Tuesday, July 21, 2015

దిగులేస్తోంది!- కవిత


1
కాలం గాయం చేసినప్పుడు
ముల్లు విరిగిన కాలు నిప్పుకొండలా సలుపుతుంది
కాలం ఊహల ఉయ్యాలలూపుతున్నప్పుడు
నక్షత్రమండలాన్నైనా సబ్బుబుడగల్లా ఊదిపారేయచ్చనిపిసుంది
సమయం గడుసుది సుమా!
మంటలు చుట్టూ మండుతున్నా
మనసుకి మిణుగురుపురుగుల రెక్కలు తొడిగి
మల్లెపందిరి కింద బబ్బోపెడుతుంది
కాగితంపూలవాసనకే మత్తెక్కిపోయి మనీప్లాంట్ కి పర్యాయపదమే లేదని పలవరింతలు మొదలయ్యాయి నీకప్పుడు
కంటిముందరి స్వర్గమంతా తెరముందాడే నాటకంరా నాయనా!
పేరుతో ప్రేమగా పిలిచినట్లే ఉంటుంది
కాలం మెదడులో సర్వనామంగానైనా నువ్వు మిగిలి ఉన్నావా?

2
మనిషి గోరటి ఎంకన్నగొంతులో జీరయి కరిగిపోతున్నాడురా తండ్రీ!
అంతరించిపోతున్న లోకంలో మిగిలున్నఆ ఒక్క వ్యవహర్తా కూలిపోతున్నఆర్తనాదమవుతున్నా ఆ చప్పుడు నీకు వినిపించడం లేదా!
మూతబడే కంటిరెప్పల్లో కరిగిపోయే విశ్వం నీదేరా కొడకా!
ఒక నమ్మకం చెరిగిపోతే ఒక లోకం చిరిగినట్లే!
ప్రశ్నల్ని అడవులకి తరిమేసి చెప్పుల్ని చేత్తో మోసుకుంటో గమ్మత్తైన పోటీలో నువ్ బిజీ బిజీ ఉన్నావ్
చర్మం వల్చుకుపోతున్నా చమ్మగానే అనిపిస్తుందొరేయ్ నీకీ మత్తులో!

వాక్యంలా ప్రవహించడం మానేసి ఎంత కాలమయింది?
సుందరయ్యా!..సుందరాకాండా!
జెపీనా!…జైరామ్ రమేషా!
కనీసం ప్రశ్నల్నన్నా కనాలనిపిస్తున్నదా నీకు!
పోరు ఊరేగింపులో ఊగటం మానేసి పోలేరమ్మ జాతరలో తూలటం మొదలెట్టావు
నల్లమందు నినాదాలు మింగి రాజీజెండా భుజాన మోసుకుంటో
ఒక్క పూటైనా గట్టిగా నిలబడని ఏ వెలుక్కురా నువ్ దివిటీ పట్టుకుని చిందులేసేది!

4
రేపటి మీద ఆశతో పరుగులు పెట్టే నీ పసిపిల్లలకేం చెపుతావ్ ఇప్పుడు?
ఏ వీధి చివర చెట్టు మిగిలుంటుందని పచ్చనాకు కోసుకురమ్మంటావ్ రేపు?
ఆఖరి మెతుక్కూడా అయిపోయిందాకా చేతిలో ఉన్నది అక్షయ పాత్రేనని నమ్మిస్తావా నాయనా!
నువ్వు చదివిన మాట నువ్వు పాడిన పాట
నువ్వు నిప్పు రవ్వలు చల్లుకుంటూ నడిచి వచ్చిన బాట
అంతా వెండిమబ్బుల చందమేనా!
అధర్మ రథయాత్రలో ఆఖరికిలా ఆర్భాట భటుడుగా మిగిలిపోవడం ఎంత విషాదం!
కూలిపోయే మహావృక్షం చివరి చిగురువునువ్వే అవుతావని ఎన్ని కలలు కన్నాను!
రేపటి విషపుమొక్కకు మొదటి వేరుగా మొలిచే నిన్నిలా చూడటం…!

