Showing posts with label Sutti Mettamga. Show all posts
Showing posts with label Sutti Mettamga. Show all posts

Friday, February 16, 2018

'కత'లరాయళ్ళు!- ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం






 ‘ 'స్టోరీ టెల్లింగు' స్టోనేజీనుంచి వికసిస్తూ వస్తున్న కళ. మనిషికీ మిగతా జంతుజాతికీ మధ్యగల పెద్ద వ్యత్యాసం ఈ కథలల్లడంలోనే ఉంది. గొడ్డూగోదాకి అడ్డమైన గడ్డీ మేయాలన్న యావ ఉండదు. అడ్డదారిలో వెళ్లైనా గద్దెలెక్కాలన్న కసి ఉండదు. కనక  కతలు చెప్పుకు తిరగాల్సిన ఖర్మలేదు. పురుగూ పుట్రకి నాలుగ్గింజలు నోటికందితే రోజు గడిచిపోతుంది. కాబట్టి పిట్టకథలు చెప్పుకొనే దుర్గతి పట్టదు.'
మనిషి జన్మకలా కుదరదురా అబ్బీ! చేతకన్నా ముందు కతల్చెప్పడం వచ్చుండాలి.  కష్టం తరుముకొచ్చినా.. దుఃఖం తన్నుకొచ్చినా.. ఉద్వేగం ముంచుకొచ్చినా.. ఉత్సాహం ఉరకలెత్తినా.. కోతులైతే గంతులేస్తాయి. పాములైతే కోరలు చాస్తాయి. పిట్టలైతే పిచ్చిపిచ్చిగా కూస్తాయి. పులులుకా గాండ్రింపులు, ఏనుగులుకీ ఘంకరింపులు కథలు చెప్పే కౌశలం పట్టుపడకే! మనిషొక్కడే తనక్కావాల్సినంత  విషయాన్నికావాల్సినంత మోతాదులో కథావిశేషంగా మలిచి మరీ  బురిడి కొట్టించ గలిగేది.  అలా కొట్టించే విద్యలో ఆరితేరితేనే వాళ్లే రాజకీయాల్లో రాణించేది. దాన్నీ నువ్వు ఈసడిస్తే ఎట్లారా?
బాగుంది బాబాయ్! రాజకీయాల్లో కథనకౌశలం కరువైతే కరుణవాదం ఫలించదనా! కహానీలు  కుదరకుంటే సహోదరత్వం రాణించదనా! కథలు వండే కళ ఎంతలా  వంటపడ్డకపోతే    ఎన్నికల జాతర్లప్పుడు  నేతలు పోతురాజులకు మించి హారతలు పట్టించుకోగలరు?! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదని మహాఘనంగా కతలు చెప్పుకొంటున్నాం గదా! అంటే మనమెన్నుకుంటున్న నేతాశ్రీల బుర్రల్లో అంతలా సృజనాత్మకత సుళ్లుతిరుగుతుందనా అర్థం?’
 ఆ ఎద్దేవానేరా వద్దనేది! రాజకీయాల మీదేనా రాళ్లేసేదీ?'
మరేం మనమంటావ్ చెప్పు బాబాయ్! మంట పుడుతుంటేను ఇక్కడా! ఇవాళా రేపూ కథలు 'రాయని భాస్కరుల'ని కనిపెట్టడమే మా కష్టంగా ఉంటేనూ! అంతరించిపోయే జాతుల్లో కాకి.. పిచ్చుకల్లాంటివి ఏవేవో ఉంటున్నాయని ఊరికే ఆందోళన చెందుతున్నాంగానీ..  కట్టుకతలు చెప్పి నెట్టుకొచ్చే సజ్జు  మాత్రం అంతకంతకూ పెరిగిపోతోందని కంగారు మాత్రం ఎవరం పడ్డం లేదు! రకరకాల కాలుష్యాలు పెచ్చుమీరుతున్నయని  ఆ మధ్య వందలొందల  దేశాలా పేరిస్ లోనో ఎక్కడో  అంతలా బుర్రలు బద్దలు కొట్టేసుకున్నాయి కదా! వాటి వేటికీ ఈ కతల బాపతు హానికరజీవులపైన కన్ను పడలేదు.. ఖర్మ!
మన గురుజాడగారి గిరీశం వారసులెవరన్నా అక్కడా చేరి అసలు విషయాన్నేమైనా పక్కదారి పట్టించారంటావా?!
డౌటా! ఈ కతలరాయళ్లతో వచ్చే చిక్కేఅది.  మనకు తెలీకుండానే వాళ్ల  వ్యూహాల్లో చిక్కడిపోతుంటాం!  తనను  సృష్టించిన  గురుజాడనే పెడదారి పట్టించిన ఘనుడు గిరీశం. ఆ గిరీశానిక్కూడా గాడ్ ఫాదర్లాంటి ఘనులు  తయారవుతున్నారు కదా  రాజకీయాల్లో ఘనపుటడుక్కి ఓ పదైదుగురు లెక్కన? కుంటికథలు చెప్పుకుంటూ ఊరేగే వాళ్లకు అస్సలు గుడ్డిగవ్వంతైనా  విలువ ఇవ్వకూడదు బాబాయ్ నన్నడిగితే !
'ఇప్పుడిస్తున్నారనేనా? ఎందుకురా నీకా ఏడుపు?    
ఏడవక ఇంకేం చెయ్యగలం బాబాయ్ మా బోటి బక్కోళ్లం!  టూ మినిట్స్ లో తయారయ్యే నూడీల్లో నిజంగా అన్నేసి హానికారక  పదార్థాలున్నాయా' అనడిగమా ఆ మద్యన!  రెండు రీములకు సరిపడా నవల  వినిపించిందో తయారుచేసే కంపెనీ! 'కట్టుకున్న దౌర్భాగ్యుడు  కదా! అంత కర్కశంగా పొట్టనెట్లా  పెట్టుకొన్నావమ్మా!  అని ఓ మహాతల్లిని  విచారించిందీ మధ్య మీడియా! అలవాటైన అంతర్జాతీయస్థాయి  అత్యాచారం కథ వినిపించేసింది! లక్షలు కోట్లు గడించిన బడాబాబుల బ్యాంకప్పులకు మాఫీ లవసరమా? అనడిగి చూడు!  ఊకదంపుడు కతలు  ఆపకుండా ఊరుతాయి చట్టసభల బావుల్లో! ఐపిఎల్ వంకతో విచిత్రమైన ఆటొకటి కనిపెట్టి  పిల్లకాయల జేబులు కొల్లగొట్టిన లలిత్ మోదీ గుర్తున్నాడా బాబాయ్?  అప్పనంగా బొక్కేసిన  సొమ్ముకు లెక్కలడిగితే ఎక్కడెక్కడికో పోయి దాక్కున్నాడా?'
'దాక్కునుంటే కథేముందిరా బాబీ! ట్విట్టరు ఖాతా సాక్షిగా రోజుకో ట్విస్టిచ్చే కథ ప్రచారంలో పెట్టి మరీ  పార్లమెంటు మొత్తంతో పేకాటాడేసుకొన్నాడు! దటీజ్ రియల్లీ గ్రేట్!'
' అది గ్రేటా?! జనం మర్చి పోయిన నేతాజీలను గూర్చి  తాజాగా తయారయే కతల మాటో మరి?’ 
'కథలు చెప్పడం కవుల పనేరా! ఒప్పుకుంటాను.. నిజమే!  కానీ ఆ కర్తవ్యం ఏ కవులూ సాకారం చేయడం లేదే! నాయకులే పూనుకొని కథాసాహిత్యానికి న్యాయం చేస్తున్నర్రా బాబూ? మెచ్చుకోకపోతే మానె.. ఈ నొచ్చుకోడాలేంటంట.. విచిత్రంగా!'
