Friday, July 3, 2015

పెళ్లాం చెబితే వినాలి- ఓ సరదా గల్పిక


పెళ్లాం దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గోతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామకాళ్ళు పట్టుకోలేదా?
 'దేవుడా! నాకు కష్టాన్నివ్వు! బాధల్నివ్వు! టెన్షన్నివ్వు!' అని నాలాంటి ఓ విరాగి కోరుకుంటే- 'ఇదిగో నీ కోరికలన్నింటినీ తీర్చే సాధనం!' అంటూ నీ లాంటి భార్యామణి నిచ్చాడోయ్ ఆ భగవంతుడు!' అన్నాను మా శ్రీమతితో ఓసారి ఎద్దేవాగా.
తనేమన్నా తక్కువ తిన్నదా! ' ఆహాఁ!  మరా భార్యామణినే 'బెటర్ హాఫ్' అని ఎందుకన్నారో మీ మగాళ్లూ! ఆడది అందుబాటులో ఉండేవాటినే కోరుకొంటుంది. మహేష్ బాబు జుత్తు ఎంత ఒత్తుగా ఉంటే నా కేంటి! నా మొగుడు నెత్తిమీద జుత్తుమాత్రం నా గుప్పెటకి చిక్కేటంత ఎత్తులో ఉండాల’ని కోరుకొనే అమాయకురాలండీ ఆడది! ఆ ఇంగితం మీ మగమూర్ఖులకు అర్థం కాదులేండి ఎన్ని యుగాలకైనాగానీ!' అఏసింది!
'మేం మూర్ఖులమా?'
'మరి! మీకో తమాషా కథ చెప్పనా! ఓ అందమైన ఉద్యానవనమంట! దాన్నిండా పండ్లు, పూలు, కాయలు. అందమైన బుజ్జి బుజ్జి ఎన్నో రకాల జంతువులు.. ఆమెకు తోడుగా! ఐనా ఆమెకు ఏమీ తోచేది కాదంట! సరదాగా ఆడుకొనేందుకు సరిపడా జోడునివ్వవా? అని దేవుడుగారి దగ్గర మొరపెట్టుకొందట బుద్ధి గడ్డితిని.. 'ఇస్తాగానీ! రెండు షరతులు! ఆ వచ్చే జోడు మొరటుగా, నీకన్నా బలంగా ఉంటుంది. ఓకేనా! ఇహ రెండో షరతు. వాడు నీకన్నా తానే ముందు పుట్టానని.. నువ్వే వాడి పక్కటెముకలనుంచి పుట్టుకొచ్చావని కోస్తుంటాడు. నువ్వా అజ్ఞానిని  సహించి నమ్మినట్లు నటించాలి.. మరి' అన్నాడుట దేవుడు. జోడుకోసం ‘సరే’ననక తప్పింది కాదు పాపం ఆ పిల్లకి. అప్పుడలా ఒప్పుకున్న పాపానికే మీ మగాళ్ల మూర్ఖత్వాన్ని, చపలచిత్తాన్ని చచ్చినట్లు భరించి చేస్తున్నాం ఇన్ని యుగాలబట్టీ!' అనేసింది మళ్లీ మా ఇంటిదీపం.
ఎంతైనా మగాణ్ని! నాకు కోపం రాదా! 'మాది చపలచిత్తమా?' అని గయ్యిమన్నాను వళ్ళుమండి.
'మీదే కాదు. మిమ్మల్ని మాకు అంటగట్టిన ఆ దేవుళ్లది కూడా! ఒక భార్యను పక్కలో పెట్టుకొని మరో భామను నెత్తిమీద పెట్టుకొన్నాడు  బిచ్చమెత్తుకొని బతికే దేవుడు శివయ్య. ఒక భార్యచేత అస్తమానం కాళ్లు పట్టించుకోడం చాలక మరో భార్యకోసం పరుగెత్తి అవతారాలెత్తిన మహాపురుషుడు విష్ణుమూర్తి. ఆలికోసం అంతలావు యుద్ధంచేసి.. తీరా సాధించినాక శీలం నిరూపించుకోమని సాధింపులు సాగించిన వీరపురువుడు    శ్రీరాముడు. దేవుడూ మగాడే కదా! బెడ్-కాఫీ దగ్గర్నుంచీ.. బెడ్ ఎక్కేదాకా తన అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాళ్లకో అహంభావం. తలొంచుకొని తాళి కట్టించుకొంటుందని ఎగతాళి కామోసు? పాచిపనిచేసే పనిమనిషికి, బట్టలుతికి ఇస్త్రీచేసే లాండ్రీమనిషికి డబ్బివ్వాలి. కప్పుడన్నం  ఎక్కువడిగినా ఎక్స్ ట్రా బిల్లేస్తాడు హోటలువాడు. సర్వారాయుడైతే నిర్దాక్షిణ్యంగా దక్షిణ బాదేస్తాడు. మీకూ, మీరు కనిపారేసిన పిల్లాపీచుకూ తన సొంతపన్లుసైతం మానుకొని కంచిగరుడసేవచేసే ఆడది మాత్రం గడప దాటి లోపలికొచ్చేముందు  లక్షలు కోట్లు  కట్నంకింద ఎదురు కుమ్మరించాలి. ఛ! ఆ జాన్ గోట్ మ్యాన్ చెప్పిన మాటన్నా చెవినబెట్టకపోతిని.. పిచ్చిచచ్చిందాన్ని!'
'మధ్యలో ఆ జాన్ గోట్ మ్యాన్ ఎవడే బాబూ నా ప్రాణానికి?!'
'మొగుళ్ళు మోటారుబళ్ళలాంటి వాళ్ళని. మొదటి ఏడాది మాత్రమే  బాగా నడిచేదని..  మొహమాటానికనిపోయి మీ స్వేచ్చ పోగొట్టుకోవద్ద’ని తస్మాత్ జాగ్రత్తలు చాలా  మొత్తుకున్నాడులేండి మొదట్లో ఒహాయన.. ఆయనా!'
ఓహో! మగాళ్లలాగా ప్యాంట్లూ, గళ్లగళ్ళషర్ట్లూ వేసుకోవడం, పొద్దుపోయేదాకా బైట బలాదూర్లు తిరగడం.. ఇదేనా మ్యాడమ్ మీ దృష్టిలో స్వేచ్చా వాయువులు సంపూర్ణంగా  పీల్చడమంటే! దాన్ని స్వాతంత్ర్యమనరు. మగాడి ఆధిక్యాన్ని ఒప్పుకోవడమంటారు' అన్నారు జగ్గీ వాసుదేవ్.'
'ఓహో! గురూగారికి ఇప్పుడు ఆ సద్గురుగారు గుర్తుకొచ్చారన్నమాట! ఆయనింకా చాలా మంచిముక్కలుకూడా చెప్పారు మహాశయా! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవాల్సింది పామిస్ట్రీని కాదు.. ఆలూమగలమధ్య కెమిస్ట్రీని. పెళ్లయితే అబ్బాయి, అమ్మాయి ఒకటవుతారు. నిజమే కానీ.. ఎవరు ఎవరవుతారన్నదే అసలు సమస్య. మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో  కుర్చీల్లాంటి వాళ్ళు. రెండు సీట్లకూ కలిపి ఒకే ఒక్క రెక్క ఉంటుంది. ఇద్దరూ సర్దుకుపోవాలిసినిమా ప్రశాంతంగా చూడాలంటే. స్త్రీపాత్ర లేకుండా నాటకాలు నడుస్తాయేమోగాని.. సంసారాలుమాత్రం సవ్యంగా సాగవు. ఆలూమగలు ఆలూమసాలా కూరిన  సమోసాలాగా ఉండాలి. ఓడి గెలవడమన్న సూత్రం ఒక్క భార్యాభర్తలబంధంలో మాత్రమే రాణిస్తుంది. మొగుడూ పెళ్లాలు కాటాకుస్తీ వస్తాదులు కాదుగదా! ఇద్దరూ కలసి ఏడడుగులు వేసిన్నాడే ఒకటైనట్లు లెక్క. అతను ఆకాశమైతే.. ఆమె భూదేవి. అతను వాక్కు అయితే.. ఆమె మనస్సు. కాపురమనే బైకుకు
అతను చక్రమయితే.. ఆమె ఆ చక్రాన్ని అదుపులో పెట్టే బ్రేకు.. గేరు. పెళ్ళితంతులో వల్లించే ప్రతీమంత్రానికి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. తెలుసా సారూ! ఆలుమగలనేది సీతారాములు వంటి ఒక అందమైన ద్వంద్వసమాసం గురూ! అనురాగం ఛందస్సు కుదిరి, సరైన యతిప్రాసలు పడితే పోతన పద్యమంత హృద్యంగా ఉంటుంది సంసారకావ్యం. వేలుపట్టుకొని  నడిచివచ్చిన భార్యవంక వేలెత్తి చూపించేముందు మొగుడు తనలోపలకికూడా తొంగిచూసుకోవాలి. నిజమే! భర్తపేరు చెప్పడానిక్కూడా సిగ్గుపడే ముగ్ధ భర్త సిగ్గుపడే పని ఎన్నటికీ చేయకూడదు.  పెళ్లంటే.. 'అరే! అప్పుడే నూరేళ్ళు గడిచిపపోయాయా?!' అన్నట్లు సాగిపోవాలి. ఆలుమగలమధ్య అలకలు అకుమీద నీటిబొట్లు. అవి జారిపోయేంతసేపు ఉంటేనే ఇంపూ.. సొంపూ! వాదులాట లేనంతవరకే ఆదిదంపరతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే.. మీకొకరు వచ్చి  చెప్పాలా! మొగుడూ పెళ్లాల మధ్య పంచాయితీలో మూడోమనిషికి దూరే సందివ్వరాదన్నది రాయని సంసార రాజ్యాంగసూత్రం.  అనాదిగా అదే నడుస్తున్నది మన కుటుంబ వ్యవస్థలో!'
సుమతీ శతకమంత  చక్కగా చెప్పుకొచ్చింది కదండీ మా శ్రీమతి! ఒప్పుకొని తీరాల్సిదే! ఓప్పుకొన్నాను కూడా!
'నువ్వన్నమాట నిజమేనోయ్! అందుకే ఈ మధ్య ఓ విడాకులకేసులో సర్వోన్నత న్యాయస్థానంసైతం  కలగజేసుకొనేందుకు 'ససేమిరా' అంది. పైపెచ్చు 'పెళ్ళాం చెబితే వినాలి! మేమందరం అదే చేస్తున్నాం ఇళ్లల్లో!' అని నిజం ఒప్పుకేసుకొన్నారు కూడాను కేసు విచారించే శ్రీమాన్ న్యాయమూర్తులవారు.
'చూసారా! భూమ్యాకర్షణకన్నా భామాకర్షణ ఎంత మిన్నో! భూమికి లొంగి నడవగాలేంది.. తాళికట్టిన భామకు లొంగి నడిస్తే తప్పేముంది! చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత అడ్డదిడ్డంగా  ఎందుకు రాస్తున్నాడో తెలుసాండీ! పెళ్ళాన్ని అడిగి రాయాటానికి 'అహం బ్రహ్మస్య' అన్న అహంకారం అడ్డంపడి! అందుకే అనారు…'
'..పెళ్లాం చెబితే వినాలి.. అని' అంటూ వంతపాడడం నావంతయింది చివరకు.
***
-కర్లపాలెం హనుమంతరావు

