Monday, June 11, 2018

అలెగ్జాండర్ నిజంగా జగజ్జేతానా?!




'అలెగ్జాండర్ , ది గ్రేట్' అని మాకు ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో   ఇంగ్లీషు పాఠం ఉండేది. ఆ పాఠం పంతులుగారి నోట వింటున్నప్పుడు, అచ్చులో రోజూ చూస్తున్నప్పుడు 'ఆహా! అలెగ్జాండర్.. నిజంగా ఎంత గ్రేటో!' అనుకుంటుండేవాళ్లం ఆ చిన్నతనంలో.
చాలాకాలం వరకు ఆ అభిప్రాయంలో మార్పులేదు. కానీ ఆ మధ్య సుధాకర్ ఛటోపాథ్యాయ అనే చరిత్ర పుస్తక రచయిత రాసారని చెబుతున్న ' ద అకమీనీడ్స్ అండ్ ఇండియా' పుస్తకంలోని కొద్ది భాగం ఆంధ్రజ్యోతి సంపాదక పుటలో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్దిగారు రాసింది  చదవడం జరిగింది. 'ఆహా! అయ్య.. అలెగ్జాండరుగారిలోని గొప్పతనం ఇదా!' అని ఆశ్చర్యపోవడం నా వంతయింది. అంతకు ముందూ కొన్ని అపసవ్యాలు విని ఉన్నా..
ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న పిచ్చి కోరికతో చేసిన యుద్ధాల్లో  ఆయనగారు అవసరమైన చోట యుద్ధనీతులక్కూడా తిలోదకాలిచ్చేసినట్లు చదివినప్పుడు మాత్రం  అవాక్కవక తప్పలేదు.
పెషావరు యుద్ధంలో అలెగ్జాండరుకి ఎదురైన ప్రతిఘటన చాల బలమైనది. తానే స్వయంగా యుద్ధరంగంలోకి ఆయుధం పట్టుకు దూకినా గెలుపు అంత సునాయాసంగా దక్కే అవకాశం కనిపించలేదు.  ‘అశ్వకుల’ అనే బలమైన శత్రుజాతిని  వీరోచితమైన పద్ధతిలో ఎదుర్కొనే సత్తా చాలక రాత్రి పూట చాటుగా చీకటి మాటున కోటలోకి జొరబడి సైనాన్ని  మూకుమ్మడిగా ఉచకోత కోయించాడని రాసుందా గ్రంథంలో!
అలెగ్జాండరు రక్తంలో ఉన్నది యోధత్వమా? ప్రపంచదేశాల సంపదనంతా కొల్లగొట్టి స్వదేశానికి తరలించుకుపోవాలన్న ధూర్తత్వమా? ఆ వ్యాసంలో రాసింది చదివేవారికి ఎవరికయినా ఆ అనుమానం రాక తప్పదు.
మేసిడోనియా దేశం(ఇప్పటి స్లోవాకియా) రాజు ఫిలిప్స్  బిడ్ద అలెగ్జాండరు. అతనికి చిన్నప్పట్నుంచే యుద్ధాల పిచ్చి. అరిస్టాటిల్ శిష్యరికంలో మెరికలాగా తయారయాక ప్రపంచ దేశాలన్నింటి మీదా పెత్తనం చెలాయించాలన్న కొత్త తుత్తర మొదలయిందంటారు.
సైన్యాన్ని, వనరులని దండిగా సమకూర్చుకుని ముందుగా దగ్గర్లోనే ఉన్న అకీమీనియన్ దేశం మీదకు దండయాత్రకెళ్లాడు. అప్పటికే మూడో తరం ఏలుబడిలో పడి   బలహీనంగా ఉందా దేశ రక్షాణ వ్యవస్థ.  డేరియన్ని ఓడించడం మంచినీళ్లప్రాయమయింది. ఆ విజయం ఇచ్చిన అత్మవిశ్వాసంతో ధనాగారంగా వర్ధిల్లే మన భరతఖండం మీద కన్నుపడింది అలెగ్జాండరుకి.
దారిలోని ఈజిప్టు, అసీరియాలాంటి దేశాలను ఒక్కొక్కటిగా వశపరుచుకుంటూ పర్షియా రాజధాని పెర్సిపోరస్ చేరుకొన్నాడు అలెగ్జాండర్. కొన్నాళ్లపాటు  తనకూ. తన సైన్యానికి విరామం అవసరమనిపించినట్లుంది..  ఆ దేశపు రాజు మీద పై చేయి సాధించినా అతని కూతుర్ని వివాహమాడి మనుగుడుపు అల్లుడు మాదిరి విశ్రాంతి తీసుకున్నాడు.. సామదానభేదదండోపాయాలలో ఏది ఎప్పుడు ప్రయోగించాలో అరిస్టాటిల్ శిష్యరికంలో బాగా ఆకళింపు చేసుకున్న జిత్తులమారి! లేకపోతే దక్షిణ గాంధారం రాజు అంబి తక్షశిలలో అలెగ్జాండర్  ముందు అంత సులభంగా ఎందుకు    ఆత్మార్పణ  చేసుకొంటాడు? అక్కడి గెలుపు ఇచ్చిన కిక్కులో అలెగ్జాండర్ జీలం.. చీనాబ్ నదుల మధ్య ప్రాంతాల్లో ఉన్న పోరస్ మీదకొచ్చి పడ్డాడు.
పోరస్ పౌరుషం అలెగ్జాండర్ మునుపెన్నడూ రుచి చూడనిది. పోరస్ గజబలం ముందు  అలెగ్జాండర్ ఆశ్వికదళం డీలాపడిందంటారు.