'చిత్రంగా ఉన్నాయ్ బాబాయ్  నీ మాటలు! అడ్దదారిలో గద్దెలెక్కిన కుర్ర కుంకలు వాళ్ల వాళ్ల వంశ చరిత్రలను గూర్చి  చెప్పుకొంటున్న పురాణాలు వింటూనే..'
' కన్నవారిక్కాక పక్క పార్టీ కాకాకు వన్నె తెచ్చేందుకా  బిడ్డలు  కతలు చెప్పేది? కాక ఎక్కువైనప్పుడు ఏవో రెండు మూడు కబుర్లు  శృతి మించే వీక్ నెస్ శ్రీనాథుడంతటి కవిసార్వభౌముడికే  తప్పింది కాదురా! అంత మాత్రానికే పాపం కాకమ్మ కథలు చెప్పేవాళ్లని  కేకిరించడమేంటంట? 'కదిలేదీ.. కదిలించేదీ.. కావాలోయ్ నవకవనానికి' అని  మీ  మహాకవి కదా కవిత్వాన్ని గురించి   కలవరించిందీ!’
అహాఁ! అందుకేనా.. సమాజాన్ని ఊరికే కదిలిస్తే ఉపయోగమేంటని ఏకంగా కుదుళ్లతో సహా  కుదిపేస్తున్నదో మన రాజకీయ కతలరాయళ్ళు!'
ఆపరా ఆ దెప్పుళ్ళు! కథాప్రక్రియని మరీ అంతలా కించపరచొద్దు! రిమ్మ తెగులు బ్రహ్మయ్య  ఎప్పుడో భార్యామణికి తప్పు చేస్తూ దొరికిపోయుంటాడు.  నారులకు వట్టి 'సారీ'లు సరిపోతాయా!   స్టోరీలేవో అల్లి మరీ ఆ గండం గట్టెక్కి ఉంటాడా తెల్లగడ్డం బ్రహ్మయ్య. దేవతా ముఖంగా పుట్టుకొచ్చిన కథాప్రక్రియను వృథా చెయ్యడం మాత్రం ఏమంత సబబు? అందుకే కృష్ణావతారంలో  వెన్నదొంగ ఆ కథాప్రక్రియను కంటిన్యూ చేసుంటాడు.  కాళయ్యనూ ఏదో బోళా శంకరుడని బోలెడంత  జాలిపడి పోతాం గానీ.. ఒక ఆలిని పక్కనుంచికొని.. మరో ఆలిని నెత్తినుంచుకొన్న మహానుభావుడు! అయినా   ఆదిభిక్షువనంటూ ఎన్ని  కథలల్లి భక్తగణం చేత ప్రచారం చేయించాడు!  దేవుళ్ల కథలే ఇంత లచ్చనంగా ఉంటే  వాళ్ల కనుసన్నల్లో కదిలే మామూలు   మనుషులం మనం. ముఖ్యంగా ఏదో ఓ  దేవుడి పేరు చెప్పుకుంటే తప్ప పబ్బం గడవని రాజకీయజీవుల్ని మూగమొద్దుల్లా    మూల చేరి మూలగమంటావా? అదేం భావ్యంరా! పాలిటిక్సులో పొర్లే సరుకు కథలు అల్లలేకపోతే సంసారాలే కాదు.. సర్కార్లూ  నిలబడవు. అనుభవం తక్కువ సన్నాసివి నీకేం తెలుస్తాయీ మల్లగుల్లాలు? కతలు కతలంటో ఆ ఎగతాళులే వద్దు.  అమెరికా భారత్ స్నేహ సంబంధాలు ఈ మాత్రమైనా పండుతున్నాయంటే ఇరు పక్షాలు ఒకరి కొకరు వినిపించుకొనే కథావిశేషాలే కారణం. ప్రధాని.. ప్రతిపక్ష నేతలు పది మాటలు అటూ ఇటూ విసురుకుంటున్నా.. అవీ జనం వినోదం కోసం చెప్పుకునే కతలేరా.. నీకు బోధ పడ్డంలేదు  కానీ ఈ మతలబులన్నీ! కహానీలే వద్దంటే ఇహ వెంకయ్యగారి మార్కు  పన్లు వినబడే ఛాన్సుండదు. యువనేతలు వివిధ  జనయాత్రల మధ్య వినిపించేందుకు  'థీమ్'లుండవు. ప్రసార మాధ్యమాల జోరుకిహ    జోషెక్కడేడుస్తుంది?  ఒక్క తెలుగు మూవీలు మినహా  ప్రపంచంమొత్తం ఈ కథాప్రక్రియ చుట్టూతానే కదరా గింగిరాలు కొడుతుండేదీ! స్టోరీలు వద్దంటే ఇహ మళ్లీ స్టోనేజీ యుగంలోకి వెళ్లిపోవడమే!'
మరే! కథలనేవే లేకపోతే ఆదికవి వాల్మీకీ సోదిలో కొచ్చేవాడు కాదు కదా?'
ఆ సోది సంగతేమో కానీ.. ఒక్క సూక్ష్మం  మాత్రం నువ్వు సూటిగా అర్థం చేసుకోవాలిరా అబ్బిగా! తన మానానికి తానేవేవో యుద్దాలు.. తీర్థయాత్రలు చేసుకుంటూ తిరిగే  శ్రీకృష్ణదేవరాయలుకే  కల్లోకొచ్చి మరీ తన పెళ్ళిని గూర్చి  కమ్మని కథలు చెప్పమని  శ్రీకాకుళాంధ్ర దేవుడు ఎందుకు పోరు పెట్టాడంటావ్?! కత్తి తిప్పడంలోనే కాదబ్బాయ్.. కథలు చెప్పడంలోనూ గొప్ప మెళుకువలు పట్టుపడ్డప్పుడే రాజ్యాధికారం రాయలువారి పాలనలాగా   పదికాలాలపాటు పకడ్బందీగా సాగిపోయేది ! హిస్టరీ తెలీని పిల్లతనం నీది! స్తోరీలతో నెట్టుకొచ్చే వాళ్లని గద్దె మీద నుంచి నెట్టి పడేయడం ఎన్ని లక్షల నెటిజన్లను కూడగట్టి అల్లరి పెట్టించినా వల్లయ్యే  పని కాదు! ముందది తెలుసుకోరా! అసహనం నటించబాకరా పిల్ల సన్నాసీ?'   
