Saturday, January 18, 2020

పుస్తకం .. ఓ ప్రియ నేస్తం! -కర్లపాలెం హనుమంతరావు- సూర్య ప్రచురితం



వసు చరిత్ర’ వంటబట్టించుకుంటే  తెలుగు
సాహిత్యమంతా ‘మంచి నీళ్ళప్రాయమ’ని బాల వీరేశాన్ని ఎవరో బాగా నమ్మించారు. ఆ గ్రంరాజం విలువ ఆ పిల్లవాడి కాలంలోనే  రెండున్నర అణాలు. చిల్లుకానీ బిళ్ళ దర్శనానికైనా  ఎన్నడో కానీ నోచుకోని బాలకందుకూరి పంతం వదల్లేదు. దినం తప్పకుండా ప్రతీ పరగడుపునా పుస్తక దుకాణ దర్శనం.. పొద్దెక్కేదాకా అక్కడే పుస్తక పఠనం! పంతులుగారి పంతం చూసి  ఉదారంగా ఆ పుస్తకం ప్రదానం చేసేసాడు దుకాణం పెద్దమనిషి. విద్య విలువ, ఆ విద్యను అందించే  ద్గ్రంథాల ప్రాధాన్య గురించి ఎంత తవ్విపోసినా  అడగడుగునా ఈ మాదిరి ఏవేవో వింతలూ.. విశేషాలు అలరిస్తూనే ఉంటాయి.
ఆరువందల ఏళ్ల కిందట బడికి వెళ్లే పిల్లకాయల సంచుల్లో ఇప్పట్లా పుస్తకాల దిండ్లు వందలొందలు ఉండేవి కావు. ఒక్క చెక్కపలకే వాళ్లకు అప్పట్లో  రాసుకునేందుకు దిక్కు. వేరే దేశాల్లో అయితే మైనం పూసిన చెక్కపలకలు. వింత వింత రాత సాధనాలు కనిపిస్తాయి మరీ పుస్తక చరిత్ర తవ్వుకు పోతుంటే! 
ఏది కంటబడితే దాని మీదనే చేతి గోటితొ గీసే అలవాటు ఆదిలో మానవుడిది. గోలుకొండ కోట జైలులో కంచెర్ల గోపన్న గోడ మీద శ్రీరామచంద్రుణ్ని దెప్పుతూ సంకీర్తనలు రాసుకున్నదీ చేతి వేళ్ల గోళ్ళతోనే!
రాతిబండలు, తాటాకులు, భూర్జపత్రాలు,  జంతుచర్మాలు, చెట్టుపట్టలు, కుండ పెంకులను కూడా వదలకుండా ఒకానొక కాలంలో బండ మనుషులు రాయడానికి వాడేవాళ్లు.   రాత పరికరాల  రూపంలో మార్పు రావడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో విసుగెత్తి మనిషి ఈ రాత బెడద మనకెందుకులెమ్మని లేచిపోయి గాని ఉంటే మన తలరాతలు ఇప్పుడు మరోలా ఉండేవేమో కదా!
మహమ్మద్ పైగంబర్ ఖురాన్ షరీఫ్ ను గొర్రెమూపు చర్మాలను ఎండబెట్టిన ముక్కల మీదనే రాసాడుట పాపం. గ్రీకులు ఓస్ట్రక్ అనే  కుండ పెంకులను పలకలుగా వాడేవాళ్లు. మన దేశంలో అయితే గణతంత్ర రాజ్యాలలో ముద్రలు వేసి ఇచ్చే నోట్లకు కర్రముక్కలను వాడినట్లు చరిత్ర. ఇదే ‘శలాకా పద్ధతి’.
పశ్చిమ దేశాలలో పైపరస్ కాగితాలకు గిరాకీ. అంత ధర పెట్టలేని  బీద రచయితలు కుండపెంకులతో సరిపెట్టుకొనేవాళ్లే కాని రాత పని మాత్రం వదిలిపెట్టే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఈజిప్టులో పనిచేసిన రోమన్ సైనికులు తమ కాతాలకు సరిపడా పైపరస్ సరుకు దొరక్కపోయినా  కుండపెంకులను పట్టుకు వేళ్లాడారే తప్ప కాతాలెక్కలు రాయడానికి పాలుమాలిందీ లేదు!  
గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు’ అంటూ తెలుగు  అడిదం సూరకవి ఎట్లా కోతలు కోసాడో.. తెలియదు కానీ.. మన దేశంలో  మొదటి నుంచి తాటాకులదే(తాటియాకులదే) రాత సాధనాలలలో రాజాపాత్ర. సమయానికి రాసుకునేందుకు ఆకులు ఇవ్వలేదని వేములవాడ భీముడు తాడిచెట్టు మొత్తాన్నే వేళ్లతో సహా  బూడిద చేసినట్లో కథ. ఆ కట్టుకతలో పక్కన పెట్టినా చరిత్రను బట్టి  చూస్తే   రాయిని కూడా రాజుల శాసనాలు రాయించేందుకు ఉపయోగించినట్లే రూఢవుతుంది. అవే 'శిలాశాసనాలు'. శాశ్వతత్వానికి నేటికీ ప్రతీక శిలాశాసనం’ అనే పదం. ‘అల మీద అక్షరాలు క్షరాలు/ శిల మీది అక్షరాలు అక్షరాలు/ అలా? శిలా? ప్రియా.. నా ప్రేమాక్షరాలకు నీ హృదయ ఫలకం?’ అని నేనే గతంలో ఓ మినీ కవిత రాసినట్లు గుర్తు!
క్రీస్తుకు నాలుగు వందల ఏళ్ల కిందటిదైనా మహాస్థాన్ శాసనం ఇప్పటికీ మనం కళ్లారా చూస్తున్నామంటే అందుక్కారణం  అది శిల మీద చెక్కింది కావడమే. మన భట్టిప్రోలు, అశోక శాసనాలూ శిలాలిఖితాలే.  వేల ఏళ్ల కిందటి  బౌద్ధ స్తూపాల మీద  చెక్కిన జాతక కథలు నేటికీ చెక్కు చెదరని స్థితిలో తవ్వకాల్లో బైటపడుతున్నాయి ఎన్నో చోట్ల. ఈజిప్టులో  కళా చిత్రాలు సమాధుల మీద, దేవాలయ కుడ్యాల మీద రాయడం ఓ సంప్రదాయం.
రాతి పుస్తకాలు మోతబరువు. 177 పుటల బరువున్న ఈజిప్టు శిలాశాననం అసలు ప్రతి చదవాలంటే ఎవరైనా ఈజిప్టు దేశం దాకా వెళ్లి రావాలి.  గవిమఠం శిలాశాసనం చదవాలంటే  కొండలు.. బండలుక్కి పైకిపోవాలి. అశోకచక్రవర్తి  మహానుభావుడు  దాన్ని అంత ఎత్తు  కొండ మీద ఎందుకు చెక్కించినట్లో ? రాసే వాళ్లకి కష్టం ఎటూ తప్పదు. చదివేవాళ్లకీ ఇన్ని ఇబ్బందులా? బహుశా సీరియస్ పరిశోధకులు మాత్రమే ఆ శాసనాల జోలికి పోతారన్న ఉద్దేశముందేమో.. చక్రవర్తి కడుపులో!  పోనీ ప్రత్యామ్నయంగా  పోష్టులో పంపిద్దామన్నా ఉండవల్లి గుహశాసనాలు వంటి  బండరాళ్ల శాసనాలను ఉండచుట్టేందుకైనా వీలు కావే! హ్హేవిఁటో! రాత కష్టాలు!
ఇన్ని రాతి  కష్టాలు ఎదురయ్యాయనే కావచ్చు పరిష్కారంగా కొంతలో కొంత బరువు తక్కువ లోహాలు  కంచు, రాగి వంటివి  వాడుకలోకి వచ్చింది. విదేశాలలోని చాలా ప్రార్థనాలయాలు, రాజప్రాసాదాలు ఎక్కువగా కంచు ఫలకాలతోనే కనువిందు చేస్తుంటాయి. బ్లోయిన్ నగరవాసులతో ఎట్ లీన్ ప్రభువు ఓ కంచు ఫలకంపైన చేసుకొన్న ఒప్పంద పత్రం  అక్కడి ఓ చర్చి తలుపులకు పుస్తకం మాదిరి తాపడం చేయించిపెట్టారు.  రాజప్రాసాదం నేల కూలింది కానీ.. కంచు పుస్తకం మాత్రం నేటికీ చెక్కు చెదరకుండా  ఉంది! పుస్తకమా.. మజాకానా!