నిజానికి అక్కడ అలెగ్జాండరుకి ఏ మేరకు విజయం లభించిందో ఇతమిత్థంగా చెప్పలేం. యూరోపియన్ హిస్టోరియన్స్ రాసిన చరిత్రే మనకు ఆధారం అప్పట్లో. తమ యూరోపు యుద్ధవీరుడికి ఆసియావాసుల ముందు  పరాజయం కట్టబెట్టడం తలవంపులుగా భావించినట్లుంది.. మధ్యగోళ చరిత్రకారులు ఆ అపజయాన్ని కనీసం రాజీగా కూడా చిత్రించేందుకు ఇష్టపడలేదంటారు సుధాకర్ ఛటోపాధ్యాయ. పోరస్ మీద పై చేయి సాధించినా అలెగ్జాండర్  శత్రువుకు రాజ్యాన్ని ఉధారంగా వదిలేసి వెనక్కి మళ్లినట్లు తమ చరిత్రలో రాసుకున్నారని ఆ చరిత్రకారుడి  ఫిర్యాదు.
‘The classical authors have evidently twisted the facts to glorify their one hero'(p.21) అని ఆ పుస్తకంలో రాసి ఉన్న దాన్ని బట్టి అలెగ్జాండర్ విజయం అనుమానస్పదమే అనిపిస్తుందిప్పుడు.
ముందున్న ప్రాంతమంతా ఎగుళ్లు దిగుళ్లు. సముద్రాలు, నదులు, దట్టమైన అడవులు. పాములు, తేళ్లులాంటి ప్రాణాంతకమైన జీవులు సంచరించే ప్రాంతాలే అన్నీ. దట్టంగా వర్షాలు దంచికొడుతున్నాయ్ ఆ సమయంలో. వరస యుద్ధాలతో బాగా అలసిపోయుంది సైనికదళం. అన్నిటికీ మించి అప్పటి వరకు వివిధ దేశాలలో దోచుకున్న సంపదతో తృప్తి చెంది తిరిగి స్వదేశంలో తమవారితో సుఖపడాలన్న కోరిక.. ఆ సైనికులలో మొండితనాన్ని కూడా పెంచిందంటారు.  అతికష్టం మీద అలెగ్జాండర్  వాళ్లకు నచ్చచెప్పుకుని ముందుకు నడిపించినా.. సింధునది దక్షిణ ప్రాంతంలో మల్లులు, క్షుద్రకులు అనే రెండు జాతులు ఉమ్మడిగా చేసిన దాడిలో అలెగ్జాండరే స్వయంగా విషపూరితమైన  అమ్ము శరీరానికి తాకి గాయపడ్డట్లు కథనం.
ఏదేమైనా ప్రపంచ విజేత కావాలన్న తన కల నేరవేరక ముందే అలెగ్జాండర్ తిరిగి స్వదేశానికి పయనమయిన మాట మాత్రం పచ్చి వాస్తవం.
అంభంలో కుంభం అన్నట్లు.. ఆ తిరుగు ప్రయాణం మధ్య దారిలో మలేరియా జ్వరం తగులుకొని బాబిలోనియాలో (సూసానగరం అని కొందరంటారు) క్రీ.పూ 324లో ఆఖరి శ్వాస విడిచాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని లొంగదీసుకోవడం మాట అటుంచి మృత్యువుకు తనకు తాను అంత నిస్సహాయంగా లొంగిపోయాడు! ఇంకా జగజ్జేత అన్న బిరుదుకు అలెగ్జాండరు అర్హుడా?
అయినా 'అలెగ్జాండర్ .. జగజ్జేత' అంటూ యూరోపియన్లు  తమకు అనుకూలంగా రాసుకున్న తప్పుల తడక చరిత్రను తెల్లవాడి పుణ్యమా అని మనం ఏళ్లతరబడి వల్లెవేసాం!  మన పిల్లల చేతా ఇప్పుడు వల్లెవేయిస్తున్నాం!
చరిత్రలూ చాలా రకాలుగా ఉంటాయి. ఎవరి విశ్వాసానికి తగ్గవి వాళ్లు  చదువుకుంటున్నారిప్పుడు! అలాంటప్పుడు ఏ సమాచారాన్నని తప్పు పట్టగలం? ఏ సమాచారం కరెక్టని నెత్తి మీద పెట్టుకోగలం?
***
-కర్లపాలెం హనుమంతరావు
11 -06 -2018
 


Wednesday, June 6, 2018

గతం ఘనం – ప్రస్తుతం సతమతం – మన తెలుగు




బుద్ధుడి బోధనలు సాగింది  పాలీ భాషలోనో, అర్థ మాగధి భాషలోనో.. మొత్తానికి ఆ భాషలో తెలుగు పదాలు కొన్ని(సుమారు 60) కనపడుతుంటాయంటారు. మనం ఇప్పటికీ వాడుతున్న అనేక తెలుగు పదాలు బుద్ధుని కాలంలో దైనందిక జీవితంలో వ్యవహారంలో ఉండేవని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు తన 'తెలుగులో పాలీ పదాలు' పుస్తకంలో పేర్కొన్నారు.
పైశానీ భాషలో కూడా తెలుగు పదాలు ఉన్నాయని తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. బౌద్ధ కొరియా యాత్రికుడు ఒకాయాన ఆరో శతాబ్దంలో చైనా, ఆఫ్ఘనిస్తానుల మీదుగా వచ్చి ఈ దేశంలో  కైబర్ కనుమల నుంచి మన నాగార్జునకొండ వరకు పర్యటించి వెళ్లాడు. ఆయన తనకు తెలిసిన ప్రాకృతం మాట్లాడినా ఆంధ్రదేశంలో ఎక్కడా ఇబ్బంది కలుగలేదని రాసుకున్నాడు! ప్రాకృత శబ్దం మన తెలుగు భాష పూర్వ రూపానికి దగ్గరగా ఉంటుందని  తిరుమలవారి థియరీ. 
