Thursday, May 17, 2018

కవిత్వంలో నేను






కవిత్వం ఒక తపస్సు అయితే
నేను
తాపసిని కాలేకపోవచ్చు కానీ
ఫల పుష్ప పత్రాలు కాసినైనా
తల్లిపూజకు భక్తితో అందించుకోగలను
కవిత్వం ఒక సంగీత సాగరమైతే
నేను
అల కాలేకపోవచ్చు కానీ
ఉవ్వెత్తున ఎగసి పడే తరంగానికి
పక్కమృదంగ తోడిరాగమందిచుకోగలను
కవిత్వం ఒక యుధ్దమైతే
నేను
యోధుణ్ణి కాలేకపోవచ్చు కానీ
దుష్టశక్తిని తురిమే
యోధ ముష్టిఘాతంలో
జీవశక్తిని ఖచ్చితంగా జోడించుకోగలను
కానీ..
కవిత్వం ఒక రాజీపత్రమైతే 
ఆ లాలుచీ ప్రకటన మీద
శిరస్సు వంచుకు సాగిలపడే
సంతకం కింది చుక్క మాత్రంగా 
చచ్చినా బతకబోను!
-కర్లపాలెం  హనుమంతరావు 
19 -05 -2018







'ఓ మై గాడ్!'- సరదా వ్యాఖ్య



'ఓ మై గాడ్!'- సరదా వ్యాఖ్య

హఠాత్తుగా ఎదురుగా ఓ ఆకారం ప్రత్యక్షమయింది.
 నెత్తి మీద కిరీటం. నుదుట నిండా పట్టెనామాలు.. పొట్టకి తిరుచూర్ణాలు. పేరు తెలీని అభరణాలు!
 'ఎవరు స్వామీ తవఁరూ? నా నడినిద్రలోకి ఎందుకిలా నడిచి వచ్చారు?’
'మానవా! నన్నే మరిచిపోతివా?’
 'ఓఁ.. మై.. గాడ్! నువ్వా దేవా! పడీ పడీ నీ గుళ్లూ గోపురాల చుట్టూ ఎన్ని వేల సార్లు  పొర్లుదండాలు పెట్టానయ్యా! అప్పుడేమీ కనికరించని దయామయా.. ఇప్పుడిదేమి.. పిలవని పేరంటానికిలా  ఊడిపడితివి.. దేవదేవా?’   
'పిలవని పేరంటమా! శంఖు చక్రాదులనైనా చంకనేసుకోకుండా వట్టి గదాయుధంతోనే వచ్చినందుకా ఈ   చులకన? అరక్షణం కిందటే గదటయ్యా  'ఓఁ.. మైఁ.. గాడ్!' అంటూ గావుకేక వేసితివీ!’
'గాడ్! అదా తమరి గోల! రాత్రింబవళ్లు మా టీవీలల్ల మహాకూటములూ.. ప్రజాకూటములంటూ ఒహటే రాచకీయ నాటకాలు స్వామీ! ఏ మిత్రపక్షాల మధ్యున్నది ఏ శత్రుత్వమో, ఏ శత్రుశిబిరాలది ఏ మిథ్యా మిత్రత్వమో! ఆ అయోమయం తలకెక్కక  ఓ సారేమన్నా 'ఓఁ.. మై  గాడ్' అంటూ అలా గావుకేక వేసానేమో!  అంత మాత్రానికే తమరింత ఆత్రంగా గరుడవాహనం  కూడా మరిచి వగర్చుకుంటూ వేంచేసెయ్యాలా స్వామీ.. వింతగా ఉందే! అవతల తిత్లీ తుఫాను దెబ్బకు దిబ్బా దిరిగుండం మొత్తం  కొట్టుకుపోయి తలలు బాదేసుకుంటున్నారయ్యా తమరి భక్తజనాలు! ఆ బక్కభక్తుల దగ్గరికైనా వెళ్లి నీ వరాల జల్లులేవో కురిపించుకోవచ్చుగదా! కోదండ రామావతారులు.. తమరికీ  ఏ కోడైనా కత్తితో అడ్డొచ్చిందా దేవా? ఆ నయా పవర్ స్టారెవరో  వచ్చి కాచి కాపాడతాడేమోనని  నిద్దట్లో కూడా పాపం బక్కాభిమానులు ఉలిక్కిపడి అరుస్తున్నారయ్యా!  ఆ స్టారు రాక  ఎటూ రవ్వంత లేటవుతుందని  సర్వాంతర్యాములు తమకూ తెలీకా! ఎందుకయ్యా ఎంతకూ దర్శనమివ్వని తమరి నిర్వికారపు మెలిక?’
'కంటికి కనిపించకుంటేనే ఎంతో అల్లరీ ఆగమూ అన్ని గుళ్లూ గోపురాలల్లో! ఇహ దయతలచి ఒక్క క్షణమేగదా అని   దభిక్కని దర్శనభాగ్యమిచ్చేస్తినా! వెయ్యి యుగాలకు సరిపడా పిట్టకథలు అల్లి మరీ నాకున్న ఈ రవ్వంత పరువూ పవిత్రతలు మంటగలిపేస్తారన్న భయం భక్తా!’