(26-06-2009 నాటి 'ఈనాడు' సంపాదక పుటలో ప్రచురితం)

Thursday, July 2, 2015

రామాయణం- ఒక్క వాల్మీకి విరచితమేనా?- ఒక విమర్శ, విశ్లేషణ


‘యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని బ్రహ్మ వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ అన్న మాట. రామాయణమంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు. ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో తీర్చిదిద్దిన ఆదికావ్యం రామాయణం. పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను ఒకే తీరులో ఆకర్షించే గుణం రామాయణంలో ఏదో ఉంది.
వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును కుమారరాముడు సునాయాసంగా విరవడంలాంటి అతిమానుష సన్నివేశాలు రామాయణంనిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు దండిగా ఉండబట్టే రామాయణం చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రిక కన్నా ఎక్కువ చర్చనీయమౖందేమో! శతాబ్దాలబట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు చెయిచేసుకున్నకథ రామాయణం. భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమైవడం సహజ పరిణామమే.
వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథా దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి రామాయణంలోని అన్ని భాగాలూ వాల్మీకి విరచితాలేనని చెప్పలేని స్థితి. మొదటి వాల్మీకి పుట్టించిన కావ్యం మరో వాల్మీకి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరన్ని ప్రక్షిప్తాల హంగుల్ని రంగరించుకుందన్న వాదనా కొట్టివేయదగింది కాదు.
‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన

ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న బాల కాండ (2,1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో చెప్పుకోవడం కాదు కానీ.. వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో స్వోత్కర్ష చేసుకోవండం వల్ల కలిగే సందేహం, తరువాతి శ్లోకాల్లోని భగవాన్( బాల 2, 9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2, 17) వంటి పొగడ్తలతో మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునే కుసంస్కారా వాల్మీకి మహర్షి?
క్రౌంచ పక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ చందస్సులో ఉండటం.. తదనంతరం ఆ చందస్సులోనే సంపూర్ణ రామాయణం కథనం చేయాలని కవి సంకల్పించడం జగద్వితం. వాల్మీకి రామాయణ శ్లోకాల్లో అనుష్టుప్ ఛందస్సుకు భినమైన ఛందస్సూ కనిపిస్తుంది! అదంతా అనంతర కాలం తాలూకు మరో వాల్మీకి ప్రక్షిప్తమై ఉంటుందని సందేహించడంలో అసమంజసమేముంది?
నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలోగానీ, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలోగానీ బాలకాండకు సంబంధించిన కథ ఆట్టే లేదు. వాల్మీకి రామాయణ బాలకాండలోనే రామసంబంధమైన కథ ఉన్నది కడు స్వల్పం. అప్రస్తుతమని తోచే కథాభాగమంతా ఆ ‘మరో వాల్మీకుల’వారి నై’పుణ్య’మేమో?
ఉత్తరకాండలోని శంబూక వధ మాత్రం? తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వచ్చే సందర్భంలో- కృతయుగంలో బ్రాహ్మణులు, త్రేతాయుగంలో అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు, కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులన్నట్లు ఒక సిద్ధాంతం ఉన్నట్లు అర్థమవుతుంది. తద్విరుద్ధంగా త్రేతాయుగంలో దీక్ష చేబట్టినందువల్లే శూద్ర శంబూకుడు వధ్యుడన్నట్లు వాదన ముందుకొచ్చింది. విశ్వామిత్రరుషి క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగనుకుని వధించిన బాలకుడు ఒక శూద్రతపస్వి కన్నకొడుకు. ఇలాగే ఇతిహాసాలనిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన దృష్టాంతాలు పుష్కలంగా ఉన్నప్పుడు వాల్మీకివంటి సామాజిక తత్త్వవేత్త ఇంత పెద్ద తప్పిదం చేస్తాడా?! తదనంతర కాలంలో వాల్మీకేతర కవులెవరో చొప్పించిన ప్రక్షిప్తాల చలవే ఈ స్ఖాలిత్యాల గోలంతా.. అని అందుకే అనిపించేది.
ప్రథమ రామాయణం రాసిన వాల్మీకి రామునికి సమకాలీనుడని కదా భావన! జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడనడం హేతుబద్ధంగా ఉందా? కావ్యారంభంలో వాల్మీకి చేసుకున్న కథాగమన మననంలో ఉత్తరకాండా ఉంది కదా అని వాదించ వచ్చు. ఆ సర్గా ఎందుకు ప్రక్షిప్తమై ఉండకూడదూ?!
లంకాధిపతి వేదపాండిత్యంగల పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధిమీద విశ్వాసమున్నవ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నమవాలని చూస్తాడా?! ‘రావణుడు రాక్షసుడు. అసురుడుగా ప్రచారం చరిత్ర దృష్ట్యా దోషం’ అనుకుందామనుకొంటే సుందరకాండలో తద్విరుద్ధమైన భావం (సుందర 20, 5-6) ఎదురవుతుంది! ఎత్తుకొచ్చిన స్త్రీకి మనసు దిటవు పరుచుకొనేందుకు వీలుగా ఒక ఏడాదిపాటు అవకాశంగా ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని స్రీని భక్షించడం ఆదిమ జాతుల్లో తప్పు కాదు. రాక్షస రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడుగానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనడు! పైపెచ్చు ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి . ఆదర్శనీయమైన భావన అది. ప్రధానపాత్రలలోనే ఇన్ని పరస్పర వైరుధ్యాలా?! రామాయణ కర్త ఒక్కరు మాత్రమే కాకపోవడమే ఇంత గందరగోళానికి కారణమనుకోవాలి.
ఆచారాలనుబట్టి, కొన్నిభాషనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారేమోనని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు) ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. (అందుకేనా ఆడవారికి తోకలున్నట్లు రామాయణంలో ఎక్కడా చెప్పలేదు?) రామాయణంలోని లంక, జన స్థానాలకి సవర పదాలు లంకాన్, జైతాన్ మూలాలేమేమోనని గో. రామదాసుగారి ఊహ. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ఆలోచన. దండకారణ్యంలో విశేషంగా నీరుండబట్టే అరణ్యకాండ (11, 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అన్న శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలంమీద రకరకాల పుష్పాలు, ఫలాలు, పక్షుల రవాలు, హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’న్న వర్ణనకు అతికినట్లు సరిపోతుంది.
చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉండె! చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం వానరజాతి నాగరిక లక్షణ విశేషాలు. అభివృద్ధి పరంగా ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయారో? నమ్మదగ్గ అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేం. కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ. అదో వింత!
రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడుతున్నారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా కాలక్రమేణా అది గద్దగా ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా?
ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని ఉరోవన్ అనే ఒక శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్ తీరం ఖరమండలం అనే మూలపదం నుంచి ఉద్భవించింది. రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే కావచ్చన్న రాయ్ గారి అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది
‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ
ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా. ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది! రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?
ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా గోరంత వాస్తవికతకు కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో ఓ అందమైన కావ్యానికి సరిపడినంత సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో ఆ కావ్యంలోకొచ్చి పడ్డ ప్రక్షిప్తాల తంతు సరే సరి!
అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత!

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబా?
సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.
కర్తృత్వం సంగతి కాసేపు పక్కన పెడదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ల పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ కవిశ్రేష్టుడైన వాల్మీకి మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు. పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం. కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి. ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం. వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ.
మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడు లేని గుడి లేదు. రామకథ వినిపించని బడి లేదు. సీతారాముల్ని చిత్రించని కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం. దేశదేశాలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధం.
ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ ధన్యులు.
-రచన: కర్లపాలెం హనుమంతరావు

సంప్రదించిన కొన్ని రచనలుః
వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు
రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు
రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి
రామాయణమునందు వానరులు ఎవరు? – గో. రామదాసు
రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya
(మాలిక- అంతర్జాల పత్రిక జూలై 2015లో ప్రచురితం)

Wednesday, July 1, 2015

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ

ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
'స్వామీ! మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచిభవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమలను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా బతకలేను. క్షమించండి!' అన్నాడు రుషివర్యుడు.
'పోనీ.. శరీరంమీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులుకదా ఆత్మమీది ఈ శరీరం! ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా!
మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది బాదుషా!' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
'కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగగదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకయ్యా మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధువుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 
'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషివర్యునికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా అర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేం మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడో? అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా సొంతానికి ఏర్పాటు చేసుకోగలను.. ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు   'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?'
గురువుగారి బోధనను విన్న  శిష్యపరమాణువు నోరువెఃఃఅబెట్టాడని వేరే చెప్పాలా!
***
-కర్లపాలెం హనుమంతరావు
( నా నోట్ సునుంచి సేకరించినది. సోర్సు తెలియ లేదు)



Tuesday, June 30, 2015

ఇంతకీ ఆ సీసాలో ఏముంది?- చిట్టి సరదా కథ


శిబి చక్రవర్తి గొప్ప దాత. దయా గుణం జాస్తి. ఉశీనరుడు అనే మహారాజుకు కుమారుడుగా జన్మించిన ఇతని చరిత్ర మహాభారతం, రామాయణంలాంటి పురాణాలలో,  బుద్ధుల జాతక కథలోసైతం  పేర్కొనబడింది.
భృగుతుంగ పర్వతంమీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడివరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. ఒక పావురంగా మారాడు దేవరాజు.
రాజుగారు యజ్ఞంచేసే సమయంలో అతని ఒళ్ళోకి  ఎగిరివచ్చి ఆ పావురం మానవభాషలో
'రాజా! నన్నొక డేగ తరుముకొంటూ వస్తోంది! రక్షించు!' అని వేడుకొంది. రాజుగారు 'నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. భయపడకు!' అంటూ ఆ పావురానికి అభయమిచ్చాడు.
అదే సమయంలో ఓ డేగ అక్కడికి  ఎగురుకుంటూ వచ్చి మానవభాషలోనే 'రాజా! నా నోటిదగ్గర ఆహారాన్ని దాచెపెట్టాడం రాజుగా నీకు ధర్మంకాదు. పావురాన్ని విడిచిపెట్టు! నేను ఆకలితో చచ్చిపోతే ఆ పాపం నీకు అంటుకొంటుంది' అంటూ వాదనకు దిగింది. ధర్మవర్తనుడైన శిబిచక్రవర్తి డేగ హేతుబద్దమైనవాదనను కాదనలేకపోయాడు. 'పావురానికి సరిపడా ఆహారమే కదా నీకు కావాలి. ఇస్తాను. తీసుకో!' అంటూ అప్పటికప్పుడు ఒక కత్తి, త్రాసు తెప్పించి.. పావురాన్ని ఒక సిబ్బెలో ఉంచి మరో సిబ్బెలో తన శరీరాన్నుంచి కొంత మాంసాన్ని కోసి తూచాడు. ఎంత మాంసం తాచులో వేసినా పావురానికి సరిపడా తూగడమే లేదు! చూపరులందరు ఆశ్చర్యంతో నోటమాట రాకుండా నిశ్చేతనంగా నిలబడిపోయారు. చివరికి రాజుగారే స్వయంగా సిబ్బెలో కూర్చొన్నారు. ఆశ్చర్యం! అయినా పావురాయివున్న సిబ్బె కిందకి దిగనే లేదు!
శిబి ఖిన్నుడవడంచూసి సభలోని విదూషకుడు 'మహారాజా!  మీరు అనవసరంగా వంటినిండా  గాయాలు చేసుకొన్నారు. పావురాయికి సరితూగే సాధనం నా దగ్గర ఉంది' అంటూ అంగీలోనుంచి ఒక సీసాతీసి అందులోని ద్రవాన్ని మూడొంతులు గొంతులో వంపుకొని నాలుగోవంతు మిగిలిన సీసాని త్రాసు సిబ్బెలో వేసాడు. ఆప్పటిగ్గాని పావురం  సరితూగింది కాదు!
ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై శిబి అసమాన దానశీలతకు, విదూషకుడి నిరుమానమైన తెలివితేటలకు సంతసించి కోరిన వరాలిచ్చి వెళ్ళిపోయారు.
ఇంతకీ ఆ సీసాలో ఉన్నది ఏమిటి?
పావు.. రమ్!