సుమేరియన్ భాషలోనూ తెలుగు పదాలు ఉన్నాయన్నట్లు శ్రీ రాంభొట్ల కృష్ణమూర్తి ఏదో సందర్భంలో రాసినట్లు గుర్తు. ఆయన దగ్గర సుమేరియన్ భాషాకోశం మొదటి భాగం ఉందిట. (మొత్తం నలభై భాగాలు). తుర్కీ నుంచి గంగామైదానం వరకు ఏదో ఒక ఉమ్మడి నాగరికత ఒకానొక కాలంలో విలసిల్లినట్లు రాంభొట్ల అభిప్రాయం! భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజం. సుమేరియన్ల .. మన భాషల మధ్యా ఆ తరహా  ఇచ్చిపుచ్చుకోవడాలు  జరిగివుండవచ్చని కృష్ణమూర్తిగారి  ఆలోచన.
ఇప్పటి బోధన్.. ఒకప్పటి సోదనం. ఏదో పెద్ద విశ్వవిద్యాలయ ప్రాంతం కూడా అప్పట్లో. 'బావరీ' గోత్రానికి చెందిన పెద్దాయనెవరో దానికి అధిపతి. అది బుద్ధుడు జీవించి ఉన్న కాలం. తధాగతుణ్ణి కలుసుకొనేందుకు సుమారు ఓ వెయ్యి మంది బావరీ పెద్దాయన శిష్యులు రాజగృహం (పాటలీపుత్రం) పర్యటించారు. ఆ బృందంలో అదృష్టవశాత్తూ ఒక చిత్రకారుడూ ఉన్నాడు. బుద్ధుని బోధనలు సాగుతున్న సమయంలో తెర వెనక నుంచి అతగాడు ఆ శాంతమూర్తి బాహ్యరూపం (ఔట్ లైన్)  గీసుకున్నాడు. తరువాతి సిటింగులో కన్నూ, ముక్కూ, చెవులూ.. వంటివి గుర్తుంచుకొని తీరిగ్గా చిత్రం పూర్తిచేయాలని ఆలోచన. ఆ చిత్రకారుడు అనుకొన్నట్లే జరిగింది.. కానీ కొద్ది తేడాతో! తధాగతుడి బాహ్యాకారాన్ని యథాతధంగా ఉంచి ఏ ప్రాంతానికి చెందిన శిల్పులు ఆ ప్రాంతానికి చెందిన మనిషి ముఖకవళికలతో బుద్ధమూర్తిని చిత్రించుకొన్నారు! చైనా, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, బర్మా, ఇండోనీషియా, భారతదేశాలలోని బుధ్ధవిగ్రహాలు ఆయా దేశవాసులను పోలివున్నా.. బాహ్యరూపం మాత్రం మన  చిత్రకారుడు సమకూర్చిన విధంగా  ఉండటం తెలుగుజాతికి గర్వకారణం.
బుద్ధుని విహార(బిహార) భూమిని తెలుగునేలకు తరలించిన ఘనత తెలుగువాడిది. బుద్ధుని విచారధారను బావరీ విశ్వవిద్యాలయ విచారధారగా మార్చుకున్న మేధస్సూ మన తెలుగువాడిదే.
శ్రీ పర్వతం తూర్పునున్న ఓ కుగ్రామం నాగార్జునుడి జన్మస్థానం అని ఓ నమ్మకం. అద్వైతం, మాయావాదం, నేతివాదం, అవతారాలుగా నేడు ప్రచారంలో ఉన్న హైందవ భావజాలానికి ఆ ఆచార్యుడి  అద్వం, శూన్యం, విజ్ఞానం, బోధిసత్వం ప్రభృత భావాలే మూలాలు. బౌద్ధం మహాప్రచారంలోకి వచ్చి మహాయానంగా వృద్ధిపొందిందీ మన  ఆచార్యుడి ఆధ్వర్యంలోనే! నాగార్జునుడి కొత్త ఆలోచనలకు పురిటిగడ్డ   తెలుగుభూమి! నాగార్జునుడి 'సృహుల్లేఖ' (స్రిహిల్లేఖ అని కూడా అంటారు) శాతవాహనులతో ఆచార్యునికున్న సాన్నిహిత్యం తెలియచేసే పత్రం. బౌద్ధులు కాకున్నా శాతవాహనుల నీతిపాలనకు, నేర నిరోధక చర్యలకు  బౌద్ధధర్మమే కేంద్రబిందువయిందని పరిశోధకుల మాట. దేశంలోని అధిక భాగాన్ని ఏలిన ఈ తెలుగు ప్రభువుల పాలనలో తెలుగువారి ప్రభ సహజంగానే దేశమంతటా వెలుగులు విరజిమ్మింది. పాటలీపుత్రంలో 'ఆంధ్రభృత్యులు'గా పేరొందిన శాతవాహనులలో సిముక సాతవాహనుడు దక్షిణాపథాన స్వతంత్రంగా రాజ్యమేలిన తెలుగు చక్రవర్తి. పాటలీపుత్రపు  పండితులు రాసిన పురాణాలలో 'అంధ్రుల' వంశావళి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తదనంతరం వచ్చిన ఇక్ష్వాకులూ తెలుగు రాజులే. ఆ ప్రభువులు పాలించిన భూమి విస్తృతమైనది కాకపోవచ్చు.  కానీ సృష్టించిన శిల్పసంపద  అపారమైనది. ఇప్పటికీ తెలుగువాడలలో కనిపించే ఆ శిధిల శిల్పకళల ఆధారంగానే మాన్యులు కె.కృష్ణమూర్తి ఆనాటి ఆటపాటలు, వేషభూషణాలు, సాంఘిక పరిస్థితులను గూర్చి ఆసక్తికరమైన గ్రంథాలెన్నో ప్రచురించారు. శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటి సాహిత్యం, శాసనాలు తెలుగు ప్రాకృతంలో కనిపించడం తెలుగువారికి గర్వకారణం.
