Showing posts with label Languages. Show all posts
Showing posts with label Languages. Show all posts

Friday, May 8, 2020

చక్కని తెలుగుకు బాటలు మూయకు- ఎలనాగ



తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే ఏవి భాషాపరమైన దోషాలో తెలిసి ఉండటం మంచిది.
హాస్యాన్ని చేర్చి వినోదాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని చమత్కార భరితమైన వాక్యాలను రాసాను. అవి కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ చిన్నబుచ్చటం కోసం కాదు. దయచేసి పాఠకులు సహృదయతతో అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. మరొక్క విషయం. ఒక ప్రయోగం భాషాసవ్యత దృష్ట్యా తప్పు అని చెప్పినంత మాత్రాన దాన్ని నేటి ఆధునిక యుగంలోని రచనా సందర్భంలో అసలే వాడకూడదని కాదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటువంటి ఎన్నో పదాలను ఉపయోగించటం పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే స్ట్రిక్టుగా (కచ్చితంగా) చూస్తే అది తప్పు అనే విషయం తెలిసి ఉండాలి.
ప్రాథమిక స్థాయి దోషాలను మొదట పరీక్షించి, అరుదుగా తటస్థించే తప్పులను తర్వాత పరిశీలిద్దాం.
అవసరం లేకపోయినా ఒక అక్షరాన్ని ఒత్తి పలకటం (అక్షరం అడుగు భాగాన ఒక చిన్న నిలువు గీత ఉన్నట్టు వ్యవహరించటం – దీన్ని జట అంటారు) లేక ఆ విధంగా రాయడం మనం సాధారణంగా గమనించే స్ఖాలిత్యం.
“వివిధ మతాల, జాతుల, వర్గాల మధ్య సమైఖ్యతను సాధించటం ఈనాడు మన దేశానికెంతో అవసరం” అనే వాక్యంలో సమైఖ్యత అన్న పదం తప్పు. సమైక్యత అనేది సరైన పదం. సమ + ఐక్యత = సమైక్యత (వృద్ధి సంధి). అదే విధంగా ‘మల్లిఖార్జున స్వామి దేవాలయం’ అని రాసివున్న బోర్డులు కనపడతాయి మనకు అక్కడక్కడ. మల్లికార్జునుడు అనేదే సరైన పదం. మల్లిక + అర్జునుడు = మల్లికార్జునుడు (సవర్ణ దీర్ఘ సంధి). “నేను ప్రయోగించే భాష చాలా ఖచ్చితంగా ఉంటుంది సుమండీ” అన్నాడట ఓ పండితుడు. నిజానికి కచ్చితం అనే మాటకు బదులు ఖచ్చితం అని రాయటం వలన తన భాషలో కచ్చితత్వం లోపించిందన్న విషయాన్ని ఎరుగడాయన! ఏదైనా ఒక రంగంలో గొప్పవాడైన వ్యక్తిని సూచించటానికి ఉద్దండుడు అనే పదం ఉంది. కాని ఉద్ధండుడు అని రాస్తారు లేక పలుకుతారు కొంత మంది. గొప్పవాణ్ని సూచిస్తున్నాం కనుక ఒత్తు లేకుండా రాస్తే చప్పగా (సాదాగా) ఉండి అపచారం జరిగిపోతుందని భయం కాబోలు! ఉద్దండము అంటే పొడవైనది లేక ఎక్కువైనది అని అర్థం.
విష్ణువుకు ఉన్న అనేక నామాలలో (పేర్లలో) జనార్దనుడు అనేది ఒకటి. కాని జనార్ధనుడు అని తప్పుగా రాసేవాళ్లు లేకపోలేదు. అదే విధంగా మధుసూదనుడుకు బదులు మధుసూధనుడు అని కొందరు రాయటం, పలకటం అరుదైన విషయమేం కాదు. సూదనము అంటే చంపుట. మధు అనే రాక్షసుణ్ని చంపినవాడు కనుక మధుసూదనుడు అయినాడు శ్రీహరి.
“గులాబీ పువ్వులు గుభాళించినట్టు” అని వచన కవితలో ఒక కవి రాసుకోవచ్చు గాక, అంత మాత్రాన గుభాళించు అనే పద ప్రయోగం తప్పు కాకుండా పోతుందా? గుబాళించుట అంటే వాసన కొట్టుట.
“నావి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావండీ. ఇవి ఆనంద భాష్పాలు” అన్నదట ఒక యిల్లాలు తన భర్తతో. ఆ భర్త ఒకవేళ తెలుగు భాషను అమితంగా ప్రేమించే వాడైతే ఆ పద ప్రయోగాన్ని విని ఎంతగా విచారపడి దుఃఖ బాష్పాలను రాలుస్తాడో కదా! బాష్పాలు అనేదే సరైన పదం. అట్లా దుఃఖం ముంచుకొచ్చినప్పుడు మనను మనం ‘సంభాళించుకోవాలి’ అనకండి. ఎందుకంటే సంబాళించుకొనుట అన్నదే సరైన పదం.
“ఫలానా శ్రీమంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వజ్ర వైఢూర్యాలను కానుకలుగా సమర్పించుకున్నాడు” అని అచ్చులో చదివి అది దోషరహితమైన వాక్యం అనుకోకండి పాఠకులారా! ఎందుకంటే వైఢూర్యము అనటం తప్పు. వైడూర్యము అనేదే సరైన పదం. పురాణంలో శంబూకుడు అనే ఒకాయన తటస్థిస్తాడు మనకు. శంబూకము అంటే ముత్యపు చిప్ప లేక ఆల్చిప్ప. అయితే శంభూకుడు అని ఎవరైనా వాడితే ఆ పదం తప్పు అని గ్రహించాలి.
“నీ కోసం నా ప్రాణాలను ఫణంగా పెడతాను” అని ఎవరైనా అన్నారనుకోండి. చస్తే నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఫణం వల్లనే చచ్చిపోతాము మనం! ఫణము అంటే పాము పడగ. పణము = పందెము కనుక ఇదే రైటు. ‘మాంసాహార & శాఖాహార హోటల్’ అనే బోర్డులు మనకు కనిపించటం సర్వసాధారణమైన విషయం. శాఖ అంటే చెట్టు కొమ్మ కనుక, కొమ్మలతో వండిన కూరను తెచ్చిపెడతారేమోనని భయం కలుగవచ్చు తెలుగు భాషా పండితులకు! శాఖాహారము అనేది తప్పు. శాకాహారము అనాలి. శాకము = కూర (ఆంగ్లంలో కరీ).
