Wednesday, December 4, 2019
ఆంధ్రౌన్నత్యం -పండిత సత్యనారాయణరాజు
1
వెల్లబోయెదెవేల
విశ్వేశ్వరుని గాంచి హంపీవిరూపాక్షు నరయరాదె
డంబువీడెదవేల
టాజుమహల్ గాంచి యమరావతీస్తూప మరయరాదె
భ్రాంతిచెందెద
వేల వారనాసిని గాంచి దక్షవాటిక గాంచి తనియరాదె
కళలువీడెద
వేల కాళి ఘట్టము గాంచి వైశాఖపురి గాంచి పరగరాదె
గాంగజలముల
గనుగొని కలగదేల-గౌతమీ గంగ కనులార గాంచరాదె
యఖిల
సౌభాగ్యములు నీకు నమరియుండ-దెలివిమాలెద వేమోయి తెలుగుబిడ్డ!
2
ఆలించినావెందు
ద్యాగరాట్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
నాలకించితివెందు
నాధ్యాత్మ కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
రహివింటి
వెచ్చోట రామదాస్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
మొగివింటి
వెయ్యెడ బొబ్బిలిపాటల నాంధ్రభూమినిగాక యన్యభూమి
వింటి
వెచ్చోట పల్నాటివీరచరిత- మాంధ్రభూమిని గాకున్న యన్యభూమి
నాంధ్రపదమెంత
మధురమో యాంధ్రతనయ-తెలిసికొని, నేటికేనియు గులుకవోయి!
3
చిట్టివడాలను
చేర్చిన పోపుతో గమనైన పనసకూర
అల్లముకరివేపయాకుతో
దాలింపుగా నొప్పు లంకవంకాయకూర
ఘ్రాణేంద్రియముతో
రసనేంద్రియము దన్ను పసమీఱు విఱిచిన పాలకూర
గరమసాలాలతో
గమగమవలచెడు వసలేని లే జీడిపప్పుకూర
బుఱగుం
జూచబియ్యము పూతచుట్ట- లాదిగాగల దివ్య పదార్థవితతి
యాంధ్రులకెకాని
మఱియేరికైన గలదె-సేతుశీతాద్రిమధ్య విశేషభూమి!
4
కాలుసేతులును
వంకరలువోవగజేసి వణకించు పెనుచలిబాధ లేక
బండఱాళులు
గూడ మెండుగా బీటలు వాఱించు వాతపబాధ లేక
ఏరుళూలుగూడ నేకమై ప్రవహించు వర్రోడుతతవర్ష బాధ లేక
బండుగనాడైన
బట్టెడన్నము లేక రొట్టెలే తినియుండు రోత లేక
చూచితూచినయట్టుగా
దోచుచుండు-సీతు నెండయు వానయు బూతమైన
యమలరాజాన్నమునుగల్గునాంధ్రభూమి-
దలచికొనిపొంగుమెటనున్న దెలుగుబిడ్డ!
రచనాకాలం:1934
‘ధర్మా’గ్రహం -కర్లపాలెం హనుమంతరావు
బాబ్రీ
మసీదు కూల్చివేత పట్టపగలు.. కొద్ది మంది మతవాదుల దుందుడుకు ఆగడం. రాజ్యాంగ
అధికరణం 370 రద్దు ఓ
ప్రజాస్వామ్య ప్రభుత్వ అర్థరాత్రి అతిరహస్య ఎత్తుగడ.
రెండు ఘటనలకు ఎన్ని సమర్థనలో.. అంతకు మించి ఖండనలు!
చారిత్రిక తప్పిదాలను సరిదిద్దిన సాహసోపేత సంస్కరణలుగా సంఘ్
పరివార్, వారి తైనాతీల వాదనగా ఉంటే..
మతాతీత దేశానికి అతకని ముతక పోకడలుగా ప్రజాస్వామ్యవాదుల నిరసన! ఒక కూల్చివేత ఘటన పూర్వాపరాలు పంథొమ్మిది
వందల తొంభై నాటి వాతావరణానికి ప్రతీక. మరో
కొట్టివేత సన్నివేశం వెనుకా ముందు నాటి పరిస్థితులు రెండువేల
పంథొమ్మిది నాటి స్థితిగతులకు
నిదర్శనం. మధ్య ఉన్న దాదాపు మూడు దశాబ్దాల కాలంలో దేశం ‘మూడ్’
ఏ విధంగా మారిందన్నది చరిత్ర పరిశోధకులలో ఆసక్తి
ర్రేకెత్తించే అంశం.
బాబ్రీ మసీదు కూల్చివేత
నాటికి ధర్మకుమార్ దిల్లీ స్కూల్
ఆఫ్ ఎకనామిక్స్ లో
ఎకనామిక్స్ ప్రొఫెసర్. హిందూ మితవాదం, కమ్యూనిష్టు
భావజాలం.. రెండిటి పట్లా ఒకే తరహా వైఖరి ఆ స్త్రీ మేధావిది. ఒక మతానికి చెందిన ప్రార్థనాలయం
మరో మతవాదుల మూకచేష్టల కారణంగా కూలడం సహజంగానే మతసామరస్యం కాంక్షించే ఆ విద్యాధికురాలి
మదిలో ఆవేదన రగిలించింది. కూల్చివేత
ఘటనపై అప్పటికప్పుడు ఒకానొక ప్రముఖ
దినపత్రిక మొదటి పుటలో ఓ సుదీర్ఘ ప్రకటన రూపంలో స్పందించారా చైతన్యశీలి. ‘మరో ప్రార్థనాలయం కూల్చివేత హిందూ స్వాభిమానాన్ని
ఏ విధంగా పునరుద్ధరిస్తుందో ముందు తేలాలి. జాతిగౌరవం ఏ మోతాదున పెరుగుతుందో,
దేశ సమగ్రత ఏ తీరున పటిష్టమవుతుందో వివరించాలి!' అంటూ విధ్వంసకారుడిని నేరుగా నిలదీస్తూ సాగే ఆ నిరసనలో
ఆద్యంతం నిండి ఉన్నది ఆనాటి సగటు భారతీయుడి మదిలో ర్రగిలే ఆందోళనే. మత ప్రాధాన్యత అధికంగా
ఉండే సున్నిత అంశాలు కొన్నింటి పట్ల ప్రదర్శించే దురుసుతనం దేశ
అస్థిరతను మరంతగా విస్తరిస్తుందని,
ప్రపంచం ముందు ప్రజాస్వామ్య
దేశానికి తలవంపులు తెస్తుందని, భావితరాల జీవితాలలో వృథా
ఉద్రిక్తతలను పెంచుతుంద’ని ఆ ప్రొఫెసర్
ఆవేదన. నిరసనతో కలగలసిన ఆ ఆవేదన ధర్మకుమార్ ఎంతో ధైర్యసాహసాలతో బహిర్గతం చేయడం ఆనాటి ప్రజాస్వామిక స్వేఛ్ఛాయుత వాతావరణానికి సంకేతంగా
భావిస్తే తప్పేముంది? మొదటి
పుట నిండా నలుపు రంగు పులుముకొని పైన తెల్లటి అక్షరాలతో కొట్టవచ్చినట్లుగా
ఓ నిరసన ప్రముఖ దినపత్రికలో దర్శనమివ్వడం ఈ
కాలపు రాజకీయ విలువల దృష్ట్యా నిజంగా ఓ అద్భుతమే.
ఆ ప్రకటనకు మద్దతుగా అప్పటి మేధోవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు,
బ్యురోక్రాట్లు, పాత్రికేయులు, వివిధ రంగాలలో పేరొందిన ప్రముఖులు ఎందరో మద్దతుగా నిలవడం, పంథొమ్మిది మంది ప్రముఖుల సంతకాలతో ఆ నిరసన ప్రకటన వెలువడడం పెద్ద చర్చకు దారి తీసిందంటారు అప్పట్లో.
ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్ నుంచి మాజీ చీఫ్ ఆఫ్
ఆర్మీ స్టాఫ్ కె.సుందర్ జీ వరకు సంతకాలు చేసినవారంతా
నాటి సమాజం దృష్టిలో ఎంతో విశ్వసనీయులు! ఖర్చులు భరించి తానే జారీ చేసిన ప్రకటన కాబట్టి ధర్మకుమార్ విలువలకు కట్టుబడి స్వయంగా సంతకం
చేసారుకాదు. సంతకాలు
చేసిన ప్రముఖులలో ఆర్.పి.గోయెంకా, రాజ్ త్యాగరాజన్, దేశ్ బంధు గుప్తా వంటి వ్యాపార దిగ్గజాలూ కనిపించడం ఏ విధంగా సాధ్యమయింది?! ఈ
కాలం తరహాలో ధర్మకుమార్ ధర్మాగ్రహం ఏ హిప్పీ కటింగ్ కమ్యూనిష్ట్ చిల్లర 'కుట్టుపని' కిందనో ఎందుకు వెక్కిరింతలకు గురికాలేదు?! గత మూడు దశాబ్దాలుగా
కేంద్ర ప్రభుత్వాలను నడిపించిన పాలక పార్టీల
దృక్పథాలలో క్రమంగా వస్తోన్న మార్పుల నుంచే ఈ సందేహాలకు సరైన సమాధానాలు దొరికేది.
ఈ మూడు
దశాబ్దాలకు మూడేళ్లు ముందు ప్రస్తుతం నడుస్తున్న 2019, అగష్టు,
5 సోమవారం భారత రాజ్యాంగం
కశ్మీరు లోయ వాసులకని ప్రసాదించిన స్వయంప్రతిపత్తి సౌకర్యానికి గండి కొడుతూ ఆర్టికల్ 370 అర్థరాత్రి నిశ్శబ్దంగా
నిర్వీర్యమయింది! స్వీయపాలన ‘వద్దు.. మాక’ని స్థానికుల నుంచి కించిత్తైనా వత్తిడులు
లేవు. అధికరణ కారణంగా బాధితులం అవుతున్నట్లు ఏ వర్గ సమూహపు మొత్తుకొళ్ళూ వినిపించవు!