మూరగండరాయడుగా శత్రుమూకల చేత మూడు  గంగల నీళ్లు తాగించిన శ్రీకృష్ణదేవరాయలు ‘మను చరిత్ర’ కర్త పెద్దనామాత్యుడి కాళ్లు కడిగి ఆ నీళ్లు శిరస్సు మీద  జల్లుకున్నాడు. చేత్తో కాలికి ఆ మహారాజు తొడిగిన గండపెండేరం కన్నా ..  నోటితో ‘చతుర వచోనిధి/వతుల పురాణాగమేతిహాస కథార్థ/ స్మృతి యుతుడ’ వని పొగడటమే పెద్దన ఆధిక్యాన్ని పదింతలు గుర్తింపు. పెద్దనగారి ఆ ఆధిక్యానికి కారణం ఆ కవిగారు రాసిన ‘మనుచరిత్ర’ పుస్తకమే కదా! ‘విద్యా సమం నాస్తి శరీర భూషణమ్- విద్యను మించిన అలంకారం మనిషికింకేమీ లేద’న్న మాట అక్షరాలా నిజం. ఆ విద్యాప్రసాదం మన జిహ్వకు  రుచి చూపించే పళ్లెరం పుస్తకం.. తాళపత్రగ్రంథాలైనా మరోటైనా!
అప్పటికీ మన దేశంలో రాగి లోహం మీది రాతలే ఎక్కువ. గోరఖ్ పూర్ జిల్లా తాలుకు  బుద్ధుని కాలం నాటి పాలీ లిపి తామ్రశాసనం క్రీస్తుకు పూర్వం 450 ఏళ్ల కిందటిది. ఇప్పటి వరకు దొరికిన వాటిలో ఆ శాసనమే అతి ప్రాచీనమైనది.
తెలుగు దేశాల్లో తెలుగులో చెక్కిన తామ్రశాసనాలయితే తామర తంపరలుగా కనిపిస్తుంటాయి. తాళ్లపాక అన్నమాచార్యులవారు. ఆయన బిడ్డ తిరువేంగళాచార్యులవారు చెక్కించిన సంకీర్తన రాగిరేకులే సుమారు ముఫ్ఫైరెండు వేలకు పై చిలుకు! రాజులు తమ  వైభవ ప్రాగల్భ్యాల ప్రదర్శన కోసం, ప్రజలు భక్తిభావ ప్రకటన కోసం బంగారం, వెండి వంటి వాటి రేకుల మీద స్త్రోత్రాలు చెక్కించడం ఆచారంగా వస్తున్నది అనూచానంగా. తక్షశిలలో గంగు స్తూపంలో  బంగారురేకు శాసనం, భట్టిప్రోలు స్తూపంలో వెండిరేకు శాసనం లభ్యమయ్యాయి. అన్ని కళాఖండాల మాదిరే అవీ ఇప్పుడు చివరకు బ్రిటిష్ మ్యూజియంలో తేలాయనుకోండి! అది వేరే కథ.
ఎన్ని నయగారాలు పోయినా చివరికి రాతకు కాగితమే గతి అని తేలిపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్నది చెట్టు బోదెల నుంచి రాబట్టే గుజ్జుతో తయారయే కాగితం. రాతకు, మోతకు, ఖరీదుకు, వాడకానికి అన్నిందాలా అనువైనది కావడమే కాగితం విజృంభణకు ముఖ్య కారణం.  ఇప్పుడిప్పుడే ఈ-బుక్స్ పేరుతో ఎలక్ట్రానిక్ పుస్తకాలు  ఉనికిలోకి వస్తున్న మాటా నిజమే. అయినా అత్యధికులకు అచ్చు కాగితాలతో తయారయే పుస్తకాలంటేనే ముచ్చట.
 ఏ రూపంలో ఉన్నా పుస్తకాలు మనిషికి గొప్ప నేస్తాలు సుమా! దుర్బలంగా జబ్బురోగిలా ఉన్నాడన్న దిగులుతో  కన్నబిడ్డ ప్రహ్లాదుణ్ని ‘విద్యాభ్యాసంబున గాని తీవ్రమతి గాడని’ భావించి చండామార్కులవారికి అప్పగించాడు రాక్షసరాజై ఉండీ హిరణ్యకశిపుడు. ‘చదివిన వాడజ్ఞుండగు/ చదివిన సద సద్వివేక చతురత గలుగుం’ అన్న ఆ రాజు అప్పుడన్న  మాటలు అక్షరాలా అందరికీ శిరోధార్యమే. అసురుల చేత కూడా పొగిడించుకున్న  విద్య వట్టి నోటి మాటతో సాధించే కృష్ణ కుచేలుల సాందీపనీ గురుకుల విద్యా ప్రణాళికగా మాత్రమే సాగలేదు.  తావికి పూవులా విద్య పుస్తకంలోకి  ఒదిగిపోయింది.
'పాత చొక్కా అయినా తొడుక్కో! కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!' అన్న కందుకూరి హితవు పాత చింత తొక్కు కింద మారడం మేలు కలిగించే పరిణామం కాదు.   దుస్తుల ధారణలో చూపించే శ్రద్ధ నేటి తరం పుస్తక పఠనంలో ప్రదర్శించడంలేదు. క్రమంగా కనుమరుగయే జాతుల జాబితాలో పిచ్చుక, పావురాల మాదిరి పుస్తకమూ చేరడంలో తప్పెవరిది అన్న చర్చ ఆనక. ముందు  తగు దిద్దుబాటు చర్యలు వేగిరం తీసుకోవడం అవసరం.   
అంతర్జాలం అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వస్తున్న  మాయాజాలం. అయినా పుస్తకంలాగా  చేతితో ముట్టుకొని, ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని  సారం గ్రహించేందుకు వీలయే వాస్తవిక ప్రపంచం కాదు అది.  ఎవరైనా.. ఏమైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా.. ఏ హద్దులు, పరిమితులు, నిజ నిర్థారణలు, వడపోతలు గట్రా లేకుండా   ప్రామాణిక పరీక్షల ముందు నిలబడలేని సమాచారం అన్ని వర్గాల పాఠకులకు వయో లింగ భేదాలనేవేవీ లేకుండా అందుబాటులోకి తెచ్చేది ఈ జిత్తులమారి ‘వర్చ్యువల్’ ప్రపంచం. కల్లో.. కనికట్టో నిర్థారణ కాని విషయాల వల్ల మంచి ఎంతో.. హాని  అంతకు మించి. ఈ తరం ఆ నిజం ఎంత తొందరగా గ్రహిస్తే పుస్తకం మనుగడకు అంత మంచిది.
పుస్తకప్రపంచంలోనూ కొన్ని బెడదలు లేకపోలేదు. అయినా సరే.. ఫేసుబుక్కు కన్నా ఏ ఫేమస్ పర్శనాలిటీని గూర్చో చర్చించే బుక్కే పాఠకుడికి ఎక్కువ  ఉపయోగం.  చెడు పుస్తకం వడపోతలు, నిబంధనలు, పర్యవేక్షణలు, ట్టబద్ధమైన నియమాల అడ్డు గోడలు దూకుతూ ఆట్టే కాలం నిలబడేది కష్టం. కాలపరీక్షకు తట్టుకు నిలబడే విజ్ఞానానికే   పుస్తక రూపంలో చదువరి ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఎక్కువ. ఇంటర్నెట్ హోరెత్తించే  అగాధ సాగరమైతే.. గ్రంథలోకం హృదయాహ్లాదం కలిగించే   గందర్వ లోకం!
రోజంతా టీ.వీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లకే  మీదు కట్టే బలహీనత కట్టేసుకోవాలి పెద్దలు ముందు. వీలున్నంత మేరకు విలువైన  పుస్తక పఠనానికే సమయం కేటాయించాలి.  కన్నబిడ్డలకు తాము మార్గదర్శకులయినట్లే  మంచి పుస్తకం తమకు  సన్మార్గ సూచిక అని  పెద్దలు గుర్తించినప్పుడే  గత కాలం మాదిరి గ్రంథస్త జ్ఞానం పదహారు కళలతో పునః ప్రవర్థిల్లే అవకాశం.
ఇంటి పట్టున ఉండే అమ్మలక్కలక్కూడా ఇప్పుడు పుస్తకమంటే  ఎకసెక్కెమైపోయింది. అమ్మ, అమ్మమ్మల కాలంలో మాదిరి కనీసం ఓ వారపత్రికనైనా తిరగేసే ఓపిక బొత్తిగా కరువయింది అమ్మళ్లకు. కంటి సత్తువంతా ఎన్నటికీ ఎడతెగని ఏడుపు, పెడబొబ్బల   ధారావాహికాలే ధారపోతాయ! ఉన్న మానసిక వత్తిళ్లకు తోడు ఉపరి దైహిక వత్తిళ్లు అంటగట్టేవి టీవీ, మూవీ మంధరలు!   కొత్తగా నట్టింట చేరిన కంప్యూటరుతో సరికొత్త తుత్తర్లు. పద్దస్తమానం  చెవులు కొరికే స్మార్ట్ ఫోన్ దూరభారపు చుట్టంతో కాపురాలు కూల్చేసే దొంగచాటు ఛాటుల కన్నా.. కూలే కాపురాలను నిలబెట్టే పుస్తకాలే మిన్న కదా! అన్నుల మిన్నల కన్నులు తెరిపిడి పడితేనే  నట్టింటి పుస్తకాల గూటిలో  మళ్లీ రంగనాయకమ్మ స్వీట్ హోమ్ లు, బాపూ రమణల బుడుగులు, చక్రపాణిగారి చందమామ వెలుగులు!
పిల్లలు తప్పని సరిగా చదివే పాఠ్యపుస్తకాల సంగతి వేరు. ఇప్పటి ఘోషంతా వినోదంతో పాటు విజ్ఞానం, సంస్కారం, సాంఘిక దృష్టి, ప్రాపంచిక ఇంగింతం.. పెంపొందించే కాల్పనిక సాహిత్య పఠనం గురించే. అపూర్వ  పూర్వ వైభవాన్ని పరిచయం చేస్తూ.. దివ్యమైన బంగరు భవితవ్యం కోసమై వర్తమానంలో ప్రవర్తించవలసిన తీరుతెన్నులను గురువులా, స్నేహితుడిలా, తాత్వికుడిలా శాసించి, లాలించి, బోధించే సత్తాగలది  పుస్తకం ఒక్కటే! ఆ విశిష్టత నేటి తరాలకు తెలియచేసేదెవరు?
 ‘శ్రీవాణి వదనంలో నివాసమున్న వాడెన్నడూ దైన్యు డు కాలేడ’ని  శంకర భగవత్పాదులేనాడో భాష్యంలో చెప్పుకొచ్చారు. ఆ వాణీ ముఖ వాస్తవ్యుల  పుణ్య చరిత్రలు  మనకందించేవి పుస్తకాలే! మనిషి తనకు తానుగా తనకోసం తాను మనిషిగానే మెలగడానికి  తయారు చేసుకొన్న గొప్ప చమత్కార మార్గదర్శి  పుస్తకం.
చిన్నతనం నుంచే పుస్తకాన్ని పిల్లల జీవితంలో అంతర్భాగం చేయవలసిన బాధ్యత నిజానికి కన్నవారి మీదే ఎక్కువ ఉంటుంది.  భవిష్యత్తులో గొప్ప కలిమి  గడించాలన్న  అడియాసలో పడి బిడ్డల ఒడి నుంచి మంచి పుస్తకం వడలాగేసుకోడం మంచి పెంపకం అనిపించుకోదు.  తమంతట తాముగానే మంచి పుస్తకాలని  ఎంచుకొని  చదువుకొనే దిశగా పసిమనసులను ప్రోత్సహించవలసిన బాధ్యత వాస్తవానికి కన్న తల్లిదండ్రులకే అందరికన్నా ఎక్కువ సుమా!
విభిన్న రంగాలకు, రుచులకు చెందిన గ్రంథాలు వారి అంతరంగాలను అలరించే  తీరులో అందుబాటుకి తెచ్చినప్పుడే  కదా బాలలకు  వాటిపై  ఆసక్తి,  అభిరుచి  పెరిగే అవకాశం.  పుస్తకమే లోకంలా పిల్లలు ఎదగాలంటే ముందు ఇంటినే పుస్తకలోకంగా మార్చేయడమే మందు. 
భావి  జీవితం మీద ఓ స్పష్టమైన వైఖరి తీసుకొనే శక్తిసామర్థ్యాలను కల్పించేవి మంచి పుస్తకాలే. కన్నవారు,    అనుభవం పుష్కలంగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉంటారా? ఆ లోటు భర్తీ చేసే మంచి నేస్తాలే పుస్తకాలు. పుస్తక పఠనమంటే ఓ ఆటలా ఇంటిని ఆటల మైదానంలా తీర్చి దిద్దినప్పుడే పిల్లలలో క్రీడాస్ఫూర్తి పుంజుకునేది! ఎదర జీవితంలో ఎన్నైనా సవాళ్లుదురు కానీయండి.. తిరగబడి పోరాడే తత్వం పుస్తక పఠనం వల్లనే బాలల్లో గట్టిడేది.
పుస్తకాలు చదివే వాళ్లకు.. చదవని వాళ్లకు  సంస్కారంలో హస్తిమశకాంతరం తేడా. సయమానికి విలువ ఇవ్వడం. సమాజావగాహన కలిగి ఉండటం, సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడం, పరిష్కరించడంలో చురుకుదనం ప్రదర్శించడం,  తప్పులుంటే ఒప్పుకోవడం,  సరిదిద్దుకొనేందుకు సిద్ధంగా ఉండటం, విభిన్నంగా ఆలోచించడం, విశాల దృక్పథం కలిగి ఉండటం.. మంచి పుస్తకాలు విసృతంగా చదివే బుద్ధిజీవులకు సులభంగా పట్టుబడే సిద్ధవిద్యలు.
పుస్తకాల పండుగలు ఏటేటా రెండు తెలుగు రాష్ట్రాలలో కనుల పండువుగా జరుగుతూనే ఉంటాయి. తీరిక ఉన్నప్పుడు కాదు.. తీరిక చేసుకొని మరీ  పుస్తకాల కొలువులని  చిన్నా పెద్దా కలసి సందర్శించండి! కొన్నైనా మంచి పుస్తకాలు కొని  ఇంటికి తెచ్చుకోండి!  
మంచి పుస్తకం పైన మనసు లగ్నమవడానికి మంచి లగ్నం అవసరమా?  పుస్తక ప్రదర్శన  మహోత్సవ సందర్భమే ఈ శుభ మూహూర్తానికి నాంది! శుభం!