-కర్లపాలెం హనుమంత రావు 
01-09-2012

Monday, July 20, 2015

1950లో ఓ కచేరీకి ఓ ముఫ్ఫైఏళ్ళ మహిళని పాడమని పిలిచారు. ఆమె వర్ణంతో కచేరీ ప్రారంభించి గణేశ ప్రార్థన, ఆ తరువాత దేవగాంధారి రాగంలో ‘సీతా వర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ పాడడం మొదలు పెట్టారు. ఇంతలో ఒక చిన్న భూకంపం రావడంతో ప్రేక్షకులు భయంతో ఆ హాలు విడిచి బయటకు పారిపోయారు. జనం వెళ్ళిపోవడం చూసి పక్క వాయిద్యకారులు కంగారు పడ్డారు కానీ అలాగే భయపడుతూ వాయించారు. పక్క వాయిద్యకారుల పరిస్థితి కానీ, జనం హాహాకారాలు చేయడం, భయంతో పరుగులు తీయడం ఇవేమీ కళ్ళు మూసుకుని పాడడంలో నిమగ్నమయిపోయిన ఆవిడకి తెలియవు. భూకంపం హడావిడి తగ్గాక ప్రేక్షకులు లోపలికి వచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఇంకా పాడుతూనే వుంది. పాట పూర్తయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడం కనిపించింది. ఆ తరువాత పక్క వాయిద్యం వాయిస్తున్న ఓ వ్యక్తి అసలు విషయం చెప్పారు. ఆ కచేరీ చేసిన మహిళ డి.కె.పట్టమ్మాళ్. భూకంపం సంగతి ఆమెతో తరువాత ప్రస్తావించినప్పుడు, “భూకంపం వచ్చి నా ప్రాణం పోవాలని రాసుంటే అదెలాగూ జరుగుతుంది. ప్రాణమ్మీద తీపితో కచేరీ చెయ్యకుండా ఇచ్చిన మాట తప్పిందన్న అప్రతిష్ట నాకు చావు లాంటిదే. నేను సంగీతానికీ కట్టుబడున్నాను. అదే నా ఊపిరి” అన్నారామె. ఈ సంఘటన చెప్పింది ఆమె భర్త ఈశ్వరన్. ఆనాటి కచేరీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ రావలసి ఉన్నా, ఎందుచేతనో రాలేకపోయారు. భూకంపం వచ్చినా కదలకుండా తన్మయత్వంతో ఆమె పాడడం గురించి తెలుసుకొని ఆ మర్నాడు ఆయనింట్లో మరో కచేరీ ఏర్పాటు చేయించుకున్నారు
సాయి బ్రహ్మానందం గొర్తి "ఈ మాట- 'కంచి పట్టు కచేరీ' నుంచి
-కర్లపాలెం హనుమంతరావు

విశ్వనాథగారి విశిష్ట జ్ఞాపకశక్తి- ఒక సేకరణ

విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు

"రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.అందుకు విశ్వనాథ గారు " అందులో బాధపడాల్సింది ఏం లేదు" అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.
తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు
-కర్లపాలెం హనుమంతరావు
(నా నోట్ స్ నుంచి.. క్షమించండి సోర్సు రాసి పెట్టుకోలేదు)

ద!.. ద!.. ద!- ఒక చిన్నకథ

దేవుడు, మనిషి, దానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.
దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు.
'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ '' అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." '' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు
మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!' అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. '' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటాను' అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు.
ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ '' శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’' అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! '' శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను' అని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు.
వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. ద' అంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమ, దాన, దయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***
కర్లపాలెం హనుమంతరావు
(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)


Sunday, July 19, 2015

పాదుకాపట్టాభిషేకం- ఓ చిన్ని సరదా కథ

అందరికీ తెలిసిన విషయంలోనుంచి  ఓ కొత్త విశేషాన్ని.. వెలికి తీసి చూపిస్తే.. సహృదయులైన చదువరురులకు కాస్త గిలిగింతలు పెట్టినట్లుంటుందని హాస్య విశ్లేషకులు అంటుంటారు.