ప్రజలిచ్చిన అధికారం ఒక్కటే పాలకపక్ష అప్రజాస్వామ్య
చేష్టలకు ఊతం! ఆ నాటి ఎకనామిక్స్ ప్రొఫెసర్ ధర్మకుమార్ దారిలోనే నేడూ ప్రజావ్యవస్థలకు
రక్షణగా నిలబడ్డదలచినవారు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా ప్రశ్నిస్తేనో? ప్రశ్నల పర్యవసానాల సంగతి పక్కనుంచి..
ప్రశ్నించే పరిస్థితులు దేశంలో అసలు
ఎంత వరకు బతికున్నాయన్నదే ప్రస్తుతం ప్రధానంగా ముందుకొస్తున్న
ప్రశ్న.
ప్రజాస్వామ్య పంథాకి
పెడగా ప్రభుత్వాల అడుగులు పడుతున్న ప్రతిసార్రీ గల్లాపట్టుకు నిలదీసే గుండె నిబ్బరం కోటికి ఎక్కడో ఒకరికైనా ఉందా? ఉందనే మాట వరుసకు అనుకుందాం.
ధర్మకుమార్ దారిలోనే
వారి చేతా నిరసన పత్రమొకటి తయారయితేనో?! 'దేశభక్తులంతా
తప్పక ఆలోచించాలి. కేవలం రాజ్యాంగ అధికరణ 370 రద్దు చర్యతోనే
మన జనస్వామ్య వ్యవస్థలన్నీ సుదృఢవుతాయని నమ్ముతున్నారా? సమస్యకు సంబంధించిన ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోని
రద్ధుసంస్కరణ దేశ ఉద్రిక్తతలకు తగ్గ మందుగా మీరు భావిస్తున్నారా? అదే వాస్తవమయితే
మతాతీత కులాతీత ప్రజాస్వామ్య భూమిక పై నిర్మితమైనదిగా జాతి గౌరవించే దేశ రాజ్యాంగం నిజానికి అప్రజాస్వామికమైనదని మీరు ఒప్పుకున్నట్లే! దేశం ఓ మూల భూభాగానికి మాత్రమే
ప్రత్యేక రక్షణ కవచాలు అందించడం అంటే అఖండ భారతావని సార్వబౌమికతను
కించపరిచిందన్నట్లేగా రాజ్యాంగం మీద మీ ఆరోపణ? కశ్మీరు లోయ స్వయంప్రతిపత్తి పట్ల ప్రత్యేక
ఆసక్తి ప్రదర్శించడమంటే అఖిల భారతావని ఇతర
భాగాల బాగోగులపై ఇసుమంతైనా శ్రద్ధ రాజ్యాంగానికి లేదన్నట్లేగా మీ ఫిర్యాదు?' ఈ తరహాలో
సాగే ఆ నిలదీత పత్రం ప్రముఖ దినపత్రికల ప్రథమ పుటలలో ప్రచురించడానికి సిద్ధమయితేనో? ఖర్చులకని
యాచిస్తే గుప్తంగా మద్దతిచ్చే విజ్ఞులకు ఇప్పుడూ పెద్ద
కొదవేమీ ఉండబోదు. కానీ సర్కారును ఇరుకున పెట్టే ఏ ‘డిస్సెంట్ నోట్’ పైనా పెన్ను పెట్టి ‘సైన్’ కొట్టే
దమ్ము ధర్మకుమార్ కాలంలో మాదిరి ఇప్పుడు ఎంతమంది బిగ్-బాసులకుంది?’ అదే బిలియన్ డాలర్స్
ప్రశ్న ప్రస్తుతం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా విశ్వ విపణి వీధులనేలే భారతీయ కుబేరులలో ఎందరో నిజానికి ఉదారభావాలకు పెట్టింది పేరు. ప్రజాస్వామ్య పంథా పట్లా వారికుండే అచంచల విశ్వాసం సాధారణ పౌరుల
అంచనాలకు అందేవికావు. ఆర్టికల్ 370 వంటి పాక్షిక లాభాలు చేకూరే
రాజ్యాంగ అధికరణల పట్ల ప్రముఖులందరికీ ఒకే తరహా అభిప్రాయం ఉండకపోవచ్చు. అందుకు
తప్పు పట్టలేం. చట్టాల పట్ల కన్నా.. ఈ తరహా
బిల్లుల ఆమోద తిరస్కారాలకై చట్టసభలు నడుస్తున్న
తీరు మీదనే ఎందరో ప్రముఖులకు బాహాటంగా చెప్పలేని
బాధా.. ఆందోళన. పాలకవర్గ రాజకీయ ప్రేరిత ప్రణాళికల
కార్యాచారణ విధానాలను అంతర్గత సంభాషణలలో ఎంతగా
తూర్పారపట్టినా బహిరంగంగా మాత్రం తటస్థ వైఖరి తీసుకోక తప్పని దుస్థితి కొందరు పెద్దలది.
పరిథి మీరి మరీ వత్తాసుకు పోక తప్పని ఒత్తిళ్లు మరి కొందరు వ్యాపారప్రముఖులవి. సంపూర్ణ
మౌనమే సర్వదా శ్రేయస్కరంగా భావించి ఓ నమస్కారబాణంతో సరిపుచ్చుకునే సంపన్నుల సంఖ్యే
ప్రస్తుతం దేశంలో ఎక్కువ! కారణం;
ఆర్టికల్ 370 రద్దులోనే లేదు. గద్దె ఎక్కిన
పార్టీల ప్రాయోజిత సర్దుబాట్లు సంస్కరణల ముసుగులో మరెన్నో ముందు ముందుకు తోసుకుని వచ్చే కొత్త తరహా వాతావరణానికి 2019 నాంది కావడంలో ఉంది.
సంతకాలకై ధర్మకుమార్ సంప్రతించిన నాడు .. కేవలం ఒక నిరసన పత్రం పైన పొట్టిసంతకం
గిలికిన కారణానే తమ అండన బతికే వేలాదిమంది రోడ్డున పడరన్న ధీమా భరత్ రామ్, లలిత్
థాపర్ వంటి పరిశ్రమల పోషకుల గుండెల నిండుగా ఉండిన పంథొమ్మిది
వందల తొంభై రెండులు…
అదే మాదిరి గుండె నిబ్బరం మాజీ ఆర్థికశాఖామాత్యులైన శ్రీమాన్ చిదంబరానికే ఉండని
రెండువేల పంథొమ్మిదులు…
దాదాపు మూడు దశాబ్దాల మధ్యన పరుచుకున్న దేశ రాజకీయ, పాలనా
వ్యవస్థల పని తీరుల్లో కనిపిస్తున్న మార్పులను గమనిస్తే దేశం ‘మూడ్’
‘బ్యాడ్ టు వర్స్ట్’ దిశగా ఎంత వేగంతో
దిగజారుతున్నదో తెలిసి దిగులవుతున్నది ప్రజాస్వామ్య వికాసం పట్ల ఎంతటి ఆశావహ దృక్పథం
గల దేశభక్తులకైనా!
కంటి ముందు జరిగే ఆర్థిక
దాడులు, కుంటి సాకులు ఇరికించే అక్రమ
నేరాల కేసులు, ఊహించేందుకైనా భీతి గొలిపే ఉపద్రవాలు ఇంకెన్ని
ఏ సందు గొందుల నుంచి ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నవో అంతుపట్టని ఉగ్ర వాతావరణం మధ్యన
నేటి దేశం అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నది
మరి! లోయకోని జాతులే కాదు..
దేశంలోని అన్ని తరగతులు ఒక్కో తీరున ఒకనాటి దేశ అత్యయిక పరిస్థితులను దాటి శిక్షల గదుల్లో
మగ్గుతున్నాయి.
‘ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి ప్రగాఢ విశ్వాసమున్నప్పటికీ ఉదారవాదం ఆచరణలో సదా ఓ మిథ్య మాత్రమే’ అని భావి తరాలు సైతం ఒక శాశ్వత నిరాశ భావన లోనికి జారక ముందే మందలు మందలుగా
మరెంతో మంది ప్రొఫెసర్ ధర్మకుమార్ లు అందుకే పుట్టుకు రావాలసుంది.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక- సంపాదకీయ పుట వ్యాసం)
***
Tuesday, December 3, 2019
సరస్వతీ.. నమస్తుభ్యమ్! - ఈనాడు సాహిత్య సంపాదకీయం
'పలు
సందియములు దొలుచును/ వెలయించు న గోచరార్థ విజ్ఞానము'అన్నది
చదువు మీది చిన్నయసూరి సదభిప్రాయం. అక్షరం లోక చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డి
కుక్కతో పోల్చారు పురందరదాసు. 'సంతకు పోయి దుడ్డు పెట్టె కాక
దొరికేనా' అని ఆ వాగ్గేయకవి ఎకసెక్కాలాడినట్లే గాలికి తిరిగి
తన పుత్రులు ఎక్కడ జనుషాంధువు లవుతారోనని పంచతంత్రంలో పాటలీపుత్ర మహారాజు మహా
మధనపడిపోతాడు. అహరహము అరి నామ స్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి
తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికి ముందుగా తోచింది సద్గురువుల వద్ద లభించే
సదసద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే!చదువనివా డజ్ఞుండగునని రాక్షసుడైనా
విద్య విలువ చక్కగా గ్రహించాడు. ఇప్పుడంటే విద్య పరమార్థం అర్థ సంపాదన అయింది కానీ
ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసుల కోసం ఏకంగా బొటనవేలునే పణంగా పెట్టి విద్యల కోసం
వెంపర్లాడాడు? కర్ణుడు పరశురాముడి దగ్గర పడీ పడీ శుశ్రూషలు
చేసుకున్నది ఉబుసుపోక కాదు గదా? మృత సంజీవనీ విద్య ఆర్జన
కోసం కచుడు చేసిన సాహసం సామాన్యమైనదా? ఆత్మ పరమాత్మల పరమ
రహస్యాలను గురు ముఖతః గ్రహించాలన్న తపనతోనే కదా జాబాలి గౌతముని మున్యాశ్రమంలో
అన్నేళ్లు గొడ్డూ గోదా కాచింది!విద్యార్జనకు ఎంత విలువ లేకపోతే గీతాచార్యుడు గోపాలబాలుడుగా సాందీప మహాముని పంచలో కూర్చుని గుంట ఓనామాలు దిద్దుకుంటాడు? అవతార పురుషుడు తారక రాముడు సైతం తాటకి వధకు పూర్వం వశిష్టులు, విశ్వామిత్రుల వద్ద వేద విద్యా పారాయణాలలో తర్ఫీదు పొందినవాడే!