తెలుగు నడిగడ్డ మీద వెలసిన శ్రీ పర్వతానికి దేశ విదేశాల నుంచి బౌద్ధులు, పండితులు విచ్చేసేవాళ్లు. అక్కడ ఒక మహావిశ్వవిద్యాలయం విలసిల్లింది కూడా. మహాయానమే కాదు.. వజ్రయానమూ ఇక్కడి నుంచే ప్రపంచం నలుదిక్కులకూ వ్యాపించిందంటారు. ఇప్పటి  టిబెట్టులో వర్ధిల్లుతున్నది ఈ వజ్రయానమే.  టిబెట్టుకీ తెలుగు గడ్డకి బౌద్ధం ఒక ఆధ్యాత్మిక బంధం.   
ఒకానొక కాలంలో ఆంధ్రదేశానికి నౌకావ్యాపారం ప్రధాన ఆదాయ వనరు. దేశదేశాల నుంచి వ్యాపారులు వచ్చి సాగించే బేరసారాలకు  వ్యావహారిక భాష  తెలుగు ప్రాకృతమే.
ఇక్ష్వాకుల కాలంలో 'శైలీయులు' బౌద్ధంలో ఒక ప్రత్యేకశాఖ. ఇండొనేషియాలో రాజులుగా వర్ధిల్లిన శైలేంద్రులు ఈ  శైలీయశాఖా సంబంధితులే కావచ్చని ఒక విశ్వాసం.
తెలుగు  ప్రాకృత సాహిత్యాన్ని విదేశీయులు .. ముఖ్యంగా జర్మనులు  సొమ్ము చెల్లించి మరీ కొనుక్కుపోయేవారు. ఇప్పటికీ జర్మనీలో పది పన్నెండు విశ్వవిద్యాలయాలు ఈ ప్రాకృతభాష మీద పరిశోధనలు కొనసాగిస్తున్నాయ్.
జైన ధర్మం, తెలుగు భాష మధ్య గల బంధం దృఢమైనది. జైనులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతీయ భాషలను క్రమబద్ధీకరించేందుకు తగుసూత్రాలను రూపొందించారు. సామాన్యులకు చదువు సాములు నేర్పించారు. గణితవిజ్ఞానం  బడుగులకు చేరువయింది జైనుల పుణ్యం వల్లే! జైనంతో సాహచర్యం వల్ల సమాజానికి ఆ ధర్మం పట్ల విశ్వాసం వృద్ధి అయింది. ఆలయాల్లో  గీతాలు పాడేవాళ్ళు జైనులు. ఆ గీతాలే ఇప్పుడు నాటి మన  తెలుగు భాషాచరిత్ర ఆనవాళ్ల పరిశీలనకు ఉపకరిస్తున్నాయి. బౌద్ధులూ ప్రజల చదువు సంధ్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన బుద్ధిజీవులే. జైనులు, బౌద్ధులు ఆంధ్రదేశంలోని శిల్పకళకు కొత్త హంగులు తీర్చిదిద్దిన  కళాకారులు, కళాపోషకులు. బౌద్ధులు బోధిసత్వుని కథలను  నిరంతరాయంగా పారాయణం చేయడం ద్వారా  ప్రజలలో  పఠనాసక్తి  పెంపొందించినట్లు పరిశోధకుల మాట.
బౌద్ధం కారణంగా ప్రపంచానికి ధర్మకేంద్రంగా వర్ధిల్లిన ఘనత మన తెలుగు గడ్డది.  సన్యాసులకు, బ్రహ్మచారులకే పరిమితం అనుకున్న బౌద్ధాన్ని  సంసారులూ ఆచరించదగ్గ ధర్మంగా ఆచార్య నాగార్జునుడు తీర్చిదిద్దాడు.  ఆంధ్రదేశంలోని జైనులూ ఆ మార్గంలోనే సాగి తమ వంతు బాధ్యతగా సామాజిక సంస్కరణలకు పూనుకున్నారు. శ్వేతాంబరులకు, దిగంబరులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన యూపనీయులు తెలుగుజాతికి చెందిన వారేనని ఒక విశ్వాసం.
బాహ్యుబలి లాంటి భారీ విగ్రహాలు బోధన్ కేంద్రంలోనూ తెలుగువాళ్లు ప్రతిష్టించుకొన్నట్లు వినికిడి. జైన, బౌద్ధ మతాలలో భారీ విగ్రహాల ప్రతిష్టాపన ఒక ఆచారం. కక్షల కారణంగా అన్యమతస్తులు ఆ అఖండ శిల్పకళా వైభవాన్ని ఖండ ఖండలు చేయడం అన్యాయం. తెలుగునేల మీద ఊళ్ల పేర్ల పరిశోధనలకు పూనుకుంటే ఆ స్థలపురాణాల చాటున బోలెడంత తెలుగువాళ్ల చరిత్ర బైటపడుతుంది.
శాతవాహనుల తరువాత కొంత భూమిని  ఏలిన విష్ణుకుండినులకు నేటి నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరం రాజధానిగా ఉండేది. విష్ణుకుండినులు తమ పేరుకి 'ఇంద్రపాల్' అనే బిరుదును చేర్చుకొనే ఆచారం పాటించేవాళ్ళు. ఆ ఇంద్రపాలనగరం ఇప్పుడు  తెలంగాణాలోని ఏ ప్రాంతంలోదో? విష్ణుకుండినుల రాజవంశానికి చెందిన శాసనం ఒకటి బి.ఎన్.శాస్త్రిగారి పరిశోధనల్లో బైటపడింది కానీ నాటి ప్రాంతాల వివరాలు, ఆ రాజుల పాలనా ప్రాముఖ్యాలు వెలుగులోకి వచ్చే తీగెలేవీ ఆ పరిశోధన డొంకలో తగిలినట్లులేవు. డాక్టర్ అజయ్ మిత్రా చేసిన కొంత కృషి మినహా.. ఆ దిశగా  మరి దృష్టి మళ్లించిన పరిశోధకులు కరువయ్యారు! ఏదేమైనా నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం పురిటిల్లుగా మారడం ప్రతీ తెలుగుబిడ్డా ఎలుగెత్తి చాటవలసిన అంశం.