పావురానికి సరితూగేది పావు రమ్మేగదా!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఎప్పుడో చదివి రాసిపెట్టుకొన్న నోట్ సునుంచి కొద్ది సొంతపైత్యంతో-సోర్సు నోట్ చేసుకోలేదు.. సారీ!)


Monday, June 29, 2015

అలా అయితే మనమే ఒలంపిక్సులో ఛాంపియన్స్!- సరదా గల్పిక


ఏడు దశాబ్దాలు  గడిచిపోయాయి.. దేశం దాస్యం సంకెళ్ళు తెంచుకొని! దాని దుంపతెగ.. ఏడుగురికిమించి ఒలంపిక్సు విజేతలు మన దగ్గర తేలకపోతిరే! నూటపాతిక కోట్లమందున్నాం        జనాభా! ఎందుకూ?  దేశమాత పరువు గంగలో కలుపుతున్నాం అందరం!
ఒలంపిక్సు ఇప్పట్లో లేవే! ఇప్పుడెందుకబ్బా ఈ దెప్పుళ్ళూ! ఉన్నప్రతిభను పట్టించుకోకుండా.. లేనివాటిని.. తేలేని వాటిని గురించి విలపించడం ఈ మద్య మరీ ఫ్యాషనై పోయింది! దేశమాత పరువు పోతోందని బావురుమంటున్నావు గానీ.. ఆ లోటు తీరుస్తున్న మనపాలిటిక్సు పెద్దల్నిమాత్రం  తెగ తిట్టిపోస్తున్నావ్!
క్రీడలలోటును రాజకీయాలు పూడ్చడమా? పెద్ద జోక్!
ఒలంపిక్సులో మన రిలే ఆటగాళ్లెప్పుడూ బొక్కబోర్లా పడుతుంటారని నువ్వేగా తెగ విమర్శిస్తావు! ఆ లోటునిప్పుడు మన రాజకీయవేత్తలు ఎంత వడుపుగా   పూడుస్తున్నారో చూడవా! నెహ్రూజీనుంచి పుత్రిక ఇందిరా ప్రియదర్శిని, ఆ ప్రియదర్శిన్నుంచి బిడ్డ రాజీవ్ గాంధీజీ, ఆ రాజీవ్ జీనుంచి భార్యామణి సోనియమ్మాజీ, ఆ సోనిమ్మాజీనుంచి ఇప్పుడు బుజ్జి రాహుల్ బాబూజీ.. ఇలా ఐదు తరాలబట్టీ ఆ   ‘జీ’ళ్ల ఫ్యామిలీనే అధికార మంత్రదండం  రిలే పరుగులతో ఎలా 'చేతులు' మార్చుకొంటూ నెట్టుకొస్తుందో నీకు పట్టదు! ప్రపంచంలో ఎక్కడైనా మరీ ఇంత కట్టుదిట్టమైన రిలేపరుగులు నడుస్తున్నాయా నువు చెప్పు!
ఓహో!.. అలాంటి క్రీడలా బాబూ తమరు చెప్పేది! ఆ ఆట ఇక్కడ మన తెలుగురాష్ట్రంలోకూడా  ఆడనివ్వడంలేదనేగా  జగన్ బాబు అలక పానుపెక్కింది!
ప్రస్తుతానికి ఆ టాపిక్కు అప్రస్తుతంలే! ట్రాకు తప్పితే నాకు  టాకు కష్టమవుతుంది.  ముక్కూమీదా మూతిమీదా రక్తాలు కారేటట్లు గుద్దుకునే మీ బాక్సింగూ ఓ
క్రీడేనంటావా? దెబ్బంటే కంటికి కనపడకుండా పడాలి! మూడో కంటికి తెలీకుండా మట్టి కరవాలి! చేతికి మకిలంటకుండా గొయ్యి తియ్యాలి. ఏ క్రిమినల్ సెక్షన్లకందకుండా క్షురకర్మకాండమొత్తం గమ్మున  కానివ్వడంలోనే ముష్ఠికళంతా బైటపడాలి. అలాంటి క్రీడానైపుణ్యం కోకొల్లలుగా ఉన్నా మన రాజకీయనేతల్ని నువ్వేనాడన్నా  నోరారా 'శభాష'న్నావా? ఏడుపదులు దాటిన ఎవడో మూడుకాళ్ల ముసలిడొక్కు గుర్రపుస్వారీ కళలో తెగ మెప్పించేసాడని డప్పుకొడుతున్నావ్ గానీ, కాటికి కాళ్లు చాపీ.. ఒంట్లో ఓపిక లేకపోయినా.. వృద్దపితామహులు ఎందరో వళ్ళు తూలుళ్ళనుకూడా లెక్కచేయకుండా వణుక్కుంటూ వణుక్కుంటూ రాజకీయాలను ఎంత కళగా నెట్టుకొస్తున్నారో! వాళ్లనొక్కమారైనా నోరారా పొగిడిన పాపాన పోయావా? మనదేశ పతాకం లండన్లో ఎగిరినా, లడక్లో గింగిరాలు కొట్టినా  నీ వళ్లోకేమీ బంగార్రాసులు  వచ్చి రాలవుగదా సోదరా! సర్కారువారి బుగ్గకారు నీ కొచ్చి.. దానిమీదగానీ నీ పార్టీజెండా ఎగురుతుంటేనేగదా దర్జా.. దర్పం! బోడి  ఒలంపిక్సు రికార్డులకోసం అంతలా కొట్టుకు చావడ మంతవసరమా? నీ కన్నా ఖిలాడీగాడెవడో వచ్చి నీ రికార్డులుగట్రా  బద్దలుకొట్టేస్తే నీ ఆట శాశ్వతంగా కట్టయి పోయినట్టేగదా! అంతమాత్రం దానికి ఇన్ని అష్టకష్టాలు దేనికి.. ఆలోచించవా? నీ కన్నవాళ్ల చేతుల్లో ఎన్ని వందల బంగారు పతకాలైనా పొయ్యి.. ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టుకి అవేవీ ఎప్పటికీ సాటిరావు. మెడలు ఇరగ్గొటుకొని  వంద మెడల్సు నువు సాధించినా సర్కారుపెద్దలు దయతలిస్తేనేనబ్బా  రొక్కమైనా.. శివార్లలో భూమిస్తానన్న హామీ ఐనా నీకు దక్కేది! అదే నీకు నువ్వే ఓ ప్రజాప్రతినిధివయావనుకో! వయా ఎమ్మేల్యే సీటు రూటులో కోట్లక్కోట్లు  ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేకుండానే కుమ్మేసుకోవచ్చు!  రకరకాల పతాకాలు మన ఇందిరాపార్కుదగ్గరి   ధర్నాచౌకులో రోజూ రెపరెపలాడుతుంటాయ్..  మరి దేనికోసమంట?!