‘అలాగని.. నా నడినిద్రట్లోకిలా ధడాల్మని వచ్చేసెయ్యడవేఁ? వీరలౌకికవాదులం గదా మేం. ఎంత వేధించినా మీ మతంలోకి  రాబోము. పొత్తులంటేనే సోషల్ మీడియాలల్లో బొత్తులు బొత్తులుగా జోకులు పేలుతున్న ఈ సీజన్లో.. ఈశ్వరా నా నిద్రట్లోకిలా చంద్రన్నలా దూరింది మళ్లీ ఏ కొత్త రాజకీయరంగ అరగంగేట్రానికి స్వామీ? ఇదేమీ తమరి స్వర్గధామం కాదు! ఒక్క ఫొటోకి ఐదు నిమిషాలల్లో వెయ్యి  మార్ఫింగులొచ్చేసే  మా పాడురోజులు! ఇహ కలహభోజనులంటావా?  మీడియా ముసుగులో గాలికి తిరిగే వారి జోరు విడిగా చెప్పపనే లేదు. ఏ దారే పొయ్యే దానయ్య సెల్ఫోను కన్ను మన మీద పడ్డా అర్థరాత్రిలోపే పెద్ద వైరలైపోతుందయ్యా స్వామీ  వీడియో! ‘చీకటి ఒప్పందాలు’ అంటూ తెల్లారి పత్రికలు పోసే పతాక శీర్షికల తలంట్లకు ముందు వైరల్ ఫీవర్లు ముంచుకొచ్చేది మాకు. నిరాకారులు తమరు. తమాషాగా తగిన సందు చూసుకొని మా అమిత్ ‘షా’  మాదిరి చిటికెలో తప్పించుకోగలరు. వేళకు మొహం చాటేసే కళ   మా రాహులు బాబుకు మాదిరి మాకే దిగ్గీబాబా ట్రైనింగయినా ఇవ్వలేదు మహాత్మా! తగులుకున్నోడికల్లా తగు బదుళ్లు చెప్పలేక మా చిదంబరం సాబులా  పాతచెప్పుల అనుభవం మేం చవిచూడాలనా తమరి స్కీము?తక్షణమే తమరిక్కణ్నుంచి తప్పుకోడం  ఉభయత్రా  శ్రేయస్కరం’
 'నీలో నచ్చేది నాకదే చిచ్చర పిడుగా! ఉచ్ఛనీచాలేవీ  చూసుకోవు. ఎంత మోదీనైనా ‘గీదీ’ అనేసేయగలవు. నా పేరున వేదాలు వల్లించి ఓటర్లను ముంచే భూతాల కన్నా మీ టైపు బోల్డ్ శాల్తీలే లోకానికి   బెటర్. అందుకే అర్భకా! నువ్విట్లా నా పేరుతో నిట్టూర్చీ నిట్టూర్చగానే ఇట్లా నిట్టనిలువుగా నీ ముందుకొచ్చి నిలబడింది నేను! ఎట్లాగూ వచ్చాను కాబట్టి..  వట్టి చేతుల్తో వెనక్కి మళ్లడం కుదరదు. మా లక్ష్మమ్మతో మొట్టికాయలు తప్పించేందుకైనా.. ప్లీజ్.. ప్లీజ్.. ఏదో.. నీకు తోచిందే.. ఓ కోరిక,, చిన్నదో.. పొన్నదో యాచించుకో నాయినా! ‘తధాస్తు’ అని దీవించి  నా దారిన నేను వెళ్లిపోతాను’
దేవుడి దీనస్థితికి నిజంగానే జాలేస్తోంది.  నా నిద్ర కోసమైనా ఏదో ఓటి కోరక తప్పేట్లులేదు పరిస్థితి.
 'ఆపద్భాంధవా! ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద సర్వత్రా ఉత్కంఠగా ఉంది! కోట్లలో కొనుగోళ్లు నడుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కొద్ది మందైనా ఈ ఊబి నుంచి బైటపడతారు.. దయచేసి రాబోయే ఫలితాలు ముందే తమరు సెలవివ్వండి సర్వేశ్వరా!’
'సారీ భక్తా! అది మీ భూలోక సర్వే సిబ్బంది భుక్తికి ఇబ్బంది. ఇ.సి కోడులతో నాకు ఇబ్బంది. మరింకేదైనా కోరుకో మానవా!'
అయితే.. ఆ అయోధ్యలో నీ గుడి గురించి ఓ అనుమానం ఉంది ..'
'ఆ బంతి సర్వోన్నత న్యాయస్థానం కోర్టులో ఉంది. మరింకేదైనా కోరుకో మానుషా!'