‘రాయబారము’కు బదులు ‘రాయభారము’ అని తప్పుగా ప్రయోగం చేస్తారు కొందరు. అట్టివారికి సవ్యముగా ‘రాయ’ భారమా?! కొన్ని కుటుంబాల వాళ్లు ‘భ’ గుణింతం ఎక్కువగా వాడుతారు రోజువారీ భాషలో. “భావగారూ, భావి దగ్గర స్నానం చేసి ధోవతి కట్టుకోండి” అంటారు. ఈ వాక్యంలో మూడు భాషాదోషాలు దొర్లినయ్. బావ, బావి, దోవతి అనేవే సరైన పదాలు. భావి అంటే భవిష్యత్తు అనే మరో అర్థం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. భ్రాహ్మ(ణు)లు అనే పదాన్ని వాడటం కూడా తప్పే. బ్రాహ్మణులు అనేదే రైటు. అదే విధంగా భీభత్సము, భీబత్సము, బీబత్సము – ఈ మూడు పదాలూ తప్పుతో కూడుకున్నవే. బీభత్సము అన్న పదమే సరైనది. “ఆర్థిక స్థోమత లేని బీదవాడు పాపం” అనే వాక్యంలో భాషాదోషం ఉంది. ఎందుకంటే స్థోమత అనే పదం తప్పు. స్తోమత అన్నది సరైన పదం. “ఎందుకలా అదేపనిగా కదుల్తావ్? స్థిమితంగా కూర్చోలేవూ?” అంటూ చిన్న పిల్లవాణ్ని పెద్దాయనెవరైనా మందలిస్తే, స్తిమితం అనే పదాన్ని స్థిమితంగా మార్చి ‘దోషం’ ఆ పెద్దాయనదే అనిపిస్తుంది కదా!
స్తంభము అనే పదాన్ని స్థంభము అని రాస్తారు కొంత మంది. స్తంభము అనేదే రైటు. స్థంభము తప్పు. ‘స్తంభించుట’ స్తంభము నుండి వచ్చిందే. ఇంకొక భాషాదోషాన్ని ప్రస్తావిస్తాను. అదేమిటంటే ప్రస్థావన అనే తప్పు పదాన్ని వాడటం. ప్రస్తావించుట అంటే చెప్పుట. ప్రస్తావము అన్నా కూడా ప్రస్తావన అనే అర్థం. ప్రస్థావన తప్పు. “ఆస్థీ, అంతస్థూ చూసుకోకుండా ఏ సంబంధాన్నీ చేసుకోవద్దు” అన్నామనుకోండి. అప్పుడు మనం సరిగ్గా చూసుకోకుండా రెండు భాషాదోషాలను దొర్లించిన వాళ్లమవుతాము. ఆస్తి, అంతస్తు అనేవే సరైన పదాలు. అదేవిధంగా అస్థిత్వము అన్న పదాన్ని వాడినామనుకోండి. అప్పుడు మనం పప్పులో కాలు వేసినట్టటే. ఎందుకంటే అస్తిత్వము అన్నదే సరైన పదం. అస్థిత్వము తప్పు.
మీరు రాంచి వెళ్లారట కదా. అక్కడి స్థూపాల్ని చూసారా? అని అడిగామనుకోండి. అప్పుడు కూడా రెండు తప్పులు చేసినవాళ్లం అవుతాము. ఒకటి భాషాపరమైనది, మరొకటి సామాన్య విజ్ఞానం (General Knowledge) కు సంబంధించినది. స్తూపము అనేదే సరైన పదం కావటం భాషకు సంబంధించినదైతే, రాంచిలో కాక సాంచిలో స్తూపం ఉండటం G.K. కు సంబంధించినది! కొందరు స్తనాలు అనటానికి బదులు స్థనాలు అంటారు. అది కూడా తప్పే. దీనికి విరుద్ధంగా ‘థ’ వత్తుకు బదులు ‘త’ వత్తు రాస్తారు కొంత మంది. ఉదా: అస్తిక, నేరస్తులు, గ్రామస్తులు. అలా రాయటం తప్పు. అస్థిక, నేరస్థులు, గ్రామస్థులు అని రాయాలి. అయితే రోగగ్రస్థులు అని రాయకూడదు. రోగగ్రస్తులు అనే రాయాలి. ఎందుకంటే గ్రస్తము అనే పదానికి తినబడినది లేక మింగబడినది అని అర్థం.
‘ట’ వత్తుకు బదులు ‘ఠ’ వత్తును రాయటం మరొక రకమైన భాషా స్ఖాలిత్యం. తెలుగు భాష ఎంతో విశిష్ఠమైనది అంటూ పొగిడామా తుస్సుమన్నట్టే! ఎందుకంటే విశిష్ఠము అనేది తప్పు పదం. విశిష్టము అని రాయాలి. అదే విధంగా ఉత్కృష్ఠము తప్పు. ఉత్కృష్టము సరైన పదం. ముష్ఠి , పుష్ఠి అని రాస్తారు చాలా మంది. కాని అవి తప్పులు. ముష్టి , పుష్టి అనేవి సరైన పదాలు. “చిత్రగుప్తుని చిఠ్ఠాలో మన పాపాలన్నీ రాయబడి ఉంటాయి” అని చదువుతాం మనం. అలాగే “ఏంటా వెకిలి చేష్ఠలూ” అంటూ చివాట్లు పెట్టడం కూడా వింటుంటాం. ఇక్కడ చిఠ్ఠాకు బదులు చిట్టా, చేష్ఠకు బదులు చేష్ట సరైన పదాలు అని తెలుసుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నవాణ్ని కోపధారి అనటం వింటుంటాం. కాని అది తప్పు. కోపిష్ఠి అనాలి (కోపిష్టి కాదు). అదేవిధంగా పాపిష్టి , పాపిష్ఠిలలో రెండవది రైటు. నిజానికి పాపిష్ఠి అని కాక పాపిష్ఠుడు అనాలట. కిరీటధారి, మకుటధారి, గిరిధారి, వస్త్రధారి అనవచ్చు కాని కోపధారి అనకూడదు.
తనకు అరవై సంవత్సరాల వయస్సు విండిన సందర్భంగా ఒకాయన అట్టహాసంగా ఉత్సవం జరుపుకోవాలనుకున్నాడు. ఆహ్వాన పత్రికల్లో షష్ఠిపూర్తి ఉత్సవం అని అచ్చయింది. అయితే మరి అతనికి ఆరేళ్ల వయసే ఉన్నట్టు భావించాలా? ఎందుకంటే ఆరవ తిథి (పంచమి తర్వాత వచ్చేది) షష్ఠి . అరవై సంవత్సరాల ఉత్సవాన్ని షష్టిపూర్తి లేక షష్ట్యబ్ద పూర్తి అనాలి. ఇలా కేవలం ఒక వత్తు వచ్చి చేరినందుకే అర్థం పూర్తిగా మారే ప్రమాదాలు తెలుగు భాషలో మరి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ప్రదానం, ప్రధానం. ప్రదాన సభ అంటే ఇచ్చివేసే సభ కాగా (బహుమతి ప్రదానం), ప్రధాన సభ అంటే ముఖ్యమైన సభ అవుతుంది. అదేవిధంగా అర్థము = భావము, అర్ధము = సగము. అర్థ సౌందర్యం అంస్టేకర Beauty of meaning. అర్ధ సౌందర్యం అంటే Half beauty. ఇక ధార అంటే వరుస, దార అంటే భార్య. ‘బాలరసాల సాల……’ అనే పద్యంలో పోతన ‘నిజదార సుతోద్ధర పోషణార్థమై’ అన్నాడు. పంచదార అంటే ద్రౌపది (ఐదుగురికి భార్య అయినది) కూడా అవుతుంది.
-ఎలనాగ

(భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1(వాకిలి- అంతర్జాల పత్రిక )

-సేకరణః కర్లపాలెం హనుమంతరావు)

Thursday, December 12, 2019

జగదానందకారకం- ఈనాడు ఆదివారం సాహిత్య సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు





'నాదాధీనమ్ జగత్ సర్వం' అని సామవేద వాదం. బ్రహ్మ సామవేద గానాసక్తుడు. వాణి వీణాపాణి. శంకరుడిది ఓంకార నాద ప్రీయత్వం. అనంతుదు సంగీత స్వరాధీనుడు.   మతంగ, భరత, శుక, శౌనక, నారద, తుంబుర ఆంజనేయాది రుషిసత్తములందరూ మోక్ష సామ్రాజ్యాన్ని సాధించింది నాదబ్రహ్మోపాసనా మార్గంలోనే అన్నది శ్ర్రుతి స్మృతి పురాణేతిహాసాదుల మాట. సామవేదం ప్రకారం చేతనాచేతనాలైన సమస్త భూతజాలాన్ని ఆకర్షించే ఐహిష్కాముష్కికాలైన చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శక్తి ఉన్నది ఒక్క సంగీత విద్యకే. 'సరిగమపదని'సలనే సప్త స్వరాల పునాదులపై నిర్మించిన భారతీయ సంగీత మహాహార్మ్యం ఎంతో అనాదిది. ఆరంభంలో ఒకే లక్ష్య లక్షణ సంప్రదాయాలతో విరాజిల్లినా విజాతీయుల పాలనా ప్రభావం ఉత్తర దక్షిణాలనే అంతరాన్ని ఏర్పరిచింది. ఆంధ్ర కవితాపితామహుడుగా పేరుగాంచిన నన్నయ భట్టారకునికి చాలా ముందు నుంచే ఏలపాటలు, తుమ్మెద పాటలు వంటి జానపద గులాబీలు సౌరభాలు గుబాళించేవి. అన్నమాచార్యులు, పురందరదాసు, క్షేత్రయ్య వంటి పదవాగ్గేయకారులూ   ప్రచారం చేసిన జనసాహిత్యమూ అపారమే! 'సంగీతం' అంటే 'తంజావూరు పాట' అన్నంతగా స్థిరపడిన నాయజరాజుల పాలనలో తెలుగు నేలల నుంచి  గుర్తింపు కోసం వలసపోయిన మహానుభావులు ఎందరో! ఆ వలసజాతి కాకర్లవారి వంశంలో సుస్వర జనసంగీత పునరుద్ధరణార్థమై భువికి దిగివచ్చిన అపర పరమేశ్వరుడు 'శ్రీరామ తారక మహా మంత్రోపాసన' మహిమతో అసంఖ్యాకంగా భగవత్ సంకీర్తనా సాహిత్యం సృజించిన కర్ణాటక సంగీత వైతాళికుడు  త్యాగరాజు. పద్దెనిమిదో శతాబ్ది పూర్వార్థంలో తంజావూరు సంగీత సాహిత్య క్షేత్ర వృక్షాల 'అంటు'గా ప్రవర్థిల్లిన 'త్యాగరాజం' అనే కొమ్మ వెదజల్లిన ఫలాలు, పుష్పాలు, బీజాలే నేటికీ మహావృక్షాలుగా ఎదుగుతూ నేల నలు చెరగులా పరిమళాలు ప్రసరిస్తున్నది.
సరిగమలతో పరిచయం ఉండని సామాన్యుడిని సైతం సమ్మోహనపరిచే ఆ సంగీత మాయావినోదం మూలాలు- రాగాలలో అంతర్లీనంగా ఒదిగుండే పదాల పొహళింపులో ఉంటుంది. పండితులు అంత వరకు తమ సొంత సొమ్ముగా భావిస్తూ వచ్చిన సంగీత సాహిత్యాలు రెండింటినీ తనదైన అజరామర సృజన ముద్రతో సామాన్యజన పరంచేసిన రాగ భగీరథుడు త్యాగరాజయ్యర్. 'ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ముగ్గురే కవిబ్రహ్మలు' అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ; తిక్కన, పోతన, వారిద్దరి తేటతనం, భక్త్యావేశాలను వాగ్గేయరూపంలో తేటపరిచిన  త్యాగరాజు. త్యాగయ్య పల్లవులు, చరణాల నిండా కండ గల కలకండ తెలుగు పలుకులే! నిత్య వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్న అచ్చతెనుగు పలుకుబడులను పునరుజ్జీవింపచేసిన త్యాగరాజుది భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సైతం వైతాళిక పాత్ర.  'సానుభూతి' అనే పదానికి సాధారణంగా మనం వాడే అర్థం 'జాలి'. 'త్యాగరాజు 'నగుమోము గనలేని'  అనే కీర్తనలో 'నా 'జాలి' దెలిసి నను బ్రోవగ రాద' చరణంలో ఆ పదం 'నిస్సహాయత' అనే అర్థంలో ధ్వనిస్తుంది. పాటకజనం నిత్యవ్యవహారంలో సన్నిహితులను చనువుతో పిలిచే విధంగా 'రారా మా ఇంటి దాకా' అంటూ మనసారా ఆహ్వానించడంలోని మర్మం; రాముణ్ని ఎప్పుడూ త్యాగయ్య మానవాతీతుడిగా భావించకపోవడమే! తెలుగు వాజ్ఞ్మయంలోని గేయ సంప్రదాయాన్ని స్వీకరించి ఉత్తమోత్తమమైన సంగీత సాహిత్యాలను సమపాళ్లలో ప్రజాబాహుళ్య ప్రయోజనార్థం మేళవించిన జనవాగ్గేయకారుడు త్యాగయ్య. అంతకు మించి  వైదేశిక రాటుపోట్లతో అగ్గలమయిపోయిన తెలుగువాణిని సముద్ధరించిన శుద్ధ భాషాసేవకుడు కూడా!

ఉపనిషత్తుల ప్రకారఁ అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం, ఆనందం - అనే అయిదు అంచల సోపాన మార్గాన మాత్రమే ఈశ్వర తత్వ సాధన సాధ్యమన్నది భారతీయ ఆధ్యాత్మిక  చింతన. త్యాగరాజస్వామి పంచరత్నమాల అంతస్సూత్రమూ అందుకు అనుగుణంగా సాగుతుంది. పరమేశ్వరాత్మతో తాదాత్మ్యత సాధించే నిమిత్తం సాధించవలసిన బ్రహ్మానందం కోసమై ఆలపించే 'జగదానందకారక' కీర్తన ఆలాపనకు మిగిలిన నాలుగు ఘనరాగరత్నాలను సోపానాలుగా ఆ రాగయోగి మలచిన తీరు నిరుపమానం! ఆనందమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల శుద్ధిని ఉద్దేశించి సృజించినవని ఘనరాగపంచరత్నాలను యోగ శాస్త్రజ్ఞులూ సమర్థిస్తున్నారిప్పుడు. రామకృష్ణుడు ప్రవచించిన సర్వమత సహన సూత్రాన్ని తన సంకీర్తనల ద్వారా లోకానికి ఎలుగెత్తిచాటిన మత సంస్కర్త త్యాగరాజస్వామి. రాగకళకు రాగద్వేవాలతో నిమిత్తం లేదని త్యాగరాజయ్యవారి శిష్యకోటిలోని ఆంధ్రేతరులు చాటిచెప్పే మాట.  'జయదేవుని కడ క్రోధమై రాధ చరణాలు-ముద్దుల మోళిపై మోసి మోసి/ అన్నమాచార్యుల సమక్షమందేడు కొండల- నొంటిగా కాపురముండి  యుండి/ క్షేత్రయ్య రసమయ్య క్షేత్రమున పలు నాయికల బిగి కౌగిళ్ల నలిగి నలిగి/ విసిగిపోయి సుంత విశ్రాంతి కోసమై- సీత తోడ అనుగు భ్రాత తోడ / విశ్వమయుడు ప్రభువు వేంచేసియున్నాడు- రాముండగుచు త్యారరాజు నింట' అంటారు కవి కరుణశ్ర్రీ! నిజానికి ఆ రామచంద్రుడు లౌకికమైన చీకాకులకు అలసి రవ్వంత సాంత్వనకై తపించే మనలోని ఆత్మారాముడికి ప్రతీక. 'ఇంద్రియ జ్ఞానానికి, ఆత్మానందానికి మధ్య స్థానాన్ని సంగీతం ఆక్రమిస్తుంది' అంటారు ప్రముఖ  ఆంగ్లకవి బ్రౌనింగ్. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ  'లోచెవి' కలిగిన సంగీత సాహిత్యశాస్త్రవేత్త కాగలిగేది. త్యాగరాజస్వామి అంతటి అదృష్టవంతుడు. ఆ స్వామి తెలుగువాడు కావడం తెలుగువాడి అదృష్టం. స్వామి 'తన్మయ సమాది' నుంచి తన్నుకువచ్చిన సంగీత ఝరిని దోసిళ్లకు పట్టి శిష్యులు స్వరసాహిత్యంగా పదిలపరచని పక్షంలో జాతికి ఈ మాత్రమైనా 'సుస్వర గంగ' సంప్రాప్తమైవుండేదా? ఎనభై ఐదేళ్లు అఖండంగా వెలిగిన ఆ త్యాగరాగజ్యోతి ఈ బహుళ పంచమి నాటికి 'నచ పునారావర్తి' పదవిని అలంకరించి 173 ఏళ్లు
(2020 నాటికి). ప్రతీ ఏటా జరుపుకునే త్యాగరాజ సంగీత ఉత్సవాలు వాస్తవానికి స్వర,సాహిత్యాలు రెండింటికీ జరిగే మహోత్సవాలు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయం 15 -12 -2012)