'ఆహాఁ!  హేమాహేమీలు అలవోకగా ఇచ్చేసే హామీలు,  వాటి మీద అస్మదీలుగా ఉన్నప్పుడు  చేసే 'హైఁ.. హైఁ'లు.. తస్మదీయులుగా మారినప్పుడు కూసే  'హ్హీఁ..హ్హీఁ'లు..   అన్నీ ఈ కథాప్రకియ చుట్టూతానే గింగిరాలు కొట్టే ప్రహసనాలు కదా బాబాయ్! ఈ కుర్చీకతల కిక్కుని గూర్చి  ఓట్లేసే జనమైనా అప్రమత్తం కాకపోతే ప్రజాస్వామ్యానికిహ పర్మినెంటుగా  'జనగనమనే..'! జనం మనిషిగా అదే నా దిగులు'
మరే! బాగుందిరా అబ్బాయ్ నీ  దిగులు కత కూడా! హ్హీఁ.. హ్హీఁ..హ్హీఁ!''కత'లరాయళ్ళు!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రప్రభ దినపత్రిక 17-02-2018 సుత్తి.. మెత్తంగా కాలమ్)


Friday, January 26, 2018

తెలుగు రుచులు-ఆంధ్రప్రభ దినపత్రిక - సరదా గల్పిక



అన్నం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ అన్నకర్త సాక్షాత్ విష్ణ్వావతారమే అవాలి గదాభగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో(15-14)సైతం  ఆహారవ్యవహారాల్లో భగవంతుడి  ప్రమేయం (అహం వైశ్వానరో భూత్వా..) తప్పదన్నట్లు  ధృవపడుతుంది. అర్జునుడు యుద్ధరంగంమధ్య విషాదయోగంలో పడి కొట్టుమిట్టాడే వేళా కర్తవ్యబోధ చేసేందుకు ఉద్యుక్తుడైన    భగవంతుడు  తిండిగోల మర్చిపోలేదు! వాల్మీకులవారి రామాయణంలోకూడా రావణాసురుడు అంతలావు క్రోధంలోసైతం 'ఇచ్చిన గడువులోగా శయ్యాస్వీకారం చెయ్యకపోతే  వంటవాళ్లచేత వండించుకొని తింటాన'ని సీతమ్మవారిని బెదిరించాడు! భోజనానికి ముందో శ్లోకం (బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః).. భోజనాల మధ్యలో మరో శ్లోకం (త్వదీయం వస్తు గోవింద).. భోజనానంతరం మరో శ్లోకం(అగస్త్యం  వైనతేయం) మన  ముందు తరాలకి!మన తాతలకి  భజనతో సమానమైన భోజనవ్యవహారం   ఓ  భోగకళగా మారింది మన హయాంలో!
భూగోళంలో  ఒక్కపాలు నేల. మనం భూచరాలుగానే బతుకుతున్నా  తిండికోసం  నీళ్లఅడుగునా,  ఆకాశంలోకూడా  దేవులాడటం మన తిండియావకు నిదర్శనం.  చంద్రమండలంమీదకు వెళ్ళినా   బంగాళాదుంపల్ని ఎలా పండించాలనే కదా మనం ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నదీ!
ఆకలి లేకుంటే జీవికి ఆరాటమే లేదు. ఆ మాటా నిజమేననుకోండి! ఆరాటం ఉండి.. అది తీరేందుకు  చేసేపోరాటమే  జీవితం. అందులోనే ఉంది జీవితసారమంతా!  పాతరాతియుగంనాటి  మనిషికూడా  రాయిని ఆయుధంగా నూరుకున్నది ఆహారం  సంపాదించుకోడంకోసమే!   నిప్పురవ్వను రాజేయడం నేర్చుకున్నది వేటమాసం.. కాయలు, దుంపలు గట్రా కమ్మంగా వండుకు తినేందుటందుకే! వంట ఒక కళగా ఆటవికయుగంనాటినుంచే మనిషివెంట మహాప్రస్థానం చేస్తూ వస్తోందంటారా ఎవరైనా!
సమాజస్వభావం సమ్యగ్దర్శనభాగ్యానికి నోచుకోవాలంటే, ఆచార వ్యవహారాదులతోపాటు ఆహారపద్ధతులూ తెలిసి ఉండాలి!’ అని మల్లంపల్లివారు అభిప్రాయపడ్డారు!   సామాజిక బాధ్యత గుర్తెరిగారు కాబట్టే మన ప్రాచీనకవులు సందర్భశుద్ధి ఉన్నా, లేకున్నా  సందుచూసుకుని మరీ పసందైన విందు భోజనాలు రకరకాలుగా అందించారు. మన కడుపులు నింపారు.
ఆత్మకు ఇంపైన భోజనం సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. ముంగండ అగ్రహారీకుడు పండితరాయలు తెలుగువిస్తరి  ఘుమఘుమల్ని డిల్లీదాకా విస్తరింపచేసాడు. ఆవఠేవ(ఆవకాయ)నుంచి.. ఇంగువ హంగులదాకా దేన్నీ ఓ పట్టు పట్టిందాకా వదిలిపెట్టని తిండిరంధి వేములవాడ భీమన్నకవిది. బమ్మెరవారి భాగవతంలోని 'బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో' పద్యం గోపబాలకులు లోకపాలకుడుతో  భోజనోత్సవ  పూర్ణోత్సాహాన్ని కళ్లక్కట్టించే కమ్మని నేతిబూరె! భోజనాది లౌకికాలనుకూడా మన కవులు ఎంత అలౌకికంగా ఆరాధించారో!  
వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే దోషంగా  భావించే శుద్ధశాకాహారి కదా శ్రీనాథుడు! అయినా తిరువెంగనాచనే శివభక్తురాలు సిరియాలును తరిగి  నానావిధ పాకాలుగా  వండటం వైనవైనాలుగా వర్ణించాడు మహానుభావుడు! మిరియాలపొడి చల్లినవి, సైంధవలవణం కలిపి చేసినవి, ఆవపెట్టి వండినవి, ఇంగువతో ఘుమఘుమలాడేవి,  చింతపండు.. నిమ్మరసం పిసికి చేసినవి, తాజానేతిలో ముంచి తేల్చినవి, లేతకొత్తిమీర మిళాయింపులతో  పరిమళించేవి, కూరగా వండినా  సౌష్ఠవం ఏ మాత్రం చెడనివి.. శివాలయంలో దొంగలా దూరి దాక్కున్న దుండగీడు గుణనిధి  కంటబడ్డ  భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు ఇవన్నీ! ‘’కాశీఖండంలోని ఈ చిన్నిజాబితా సైతం తిండిపుష్టి  దిట్టంగాగల శ్రీనాథ కవిసార్వభౌముడి పాకశాలనుంచి తయారైన అనుపాకాలే!
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. నిలపరా నీ జాతి నిండు గౌరవము'  అన్నారు కదా మన రాయప్రోలు సుబ్బారావుగారు కూడా! ఏ జాతికైనా దాని తిండి తిప్పల్ని  మించిన నిండు  గౌరవం మరేముంటుందిగనక! తెలుగువాడి ఆత్మగౌరవమైతే మరీ ముఖ్యంగా ఏ ఆవకాయ బద్దతోనో.. గోంగూర తొక్కుతోనో  ముడిపడి ఉంటుంది. వేటూరివారికి మాగాయవూరుని 'మహత్తరి' అని పొగిడితేగానీ తనివి తీరలేదు మరి! జిహ్వచాపల్యరంగంలో తెలుగునోటికి  పోటీకొచ్చే జాతి భూమ్మీద ఎందెందు గాలించినా మీకు దొరకదు గాక దొరకదు సుమండీ! ఓ మహాపండితుడు హిమాలయాలను చూసి తన్మయత్వంతో  'అన్నపు రాశుల్లా'  ఉన్నాయని నోరెళ్ళ పెట్టేసాడు. బహుశా అతగాడు మన తెలుగువాడే అయివుండనోపు!
కారంతో కారం కలిపి కొత్తరుచి సృష్టించగలడు.తెలుగువాడు. పులుపులో పులుపు కలిపి పులకరింతలు పుట్టించనూ గలడు. ఆరు రుచులతో ఆరొందల అరవైఆరు రుచులు సృష్టించి ' ఆహా! ఏమి రుచి?' అనిపించి నోరూరించగల  మొనగాడు ఇంకెవడు? మన తెలుగువాడే!