'ష్షూఁ.. చచ్చే చావొచ్చిందయ్యా స్వామీ తమరి సవాలక్ష షరతులతో! పోనీ బి.సి. కులాల ఆందోళనలన్నీ స్వయానా చూస్తుంటివిగదా! పర్సనల్ గా నా కే ఫేవరూ వద్ధు కానీ వరదా.. పాపం.. వాళ్ళ రక్షణకని తమరే ఏదైనా వరం ప్రసాదించచ్చు కదా!’
‘అడ్డె.. అడ్డె.. ఆపవయ్యా నీ కోరికల వరద! ఎవరి మనోభావాలకూ దురద రారాదు!  ఆ కండిషన్  మైండులో ఉంచుకొని మాత్రమే నీ డిమాండుండాలి. మైండిట్ మై సన్! ప్రొసీడ్.. నిర్భయంగా!’
నిర్భయ అంటే గుర్తుకొచ్చింది దర్భశయనా! పోనీ.. ఆ నిర్భయ కేసులోని అర్భకుల మీదయినా దయచూపించరాదా..!
 ‘మహిళామండళ్లు మండిపడతాయయ్యా మందభక్తా! ముందు మా శ్రీ మహాలక్ష్మమ్మే  నన్ను చెండుకు తింటుంది! నువ్వే కాదు.. నేనూ భయపడరాదు.. అలా ఉండాలి నీ నిర్భయమైన  కోరికేదైనా! ఊఁ.. కానీయ్.. కోళ్లు కూసే వేళవుతోందతవతల!’
 'సరేనయ్యా స్వామీ! మహిళలంటే మగాళ్ల జీవిత భాగస్వాములు. ఆ అమ్మలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లే ఏళ్ల తరబడి పెండింగులో ఉండింది. పోనీ.. దాని ఎండింగు కొసమైనా  షార్ట్ కట్టు  దారేదైనా చూడరాదా మాధవా! ఓ పనైపోతుందీ!’
'పెద్దలసభ కదరా ఆ రభసను ఓపెన్ చేసింది! క్లోజ్ చేసే డ్యూటీ సైతం  పార్లమెంటుదే సుమీ! మరింజేదైనా వెంటనే కోరుకో స్వామీ చంపక!’
 'ఆ ట్రంపు హెచ్చులు.. హెచ్ వస్ వీసాలూ..’
 'అమెరికన్ దేవుళ్ల తగులాటాలయ్యా అవన్నీ! ఇక్కడి దేవుళ్ల పరిధిలోవే నువ్వు కోరుకొనే వరాలుండాలి. కమాన్! కాల్ వస్తోందవతల్నుంచి. మా శ్రీలక్ష్మిదే! చప్పున కోరుకోరా పప్పుభక్తా.. పీడించక!’  
 వళ్లు మండింది నాకు చివరికి. ఈ దేవుళ్లతో యవ్వారాలు ఇట్లాగే ఉంటాయని తెలుసు. ఏదీ సర్వోన్నత న్యాయస్థానాల మాదిరి ఓ పట్టాన  తెగేది కాదు.
అవతలేమో తెల్లంగా తెల్లారిపోతోంది. బైటెవరో తలుపులు తెగ బాదిపారేస్తుంటిరి! ఏ తుంటరి కంట పడ్డా..గాడ్తో గూడుపుఠాణీ .. అంటూ పేపర్ల ఫ్రంట్ పేజీల్లో బఠాణీలు అమ్మేసే రోజులివి.
'గాడ్' ని వదిలించుకోవాలంటే ముందు  ఇతగాడు ఈజీగా ఇవ్వగల వరాలేవిఁటో   తేలాలి.
ఆఁ.. గుర్తుకొచ్చింది. కామాంధులెంతటివారైనా వదిలేయకుండా కఠినశిక్షలు పడాలంటూ మహిళందరూ తెగ ఉరుముతున్నారివాళ ప్రపంచమంతటా.  ఆ ‘మీ.. టూ’ ఉద్యమానికి మీ టూ  ఓ ఓటేసేస్తే పోలా! ఎంతటి మొండి గాడ్ కైనా ‘నో’ అనేందుకుండదు గాక ఉండదు. వివరంగా విషయాలన్నీ చెప్పి 'ఉరిశిక్ష'ల్లాంటి కఠిన శిక్షలేవఁన్నా కుదురుతుందా ముకుందా ఈ కీచకాధములకు? ఎట్లాగూ దుష్ట శిక్షణ.. శిష్ణ రక్షణ దేవుడిగా తమరి డ్యూటీలోని భాగమేనాయ! అని అడిగాను చివరాఖరికి.
‘ఉష్షో! ఊపిర్లు  లాగేసే డ్యూటీ కాలయముడిది కదరా ఢింబకా! అతగాడి పనిలో నేను వేలెడితే.. మీ రాజ్యాంగ వ్యవస్థల్లో కేంద్రం జోక్యం మాదిరి గందరగోళమయిపోతుందయ్యా మా స్వర్గలోకం పరిస్థితి! అవతల మా ఇందిరమ్మ  అప్పుడే ఇంటలిజెన్సు వర్గాలను పురిగొల్పింది. కమాన్.. ఆ కామాంధుల మేటరొదిలి  మరింకేదైనా కోరుకో... క్విక్!’ 