-కర్లపాలెం హనుమంతరావు

***
(సూర్య ఆదివారం కాలం - సరదాకే - 18 -01 -2020 )

Monday, January 13, 2020

పత్రికలు- బడుగు జీవుల బతుకు చిత్రికలు -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక పరచురణ


 వార్త- ప్రాధాన్యతః
పదిహేడో శతాబ్దానికి పూర్వం  సామ్రాజ్య వ్యవస్థలు వర్ధిల్లే  కాలంలో  అధికార వర్గాలు   జారీచేసే 'బులెటన్' ల తరువాతి రూపం ఫ్రెంచ్ భాషలో పుట్టిన 'new' పదం. దాని బహువచనం  'news' కు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్- అనే నాలుగు దిక్కుల నుంచి అందే సమాచారం అని చెప్పుకునే నిర్వచనంలో  చమత్కారమే తప్ప వాస్తవం పాలు తక్కువ.   అనేక భారతీయ భాషలలో
న్యూస్ కు సమానార్థకంగా  వినిపించే  'వార్త' విలువ కనకం మాదిరో కరెన్సీ మాదిరో   వెలగట్ట లేనిది. ఎంత నియంతల వ్యవస్థలోనైనా ఈ 'వార్త'కు ఉండే విలువ తిరుగులేనిది. పాలితుల మనోభావాలను పాలకులకు చేరవేసినట్లే, పాలకుల అంతరంగాల వైనం పాలితుల వరకు చేరవేసే చేవ సత్యకాలం బట్టి ఒక్క 'వార్త'కే సొంతం.  ఛాందసుడని మనం  ఈసడించే భారత కవిత్రయంలోని నన్నయకవి కొన్ని వేల ఏళ్ల కిందటే వార్త ప్రాధాన్యతను  ఒక్క చిన్న ముక్కలో తేల్చేసాడు. 'వార్త యందు జగతి వర్థిల్లుచుండు' అన్న  నన్నయగారి ఆ పద్యపాదం ఈ ఇరవై ఒకటో  శతాబ్దపు ఈ-కాలంలో కూడా ప్రముఖ పత్రికల 'హెడర్స్'  దగ్గర తచ్చాడక తప్పడంలేదు.

వార్త-ఆవశ్యకతః
జగతి ప్రగతి మార్గంలో  సాగాలంటే భూతకాల అనుభవాల ఆధారంగా భద్రమైన భవిత కోసం  సర్వే సర్వత్రా సంభవించే వర్తమాన సమాజాల తీరూ తెన్నూ అన్ని  వర్గాలకు అనుక్షణం  అందుబాటులో ఉండక తప్పదు.   ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ సాఫల్యానికి పాలకులు- పాలితులు మధ్య సమవ్యయం అవసరం.  ఇరుపక్షాలకు  మధ్యన  బాధ్యతాయుతమైన ఒక  అనుసంధాన ఉపకరణం క్రియాశీలకంగా పనిచేయడం తప్పనిసరి.   సమాచార లోపం వల్లనే చాలా సందర్భాలలో  సంక్షోభాలు తలెత్తినట్లు ప్రపంచ చరిత్ర చెబుతున్నది.  నిక్కచ్చి సమాచారం అధికారికంగా అసలు మూలాల నుంచి సమయానికి సరైన వారికి అందితే అపోహలకు ఆస్కారం ఉండదు.  సంక్షోభాలు తలెత్తవు. మొలక దశ నుంచే ఆవలి వైపు ఆలోచనలను క్రమ పద్ధతిలో  తెలియచేసే చేవ ఉంటుంది కాబట్టే నేటికీ వార్తకు ప్రపంచంలో ఇంతటి ప్రాముఖ్యం. 

వార్తామధ్యమాల సమర్థతః
సంక్షోభాలు సృష్టించడం,  నివారించడం   సమాచార మాధ్యమాల ప్రత్యేక సామర్థ్యం. చాటు మాటు మాటల కన్నా సూటిగా  ప్రశ్నించే ప్రెస్ (వార్తా మాధ్యమం) ద్వారా  ప్రెస్ చేసి అడిగినప్పుడే సమస్యలకు  సత్వర పరిష్కారాలు లభ్యమయే అవకాశం ఎక్కువ.  వార్తల ప్రభావం అర్థమయే కొద్దీ అందుకే వార్తామాధ్యమాల ప్రాధాన్యత అన్ని వ్యవస్థలలో క్రమంగా పెరుగుతూ వస్తున్నది. సాంకేతిక నైపుణ్యాల పుణ్యమా అని సమాచార రంగంలో ఈరోజు దృశ్యశ్రవణ విభాగాలు వీరంగం వేస్తున్నాయి!    సర్వే సర్వత్రా సంభవించే సంఘటనలను కంటి రెప్ప పాటులో అవి అరచేతిలో పెట్టేస్తున్నాయి. అయినా సమాచార స్రవంతిని ఓ ధర్మ క్ర్రతువులా  భావించి ఆరంభించిన తొలినాటి యాజుల పాత్ర  ఈ నాటికీ కొంతలో కొంతైనా పోషిస్తున్నవి వార్తాపత్రికలే!

వార్తాపత్రికలు- విశిష్టతః
అక్షర రూపంలో కట్టెదుట కనిపించే వార్తకు ఉండే విశ్వసనీయతపవిత్రత సాటి లేనివి. చదువు సంధ్యలు లేకున్నా పవిత్ర గ్రంథాల  సామాన్యుడికుండే భక్తివిశ్వాసాలే అందుకు ఉదాహరణ. అచ్చు అక్షరం పట్ల  మనిషి చూపించే అపార విశ్వాసమే ఫ్రెంచ్బ్రిటన్ ల వంటి జాతీయ ప్రభుత్వాల చేత తొలినాళ్లల్లో అధికారిక బులెటన్ లుగెజిట్ లు అచ్చులో రావడానికి   కారణమయింది.  కొత్తగా ఎన్ని ప్రసార ప్రకియలకు రోజూ ఆవిష్కరణలు జరుగుతున్నా అచ్చులో కనిపించే వార్తాపత్రికలకు ఉన్న ఆ  ఆదరణ చెక్కుచెదరలేదు.. నిన్న మొన్నటి వరకు.    విషయం కాక వినోదమే ప్రధానమనే కోణంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెజెంట్ అయే వార్తల్లో సత్యాసత్యాల నిర్ధారణ జగం మిధ్యపలాయనం మిధ్య సామెత! మార్ఫింగులుఎడిటింగులు వంటి  యాప్స్ సామాన్యుడు సైతం సులభంగా వాడే సౌలభ్యాలు  పెచ్చు మీరి ప్రధాన మంత్రిప్రతిపక్ష అదినేత.. ఒకే పబ్బులో కలసి  కేరింతలు కొట్టేస్తున్నట్లు నమ్మించే  వీడియోలు సైతం  సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసేయడం సులువవుతున్న వాతావరణం! అంతర్జాలంలో తాజా  వార్త వంకతో తయారయ్యే సంచలన వార్త వాస్తవానికి ఏ దశాబ్దం కిందటి లైబ్రరీ షాటో.. ఫోరెన్సిక్ లేబ్  తప్ప తేలే వ్యవహారంలా లేదిప్పుడు.  ఎన్నేసి రకాలుగా అన్ని వైపుల నుంచి వార్తా మాధ్యమాలు విచిత్రమైన భంగిమలలో  ప్రసారాలు గుప్పిస్తున్నా   ఇప్పటికీ జనం చివరగా చూసి నిజమని నిర్ధారించుకుంటున్నది మాత్రం   వార్తాపత్రికలో  కనిపించినప్పుడే!  ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ తొలి దశలో  కొంత తడబడ్డ మాట నిజమే కానీ  తమవైన ప్రత్యేక బలాల పునః సమీకరణ వల్ల  వార్తా పత్రికలు   తిరిగి పుంజుకున్నాయి.  సర్క్యులేషన్ పరంగా కొంత బలిమి  తగ్గినా మేలిమి వార్తకు ఈనాడూ వార్తాపత్రికలే కేరాఫ్ అడ్రస్!