'ఆంధ్ర' లోని అంధ పదం 'అన్నానికి పర్యాయ పదంట!(ఆప్టే సంస్కృత నిఘ౦టువు- పు129). జైన, బౌధ్ధ సాహిత్యాలలో తెలుగువాళ్ళు అంథ శబ్దంతోనే వ్యవహృతులు. నైలునుండి కృష్ణదాకా సాగిన ద్రావిడుల మహావ్యాప్తికి  'పెసలు' పద వ్యుత్పత్తి సాక్ష్యం  పలుకుతోంది ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు చెపుతోంది.  చైనాలాంటి తూర్పు దేశాలతో  భారతీయ బౌధ్ధులు సంబంధాలు  పంచదారతో మరింత మధురమయ్యాయని చరిత్రకారుల పరిశీలన. చెరకు తోటల నీడల్లో చేరి  వరిచేలకు పహరా  కాస్తూ ఆంధ్రమహిళలు రఘుమహారాజు జీవితగాథని పాడుకున్నారు.. ఎక్కడో పక్కమహారాష్ట్రంలో ఉన్న   కాళిదాసు రాసిన 'రఘువంశం'లోకూడా! తెలుగులు ఎక్కడ ఉంటే ఘుమఘుమలు అక్కడ ఉంటాయి కాబోలు!
'కూరదినుసుల విజేతే విశ్వవిజేత' అని యూరోపియన్ల మధ్యయుగాల్లో కనిపెట్టిన సత్యం మనం సాగు ఆరంభించిన తొలిదినాల్లోనే పసిగట్టేశాం. మనగడ్డమీద  మిరియాలు, సుగ౦థ ద్రవ్యాలు చవక.  మనదగ్గర కొనుక్కొని వేరే  దేశాలకు అమ్ముకొని వ్యాపార సంస్కృతిని విస్తరించింది మాత్రం యూరోపియన్లే.   కాయగూరలకోసం  బుడతకీచులు  ఓడలనిండా సరుకులతో మన కోస్తాతీరాలవెంట తెగ తిరుగుతుండేవాళ్ళు. మిరియాలకోసమే  కొలంబస్ ఇండియా ప్రస్థానం ప్రారంభించిందంటారు! పచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిర్చి ఘాటుని   పాండురంగడిశక్తితో పోల్చేదశకు  పురందరదాసంతటి వైదాంతికులే వెళ్ళారు కదా! ఇహ  మన ఆహార చరిత్రను 'మిరపకాయకు ముందు- తరువాత' గా విభజించిస్తేమాత్రం  తప్పేముంది!
ఒక్క మిరపకాయనే కాదు పన్నెండో శతాబ్ది 'మానసోల్లాస' గ్ర౦థ౦లో మన లడ్డూల ప్రస్తావనా ప్రశస్తంగా   వినిపిస్తుంది. రామాయణ, భారతాలు, ఆయుర్వేద గ్ర౦థాల్లోని మోదకాలు మన లడ్డూలే! తెలుగుశాతవాహన చక్రవర్తి కథలో 'మోదక' శబ్ద౦ సృష్టి౦చిన కలకలం అంతా ఇంతా కాదుగదా! బుడతకీచులతో పెంచుకొన్న  వాణిజ్యబంధాలవల్లే   బొప్పాయినుంచి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలదాకా తెలుగునాలుకలకి    కొత్తరుచులు వంటబట్టాయి.  మిరియాన్ని ఏమరచి మిర్చిని మరిగి ఆ కారాలకి తగ్గట్టుగా  ఉప్పులు, పులుపులు, తీపుల కలగలుపులతో   కొత్తతరహా వంటలకు తెరలేపిన ఘనుడు మన తెలుగువాడేనని మనం సగర్వంగా చెప్పుకోవచ్చూ! పగిలిన  కుండపెంకుమీదైనా సరే కమ్మని అట్టు పోసేయగల దిట్టతనమండీ  మన తెలుగు చేతిది!
'మేలింపు చవి గుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ నేర్పు గలదే..' అంటూ 'రాజవాహన విజయం' కావ్యంలో కాకుమాని మూర్తికవి నోరూరించాడు! ‘శుకసప్తతి' కావ్యంలో కదిరీపతి  ‘‘ఒఱపు దనరార జేపల యూర్పుగూర యిడిన..'అంటూ చేపలవూర్పు గురించి బులిపించాడు! దమయంతీ స్వయంవరానికని విచ్చేసిన అతిథులకోసం వడ్డించిన  డెబ్భైరకాల వంటకాలనూ విపులంగా వర్ణించాడు.. శిష్యసమేతంగా విచ్చేసిన వ్యాసమహర్షులవారికి  కాశీవిశాలాక్షి చేతులమీదుగా శబ్దరత్నాకరానికైనా అర్థంకాని పలు పదార్థాలు తినిపించాడు శ్రీనాథుడు! శ్రీనాథుడి భోజన రాసిక్యతను గూర్చి బోలెడన్ని చాటువులు! రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యంలో కపటబ్రహ్మచారిగా వచ్చిన పరంధాముడికి పతివ్రతా శిరోమణి సుశీల ఇచ్చిన ఆతిథ్యంలోని  ఖాద్యవిశేషాలతో అయితే ఏకంగా ఓ పరిశోధనా గ్రందమే వెలువరించేసెయ్యవచ్చు. అయ్యలరాజు నారాయణామాత్యుడు తననాటి ప్రజల జీవనస్థితిగతుల వివరాలతో రాసిన హ౦సవి౦శతి- వ్యాపారి విష్ణుదాసుడి విదేశీపర్యటనలో  వె౦టతీ సుకువెళ్ళిన  పూరీలు, కూడుపరిగెలు, తెలుపరిగెల్లాంటి  డెబ్భయిరకాల పిండివంటల జాబితాను ఏకరువు పెడుతుంది.
త్యాగరాజస్వామివారికి పుస్తికాయల ఒరుగుపులుసు  'వర్తకొలంబు' మహాప్రాణం. వస్త్రంమీద పుస్తికాయలు  ఎండబెట్టుకొనేవేళ  మనసులో  కృతులు మహా పసందుగా అల్లుకుంటాయిట! ఎందరో మహానుభావులు! అందరికీ వందనాలు! అచ్చతెలుగు అప్పచ్చులరుచి అచ్చంగా  అనుభవంలో మిగిలిపోవాలంటే అన్నమయ్య కీర్తనలొక పుడిసెడు పుక్కిలి పడితే సరిపోదా!  మధుర తిరుమలేంద్రుడు- మంచి బహుమానమొసగి/యెదుట కూర్చుండమని ఎన్నికలిమ్మనెనే/యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?/చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె?’ అని మన మొవ్వా వరదయ్య(క్షేత్రయ్య)గారి జావళీలు! జిలేబీలరుచిని  తలపించే మధురరసాలు నోట ఊరటం లేదూ!
'శనగపిండి వంటకం ప్రియురాలి సరసమైతే  అల్పాహారం ఇడ్లీ  ఇంటావిడ అనురాగం' అంటారు డాక్టర్ సినారె.  జ్ఞానపీఠగ్రహీతయితే మాత్రం  తిండిరంధి ఉండకూడదా ఏంది! శతావధానులు తిరుపతి వేంకటకవులయితే.. పకోడీ చేసేవిధానాన్ని శతవిధాల వండి చూపెట్టారు పలు అవధానప్రదర్శన పద్యాల్లో. తెలుగింటి విందులో వడ్డించిన విస్తరి మంగళగౌరీ  గళసీమ నలంకరించిన   నవరత్నఖచితహారంలా రంగులీనుతుంటుందని   ఓ సౌందర్యతుంటరి అభివర్ణన!