Thursday, October 24, 2019

తెలుగుకి ఢోకా లేదు! -కర్లపాలెం హనుమంతరావు






మన మాతృభాష తెలుగా? అబద్దం. మన మాతృదేవతలు పలికేది తెలుగేనా?!
అచ్చు తెలుగులో 'అమ్మా!' అంటే ఏ తల్లయినా  ఇస్తోందా బదులు? పుచ్చు ఆంగ్లంలో 'ఆంటీ!' అంటేనే ‘యాఁ’ అంటూ ఏ ముసలమ్మైనా కదులు! ‘అంకుల్’ అనకుంటే ఎంతటి క్లోజ్ చిన్నానైనా నెత్తికి పోస్తాడు కుంకుడు పులుసు!
సజీవ భాష అనగా నేమి?
నట్టింట్లో పద్దాకా తెగ వాగే టీ.వీ, అనుక్షణం చెవిలో మార్మోగే సెల్ జోరీగ, కంటిని ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మ.. బారిన పడి ఏ భాష  నలుగుచుండునో  అదియే  సజీవ భాష నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఏనాడో చచ్చినట్లు లెక్కేనా? అమంగళము ప్రతిహతమగు గాక. మరి తెలుగు మృతభాషయినచో అమృతభాష యేది గురువా? ఆంగ్లాంధ్రములు కలిపి పిసికిన  సంకర బంకరా శిష్యా!  తలకట్టు  ఒక్క మన తెలుగుకి మాత్రమే సొంతమైనట్టు  ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!   తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా! 
పూజా పునస్కారం ఆంగ్లాంధ్రమునకు! బడితె పూజా, తుస్కారం అగ్లీ ఆంధ్రమునకు! గుళ్లల్లో  సుప్రభాతానికి బదులుగా  'గుడ్ మాణింగ్' అంటేనేగా  ఆ గాడ్  గారి ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్కయ్యేది సర్వదా! 
వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో వాగితేనేనయా.. దండాలు.. దస్కాలు. సన్మానాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లంటూ గుణుస్తూ కూర్చుంటే  అర దండాలు.. కాళ్లూ చేతులకు అరదండాలు..ఛీఁ.. ఛీఁ  అంటూ చీత్కారాలు! తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతానికి మన  తెలుగుతల్లి బతుకీడుస్తున్నది!  ఉద్యోగం, ఉపాధి సంగతులు ఆనకరా ఢింబకా!  మనసు పడ్డ పాపను పడేసేందుకైనా నువ్ ప్రేమలేఖ ఆంగ్లమునే గిలకవలె మొలకా!  ఇంకేం చూసి  తెలుగు మీద మోజు పడాలిరా బళ్లకెళ్లే భడవాయలు అంతా? దొంగవెధవలకు మల్లే మెడల్లో పలకలు గంగడోళ్ళలా  వేలాడేసైనా సరే  బిడ్డలని లార్డు మెకాలే వారసులుగా మార్చేసెయ్యమనే కదా   మన టెలుగు మా.డా(మామ్.. డాడీ)ల సొద! పులులు, పిచ్చుకలు, దున్నపోతులూ అంతరించిపోతున్నంత చింతైనా లేదంటారా తెలుగు అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్ కాల్డ్ తెలుగు దుందుడుకు!
కాపాడే కంటి రెప్ప గొప్పతనం కన్ను గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు  అంతకు మించిన మహర్దశ సాధ్యపడుతుందా?
క్రియ తెలుగు వాక్యంలో చివరకు  రావడమే అన్ని లోకువలకు అసలు కారణం. అదే మరి  ఆంగ్లములో అయితేనో? కర్తా కర్మల మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని' అంటే వెనక్కు నక్కే తెలుగు తోడుగా ఉంటే   నీ జోడవుతుందన్న వెరీ బ్యాడ్  వెర్రి సెంటిమెంటబ్బా   తెలుగబ్బికి!  ఎంత పద, లిపి సంపద తెలుగు నాలుక చివర  పలుకుతుంటేనేమి? ఆంగ్లంతో  కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని ఉలుకు తెలుగు బోడికి.
గురజాడవారి గిరీశానికి ఈనాటికీ తెలుగ్గడ్డ మీదింత గ్లామరుందంటే కారణం?  పూనా ఢక్కన్ కాలేజీలో మూడు ఘంటల పాటు ఏక బిగిన బట్లరింగ్లీషులో  బాదేయగల గట్టిపిండం కాబట్టే! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించే లేటెస్ట్ సెంచరీ కదా ఇది! శ్రీనాథుడి చాటువులతో వేపుకు తిందామంటే  చెవులకు చేటలు కట్టెస్తారయ్యా కనక లింగం! బమ్మెర పోతనగారే..  ఆ అతి కమ్మదనం భ్రమల్లొ పడిపోయేసి అమ్మభాషలో భాగవతం  రాసి భగవంతుడికి అన్యాయం చేసేసాడు! వెరీ సాడ్! అదే ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని    ఆంధ్రాంగ్లంలోనైనా కుమ్ముంటే  భాగవతం ఈపాటికి లాటిన్ బైబిల్ తో గిన్నీస్ కు పోటీకొచ్చుండేది! 
వాడుక భాషంటే ఏమన్నా వేడుక భాషనా? వ్యవహార భాష.  ఇంద్రాసూయైనా సరే..   ఆంధ్రంలోనే యవ్వారం అని ఆనాడు చంద్రబాబు గాని   మొండికివేసుంటే   అన్ని కోట్ల పెప్సీప్లాంట్ల కేసు  పురిట్లోనే  సంధి కొట్టేసేది!  కేసీఆర్ సార్ తెలంగాణా భాషలో ఎంత మీసాలు తిప్పగల  మొనగాడవనీయి గాక ఒక్క తెలంగాణా యాసతోనే గావు గావు మంటే కెసి కెనాలు పనులు ఆగిపోయేవా?
ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుకు అంతలా అంకితమయిపోబట్టే  ఒక్క రాజమండ్రి బోర్డర్ భాష వరకే ట్రెండయిపోయాడు. అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు వదిలేసాడు  శ్రీరంగం శ్రీనివాసరావు. అందుకే   యుగకవిగా ఆయనకా గౌరవం .. సరే! కాసుల మాటేమిటి! ఆ గాసట బీసట తెలుగు ఘోషలు నమ్ముకోకుండా.. గామా, బీటాల్లాంటి కామన్ మ్యాన్ బుర్రకు కు బొత్తిగా ఎక్కని ఏ ల్యాటినాంగ్లంలోనో కూసుంటే! కాసులకసలు కరువుండేదా?   
అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని  తేడా పాడా లేకుండా ఏక మొత్తంగా వర్ణమాలను మొత్తం ఆంగ్లంతో కలిపి  రుబ్బి ప్రేక్షకుల మొహాన పేడకళ్లులా కొట్టేసే మన టీవీ యాంకరమ్మలకు, రేడియో జాకీ కుంకలకు, సినిమా రైటర్ బంకలకు నిండు మనసుతో గౌరవాభివందనములు! వైద్యం చేసే నారాయణులు, న్యాయం చెప్పే ధర్మ దేవతలు, బీదా బిక్కీలను సేవించుకునే సర్కారు బంట్లకు గొప్ప గౌరవం ఇవ్వక తప్పదు! డిస్సెంటు పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుగారు గొప్పా? న్డీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు వర్ణమాలకే  ఏక మొత్తంగా ఓ మూల  గోడ కుర్చీ వేయించిన  ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళ కెళ్ళే మన పిడుగుల తెలుగు తొక్కు పలుకుల ముందు..  గిడుగు రామ్మూర్తి పంతులుగారి  ప్రజ్ఞాపాటవాలు లెందుకు?  నేటి బుడుగుల  బడబడ ఇంగ్లీషు వాగుళ్ల వాగులో పడితే ఎంతటి భాషాగజీతగాడు విశ్వనాథవారైనా బుడుంగుమని మునిగాల్సిందే!
కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు. కాబట్టే చెవి కంతల కంత  కర్ణకఠోరం!  ఆంగ్లవాసన సోకనందుకే నాట ఓ శోకరసం! అన్నమయ్య సంకీర్తనలంటే తెలుగు నా! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే..  ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం. ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికి ఫిదా అయి కనక గండపెండేరం కాలికి తొడిగారు! ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషై ఉంటేనే తెలుగులో ఒన్సుమోర్లు మార్మోగేది!
తుమ్ము. దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా  ఆంగ్లయాసలో ఉంటేనే ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదిక్కడ.
ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా  పనికివస్తుందా అన్నది పెద్ద ప్రశ్న!
పొట్టకోసినా తెలుగక్షరం ముక్క ఒక్కటైనా  కనపించనోడే తెలుగువాడికి ఇవాళ  తలమానికం! పచ్చడి లేకుండా ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం  లేకుండా  తెలుగుముక్కంటే చచ్చే చావే తెలుగువాడికి!  తెలుగిది కేవలం ప్రాచీన హాదానే. ఆంగ్లానిది అధునాతన  హోదా!
ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో సాగిస్తే చాలు.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి మందని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడు.  అంత కష్టం కూడా పడడానికి ఇష్టపడడు.  సొంతగడ్డమీద ఉంటూనే మాతృభాషని ఆంగ్లంలా మాట్లాడేసి ఆటోమేటిగ్గా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!
తెలుగు  పుచ్చిపోయిందనో.. చచ్చిపోతుందనో కన్నీళ్ళు పెట్టుకునే తిక్కన్న వారసులకు చివరగా ఒక మాట! తిట్లున్నంత కాలం తెలుగుంటుంది. ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డల మీద వర్ధిల్లాలని  ప్రార్థిస్తామంటారా! సరే మీ ఇష్టం! సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకోండి. తెలుగూ దానితో పాటే దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో కనీసం తిట్ల రూపంలోనైనా!
-కర్లపాలెం హనుమంతరావు
25 -09 -2019
***
(సూర్య దినపత్రికలో ప్రచురితం)