వార్తాపత్రికలు- లక్ష్యం..నేపథ్యం
వార్తాపత్రికల ఆరంభ దశలో 'గెజిట్ మీద 'మాది ఒక రాజకీయవ్యాపార పత్రిక. అన్ని రాజకీయ పార్టీలకు స్థానం ఉంటుంది. కాని ఏ రాజకీయ పార్టీకి లోబడి ఉండదుఅన్న అర్థం వచ్చే మోటో ఒకటి కనిపించేది.  ఆ తొలి నాటి  లక్ష్యంలో ఇప్పుడు గణనీయమైన మార్పు కనిపిస్తున్న మాట కాదనలేం.  సమాచార మాధ్యమంగా వార్తాపత్రికలు  అత్యున్నత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించే లక్ష్యంతో  1966 లో 'ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాఆవిర్భవించింది.  నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం) గా స్మరించుకునే  నవంబర్ 16 నాడైనా పత్రికలు తమ పాత్రపై  పునస్సమీక్షలు జరుపుకోడం మేలు. ఏ కొసన ఏం జరిగినా ప్రపంచానికంతటికీ వాస్తవాలు మాత్రమే తెలిసేలా  క్షేత్రస్థాయి పరిస్థితులు యధాతధంగా ప్రచురించడం  చాలా వార్తాపత్రికలకు ప్రధాన ధ్యేయం.  రెండు దశాబ్దాల కిందటి వరకు విభిన్న వర్గాలు నమ్మదగ్గ   అత్యుత్తమ అనుసంధాన పాత్ర   వార్తాపత్రికలదే. జాతి హితం దృష్ట్యా  చేసే సమయానుకూలమైన   మేల్కొల్పులుహెచ్చరికల నుండి,  హక్కులుబాధ్యతల పట్ల  సమూహాలను అప్రమత్తం  చేసే వరకు..   సమ సమ్మాన  సమాజ  నిర్మాణ సౌధానికి  అవసరమయే కార్యకలాపాలన్నింటికి  బహిరంగ వేదికలుగా చొరవ చూపించేవి వార్తాపత్రికలే.   న్యాయంచట్టంశాంతి భద్రతల సంరక్షణ అనే మూడు మూల స్తంభాలతో పాటు ప్రజాస్వామ్య సౌధ పటిష్టత కోసం నాలుగో  స్తంభంగా 'ప్రెస్గుర్తింపు పొందటానికి అదే కారణం.   ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ తొలి దశలో  ఆ 'ఫోర్త్ ఎస్టేట్ కొంత తడబడ్డప్పటికీ   తమవైన ప్రత్యేక బలాల పునః సమీకరణ వల్ల  పూర్వ ప్రభావంతో   తిరిగి పుంజుకున్నాయి.   సర్క్యులేషన్ పరంగా కొంత బలిమి  తగ్గినా మేలిమి వార్తకు ఇప్పటికీ వార్తాపత్రికలే కేరాఫ్ అడ్రస్!  వట్టి కాగితాల బొత్తే అయితే వార్తాపత్రికలు ఈ దేశంలో  ఇన్ని శతాబ్దాల  పాటు ఎన్నో ఆటుపోటులను తట్టుకుని  నిలబడి ఉండేవే కాదు.   అక్షరాస్యత,  ఇంగ్లీషు జ్ఞానం పరిమితంగా ఉన్న కాలంలోనూ   గొప్ప గుర్తింపు పొందడం వార్తాపత్రిక వ్యవస్థ విశిష్టత. స్వాతంత్ర్య  భావజాల ప్రచారాల నిమిత్తం 1851 లో దాదాభాయ్ నౌరోజి  రాజకీయ పత్రిక  ప్రారంభించినదాది    వార్తాపత్రికల  ప్రచురణ వివిధ లక్ష్య సాధనలార్థం పాశుపతాస్త్రాలకు మించి ఉపయోగిస్తున్నాయీ దేశంలో.
పత్రికల ప్రభావం   గుర్తెరగబట్టే స్వాతంత్ర్య పోరాటపు తొలి నాళ్లల్లో   అటు   ప్రాంతీయ భాషల్లోనూఇటు ఇంగ్లీషు భాషలోనూ వార్తాపత్రికలు పోటెత్తింది.  సంస్కరణల కాలంలోసంక్షోభాల సమయంలోసామాజిక పరంగా మార్పు సంభవించే ఏ సంధి కాలంలో అయినా పత్రికలు పో్షించే పాత్ర నిస్సందేహంగా అమోఘమైనది. సామాజిక సంస్కరణల నిమిత్తం రాజా  రామ్మోహన్  రాయ్ వంటి విద్యావంతులు ఎందరో ప్రజాభిప్రాయం మలిచే  అచ్చుపత్రికలనే ప్రధానంగా నమ్ముకొన్నది. 

తెలుగులో వార్తాపత్రికలుః
తెలుగు వరకు.. తొలి పత్రిక  మత భావజాల  విస్తరణ నిమిత్తం క్రైస్తవులు 1835లో బళ్ళారి కేంద్రంగా  వెలువరించిన  సత్యదూత. కాకినాడ నుంచి కెనడియన్ బాప్టిస్టు మిషన్ ప్రచురించిన 'రావిమత పత్రికలో సామాజిక  వార్తలూ  కనిపించడం విశేషం.   భాషా ఉద్యమాలు ఉధృతంగా సాగిన దశలో విశ్వనాధ వంటి ఉద్దండులూ 'జనతాతరహా పత్రికలు నడపక తప్పింది కాదు.  కందుకూరి వీరేశలింగంగారు  'వివేకవర్ధనినడిపితే..   కొక్కండ పంతులుగారు  'ఆంధ్ర భాషా సంజీవిని'  పత్రికతో పోటీ పడ్డ రోజులున్నాయి. జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాల సమర్థన నిమిత్తం ఎ.పి. పార్థసారధి  పత్రిక  ప్రారంబించిన బాటలోనే కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు    1908లో గాంధీజీ మార్క్ జీవన విలువలను ప్రమోట్ చేస్తో ఆంధ్రపత్రిక స్థాపించారు.   'భారతిఅనే సాహిత్య పాత్రికనూ స్థాపించి దశాబ్దాల పాటు  ఆ రెండింటినీ నిర్విఘ్నంగా నిబద్ధతతో నిర్వహించారు. ఆ పత్రికకు దీటైన మరో వార్తాపత్రిక .. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థల ఆధ్వర్యాన ఖాసా సుబ్బారావు నిర్వహణలో నార్లవెంకటేశ్వర్రావు సంపాదకులుగా 1938లో స్థాపించిన 'ఆంధ్రప్రభ'.  

వార్తాపత్రికలు- సామాజిక బాధ్యతః
ప్రత్రికలతో ప్రయోజనం ఎంతో   ప్రమాదమూ అంతకు మించి. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగే ప్రభుత్వాలకు  గిట్టని వార్తా పత్రికలపై  ఉక్కుపాదం మోపాలన్నంత కసి సహజం. ఇందిరా గాంధి అత్యయిక పరిస్థితి ఇందుకో ఉదాహరణ. కానీ  ప్రజల పక్షాన మాత్రమే  నిలబడాలని భావించే పత్రికలు ఏనాడూ   నిర్బంధాలకూ తలొగ్గిన దాఖలాలు లేవు!   తెల్లదొరల   సెన్సార్ (1878) నిబంధనల మధ్యనే  ఎఫ్.సి.మెహతా  కైసర్-ఎ-హింద్ (1882)పత్రికను ప్రారంభించిన స్వేచ్ఛాప్రియుల దేశమిది! స్వాతంత్ర్యానికి ముందు  ప్రభావశీలంగా పనిచేసిన బ్రిటిష్ వారి పది పన్నెండు ఆంగ్ల దినపత్రికల మధ్యనా    చెన్నపట్నం -ది హిందూముంబై-ఇండియన్‌ ఎక్ష్ప్ ప్రెస్దిల్లీ- హిందుస్తాన్‌ టైమ్స్కలకత్తా -అమృత బజార్ ఉత్తర భారతం- నేషనల్ హెరాల్డ్మధ్య భారతం- హితవాద  వంటి పత్రికలు కొన్ని గొప్ప జాతీయభావజాలంతో జాతి ఏకీకరణ  కోసం  ఉడుతా భక్తి సేవించినవే.  దాదాపు అవే లక్ష్యాలతో ప్రజాహితం దృష్ట్యా  మారిన కాలానికి అనుగుణంగా నేటికీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి ఆ పత్రికలన్నీ. కనకనే కాలానికి ఎదురు నిలిచి తమ ఉనికి నిలుపుకుంటున్నాయి! 

సమాజిక విభజన- వార్తాపత్రికల ఎదురీతః
విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ఏదో ఒక రూపంలో సామాజిక విభజన తప్పడంలేదు. ఆఫ్రికాలో తెగల ఆధారంగాయూరప్‌లో జాతుల ఆధారంగా  అయితే భారతీయ సమాజంలో కులాల ఆధారంగా! సమాజం ఖండ ఖండలుగా విడివడే ప్రక్రియలో  సామాజిక స్థిరీకరణ మిషతో ఉన్నత వర్ణాలవారే అన్ని రకాలుగా  ఆధిపత్యాలను గుప్పెట బిగించారు.     ఆధునిక యుగం ప్రసాదించిన స్వేచ్ఛజ్ఞానాల పుణ్యమా అని యుగాల బట్టి అధికార పంపకాలలో సాగుతున్న ఈ అసమన్యాయం అణగారిన  వర్గాలవారి ఇంగితానికి ఇప్పుడిప్పుడే రావడం! బ్రహ్మణాధిపత్యంఅగ్రకులాల  దోపిడికులాలు ప్రాతిపదికగా లేని జనాభా లెక్కలుదోషపూరితమైన కుల చరిత్రల రచనసామాజికఆర్థిక అసమానతలు.. వెరసి 
 వెనుకబడిన కులాల  ఆత్మగౌరవ ఉద్యమాల (Self Respect movement) కు కారణాలవుతున్నాయి.