అరవైనాలుగు రకాల వరిధాన్యాలు తెలుగు రైతు పండించగలడు. అన్నింటినీ  వండుకుతిని హాయిగా హరాయించుకోనూ గలడు! తెలుగురుచుల్లోని  వైవిధ్యం తెలియాలంటే తెలుగు సాహిత్యమూ రవ్వంత  వంటబట్టాలన్నారు  పెద్దలు మరి! పెద్దలమాట చద్దిమూట!
'ఇప్పుడీ తిండిగోలంతా ఎదుకండీ?' అని కదూ మీ సందేహం.
ఈ ఫిబ్రవరి ఒకటికి కేంద్రం బడ్జెట్ ప్రవేశ బెట్టబోతోంది కదండీ! ఆర్థిక శాఖామాత్ర్యులు అప్పుడే 'హల్వా' వండటం  మొదలెట్టేసినట్లు వార్త. బడ్జెట్లో ఎన్ని తీపి.. చేదు కబుర్లుంటాయో ? మన తెలుగు తిండి మాత్రం నూటికి నూరు పాళ్లు  షడ్రసోపేతంగా ఉండి  గ్యారంటీగా నోరూరిస్తుంటుందండోయ్!  తమరు కడుపారా తిని తృప్తిగా త్రేన్చేస్తే వండినందుకు మాకు అదే ఓ పెద్ద 'తుత్తి'.
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 27-01-2018 నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్)


Saturday, January 13, 2018

రా.. జా.. కీయాలు- సరదా గల్పిక ఆంధ్రప్రభ -సుత్తి మెత్తంగా-



‘ఈ రాజకీయాలు అంటే ఏంటో మూడు ముక్కల్లో  చెప్పన్నా.. అర్జంటు!'
'అంతర్జంటా! అయితే రెండు ముక్కల్లోనే ముగిస్తా! 'రాఁ' అంటే 'వెలకమ్'. 'జాఁ' హిందీ ముక్క. 'వెల్! గెట్ అవుట్'అని రా అర్థం. ఎప్పుడు రమ్మని పిలవాలో.. ఎప్పుడు పొమ్మని మెడ పట్టి బైటిగ్గెంటెయ్యాలో తెలిసుండటమే రాజకీయమంటే. ఎయిటీ ఫోర్ లేక్స్ జీవాలు. సిక్స్టీ ఫోర్  టైప్ ఆర్ట్స్! ఏ జీవీ కదిలించని డొంక..  ఏ ఆర్టుకీ చెందని శాఖ.. ఈ రాజకీయం. ఇదో అబ్రహ్మ పదార్థమనుకోర అబ్బిగా!’  'బ్రహ్మపదార్థం తెలుసు. అబ్రహాం పదానికీ అర్థం తెలుసు. కొత్తగా ఈ 'అ'బ్రహ్మపదార్థం’ ఏంటన్నా?’ 
'బ్రహ్మ తయారు చేయంది  అబ్రహ్మమే కదరా అయేది వెర్రి నాగన్నా! పది దినాల పాటు అలా భూమి దాక వెళ్ళి నాలుగు జీవాలతో కాస్తింత 'మనిషి'గా మెలిగి రమ్మని బ్రహ్మయ్య ఇక్కడికి పంపిస్తే మనమేం చేస్తున్నాం? సింహాలమనుకొని గర్జిస్తున్నాం. నక్కలని వెక్కిరిస్తూనే వాటిని మించి జిత్తులు ప్రదర్శిస్తున్నాం. కుక్కలు కూడా మనలా  తోకలాడించవు. ఇహ కాకిగోలంటావా? కాకులకే మా చెడ్డ చిర్రాకు పుట్టించే కూతలు కూస్తున్నాం అస్తమానం!  కప్పలు కూడా మనంత గొప్పగా తక్కెళ్లలో గెంతటం లేదు! పిల్లులకైనా ఎప్పుడైనా కాస్త సిల్లీ అనిపిస్తుందేమో ఆ గోడదూకుళ్లకూ వాటికీ. వాటం చూసి గోడ దూకడంలో పోటీలు గాని  పెడితే మనమే వాటి రికార్డులన్నీ గ్యారంటీగా బద్దలు కొట్టేస్తాం.  ఛీఁ.. ఛీఁ.. చివరికి గద్దలు, రాబందులకు  మించి  దొరికింది దొరికినట్లే పీక్కుతినేందుక్కూడా  మనం సిద్ధం. కోతీ కొండముచ్చుల్లా కొమ్మలుచ్చుకొని గంతులేసేందు క్కూడా మనలో కొందరు పెద్దలు   సిగ్గు పడ్డం లేదు! పై పెచ్చు పెద్ద ఘనకార్యాలేవో సాధించేస్తున్నట్లు 'పెద్దమనుషులు' ‘గౌరవనీయులు’ ‘ఆత్మబంధువులు’ అంటూ పేద్ద పేద్ద  బిరుదులు బ్యాడ్జీలు గుండెలకు గుచ్చేసుకుంటున్నాం. సరే! రాజకీయాలన్నాక ఇవన్నీ ఓ.కే నేలే గానీ.. నీకే ఇంత పరగడుపునే ఈశ్వరుడికైనా అంతుపట్టని ఈ  రాజకీయాల మీద ఇంత లావు  శ్రద్ధెందుకు పుట్టుకొచ్చినట్లో? ఎవరి పుట్టైనా ముంచడానిగ్గాని ముందస్తు ప్రణాళికలేవన్నా..’
‘ఛఁ..ఛఁ!  నాకంత సీనుందా? నీకు తెలవదా వెంకన్నా?  మా తింగరోడు చాలడా కొంప కొల్లేరు చేసెయ్యడానికి!  రాత్రి బట్టీ వాడు నిద్దట్లో కూడా ఒహటే పలవరింతలు! 'ఇదిగో వస్తన్నా! ఇప్పుడే వస్తన్నా!' అంటూ తెగ కలవరించి చంపేస్తున్నాడన్నా! తెల్లారి లేచి పాచి పళ్లైనా తోమకుండా అద్దం ముందు చేరి ఏంటేంటో  కూస్తున్నాడన్నా! అన్నీ అర్థమయి చస్తాయా మా మొద్దు బుర్రలకీ! ఆ దండాలేంటి.. దస్కాలేంటి? వేళ్లు, చేతులూ అట్లా గాల్లో ఊరికే ఊపేసెయ్యడాలు.. ఉండుండి ముద్దుల మీద ముద్దులు అద్దం మీదకు విసిరేయడాలు!  పండగ రోజుల్లో మాకీ పాడు బెడదేంటన్నా కొంపలో?  మా ముత్తాత  జమానా  మురికి  ఖద్దరు జుబ్బా.. పంచె.. పై కండువా బైటికి తీయించి  చలువ చేయించిండు! వంటికి తగిలించుకొని ఏడకో ఉరుకుతా వుంటే నేనే గడప కడ్డం పడ్డా! 'ఏడకిరా?’అని గట్టిగా గదమాయిస్తే 'ఇంకేడకీ? రాజకీయాల్లోకి నాయనా! అదిగో మా అధినేత ‘రా! రా! రమ్మ’ని పిలుస్తున్నాడు’ అంటా నన్నో మూలకు తొక్కేసి పోతున్నాడన్నా! వీడిగ్గానీ ఏ దిల్లీ గాలో ధూళో సోకలేదు కదా! మా ఇంటా వంటా లేవీ రాజకీయాలు. అరక తీసి పొలానికి పోవడమే మాకు తెలుసు! బుడంకాయలకి బుక్కు బండలేసుకొని బళ్లకు పోవడమే తెలుసు. ఆడంగులకట్లా  చెరువు గట్ల  దాకా  పోయి నీళ్లు చేదుకొచ్చుకోవడం తెలుసు,  పనుల్లేనప్పుడు అట్లా  పక్కోళ్ళ ఇళ్లూ.. చావిళ్లూ చుట్టబెట్టి రావడం తెలుసు కానీ..  ఈ రాజకీయాల్లోకి వెళ్లిపోవడమేంటన్నా కొత్తగా వింటన్నా!’ 