విద్యాసముపార్జన ఒక విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాలలో ప్రధమమైనదే
కాదు.. ప్రధానమైనది కూడా! భారతీయులకు చదువు చెప్పే గురువు సాక్షాత్ పరబ్రహ్మ
స్వరూపం. పురందరదాసు ప్రబోధించిన విధంగా 'గురువుకు గులాము
అయే దాకా ముక్తి దొరకదు అన్నా' అన్న సూక్తి మనిషికి చదువు
మీద ఉందవలసిన శ్రద్ధాభక్తులకు పెద్ద నిదర్శనం.
భర్తృహరి బోధించనే బోధించాడు కదా -
విద్య నిగూఢ విత్తమనే గాఢ రహస్యం! అది పూరుషాళికి రూపం. యశస్సు. భోగకరి. విదేశంలో
ఆదుకునే ఆపద్బంధువు. హరించదలచే వాడి కంటికి కనిపించని నిధి. సుఖపుష్టి తో పాటు
సత్కీర్తి సాధించి పెట్టే ఈ దివ్య ధనం అఖిలాండ కోటికి ఎంత ఉదారంగా ధారపోసినా పెరిగేదే కానీ.. తరిగే ద్రవ్యం
కాదు. యుగాంతాన కూడా అంతం కాని ఈ మీరాశి ఎవరి సొంతమో వారు కుబేరుడిని మించిన సంపన్నులు. నిజానికి మనిషికి భుజకీర్తులు. సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలే
కావు. చందన స్నానాలు, మందారమాలలు ఏమంత అందచందాలను పెంచనూ
లేవు. వాగ్భూషణం ఒక్కటే మనిషికి సుభూషణం- అన్న భర్తృహరి సుభాషితాన్ని కాదనలేం! నృపాల పూజితమని అనుభవం మీద ఆ
రాచకవే ప్రవచించిన తరువాత విద్య విలువను గురించి వేరే తర్జన భర్జనలు దండుగ. అల్లసాని పెద్దనామాత్యులు
ఎదురైనప్పుడు మదకరీంద్రము నిల్పి కే యూత యొసగి కృష్టదేవరాయలంతటి రారాజు సరదాకి
ఎక్కించుకొంటారా? మను చరిత్ర రచనతో చరిత్ర సృష్టించిన ఘనతే
కదా మహారాజుల పక్కన పీఠాల దక్కుదలకు ముఖ్య కారణం! వల్మీకజనుడైన వాల్మీకి మహర్షికీ
కమలజన్యుడు బ్రహ్మతో సరిసమానంగా గౌరవ మర్యాదలందిన కీలక రహస్యం రామాయణ రచనలోనే
ఉందన్న నిజం కాదని ఎలా అనగలం? సుభాషిత రత్నావళి భాషించినట్లు
చందమామకు తారాతోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి సద్భూపాల పాలన మాత్రమే అలంకారాలవుతాయేమో కానీ విద్య
మాత్రం సర్వే సర్వత్రా సకల జనావళికి ఒకే తీరున సద్భూషణాలై శోభను పెంచుతాయి. డొక్కశుద్ధి లేని మనిషి తేనె లేని తేనెపట్టు- అంటారు ఖలీల్ జిబ్రాన్. మానవ జన్మ ఎత్తినందుకైనా
నాలుగు మంచి ముక్కలు నాలుక కింద దాచుకోని వాడిని 'విద్యానీతి'
అనే సద్గ్రంథం వజ్ర వైఢూర్య ఖచిత ఘటకంలో తెలక పిండి వంట కోసం గంధపు చెక్కలు
తగలేసే మూర్జశిఖామణి కింద జమకట్టింది.
చదువును మించిన చక్కదనాల చక్కని ధనం ముల్లోకాలు గాలించినా
ఎక్కదా దొరకేది కాదని సర్వశాస్త్రాల మూకుమ్మడి సారం. భాగవతంలో కన్నతండ్రికి పిన్న
వయసులోనే ప్రహ్లాదుడు కుండ బద్దలు కొట్టి మరీ విప్పి చెప్పిన చదువుల మర్మం మహా భాగవతమంత!
చదువు- సంధ్యలు చక్కని
జంట పదం. రెండు సంధ్యల మద్యన సాగే జీవితం రాగరంజితం అయే ఉత్తమ సాధనాలలో చదువు అతి చక్కనిది. మంచి చెడుల మధ్యన అనుక్షణం జరిగే
ధర్మయుద్ధమే జీవితమంటే. ఆ నిత్య కురుక్షేతంలో మనిషిని కాపాడే విచక్షణ పునాది మంచి
విద్య. సర్వ రోగాలకు మూలకారణం మనిషి
తాపత్రయం- అంటారు బుద్ధ భగవానులు. దాని అంతిమ దుష్ఫలితం ఆయుక్షీణం- అన్నది రుగ్వేదం సమర్థన. యావ నుంచి మనిషి మనసును ఉత్తమ మార్గానికి మళ్లించేది సద్వాణి - అన్నది కృష్ణారావుగారి గ్రంథాలయ సూక్తిసుధలో ఒకటి. అయితే ఆ వాగ్రాణి మనం పాణి చాచితే అందేటంత సమీపంలోనే ఉంటుందని వీరేశలింగం పంతులుగారు ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. మానసిక వైద్యుల ఉధ్ఘాటన ప్రకారం .. ఆరోగ్య సిద్ధికి,
అమరత్వ లబ్దికి సద్గ్రంథ పఠనం ఉత్తమ సోపానం కూడా. ఒక దశ దాటిన తరువాత వయసుతో పాటు
మనసూ వడలిపోవడం సహజంగా జీవచర్యల్లో ఓ భాగమే! బద్దెన నీతిశాస్త్రంలో కుండ బద్దలు
కొట్టినట్లు ధనం, ఉషోదయం, యవ్వనం,
వండిన అన్నం, మూర్ఖుడి స్నేహం మాదిరి మనిషి బతుకూ బుద్భుధప్రాయమే!'ఆయువు నూరు సంవత్సరము లందు సగంబు నశించె నిద్రచే/ నా యరలో సగంబు గతమయ్యెను
జరా ప్రసక్తి చే/ బాయక తక్కిన యట్టి సగ బాలు గతించు బ్రాయస వృత్తిచే'!- అన్న నానుడికి కొనసాగింపుగా ఆ మిగిలిన జీవితకాలంలో కనీసం సగ భాగమైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలని ఉవ్విళ్లూరకపోతే
వాడసలు మనిషే కాదు- అనే నవీన జీవన సూత్రం పైనే పిన్న పెద్దా అందరి ధ్యాసా ప్రస్తుతం. నిష్కాముకత్వం
మనసుకు సేదనిచ్చి ఆయుక్షీణతకు దివ్యౌషధంగా పని చేస్తుందని వేదాలు చెబుతున్న మాట వాస్తవమే. కానీ నిత్య జీవిత పోరాటంలో ఏదో ఒక
ఆరాటం తప్పదన్నట్లుగా బతికాల్సిన సామాన్యుడికి యోగుల కామనగా భావించే ఆ ఆధ్యాత్మిక భావన సాధన సాధ్యమయే పనేనా? అన్ని పద్దులకూ రద్ధై పోగా
మిగిలిన జీవితంలో కనీసం సగ భాగమైనా పడుచుదనంతో పరవళ్లు
తొక్కాలనే మామూలు మనిషి తపన. పుస్తక పఠనం ఓ తపస్సుగా మార్చుకుంటే సరి.. ఆ మాదిరి విలాస జీవితం కోరుకున్న
విధంగా కులాసాగా అనుభవించెయ్యచ్చని కొత్తగా లండన్ తాజా విశ్వవిద్యాలయ మనస్తత్వవేత్తల బృందం
తమ పరిశోధనల్లో తేల్చింది. మానవ జీవకణాలైన క్రోమోజోముల చివర్న జీవిత కాలాన్ని
నిర్దేశించే 'టెలోమెల్' లు ఉంటాయని,
అవి ఎంత దీర్ఘంగా ఉంటే మనిషి జీవితం అంత సుదీర్ఘంగా సాగుతుందని,
పుస్తక ప్రియులలో ఈ ' టెలోమెల్' పొడవు సాధారణ కొలతల కన్న అధికంగా ఉంటుందని ఆ పరిశోధకుల బృంద నేత ప్రొఫెసర్ స్టీఫెన్ హోల్గేట్
ప్రకటించారు. ఇంకేంటీ! ఏడు పదులు దాటినా చేతికి కర్ర రాకుండా కులాసాగా కాలం గడపాలంటే వెంటనే పుస్తకాలు పట్టి వరుసబెట్టి వదలకుండా 'పఠనయోగం'
ఆరంభిస్తే సరి!