ఆత్మగౌరవ ఉద్యమాలుః
19వ శతాబ్దం చివరి భాగంలో దక్షిణపశ్చిమ భారతంలో  అగ్రకులాల వ్యతిరేక ఉద్యమాలు అనేకం పురుడుపోసుకున్నాయి. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకం నాటికి శైశవ అవస్థలు దాటి  అవే  కుల సంఘాలుసంస్థలుగా పుంజుకున్నాయి.    పరిణతి గడించే క్రమంలో ఆ  సంఘాలుసంస్థలే నిమ్న,  వెనుకబడిన తరగతుల ఆత్మసమ్మానానికి ప్రతీకలుగా గుర్తింపుపొందింది. బడుగుల  బతుకుల్లో కొంత మేలైన మార్పు సాధించినా    జనాభా దామాషాలో రాజకీయ అధికారం చేజిక్కించుకున్నప్పుడే  సంపూర్ణ న్యాయం జరిగినట్లుగా  అణగారిన వర్గాలిప్పుడు భావించేది. జనాభా దామాషాలో ఎక్కువగా ఉన్న ఎజువా కులం కేరళ హిందూ సవర్ణుల చేత వెలికి గురయింది వ శతాబ్దిలో! అదే కులంలో పుట్టిన నారాయణ గురు  అణగారిన వర్గాల అభ్యున్నతికి ముందుగా  వారి దృక్పథంలో మార్పు రావలసిన అగత్యం గుర్తించి  1903లో శ్రీ నారాయణ ధర్మపరిపాలన సంస్థను (SNDP) సంస్థను స్థాపించారు. అణగారిన వర్గాలకు వేదాలుశాస్ర్తాలు బోధించి  శిక్షణ ఇవ్వడం అపూర్వం. కులమతభాషా భేదాలువంటి అనేక  మానవ కల్పిత  సాంఘిక వ్యత్యాసాల పట్ల సదవగాహన కల్పిస్తూనే
ఏకోపాసన పట్ల నారాయణ గురు  సంస్థ సాగించిన ఉద్యమాలతో కేరళలో వెనుకబడిననిమ్న కులాల సామాజిక జీవనంలో విశేషమైన మార్పులొచ్చాయి.
సామాజిక విప్లవవాది రామస్వామి నాయకర్ (పెరియార్) అణగారిన వర్గాల  ఆత్మ విశ్వాస పునరుద్ధరణే  లక్ష్యంగా ఆరంభించిన ఆత్మగౌరవ ఉద్యమం..  సంఘ సంస్కరణల దిశగా సాగి ఆఖరుకి రాజకీయా పోరాటాల రూపం తీసుకున్నది. ఆత్మగౌరవ భావజాల ప్రచారం నిమిత్తం కుడి అరసు అనే వారపత్రిక ఆరంభించి ఆ దిశగా ఎందరికో ఆదర్శనీయుడయింది పెరియారే! దేవాలయ ప్రవేశాలుదైవజ్ఞుల ప్రమేయం లేని కళ్యాణాలుపూజా విగ్రహాల నిషేధాలు వంటి వైదిక ప్రాముఖ్యత లేని సంప్రదాయాల ఆచరణకు వ్యతిరేకంగా మనుస్మృతిని తగలబెట్టడం వంటు  నిరసన రూపాలకు శ్రీకారం చుట్టింది ఈ ఆత్మగౌరవ ఉద్యమం.  దైవకార్యాల పౌరోహిత్యంఉమ్మడి నీటి వనరుల వినియోగం వంటి  నిత్య జీవితావసరాలలో బ్రాహ్మణేతరులకూ భాగస్వామ్యం కల్పించడం వంటి ఆత్మగౌరవ సాధన మార్గాలు పెరియార్ తొలినాటి జస్టిస్ పార్టీ నుంచి ప్రేరణ పొందినవి.  జాతీయ అనుసంధాన భాష మిషతో ఆర్య సంస్కృతికి అచ్చమైన ప్రచార మాధ్యమంగా భావించే హిందీని వ్యతిరేకించడం నుంచి  ప్రత్యేక ద్రవిడస్థాన్ కోసం పోరాటం చేసే వరకు తమిళనాట  ద్రవిడ కజగమ్ (డి.కె),  ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డి.ఎం.కె),  అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగమ్ వంటివి ఎన్నో రాజకీయంగా వెనుకబడిన తరగతుల ఉద్యమం సాఫల్యం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నాయి. తమిళ విల్లాలుముదలియార్లుచెట్టియార్లుతెలుగురెడ్లుకమ్మబలిజ నాయకులు వంటి వెనుకబడిన మధ్య తరగతి కులాలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి.  కల్లుగీత కార్మికులుగాపామరులుగావ్యవసాయ కూలీలుగా జీవించే  అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక అంతస్తు పెంచుకునే నిమిత్తం విద్య,  సాంఘిక సంక్షేమ కార్యకలాపాలలో ఎక్కువ ప్రభుత్వ నిధుల కెటాయింపుల కోసం నాడార్లు  నాడార్ ఉద్యమం  నడిపించారు.   ఉత్తర తమిళనాడు వెనుకబడిన కులం పత్లీ. షవాన్ల మాదిరిగా 1871 నుంచి తమకు తాము వన్నీయ కుల క్షత్రియులని ప్రకటించుకున్న ఆత్మగౌరవ ఉద్యమం పత్లీల ఉద్యమం.
మహారాష్ట్రలో అణగారినవెనుకబడిననిమ్నకులాల అభ్యున్నతి కోసం 18వ శతాబ్దిలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం  ఉధృతంగా కొనసాగింది. శూద్రులకై సలహాలు,  విద్యావ్యాప్తిహక్కుల స్పృహే లక్ష్యంగా మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్  సమాజ్‌ కూడా ఆత్మగౌరవ ఉద్యమ చరిత్రలో ప్రధాన ఘట్టమే! కృషీవలులకార్మికుల సమస్యల  నివారణార్థం 1871లో ఫూలే ప్రచురించిన వారపత్రిక ‘దీనబంధు’! సమాజం  నుంచి కోరుకొనే మంచి మార్పు ముందు సొంత ఇంటి నుంచే మొదలుకావాలంటూ..  ఆచరించినిరూపించిన ాఅ ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడిచే అచ్చమైన సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడున్నది ఎంత మంది?! స్త్రీ విద్య పట్ల అనురాగంబాల్య వివాహాల పట్ల వ్యతిరేకత వట్టి మాటలతోనే ప్రకటించుకోడంతో సరిపెట్టుకోక స్వయంగా 'బాలహత్య ప్రధిబంధక్ గృహను స్థాపించిగర్భిణీ వితంతువులకు   అండగా నిలిచిన సంఘసంస్కర్త ఫూలే!   వేదాలనువిగ్రహారాధనను వ్యతిరేకిస్తూ 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’  అనే పుస్తకాన్ని ప్రచురించిన కార్యశీలి ఫూలే మహాత్ముడు. మరో నాలుగేళ్లకు బ్రాహ్మణుల వైఖరిని నిరసిస్తూ ‘గులాంగిరి’ అనే పుస్తకం ప్రచురించారు.


వెనుకబడిన కులాలు- ప్రస్తుత పరిస్థితులుః
జనాభాలో అధిక శాతంగా ఉన్నా  వెనుకబడిన కులాలుగా ముద్రబడి భారతీయ హిందూ సామాజిక వ్యవస్థలో నాలుగో స్థానంలోకి నెట్టివేయబడడాన్ని బుద్ధి ఉన్న ఏ సామాజికహితుడైనా ఎట్లా సహించడం ?  ఆర్థిక పరంగా బలంగా ఉండిసమాజం దృష్టిలో  సమ్మాన స్థానంలో ఉన్నా .. వెనుకబడ్డ తరగతులలోకి జొరబడి బలహీన వర్గాల పిసరంత రాజ్యాంగ బద్ధ లాభాలనూ గుంజేసుకోవాలనే దుర్భుద్ధి కొత్తగా కొన్ని అగ్రవర్ణాలలో పుట్టుకొస్తున్నదిప్పుడు.  రాజస్థాన్‌ రాష్ట్ర జాట్లను కేంద్ర వాజపేయి ప్రభుత్వం ఒబిసి జాబితాలో చేర్చడాన్ని ఎట్లా సహించడం?   మహారాష్ట్రలో అన్ని విధాలా బలమైన కులం మరాఠాల కులం.  అదీ ఆందోళన చేసి ఒబిసిల్లోకి చేరిపోతే నిజంగా వెనుకబడ్డ తరగతులవారి వాటా కుచించుకుపోదా?  అన్ని కులాల్లో నిరుపేదలు ఉంటారు. బలహీనులు అందరికీ  ప్రభుత్వ సాయం గత్తర తప్పదు. కాని భారత సమాజాన్ని సహస్రాబ్దాలుగా పట్టిపీడిస్తున్న  కుల వ్యవస్థ  కారణంగా   ఏర్పడ్డ  అణగారిన వర్గాలవారి హక్కుల నేపథ్యం వేరు.  విద్యాఉద్యోగాలకు దూరమయిన ఈ బడుగుల కోసం  బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వాస్తవంగా వెనుకబడిన కులాల ఆధారంగా ఏర్పాటు చేసినది రిజర్వేషన్ వ్యవస్థ. ఈ ప్రత్యేక సదుపాయాలలో కూడా అభివృద్ధి చెందిన జాతులు వాటా కోరడమే అభ్యంతరకరం. గుజరాత్‌లో తాజాగా పటేల్‌ కులస్థులు తమ కులాన్ని ఓబిసి కేటగిరీలో చేర్చాలంటూ సాగించే హింసాత్మక ఆందోళనపట్ల సంయమనం ఎట్లా?   హిందూ మితవాదులు  పటేళ్ల ఆందోళనపై చేసే అనుకూల వ్యాఖ్యలు  రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోగయ్యే ప్రమాదాలను సూచిస్తునాయి.   ఉదారవాద ఆర్ధిక విధానాల అమలు వల్ల ప్రభుత్వ రంగ ఉద్యోగాలుఉపాధులు పెరుగుతాయని బుకాయించాయి బడా వ్యాపార వర్గాలు.  అందుకు విరుద్ధంగా  తగ్గుతున్న ఈ అవకాశాల్లో 'ఎవరికి.. ఎంతఅన్న తంపులు పెట్టి   ప్రజల అసంతృప్తిని ప్రణాళికాబద్ధంగా వెనుకబడిన వర్గాల వైపుకి మళ్లించే  కుట్ర ప్రస్తుతం నడుస్తున్నది. 'అందరికీ విద్య- అందరికీ ఉపాధిఅన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగే రిజర్వేషన్ ప్రక్ర్రియ పైన కొందరికి కొత్తగా  సందేహాలు తలెత్తే పరిస్థితులు నిత్యం జరుగుతున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలో ప్రజాహితం ఏకమొత్తంగా అభిలషించే ప్రజాస్వామ్యవర్గాలనూ కలుపుకుపోయే అవసరం ఆత్మగౌరవ ఉద్యమం గుర్తించాలి. 

బచుగుల కోసమే వార్తాపత్రికలుః
బడుగు బలహీన వర్గాలు తమ ఉనికిని నిలుపుకునేందుకు వివిధ మార్గలను అన్వేషిస్తున్న సందర్భం ఇది. అందులో ఒక ప్రధానమైన కార్యాచరణ   బడుగుల గొంతుక వినిపించే నిమిత్తం  పత్రికల నిర్వహణ. విస్తృతమైన సమాజంలో పరిమిత లక్ష్యాల నిమిత్తం  మితమైన వనరుల సాయంతో  చిన్న పత్రికలు మనుగుడ సాగించడం  కొండకు ఎదురు దేకడం మించి కష్టం. కార్మికపేదమధ్య తరగతులు తమ జీవిక నిలిపే  సంజీవనిగా   బడుగుల కోసం నడిచే పత్రికలు  నిర్వహించబడాలి. ప్రజల భాగస్వామ్యం అభిలషించే ఉద్దేశం ఉంటే బలహీనవర్గాల పత్రికలోనే  అన్ని వర్గాలకు సంబంధించినవి కొన్నైనా విలువలతో కూడిన కథనాలు ప్రచురించడం అవసరం!    

