Wednesday, July 1, 2015

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ

ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
'స్వామీ! మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచిభవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమలను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా బతకలేను. క్షమించండి!' అన్నాడు రుషివర్యుడు.
'పోనీ.. శరీరంమీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులుకదా ఆత్మమీది ఈ శరీరం! ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా!
మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది బాదుషా!' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
'కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగగదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకయ్యా మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధువుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 
'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషివర్యునికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా అర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేం మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడో? అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా సొంతానికి ఏర్పాటు చేసుకోగలను.. ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు   'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?'
గురువుగారి బోధనను విన్న  శిష్యపరమాణువు నోరువెఃఃఅబెట్టాడని వేరే చెప్పాలా!
***
-కర్లపాలెం హనుమంతరావు
( నా నోట్ సునుంచి సేకరించినది. సోర్సు తెలియ లేదు)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...