***
కర్లపాలెం హనుమంతరావు
03 -12 -2019,
బోథెల్, యూ.ఎస.యే
(ఈనాడు-
సాహిత్య సంపాదకీయం)
Monday, December 2, 2019
'మరో గొలుసు కట్టు పథకం'- అంబల్ల జనార్దన్ కథానిక పై పరామర్శ
రచయితలకు రాత కష్టాల కన్నా
మోత కష్టాలు జాస్తి. ఇల్లాలు టీలు కాచి కాచి ఇస్తే.. తెల్లార్లూ నిద్ర కాచి కళ్ళు వాచేటట్లు మరీ తాను కన్న కలలన్నింటినీ తెల్లటి కాగితాలపైన కమ్మటి కథలుగా కనిపారేసే
పని రచయితది. తెలుపును నలుపు చేయడం అంటే అదెంతో ఇష్టమైన వ్యాపకం; కాబట్టి కష్టం అనిపించదు. కానీ ఆ రాసేసిన
ఆక్షర రాసులన్నిటి అంతిమ పరమార్థం చిత్తు కాగితాల తక్కెడ అయితేనే
అనర్థం!
ప్రతీ
రచయిత బయోపిక్ లో రెండు హాఫ్స్ తప్పనిసరి. ఫస్ట్ హాఫ్ లో కలం అనే అంకుశంతో
కాగితమనే రణక్షేత్రం మీద కాల్బంట్ల నుండి అశ్వ గజ పదాతి
దళాలను మించి అమోఘమైన పాత్రలతో తోచిన వ్యూహాలు అల్లి మరీ కదను తొక్కించే యోధుడు అతగాడు! సెకండ్ హాఫ్ నుండి అంత లావు 'గాడూ' అంతూ పొంతూ లేని కడగండ్ల బారిన పడి కొట్టుకుపోతూ తేరుకొనే దారి తెలియక భోరుమనే ఆర్థిక బాధితుడు. రాసి పడేసిన రాసులన్నింటినీ ఎట్లాగూ అన్ని పత్రికలు
పడేసి ఆదరించవు. అచ్చుపడ్డ కథల మీదా ఇరుగు పొరుగు రచయితల
పాపిష్టి దిష్టే తప్ప ఎంత మంది అసలు సిసలు పాఠకుల
దృష్టి పడుతుందో తెలియదు! అక్షర రాసులతో లక్షలాది కాసులు ఆశించే సీను ప్రస్తుతం తెలుగు రచయితకు
ఎట్లాగూ సున్నా. కలాల కరవాలాలతో చేసిన భీకర
కవాతులకైనా ఓ గుప్పెడు
చప్పట్లు రాలవు. వాటి కోసం దేబిరించడం.. ద్యావుడా.. ఎంతటి దైన్యం! వెనకటికి పుస్తక ప్రచురణలో వాచిపోయిన వాచీతో సహా సర్వం కోల్పోయిన ఓ రచయిత వాపోయినట్లు కాణీలు, అణాలు ఏరుకునేటందుకు మాత్రమే మిత్రమా రూపాయలు పైకి వెదజల్లే సాహసం రచయిత చేయాల్సిందీ కాలంలో! ఇవాళ్టి పరిస్థితిని బట్టి చూస్తే పుస్తకాల ప్రచురణ అనే యాగం రచయిత కోరి కొనితెచ్చుకొనే ఆగం మాత్రమే సుమా! గతం మాదిరి ఏ ప్రచురణ సంస్థా
రచయిత సృజనకు ‘సుస్వాగతం!’ అనే చాదస్తపు రోజులు కావివి. అదృష్టవంతులు ఏ అతి
కొద్దిమందికో మాత్రమే ఆ స్వాగతాలు.. సత్కారాలు! చిన్నా చితకా రచయితలంతా సొంత సొమ్ముతో ప్రచురణ క్రతువు ఆరంభించి ఆనక పూరా చితికిపోయినవారే!
ఆరంభంలోనే ఈ పిచ్చి పుస్తకాలకు చితి ఎందుకు పేర్చలేదా అని చింతించినవారే!
అచ్చోసి వదిలేసినా అచ్చొచ్చే అదృష్టం అందరు రచయితలకూ పొసగదు.
ఖర్చు ఒక్కటే కాదు వయస్యా
సమస్య ఇక్కడ! విచ్చు రూపాయలు అచ్చుకొనేందుకు సిద్ధ పడ్డా రచయితలకు ప్రచురణ కర్తల కోడరికం తప్పించుకునే
మార్గాలు లేవు. ఓపినన్ని
ప్రతులు వేసి ఏ పంపిణీ సంస్థకో ఓపెన్ గానే చచ్చు రేటుకు ఆఫర్ ఇచ్చినా ప్రతీ వంద రూప్యములకు ఒక పైసా గిట్టుట సందేహము! రచయిత సొంత ప్రచురణ మగవాడి సొంత వంటకు మించి
రిస్క్! ఏజెన్సీలని బతిమాలి బామాలి ఒప్పించి తమ పుస్తకాలు
షాపు బీరువాలలో సర్దించే సంతృప్తి తప్పించి ..
చిట్టెలుక వంటి రచయిత సింహం వంటి ప్రచురణ సంస్ఠ ముందు చిందులు వేయుట దుస్సాహసంబందురు లోక నైజం కాచి వడబోసిన వడబోసిన అనుభవజ్ఞులు. రామాయణ భారత మహాభాగవతాల మాదిరి
మన గ్రంథాలకూ ఓ ‘మూల’ గ్రంథాల హోదా దక్కిందన్న సంతృప్తి
ఒక్కటే రచయిత సృజనాత్మ పరిశ్రమకు అంతిమంగా దక్కుదల.
చచ్చీ
చెడి అచ్చేసుకున్న పుస్తకాలు ఇంటి అటక మీద దాచిపెట్టినా ఆవకాయ జాడీలకు మల్లే అవేవీ భద్రంగా ఉండేవి కావు! చదువరులకు
చేరని అక్షరమంటే చెదపురుగులకు చచ్చే తీపి. కొంప గుండమవుతోందంటూ ఇంటామె గుండెలు బాదుకొనే చప్పుళ్లే తప్పించి బేవార్సుగా
పుచ్చుకున్నందుకైనా మిత్రుల నుంచి మినిమం చప్పట్లు వినిపించే రోజులూ కావివి. మొహమాటం కోసమైనా నవ్వుతో
ఒహ మంచి మాట నోట పలకని మొద్దురాచిప్పల కోసమా కాలి చిప్పలు అరిగేలా ఇన్నేసి
అచ్చుపాట్లు పడేది రచయిత? పరువు ప్రతిష్ఠల
గ్రాఫు ఎటూ పైకి ఎగబాకేది లేదు! బాకీలు చేసి మరీ అచ్చొత్తించిన పుస్తకాల గాడిద బరువు చివరికి
తీర్చే బాధ్యత ‘గాడ్’ వంటి చెత్త కాగితాలు కొనుక్కునే వీధి బేరగాడిదే! ఓ మై గాడ్! మంచి సాహిత్యం చివరి వినియోగదారుడు కాగితాల చెత్త కొనేవాడు కావడం.. సో సాడ్! పుస్తకాల పురుగులకే రచయితలయ్యే అవకాశం ఎక్కువంటారు. ఆ
రచయిత పుస్తకాలే పురుగుల
పాలవడం.. అంతకు మించిన విషాదం మరేముంటుంది? అందుకే గతంలో
మాన్యులు కీ. శే. శ్రీ పోతుకూచి
సాంబశివరావు రచయితలను ఆదుకునే పంపిణీ పథకాలేవేవో పద్దస్తమానం
ప్రయత్నించేవారు. అదే తరహాలో ఓ పుస్తక రచయితల బృందం తమ తమ పుస్తకాలు అమ్ముకునే గొలుసు కట్టు పథకం గురించి ప్రణాళికలు వేసుకునే
అంశం చుట్టూతా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన చక్కని
కథానిక శ్రీ అంబల్ల జనార్దన్ ‘మరో గొలుసు కట్టు
పథకం’.
సాహిత్యంలో అభినివేశం ఉండీ తన తండ్రిగారు స్వంత ఖర్చుపై అచ్చేసుకున్న పుస్తకాలకు పట్టిన దుర్గతి చూసి చలించిపోయిన ఓ గుప్తాజీ తన ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచే సంస్థ తరుఫున గొలుసు కట్టు పుస్తక ప్రచురణ ప్రణాళిక సిద్ధం చేసే దిశగా సాగుతుందీ కథానిక. తన తండ్రిలా తతిమ్మా రచయితలెవ్వరూ పుస్తకాల ప్రచురణకై అవసరమయే డబ్బు నిమిత్తం తబ్బిబ్బులు కారాదన్న సదుద్దేశం ఆ పెద్దమనిషిది. అతను తనతో కలసి వచ్చిన మరికొంత మంది రచయితలతో ఏర్పాటుచేసుకొన్న సాహిత్య సంస్థ పేరే 'సాహితీ విశ్వవిపణి'. శాస్త్రి, మూర్తి, చారి, జంగయ్య, యేసోబు, నదీం, రెడ్డిం సుందర్ వంటి రచయితలు సంస్థ క్రియాశీలక కార్యవర్గ కమిటీ సభ్యులు. ఈనాటి ప్రచురణ రంగంలో తెలుగు రచయిత ఎదుర్కొనే సాధకబాధకాలను గురించి సాధికార సమాచారం ఆధారంగా రచయిత అంబల్ల చర్చకు పెట్టడం తెలుగు కథల వరకు అరుదైన విధానమే. తెలుగు సాహిత్య సౌరభాలు నలుదిశలా ప్రసరింపచేసే బాధ్యతలో భాగంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతం కార్యక్రమాలు విస్తరింపచేసి, సమర్థవంతంగా నిర్వహించడం, ప్రత్యేకంగా తెలుగు రచయితలకు సముచిత గౌరవ సమ్మానాలు లభ్యమయే రీతిలో ప్రణాళికల రూపొందించడం, మందకొండిగా సాగే తెలుగు భాషా వినియోగం తిరిగి పుంజుకోవాలనే లక్ష్యంతో నిస్వార్థంగా సాహిత్య సేవ చేసే గుప్తాగారిని సంస్థ పంచమ వార్షికోత్సవ సందర్భంగా సన్మానించాలన్న తీర్మానంతో కథ మొదలవుతుంది. బిరుదులు, పూదండలు. అభినందన పత్రాల మార్క్ సన్మాన సభల ఆర్భాటాన్ని నిర్ద్వందంగా కొట్టిపారేసి, వ్యక్తిగత గుర్తింపులకు మించి భాషామతల్లికి దక్కవలసిన మన్ననలను గురించి గట్టి ప్రయాసేదైనా చేద్దామన్నది గుప్తాగారి సదాశయం. భాషాసభల మిషతో అపారంగా నిధులు వెచ్చించి మరీ అంతూ పొంతూ లేని తంతులు సాగించే ఆర్భాటకులకు ఇది చెంపపెట్టు. సాహిత్య సముద్ధరణ కోసం శక్తికి మించి కష్టాలకోర్చే నిస్వార్థ రచయితలను గుర్తించి ప్రోత్సహించే అవసరం సమావేశం మరోసారి గుర్తుచేసుకుంటుంది. రచయితల మంచి రచనలను నలు దెసలా శ్రమదమాదులకు ఓర్చి మరీ చేరవేసే మధ్యవర్తుల పాత్ర్రా తక్కువేమీ కాదు. వారి అనుభవాలను, ఆలోచనలను సైతం పరిగణనలోకి తీసుకునే అవసరం గుప్తాజీ సూచిస్తారు. సాహితీ సమావేశాలు ఒక పూర్తి రోజు ఏర్పాటు చేయడం ద్వారా ప్రచురణరంగ సంబంధీకులు అందరి మధ్యా అనుసంధానం సులభతరమవుతుందన్న ఆలోచనా ఆ సందర్భంగా తేటపడుతుంది.