సూర్య దినపత్రిక సామాజిక సాహసం
బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజాశక్తి,  విశాలాంధ్ర,  నవ తెలంగాణా వంటి దినపత్రికలు ఎంతో కాలంగా తెలుగునాట క్రియాశీలకంగా నిస్వార్థమైన సేవలు అందిస్తున్నాయి. మూడు దశాబ్దాలు పై బట్టి  సమాజాన్ని  తమ లక్ష్యాల వైపుకు మళ్లించాలనే మంచి దృక్పధంతో ముందుకు సాగే ఆ తరహా వార్తాపత్రికల సరసన చోటు  కోసం పన్నెండు ఏళ్ల కిందట  2007, అక్టోబర్, 21  బ్రాడ్ షీట్ ఫార్మాట్ లో నూకారపు సూర్యప్రకాష్ రావుగారి సంపాదకత్వంలో 'సూర్యదినపత్రికగా ఉద్యమబాటలో తొలి అడుగువేయడం సాహసమే! కానీ నిస్సందేహంగా అభినందనీయం కూడా!  శ్రీ నారాయణ్ దత్ తివారీ చేతుల మీదుగా ఆరంభమయిన ఈ దినపత్రికకు తెలుగు దినపత్రికలలో మొదటగా ప్రామాణికమైన  యూనీకోడ్ లో    వెలువడ్డ  అంతర్జాల పత్రిక అనే రికార్డ్ ఉంది.  ఈ పత్రికజాలస్థలి సమాచారానికి 2010 సెప్టెంబరు, నుండి శాశ్వత లింకులు ఉండడం మరో అరుదైన విశేషం.   పక్షపాతం లేకుండా సమాచారం అందించే పత్రికల అవసరం ప్రస్తుత వ్యాపార సంస్కృతిలో ఎంతో అవసరం.  బలహీన వర్గాల   గొంతుకకు ఈ తరహా చిన్నపత్రికలే  అండ.  అభివృద్ధి అంతా ఒకే చోటకొన్ని వర్గాల వద్దనే పోగుపడడం మిగిలిన ప్రాంతాలువర్గాలు నిర్లక్ష్యానికి గురయేందుకు కారణం. సమాజం పట్ల నిబద్ధతబడుగు వర్గాల హక్కుల పట్ల  బాధ్యతల ప్రమాణంగా మాత్రమే చిన్నపత్రికలకు ఆదరాభిమానాలు.  పాలక వర్గాలు అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను నిర్భయంగా ఎప్పటికప్పుడు  వెలుగులోకి తెచ్చే సత్తా ఉన్నప్పుడే చిన్నపత్రికలకు పెద్ద అభిమానవర్గం లభ్యమయేది. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సిబ్బంది  యాజమాన్యం సహకారంతో   పత్రికను సంరక్షించుకొంటూ దినదిన ప్రవర్థమానవుతున్న సూర్య దినపత్రికకు పదమూడో జన్మదిన సందర్భగా హృదయపూర్వక అభినందనలు! బడుగు జనుల వ్యతిరేఖ విధనాల పట్ల ఆకర్షణ అధికమయే  నేటి కాలంలో అసలైన బలహీన ప్రజల పక్షాన నిలబడి నిర్భీతితో గళమెత్తి నినదించే మరెన్నో పత్రికలకు సూర్య దినదినాభివృద్ధి  ప్రేరణ కావాలని మనసారా ఆకాంక్ష
పత్రికలు- బడుగు జీవుల బతుకు చిత్రికలు
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినోత్సవ  సందర్భంగా రాసిన వ్యాసం)





Saturday, January 11, 2020

సంక్రాంతి సౌరభాలు- సూర్య దినపత్రిక- 'సరదాకే’ ఆదివారం శీర్షిక - కర్లపాలెం హనుమంతరావు