'అర్థమయిందబ్బీ! మొన్నటి  గుజరాత్ ఎన్నికల్లో ఆ ముగ్గురు కుర్రాళ్లెవరో గానీ పెద్దాయన్తోనే పేకాటాడేసుకున్నారు కదా! ఆ దుమారం దుమ్మే మీ తింగరోడి కంట్లోనూ పడ్డట్లుంది.  పోతే పోనియ్యరాదే! రాజకీయాల్లోకే కదా ఆ పొయ్యేదీ?  సన్యాసుల్లో కలిసేందుకేమన్నా పోతన్నాడా? ఎవురికైనా నాలుగు రాళ్లు గడించుకోవాలనే కదా ఉంటుందీ వంట్లో ఓపికున్నంతా కాలం?’ 
'గిట్టనోడి మీద  రాళ్లేయడమంత సులువా అన్నా రాజకీయాల్లో దూరి రాళ్లూ  రత్నాలూ గడించడం? చక్కంగా చదువుకొని..'
'.. సతికి సతికీ ఎంత బుర్రలరగ తీసినా ఏమొస్తదిలేరా నాగన్నా? ఎంత  సర్కారు  కొలువుల్లంకించుకున్నా మిగిలేది గుండుసున్నా! ఏ సదువూ సంధ్యల్లేకపోయినా మంత్రులయినోళ్ళు  ఇంత మంది. మంద బుద్ధివి. నీకా మతలబులన్నీ అందేవి కాదు కానీ.. తింగరోడంటున్నావు కదా నీ కొడుకుని? మరి తిన్నగా రాజకీయాల్లోకే దూరి పోనియ్యరాదా! కేజ్రీవాలే దిల్లీకి సియమ్మయిండు.  ఏమో.. జనం తలరాతలు బా లేక పోతే  మీ పిచ్చోడు కూడా  రేప్పొద్దున ఏ ముఖ్యమైన పదవికో ఎక్కి రావచ్చూ!’ 
'ఎక్కిరావడానికి ఇదేవన్నా దొడ్డిగోడకు చేరేసిన చెక్కనిచ్చనా అన్నా? రాజకీయం వైకుంఠపాళి అని నువ్వే ఓ పాలి అనుంటివి. ఎన్ని పాములు కనికరిస్తే ఆ  చివరి గడికి చేరేదీ! ఎవరెవరి వెనకాలో చేరి గోతులు తీస్తుండాలి! ఎకరాలు అమ్మినా నికరంగా టిక్కెట్టు దొరుకునా? సి- ఫారము దక్కినా  సిఫార్సులు గెలిపించునా? గెలుపుకి ఎవ్వరూ  గ్యారంటీ ఇవ్వరు. గెలుచుకు వచ్చినా ఐదేళ్ల  వారంట్రీ అసలే ఉండదు.  ప్రతీ రోజూ ప్రతినిధుల కతలు ఎన్ని  వింటున్నాం? నాలుగేళ్లు దాటినా నిఖార్సుగా గెలిచిండో లేడో,,  చిట్ట చివరి న్యాయస్థానం కూడా చటుక్కని తేల్చని పరిస్థితి! ఈ పాడు పాలిటిక్సులసలు  మా వంటికి పడేవి కాదు గానీ.. మా తిక్కసన్నాసిని నీ దగ్గరకే పంపిస్తా! ఆ పిచ్చోడి ధ్యాస కాస్త పని మీదకు మళ్లించన్నా! సర్కారు పోస్టులకు ..’ 
‘ఆ సర్కారు పోస్టులన్నీ శుధ్ధ వేస్టురా నాగన్నా! ఆ అరవదేశం చూసన్నా తెలివి తెచ్చుకోవేంటన్నా! ముఖ్య కార్యదర్శంటే ఎంతటి ముఖ్యమైన పదవి? అతగాడి మీదకే ఆదాయప్పన్ను పిశాచాల దాడి! అదే  చోట.. మరి   ఆ రాజా.. కనిమొళమ్మల వైభోగం చూడు! లక్షల కోట్లలో జరిగింది కుంభకోణం. అయినా రాజా.. రాణీల్లా   లక్షణంగా తిరుగుతున్నార్రా రాజకీయాలల్ల! పాలిటిక్సు పవరేంటో నీకేరా వంటపట్టటంలా! గొడ్లు తినే గడ్డి బొక్కినా  ఏళ్ల తరబడి ఎవరూ అడగరు రాజకీయాల్లో.  తలరాత తిరగబడి ఎవుడో తిరగదోడినా తప్పుకు పడే  శిక్ష  ముత్తెమంత! మానవీయకోణం అంటూ లా పాయింటు ఒకటెప్పుడూ రాజకీయాలోళ్ల  సాయానికి సిద్ధంగా ఉంటుందన్నా. ఆ లల్లూ ప్రసాదు భాయీని చూడరాదా.. పాలిటిక్సంటే భయం పోద్ది.  ఓపెన్ జైలు.. అటాచ్డ్ బాత్రూం, సింగిల్ వంటిల్లు, పెళ్లాం కూడా వచ్చి పోతుండొచ్చు బుద్ధి పుట్టినప్పుడల్లా! పిల్లాజెల్లాకీ సలహాలవీ ఇస్తుండొచ్చు. పక్కనే కూర్చో బెట్టేసుకొని ఎవురెవరి కుర్చీల కెప్పుడు ఎట్లా ముప్పందం తేవాలో ముచ్చట్లలా చెప్పుకోవచ్చు. చక్రం తిప్పే ఛాన్సు లేక  పెద్దాయనకి పొద్దు పోకపోతే.. సొంత కొష్ఠం నుంచే ఎద్దులు.. ఆవులూ.. దున్నలూ.. పోతులూ నేరుగా జైలుకే డజన్ల కొద్దీ తరలొచ్చాయన్నా! ఆ వైభోగమంతా చూసే మీ పిల్లాడికి పాలటిక్సు మీదకి గాలి మళ్లినట్లుంది. శభాషో!'
'తెలివి తక్కువ కుంక. నెగ్గుకు రాగలాడా అని శంక!'
'తెలివి బ్రహ్మపదార్థం. రాజకీయం అబ్రహ్మ పదార్థం. రెండింటికీ ముడి పెట్టి కంగారు పెట్టవాక! డొల్లు బుర్ర డొనాల్డే అమరికా దుమ్ము లేపేస్తున్నాడన్నా! కాకపోతే కాస్త మంచీ మర్యాదగా మెలిగే చాదస్తం తగ్గించుకోవాల. అవసరం పడితే కన్నీళ్లు కుండల కొద్దీ కార్చేందుకు సిద్ధపడాల! బోర విరుచుకొని నడిచే దెప్పుడో.. బొక్కబోర్లా పడ్డట్లు నటించాల్సింది ఎప్పుడో ఆ టైమింగు అదీ బాగా ప్రాక్టీసు చేసుకొనుండాల! గుండులాగా ఆరోగ్యం ఉండుగాక.. గుండెనొప్పి, హై బిపి, లో షుగరు, అబ్నార్మల్ లెవెల్లో అల్జీమర్స్, ఫిట్సూ గట్రా  నటించడం బాగా వచ్చుండాలి. ఖర్మకొద్దీ ఏ  సీసీ కెమేరాలకో బుద్ధి గడ్డి తింటూ పట్టు పడిపోవచ్చు. కేసులూ తప్పక పోవచ్చు. ధర్మాసనాలు సులువుగా బెయిళ్లిచ్చే అన్ని అడ్డదారులూ పిండి కొట్టినట్లు  ప్రాక్టీసు చేసుండమను ముందు. ఆ తరువాతే రాజకీయాల్లోకి దూకడం సేఫని నా మాటగా చెప్పన్నా! పిలగాడు  తింగరోడేనని నువ్వే అంటుంటివి.  బంగారమంటి భవిష్యత్తు  గ్యారంటీ! బెంగెట్టుకోవాకా వెర్రి నాగన్నా!  ముందు ఇంటికి లగెత్తుకెళ్లు! బిడాయించిన గది తలుపులు బేగి తీయించు. లేకుంటే మణిపూసలాంటి మరో యువనేతను లోకానికి కాకుండా చేసిన పాపం ముందు నీకే చుట్టుకుంటుందబ్బీ!’