సొంత భాషకు చెందిన పుస్తకాలేవీ చదవకుండానే పరాయి భాషాశాస్త్రాల మిడి మిడి జ్ఞానం ఆధారంగా వచ్చే విమర్శలను ఈ కథ వంకతో రచయిత ప్రశ్నించడం ప్రశంసనీయం. పరాయి భాషా అనువాదాలు తెలుగులోకి రావడమే తప్పించి.. తెలుగు నుంచి అనువాదాలు వేరే భాషలలోకి పోకపోవడంలోని ఔచిత్యాన్నీ రచయిత ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. అనువాద రంగంలోని అన్ని రుగ్మతలకూ విరుగుడు మంత్రంగా ఒక ప్రత్యేక ‘అనువాద విభాగం’ ఆరంభం, అందులో అనుభవజ్ఞులైన రచయితలతో పాటు సామాన్య పాఠకుల సమ భాగస్వామ్యం .. రచయిత చేసిన చక్కని సూచనలు. తెలుగు సాహిత్య విస్తృతి సమస్యకు ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువాదాలు పెంచడం తిరుగులేని పరిష్కారమే.. అనుమానం లేదు! ‘కన్నడంలో మాదిరి జ్ఞానపీఠలు తెలుగులో రాకపోవడానికి కారణమెవరో, నోబెల్ పురస్కారాలను గూర్చి కలలో అయినా ఊహించలేనంత ఘోరంగా తెలుగు సాహిత్య వాతావరణం కలుషితమవడం ఎవరి పుణ్యమో!’ అంటూ రచయిత అత్యవసరమైన అంశాలను చర్చకు పెట్టడంతో ఈ కథను చర్చాపరంగా ఒక ఉన్నత స్థానానికి చేచినట్లయింది! సమకాలీన తెలుగు సాహిత్య రంగ స్థితిగతులను గురించి నిర్మొహమాటంగా చర్చించే చొరవకు అంబల్ల జనార్దన్ లా మరెంతో మంది మేధో జీవులు ముందుకు రావాలసిన తరుణమిదే.
సమస్యలను లేవనెత్తడంతో మాత్రమే సరిపుచ్చుకునే నైజం కొన్ని కథలది. మరో అడుగు ముందుకు వేస్తో - ‘సాహితీ విశ్వవిపణి’ సంస్థ 'సాహిత్య విపంచి' అనే భారతి స్థాయి పత్రికను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు పరిష్కారం సైతం ఈ కథలో రచయిత సూచిస్తారు. సామాజిక ప్రయోజనపరంగా కథను మరో మెట్టు ముందుకు నడిపించినందుకూ అంబల్ల అభినందనీయులు! ఈ కంప్యూటర్ యుగంలో కూడా లక్షలాది యువత ఆ మాదిరి సాహిత్య నిబద్ధ పత్రికలకు చందాలు కట్టడం హుందాతనానికి చిహ్నంగా భావిస్తున్నట్లు రచయిత ఊహించడం కలలో మాత్రమే సాధ్యమేమో! ఆ మాదిరి అనుమానం ఓ వంక పీడిస్తూనే ఉన్నా మరో వంకన ఒక కమ్మని భావన మనసును ముప్పిరిగొనడం ఈ కథ సాధించిన వస్తుప్రయోజనం. మంచి కథకు అవసరమయిన ప్రసాద గుణానికి రచయిత కథలోని ఏ పేరాలోనూ కాస్తింత కూడా లోటు రానీయకపోవడం ఆహ్లాదకరమైన కొత్త దారి.
అమీర్ ఖాన్ 'లగాన్ ' చిత్రం ఎంతో గొప్పదై ఉండీ ప్రచారలేమి కారణంగా ఆస్కార్ పురస్కారానికి అడుగు దూరంలో ఆగిపోవడం రచయిత సందర్భానికి తగ్గట్లు గుర్తు చేస్తూనే ఆ తరహా దౌర్బల్యం తెలుగు అనువాద సాహిత్యానికీ పట్టకుండా ఉండాలంటే ప్రముఖల చేత ప్రత్యేక సమీక్షలు రాయించి అంతర్జాతీయ సంస్థల సహకారంతో వాటికి విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని సూచిస్తారు. ఎంపిక చేసిన అనువాద సాహిత్యం ప్రచురణార్థమై ప్రత్యేకంగా ఆంగ్ల, హిందీ భాషలలో క్రమం తప్పకుండా పత్రిక ఒకటి తేవాలన్న ఆలోచన దాకా సమావేశంలోని సభ్యుల ఆవేశం చేరుకుంటుంది. ముదావహం.
గతంలో ఒక పత్రికలో నవల ప్రచురణ సాగే మధ్యలోనే ప్రముఖ ప్రచురణ సంస్థలు పోటీలు పడి మరీ రచయితతో ఒప్పందాలు కుదుర్చుకొనే
పరిస్థితి. అందుకు విరుద్ధంగా ప్రతిష్టాత్మకమైన పత్రికలలో బహుమతులు సాధించిన నవలలూ నేడు పాఠకుల దాకా చేరడం గగన కుసుమంగా ఉంది! అంతర్జాలం ప్రభావాన అచ్చుపుస్తకాల మీద సొమ్ము వెచ్చించడం వృథా అనే
ధోరణి తెలుగు పాఠకలోకంలో నిజంగానే అంతకంతకూ పెరుగుతోందా? ఏటేటా పుస్తక ప్రదర్శనల పట్ల
పెరుగుతున్న ప్రజాదరణ మాటేమిటో మరి? గతంలోని భారతి, ఇప్పటి మిసిమి వంటి పత్రికల దారిలో లాభాలతో నిమిత్తం లేకుండా సత్సాహిత్య
ప్రచురణ ఓ ధర్మయజ్ఞంలా భావించి ఈ కథలోని గుప్తాగారి దారిలో మరింత మంది పెద్దలు ఔదార్య బుద్ధితో ముందుకు వస్తే మినహా తెలుగు తల్లి పూర్వపు మానమర్యాదలతో తిరిగి తలెత్తుకు నిలబడే పరిస్థితులు లేవేమో!
మళ్లీ కథ విషయానికి వస్తే..
కేవలం ఓ వెయ్యి రూపాయల
సభ్యత్వం కలిగి ఉంటే చాలు.. రెండు వేల రూపాయల ముఖ
విలువ చేసే పుస్తకాలు దొరకడం, ఆనక తాము చేర్పించిన ప్రతి సభ్యుడు నుంచీ
నాలుగో వంతు రుసుము వెనక్కి తీసుకొనే అదనపు సౌకర్యం సాహితీ విశ్వవిపణి
ఆలోచించిన ‘మరో గొలుసు కట్టు పథకం’ లోని
ముఖ్యాకర్షణలు. పెట్టిన సొమ్ము తిరిగి గిట్టుబాటు అవడంతో ఆగక పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే లాభమూ ప్లస్! ఆ ఉత్సాహంతోనే ఒక్కో సభ్యుడు పదేసి
మంది కుటుంబ సభ్యులను చేర్పించి మరీ సంస్థ నుంచి అందిన పుస్తకాలతో చిన్న చిన్న గ్రామాలలో సైతం ప్రయివేట్
గ్రంథాలయాలు ఏర్పాటుకు ఉత్సాహం చూపించినట్లు
సంస్థ ప్రధాన పోషకులు గుప్తాగారు పత్రికా విలేఖరులతో సంస్థ పుట్టుక నేపథ్యం గురించి
చెప్పుకొచ్చే సందర్భంలో బైటపెట్టిన ముచ్చట్లు. రచయితలకు
అమ్మకాల బెడద తప్పింది. తమ పేరు జనాలలోకి చొచ్చుకు వెళ్లే సులువు దారి దొరికింది. అన్నింటికీ
మించి శారదా సంతతికి అంతో ఇంతో లక్ష్మీ ప్రసన్నం కూడా! ఇంకేమి కావాలి రచయితన్న జీవికి సంతృప్తి చెందడానికి!