Wednesday, June 13, 2018

కలకండ పలుకు- తెలుగు పలుకు


'కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!’
అంటూ మహా అతిశయోక్తులు ప్రదర్శిస్తాడు! 
రాజుగారి కీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడం వల్ల పక్షులన్నీ హంసల్లాగా  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షుల ముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  చల్ల  సాయం తీసుకోవాల్సి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  ఏ సముద్రం గడ్డకడుతుందో అదే   తన పడక గల పాలసముద్రం అవుతుందనిట  పరమాత్ముని ఈ ప్రయోగం!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించవలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండ అవుతుందని ఈశుని ఈ విచిత్ర పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనే ఇంత దయనీయంగా మార్చివేసాయి భోజరాజు వంటి గొప్ప మహారాజు కీర్తికాంతులని కాళిదాసు  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం. రాసినవాడు అక్షరసిరి  కాళిదాసు కాబట్టి ఎంతటి  కల్పన అయితేనేమి.. అత్యంత రమణీయంగానే ఉండక తప్పదు! కాళిదాసు ప్రతిభకు సంస్కృతం శోభా తోడయిందని పండితుల గొప్పలు! ఒప్పుకుంటాం కానీ.. మరి మన తెలుగు తీయందనంలో భాషా దేవభాషకు ఏం తీసిపోయేది కాదు. ఈ తెలుగు పద్యం చూడండి!
వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు- జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు- నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియు- మేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును’
అంటూ మన తెలుగు కవి కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఓ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులు కూడా దెవేంద్రుడి ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం, నీలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండల కూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో మెరిసి  పోతున్నాయనడం,  శ్యామల వర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ శరీరకాంతితో పోటీకి దిగుతున్నాయనడం, హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం,  నదులు సర్వస్వం క్షీరసాగరానికి మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని వర్ణించడం,  వివిధ జాతుల  పక్షులన్నీ రంగులతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అతిశయోక్తులు పోవడం..  ఆహాఁ..మన తిమ్మకవి తెలుగు మాత్రం కమ్మదనంలో  కాళిదాసు సంస్కృతానికన్నా  ఏం తక్కువగా తీసిపోయింది?
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో ముక్కి ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవి శ్రేష్టతకు గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే  ఈ కమనీయమైన కల్పనలన్నీ!
అదంతా నిజమయితే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఇమిడి ఉంది. నిశితంగా గమనించి చూడండి! ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో  రసవంతమైన శైలిలో  రాయడంలోనే కవి నిఖార్సైన ప్రతిభ దాగి ఉంది!
పసిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా!
మన మాతృభాషను చులకన చెయకండి! అంతర్జాతీయంగా అదే మన ప్రాంతీయతకు  గొప్ప గుర్తింపు!
***
-కర్లపాలెం హనుమంతరావు
12 -06 -2018