‘!!!’
‘ఆఁ.. అన్నట్లు నీ మనవడిక్కూడా నా అడ్వాన్సు అభినందనలు చెప్పు నాగన్నా! వచ్చే తరానికి వాడేగదా మీ అబ్బాయికి దక్కబోయే కుర్చీకి చచ్చినట్లయ్యే వారసుడు!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- సుత్తి మెత్తంగా కాలమ్-13-01-2018 -ప్రచురితం)


Friday, December 15, 2017

‘కాఫీ’రాగాలు- (ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి సుత్తి.. మెత్తంగా- కాలమ్ లో ప్రచురితం




దేవతలూ రాక్షసులూ  పాలసముద్రాన్ని తెగ మధించేసారు. ముందుగా కాలకూటం.. ఆనక పీయూషం. రాక్షసులకు కాలకూటం దక్కితే.. లక్కీ దేవతలు అమృతం లంకించుకుంటిరి. ఏమీ దొరకని మన మనుషులమే మన్ను తిన్న పాముల్లా ఓ మూల పడుంటిమి.  బ్రహ్మయ్యకే పాపం.. పాపం అనిపించింది. అందుకే కాలకూటం లోంచి 'కా'.. పీయూషం లోంచి పీ.. బైటికి పీకి కాపీ అనే కొత్త కాక్ టైల్ సృష్టించేసి మన వంతుకని ప్రసాదించింది. ఆ  కాఫీతోనే మనకిప్పుడు ఇన్ని గంతులు!
అందుకే విషంలోని మాదకశక్తి..  అమృతంలో ఉండే అద్భుతమైన  రుచి.. రెండూ కాఫీలో ఉంటాయి కదా! అమృతం హంబక్కేమో కానీ.. కాఫీ కిక్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్  రియాల్టీ! కోక్ నుంచి కొబ్బరి బోండాం దాకా ఎన్ని డ్రింకులు అందుబాటులో ఉంటేనేమి.. కాఫీకుండే ఆ కిక్కే వేరు స్వామీ! ఫిల్టర్ కాఫీ  స్పేసును ఫిల్లప్  చేసే  హాట్  డ్రింకు మనకింకెన్ని  జన్మలెత్తినా దొరకడం కల్ల.. నో డౌట్! రామనవమి బెల్లప్పానకం, ముక్కు దిబ్బడకని వాడే మిరియాల కషాయం, పడ్డ పడ్డప్పుడు మాత్రమే దొరికే గేదె జున్నుపాలు.. ఇవి మినహా మనకి మరేమీ తెలియని   అమాయాకపు రోజుల్లో  కాఫీలు  మప్పే  తెల్లోడు మనల్ని పర్మినెంటుగా సర్వెంట్సు  చేసుకున్నది! కాఫీనా? మజాకానా?  
ఒకానొక్కప్పుడు ఓ కప్పుడు కాఫీ దిలాసాగా ఆరుబయలు కుర్చీల్లో చేరగిలిబడి తీరిగ్గా  తాగే అదృష్టం ఒక్క  తెల్లదొరలకు మాత్రమే సొంతం! ఇప్పుడో? 'కుదిరితే కప్పు కాఫీ.. నాలుగు కబుర్లు' ఈ కాలం కుర్రకారుకి.  కాటికెళ్లే ముసలి డొక్కులక్కూడా చివరి కోరిక చికోరి తగు పాళ్లలో కలిపి మరిగించిన కమ్మని కాఫీ ఓ లోటా నిండుగా లాగించి హరీమనాలని!  ఎంత కాఫిర్ కైనా కాఫీ దగ్గర కాసుల్లెక్క ఉండకూడదు! 'కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?' అంటూ వెంటబడి మరీ చంపుకు తింటుంటారు  ఆడపెళ్లివారు పెళ్లిళ్ళలో. అమ్మాయి తండ్రేమన్నా అమీర్ బాబనా? అదో మర్యాద.. కాఫీకి దక్కే గొప్ప గౌరవం!
టర్కీలో పిల్ల చేసిన కాఫీ కమ్మంగా ఉంటేనే పిల్లడు పెళ్లికి  సై. కాఫీ రుచిలో కాస్తింత తేడా వచ్చినా ఆనక పెళ్లాం కాపురానికి  నీళ్లొదులుకోవాల్సిందే! పాడు కాఫీ! ఎన్ని కాపురాలలా కుల్చేస్తోందో ఇక్కడా టర్కీలోలా! అయినా కాఫీకున్న గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు!
కాఫీ అయ్యర్లకు వరల్డువైడుగా పేరొచ్చిందీ ఫిల్టరు కాఫీ వల్లనే సుమా! 'అయ్యరూ! నీవు లేనట్టి తావు-కలదె పరికింప నెందు భూవలయమందు!' అంటూ స్త్రోత్రమాలలందించాడో  కాఫీగత బ్యాచిలరు కవి జీవుడు. 
కాఫీ కాయడం క్రికెట్టాటల్లో బెట్టింగు కాయడమంత సులభం కాదు. పొడి వేసిం తరువాత పాలు పొయ్యాలో..   పాలు  మరిగిం తరువాత పొడి వెయ్యాలో గూగుల్లో చూస్తే గానీ  పాలు పోని జ్ఞాని ప్రతి కొంపకీ కంపల్సరీగా ఒకరుంటారు.  డికాషనుకు ఎంత   ప్రికాషను అవసరమో, పంచదార ఎంత పాళ్లలో పడితే చెక్కర రోగం ముదర పెట్టదో.. అబ్బో., కాఫీ మేకింగుల మీద ‘క్లాసులు పీకింగే’ వృత్తిగా పెట్టుకొని కింగులూ క్వీజులూ అవుతున్న వాళ్లు ఆన్లైన్లలో ఇప్పుడు బోలెడు మంది!     
మా ముసిల్ది మరీ రెచ్చి పోతోంది. కాఫీ కోటా డబుల్ చేసింది. తాను గుండ్రాయిలా తిరుగుతూనే ఉన్నా ఆ పాలూ, పంచదారా, కాఫీ పౌడర్ గట్రా జి ఎస్ టి టాక్సుతో సహా పెరిగిన ధరలకు కొని తట్టుకోలేక పాపం మా డాడీనే తల పట్టుక్కూర్చుంటున్నాడు. అన్నట్లు  తలపోటుక్కూడా డబుల్ స్ట్రాంగు బ్లాక్ కాఫీని మించిన మంచి టానిక్  లేదంటున్నారు డాక్టర్లు! మూలక్కూర్చుని మూలిగే  ముసలాళ్ళ మురిపాలే కాఫీల మిదింతలా పెరిగి పోతుంటే ..  పని పాటలు చేసుకుంటూ బతకి చావాల్సిన  సంసారులం.. ఇహ మన కాఫీ బడ్జెటు కథ స్పెషల్గా  చెప్పేదేవుంది?