నీ ఒలంపిక్సులో ఓ పక్షం రోజులే జెండా పండగ.   మన రాజకీయాల్లో రోజూ జెండాల పండుగే!  అక్కడి ఆటలు మొత్తం కలిపి కూడినా ఓ మూడొందలు మించుండవు మహా. అదే మరి మన రాజకీయాల్లోనో? రోజుకో కొత్తరకం ఆట! ఒలంపిక్కు ఆటల్ను అటల్బీహారీబాజ్పాయి ఇప్పుడున్న స్టేజిలోకూడా ఒంటిచేత్తో ఈజీగా  నిర్వహించేసవతల పారేయవచ్చు. పాలిటిక్సుక్రీడల  నిర్వహణకి ఎంత పరిణితి  అవసరం? అధిష్ఠానం కనుసన్నల్లోనే కదులుతుండాలా! తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతుండాలా!  కుంగ్ఫూలూ, కరాటేలూ, పంచిలూ, ఫెన్సింగులంటూ ఏవో నాలుగు బోర్డ్లు ఎవరెవరో మెళ్ళకు తగిలించేసుకొని బోరవిరుచుకోంగానే వాటికి నువ్వింతగా హారతులు పడుతున్నావే! అంతేలే! పెరటిచెట్లు మందుకు పనికిరావన్నట్లు .. మన రాజకీయక దిగ్గజాలు దుగ్గూదూగర్లా  నీకంటికానరు! నీ ఒలంపిక్సు  నాలుగేళ్ళకొక్కసారొచ్చి పోయే కొక్కిరాయి సంబడం. భూమి పుట్టకముందునుంచి ఉందబ్బా  మన భారతీయుల రాజకీయ క్రీడావైభవం!
ఒలంపిక్సులో నువ్వెంత ఒళ్ళిరుచుకొని నైపుణ్యం చూపించినా చివరకు దక్కేది
ఒక్క బంగారబ్బిళ్లేరా! అదే మన రాజకీయాల్లో?  వడుపు చూపి ముందుక్కదిలివానుకో..   వళ్లుకందకుండానే కిలోలకొద్దీ  బంగారం కందకాల్లో దాచుకోవచ్చు!  ఒలంపిక్కా?.. వాన్ పిక్కా? అని నీకింకా సందేహమేనందువా?
సందు లేకుండా వాయగొడుతున్నావ్! ఇహ సందేహమెందుకుంటుందులే!  అయితే అసలు సిసలు   ఆటలన్నింటినీ అటకెక్కించాల్సిందేనంటావ్ నువ్వు?!
మరి! నీ మాయదారి ఆటల్లో మ్యాచ్ ఫిక్సింగు పీడా ఒకటి! ఆ ముద్ర ఒక్కసారి పడిందనుకో.. ఆటగాడి లైఫుగాడీ పర్మినెంటుగా షెడ్డుపాలు! అదే తంత్రం రాజకీయాల్లో వడుపుచూసి వదిలావనుకో.. పదవులే పదవులు! కోట్లే కోట్లు! సంపదే సంపద! అవినీతిని కడిగిపారేస్తానన్న మీ అన్నాహజారేనే ఒకదశలో రాజకీయక్రీడలమీద తెగ మోజు చూపించాడబ్బా! పొలంబాట.. బడిబాట.. బస్తీబాట.. పాట ఏదైనా అదంతా రాజకీయాల్లో ఒక కొత్తరకమైన ఆటేరా బుజ్జికన్నా! వయసుతో నిమిత్తం లేకుండా పెద్ద పెద్ద వృద్ధనేతలుసైతం  పాదయాత్రలుకు ఎందుకు  ‘సై’ అంటారంటావ్?
    ఆ మారథాన్ మూలకంగా  ఆరోగ్యం బాగుపడుతుందనీ!
అమాయకుడా! నువ్వు బాగుపడవురా ఈ జన్మకింక! మూలబడ్డ పొలిటికల్ బతుకుబండిని మళ్ళీ రోడ్డుమీదకు లాగాలని..  జనంమధ్య మహారాజులా మళ్ళా ఊరేగాలని ఆ ఉబలాటమంతా! ఒలంపిక్సు నడిచే నాలుగురోజులేగా జనంనోళ్లలో నీ చాంపియన్ల పేరు తెగ నలిగేది! అదే రాజకీయాల్ని నమ్ముకొన్నావనుకో! రోజూ మీడియాలో డబల్ రోస్టు పెసరట్ విత్ అల్లం ఉల్లి పేస్టు! అమ్ముడుపోతూ బైటపడితే   ఆటగాడి బతుకింక చాకిరేవుబండమీది చింకిపాత సామెతే! అదే రాజకీయక్రీడల్లో?  అమ్మకం గ్లామరుకు గుర్తు. ఆనక పదవికి  పైపదవికి ప్లస్సు. ఇహ ప్రచారానికైతే   ఉండదు కానీ ఖర్చు!
ఐనా కానీ మన రాజకీయనాయకులమీద నాకింకా  ఎందుకో ఏమాత్రం నమ్మకం,  గౌరవం కలగడం లేదు బాబాయ్!
వాళ్లనలా వదిలేయవోయ్! ఒలంపిక్సులో పతకాలు రావడంలేదనేగా పదిరోజులబట్టీ శతకాలు చదువుతున్నావ్!  నీ కోరికతీరే దారొకటుంది.. చెప్పనా! పెద్ద పెద్ద ఆటగాళ్ళకు బదులుగా  మన సగటు నగరం ఓటర్లలో ఎవర్నైనా ఒలంపిక్సు గోదాలోకి దింపి చూడు! స్వర్ణాలకు స్వర్ణాలే స్వర్ణాలు!  వాటికవే దొర్లుకుంటూ మెళ్లోకొచ్చి పడతాయ్!  మరి దానికేమంటావ్?