                                      పండుగ పేరు చెవిన పడితేనే చాలు మనసులో అదో వింత వెలుగు. రసానుభూతిని పెంచే ప్రతీ సందర్భమూ నిజానికి ఓ పండుగే! సాంప్రదాయకంగా జరుపుకునే పండుగల ఆనందం అందుకు అదనం. దేశమంతటా ఏదో ఓ సందర్భంలో వేరే వేరే పేర్లతో అయినా సరే వైవిధ్యభరితంగా జరుపుకొనే వ్యవసాయ సంబరాలలో సంక్రాంతిది మొదటి స్థానం. తెలుగువారికి అదనంగా ఇది పెద్దల నుంచి పశువుల దాకా అందరినీ  స్మరించుకొనే పెద్దపండుగ కూడా!
పుష్యమాసం ఆరంభంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే  శుభసందర్భాన్ని ధనుర్మాస ప్రారంభంలోనే  'నెల పట్టండహో!' అంటో దండోరా వేసుకుంటూ వచ్చే పెనుపండువు(శ్రీనాథుడి ప్రయోగం) సంక్రాంతి పండుగ.
తొలి జాము చలిని సైతం లెక్కచేయకుండా ముగ్గుబుట్టలతో ముంగిళ్ల ముందు  ముద్దుబొమ్మలు రంగవల్లుల రంగంలోకి దిగిపోయేది ఈ నెలలోనే! ముగ్గంటే ముగ్గు కాదు. చుక్కంటే చుక్కా కాదు. ఖగోళశాస్త్ర గ్రహాల సంచార రహస్యాలను ఇంటి ముంగిళ్ల ముందు ముదిముత్తైదువులకు మల్లే ఈడొచ్చిన ఆడపిల్లలు పరిచి మరీ ప్రదర్శించే బ్లూ-ప్రింట్లు! క్రిమి సంహారక గుణాలు ప్రకృతిపరంగా సిద్ధించిన గోమయం(ఆవుపేడ)తో కలాపులు ల్లి, చీమల్లాంటి చిట్టి పొట్టి జీవాలకు పెట్టే గోరుముద్దలకు మల్లే బియ్యప్పిండితో కళలుట్టి పడేలా కోలాలు  తీర్చిదిద్దుతారు కోమలాంగులు. గుమ్మడి, గన్నేరు, చామంతి వంటి పూబంతులకు తోడు పసుపూ కుంకుమలద్ది అలంకరించిన గొబ్బిదేవతల చుట్టూతా చేతులు తట్టుకుంటూ సాయం సంధ్యల్లో 'సుబ్బీ గొబ్బెమ్మా! శుభమూ నీయవే! మొగలి పూవంటి మొగుడు నీయమే'  అంటూ అరవిరసిన మందారాల వంటి చేతులతో గొబ్బి తట్టే దృశ్యాలు.. అబ్బబ్బ! అబ్బాయిలకే కాదు.. అబ్బాయితనం గడచిపోయిన ముదుసళ్లక్కూడా చూసేందుకు వెయ్యి కళ్లున్నా చాలేవి కావు.
'కోడితో మేలుకొని, తానమాడొ, నుదుట/
దిరుమణియు, తిరుచూర్ణము తీర్చిదిద్ది/
యొక్క కేలను దంబఱ నొక్కకేల/
జిఱుతలం బూని వీధు వీధుల దిరిగి/
'రంగ రంగా'యటంచు ' గోవిందనామాలు కొట్టే సాతాని జియ్యరు సాక్షాత్ శ్రీహరి అవతారాన్ని కళ్లకు కట్టిస్తాడు! అతగాని శిరం మీద కొలువైన కూష్మాండ(గుమ్మడి కాయ ఆకారంలో ఉండే) పాత్ర భూమాత సంక్రాంతి పర్వదిన అవతారం! చిన్నారి చిట్టి చిట్టిగుప్పెట నిండా భిక్ష పట్టించి అక్షయపాత్రలోని అన్నపూర్ణాదేవిని సేవించుకోడం ఏ గోవర్థన గిరిధారినీ ఉద్ధరించడంగా అనుకోరాదుట. బువ్వ పెట్టే భూదేవి అవ్వ నోటికి వ్వంత కబళం అందించి  కృతజ్ఞత తెలుపుకునే భారతీయుల సత్సంప్రదాయమదని పెద్దల మాట! పట్టుశాలువతో మహాపండితుడికి మల్లే సన్నాయి బృందాన్ని వెంటేసుకొని గడపగడపా తడుముతూ ఈ అయ్యగారికి ఓ దండం, ఆ అమ్మగారికి ఓ దండం అడగకుండానే తడవతడవకీ తలాడించుకు పెట్టే గంగిరెద్దుదీ ఏ సరదా ఆట కాదుట! సాక్షాత్తూ ఆ గంగాధరుడి పండుగ సంబరాల  పర్యాటనట. పాడిపంటలకు అత్యవసరమైనవి జలధాన్యాలు. ఆ రెండింటినీ తలలపై మోసుకుంటూ శివకేశవులు నేల మీద పండుగ నెలరోజులూ తిరగాడుతున్నారు కాబట్టే తిండిగింజలకు ఏ మాత్రం లోటు లేకుండా లోకమిలా చల్లంగా సాగిపోతోందని పెద్దల కాలం నుంచి వస్తున్న ప్రగాఢ విశ్వాసం.
సకాలంలో నాట్లు పడి, పంట పుష్కలంగా దిగబడి, క్షేమంగా ధాన్య సంపద ఇంటి గాదెల్లోకి చేరిన శుభసందర్భంలోనే పౌష్య సంక్రాంతిలక్ష్మి శుభాగమనం గమనార్హం. ధాన్యాగారంలా కర్షకుడి గుండె కూడా నిండుగా నిర్మలంగా ఉంటుందీ పండుగ నెలరోజులు! ఏడాది పొడుగూతా పడిన సాగుకష్టానికి తగిన ఫలితం దక్కిందన్న సంతృప్తి పదిమందితో కలసి పంచుకుంటే పదింతలవుతుందనుకునే  మంచి బుద్ధి మొదటి నుంచి ఈ భూమినే నమ్ముకున్న అన్నదాతది. ఆ సంతృప్తి సంబరాల రూపమే శుభ సంక్రాంతి!
సంక్రాంతి అంటే  ఆటవిడుపు కూడా. ఏ మూల చూసినా పల్లెపట్టుల వైపు కోడి పందేలు, కోడె దూడల పరుగు పందేలు, చిన్నపిల్లల గాలిపటాల  మధ్య పోటా పోటీలు  సాగు విరామసమయంలో పల్లెలు సేదతీరే విధానాలు మనోహరాలు.
'అంబ పలుకు జగదంబా పలుకు/
కంబుకంఠి  ఓ కాళీ పలుకు/
కంచిలోని ఓ కామాక్షీ పలుకు' అంటూ ముక్కోటి దేవతల మధుర వాక్కులను తన డుబుడుక్క శబ్దంలో వినిపించే బుడబుక్కలవాడి నుండి- విశ్వశంభుడిని తన కాశీచెంబులోనికి కుదించి కాణీ ఆశించకుండానే ఆశీర్వాదాలు అందించే పురోహితుల దాకా ఈ పండుగ నెలరోజులూ ఏ మారుపల్లెలో విన్నా విష్ణ్వాలయ ధ్వజస్తంభం  నుంచి వినిపించే జయ జయ విజయధ్వానాలే! నిజానికి ఇవన్నీ శ్రామిక కృషీజన విజయాలకు వైజయంతీ గానాలని అంటారు కరుణశ్రీ ‘సస్య సంక్రాంతి’లో. ముందు చావిళ్ల నుంచి గొడ్ల చావిళ్ల దాకా  ఒక్క గజమైనా వదలక గోడలకు  వెల్లవేయించిన ఇళ్లు మహేంద్రైరావతాలని మించి మురిపిస్తుంటాయి గదా! కవి భావన ఎంత కమనీయంగా ఉందో!
హాని కలిగించే క్రిమికీటకాదుల సంహారానికని పరగడుపునే రగిలించే చలిమంటలు సంక్రాంతి పండుగ సంబరాల తొలి ఘట్టం. ఏడాది పొడుగునా ఇంటి నలుమూలలా పేరుకున్న చెత్తా చెదారమంతా చలిమంటల పరశురాముడికి పసందైన పండుగ  విందు. కొత్త ఏడు గడపలోకి కుడిపాదం మోపి ముందుగా ప్రవేశించే ముగ్ధ పౌష్య సంక్రాతి. ఆ లక్ష్మికి పట్టే దివ్యమంగళ హారతులు ఇంటి ముంగిటిలో రగిలే చలిమంటలని మరో కవి భావన.
తూర్పున తెలతెలవారుతుండగానే అభ్యంగన స్నానమాచరించి, నూత్న వస్త్రాలతో కొత్తకుండలో కొత్తబియ్యం, కొత్తబెల్లం, పాలు, నేయి కలగలిపి వండిన మధురాన్న ప్రసాదం ప్రత్యక్షనారాయణుడికి నివేదించి, ఆనక ఆరగించడంతో పండుగ సంబరాలు పంచుకోడం ఆరంభమయినట్లే! భోగినాటి సాయం సంద్యవేళల్లో బాలభగవంతులకు ఇరుగు పొరుగు పేరంట్రాండ్ల సాక్షిగా రేగుపళ్లతో చేసే అభిషేకోత్సవం  మరో ముచ్చట. ఆంధ్రాప్రాంతాలలో స్త్రీలు తమ సృజనాత్మకనంతా రగంరించి తీర్చి దిద్దే బొమ్మల కొలువులు మరో అద్భుత  కోలాహల ప్రదర్శన. సీతారాముఅ కళ్యాణాన్ని ఆశీర్వదిస్తూ ఎదురుగా రావణబ్రహ్మ, రాధాకృష్ణుల సరాగాలాను ఆస్వాదిస్తూ వెనకనే సత్యభామ! సహజ వైరాలన్నీ పక్కన పెట్టి ఒకే వరుసలో బారులు తీరిన పులీ-మేకా, పామూ-ముంగిసా.. సహజీవన సౌందర్యానుభూతులను చాటి చెపుతుంటాయ్ బొమ్మల కొలవుల్లో. మనుషులూ దేవుడు చేసిన బొమ్మలే కదా! ఆ మర్మం మరుగున పడినందునే మనిషి మనిషికీ మధ్యన ఇన్ని మద మాత్సర్యాల పొరలు! మాకులా కలసి మెలసి ఉంటేనే కలదు సుమా కలకాలం సుఖశాంతులు’ అంటూ నోరులేని బొమ్మలు  సందేశమందిస్తున్నా.. బుద్ధి కలిగిన మనుషలం మనమే ఎందుకో అర్థం చేసుకోం!
దేహం. కుటుంబం, సంస్కారం. సంస్కృతి, ఆస్తీ, అంతస్తూ .. అన్ని సంపదలూ కోరక మునుపే వారసర్వంగా ఇచ్చిపోయిన పెద్దలను స్మరించుకునే అవకాశం పండుగ రెండోరోజు. ఎక్కడెక్కడో రెక్కల కష్టం మీద రోజులు వెళ్లబుచ్చే కుటుంబ సభ్యులందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఒకే చూరు కింద చేరి సరదాలు, సరసాలు, విందులు, వినోదాలు జరుపుకునే సందర్భం చూసి సంబరపడాలని అంబరం నుంచి పితృదేవతలంతా కిందకు దిగివచ్చే శుభఘడియలుట ఇవి.
'లేగడి పాలలో గ్రాగి మాగిన తీయ తీయ కప్పుర భోగి పాయసంబు/
చవులూరు కరివేప చివురాకులో గుమగుమలాడు పైర వంకాయగూర/
అరుణ కూస్తుంబరీ దళ మైత్రిమై నాల్క త్రుప్పుడుల్చెడు నక్కదోస బజ్జి/
కొత్త బెల్లపు దోడికోడలై మరిగిన ముదురు గుమ్మడి పండు ముదురు పులుసు/ జిడ్డు దేరిన వెన్నెల గడ్డపెరుగు/
గరగరిక చాటు ముంగారు చెఱుకు రసము/
సంతరించితి విందు భోజనము సేయ/
రండు రండ'ని ఇంటిల్లిపాదినీ సంక్రమణ లక్ష్మి విందుకుడుపులకై ఆహ్వానమందిస్తుంటే 'కాదు.. రామ'ని మారాములు చేయడం ఎంత నిగ్రహాత్మారాములకైనా  సాధ్యమయే పనేనా? కాకపోతే తృప్తిగా తిని త్రేన్చే ముందు  మనకింత సంపత్తినిచ్చిపోయిన పితృదేవతలకు తృప్తిగా నువ్వులూ నీళ్లూ కలపిన మంత్రపూర్వక తర్పణాలను సంతృప్తిగా అర్పించుకోడం విధాయకానికే కాదు.. విధి నిర్వహణకు కూడా!
'అత్తవారింట విందులటన్న/ భార్య వాలుజూపు కోవులె గాని. వారు పెట్టు పంచభక్ష్యములనుకొని భ్రాంతి పడవద్ద'ని 'సంక్రాంతి' లో కవితలో పింగళి -కాటూరి వారి సందర్భానుసారంగా సందేశమందిస్తారు. అదనపు కట్న కానుకల కోసం ఇంటి ఇల్లాళ్లను కాల్చుకు తింటున్న ఈ కాలపు కాసు రాకాసి మూకల చెవులకూ కాస్తంత కవుల వాక్కుల్లోని పరమార్థం సోకడం అవసరం. పండగకు వచ్చిన కొత్తదంపతులకు ఉన్నంతలో పెట్టుపోతలు చేసి మనసారా 'వచ్చే సంక్రాంతికి/ గుమ్మడి పండంటి కొడుకును ఎత్తుకోమ'ని అత్తమామలు ఆశీర్వదిస్తే 'కొడుకుపై ప్రేమచే చెడిపోయె కురురాజు/ కొడుకుపై మమతతో కుమిలిపోయెను కైక/ అబ్బాయి వలదండి అమ్మాయి కావలెనండి' అంటూ కరుణశ్రీ  స్వర్ణసంక్రాంతిలోని ఇంటల్లుడు అభిలాషించడం అభినందనీయం. పుట్టింది ఆడబిడ్డనగానే కట్టుకున్న ఇల్లాలిని పుట్టింటనే వదిలెళ్ళిపోయే ప్రబుద్ధులు అందరకూ బుద్ధి చెప్పే సుద్ది కూడా ఇది! దక్షిణాయన కురుక్షేత్ర యుద్ధంలో నేలకొరిగిన భీష్మపితామహుడు సద్గతుల కోసం ఉత్తరాయన పుణ్యతిథులకుగాను  ఎంతో ఓపికగా అంపశయ్య మీద ప్రాణాలు ఉగ్గబట్టుకుని వేచిచూస్తాడు వ్యాస మహాభారత కథనం ప్రకారం. పితృదేవతలనంతా అదే మార్గంలో స్వర్గధామం చేర్చే  తర్పణాలు అర్పించుకునే గొప్ప కౌటుంబిక సంస్కృతి ప్రపంచం మొత్తంలో ఒక్క భారతీయుల పర్వదిన సంస్కృతులకే సొంతం! బతికుండగానే తల్లిదండ్రులను గొడ్లకొష్టాల పాల్చేసే గొడ్డుమోతు సంతుకు సంతర్పణల్లోని వైశిష్ట్యం అంతుపడితే ఎంత బావుణ్నో! పితృ, మాతామహులు నరకయాతనల నుంచి  విముక్తి పొందే ఆనంద సందర్భం కాబట్టే ఆబాలగోపాలం ఎంతో సంతోషంతో   మకర సంక్రాంతికి మూడో రోజున గాలి పతంగులతో మనసారా కృతజ్ఞతలు తెలుపుకోవడం!
మూడో రోజు పశువుల పండుగ, కనుమ. దుక్కి దున్నడం నుంచి ధాన్యం గాదెల కెక్కించడం దాకా అన్నదాతకు అన్నదమ్ములకు మించి అన్నిందాలా సాయమందించేది పశుజాతే! కొట్టినా తిట్టినా పట్టించుకోదు. గడ్డీ గాదం పెట్టినా కిమ్మనకుండా గొడ్డుచాకిరీ చేసే గొడ్డూగోదాకు ఏడాదికి ఓ రోజైనా ఆటవిడుపు అవసరమే కదా! చేసిన సాయానికి ఘనంగా కృతజ్ఞతలు చెప్పుకోవడమే కనుమ వెనుక ఉన్న మర్మం! పశువులను పరిశుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో దేవుళ్లకు మల్లే అలంకరించి, కడుపారా గడ్డి, మనసారా కుడితి నైవేద్యాలుగా అర్పిస్తే బసవరాజుల భుక్తాయాసం, గోమాలక్ష్ముల ఆశీర్వాదం, ముందొచ్చే ఆరుగాల సేద్యానికి మేలుచేస్తుందని రైతన్నల భక్తి, విశ్వాసం.
పితృదేవతల ప్రీత్యర్థం వండే గారెలు కాకులు  కడుపారా సేవిస్తే పైనుండే పెద్దల ఆశీస్సులూ తమకందినట్లేనని ఓ భావ భారతీయులకు. కనుమ నాడు కాకైనా కదలదని సామెత. కడుపు సరిపడా ఆహారం కంటి ముందరే కనపడుతుంటే ఏ కాకైనా ఎక్కడెక్కడికో ఎందుకు ఎగిరిపోతుంది? ముక్క లేనిదే పండుగేమిటని పెదవులు విరిచే ఆహారప్రియుల ఆత్మారాముల శాంతి కోసమే నాలుగో రోజు నాటి ముక్కనుమ సంబరం.
కాలం పెనువేగంగా మారుతోంది. పోటీ వినా జీవితమే లేదనుకునే భావన పెరుగున్న కొద్దీ వ్యక్తిగత విరామ సమయమూ కుదింపుకు లోనవుతోంది. కాలాన్ని కాసులతో తూచే కలికాలంలో తీరుబడిగా నెలరోజుల పాటు సంబరాలు జరుపుకుంటూ నష్టానికి సిద్ధపదేదెవరూ? పండుగ మూణ్నాళ్లే బంధు మిత్రులతో సందడిగా గడపేందుకు సామాన్యుడికి గంపెడన్ని కడగండ్లు! చీకాకులు కాస్తింత సేపు పక్కకు తోసేసి పండుగ వంకనైనా పుట్టి పెరిగిన పల్లె వంకలకు తొంగి చూస్తే  ఎంత తెరిపో పట్నవాసులు  తెలుసుకోవడం ఆరోగ్యానికి అవసరం అంటున్నారు వైద్యులు కూడా! ఇన్స్టాంట్ ముగ్గులు, ప్లాస్టిక్ గొబ్బెమ్మలు, డొక్కలు ఎండిన బసవన్నల పక్కన నిలబడి అపస్వరాలతో  వినిపించే దండాల దండకాలు అపార్టుమెంటు దండకారణ్యంలో అందుకునేదే అయ్యవారు?  కిలో రెండొందలు  దాటి బెల్లం పలికే కరువు రోజులు! ఇంటిల్లిపాది పండుగ  పొంగలి ఎంగిలి పడేందుకు ఇంటి మాలక్ష్మి పడే   యాతనను ఏ బరువు రాళ్లు తూచగలవు? పెంట్ హౌస్ టాపుల పైన చేరి పిల్ల సంచు సందడిగా ఎగరేసే గాలిపటాలు ఏ సెల్ టవర్లకో, కరెంట్ తీగలకో తగలకుండా గడిస్తే అదే సగటు కుటుంబానికి పెద్దపండుగ! బతికున్న తల్లిదండ్రులకే  ఇంట ఏ మూల చోటు చూపించాలో తోచని బడుగు సంసారికి తాతల తాతలకూ తిలోదకాలంటే తలకు మించిన క్రతువే! నిన్న మొన్నటి వరకు అన్నిటికీ తానున్నాననన్న పెద్ద మనసు పొరుగింటి అన్నది! పండుగ చక్కిలాలతో సంబరాలు పంచుకొందుకు ఈ పూట తలుపు తడితే 'సకినాలు' తప్ప  నోటికి మరేదీ హితవనిపించవు' అంటూ సకిలించేస్తుండె!గుండె గుండెకూ మధ్య రోజుకో కొత్త కొండను లేపే పాడుకాలం అంతు చూస్తేనే లోకానికి అసలైన పెద్దపండుగ.
సేద్యమంటే ప్రకృతిశకుని మామతో రైతన్నాడక తప్పని మాయదారి జూదం. ఏరువాక  అంటేనే రాబోయే యుద్ధపు రాక. జవాను మాదిరి అరకోలు పట్టుకుని సాగు పోరుకు కిసాను గడప దాటితే ఇల్లాలు కన్నీటి చెరువు చీరె చెరుగులో దాచుకుని ఎదురెళ్లే దారుణ పరిస్థితులిప్పట్టివి.
జీవనదులు ఎన్నున్నా చేవలేని చౌడుల పైనే   ఇంకెత కాలం నాగలి  పోరు? విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్నింటా కల్తీ, కరువు. ముద్ద పెట్టే రైతన్న మద్దతు ధరల సాధనకై ముష్టియుద్ధాలకు దిగడమా! ముఖ్యమంత్రులు, ప్రధానులతో ఎన్నికల బరిలో నిలబడి పోరడమా! చేతులారా పెంచిన పంటకు చేజేతులా నిప్పటించడం.. బురద మళ్లలో పొర్లి పండించిన కాయను ధరలేక నడిరోడ్ల మీద కుమ్మరించడం! పొలాలకు గొళ్లేలు బిగించినా పట్టించుకే నాథుడు కనిపించడే! కళ్లేల  నుండి.. అంగళ్ల దాకా అన్ని యుద్ధక్షేత్ర్రాలలో  అన్నదాతకు కర్ణుడికి  మించిన పరాభవాలే. బ్యాంకు రుణాల నుంచి సరళీకృత విధానాల వరకు  సంక్లిష్టమైన సాలెగూళ్లన్నింటి  మధ్యన  ఓటమి ఖాయమని తెలిసీ పోరాటమాపని  అసలు సిసలు  నిస్వార్థ నిబద్ధ కర్మయోధుడు  దేశం మొత్తాన ఒకే ఒకడు! ఆ ఒక్క  సేద్యగాడూ కాడి కింద పడవేస్తే  పుష్యమాస సంక్రాతి శోభలిక సమ్మేళనాలలో మాత్రమే కవుల గళాలలో  వినిపించే మంగళ గీతాలుగా మిగిలేది!
రూపాయికి కిలో బియ్యం అందించే ప్రభువులు విత్తనాలకు, ఎరువులకు రాయితీలు ఎందుకు కల్పించరో?! అదనుకు జలాలు సమృద్ధిగా  పొలాలకు అందించేందుకు  ప్రభుత్వాలకు ఎందుకు చేదో?! పెరిగే రైతుకూలీ రేట్లకు ప్రత్యామ్నాయ విధానమేది?  యంత్రాల బాడుగ ధరల వరకైనా ప్రభువులు దయచూపిస్తేనే గదా బడుగు రైతు  సాగుబడి సాగిలపడకుండా ముందుకు సాగేది! పటిష్ట మార్కెట్ వ్యవస్థ, పారదర్శక పంటల బీమా, చీడపురుగుల నివారణలకు తోడు అగ్రిక్లినిక్కులు, ఉత్తేజపరిచే సాంకేతిక సమాచారం వంటి ఎన్నెన్నో పథకాలు  ఎప్పటికప్పుడు ఏదో ఓ రూపంలో రైతన్నకు అందేందుకూ రూపాయల లెక్కలా?! 
రాష్ట్రాల అంశమా, కేంద్రం అంశమా అన్నది కాదు.. రైతాంగం సమస్య యావద్దేశానికీ  అత్యంత ప్రధానాంశం! విపత్తులో ఉన్నాయన్న మిషతో లక్షల కోట్ల ప్రజల సొత్తు డీలాపడే డొక్కు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నప్పుడు.. ఏ వైభోగంతో   ప్రాభవంగా వెలుగుతోందని  వ్యవసాయరంగానికి పైసా  సాయమందకపోవడం? ఉత్తుత్తి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు! ఓటి కమిటీలు, ఓటు కుండలు సామెత! వేదికల పైన జరిగే వాదనలు రైతు వేదనలను ఆర్చవు తీర్చవు. కాడి ఇంకా నేల మీద పడలేదంటే అది అన్నదాతలోని అమాయకత్వం కాదు. అమ్మతనం! కృషీవలుడు కదిలే కన్నీటి మేఘంలా ఉన్నంత కాలం సంక్రాతి లక్ష్మి మొహంలో  సరదాకైనా కళాకాంతులు  కనిపించవు! పాలన  పొలాల వైపుకు పరుగులెత్తినప్పుడే కరుణశ్రీ 'స్వర్ణ సంక్రాంతి'లో ఆశ్వాసించినట్లు 'సస్య సంపదలతో' దేశమంతా సంబరంగా సంక్రాంతులు చేసుకునే వీలు!
-కర్లపాలెం హనుమంతరావు  
(‘సరదాకే’ శీర్షిక - సూర్య దినపత్రిక   ఆదివారం, 12 -01 -2020 )
***