'తప్పుడు వెధవలని తెలిసి కూడా శిక్షించడం కుదరనప్పుడు ఎందుకయ్యా దేవుడా నీకిన్నేసి బిల్డప్పులు! వచ్చినప్పట్నుంచీ చూస్తున్నా.. అంత లావు గదాయుధం భుజం మీద మోయలేక  తెగ వగరుస్తున్నావు!  పోనీ ఈ బుల్లి దోమనైనా వధించేయగలవా నీ అతిభీకర గదాయుధంతో?’ వళ్లు మండి అరిచేసాను మహావెటకారంగా!
'థేంక్ గాడ్ రా బాబూ! ఆఖరికి నా దుష్టశిక్షణ ధర్మకార్యానికి సరిపడ్డ  కోరికనే కోరావు బిడ్డా! ఇదే చూడుము! మదీయ గదాఘాతంబుతో ఈ దుష్టదోమను ఒక్క వేటున దునుమాడువాడను’ అంటూ పాండవవనవాసం ఎన్టీఆర్ మార్కు అబినయంతో  మశక సంహారం సీనును కళ్లక్కట్టించేసాడా విశ్వరూపుడు. కళ్లు నులుముకొని చూసే లోపే  అంతర్ధానమూ అయిపోయాడీ అనంతశక్తిసంపన్నుడు!
మిజం చెప్పద్దూ! దేముడి పీడ వదిలినందుకన్నా దోమ పీడా వదిలినందుకు బ్రహ్మానందభరితమయింది నా మానసమంతా ఒక్క క్షణం.
ఒక్క క్షణమే బాబూ ఆ ఆనందమంతా! దైవగదా ప్రహారానికి చచ్చినట్లు మాత్రమే నటించినట్లుంది ఊ దోమాజీ! ఏ నక్సల్స్ గ్రూపులో చేరి శిక్షణ పొందిందో గాని మరి.. శత్రువలా కనుమరుగవగానే యధాప్రకారం తన రక్తపీడనోద్యమాన్ని పునరుజ్జీవనం చేసేసింది.. నా మీద! అదీ కథ!
ఇదేం సొదరా బాబూ? ఇందులో ఏం నీతి ఉందని ఇంత వూదర అని కదా తమరి చీదర! ఉంది సోదరా!
సాక్షాత్ సర్వశక్తిసంపన్నుడైన సర్వేశ్వరుడంతటి మహాదేవుడే ఆఫ్ట్రాల్  ఓ బుల్లి దోమస్యనే దిగ్విజయంగా జయించని   ఈ కాలంలో.. ఇహ దేవుడిలాంటి మన ప్రధాని  మోదీజీ మాత్రం  ఏ మహిమలు.. మాయమంత్రాఅలు చూపించి  దేశాన్ని ఉద్దరించగలడు? వూరికే బండరాళ్లేసెయ్యడమే గానీ ఎవరో ప్రసాదించిన ప్రత్యేక హోదా, నిధులు, విధులు, నీళ్లు, నియామక వరాలను సంపూర్ణంగా తీర్చి ఎలా నిభాయించుకోగలడు? పనిలేని నేతలంతా   నిష్కారణంగా కల్సి ‘సేవ్ ది నేషన్’ వంకతో    ధానంతటి పెద్దను వృథాగా వేధించడం తగదు కాక తగదనేదే ఈ కథ చెప్పే అంతిమ నీతి!
***

Saturday, May 12, 2018

నేటి మతోన్మాదానికి చారిత్రక నేపథ్యం ఉంది




ప్రకృతికి మనిషికి తాత్విక సంబంధంగా 
మొదలయినది మతం. మానవ పరిణామ దశల క్రమంలో ప్రారంభంలో అదో నమ్మకం.. ఆనక అదే ఓ విశ్వాసంగా బలపడింది. సమాజం అభివృద్ది చెందే వివిధ దశల్లో ఆ ‘మత’మే ఉన్నత వర్గాల వారు కింది తరగతుల వారిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకొనే సాంస్కృతిక ఆయుధంగా మారిపోయింది. అదో చారిత్రక విషాదం.
మనిషి ఆదిమ దశలో ప్రకృతి నుంచి ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో తెలియని నిస్సహాయతతో ముప్పిరిగొన్న భయం నుంచి బైటపడేందుకు అదృశ్య శక్తులేవో ఉన్నాయని ఊహించుకొని. వాటిని కర్మకాండల ద్వారా సంతృప్తిపరిస్తే కష్టం నుంచి గట్టెక్కవచ్చని భావించాడు. అతగాడి అజ్ఞానం, అమాయకత్వం, అసహాయత, అవగాహనాలేమి ఇత్యాదుల వల్ల మొదలైన ఆ కర్మకాండలకు ఒక సైధ్దాంతిక రూపం కల్పించి పూజాదికాలు అతని జీవితంలో  ఒక ప్రధాన విధానంగా మార్చింది పూజారి వర్గం.   దైవసంబంధమైన ఆ కర్మకాండలు నిర్వహించే హక్కు కేవలం తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది. పూజారికి దేవుడి ప్రతిరూపం అనే ఇమేజి స్థిరపడింది. మతం మీది అతని గుత్తాధిపత్యం ఎప్పుడూ ధిక్కరణకు గురి కాలేదు. అప్పుడప్పుడు ఏ చిన్న  చైత్యన్యవంతమైన ఆందోళన చెలరేగినా వాటిని మొగ్గదశలోనే తుంచివేయడం జరిగేది. పాలకుల అండదండలు పుష్కలంగా గల బ్రాహ్మణ వర్గానికి అదంత కష్టసాధ్యం కూడా కాలేదు.