తెలుగు భాష వ్యాప్తికై దోహదించే ఈ మాదిరి గొలుసు 'కట్టు' పథకాలు కట్టు కథలు కాబోవు కదా? తెలుగునాళ్లలో నిజంగానే ఇవి సఫలమయేవేనా? లేక కేవలం కలల వరకేనా ఈ కమ్మని వరాలన్నీ పరిమితం? చదువరిని అద్బుత రసంలో ముంచెత్తేందుకు కాదు గదా రచయిత పనిగట్టుకుని మరీ ఇన్నేసి కమ్మని ఊహపోహలను కుమ్మరించే ఎత్తు వేసింది? ఇన్ని సందేహాలన్నీ ఒక వంక నుంచీ వెన్నాడుతూనే ఉంటాయి కథానిక చదువుతున్నంత సేపూ. ఆ అబ్బురం నుంచి పాఠక మహాశయుడు తేరుకునే లోగానే అసలు విషయం బైటపడుతుంది. విద్యార్థులు, యువత కంప్యూటర్లూ సెల్ ఫోనులూ పక్కనో మూలకు గిరాటేసి అచ్చు పుస్తకాల విస్తరణను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లడం, అస్తమానం టి.వి లు, టిక్-టాకులతో పొద్దు గడిపే ప్రమదాలోకం సైతం తిరిగి పాతకాలంలోకి మల్లే నవలా పఠనాలల్లో మునిగితేలడాలు, కిళ్లీ బంకుల్లో కూడా డిటెక్టివ్ సాహిత్యానికి పోటీగా తెలుగు కథాసంపుటాలు దర్శనమీయడాలు, తెలుగు భాష పైన పట్టు పెరగడం వల్ల యువతకు తెలుగు టైపింగ్ వంటి మునుపెన్నడూ పట్టించుకోని రంగాలపై ఆసక్తులు పెరిగి మాతృభాష కొత్త జవసత్వాలు పుంజుకోవడాలు, నిరుద్యోగి యువతకు ఆయాచిత వరంగా ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగిపోవడాలు! ఆ కారణంగా అచ్చక్షర స్వర్ణయుగానికి హఠాత్తుగా ఏ ప్రభుత్వాల ప్రమేయంతో పని పడకుండానే ఆవిష్కరణలు జరిగిపోవడం! ‘కలా? నిజమా?’ అని చదువరి గిల్లిచూసుకొనే లోగానే భార్యామణి వెన్ను చరుపుతో తటాల్మని లేచి కూర్చున్న సన్నకారు రచయిత మునిమాణిక్యం రాత్రంతా పడుకుని తీరిగ్గా తెల్లారుఝాము వరకు వివరంగా కన్న కమ్మని కలలు మాత్రమే సుమా ఇవన్నీ అని తేలిపోతుంది. పావుగంట పాటు మబ్బుల్లో తేలిన పాఠకుడి మనసు నేలకు వాలిపోతుంది!
తెలుగు భాష వ్యాప్తికై దోహదించే ఈ మాదిరి గొలుసు 'కట్టు' పథకాలు కట్టు కథలు కాబోవు కదా? తెలుగునాళ్లలో నిజంగానే ఇవి సఫలమయేవేనా? లేక కేవలం కలల వరకేనా ఈ కమ్మని వరాలన్నీ పరిమితం? చదువరిని అద్బుత రసంలో ముంచెత్తేందుకు కాదు గదా రచయిత పనిగట్టుకుని మరీ ఇన్నేసి కమ్మని ఊహపోహలను కుమ్మరించే ఎత్తు వేసింది? ఇన్ని సందేహాలన్నీ ఒక వంక నుంచీ వెన్నాడుతూనే ఉంటాయి కథానిక చదువుతున్నంత సేపూ. ఆ అబ్బురం నుంచి పాఠక మహాశయుడు తేరుకునే లోగానే అసలు విషయం బైటపడుతుంది. విద్యార్థులు, యువత కంప్యూటర్లూ సెల్ ఫోనులూ పక్కనో మూలకు గిరాటేసి అచ్చు పుస్తకాల విస్తరణను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లడం, అస్తమానం టి.వి లు, టిక్-టాకులతో పొద్దు గడిపే ప్రమదాలోకం సైతం తిరిగి పాతకాలంలోకి మల్లే నవలా పఠనాలల్లో మునిగితేలడాలు, కిళ్లీ బంకుల్లో కూడా డిటెక్టివ్ సాహిత్యానికి పోటీగా తెలుగు కథాసంపుటాలు దర్శనమీయడాలు, తెలుగు భాష పైన పట్టు పెరగడం వల్ల యువతకు తెలుగు టైపింగ్ వంటి మునుపెన్నడూ పట్టించుకోని రంగాలపై ఆసక్తులు పెరిగి మాతృభాష కొత్త జవసత్వాలు పుంజుకోవడాలు, నిరుద్యోగి యువతకు ఆయాచిత వరంగా ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగిపోవడాలు! ఆ కారణంగా అచ్చక్షర స్వర్ణయుగానికి హఠాత్తుగా ఏ ప్రభుత్వాల ప్రమేయంతో పని పడకుండానే ఆవిష్కరణలు జరిగిపోవడం! ‘కలా? నిజమా?’ అని చదువరి గిల్లిచూసుకొనే లోగానే భార్యామణి వెన్ను చరుపుతో తటాల్మని లేచి కూర్చున్న సన్నకారు రచయిత మునిమాణిక్యం రాత్రంతా పడుకుని తీరిగ్గా తెల్లారుఝాము వరకు వివరంగా కన్న కమ్మని కలలు మాత్రమే సుమా ఇవన్నీ అని తేలిపోతుంది. పావుగంట పాటు మబ్బుల్లో తేలిన పాఠకుడి మనసు నేలకు వాలిపోతుంది!
కానీ .. కలే కదా అని ఉసూరుమనే ఆశావహజీవికి సర్దిచెపుతూ రచయిత చెప్పిన రెండు మూడు ముచ్చట్లు అచ్చంగా ఇటీవలే మనందరి కళ్ల ముందే జరిగిన
పరమాద్భుతాలు! ‘చందమామ’ పత్రికలో చిన్నా పెద్దా ఏళ్ల తరబడి ఆబగా చదువుకొన్న కథలు, సీరియళ్లు రాసిన రచయిత మొన్నీ మధ్య వరకు అజ్ఞాతంలోనే ఉండిపోయిన శ్రీ
దాసరి సుబ్రహ్మణ్యం. ఆ సృజనశీలి ఇతర పత్రికలకని రాసిన మృత్యులోయ, అగ్నిమాల వంటి అద్భుతమైన నవలలు, సాహితీ ప్రియులైన 'రచన' శాయిగారి పూనిక పుణ్యమా అని తెలుగు హారీ ప్యాట్టరా.. అనిపించే స్థాయిలో ఒక్కో నవల అరలక్ష ప్రతులు ఆవురావురామని చెల్లిపోయాయ్! ఆ శ్రీ 'శాయి' చేతి చలవ వల్లనే సామాన్యుడికి
ఏ విధంగానూ అందుబాటుకు వచ్చే అవకాశం లేని చిత్రకారుడు
కమ్ చిత్ర దర్శకుడు శ్రీ బాపు శ్రీరామరాజ్యం స్టోరీ బోర్డ్ అచ్చుప్రతుల రూపంలో లక్షకు
చేరువై హిస్టరీ సృష్టిస్తోంది.
రచయిత కన్నది తెల్లవారుఝాము కలా అని ఉసూరుమనే కన్నా ప్రజలెన్నుకున్న
ప్రభుత్వాల మీద వత్తిడి పెంచి కేవలం ఒక్క జీ.వో గానీ
జారీ చేయిస్తే చాలదా! మంచి రచనలు పుస్తక రూపంలో రెండు తెలుగు
రాష్ట్రాల గ్రంధాలయాల బీరువాల నిండా కొలువు తీరడానికి! విదేశాలకు భారీగా వలస వెళ్లే యువతకు తెలుగు సాహిత్యం పైన నేడు అపారమైన అభిమానం. దేశీయంగా రచయితలు చొరవ చూపించడమే తరువాయి.. భారీ పెట్టుబడులతో ప్రచురణ రంగానికి ఇతోధిక సేవలు అందించేందుకు ఆ యువత సదా తయారు. రచయిత ప్రయివేట్ పంపిణీదార్ల
దయాదాక్షిణ్యాల పైన బతుకీడ్చే రోజులు పోవాలంటే ముందు పాఠకలోకానికి
అచ్చు పుస్తకం సాధ్యమైనంత చేరువ కావాలి. అచ్చక్షరం పైన పాఠకలోకం మక్కువ పెరగనంత కాలం ఈ గొలుసు ‘కట్టు’ కథలోని సన్నకారు రచయితకు మల్లేనే నిద్రలో మాత్రమే స్వర్ణయుగం ఊరించేది!
ఏ నాటకీయతపై వ్యామోహం పెంచుకోకుండా.. ఉన్న పరిస్థితులను
పాఠకుని ముందు యధాతధంగా ఉంచేటందుకు రచయిత ఎన్నుకున్న (ప్రోటోగనిష్టిక్ ఏటిట్యూడ్) అనుకూల దృక్పథం ఈ కథకు వన్నె తెచ్చింది. ముక్తాయింపుగా రచయిత కల గురించి ప్రస్తావించే
వరకు 'అబ్బ! ఈ విధంగా జరిగితే ఎంత బాగుణ్ణు!' అన్న ఫీల్ గుడ్ వాతావరణమే కథంతా
పరుచుకుని ఉంటుంది. రచయితగా అది అంబల్లవారు ఎన్నుకుని మరీ మెప్పించిన
సాహిత్య సర్కస్ ఫీట్!