అదెలాగా?!
వెయిట్ లిఫ్టింగు పోటీలకు గ్యాసుబండల్ని అవలీలగా మోసే  మీ పక్కింటి పిన్నిగారిని పంపరా! దూదిపింజల్లా ఆ బరువుల్నెత్తవతల పారేయకపోతే నా నెత్తిమీద ఓ బండేసి మొత్తరా! మన భాగ్యనగర రహదార్ల గోతుల్ని దాటివెళ్లే వాళ్లెవర్ని ఎన్నికచేసి పంపించినా చాలు..  పోల్ జంప్ ఈవెంటులో పోలెండు రికార్డు బద్దలవడం ఖాయం. బస్సులమీదా, వేదికలమీదా రాళ్లు విసిరే బాపతు  అనుభవం.. డిస్కస్ త్రో ఈవెంటుకి కలిసొచ్చే నైపుణ్యంరా బాబూ! స్కూలు బస్సుల వెనకాల పరుగెత్తే బడికెళ్లే బుడతళ్ళు ఎంత లావు 'బోల్టు'నైనా పరుగుపందెంలో  పల్టీ కొట్టించెయ్యగలరు. ఎలాగూ మనకు మోదీజీ ఉండనే ఉండె! యోగా మోడల్లో ఒలింపిక్   క్రీడల్లో  రాజకీయాలుకూడా   చేర్చేట్టు చూడు! రాబోయే  ఒలంపిక్సులో బంగారం పతకాలన్నీ మనవే! దానికేగా నీ ఏడుపు!
***

-కర్లపాలెం హనుమంతరావు
(ఈ నాడు - ఆగస్టు 14-2012 దినపత్రికలో ప్రచురితమైన దానికి చిరుసవరణలతో)





Saturday, June 27, 2015

మనలో ఒకడే- కానీ లక్షల్లో ఒకడు! -వీడియో

https://www.blogger.com/video-thumbnail.g?contentId=1e11639b20e60a99&zx=u5qw4hctm1de

తెలివి తేటలు ఒకరి సొత్తు కాదు.
అవి కులాన్ని బట్టో , మతాన్ని బట్టో వచ్చేవి  కాదు .
మనిషి పరిసరాల ప్రభావాన్నుంచి తప్పించు కోలేడు.
ఈ పసివాడి ప్రతిభ సమాజాన్ని ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నదో చూడండి
పని మీద అర్జంటుగా పోతున్నప్పుడో 
తోచక అలా ఏ ట్యాంక్ బండ్ మీదో షికారుకు వెళ్లినప్పుడో,
ఆదివారం పూట సినిమా హాలు బయట బ్లాక్ లోనయినా సరే టిక్కెట్ కొని సినిమా చూసి తీరాలనో తహ తహ లాడే వేళ
తలెత్తి ఒక్కసారి చుట్టూ చూస్తే
ఇలాంటి ప్రతిభ కారు అద్దాలు తుడుచుకుంటూనో
చెప్పులు పాలిష్ చేసుకుంటూనో,
చెత్త కాగితాలు ఏరుకుంటూనో
మనల్ని
మన మానవత్వాన్ని వెక్కిరిస్తూ కనిపిస్తుంది.
ఒక్క రూపాయో,
పండో వాడి చేతిలో పెడితే మన అహం చల్లారుతుందేమో కానీ 
అది వాడి పికిలిపోతున్న బతుక్కి ఒక్క టాక లెక్కకయినా సరిపోదు.
ఎవరు చేసిన పాపానికో శిలువను మోసే ఈ  బాల ఏసులు
మన చుట్టూ మసులుతున్నంత  కాలం  
సంక్షేమాన్ని గుర్చి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అవన్ని
వట్టి పిట్టల దొరకబుర్లే!   

Thursday, June 25, 2015

తెలుగు పత్రికలు అప్పుడు- ఇప్పుడు- వ్యాసం


1976లో తన మూడు దశాబ్దాలు’ సంపాదకీయాల సంకలనానికి ముందుమాట రాస్తూ నార్ల వెంకటేశ్వరరావుగారు ‘‘కారణాలేవైనా నేటి సంఘంలో సంపాదకునికి, అతడి సంపాదకీయాలకు పూర్వపు గౌరవప్రతిష్టలు లేవు. నా జీవితకాలంలో సంపాదకుని ప్రతిపత్తి ఇంతగా దిగజారిపోవడం నాకు మరింత బాధాకరం." అన్నారు . మరి నలభై ఏళ్ళతర్వాత పత్రికారంగంలో ఇప్పుడు సంభవిస్తున్న ఈ విపరిణామాలకు వారు సజీవంగా వుండివుంటే ఏవిధంగా స్పందించి వుండేవారో!

దేశంలో మరే ఇతర భారతీయ భాషాపత్రికలకు తీసిపోని రీతిలో తెలుగుపత్రికారంగం ఈనాడు వెలుగొందుతోంది. సంతోషమే !
హిందీ పత్రికలు చదివే రాష్ట్రాల సంఖ్య ఎక్కువ. కాబట్టి సహజంగానే వాటి చలామణీకూడా (సర్క్యులేషన్) ఎక్కువ. దక్షిణాది పత్రికల పురోగతి మొదలయింది గత మూడు దశాబ్దాలనుంచే.
గతంలో మలయాళ, తమిళ పత్రికలు తెలుగుపత్రికలకన్నా ఎక్కువ ప్రతులు అమ్ముడయేవి. కానీ ఇవాళ మలయాళం తర్వాత తెలుగు ఆ స్థానం ఆక్రమించింది.

క్రియాశీలకంగా, సృజనాత్మకంగా, రంగుల హంగులతో ఆకర్షణీయమైన లే-అవుట్లతో, స్పష్టమైన  ఛాయాచిత్రాలతో, ఆసక్తికరమైన శీర్షికలతో చొచ్చుకొనిపోతున్న పత్రికలలో ప్రథమ స్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాతెలుగుపత్రికలదే! మండలస్థాయి  విలేకరులున్న పత్రికలు కూడా తెలుగువారివే. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నవీ తెలుగు పత్రికలే. శాసనసభల్లో చాలా సందర్భాల్లో తెలుగు పత్రికలు ప్రదర్శింపబడుతూ చర్చలు కొనసాగడం, వార్తా పత్రికల కథనాలతో ఎందరి రాజకీయ ప్రముఖుల  జీవితాలో మలుపులు తిరగడం మనం తరుచుగా చూస్తున్నతతంగమే! తాజాగా జరుగుతున్న ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగులలో సైతం పత్రికల పాత్ర కొట్టొచ్చినట్లు కనిప్సిస్తున్నది కదా! గతం లోకూడా మన
తెలుగు వార్తాపత్రికలు ఇలాంటి క్రియాశీలక పాత్రనే పోషించాయా? అంటే  లేదనే చెప్పాలి. ఈ రెండు దశాబ్దాల మధ్యకాలంలో పత్రికారంగంలో వచ్చిన మార్పులను తులనాత్మకంగా బేరిజు వేసుకున్నప్పుడు మనమీ నిర్ధారణకే రాకతప్పదు.