అత్యధిక సామాన్య వర్గ ప్రజల సాంస్కృతిక, జీవన విధానాలు  మతం పునాదుల మీదే నిర్మితం కావడం మతానికి సమాజం మీద అమితమైన పట్టును తెచ్చిపెట్టింది. భూస్వామ్య వర్గమూ  మంది సాంస్కృతిక బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో వెనుకబడింది లేదు.  తన వంతు కుట్రగా కులాల ప్రాతిపదికన  సమాజాన్ని మరో మారు చీల్చిందది.. ప్రాబల్యం అధికంగా గల కులాలకు ఉత్పత్తి వృత్తులతో నిమిత్తం లేదు. సమాజ సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల మీద  పెత్తనం మాత్రం  ఆ పూజారి వర్గాలకే అప్పగించబడింది. భూస్వాములకు, పూజారులకు మధ్య అంతర్గతంగా కుదిరిన ఈ అన్యాయపు ఒప్పందం మూలకంగా ఉత్పత్తి వృత్తుల మీద ప్రత్యక్షంగా ఆధారపడిన బడుగు జీవులు మరోమారు ఘోరమైన దోపిడీకి గురయ్యారు.
మధ్యయుగాలలో ఈ దేశం మీదకు దండెత్తుకొచ్చి పెత్తనం చేసిన మొగలాయీల మొదలు ఇటీవల వరకు అధికారం చెలాయించిన వలస పాలకుల వరకు.. అందరిదీ ఒకే దోపిడీ పంథా. ఏ అగ్రవర్ణానికీ, అగ్రవర్గానికీ  బడుగుల జీవన స్థితిగతుల  మెరుగుదల పట్ల  ఆసక్తి లేకపోయింది. పాలకులతో భూస్వామి వర్గాలు రాజీ ధోరణితో సర్దుకుపోతే.. అర్చక వర్గాలు మతం మీద తమకున్న పట్టు చూపించి ఆయా పాలకులను  అధీనంలో ఉంచుకొన్నాయి.
వలస పాలకుల వల్ల జాతీయ సాంస్కృతిక జీవనంలో సగుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని భావించే వాళ్లేమీ తక్కువ లేరు. వలస పాలకులు తెచ్చిన ఏ సాంస్కృతిక సంస్కరణా బడుగుల మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా సాగింది లేదు.  ఏ కొద్ది మార్పో వాళ్ల జీవితాల్లో సంభవమైనప్పటికీ జఅదీ  పాలకులకు మేలు కలిగించే వరకు సాగి అక్కడితో ఆగిపోయేది. పీడిత వర్గాలు చైతన్యవంతమైతే   తమ అధిపత్యానికి ఎదురయ్యే సవాళ్ళు  అగ్రవర్ణాలు, వర్గాలు ముందస్తుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకొనేవి.
చార్వాకుడి నుంచి గౌతమ బుధ్దుడి దాకా, భక్తి ఉద్యమం మొదలు గాంధీయిజం వరకు ఈ దేశంలోని అన్ని ఉద్యమాలు మతవాదులతో సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరించాయి. అలా వ్యవహరించాయి కాబట్టే వాటి మనుగడను కొంతవరకైనా సాగనిచ్చింది మతవర్గం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ భూస్వామ్య వ్యవస్థను ఎక్కడా ధిక్కరించిన దాఖలాల్లేవు. పైపెచ్చు జనసామాన్యం మనసులు సులువుగా గెలుచుకొనేందుకు మతచిహ్నాలను సైతం విశృంఖలంగా  వాడారాయన. గాంధీజీ తెచ్చేందుకు ప్రయత్నించిన సంస్కరణల్లో చాలా భాగం మతవాదాన్ని మరింతగా సమర్థించే దిశగానే సాగాయంటే కొంతమందైనా నొచ్చుకుంటారని తెలుసు. నిష్ఠురమనిపించినా నిజం నిజమే అవుతుంది కానీ.. ఎన్ని ముసుగులు వేసినా అబద్ధం కాబోదు కదా!
స్వాతంత్ర్యం వచ్చినా ఈ దేశ ఆర్థిక విధానాలలో ఇదే తరహా ద్వంద్వ వైఖరి  కొనసాగింది. జాతి సాధించిన అభివృధ్దిలో అధిక శాతం పది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు, వర్గాల వద్దే పేరుకు పోవడం మునుపటి కథ. ఇప్పుడు ఆ పది శాతం  రోజు రోజుకీ మరింతగా కుచించుకుపోతోందన్న  అంచనాలు వింటున్నాం.