Wednesday, June 6, 2018

గతం ఘనం – ప్రస్తుతం సతమతం – మన తెలుగు




బుద్ధుడి బోధనలు సాగింది  పాలీ భాషలోనో, అర్థ మాగధి భాషలోనో.. మొత్తానికి ఆ భాషలో తెలుగు పదాలు కొన్ని(సుమారు 60) కనపడుతుంటాయంటారు. మనం ఇప్పటికీ వాడుతున్న అనేక తెలుగు పదాలు బుద్ధుని కాలంలో దైనందిక జీవితంలో వ్యవహారంలో ఉండేవని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు తన 'తెలుగులో పాలీ పదాలు' పుస్తకంలో పేర్కొన్నారు.
పైశానీ భాషలో కూడా తెలుగు పదాలు ఉన్నాయని తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. బౌద్ధ కొరియా యాత్రికుడు ఒకాయాన ఆరో శతాబ్దంలో చైనా, ఆఫ్ఘనిస్తానుల మీదుగా వచ్చి ఈ దేశంలో  కైబర్ కనుమల నుంచి మన నాగార్జునకొండ వరకు పర్యటించి వెళ్లాడు. ఆయన తనకు తెలిసిన ప్రాకృతం మాట్లాడినా ఆంధ్రదేశంలో ఎక్కడా ఇబ్బంది కలుగలేదని రాసుకున్నాడు! ప్రాకృత శబ్దం మన తెలుగు భాష పూర్వ రూపానికి దగ్గరగా ఉంటుందని  తిరుమలవారి థియరీ. 
సుమేరియన్ భాషలోనూ తెలుగు పదాలు ఉన్నాయన్నట్లు శ్రీ రాంభొట్ల కృష్ణమూర్తి ఏదో సందర్భంలో రాసినట్లు గుర్తు. ఆయన దగ్గర సుమేరియన్ భాషాకోశం మొదటి భాగం ఉందిట. (మొత్తం నలభై భాగాలు). తుర్కీ నుంచి గంగామైదానం వరకు ఏదో ఒక ఉమ్మడి నాగరికత ఒకానొక కాలంలో విలసిల్లినట్లు రాంభొట్ల అభిప్రాయం! భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజం. సుమేరియన్ల .. మన భాషల మధ్యా ఆ తరహా  ఇచ్చిపుచ్చుకోవడాలు  జరిగివుండవచ్చని కృష్ణమూర్తిగారి  ఆలోచన.
ఇప్పటి బోధన్.. ఒకప్పటి సోదనం. ఏదో పెద్ద విశ్వవిద్యాలయ ప్రాంతం కూడా అప్పట్లో. 'బావరీ' గోత్రానికి చెందిన పెద్దాయనెవరో దానికి అధిపతి. అది బుద్ధుడు జీవించి ఉన్న కాలం. తధాగతుణ్ణి కలుసుకొనేందుకు సుమారు ఓ వెయ్యి మంది బావరీ పెద్దాయన శిష్యులు రాజగృహం (పాటలీపుత్రం) పర్యటించారు. ఆ బృందంలో అదృష్టవశాత్తూ ఒక చిత్రకారుడూ ఉన్నాడు. బుద్ధుని బోధనలు సాగుతున్న సమయంలో తెర వెనక నుంచి అతగాడు ఆ శాంతమూర్తి బాహ్యరూపం (ఔట్ లైన్)  గీసుకున్నాడు. తరువాతి సిటింగులో కన్నూ, ముక్కూ, చెవులూ.. వంటివి గుర్తుంచుకొని తీరిగ్గా చిత్రం పూర్తిచేయాలని ఆలోచన. ఆ చిత్రకారుడు అనుకొన్నట్లే జరిగింది.. కానీ కొద్ది తేడాతో! తధాగతుడి బాహ్యాకారాన్ని యథాతధంగా ఉంచి ఏ ప్రాంతానికి చెందిన శిల్పులు ఆ ప్రాంతానికి చెందిన మనిషి ముఖకవళికలతో బుద్ధమూర్తిని చిత్రించుకొన్నారు! చైనా, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, బర్మా, ఇండోనీషియా, భారతదేశాలలోని బుధ్ధవిగ్రహాలు ఆయా దేశవాసులను పోలివున్నా.. బాహ్యరూపం మాత్రం మన  చిత్రకారుడు సమకూర్చిన విధంగా  ఉండటం తెలుగుజాతికి గర్వకారణం.
బుద్ధుని విహార(బిహార) భూమిని తెలుగునేలకు తరలించిన ఘనత తెలుగువాడిది. బుద్ధుని విచారధారను బావరీ విశ్వవిద్యాలయ విచారధారగా మార్చుకున్న మేధస్సూ మన తెలుగువాడిదే.
శ్రీ పర్వతం తూర్పునున్న ఓ కుగ్రామం నాగార్జునుడి జన్మస్థానం అని ఓ నమ్మకం. అద్వైతం, మాయావాదం, నేతివాదం, అవతారాలుగా నేడు ప్రచారంలో ఉన్న హైందవ భావజాలానికి ఆ ఆచార్యుడి  అద్వం, శూన్యం, విజ్ఞానం, బోధిసత్వం ప్రభృత భావాలే మూలాలు. బౌద్ధం మహాప్రచారంలోకి వచ్చి మహాయానంగా వృద్ధిపొందిందీ మన  ఆచార్యుడి ఆధ్వర్యంలోనే! నాగార్జునుడి కొత్త ఆలోచనలకు పురిటిగడ్డ   తెలుగుభూమి! నాగార్జునుడి 'సృహుల్లేఖ' (స్రిహిల్లేఖ అని కూడా అంటారు) శాతవాహనులతో ఆచార్యునికున్న సాన్నిహిత్యం తెలియచేసే పత్రం. బౌద్ధులు కాకున్నా శాతవాహనుల నీతిపాలనకు, నేర నిరోధక చర్యలకు  బౌద్ధధర్మమే కేంద్రబిందువయిందని పరిశోధకుల మాట. దేశంలోని అధిక భాగాన్ని ఏలిన ఈ తెలుగు ప్రభువుల పాలనలో తెలుగువారి ప్రభ సహజంగానే దేశమంతటా వెలుగులు విరజిమ్మింది. పాటలీపుత్రంలో 'ఆంధ్రభృత్యులు'గా పేరొందిన శాతవాహనులలో సిముక సాతవాహనుడు దక్షిణాపథాన స్వతంత్రంగా రాజ్యమేలిన తెలుగు చక్రవర్తి. పాటలీపుత్రపు  పండితులు రాసిన పురాణాలలో 'అంధ్రుల' వంశావళి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తదనంతరం వచ్చిన ఇక్ష్వాకులూ తెలుగు రాజులే. ఆ ప్రభువులు పాలించిన భూమి విస్తృతమైనది కాకపోవచ్చు.  కానీ సృష్టించిన శిల్పసంపద  అపారమైనది. ఇప్పటికీ తెలుగువాడలలో కనిపించే ఆ శిధిల శిల్పకళల ఆధారంగానే మాన్యులు కె.కృష్ణమూర్తి ఆనాటి ఆటపాటలు, వేషభూషణాలు, సాంఘిక పరిస్థితులను గూర్చి ఆసక్తికరమైన గ్రంథాలెన్నో ప్రచురించారు. శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటి సాహిత్యం, శాసనాలు తెలుగు ప్రాకృతంలో కనిపించడం తెలుగువారికి గర్వకారణం.