ఐదు దశాబ్దలకిందట పత్రికల నిర్వహణలో వృత్తి ధర్మం కాకుండా, ఉద్యమస్ఫూర్తి ఊతంగా ఉండేది. ఇప్పుడు వృత్తిధర్మం స్థానే వ్యాపారపోకడలు పెరిగి పోయాయి. సామాజికసేవ స్థానంలో రాజకీయ, ఆర్థికప్రయోజనాలు స్థిరపడ్డాయన్న విమర్శలో నిజం  లేకపోలేదు. మేమిచ్చినవే వార్తలు.. మాకు వీలుకుదిరి పంపినప్పుడే మీరు పత్రిక చదవాలి - అనే పాతధోరణి పూర్తిగా మారిపోయింది. అభివ్యక్తీకరణలో భావానికన్నా ఆకర్షణకే భాష ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకుంది. . ఈ క్రమంలో తెలుగులో తెలుగుతనం తగ్గిపోతున్నదనే విమర్శా ఉంది. అందులో కొంత వాస్తవమూ వుంది.
విద్యకోసం, సామాజికపరమైన అవగాహనకోసం అనే పరిస్థితి దాటి వినియోగం, వినోదం, వాణిజ్యంవంటి కోణాల్లో  పత్రికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు ఆదివారం అనుబంధం అంటే కళ, సాహిత్య, విజ్ఞాన, సాంస్కృతిక వేదిక. ఇప్పుడు వినియోగదారుడి కరదీపిక. పాఠకుల ఆకర్షణకు  నిడివితక్కువ శీర్షికలు, కంటికింపైన రంగులు, అంత్యప్రాసలతో కూడిన భాష  తయారయ్యాయి. కించిత్ అశ్లీలం కూడా చోటు చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదన్న విమర్శలూ కద్దు.డైనమిగ్గానో డైనమోట్ గానో వుంటేనేతప్ప ఇప్పుడు పత్రిక బ్రతికి బట్టకట్టలేదన్న మాటలో ఆవగింజంతయినా అతిశయోక్తి లేదు.

పత్రికలు, అవి ప్రచురించే పుటలు, అంశాలు, అమ్ముడయ్యే ప్రతులసంఖ్య పెరగడం విశేషం. ఐదు దశాబ్దాలకిందట లక్షప్రతులంటే గగనకుసుమంగా ఉండేది. మూడు దశాబ్దాలకిందట మలయాళ మనోరమ ఐదులక్షల సర్క్యులేషన్ని గొప్పగా చెప్పుకునేది. ఇవాళ తెలుగులో రెండు పత్రికలకు పదిలక్షలకుమించి సర్క్యులేషన్ ఉందని 'ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్' (ఎ.బి.సి) వెల్లడిస్తోంది. ప్రచురించే అంశాలకన్నా అమ్మకాల్లో పాటించే నైపుణ్యమే పత్రికల విజయానికి కీలకాంశం అవుతున్న రోజులు ప్రస్తుతం నడుస్తున్నవి.

దేశంలో ఏ భాషలోలేని రీతిలో మండలస్థాయిలో విలేక్రులను కలిగి ఉండడం తెలుగు పత్రికల ప్రత్యేకత. విలేకర్ల విధులలో స్థానికవార్తలు పంపడమేకాక, పత్రిక అమ్మకాలు, వాణిజ్య ప్రకటనల సేకరణా అదనంగా వుండటం ఒక వాస్తవం. ప్రజాస్వామ్యస్ఫూర్తికి ఆలవాలమైన వికేంద్రీకరణ విధానానికి అనుగుణంగానే నేడు ప్రతీపత్రికా జిల్లా అనుబంధాలనూ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నది. ఈ పరిణామాల కారణంగా పత్రికలకు ఆర్థిక వనరులు పెరగడం ఒక లాభమయితే,  విమర్శల తాకిడి పెరగడం ప్రతికూల అంశం.

ఒకప్పుడు సినిమా వార్తలు కావాలంటే ఆదివారందాకా వేచి ఉండే పరిస్థితి. ఇవాళో? ప్రతి దినపత్రికా సినిమా విశేషాలకోసం ఒకటో రెండో  పుటలు కేటాయించడం కొత్త పరిణామం. కొన్ని దినపత్రికలైతే ప్రత్యేకంగా సినిమా ఎడిషన్లనే ప్రారంభించాయి . చిత్రప్రముఖుల రాజకీయ
రంగప్రవేశం కారణంగా సినీవిశేషాలు  వార్తలుగా మారి తొలిపుటదాకా తోసుకురావడం  సహజమైపోయింది. బాలలకోసం ప్రత్యేకంగా పత్రికలు నడిపే అవసరం లేకుండా దినపత్రికలే ఆయాఅంశాలనుకూడా ఇవ్వడం మరో చెప్పుకోదగ్గ మార్పు.
ఇక ఆదివారం సంచికలు వారపత్రికల సైజులోకి మారడంతోపాటు అందులోని అంశాలూ ఒకనాటి వారపత్రికల చట్రంలో ఒదిగిపోవడం ఇంకో విశేషం. గతంలో దినపత్రికలంటే డెమీ సైజు, వారపత్రికలంటే 1/4 డెమీ, మాసపత్రికలంటే 1/8 డెమీ అనేదే అలవాటయిన లెక్క. కానీ నేడు దినపత్రికలే కొన్ని పుటలు డెమీ, మరికొన్ని పుటలు 1/2 డెమీ,  1/4 డెమీ సైజుల్లో ప్రచురిస్తున్నాయి.