లాభాల బాటలో ఉన్న సంపన్న వర్గాలు ఏ కారణాల కోసం తమ  సౌకర్యాలను స్వఛ్చందంగా బడుగు వర్గాలకు ధారాదత్తం చేస్తాయి? తమ అభివృధ్ధికి ఆటంకం కలిగించే బీదల పాట్లను కనీసం అర్థం చేసుకొనేందుకైనా ఆసక్తి చూపించవు. సరికదా.. నూతన విజ్ఞానం రగిలిస్తున్న సామాజిక స్పృహ కారణంగా  అభివృధ్దిలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం బడుగులు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు  అడ్డుకట్ట వేసేందుకు  కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తాయి కూడా! అందులో భాగమే మతాల క్రియాశీలక రాజకీయ పాత్ర.
గతంలో మాదిరి  మతాన్ని కేవలం సామాజిక ఆధిపత్యం కోసం మాత్రమే వాడుకొనే ఆయుధంగా భావించడం లేదు అగ్రవర్ణాలిప్పుడు. మతం నెత్తికీ ఒక రాజకీయ టోపీ తగిలించి.. చేతికో జెండా అందిస్తే మిగతా అన్ని చిటుకుల కన్నా శక్తివంతంగా సామాన్యుల జీవితాల్లోకి చొరవగా చొచ్చుకు పోవచ్చు. మకిలి అంటకుండా స్వకార్యం సాధించుకొనేందుకు  మతానికి మించిన గమ్మత్తు మత్తు పదార్థం ఈ దేశంలో  ఇప్పటికి వరకైతే మరోటి  లేదు.
మసీదులు పడగొట్టి ఆలయాలు కడతామన్న అజెండా ప్రకటించుకున్న మర్నాటి నుంచే అప్పటి వరకు ఏదో మూల నక్కి ఉన్న  మతవాదం రాజకీయ రూపం ధరించి అప్రతిహతంగా ముందుకు దూసుకొచ్చింది ఈ దేశంలో. 2014లో పాలకులు మార్పిడి జరిగినప్పటి నుంచి కాశ్మీరు టు కన్యాకుమారి.. సర్వత్రా పెచ్చుమీరుతున్న ఉన్మాద ధోరణులకు.. గతంలోనే సామాజిక వ్యవస్థ మూలాలలో విత్తబడిన మతబీజాలే మూలకారణం. ప్రజాఉద్యమాలకు సైతం దేవుళ్లకు  ముడుపులు కట్టే వైరుధ్యం సామాన్య ప్రజలు ప్రశ్నలకు గురికాక పోవడం అందుకే ఈ దేశంలో సంభవమయింది! ప్రజలు తమ రెక్కల కష్టంతో నింపిన బొక్కసాలను యజ్ఞాలు, యాగాలు, పుష్కరాలు, దీక్షల పేరుతో పాలకులు ఖాళీ చేసేందుకు తెగబడుతున్నా ఇదేమని ప్రశ్నించాలన్న స్పృహే కరువైన ప్రస్తుత రాజ్యంలో  మతాతీత కులాతీత లౌకిక ప్రజాస్వామ్య సంక్షేమ వ్యవస్థను కాంక్షించడం ఎంత వరకు సబబు?! వలస పాలకుల నుంచి రాబట్టుకున్న రాజ్యమే లౌకిక సమాజాన్ని నిర్మిస్తుందన్న ఆశ ఇంకా మిగిల్చుకున్నవాళ్లకూ ఓ నమస్కారం.
పీడనకు గురిచేస్తున్న  మతవిశ్వాసాల ముందే భయభక్తులతో లొంగి   బతుకీడ్చేందుకు సిధ్దపడే పీడితుల మానసిక  బలహీనతలను శాస్త్రీయకోణంలో విశ్లేషించుకోవలసిన అవసరం మునపటి కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. పీడిత వర్గాలను సంఘటిత పరిచి సరైన దిశకి మళ్లించే ప్రగతి కాముక  సాహిత్యం  అందుకే ఇప్పుడు మరింత ముమ్మరంగా  విస్తరించాల్సుంది. మతంలోని గమ్మత్తు మత్తునుంచి సామాన్యుణ్ని బైటకుతెచ్చే సామాజిక బాధ్యత మేధావుల మీదే ఎక్కువగా ఉంది. మతోన్మాదం పెచ్చుమీరుతున్న ఈ దుర్మార్గ తరుణంలో మౌనం పాటించడమంటే మేధావులు తెలిసి  జాతికి చేస్తున్న ద్రోహం కిందే లెక్క.