తెలుగు నడిగడ్డ మీద వెలసిన శ్రీ పర్వతానికి దేశ విదేశాల నుంచి బౌద్ధులు, పండితులు విచ్చేసేవాళ్లు. అక్కడ ఒక మహావిశ్వవిద్యాలయం విలసిల్లింది కూడా. మహాయానమే కాదు.. వజ్రయానమూ ఇక్కడి నుంచే ప్రపంచం నలుదిక్కులకూ వ్యాపించిందంటారు. ఇప్పటి  టిబెట్టులో వర్ధిల్లుతున్నది ఈ వజ్రయానమే.  టిబెట్టుకీ తెలుగు గడ్డకి బౌద్ధం ఒక ఆధ్యాత్మిక బంధం.   
ఒకానొక కాలంలో ఆంధ్రదేశానికి నౌకావ్యాపారం ప్రధాన ఆదాయ వనరు. దేశదేశాల నుంచి వ్యాపారులు వచ్చి సాగించే బేరసారాలకు  వ్యావహారిక భాష  తెలుగు ప్రాకృతమే.
ఇక్ష్వాకుల కాలంలో 'శైలీయులు' బౌద్ధంలో ఒక ప్రత్యేకశాఖ. ఇండొనేషియాలో రాజులుగా వర్ధిల్లిన శైలేంద్రులు ఈ  శైలీయశాఖా సంబంధితులే కావచ్చని ఒక విశ్వాసం.
తెలుగు  ప్రాకృత సాహిత్యాన్ని విదేశీయులు .. ముఖ్యంగా జర్మనులు  సొమ్ము చెల్లించి మరీ కొనుక్కుపోయేవారు. ఇప్పటికీ జర్మనీలో పది పన్నెండు విశ్వవిద్యాలయాలు ఈ ప్రాకృతభాష మీద పరిశోధనలు కొనసాగిస్తున్నాయ్.
జైన ధర్మం, తెలుగు భాష మధ్య గల బంధం దృఢమైనది. జైనులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతీయ భాషలను క్రమబద్ధీకరించేందుకు తగుసూత్రాలను రూపొందించారు. సామాన్యులకు చదువు సాములు నేర్పించారు. గణితవిజ్ఞానం  బడుగులకు చేరువయింది జైనుల పుణ్యం వల్లే! జైనంతో సాహచర్యం వల్ల సమాజానికి ఆ ధర్మం పట్ల విశ్వాసం వృద్ధి అయింది. ఆలయాల్లో  గీతాలు పాడేవాళ్ళు జైనులు. ఆ గీతాలే ఇప్పుడు నాటి మన  తెలుగు భాషాచరిత్ర ఆనవాళ్ల పరిశీలనకు ఉపకరిస్తున్నాయి. బౌద్ధులూ ప్రజల చదువు సంధ్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన బుద్ధిజీవులే. జైనులు, బౌద్ధులు ఆంధ్రదేశంలోని శిల్పకళకు కొత్త హంగులు తీర్చిదిద్దిన  కళాకారులు, కళాపోషకులు. బౌద్ధులు బోధిసత్వుని కథలను  నిరంతరాయంగా పారాయణం చేయడం ద్వారా  ప్రజలలో  పఠనాసక్తి  పెంపొందించినట్లు పరిశోధకుల మాట.
బౌద్ధం కారణంగా ప్రపంచానికి ధర్మకేంద్రంగా వర్ధిల్లిన ఘనత మన తెలుగు గడ్డది.  సన్యాసులకు, బ్రహ్మచారులకే పరిమితం అనుకున్న బౌద్ధాన్ని  సంసారులూ ఆచరించదగ్గ ధర్మంగా ఆచార్య నాగార్జునుడు తీర్చిదిద్దాడు.  ఆంధ్రదేశంలోని జైనులూ ఆ మార్గంలోనే సాగి తమ వంతు బాధ్యతగా సామాజిక సంస్కరణలకు పూనుకున్నారు. శ్వేతాంబరులకు, దిగంబరులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన యూపనీయులు తెలుగుజాతికి చెందిన వారేనని ఒక విశ్వాసం.
బాహ్యుబలి లాంటి భారీ విగ్రహాలు బోధన్ కేంద్రంలోనూ తెలుగువాళ్లు ప్రతిష్టించుకొన్నట్లు వినికిడి. జైన, బౌద్ధ మతాలలో భారీ విగ్రహాల ప్రతిష్టాపన ఒక ఆచారం. కక్షల కారణంగా అన్యమతస్తులు ఆ అఖండ శిల్పకళా వైభవాన్ని ఖండ ఖండలు చేయడం అన్యాయం. తెలుగునేల మీద ఊళ్ల పేర్ల పరిశోధనలకు పూనుకుంటే ఆ స్థలపురాణాల చాటున బోలెడంత తెలుగువాళ్ల చరిత్ర బైటపడుతుంది.
శాతవాహనుల తరువాత కొంత భూమిని  ఏలిన విష్ణుకుండినులకు నేటి నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరం రాజధానిగా ఉండేది. విష్ణుకుండినులు తమ పేరుకి 'ఇంద్రపాల్' అనే బిరుదును చేర్చుకొనే ఆచారం పాటించేవాళ్ళు. ఆ ఇంద్రపాలనగరం ఇప్పుడు  తెలంగాణాలోని ఏ ప్రాంతంలోదో? విష్ణుకుండినుల రాజవంశానికి చెందిన శాసనం ఒకటి బి.ఎన్.శాస్త్రిగారి పరిశోధనల్లో బైటపడింది కానీ నాటి ప్రాంతాల వివరాలు, ఆ రాజుల పాలనా ప్రాముఖ్యాలు వెలుగులోకి వచ్చే తీగెలేవీ ఆ పరిశోధన డొంకలో తగిలినట్లులేవు. డాక్టర్ అజయ్ మిత్రా చేసిన కొంత కృషి మినహా.. ఆ దిశగా  మరి దృష్టి మళ్లించిన పరిశోధకులు కరువయ్యారు! ఏదేమైనా నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం పురిటిల్లుగా మారడం ప్రతీ తెలుగుబిడ్డా ఎలుగెత్తి చాటవలసిన అంశం.
ఎవరు ఈ దేశంలో ఎక్కడ  పరిశోధనలకు పూనుకున్నా తెలుగువారికి సంబంధించిన చారిత్రకాంశాల  లింకులు కొన్నైనా తప్పక   బైటపడతాయి! దేశరాజధాని దిల్లీ తుగ్లకాబాదు ప్రాంతంలో ఒక ఆంధ్ర  ప్రముఖుని గోరీ కనిపిస్తుంది.  తుగ్లకుల ప్రధాని మాలిక్ మక్బూల్ సమాధి అది. ఆ ప్రముఖుని అసలు పేరు 'గన్నయ్య'! కాకతీయుల ప్రధానిగా ఆయన చాలా ప్రయోజకుడంటారు చరిత్రకారులు.
చరిత్ర పట్టం కట్టిన కుతుబ్ షాహీలు నిజానికి సొంతంగా ఏమంత ఘనకార్యాలు చేసిందిలేదు. పదవులను వేలం వేసి అమ్ముకునే పూర్వపు వ్యాపార ధోరణిని మానిపించి, సమర్థతను బట్టి నియమించడం, వారికీ వర్తించే విధంగా నియమ నిబంధనల రూపొందించడం ఆ వంశం చివరి పాలకుడి పాలనా సంస్కరణగా చరిత్ర శ్లాఘిస్తుంది.వాస్తవానికి ఆ సలహా పాదుషాకు ఇచ్చింది అతని ప్రధాని మాదన్న. మాదన్న తెలుగువాడు కావడం తెలుగువారికి గర్వకారణం.
సంస్కృతంలో పంచకావ్యాలకు  సుబోధకమైన  వ్యాఖ్యలు రాసిన  వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథసూరి మన మెదక్ జిల్లా కొల్చారంలో పుట్టిన  తెలుగు బిడ్డ. ‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’(మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను) అంటూ తన  రచనా సరళి గురించి  సగర్వంగా ప్రకటించుకున్న ఆ తెలుగు పండితుడి వ్యాఖ్యల సాయం  లేకుండా  సంస్కృత కావ్యాల పఠనం అంగుళమైనా ముందుకు సాగదు.