పత్రిక అనగానే ఒకప్పుడు ఆ పత్రిక సంపాదకుడు గుర్తుకు వచ్చేవారు. కానీ ఇవాళ ఆ పత్రిక యజమాని ముందు  గుర్తుకు వస్తున్నారు. గతంలో ఆంధ్రపత్రికను కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారు అమృతాంజనం లాభాలతో, గృహలక్ష్మి పత్రికను డాక్టర్ కె.ఎన్. కేసరి లోధ్ర అమ్మకాలతో, కిన్నెర సంపాదకుడు పందిరి మల్లికార్జునరావుగారు రీటావ్యాపారంలోని మిగులుసొమ్ముతో నడిపితే..  నేటి కొన్ని పత్రికలు లాభాలకోసమే నడపబడుతున్నాయనేది ఒక విమర్శ. వ్యాపారానికి  తగ్గట్టుగానే పత్రికలు వార్తాంశాల్ని ఎంపిక చేసుకోవడం, అలంకరించడం జరుగుతోంది. సంపాదకుడిస్థానం కుంచించుకుపోవడం  దురదృష్ట పరిణామం. గత పది, పదిహేనేళ్లబట్టి క్రమంగా పెరుగుతూ వస్తున్న టి.వి చానళ్లు, వార్తాచానళ్లు తెలుగు పత్రిక
మనుగడనుకూడా గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయన్నది క్షేత్రస్థాయి వాస్తవం . ఎప్పటికప్పుడు సంభవించే విశేషాలను వార్తలైనా కాకపోయినా మసాలా దట్టించి మరీ వడ్డిస్తున్న ఛానళ్ల పోటికి దీటుగా 'ఏం చెయ్యాల'న్న మధనలో పత్రికలూ కొంతకాలం నలిగినా క్రమక్రమంగ పరస్థితి తేటపడిందనే చెప్పాలి. సంఘటనల వెనుక ఉండే నేపథ్యాలను వివరణాత్మక కథనాలుగా అందించటం నేటిపత్రికల విధానంగా మారింది. ఆ కథనాల ఆధారంగా చర్చలు కొనసాగించడం టి.వి చానళ్ల వంతయింది. వార్తాఛానళ్ళు అప్పటికప్పుడు ఇచ్చే పొట్టివార్తల ఆధారంగా
విస్తృతకథనాలు సిద్ధంచేసుకోవడం పత్రికలకు పెద్దసవాలే. అనివార్యంగా టి.వి చూడక తప్పని పరిస్థితి- పాత్రికేయుల, సంపాదకుల మేధో, సృజనాత్మక సామర్థ్యాల విస్తృతికి పెద్ద అవరోధంగా మారటం అభిలషణీయమైన పరిణామం కాదు.
పత్రికా రంగంలో కంప్యూటర్, ఉపగ్రహం వంటి వెసులుబాట్లతో తాజా వార్తలు తెల్లవారుజాముదాకా ఇవ్వవలసిన పరిస్థితి పాత్రికేయుల మానసిక శారీరిక ఆరోగ్యాలని దెబ్బతీసే ప్రతికూల అంశం . ఆసక్తితో, ఆర్తితో సమాజానికి ఏదో చేయాలనే తపనతో తక్కువ జీతానికైనా పాత్రికేయులుగా ప్రవేశించాలనుకునే వారి సంఖ్య నేడు క్రమంగా తగ్గుతూ వస్తుంది . బాగా జీతాలు ఉన్న వృత్తులలో ఇప్పుడు జర్నలిజం కూడా ఒకటి అని ఒప్పుకోవాలి. అయితే వేతనాలు పెరిగుతున్న స్థాయిలో మేధస్సు, సృజన, భాష, శైలి పెరుగుతున్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఇది ఒక్క తెలుగు పత్రికా రంగం ప్రత్యేక పరిస్థితేమి కాదు.దేశమంతటా పత్రికా రచనల స్థాయి ఒకేలా తగ్గుతూ రావటం గమనించవచ్చు. దీన్ని వాంఛనీయ పరిణామంగా కాక ఒక అనివార్యమైన పరిస్థితి గా అర్ధం చేసుకోవాలి . తమ యజమానులకు దోహదపడేవి , తమ ఉద్యోగౌన్నత్యానికికి తోడ్పడే వాదనలనే సమాజాని క వసరమైన ఔషధాలుగా పత్రికా ప్రముఖులు ముందుకు తీసుకుని రావడానికి సిద్ధమవడం ఒక ప్రమాదకరంయిన విపరిణామం. పాత్రికేయులకు సంబంధించి రకరకాల అవినీతి ఆరోపణలు తరుచుగా వినబడుటానికి పవిత్రమయిన పాత్రికేయ వృత్తిని స్వలాభం కోసం వాడుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎక్కువవటమే ముఖ్యమయిన కారణం. కేవలం వార్తను నివేదించే పాత్రికేయుడే ఈ స్థాయిలో ఉంటే ఇంక యజమాని గురించి చెప్పనే అక్కరలేదు. సమాచార హక్కు పరిధిలోకి మీడియా సంస్థలను, వ్యక్తులను కూడా తీసుకురావాలని ఒక వర్గం బలంగా వాదించటానికిదే ప్రధాన కారణం .
పత్రికారంగం ఇంతగా విస్తరించినా, సమాజంపై ఇంతబలమైన ప్రభావం చూపిస్తున్నా దానికి దీటైన స్థాయిలో పాత్రికేయశాస్త్రం తెలుగులో అభివృద్ధి చెందక పోవటం విచారించవలసిన విషయం. పాత్రికేయులకు అవసరమైన సమాచారగ్రంధాలు గతపదేళ్లకాలంలో కొన్ని వచ్చాయి. అంతకుముందయితే అటువంటి సౌకర్యాలే బొత్తిగా ఉండేవి కావు.  విద్యాపరంగా తగిన సౌకర్యాలు లేకుండా సగటు యువకుడు పాత్రికేయుడుగా ఎదగటమంటే సామాన్యమయిన వ్షయం కాదు. ఈ మధ్య కాలంలోనే పట్టభద్రుల స్థాయిలో పాఠ్యాంశంగా జర్నలిజం బోధించాలనే ప్రయత్నాలు విశ్వవిద్యాలయాల్లో ఊపందుకున్నాయి . జర్నలిజం అభ్యసించిన ఎంతోమంది పాత్రికేయ వృత్తిలో ప్రవేశించకుండా ప్రజాసంబంధ అధికారులుగానో,  ఈవెంట్ మేనేజర్లుగానో  స్థిరపడిపోవడం, పాత్రికేయవృత్తిని పక్కనపెట్టి వ్యాపారరంగంలో ప్రవేశించడమో గమనార్హం. ఈ ఐదుదశాబ్దాల్లోనే ఆంధ్రపత్రిక, ఆంధ్రసచిత్ర వారపత్రిక, భారతి, యువ, జ్యోతి, సినిమారంగం, విజయచిత్ర, ఉదయం సంస్థ పత్రికలు, సినీ హెరాల్డ్, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆదివారం.. ఇలా ఎన్నో పత్రికలు మూతపడ్డాయి. ఇప్పుడు నడుస్తున్న పత్రికలన్నీ దాదాపు ఈ ఐదు దశాబ్దాలలో ప్రారంభమయినవే. అలాగే ఒకప్పుడు తెలుగువారు ఆంగ్ల పత్రికారంగంలో రాణించిన మాట వాస్తవం. కానీ నేడు ఆ స్థాయిలో తెలుగు వెలుగులు దేశ వ్యాప్తంగా ప్రకాశిస్తున్నాయా అంటే లేదనే సమాధానమే  వస్తుంది.

పత్రికలను కూడా సమాజానికి బాధ్యులను చేసే కొన్ని ప్రయత్నాలు ఈ మధ్య ఊపందుకు కొన్న మాట నిజమే! టైమ్స్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్ వ్యవస్థను ప్రారంభించి కొంతకాలం కొనసాగించింది. హిందూ దినపత్రిక రీడర్స్ ఎడిటర్‌ను, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక కరెక్షన్స్ ఎడిటర్‌ను ఈ విధానం లో భాగంగానే నియోగించాయి. ఏ తెలుగు దినపత్రికా ఈ దిశలో ప్రయత్నించక పోవటం గమనించదగ్గ అంశం.  తొలిపుట మొత్తం ప్రకటనలకు ఇవ్వడంవంటి వాణిజ్యపోకడలను ఆంగ్ల పత్రికలనుంచి ఇష్టంగా అందిపుచ్చుకున్న తెలుగు పత్రికలు ధరల తగ్గింపువిషయలో మాత్రం ఆ స్థాయిలో స్పందించక పోవటం మన పత్రికల వ్యాపార పోకడలక్ అద్దం పడుతున్నాయి.

వడివడిగా సాగిపోయే చరిత్రని వడిసిపట్టుకుని, నమోదుచేసే బృహత్తరమయిన పాత్ర పాత్రికేయానిది. కానీ అదే నేడు విచారించదగ్గ  స్పర్థలోపడి వడివడిగా మారిపోతున్నది. ప్రపంచాన్ని అన్నిరకాలుగా ప్రభావితంచేసి శాసించాలనుకునే మాధ్యమాన్ని మాత్రం శాసించే సరైన యంత్రాంగం లేని లోటు  కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పర్యవేక్షణలేని శక్తివల్ల నివరించదగ్గ ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ. మీడియాకూ ఆత్మవిమర్శ అవసరమనీ, స్వయం నియంత్రణ అనివార్యంగా ఉండితీరాలని బుద్ధిజీవులు అందుకే భావించేది. పత్రికాప్రపంచం టి.వి. చానళ్లకన్నా ఈ స్వయం నియంత్రణ విషయంలో కొంత మెరుగని  ఒప్పుకొన్నా.. ఔషధంవంటి ఈ స్వీయ నియంత్రణను, పథ్యంవంటి ఆత్మవిమర్శను పత్రికాలోకం ఇంకా బాగా అలవాటు చేసుకోవాల్సివుంది.

అప్పుడే ఈ రంగానికి , దీనివల్ల సమాజానికి సరయిన మేలు జరిగే అవకాశం వుంది.
***
-కర్లపాలెం హనుమంతరావు
రచనా కాలం 2010

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...