రాములవారితోసహా అడవులబాట పట్టిన ఆయన పాదుకల్లో వామపాదుక (అతివాది) స్వామివారిమీద విసుక్కున్నదిట. 'దేవుడు కదా అని సంబరపడితే.. ఇదేమిటీ..  ఈయనగారు మనల్ని ఇలా ముళ్ళ డొంకలవెంట తిప్పే పని పెట్టుకొన్నాడు!' .. ఆవటా అని.
ఆ మాట విన్న కుడిపాదరక్ష 'తొందర పడి బైటికి ఏదీ అనకు! స్వామిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడరు' అని మందలించిందిట.
తదనంతరకాలంలో భరతుడు రామపాదుకలను నెత్తిమీద పెట్టుకుని అయోధ్య వీధుల గుండా ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళి నేరుగా సింహాసనంమీదే ప్రతిష్ఠించిన కథ మనందరికీ  తెలుసు.

అప్పుడు సంబరపడుతూ అందిట కుడి పాదంతో ఎడం పాదం 'నువ్వన్న మాట నిజమే సుమా! స్వామివారి మహిమ సామాన్యమైనది కాదు!  ఏ పాదరక్షలకూ పట్టని పట్టాభిషేకయోగం మనకు పట్టింది' అని!

-కర్లపాలెం హనుమంతరావు
***

Saturday, July 18, 2015

కొన్నిమొట్టు కవితలు-4


1
ప్రతి ఏడాదీ పోలింగ్ చుక్కలే
ఐనా పోలియో
మన ప్రజాసామ్యానికి!



2
బెల్టుబాంబుకు కొందరే!
బెల్టుషాపుకు
ఎందరో!


3
క్విడ్ ప్రో కో
పెద్దల
నగదు బదిలీ
పథకం




4
'గోవింద' రాజులకు
స్విస్ బ్యాంక్ లాకర్లే 
నేలమాళిగ ఆరోగది





5
యూరియా మెతుకు లేదు
యురేనియం సంపెంగ నూనె
                                 దేశం మీసాలకి!


6
చిన్న చినుక్కి ఎంత శక్తో!
చిటికెలో నగరం
హిందూమహాసాగరం




7
మీడియాలో మేధావులు
కిక్కిరిసిపోతున్నారు
తెనాలి రామలింగులూ
తెలారంగానే
జుత్తుకు తెల్లరంగుతో తయారు!


8
రాజులు డొక్కు బస్సుల్లో
బంట్లు బుగ్గ కార్లల్లో
భలే ప్రజాస్వామ్యం!









9
వేలు పట్టుకు నడిపించిన అమ్మా నాన్న
వేలు విడిచిన చుట్టాలయిపోయారా కన్నా!
వేలు సంపాదిస్తునావనా.. హన్నన్నా!







10
పిడుగు ముందూ
మెరుపు ఆనక..
ఆడపిల్ల చెంప దెబ్బ




11
ఆక్రోశాక్రోశ ఘోషంబై
వికట కఠోరాట్టహాసోద్భటంబై
వక్రభూవల్లరీ సంవలన భయదంబై
స్ఫారనిశ్వాస ధారా చక్రంబై..
                                కంగారొద్దు!
                                మా ఇంటి అటకమీది తాళపత్రాల
                                'తాటాకు చప్పుళ్ళ' గోల!
-కర్లపాలెం హనుమంతరావు