*** 
-కర్లపాలెం హనుమంతరావు
(మతోన్మాదం .. చారిత్రక నేపథ్యఁం -హరిపురుషోత్తమరావు – విభిన్న. పుట. 33- ప్రేరణతో)


Wednesday, May 9, 2018

మేరా భారత్ మహాన్!-సరదా వ్యాసం





'ఏంవాఁయ్ వెంకటేశం? ఏవిఁటలా టీవీ కతుక్కొని కూర్చున్నావ్? పెరేడ్ చూస్తున్నావా? ప్రెసిడెంటుగారి స్పీచి వింటున్నావా? మేడంగారే రకం చీర కట్టుకున్నారో చూసి మీ అక్కక్కొనిద్దావనే? దిస్.. ఐ థింక్.. ఎండాఫ్ ఆల్ ఇండియన్ వాల్యూస్. అనగా మన భారతీయ విలువల అంతిమ దినమన్న మాట. అంతిమ దినం కాదు.. గణతంత్ర దినమంటావ్! సరే.. అలాగే కానీయ్..!
'గంట నుంచీ ఆ టీవీ చూస్తున్నావు గదా? ఏదీ గణతంత్ర దివస్ అంటే ఏందో వివరంగా చెప్పూ.. చూతాం! సావరిన్ సోషలిష్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్కా? ఆ ముక్క .. తెలుగువాడివి.. తెలుగులో ఏడవ్వచ్చుగా?.. తెలీదా?  నోట్ బుక్ తీసుకో!.. రాసుకో! .. కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాతంత్ర స్వతంత్ర రాజ్యం. ఇదీ తెలుక్కాదా? తెలివిమీరిపోయావోయ్.. మై బోయ్!'
'సర్సెరే! వదిలేయ్! మన కంట్రీ స్పెషాలిటీస్.. అనగా. ప్రత్యేకతలు.. అవేంటో.. అవన్నా తెలుసా? జనాభాలో చైనా కాక మన తర్వాతే ఇంకెవరైనా. ఫరెగ్జాంపుల్.. మీ ఇంట్లోనే చూసుకో! మీ నాయనా, అమ్మా, బుచ్చెమ్మా, నువ్వూ, నీ చెల్లెలూ, నీ మామ మైరావణుడు, ఆయన శిష్యుడూ.. ఉపరి ఇప్పుడు నేనూ! ఒక మెట్రో బోగీకి సరిపడా జనం నిండామా! అందుకే థర్డు వరల్డులో మనదే థడాకా అని శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్ గారూ కూడా ఎప్పుడో ఒప్పేసుకున్నారోయ్ బాబ్జీ! మరో తమాషా చూసావూ! ముఫ్ఫై ఒక్క స్టేట్సూ.. ముప్పై ఒకటేనా.. ఏవోఁ.. లెక్క జూసుకో..  ఆరువేల కులాలూ.. మరో నాలుగొందలు పైచిలుకు ఉపకులాలూ.. అందులో సహం మతాలూ.. మూడు కోతులూ.. ముక్కోటి దేవతలూ.. పదహారొందల భాషలూ.. ముఫ్ఫై మూడు పండుగలూ.. మూడో నాలుగో ఫ్రంట్లూ.. తొమ్మిదొందల ఆరు పార్టీలు, .. పార్టీకో రెండో మూడో ఎజెండాలు.. ఇంకో రహస్య అజెండా.. ఆఖరికి ఒక్కో ఓటుక్కూడా మినిమమ్ రెండేసి రాష్ట్రాలూ.. ఒక్కదాంట్లోనైనా ఏకత్వం లేకపోవడమేనోయ్ మన భినత్త్వంలోని విచిత్రం!'
'మన దేవుళ్లకూ మనకులానే మోర్ దేన్ టూ వైవ్స్ ఉండాలాయె! అటు కాశ్మీర్ టు ఇటు కన్యాకుమారి వరకు ఒక్క విషయంలో మాత్రం మనవాళ్లంతా ఒక్క పట్టు మీద ఘట్టిగా నిలబడుతున్నారోయ్! అదేంటంటావూ? ఆఖర్న చెబుతాగానీ ఇప్పటికైతే మీ మామ పంచాగప్పొదిలో దాచిన పొగాకు పాయొకటి పట్రా.. పో! పొయెట్రీ తన్నుకొచ్చేట్లుంది!'