వాస్తవానికి ఈ నాడు రచయిత ఎదుర్కొనే అడుగడుగు గండాలు అనేకానేకం. గడగడా వాటిని ఓ ఛార్జిషీటులా ఏకరువు పెట్టేస్తే మొదటి పేరాలోనే పాఠకుడు గడగడా వణికిపోతాడు. విసుగు పుట్టి చదవకుండానే
పుటలు తిప్పేస్తాడు! చిన్న రచయిత సొంత సొమ్ము పోసినా పుస్తకాల
ప్రచురణలో ఎదుర్కోక తప్పని ఇబ్బందులు ఎన్నింటినో
సాహితీ విశ్వవిపణి,
సాహితీ
విశ్వవిపంచి, అనువాదాలకంటూ ఓ ప్రత్యేక
విభాగం అంటూ విన ఆకర్షణీయమైన ఎన్నో అనుకూల ప్రణాళికల ముసుగులో రచయిత అంబల్ల జనార్దన్
గడుసుగా పాఠకుడిని ఆలోచనలో పడవేసిన తంత్రం 'మరో గొలుసు కట్టు
పథకం' కథను మంచి కథల కోవలోకి
మళ్ళించింది. రోగి మందు తీపిగా ఉండాలన్న చికిత్సా చమత్కారం కథాప్రక్రియకూ ప్రతిభావంతంగా
అన్వయించినందుకు సీనియర్ రచయిత అంబల్ల జనార్దన్ కు అభినందనలు!
(రచన విహంగ వీక్షణ రజతోత్సవ సంచిక - నాలుగో భాగం(పు.144౫1448 - ఏప్రిల్, 2016 రచన సంచిక లో ఈ కథానిక ప్రచురితం)
-కర్లపాలెం హనుమంతరావు
01 -12 -2019,
బోథెల్, U.S.A
అంబల్ల జనార్దన్
ప్రవాసాంధ్రులు. ప్రసిద్ధి చెందిన రచయిత. 1950, నవంబర్ 9వ తేదీన జననం. ముంబయి
తెలుగు రత్న బిరుదు గ్రహీతలు).
Thursday, November 28, 2019
కుమతవాదం- వ్యాసం
మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి ప్రసరించుగాక .. అనే వేద సూక్తిని ఉద్బోధిస్తూనే వర్ణ వ్యవస్థ మిషతో సాటి మనిషిని అమానుషంగా అధిక సంఖ్యాక మతవాదులు గతంలో హింసించిన మాట వాస్తవం కాదని ఎవరం చెప్పలేం. భారతీయాన్ని .. హైందవాన్ని కలగాపులగం చేసి బుకాయించే ధోరణులను తార్కిక దృష్టితో నిలదీసిన ప్రతీ సందర్భంలోనూ మొదట తార్కిక దృక్పథాన్నే తప్పు పట్టడం .. కొంత దవ్వు సాగిన పిదప విచక్షణకు ఎదురు నిలబడే బలిమి సన్నగిల్లి పాశ్చాత్య ఆలోచనా ధోరణుల మూల అంశం అంటూ హేళన చేయ బూనడం .. అబ్బో.. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సాగుతున్న మత తతంగమే ఇదంతా ! వర్ణ, కుల, విశ్వాసాలనే పొరలతో నిర్మితమైన సమాజం మీద ఆధిపత్యం కోసం .. నిమ్న కులాలని హింసించిన వాస్తవం పక్కన పెట్టినా .. బ్రాహ్మణవాద విశ్వాసుల మధ్యనే (ఉదా: శైవులు .. వైష్ణవులు .. మళ్లా ఈ విశ్వాసుల మధ్యా ముద్రాంకితాల మీద కక్షతో కూడిన అంతర్గత పోరులు!) శతాబ్దాల తరబడి విధ్వంస కాండలు సృష్టించిన వైనాల మీద విదేశీయులు తమ పర్యటనల సందర్భంగా ఎన్నో పర్యాయాలు వివిధ వ్యాఖ్యలు చేసినట్లు చరిత్ర చెబుతోనేవుంది. వాటిపైనా ఏదో మిషతో బురద పులమడం .. ఎప్పుడూ కనిపించే ప్రహసనాలే!
మనువు అనని మాటలను మనువుకు ఇప్పటి అర్థ సత్యవాదులు అంటగడుతున్నారన్నది కొద్దిమంది హిందూ బుద్ధిమంతుల బాధ. ఆ మాటా నిజమే! అయితే మాత్రమేం? మను మహానుభావుడు అన్నట్ల్లుగా అధునాతన హిందూవిశ్వాసులు ఒప్పుకొనే సూక్తులు (?) చాలవా .. నిమ్న జాతులని పేరుతో కొన్నివృత్తుల వారిని .. అటరానివారుగా దూరంగా ఉంచారనడానికి .. ఇంటి పనికి, వంటి పనికి అవసరమైనప్పుడు కరుచుకుని .. అక్కర తీరిన తరువాత దూరంగా జరగమని ఆడవారిని కరవడానికి!
ముసల్మానుల వల్ల చెడు జరిగిన మాట కొట్టి పారేయలేం. కానీ వారి మధ్యప్రాచ్య సంస్కృతి, సాహిత్యాలతో, శిల్ప, భవన నిర్మాణాదుల వైభవాలతో మన భారతీయ సంస్కృతీ మరో విశిష్టమైన కళాకోణం సంతరించుకొన్న మాటా వాస్తవమే. మంచిని మంచిగా , చెడును చెడుగా విశ్లేషించుకొనే వజ్ఞత వివేకవంతులైనా ప్రదర్శిస్తుంటే ఇప్పుడు ఓ క్రమపద్ధతిలో పెచ్చరిల్లుతున్న 'సర్వం హిందూమయం' సిద్ధాతం అయోమయానికి. కొంతైనా తాత్విక చర్చ తోడయి ఉండేది . ఖండ ఖండాలుగా ఉండి నిత్యం హిందూ రాజులు చేసుకొనే అంతర్గత యుద్ధాలతో జనసామాన్యం శక్తియుక్తులు , జాతీయ వనరులు వృథా అయే తరుణంలో మధ్యప్రాచ్య పాలకులు అప్రతిహతంగా సాగించిన వరుస విజయాలతో దేశానికి ఒక అఖండత్వం సాధ్యమైంది. ఆ విధంగానే ఆంగ్లేయ పాలకుల పెత్తనాల ప్రభావం వల్లా మన స్వాతంత్ర్య ప్రతిపత్తికి పెద్ద దెబ్బ తగలడం, జాతీయ వనరులు సముద్రాలు దాటి తరలిపోవడం వరకు వంద శాతం వాస్తవం. రెండో వాదన లేదు. కానీ అదే సయయంలో స్వేచ్ఛా ప్రవృత్తిని బాగా ఇష్టపడే ఆంగ్లేయ సమాజం నుంచి ఇంగ్లీషు భాష , తద్వారా సిద్ధించిన ఇంగితం ద్వారా మన భారతీయ చింతనాపరులు ఎంతో మందిలో అప్పటి సమాజానికి అవసరమైన సంస్కరణలకు సంబంధించిన ఆలోచనా బీజాలూ పడిన మాటా వాస్తవమే. హిందూమతం మీద మాత్రమే ఏక పక్షంగా అపేక్ష చూపించే మతతత్వవాదులు ఈ నిజం ఒప్పుకోకపోయినా 'ఓపెన్' గా యోచించగల ఆలోచనాపరులైనా అంగీకరించవలసి ఉంది. మత విస్తరణ కోసమే ముసల్మానులు , క్రైస్తవులు బడుగు వర్గాలను చేరదీసారు కానీ ప్రత్యేకమైన అభిమానమేమీ కారిపోయికాదు అన్నది హిందూమతవిశ్వాసుల ఫిర్యాదు. నిజమే. కాదనం లేం. జైనులను, బౌద్ధులను .. శైవులు, వైష్ణవులు తన్ని తగలేసినప్పుడు ఆ ధర్మం అధర్మంగా ఎందుకు అనిపించింది కాదో?
లక్ష్యం ఏదైతే ఏం .. మతం మార్చుకోవడం ద్వారా కొంత ఆత్మసమ్మానం సాధించుకోవడం.. అతిహైందవ బిశ్వాసుల అమానుషు దాడుల నుండి తమను తాము కొంత రక్షించుకోవడమయితే వాస్తవం. హిందూమతం నుంచి కొంతైనా ఆదరణ లభించి కనక ఉండివుంటే కనీసం కొన్ని వర్గాలయినా ఈ పాటికి మూల మత విశ్వాసం వైపుకు మళ్లి ఉండేవే. ఇప్పటికీ గోమాంస భక్షకుల పేరున అన్నెం పున్నెం ఎరుగని పాత వృత్తులతో పొట్టపోసుకొనే బక్కజీవులను వెంటాడి వేధిస్తుంటిరి! ఇదేమని నిలదీసే మానవతావాదులను పాశ్చ్యాత్య భావదాస్యులని కించపరుస్తుంటిరి?!
సౌదీలో ఆడవారికి ఓటు హక్కు కల్పించిన సందర్భంగా ఈనాడు ఆదివారం సంపాదకీయం రాసాను నేను. ఆ టపాను ఫేస్ బుక్ లో పెట్టినప్పుడు వయసు సంగతి వదిలేయండి, వాదనలోని సారాంశానికయినా వీసమెత్తు విలువ ఇవ్వకుండా వ్యాఖ్యల పేటికలో అసభ్యమైన వ్యక్తిగత దూషణల పరంపర వెల్లువెత్తింది ఒకానొక సందర్భంలో! ఈ తరహా అతిమతతత్వవాదుల అసహనం గత ఎన్నికలలో ప్రో-హిందువాదుల చేతికి అధికార పగ్గాలు అందినప్పటి నుంచి క్రమంగా పెచ్చు మీరుతున్నది.
పెరుగుట విరుగుట కొరకే అన్న మన తెలుగు నానుడిని ఒక అత్యంత పురాతన జాతీయ స్థాయి పార్టీ ఎలాగూ తన వికృత చేష్టల ద్వారా రుజువు చేసుకొని ఉన్నది. చరిత్ర చెప్పే పాఠాలను పట్టించుకొనే అలవాటులేని మరో జాతీయ పార్టీ అదే బాటల్జొ ప్రస్తుతం ఉరకలు వేస్తో పతనం వైపుకు అత్యుత్సాహంగా పరుగులు పెట్టేస్తున్నది!
భశుమ్!
Thursday, October 24, 2019
తెలుగుకి ఢోకా లేదు! -కర్లపాలెం హనుమంతరావు
మన మాతృభాష తెలుగా? అబద్దం. మన మాతృదేవతలు పలికేది తెలుగేనా?!