  



Tuesday, January 7, 2020

వివాహమే మహాభాగ్యం-ఈనాడు సంపాదకీయఁ



జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.
ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,
దేవతల రుణాన్ని యజ్ఞాలతో,
పితృరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఉవాచ.
తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వివాహాన్ని ధార్మిక సంస్కారంగా ఆచరించే సంప్రదాయం మనది.
'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవారు బయటపడాలని తహతహలాడుతుంటారు. వెలుపల ఉన్నవారు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతుంటారు' అని ఓ మేధావి చమత్కరించాడు కానీ, భారతీయ సంస్కృతిలో పాటించాల్సిన నాలుగు ధర్మాల్లో గృహస్థాశ్రమమూ ఒకటి. ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగిడే పొదరిల్లు అది! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము...' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పాడు. ఆ పురుషార్థాన్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. సుఖదుఃఖాల్లో, కలిమిలేముల్లో సహభాగస్వాములై భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహదీపమే దిక్సూచి కావాలి. 'మాయ, మర్మములేని నేస్తము/మగువలకు, మగవారికొక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు రాజమార్గము'ను నిర్దేశించాడు వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయతాహస్తాన్ని అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యానికి పట్టం కట్టాల్సింది పురుషుడే.

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల,్‌ భార్య ఎర్తు' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకడం సున్నా అన్నాడు.
భార్యాభర్తల సాహచర్యం-
సమశ్రుతి చేసిన ఆ పేటికలో బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా తరంగితం కావాలి.
దాంపత్యమంటే-
మూడు ముడులతో పెనవడిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాలవలె కలిసి ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవన మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గానానికి సప్తస్వరాలై ఊపిరులూదడం!
దాంపత్యమంటే-
ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులే, సప్తాశ్వాలుగా వారి జీవనరథం మలిసంధ్యలోనూ సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెలు- కోరికలు తీరి, ఆఖరి మజిలీకి చేరుకున్నాక 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని...' నిరీక్షిస్తూ ఆర్ద్రమవుతుంటాయి. శృంగార అవసరాల్లేని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమైనది. లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళిక' అన్నది ముళ్లపూడి రమణీయ భాష్యం.

ఇతర దేశాల్లో మాదిరి కాకుండా మన సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ-పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటివాటివల్ల వివాహబంధాలు తెగిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిన రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో- వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేనివారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి పట్టం కట్టేదే. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని ఇంతకుముందరి అధ్యయనాలు పేర్కొనగా- స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసిక స్వాస్థ్యం చేకూరుస్తుందని తాజాగా వెల్లడయింది. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళలకన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగిపోతారని చెబుతున్న పరిశోధకులు- పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నవారికన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ పరస్పర నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ, పురుషులు వివాహబంధంతో ఒక్కటై బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతమే!
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 03 -05 -2010)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...