ఎవరు ఈ దేశంలో ఎక్కడ  పరిశోధనలకు పూనుకున్నా తెలుగువారికి సంబంధించిన చారిత్రకాంశాల  లింకులు కొన్నైనా తప్పక   బైటపడతాయి! దేశరాజధాని దిల్లీ తుగ్లకాబాదు ప్రాంతంలో ఒక ఆంధ్ర  ప్రముఖుని గోరీ కనిపిస్తుంది.  తుగ్లకుల ప్రధాని మాలిక్ మక్బూల్ సమాధి అది. ఆ ప్రముఖుని అసలు పేరు 'గన్నయ్య'! కాకతీయుల ప్రధానిగా ఆయన చాలా ప్రయోజకుడంటారు చరిత్రకారులు.
చరిత్ర పట్టం కట్టిన కుతుబ్ షాహీలు నిజానికి సొంతంగా ఏమంత ఘనకార్యాలు చేసిందిలేదు. పదవులను వేలం వేసి అమ్ముకునే పూర్వపు వ్యాపార ధోరణిని మానిపించి, సమర్థతను బట్టి నియమించడం, వారికీ వర్తించే విధంగా నియమ నిబంధనల రూపొందించడం ఆ వంశం చివరి పాలకుడి పాలనా సంస్కరణగా చరిత్ర శ్లాఘిస్తుంది.వాస్తవానికి ఆ సలహా పాదుషాకు ఇచ్చింది అతని ప్రధాని మాదన్న. మాదన్న తెలుగువాడు కావడం తెలుగువారికి గర్వకారణం.
సంస్కృతంలో పంచకావ్యాలకు  సుబోధకమైన  వ్యాఖ్యలు రాసిన  వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథసూరి మన మెదక్ జిల్లా కొల్చారంలో పుట్టిన  తెలుగు బిడ్డ. ‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’(మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను) అంటూ తన  రచనా సరళి గురించి  సగర్వంగా ప్రకటించుకున్న ఆ తెలుగు పండితుడి వ్యాఖ్యల సాయం  లేకుండా  సంస్కృత కావ్యాల పఠనం అంగుళమైనా ముందుకు సాగదు.
దేశదేశాల సంగీత విద్వాంసులు తన్మయత్వంతో ఊగిపోతూ స్వరార్చనచేసే త్యాగరాజస్వామి అరవదేశానికి తరలి వెళ్ళిన  మన తెలుగు తల్లి ఈత!
తెలుగు పండితులకు పొత్తాలకు పొత్తాలు వివరాలు నమోదు చేసే ఓపిక బొత్తిగా లేదన్న అపవాదు కద్దు. అందుకు విరుద్ధంగా మానపల్లి రామకృష్ణకవి పరిశోధనారంగంలో తన అసమాన ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించిన విద్యావేత్త. భాండార్కర్, ఆప్టే, రనడే, సంపుర్ణానంద్, మజుందార్ వంటి ఉత్తమశ్రేణి పరిశోధకులతో పోల్చదగిన ఆ పరిశోధక విద్వాంసుడు ప్రతీ తెలుగువాడికీ గర్వకారణం.
సంస్కృతాన్ని జాతీయయభాషగా ప్రకటించాలని బెల్గాం జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పట్టుబట్టిన కావ్యకంఠ శ్రీ గణపతి ముని తన పదో ఏట నుంచే బహుళ కావ్య రచనావతంస, నిరంతర పరిశోధక జిజ్ఞాసి. భారతీయ సంకీర్తనం అయనంతగా చేసిన వేదపండితుడు దేశం మొత్తంలోనే దొరకడు. ఆ సంస్కృతాంధ్ర మహాపండితుడూ  తెలుగుతల్లి నోముల పంటే!
వేదకాలపు సంస్కృతం పరాయి భాషలకు పదాలు పంచిపెట్టింది.  లౌకికభాష పేరున ఇతర భాషల  నుంచి తానూ పదాలు స్వీకరించింది. సంస్కృతంలో చాలా తెలుగు శబ్దాలు ఈ విధంగా చేరేందుకు ఆస్కారం ఉంది. 'తెలుగులో సంస్కృత పదాలు ఎందుకు వాడాలి?' అని మొండిగా వాదించే ప్రబుద్ధులు కొందరు అచ్చు తెలుగు పేరుతో  వికార శబ్దఘోషకు తెగబడడం విచారకరం. సంస్కృతం పేరుతో చలామణీ అయ్యే పదాలు ఎన్నో  తెలుగు ప్రాకృతాల నుంచి ఎగుమతి అయిన శబ్దభవాలేనని ఎంత తొందరగా  పెద్దలు  గ్రహిస్తే తెలుగు భాషకు అంత మేలు! సంస్కృతం ఏ రాష్ట్రానికీ చెందిన  ప్రాంతీయభాష కాదు. అది అఖండ భారతావనికి  చెందిన వాఙ్మయ సంపద. అందులో తెలుగుకూ సింహభాగం అధికారముంది.
దాదాపు రెండువేల ఏళ్ల కిందటే బౌద్ధ సాహిత్యం  తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమయింది. నాటకాలూ వేసేవాళ్లు ఆయా భాషల్లో. అప్పట్లో ఎవ్వరూ 'జననీ తమిళ భాషా' అని నినాదాలు చెయ్యలేదు. 'అవునవును' అంటూ ఏ తెలుగువాడు చప్పట్లు కొట్టిందీ లేదు.
కాలప్రవాహంలో కనుమరుగయిపోవడం  ఇతిహాసం సహజ లక్షణం.  వీలున్నంత  వరకు అందుకే దార్శనికులు చరిత్రగా దొరికిన విశేషాలను నమోదు చేస్తుంటారు.  తెలుగునాట ఈ తరహా చారిత్రిక జిజ్ఞాస  మొదటి నుంచీ కాస్త తక్కువే. కాబట్టే  తమవారు నడిచిన వచ్చిన దారుల్లో వారి అడుగుజాడల ఆనవాళ్ళు పట్టేందుకు తెలుగువాడు ఈనాడు ఇంతలా ప్రయాస పడుతున్నాడు.