అచ్చు తెలుగులో 'అమ్మా!' అంటే ఏ
తల్లయినా ఇస్తోందా బదులు? పుచ్చు ఆంగ్లంలో 'ఆంటీ!' అంటేనే ‘యాఁ’ అంటూ ఏ ముసలమ్మైనా కదులు! ‘అంకుల్’ అనకుంటే
ఎంతటి క్లోజ్ చిన్నానైనా నెత్తికి పోస్తాడు కుంకుడు పులుసు!
సజీవ భాష అనగా నేమి?
నట్టింట్లో పద్దాకా తెగ వాగే టీ.వీ, అనుక్షణం
చెవిలో మార్మోగే సెల్ జోరీగ, కంటిని ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మల.. బారిన
పడి ఏ భాష నలుగుచుండునో అదియే ‘సజీవ భాష’ నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఏనాడో
చచ్చినట్లు లెక్కేనా? అమంగళము ప్రతిహతమగు గాక. మరి తెలుగు
మృతభాషయినచో అమృతభాష యేది గురువా? ఆంగ్లాంధ్రములు
కలిపి పిసికిన సంకర బంకరా శిష్యా! తలకట్టు
ఒక్క మన తెలుగుకి మాత్రమే సొంతమైనట్టు ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!
తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా!
పూజా పునస్కారం ఆంగ్లాంధ్రమునకు! బడితె పూజా, తుస్కారం
అగ్లీ ఆంధ్రమునకు! గుళ్లల్లో
సుప్రభాతానికి బదులుగా 'గుడ్ మాణింగ్' అంటేనేగా ఆ గాడ్
గారి ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్కయ్యేది సర్వదా!
వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో
వాగితేనేనయా.. దండాలు.. దస్కాలు. సన్మానాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లంటూ గుణుస్తూ కూర్చుంటే అర దండాలు.. కాళ్లూ చేతులకు అరదండాలు.. ‘ఛీఁ.. ఛీఁ’ అంటూ చీత్కారాలు!
తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతానికి మన తెలుగుతల్లి బతుకీడుస్తున్నది! ఉద్యోగం, ఉపాధి సంగతులు ఆనకరా ఢింబకా!
మనసు పడ్డ పాపను పడేసేందుకైనా నువ్ ప్రేమలేఖ ఆంగ్లమునే గిలకవలె మొలకా!
ఇంకేం చూసి తెలుగు మీద మోజు పడాలిరా
బళ్లకెళ్లే భడవాయలు అంతా? దొంగవెధవలకు మల్లే మెడల్లో పలకలు గంగడోళ్ళలా
వేలాడేసైనా
సరే బిడ్డలని లార్డు మెకాలే వారసులుగా మార్చేసెయ్యమనే కదా మన టెలుగు మా.డా(మామ్.. డాడీ)ల సొద! పులులు, పిచ్చుకలు, దున్నపోతులూ అంతరించిపోతున్నంత చింతైనా లేదంటారా తెలుగు
అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్ కాల్డ్ తెలుగు ‘దుందుడుకు’!
కాపాడే కంటి రెప్ప గొప్పతనం కన్ను
గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు అంతకు మించిన మహర్దశ సాధ్యపడుతుందా?
‘క్రియ’
తెలుగు వాక్యంలో చివరకు రావడమే అన్ని
లోకువలకు అసలు కారణం. అదే మరి ఆంగ్లములో అయితేనో? కర్తా కర్మల
మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని'
అంటే వెనక్కు నక్కే తెలుగు తోడుగా ఉంటే శనీ జోడవుతుందన్న
వెరీ బ్యాడ్ వెర్రి సెంటిమెంటబ్బా తెలుగబ్బికి! ఎంత పద, లిపి సంపద తెలుగు నాలుక చివర పలుకుతుంటేనేమి? ఆంగ్లంతో కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని
ఉలుకు తెలుగు బోడికి.
గురజాడవారి గిరీశానికి ఈనాటికీ తెలుగ్గడ్డ మీదింత గ్లామరుందంటే కారణం? పూనా ఢక్కన్
కాలేజీలో మూడు ఘంటల పాటు ఏక బిగిన బట్లరింగ్లీషులో బాదేయగల గట్టిపిండం కాబట్టే! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించే లేటెస్ట్ సెంచరీ కదా ఇది!
శ్రీనాథుడి చాటువులతో వేపుకు తిందామంటే చెవులకు చేటలు కట్టెస్తారయ్యా కనక లింగం! బమ్మెర పోతనగారే.. ఆ అతి కమ్మదనం
భ్రమల్లొ పడిపోయేసి అమ్మభాషలో భాగవతం రాసి భగవంతుడికి అన్యాయం చేసేసాడు! వెరీ సాడ్! అదే ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని ఆంధ్రాంగ్లంలోనైనా
కుమ్ముంటే భాగవతం ఈపాటికి ఆ లాటిన్ బైబిల్ తో గిన్నీస్ కు పోటీకొచ్చుండేది!
వాడుక భాషంటే ఏమన్నా వేడుక భాషనా? వ్యవహార
భాష. ఇంద్రాసూయైనా సరే.. ఆంధ్రంలోనే యవ్వారం అని ఆనాడు
చంద్రబాబు గాని మొండికివేసుంటే అన్ని కోట్ల పెప్సీప్లాంట్ల కేసు పురిట్లోనే
సంధి కొట్టేసేది! కేసీఆర్ సార్ తెలంగాణా భాషలో ఎంత మీసాలు తిప్పగల మొనగాడవనీయి గాక ఒక్క తెలంగాణా యాసతోనే గావు గావు మంటే కెసి కెనాలు
పనులు ఆగిపోయేవా?
ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుకు అంతలా అంకితమయిపోబట్టే ఒక్క రాజమండ్రి బోర్డర్ భాష వరకే ట్రెండయిపోయాడు. అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు
వదిలేసాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అందుకే
యుగకవిగా ఆయనకా గౌరవం .. సరే! కాసుల మాటేమిటి! ఆ గాసట బీసట తెలుగు
ఘోషలు నమ్ముకోకుండా.. గామా, బీటాల్లాంటి కామన్ మ్యాన్ బుర్రకు కు బొత్తిగా ఎక్కని ఏ
ల్యాటినాంగ్లంలోనో కూసుంటే! కాసులకసలు కరువుండేదా?
అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని తేడా పాడా లేకుండా ఏక
మొత్తంగా వర్ణమాలను మొత్తం ఆంగ్లంతో కలిపి రుబ్బి ప్రేక్షకుల మొహాన పేడకళ్లులా కొట్టేసే మన టీవీ యాంకరమ్మలకు, రేడియో జాకీ కుంకలకు, సినిమా రైటర్ బంకలకు నిండు మనసుతో
గౌరవాభివందనములు! వైద్యం చేసే నారాయణులు, న్యాయం చెప్పే ధర్మ దేవతలు, బీదా బిక్కీలను సేవించుకునే సర్కారు
బంట్లకు గొప్ప గౌరవం ఇవ్వక తప్పదు! డిస్సెంటు
పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుగారు గొప్పా? ఇన్డీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు వర్ణమాలకే ఏక మొత్తంగా ఓ మూల గోడ కుర్చీ వేయించిన ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళ కెళ్ళే మన పిడుగుల తెలుగు తొక్కు పలుకుల ముందు.. గిడుగు రామ్మూర్తి పంతులుగారి ప్రజ్ఞాపాటవాలు లెందుకు?
నేటి బుడుగుల బడబడ ఇంగ్లీషు వాగుళ్ల వాగులో
పడితే ఎంతటి భాషాగజీతగాడు విశ్వనాథవారైనా బుడుంగుమని మునిగాల్సిందే!
కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు. కాబట్టే చెవి కంతల కంత కర్ణకఠోరం!
ఆంగ్లవాసన సోకనందుకే నాట ఓ శోకరసం! అన్నమయ్య సంకీర్తనలంటే
తెలుగు నా! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే.. ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం.
ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికి ఫిదా అయి కనక గండపెండేరం కాలికి తొడిగారు!
ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషై ఉంటేనే తెలుగులో ఒన్సుమోర్లు మార్మోగేది!
తుమ్ము. దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా ఆంగ్లయాసలో ఉంటేనే
ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదిక్కడ.
ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు
ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా
పనికివస్తుందా అన్నది పెద్ద ప్రశ్న!
పొట్టకోసినా తెలుగక్షరం ముక్క
ఒక్కటైనా కనపించనోడే తెలుగువాడికి
ఇవాళ తలమానికం! పచ్చడి లేకుండా
ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం
లేకుండా తెలుగుముక్కంటే చచ్చే చావే
తెలుగువాడికి! తెలుగిది కేవలం ప్రాచీన
హాదానే. ఆంగ్లానిది అధునాతన హోదా!
ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో
ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో సాగిస్తే చాలు.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి
మందని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడు. అంత కష్టం కూడా పడడానికి ఇష్టపడడు. సొంతగడ్డమీద ఉంటూనే మాతృభాషని ఆంగ్లంలా
మాట్లాడేసి ఆటోమేటిగ్గా అంతర్జాతీయ
స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!
తెలుగు పుచ్చిపోయిందనో.. చచ్చిపోతుందనో కన్నీళ్ళు
పెట్టుకునే తిక్కన్న వారసులకు చివరగా ఒక మాట! తిట్లున్నంత కాలం తెలుగుంటుంది.
ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డల
మీద వర్ధిల్లాలని ప్రార్థిస్తామంటారా! సరే
మీ ఇష్టం! సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకోండి. తెలుగూ దానితో పాటే దివ్యంగా
వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో కనీసం తిట్ల రూపంలోనైనా!
-కర్లపాలెం హనుమంతరావు
25 -09 -2019
***
(సూర్య దినపత్రికలో ప్రచురితం)
Subscribe to:
Posts (Atom)
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...