'…'
'నౌ ..బ్యాక్ టు ది పాయింట్!మన ప్రత్యేకతల గురించి మరో ముక్క చెప్పేదా! గుండు సున్నా కనిపెట్టింది మనవేఁనోయ్ సన్నాసీ! ఆ సంగతి సమస్తానికి తెలియాలనే కదా జాతీయ జెండా మధ్య బండి చక్రంలా పెట్టి  రెపరెపలాండించేస్తున్నాం! చక్రం తిప్పడంలోని చాణక్యమంతా శ్రీకృష్ణుణ్నుంచీ వడలాగేసుకుంటున్నారోయ్ మన లీడర్లూ! మన రాజ్యాంగంలోని మరో చిత్రం చెప్పనా? ఇంత పెద్ద ఇండియాలో ఇంకే లేనట్లు కాన్స్టిట్యూషన్ మొత్తం రెండొందలిరవైఅయిదు పేజీలూ చైనా ఇంకుతో రాయించేసారు మన సార్లు! ఏ ఇండియనింకో యూజ్ చేయచ్చుగదా? ఊహూఁ! మనోళ్ళకి మొదట్నుంచీ పరాయి సరుకు మీదే పరమ్మోజు. లేకపోతే నైరుతీ వైపు ఆ సముద్రానికి అరేబియా పేరు పెట్టటమేంటోయ్! ఆగ్నేయంలో ఈ వైపు నీళ్లకు బెంగాలు వాళ్లు 'బే ఆఫ్ బెంగాల్' పేరు పెట్టేసారు కదా! రేప్పొద్దున బెంగాలోళ్లు.. బంగ్లాదేశంగాళ్లూ.. ఆ నీళ్ల కోసం కొట్టుకు చస్తారని బెంగేస్తోందోయ్.. బోయ్! ధరలూ, జలయజ్ఞాలూ, అణుబాంబులూ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలూ, అర్థికమాంద్యం, కల్తీలు, కరువులూ, నీళ్ల కోసం కొట్లాటలూ, అవినీతి, అసహ్యంగా పోట్లాటలూ, ఉద్యోగాలూడ్డాలూ, ఉపాధులు దొరక్క చచ్చిపోడాలూ, చట్టుబండ చదువులూ, కేజీ టూ పీజీ లాన్గ్వేజీ పేచీలు, ప్యాకేజీలూ,  ప్రత్యేక రాష్ట్రాలు, హోదాలు, రిజర్వేషాలూ, ఇప్పుడు  కొత్తగా చట్టం.. న్యాయం మధ్య కొట్లాటలూ, పక్క మతం మీద పక్కా వ్యూహంతో  దాడులూ, అసహనం, ఆక్రోశం.. ఇన్ని బిలియన్సాఫ్ బర్నింగ్ ప్రాబ్లమ్సుంటే.. మళ్లీ కొత్త తల్నెప్పులు నెత్తికి తెచ్చుకోడం తెలివున్నవాళ్లు చేసే పనేనా? అబ్బే! ఈ చుట్ట అంటుకోడంలేదు. ఇదే ఇప్పుడు పెద్ద బర్నింగ్ ప్రాబ్లమయిందోయ్.. బోయ్!'
'అవునూ.. మద్యాహ్న భోజనం సంగతేం చేసావ్.. మై డియర్ వెంకీ? అహఁహఁ! ఆ సర్కారు స్కీము భోజనాలు కాదోయ్.. వెధవాయ్! నేనంటున్నది మన కడుపాత్రం సాపాటు ఏర్పాట్లు సంగతి మేన్! పొలిటికల్ ఫ్లోలో నువ్వలా ఫీలవడం బిట్ నేచురలే గానీ.. ప్రెసిడెంట్ స్పీచుకీ నువిట్లాగే పాలిటిక్స్ పెంటంటిస్తే.. చుట్ట తిరగేసి అంటిచాలని అధర్వణవేదం అయిదో అధ్యాయం పదో శ్లోకం తెగేసి చెపుతోంది.. తస్మాత్ జాగ్రత్త!'
'ఎలక్షన్ రోజులు కదా ఏ జండా చూసినా నీ పార్టీ ఫ్లాగే కనిపిస్తుందా? 'వందేమాతరం' అన్నా 'వందోట్లున్నయ్,, ఏ మాత్రం?' అని అడగాలనిపిస్తుందా? సహజం! జెండా పోలుకీ.. పోలింగ్ బూతుకీ సౌండులో తప్ప  మరెందులోనూ పోలిక లేదన్న కామన్ సెన్స్ కోల్పోతే రాజకీయాల్లో ఇంకెలా రాణిస్తావో బోధపడకుండా ఉంది. పాలిటిక్సంటే ఏంటను కున్నావోయ్? ఆర్ట్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ థింగ్. అసలేవీఁ చేయకుండా అన్నీ చేసేస్తున్నంత బిజీగా ఉన్నట్లు బిల్డప్పిచ్చే కళ! అంటే మీ అగ్గిరాముడు దగ్గర ఇంగ్లీషు దంచడం లాంటిదన్న మాట! మీ అక్కయ్యకిచ్చే హామీలనుకో.. తప్పు లేదు! కోర్టు బోనుల్లో ప్రత్యక్షంగా  నిలబెట్టి తప్పట్టినా సరే.. 'అబ్బే! అదేం లేదు మిలార్డ్! గిట్టనోళ్లేవో కల్పించి చేసే ఆగం అదంతా! మా మెంబర్లంతా పులుకడిగిన ముత్యాల!'ని తేల్చేసేయ్యడవేఁ.. దటీజ్ పాలిటిక్స్ !'
'పండగ పూట ఈ కప్పల తక్కెడ తీయడ మెందుకు అంటావా మై బోయ్! సరే! అలాగే కానీయ్! మేరా భారత్  మహాన్! మన మహాన్ భారత్  కీ బోలో జై!,, జై జై!'
-కర్లపాలెం హనుమంతరావు
***
(26, జనవరి, 2009 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...