ఈ దేశాన్ని తెల్లవాళ్లు పాలించే రోజుల్లో బ్రిటన్ నుంచి దిగివచ్చిన దొరలకు ఇక్కడి భాష, సంస్కృతల గురించి  ప్రముఖులు అవగాహన కల్పించే పాలనావిధానం అమలులో ఉండేది.  ఆ విధంగా ఉపన్యసించేందుకని వచ్చిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్  ఒక సందర్భంలో ఆర్య.. ద్రావిడ 'జాతుల'ను గూర్చి ప్రసంగించి వెళ్లిపోయాడు. కొంత కాలం తరువాత మరోసారి ఉపన్యసించడానికని వచ్చినప్పుడు గతంలో తాను చేసిన  పొరపాటున సరిదిద్దుకొనే ప్రయత్నం చేయబోయాడు. ఆర్య.. ద్రావిడ వైరుధ్యాలని   'జాతుల' మధ్య వైరుధ్యాలుగా తాను పొరపడ్డానని.. నిజానికి అవి 'సంస్కృతుల' మధ్య సంభవించిన వైరుధ్యాలని సరిదిద్దుకొనే ప్రయత్నం అది. 'ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవడం కుదరదు' అన్నది ఇక్కడి దొరతనం. కారణం..  అప్పటికే ఇక్కడి అమాయక  భారతీయులని ఆర్య.. ద్రావిడ 'జాతులు'గా పాలకులు తమ పాలనా సౌలభ్యం కోసం  పూర్తిగా విడగొట్టేసేయడం!  విజ్ఞానశాస్త్రం కానీయండి, సంస్కృతులు కానీయండి, భాషలు కానీయండి.. రాజకీయాలకు విడగొట్టరానిదంటూ ఏదీ ఉండదుతమకు గిట్టుబాటు వ్యవహారంగా ఉండాలి.. అదే ప్రధానం
ఈ దేశంలోని చాలా ప్రాంతీయభాషలు ఆనాటి  విభజన రాజకీయాల మూలకంగా  ఇవాళ ఎన్నో విధాలా నష్టపోయాయి!  ఎక్కువ నష్టం దక్షిణాది భాషలదయితే.. వాటిలో  అత్యధిక నష్టం తెలుగు భాషది. ఎవరినో నిందించడం ఎందుకు? తెలుగు భాష నేటి దైన్యస్థితి తెలుగువాడి స్వయంకృతం.
తెలుగువాడు ఈ దేశం  గడ్డ మీద ఎన్నో  శతాబ్దాల బట్టి వివిధ రాజ్యాలు చలాయించిన మొనగాడు. ఘనమైన మన గతం అవగతం కాకే  భాష వాడకం మీదింతలా  సతమతం ప్రస్తుతం. తెలుగు చరిత్ర మీద చిన్నచూపు. ఇకనైనా సరిదిద్దుకుందామా.. కనీసం పదిమంది మధ్య పరువుగా నిలబెట్టే ఆత్మసమ్మానానికైనా!
***
-కర్లపాలెం హనుమంతరావు
06 -06 -2018
(భారత ఇతిహాసంలో ఆంధ్ర దేశం - జి.కృష్ణ- ఆంధ్రప్రదేశ్ - ఏప్రిల్ 1994 సంచిక- పు.13 -16- వ్యాసం ప్రేరణతో}



Sunday, June 3, 2018

ఇదేం చారిత్రిక సాహిత్యం?!- సాహిత్య విమర్శ




రెండో ప్రపంచయుద్ధంలో పట్టుబడ్డ జర్మన్ నాజీ సైనికాధికారులను విచారించే సందర్భంలో ఒక విచిత్రమైన విషయం బైటపడింది. రష్యన్ భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశమేలేని ఆ సైనికాధికారులు ఆ దేశ బౌగోళిక పరిస్థితులను  ముందుగానే ఎట్లా పసిగట్టినట్లు?! ఆ విషయం తెలుసుకుంటే అవాక్కవడం ముందు మన వంతవుతుంది. టాల్ స్టాయ్ లాంటి గొప్పరచయితల నవలలు చదివినందువల్ల రష్యా బౌగోళిక పరిస్థితుల మీద ఒక నిర్దుష్ట అవగాహన ఏర్పడిందట! రష్యన్ రచయితల కాల్పనిక రచనల్లో సైతం కనిపించే వర్ణనలు చరిత్రను అంత విశుధ్ధంగా చిత్రీకరిస్తాయన్న మాట! ఆ రచయితలు వెర్రివాళ్లు.
మన తెలుగు రచయితలకు అంత వెర్రిలేదు. శత్రువులకు ఉప్పందించడం ఎందుకన్న ఉద్దేశంతో చారిత్రక నవలలల్లో సైతం నిండా అభూత కల్పనలు నింపి పెడుతుంటారు! మన తెలుగు చారిత్రక నవలలు చదువుకొని ఏ మూర్ఖుడైనా మన దేశం మీదకు దండెత్తి వస్తే వింద్యకు ఇవతల దిక్కు తోచక చచ్చూరుకోవడం ఖాయం. భద్రత దృష్ట్యా  చరిత్రలను సైతం  తప్పుల తడకలతో నింపి తమ దేశభక్తిని నిరూపించుకుంటున్నారు మన తెలుగు చరిత్రకారులు!
