Thursday, July 2, 2015

రామాయణం- ఒక్క వాల్మీకి విరచితమేనా?- ఒక విమర్శ, విశ్లేషణ


‘యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని బ్రహ్మ వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ అన్న మాట. రామాయణమంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు. ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో తీర్చిదిద్దిన ఆదికావ్యం రామాయణం. పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను ఒకే తీరులో ఆకర్షించే గుణం రామాయణంలో ఏదో ఉంది.
వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును కుమారరాముడు సునాయాసంగా విరవడంలాంటి అతిమానుష సన్నివేశాలు రామాయణంనిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు దండిగా ఉండబట్టే రామాయణం చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రిక కన్నా ఎక్కువ చర్చనీయమౖందేమో! శతాబ్దాలబట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు చెయిచేసుకున్నకథ రామాయణం. భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమైవడం సహజ పరిణామమే.
వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథా దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి రామాయణంలోని అన్ని భాగాలూ వాల్మీకి విరచితాలేనని చెప్పలేని స్థితి. మొదటి వాల్మీకి పుట్టించిన కావ్యం మరో వాల్మీకి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరన్ని ప్రక్షిప్తాల హంగుల్ని రంగరించుకుందన్న వాదనా కొట్టివేయదగింది కాదు.
‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన

ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న బాల కాండ (2,1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో చెప్పుకోవడం కాదు కానీ.. వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో స్వోత్కర్ష చేసుకోవండం వల్ల కలిగే సందేహం, తరువాతి శ్లోకాల్లోని భగవాన్( బాల 2, 9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2, 17) వంటి పొగడ్తలతో మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునే కుసంస్కారా వాల్మీకి మహర్షి?
క్రౌంచ పక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ చందస్సులో ఉండటం.. తదనంతరం ఆ చందస్సులోనే సంపూర్ణ రామాయణం కథనం చేయాలని కవి సంకల్పించడం జగద్వితం. వాల్మీకి రామాయణ శ్లోకాల్లో అనుష్టుప్ ఛందస్సుకు భినమైన ఛందస్సూ కనిపిస్తుంది! అదంతా అనంతర కాలం తాలూకు మరో వాల్మీకి ప్రక్షిప్తమై ఉంటుందని సందేహించడంలో అసమంజసమేముంది?
నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలోగానీ, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలోగానీ బాలకాండకు సంబంధించిన కథ ఆట్టే లేదు. వాల్మీకి రామాయణ బాలకాండలోనే రామసంబంధమైన కథ ఉన్నది కడు స్వల్పం. అప్రస్తుతమని తోచే కథాభాగమంతా ఆ ‘మరో వాల్మీకుల’వారి నై’పుణ్య’మేమో?
ఉత్తరకాండలోని శంబూక వధ మాత్రం? తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వచ్చే సందర్భంలో- కృతయుగంలో బ్రాహ్మణులు, త్రేతాయుగంలో అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు, కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులన్నట్లు ఒక సిద్ధాంతం ఉన్నట్లు అర్థమవుతుంది. తద్విరుద్ధంగా త్రేతాయుగంలో దీక్ష చేబట్టినందువల్లే శూద్ర శంబూకుడు వధ్యుడన్నట్లు వాదన ముందుకొచ్చింది. విశ్వామిత్రరుషి క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగనుకుని వధించిన బాలకుడు ఒక శూద్రతపస్వి కన్నకొడుకు. ఇలాగే ఇతిహాసాలనిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన దృష్టాంతాలు పుష్కలంగా ఉన్నప్పుడు వాల్మీకివంటి సామాజిక తత్త్వవేత్త ఇంత పెద్ద తప్పిదం చేస్తాడా?! తదనంతర కాలంలో వాల్మీకేతర కవులెవరో చొప్పించిన ప్రక్షిప్తాల చలవే ఈ స్ఖాలిత్యాల గోలంతా.. అని అందుకే అనిపించేది.
ప్రథమ రామాయణం రాసిన వాల్మీకి రామునికి సమకాలీనుడని కదా భావన! జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడనడం హేతుబద్ధంగా ఉందా? కావ్యారంభంలో వాల్మీకి చేసుకున్న కథాగమన మననంలో ఉత్తరకాండా ఉంది కదా అని వాదించ వచ్చు. ఆ సర్గా ఎందుకు ప్రక్షిప్తమై ఉండకూడదూ?!
లంకాధిపతి వేదపాండిత్యంగల పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధిమీద విశ్వాసమున్నవ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నమవాలని చూస్తాడా?! ‘రావణుడు రాక్షసుడు. అసురుడుగా ప్రచారం చరిత్ర దృష్ట్యా దోషం’ అనుకుందామనుకొంటే సుందరకాండలో తద్విరుద్ధమైన భావం (సుందర 20, 5-6) ఎదురవుతుంది! ఎత్తుకొచ్చిన స్త్రీకి మనసు దిటవు పరుచుకొనేందుకు వీలుగా ఒక ఏడాదిపాటు అవకాశంగా ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని స్రీని భక్షించడం ఆదిమ జాతుల్లో తప్పు కాదు. రాక్షస రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడుగానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనడు! పైపెచ్చు ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి . ఆదర్శనీయమైన భావన అది. ప్రధానపాత్రలలోనే ఇన్ని పరస్పర వైరుధ్యాలా?! రామాయణ కర్త ఒక్కరు మాత్రమే కాకపోవడమే ఇంత గందరగోళానికి కారణమనుకోవాలి.
ఆచారాలనుబట్టి, కొన్నిభాషనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారేమోనని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు) ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. (అందుకేనా ఆడవారికి తోకలున్నట్లు రామాయణంలో ఎక్కడా చెప్పలేదు?) రామాయణంలోని లంక, జన స్థానాలకి సవర పదాలు లంకాన్, జైతాన్ మూలాలేమేమోనని గో. రామదాసుగారి ఊహ. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ఆలోచన. దండకారణ్యంలో విశేషంగా నీరుండబట్టే అరణ్యకాండ (11, 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అన్న శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలంమీద రకరకాల పుష్పాలు, ఫలాలు, పక్షుల రవాలు, హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’న్న వర్ణనకు అతికినట్లు సరిపోతుంది.
చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉండె! చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం వానరజాతి నాగరిక లక్షణ విశేషాలు. అభివృద్ధి పరంగా ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయారో? నమ్మదగ్గ అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేం. కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ. అదో వింత!
రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడుతున్నారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా కాలక్రమేణా అది గద్దగా ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా?
ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని ఉరోవన్ అనే ఒక శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్ తీరం ఖరమండలం అనే మూలపదం నుంచి ఉద్భవించింది. రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే కావచ్చన్న రాయ్ గారి అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది
‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ
ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా. ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది! రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?
ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా గోరంత వాస్తవికతకు కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో ఓ అందమైన కావ్యానికి సరిపడినంత సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో ఆ కావ్యంలోకొచ్చి పడ్డ ప్రక్షిప్తాల తంతు సరే సరి!
అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత!

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబా?
సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.
కర్తృత్వం సంగతి కాసేపు పక్కన పెడదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ల పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ కవిశ్రేష్టుడైన వాల్మీకి మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు. పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం. కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి. ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం. వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ.
మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడు లేని గుడి లేదు. రామకథ వినిపించని బడి లేదు. సీతారాముల్ని చిత్రించని కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం. దేశదేశాలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధం.
ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ ధన్యులు.
-రచన: కర్లపాలెం హనుమంతరావు

సంప్రదించిన కొన్ని రచనలుః
వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు
రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు
రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి
రామాయణమునందు వానరులు ఎవరు? – గో. రామదాసు
రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya
(మాలిక- అంతర్జాల పత్రిక జూలై 2015లో ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...