Thursday, July 16, 2015

అమెరికావాడి తెలుగు పుష్కర స్నానం- ఓ సరదా గల్పిక


చికాగోనుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టిబాబు ఫోన్ చేసాడు. 'మొత్తం పాతిక మందిమి.. మునగడానికని వస్తున్నాం. అదేరా! గోదావరీ పుష్కరాలు కదా! ఆ ఏర్పాట్లూ.. అవీ చూసే పూచీ నీదే!' అంటూ.
'ఇంతమంది ఒక్కసారి వచ్చిపడితే గోదారిలో నీళ్ళు చాలద్దూ!' నేను మధన పడుతుంటే మా మాధవగాడే గాడ్లా వచ్చి ఆదుకొన్నాడు. గోదారీనేగదరా! డోంట్ వరీ సోదరా! అమెరికాలో మునగడానికి గోదావరుండదుగదా! చికాగోనుంచి వస్తున్నారాయ.. పాపం.. చికాకుపడితే ఎలాగురా తమ్ముడూ! నీ చుట్టమేనంటుంటివి! ఎలాగో చూద్దాంలే మరి!' అని నన్ను ఓదార్చాడు.
ఆ సాయంత్రమే టక్కూ.. టయ్యీ.. కట్టిన శాల్తీ ఓటి 'టక్.. టక్' మంటూ  మా ఇంటి తలుపు తట్టింది. మోహాన కాసంత గంధబ్బొట్టు మినహా మనాడే అనుకోడానికి ఇంకేం దాఖలాల్లేవు. అంత మంచిగా ఇంగ్లీషు దంచుతున్నాడు మరి. 'మై నేమీజ్ మిస్టర్ డూబే! మీ మాధవర్రావ్సాబ్ పంపించాడు సార్!' అంటూ ఏవేవో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని కూర్చున్నాడు. హేండౌట్ ఇచ్చి డౌట్లేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది.
'పన్నేండేళ్లకోసారి వచ్చే పవిత్ర గోదావరీ పుష్కర సంబరాలివి. మీరు జీవితంలో మర్చిపోలేనంత మధురఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి టు నర్సాపూర్ వరకు గోదారి నది వడ్డు పొడుగూతా ఒడ్డూ పొడుగు ఉన్నవస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు.' అన్నాడు.
'వస్తాదులెందుకబ్బా?!'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకుపోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ చాలు!  కాలు కదపకుండా గోదారి నది మీ పాదాల చెంతకే పరుగులెత్తుకొంటూ వస్తుంది. పోనీ ఆ ప్లానులో చేరి మునగండి సార్!' అన్నాడు మిస్టర్ డూబే.
' నా తటపటాయింపు అందుక్కాదయ్యా బాబూ! ఫీజును గురించే పీకులాట! ముక్కు మూసుకొని మూడు మునకలేసేందుకు   తలకు పదమూడు వేలా?!
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసలివాళ్ళకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచే ఏర్పాట్లూ ఉన్నాయండీ! సిక్కులకు మినరల్ వాటర్ మిక్సుడ్ షవర్ బాతులు'
'తలపాగాలు అడ్డొస్తాయనా పాపం?'
'సిక్కులంటే సర్దార్జీలనుకొన్నారా! భలే సర్దా మనుషుల్సార్ మీరూ! 'సిక్కు'లు మీన్స్ రోగులని అర్థం. విఐపిలకు విడిగా వేణ్నీళ్ల స్నానం..'
'శుద్ధి చేసిన వాటర్ గదరా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుంది మరి.' అని అందుకొన్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. 'సౌకర్యాలు చూసుకోరా! ఫీజెంత చౌకో అర్థమవుతుంది. సొంతంగా వెళ్ళాలంటే ఎంతవుతుందో తెలుసా?టిక్కెట్టు దొరకడానికే చచ్చే యాతన. రద్దీలో ఏదీ దొరికి చావదు. దొరికినా అ ధరలుండేది నేలమీద కాదు. అదే డూబే వాళ్లయితే అంగవస్త్రంనుంచి.. గోచీపాతవరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు దగ్గరుండి చేయిస్తారు. పురోహితుణ్నీ.. పితృదేవతల్నికూడా వాళ్లే చూసిపెడతారు..తెలుసా!'
'మరే..' అన్నాడు మిస్టర్ డూబే సెల్ఫోన్లో ఏవేవో నెంబర్లు టకటకా కొట్టేస్తూ.