మనం ఉండేది జంబూ ద్వీపం, భరతఖండం, భరతవర్షం.. కృష్ణాగోదావరీ నదీ తీరాల మధ్య మనల్ని ఏలిన రాజులు చతుస్సాగర పర్యంతం పరుచుకున్న భూమిని ఏలిన మహావీరులు. దైవాంశ సంభూతులకు మన భూమి  గొడ్డుపోలేదు. ఇక్కడి బ్రాహ్మణ్యం బ్రహ్మతేజస్సుతో, బ్రహ్మజ్ఞానంతో వెలుగొందిపోతుంటుంది. గోదావరి వేదఘోషతో ప్రవహిస్తుంటుంది. తెలుగునాట అంగళ్లలో రత్నాలు  రాశులు పోసి అమ్ముతారు. కళింగసీమ విజయనగరరాజు పూసపాటి విజయరామ గణపతి రాజు లక్షమంది సైనికులతో, లక్ష ఏనుగులతో, పదివేల లొట్టిపిట్టలతో బొబ్బిలి మీదకు దండెత్తి వస్తాడు. బొబ్బిలి పక్కనే రాజాం ఠాణాలో సుంకాలు వసూలు చేసుకొనే తాండ్రపాపారాయుడు అర్థరాత్రి చీకట్లో చడీ చప్పుడు లేకుండా విజయరామరాజు గుడారం గుడ్డలు చించి మరీ నిద్రలో ఉన్న రామరాజును ఖూనీ చేసి 'పులి.. పులి' అంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ వీరోచితంగా పోరాడి చచ్చిన మహావీరుడు!
మన పురాణ గాధలు, తరువాత వచ్చిన విశ్వనాథవారి పురాణ వైరగ్రంథమాల నవలా సిరీసు పూర్తి 'ఉన్మత్త భావుకత్వం'తో వెలిగిపోతుంటుంది. విశ్వనాథవారి వేయిపడగలు ఊహకందని ఉదాత్త పాత్రల జీవిత చిత్రీకరణలతో, చెప్పనలవికాని గ్రామీణ వ్యవస్థ  వర్ణనలతో విభ్రాంతిగొల్పుతుంటుంది. 'ఆంధ్రప్రశస్తి' పద్యాలు పరమాద్భుతంగా ఉంటూనే  వాస్తవానికి సహస్రయోజనాల దూరంలో సాగుతుంటాయి
జానా బెత్తెడు రాజ్యమేలిన వేంగిరాజుల పౌరుష ప్రతాపాలకి జడిసి సముద్రగుప్తుడు అనే చక్రవర్తి పుటాయించి పారిపోయాడుట! 'అటనెటగనిన బంగరేనట!' 'అదెంత శ్రీయో, అదెంత భాగ్యమో' అంటూ అవాస్తవికమైన ఒక వైభవాన్ని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు విశ్వనాథుడు. పల్లవరాజులు అసలు ఆంధ్రులే కారు. ఇరాన్ నుంచి తరలి వచ్చిన పహ్లవి జాతివాళ్ళు. భూముల్ని ఆక్రమించి  ప్రజలని పీడించి పాలించిన పాలకులు స్థానిక ప్రజలతో కలగలసి ఇక్కడి భాషను, సంస్కృతిని వంటబట్టించుకున్న బాపతు. ఒకవేళ నిజంగా ఆంధ్రులే అయినా వాళ్లకి అంత వైభవమూ లేదు, భాగ్యమూ లేదు. ఇక్ష్వాకులూ.. చాళుక్యులూ  అంతే. చిన్న  స్థాయి రాజ్యాలను ఆక్రమించుకొంటూ.. వాళ్ల నుంచి వసూలైన పన్నుల మీద ఆధారపడిన వీరకళాకారులు వాళ్లంతా. విశ్వనాథ వంటి మహాప్రతిభావంతుడు కలం పుచ్చుకొని వళ్లు మరచి వాళ్ల కీర్తిగానానికి పూనుకుంటే ఇదే నిజమైన చరిత్రగా భావించే అమాయకులకు కొదవ లేదు మన తెలుగు గడ్డల మీద!
శక్తిమంతులు, కళాకారులు తెలిసి అబద్ధాలు ప్రచారం చెయ్యకూడదు. అబద్ధానికి నిజం కన్నా ఎన్నో రెట్లు బలమెక్కువ. నిజాన్ని చంపేసిన పాపం కళాకారులకు చుట్టుకుంటుంది. కళ ఎంతటి అమృతమో, అంతటి హాలాహలం కూడా కళ. విశ్వనాథ వంటి మహాకవి ప్రజాపక్షాన నిలబడి.. ప్రజాస్వామిక ఉద్యమాలకి అగ్రభాగాన ఉండుంటే తెలుగు సాహిత్య చరిత్ర విశ్వవిఖ్యాత స్థాయికి చేరి ఉండేది. ప్రతీ తెలుగు గుండె గర్వంతో ఉప్పొంగే సాహిత్య చరిత్ర మన సొంతమై ఉండేది!
విశ్వనాథకు సమకాలీనులు అడవి బాపిరాజు. అవడానికి ఆయన ప్రజాస్వామ్యవాదే. చారిత్రక దృష్టిగల రచయితే!  కానీ ప్రతిభా వ్యుత్పత్తుల విషయంలో విశ్వనాథవారి తరువాతే! ప్రజల రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి  మంచి చారిత్రక నవలలు అందించారు. కానీ వాటిని  స్పార్టకస్, వార్ అండ్ పీస్,  హ్యూమన్ కామెడీ స్థాయిలో ఊహించడం కుదరదు. మహీధర రామ్మోహనరావుగారికి రాచమల్లు రామచంద్రారెడ్డి వంటి పెద్దల నుంచి మంచి చారిత్రక నవలా రచయితగా ప్రశంసలు దక్కాయి. బహుశా 'కొల్లాయి గట్టితేనేమి' 'రథ చక్రాలు' వంటి నవలల వల్ల ఆ ప్రశంసలు దక్కివుంటాయి. కానీ రామ్మోహనరావుగారి చారిత్రక రచనల్లో  గొప్పనవలల్లో ఉండే జీవలక్షణం, నవల  చదువుతున్నప్పుడు వినిపించవలసిన గుండె చప్పుళ్లు ఉండవు. పనివాడే కానీ మహాపనివాడు కాదంటే ఆయన  అభిమానులకు కించిత్ రోషం రావచ్చు. కానీ వాస్తవాన్ని వాస్తవంగానే చూడవలసి ఉంటుంది! ఇంతమంది మంచి రచయితలు ఉండీ  మరి మన తెలుగులో మంచి చారిత్రిక సాహిత్యం ఎందుకు రావడం లేదు? మన కాల్పనిక రచయితలకు చారిత్రక దృక్పథం కరువవడమే కారణం అనిపిస్తుంది!