దేశదేశాల సంగీత విద్వాంసులు తన్మయత్వంతో ఊగిపోతూ స్వరార్చనచేసే త్యాగరాజస్వామి అరవదేశానికి తరలి వెళ్ళిన  మన తెలుగు తల్లి ఈత!
తెలుగు పండితులకు పొత్తాలకు పొత్తాలు వివరాలు నమోదు చేసే ఓపిక బొత్తిగా లేదన్న అపవాదు కద్దు. అందుకు విరుద్ధంగా మానపల్లి రామకృష్ణకవి పరిశోధనారంగంలో తన అసమాన ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించిన విద్యావేత్త. భాండార్కర్, ఆప్టే, రనడే, సంపుర్ణానంద్, మజుందార్ వంటి ఉత్తమశ్రేణి పరిశోధకులతో పోల్చదగిన ఆ పరిశోధక విద్వాంసుడు ప్రతీ తెలుగువాడికీ గర్వకారణం.
సంస్కృతాన్ని జాతీయయభాషగా ప్రకటించాలని బెల్గాం జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పట్టుబట్టిన కావ్యకంఠ శ్రీ గణపతి ముని తన పదో ఏట నుంచే బహుళ కావ్య రచనావతంస, నిరంతర పరిశోధక జిజ్ఞాసి. భారతీయ సంకీర్తనం అయనంతగా చేసిన వేదపండితుడు దేశం మొత్తంలోనే దొరకడు. ఆ సంస్కృతాంధ్ర మహాపండితుడూ  తెలుగుతల్లి నోముల పంటే!
వేదకాలపు సంస్కృతం పరాయి భాషలకు పదాలు పంచిపెట్టింది.  లౌకికభాష పేరున ఇతర భాషల  నుంచి తానూ పదాలు స్వీకరించింది. సంస్కృతంలో చాలా తెలుగు శబ్దాలు ఈ విధంగా చేరేందుకు ఆస్కారం ఉంది. 'తెలుగులో సంస్కృత పదాలు ఎందుకు వాడాలి?' అని మొండిగా వాదించే ప్రబుద్ధులు కొందరు అచ్చు తెలుగు పేరుతో  వికార శబ్దఘోషకు తెగబడడం విచారకరం. సంస్కృతం పేరుతో చలామణీ అయ్యే పదాలు ఎన్నో  తెలుగు ప్రాకృతాల నుంచి ఎగుమతి అయిన శబ్దభవాలేనని ఎంత తొందరగా  పెద్దలు  గ్రహిస్తే తెలుగు భాషకు అంత మేలు! సంస్కృతం ఏ రాష్ట్రానికీ చెందిన  ప్రాంతీయభాష కాదు. అది అఖండ భారతావనికి  చెందిన వాఙ్మయ సంపద. అందులో తెలుగుకూ సింహభాగం అధికారముంది.
దాదాపు రెండువేల ఏళ్ల కిందటే బౌద్ధ సాహిత్యం  తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమయింది. నాటకాలూ వేసేవాళ్లు ఆయా భాషల్లో. అప్పట్లో ఎవ్వరూ 'జననీ తమిళ భాషా' అని నినాదాలు చెయ్యలేదు. 'అవునవును' అంటూ ఏ తెలుగువాడు చప్పట్లు కొట్టిందీ లేదు.
కాలప్రవాహంలో కనుమరుగయిపోవడం  ఇతిహాసం సహజ లక్షణం.  వీలున్నంత  వరకు అందుకే దార్శనికులు చరిత్రగా దొరికిన విశేషాలను నమోదు చేస్తుంటారు.  తెలుగునాట ఈ తరహా చారిత్రిక జిజ్ఞాస  మొదటి నుంచీ కాస్త తక్కువే. కాబట్టే  తమవారు నడిచిన వచ్చిన దారుల్లో వారి అడుగుజాడల ఆనవాళ్ళు పట్టేందుకు తెలుగువాడు ఈనాడు ఇంతలా ప్రయాస పడుతున్నాడు.
ఈ దేశాన్ని తెల్లవాళ్లు పాలించే రోజుల్లో బ్రిటన్ నుంచి దిగివచ్చిన దొరలకు ఇక్కడి భాష, సంస్కృతల గురించి  ప్రముఖులు అవగాహన కల్పించే పాలనావిధానం అమలులో ఉండేది.  ఆ విధంగా ఉపన్యసించేందుకని వచ్చిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్  ఒక సందర్భంలో ఆర్య.. ద్రావిడ 'జాతుల'ను గూర్చి ప్రసంగించి వెళ్లిపోయాడు. కొంత కాలం తరువాత మరోసారి ఉపన్యసించడానికని వచ్చినప్పుడు గతంలో తాను చేసిన  పొరపాటున సరిదిద్దుకొనే ప్రయత్నం చేయబోయాడు. ఆర్య.. ద్రావిడ వైరుధ్యాలని   'జాతుల' మధ్య వైరుధ్యాలుగా తాను పొరపడ్డానని.. నిజానికి అవి 'సంస్కృతుల' మధ్య సంభవించిన వైరుధ్యాలని సరిదిద్దుకొనే ప్రయత్నం అది. 'ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవడం కుదరదు' అన్నది ఇక్కడి దొరతనం. కారణం..  అప్పటికే ఇక్కడి అమాయక  భారతీయులని ఆర్య.. ద్రావిడ 'జాతులు'గా పాలకులు తమ పాలనా సౌలభ్యం కోసం  పూర్తిగా విడగొట్టేసేయడం!  విజ్ఞానశాస్త్రం కానీయండి, సంస్కృతులు కానీయండి, భాషలు కానీయండి.. రాజకీయాలకు విడగొట్టరానిదంటూ ఏదీ ఉండదుతమకు గిట్టుబాటు వ్యవహారంగా ఉండాలి.. అదే ప్రధానం
ఈ దేశంలోని చాలా ప్రాంతీయభాషలు ఆనాటి  విభజన రాజకీయాల మూలకంగా  ఇవాళ ఎన్నో విధాలా నష్టపోయాయి!  ఎక్కువ నష్టం దక్షిణాది భాషలదయితే.. వాటిలో  అత్యధిక నష్టం తెలుగు భాషది. ఎవరినో నిందించడం ఎందుకు? తెలుగు భాష నేటి దైన్యస్థితి తెలుగువాడి స్వయంకృతం.
తెలుగువాడు ఈ దేశం  గడ్డ మీద ఎన్నో  శతాబ్దాల బట్టి వివిధ రాజ్యాలు చలాయించిన మొనగాడు. ఘనమైన మన గతం అవగతం కాకే  భాష వాడకం మీదింతలా  సతమతం ప్రస్తుతం. తెలుగు చరిత్ర మీద చిన్నచూపు. ఇకనైనా సరిదిద్దుకుందామా.. కనీసం పదిమంది మధ్య పరువుగా నిలబెట్టే ఆత్మసమ్మానానికైనా!
***
-కర్లపాలెం హనుమంతరావు
06 -06 -2018
(భారత ఇతిహాసంలో ఆంధ్ర దేశం - జి.కృష్ణ- ఆంధ్రప్రదేశ్ - ఏప్రిల్ 1994 సంచిక- పు.13 -16- వ్యాసం ప్రేరణతో}



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...