పితృదేవతల్ని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో కొంపదీసి! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే వెళ్ళి గోదారిలో బుడుంగుమని మునగాలనిపిస్తోంది.
బేడ్ లక్!  పుష్కరాల రెండువారాలూ నాకు సింగపూరు డెప్యుటేషన్ డ్యూటీ!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముకూడా ఉంది సార్ మా దగ్గర! ఆఫీసులో.. బిజినెస్ లో మీరు బిజీగా ఉన్నా ఫర్వానై.  ఫీజు కట్టండి చాలు. మీ తరుఫున మరొకర్ని ముంచేస్తాం. ఆ పుణ్యం మొత్తం మీకే బదిలీ అయే ప్రత్యేక పూజకూడా ఈ ప్యాకేజీలోనే ఇన్ క్లూడెడ్!' అంటూ ఇంకో ఫారం.. ఫైలునుంచి బైటికి తీసాడు మిస్టర్ డూబే. ఆ ఫైలునిండా ఎన్ని ఫారాలోరా బాబూ!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగుర్లో స్నానమెలాగబ్బా అని ఇందాకట్నుంచీ తటపటాయిస్తున్నా. నౌ ప్రాబ్లం సాల్వుడ్..' అని తగులుకొంది మా శ్రీమతిరత్నం. ముక్కుమూసుకొని మునక్కుండానే ముక్కోటి దేవతలనూ అర్చించే పుణ్యఫలం ఇంత  సులభంగా వచ్చేస్తుంటే వదులుకొంటుందా మా ఆవిడ!
పాచినీళ్ళలో మునిగే బాద లేదు. వరదనీళ్లలో కొట్టుకుపోయే రిస్కంతకన్నా లేని స్కీము. పదివేలు మనవి కాదనుకొంటే సరి! పుష్కలంగా పుష్కర పుణ్యం!
'ఊరికే వాగ్దానాలు చేసి ఓట్లు దండుకుపోయే నాయకులు ఇలాంటి ఉచిత పథకాలు ప్రవేశపెటి ప్రజలనెందుకు పునీతుల్ని చెయ్యరో! మళ్లీ ఎన్నికలొస్తాయిగా! అప్పుడడాగాలి. కడిగిపారేయాలి'      అనుకొన్నాను డూబేకి డబ్బులు సమర్పించుకొంటూ.
 అమెరికా బ్యాచి గోదావరి పుష్కర స్నానాలలా ఖాయామైనాయా! తీరాపోతే  ఆ అమెరికానుంచి తీరిగ్గా విమానం దిగింది ఒక్క శాల్తీనే! అదీ తెల్లతోలు. తెల్లబోవడం మా వంతయింది.
తెలుగు బ్యాచంతా తీరికలేనంత పనుల్లో తలమునకలై ఉన్నారంట! డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు డ్రౌనింగ్ డాట్ కమ్ అని కొత్తగా ఓ వెబ్-సైట్ పెట్టే పనిలో ఉన్నార్ట!
'ఇంట్లోనే కూర్చొని ఇన్టర్నెట్లో పుష్కర స్నానాలు చేయించడం.. ఇండియన్ పితృదేవతలకు అమెరికానుంచే పిండప్రదానాలు వదిలించడంలాంటివి మా లక్ష్యాలు. దానికి తగ్గ సాఫ్ట్ వేరు.. యాప్స్ డిజన్సులో పిచ్చ బిజీగా ఉన్నాం. ఇదిగాని సకెస్ ఐతే నట్టింట్లోకే గోదావరి నదిని తెప్పిస్తాం. పెరట్లోనే పుష్కర స్నానాలు జరిపిస్తాం' అంటూ ఏదేదో సోది రాసాడుగాని చిట్టిబాబు.. దానికన్నా   ఈ తెల్లతోలుని గురించి చేసిన పరిచయముంది చూసారూ.. అదీ మనకిప్పుడు ముఖ్యం.
'ఈ తెల్లబాబుకి తెలుగునదుల్లో మునిగి తరించాలని తెగ ఉబలాటంగా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నది. మా బాసే. బీ కేర్ ఫుల్! జాతకం ప్రకారం వీడికీ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు మందు కొట్టకుండా చూసుకోండి! చాలు' అంటూ చాలా జాగ్రత్తలుకూడా చెప్పుకొచ్చాడు చిట్టిబాబు.
తెల్లాయన ఊళ్లో ఉన్నంతకాలం నాకు తెల్లారేదెప్పుడో.. రాత్రి గడిచేదెప్ప్డో.. తేడా తెలీకుండా  గడిచిపోయింది. అమెరికా దేవదాసుగారికి కుక్కకాపలా కాయడం నా పనయిపోయింది. ఇంత కష్టపడ్డా పుష్కర స్నానానికని బైలుదేరాల్సిన రోజు పరగడుపునే  బాత్ రూంలో కాలు జారిపడ్డారు దొరగారు. గోదారిలో మునగవలసినవాడు అపోలోలో తేలాడు.