మన భారతీయులు శిరోధార్యాలుగా భావించే భారత, రామాయణాలు కావ్యాలా? చారిత్రిక సంఘటనలా? అన్న శంక  ఇంకో వెయ్యేళ్ళు గడిచినా తీరేది కాదు. కళింగయుద్ధంలో అశోకుడితో పోరిన కళింగరాజు అసలు పేరేమిటో ఇప్పటికీ తెలియదు! అశోకుడు రాతి స్తంభాల మీద, రాతి పలకల మీద చెక్కించాడని చెప్పుకునే శాసనాలు ఎంత వరకు వాస్తవమో నిర్ధారణ కాలేదు. అంతటి ఘోరమైన యుద్ధం చేసినందుకు పశ్చాత్తాపం కలిగి ఉంటే తనతో పోరిన ఆ కళింగరాజు పేరును అశోకుడు ఎందుకు గుట్టుగా దాచేసినట్లు?!
అశోకుడి శాసనాల వల్ల కళింగ యుద్ధం, అలెగ్జాండర్ దండయాత్రల వల్ల మౌర్యులకాలం నాటి విశేషాలు, హ్యూయన్ త్సాంగ్, ఫాహియాన్ వంటి విదేశీ యాత్రికల కథనాల వల్ల మాత్రమే ఆ నాటి పరిస్థితులు, ముస్లిం పాలకులు రాసిన, రాయించుకున్న ఐనీ అక్బరీ.. బెర్నెయర్ రాతల వల్ల మాత్రమే  మొగలాయీల  విశేషాలు.. తెలుసుకునే దుస్థితి మనకెందుకు కలిగినట్లు? మన తెలుగు రచయితలకు.. ఆ మాటకొస్తే భారతీయ రచయితలకు చారిత్రిక దృష్టికోణం, చారిత్రిక వాస్తవాల  మీద ఆట్టే గౌరవం లేకపోవడమే కారణం అనుకోవాలి.
కులపురాణాలు, వంశవృక్షాలు పరిశీలిస్తే మన చారిత్రిక జ్ఞానశూన్యత బట్టబయలవుతుంది. సూర్యుడు, వాడి కొడుకు చంద్రుడు, వాడి కొడుకు భరతుడు, వాడి కొడుకు ప్రసేనుడు, వాడి కొడుకు రవి, వాడి కొడుకు చంద్రదీపుడు, వాడి కొడుకు ఓ  చూరుపోయిన చిన్నయస్వామి.. ఈ రీతిలో సాగుతుంటాయి వంశచరిత్రలు!
కాబట్టే మనకు కాకతీయులు ఎవరో ఖచ్చితమైన సమాచారం లేదు.  కృష్ణదేవరాయలు తమ వాడేనని ఒక్క చైనా, జపాన్ వంటి పరాయి దేశాలు, ఉత్తర హిందూస్థానం మినహా దక్షిణాది ఆంధ్ర, కర్ణాటక  లోని దాదాపు అన్ని  కులాలు సగర్వంగా క్లెయిమ్ చేసుకుంటుంటాయ్ ఇప్పటికీ!
మనకు చరిత్ర కూడా మతం లాగా ఒక విశ్వాసమే! ఈ దేశంలో సీతమ్మ స్నానం చెయ్యని చెరువు, పాండవులు నిద్ర తీయని గుహలు, శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించని శివలింగమూ లేనేలేవని గురజాడ మహాకవి ఎన్నడో కడుపుమంటతో అనేశాడు. ఆయన కన్యాశుల్కం మీద నాటకం రాశాడు కానీ ఏ బొబ్బిలియుద్ధం మీదో రాసి ఉంటే మనం ఇక్కడ చెప్పుకునే మాటలకు వెయ్యి రెట్లు చురకలు  మన చరిత్రకారులకు వడ్దించుండేవారు,
జానపదులూ, జ్ఞానులూ, కవులూ, పండితులూ కూడా మన దేశంలో ఒకే మాట మీద నిలబడతారు. ఆయుర్వేదశాస్త్ర పితామహుడు ధన్వంతరి అయినా సరే.. చచ్చినట్లు దేవతలు, రాక్షసులు కలసి మధించిన క్షీరసాగరం నుంచే పుట్టుకురావల్సిందే. సంస్కృత వ్యాకరణం శివుని ఢమరుకం  నుంచి పుట్టితీరాల్సిందే! బుద్ధుదు తన ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా విధిగా భగవంతుడి అవతారాల్లో ఒకడిగా పడివుండాలి.
బ్రహ్మాండంలో హిందూమతం ఒక్కటే అతి సనాతనం, విస్తృతం, పవిత్రం, అచరణీయం.  భ్రమల్లో విహరిస్తూ బ్రహ్మానందం పొందే తెలుగు రచయితకు ఎప్పటికికైనా చారిత్రిక దృక్పథం అబ్బాలని ఆశిద్దాం. అప్పటి వరకు మనం ఐరోపా, అమెరికా, ఆఫ్రికా ఖండాల రచయితల హిస్టారికల్ ఫిక్షన్సే గతి!
-కర్లపాలెం హనుమంతరావు
03 – 06 -2018
(కలాలు- కరవాలాలు; పరాయి రచయితలనే చదువుకోవాలా?డా॥ ఎ.బి.కె.ప్రసాద్ వ్యాసం నుంచి కొంత భాగం- పు.133 – 136 )
డా॥ ఎ.బి.కె. ప్రసాద్ గారికి కృతజ్ఞతలతో! ఎమెస్కో వారికి ధన్యవాదాలతో!!
  



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...