 కాఫీల మీద శాస్త్రవేత్తలు కూడా అస్తమానం ఏవో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకుడు   కాఫీ తాగితే కేన్సర్ దూరమవుతుందంటాడా? ఆ మర్నాడే.. మరో చికాగో విశ్వవిద్యాలయ బృందం చికోరీ లేని కాఫీ మాత్రమే సేఫని స్టేట్మెంటిచ్చేస్తుంది. అన్ లిమిటెడ్  కాఫీ డ్రింకింగ్   యుట్రిసు మీద స్ట్రెస్సని ఊటా యూనివర్శిటీ వాక్రుచ్చితే.. అదేం లేదు.. పుట్టబోయే కిడ్ ‘విజార్డ్’ అవాలంటే కెఫిన్ కాన్స్టంట్రేడెడ్ కాఫీ కనీసం రోజుకో పది సార్లైనా గొంతులో దిగాల'ని గుయానా యూనివర్శిటీ గగ్గోలు పెదుతుంది.  మగాళ్లకి మెదడులో కణితలు పెరిగి అనుకోని ప్రాణాపాయం జరిగే అవకాశం గత శతాబ్దం కన్నా  అరవై  శాతం అధికమయిందని  అదేందో అర్థం కాని టెర్మినాలజీలో  కాఫీ డ్రింకింగ్ పెరిల్సుని గురించో జర్మనీ విశ్వవిధ్యాలయం బెదిరిస్తే.. తాజా పరిశోధనల్లో- తాజాగా తయారైన కాఫీ తాక్కుండా ముక్కుతో పీల్చినా చాలు మెదడులోని అసిటోన్ ఎంజైమ్స్ ఉద్దీపనం చెంది ఆ రోజంతా ఫీల్ గుడ్ మూడ్ మెయింటైన్ చేసేయచ్చని మన దగ్గరే ఓ హెర్బల్ పరిశోధక సంస్థ  అభయహస్తం ఇచ్చేస్తోంది.    ఆ అర్థం కాని పాడు లెక్కలు అవీ పట్టించుక్కూర్చుంటే ఆ తాగే గుక్కెడు కాఫీ కూడా కాలకూట విషమై రేపు పోయే ప్రాణం ఇవాళే హరీ అనడం ఖాయం. 
ఏడో శతాబ్దం నాటి మత్తు గింజలు ఈ  ఏడు కాఫీ గింజలు! ఎంతలా విశ్వరూపం దాల్చి  ఏడిపిస్తోందీ పాడు లోకాన్ని! ఎక్కడి  ఇథియోపియా.. ఎక్కడి మేరా మహాన్ ఇండియా?  
 ఇస్లామిక్ గావా వైన్- ఈ డెవిల్స్ డ్రింక్!  ఇవాళ అదే  ఇండియా గుడ్ విల్ డ్రింక్! నిషేధించాలనుకున్న క్రైస్తవమే కాఫీ  రుచికి దాసోహమంది! మక్కా యాత్రకని పోయిన బాబూ బుడాన్ సూఫీ  వట్టి చేతుల్తో రావడ మెందుకని ఏ సుమూహూర్తాన ఆ ఏడు గింజలు గిల్లుకొచ్చాడో గానీ.. దాందుంప తెగ.. కన్నడ దత్తాత్రేయ కొండల గాలి తగిలి  నూటేడు  దేశాల నుంచి  ఇప్పుడ అదే మనకు ప్రధాన ఆదాయ వనరైంది!  యూరోపు ‘గుడ్ మార్నింగ్'  మన అరకులోయ  కాఫీతోనే!  ఇండోనేసియా పిల్లి తిని ఆరగించుకొనే  పళ్ళు ఈ కాఫీ గింజలు. ‘చరిత్ర మనకెందుకయ్యా? రుచి ముఖ్యం గానీ!’ అంటూ చిరాకు పడి పోవద్దు. ఓ కప్పు కాఫీ తెప్పించుకోండన్నా! అప్పుడే  చెత్త వాగినా చప్పట్లు కొట్టాలనే అనిపిస్తుంది. దటీజ్  కాఫీస్ మ్యాజిక్!
'జొన్న అన్నమే ఆహారం.. జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని  వాపోయాడొకప్పుడు పాపం.. ఆ తిండిపోతు శ్రీనాథుడు. ఇప్పుడతగాడే కనక బతికుండుంటే? 
దేశభక్తి కవిత్వానికి పాలుమాలిన కవులు సైతం పాలు మరగ్గాచిన  కాఫీ ద్రావకం మీద దండకాలు రాయకుండా ఉండలేక పోయారు. అభినవ సరస్వతి పత్రికలో గౌరావఝ్ఝల సీతారామయ్యగారు 'కాఫీతీర్థంతో సమానమైన తీర్థం మరోటి లేనే లేదు పొమ్మం' అంటూ తేల్చేసారు. డెబ్బై ఏళ్ల కిందటే  గృహలక్ష్మిలో పేరు తెలీని తెలివైన కవి ఒకాయన 'అమ్మవార వౌచు నిఖిల జనంబుల/ గృహములందు దాపురించినావు/ నిను భరింపలేము నిను ద్రోయగా లేము' అంటూ  దండకాలు అందుకున్నాడు. 
లీటరు  రేటు వింటుంటే పాలకు బదులుగా వాటరు వాడటం  బెటరు అనిపిస్తోందిప్పుడు. కాఫీ పౌడరు ధర వింటుంటే కాఫీ తాగక ముందే బి. పి పెరిగి పోతోంది. చిటికెడు చక్కర ఇంత గుక్కెడు  నీళ్లల్లో కలుపుకు తాగుదామని ఉన్నా..  ఆ చికోరి రుచి  వలలో చిక్కుకున్న దౌర్భాగ్యానికి కాఫీ చుక్క గొంతులో దిగక పోతే పక్క కూడా దిగ బుధ్ధి కావడం లేదు!   
 తాపీ ధర్మారావుగారోసారి కాఫీపై దండకం చెప్పమంటే పోకూరి కాశీపతిగారు ఆశువుగా  కాఫీ జగన్మోహిని జన్మవృత్తాంతం గూర్చి గురజాడ గిరీశాన్ని మించిన థియరీ కూర్చి వినిపించేసారు. తొల్లి శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాతాన్ని తెచ్చి సత్యభామకు ఇచ్చే సందర్భంలో  దారిలో దాని గింజ నేల మీద రాలి  కాఫీ చెట్టుగా మొలిచిందంట! 
'అనుదినమ్మును కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు' అంటూ లేటెస్టుగా కాఫీ టేస్టును గూర్చి మిథునం  చిత్రం కూడా  జై కొట్టింది.
 ‘కాఫీశ్వరీ! నెస్సుకేఫేశ్వరీ! బ్రూకుబాండేశ్వరీ! గంట గంటా ప్రతీ యింటా ఉప్పొంగవే ఉష్ణ పానీశ్వరీ!’ అంటూ ప్రాథేయ పడ్డం తప్పనిసరి. మరేం చేస్తాం? మనిషిగా పుట్టేం కదా.. గిట్టే దాకా కాఫీలు తాగడం కంపల్సరీ! 

-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి  సుత్తి.. మెత్తంగా-  కాలమ్ లో ప్రచురితం)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...