ఏదేమైనా సరే నదిలో మునిగి తీరాల్సిందేనని మంకుపట్టు! కట్లతో అలాగే డిశ్చార్జి  చేయించుకొని.. మంచంమీదనే బాసరవైపుకి తరలించుకుపోయే ఏర్పాటు చేసింది  మిస్టర్ డూబే బ్యాచి!

తిరిగొచ్చిన తరువాత చూడాలీ తెల్లబాబుగారి ఆనందం! తెలుగువారి పుణ్యనదుల జలసౌందర్యాన్ని వేంగీక్షేత్రం విశ్వనాథవారికన్నా విశిష్ఠంగా పొగడ్డం! ఎంత గోదావరి జలమైనా ఒక్క పూట మునక్కే ఇంత కవితావేశమా! మన చోటా నాయుడు లెవెల్లో వీడియోకూడా ఒకటి తీసాట్టగానీ.. విడిగా ఫీజులు అవీ  కట్టలేదని ఆఖర్లో ఎవరో పీకి పారేసారుట! 'పవిత్ర స్థలాల్లో ఫొటోలు తీయడం పాపం' అని విని చెంపలేసుకొని పరిహారంకింద పన్నెండొందలుకూడా వదిలించుకొన్నానని చెప్పుకొచ్చాడు.. పాపం.. నీతిమంతుడు!
'దిన్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ వండర్ ఫుల్ మిరకల్స్!' అంటో ఫ్లైటెక్కిందాకా ఒహటె మురుసుడు!

తెల్లాయన అమెరికా చేరిన మూడో రోజే చిట్టిబాబునుంచి ఫోన్!
చిటపటలాడిపోతున్నాడు నా మీద. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! .. గోదావరికి దారి తెలీకపోతే కనుక్కోవాలిగాని.. దారిలో అడ్డొఛిన మూసీలో మునకలేయిస్తార్రా స్కౌండ్రల్స్! అదే గోదారనుకొని పాపం మా బాసు మాఅందరికోసం పాతిక సార్లు మునకలేసాడు తెలుసా! వాడికక్కడే పడిశం పట్టుకొంది. ఇక్కడి కొచ్చినాక నిమోనియాకి దిగింది. టెస్టులవీ చేయిస్తున్నాం. ఏ క్షణంలో ఎబోలాకి మళ్ళుతుందోనని గుండెలదిరి పడుతున్నాయ్! .. మూసిన కన్ను తెరవడం లేదు. 'మిరకల్.. మిరకల్' అని ఉలికులికి పడుతున్నాడురా పాపం మానవుడు..' ఇహ వినలేక ఫోన్ కట్ చేసేసాను.
డూబే మోసం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.
బ్యాంకుల్లో ముంచడం విన్నాంగానీ..ఇలా  రివర్ బ్యాంకుల్లో ముంచడం వినడం ఇదే మొదటి సారి.
గోరు తడవకండా గోదావరి స్నానమంటే ఇదా!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబరు కలవదే!
'మళ్లీ పుష్కరాలప్పటిక్కానీ నీకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు  ఆ మధ్య కనపడినప్పుడు. జరిగిందంతా చెప్పి జగడానికి దిగపోతే 'మీ తెల్లతోలుగాడికి జలగండం ఉందన్నావుగా! నేనైనా.. డూబే అయినా నిమిత్తమాత్రులం.. భాయీ! అంతే!' అంటూ కాలరు విడిపించుకొని దర్జాగా వెళ్ళిపోయాడు మాధవగాడు.
***
కర్లపాలెం హనుమంతరావు 
(2003 గోదావరి పుష్కరాల సందర్బంగా 08-07-2003 ఈనాడు-సంపాదకీయ
పుటలో ప్రచురితం) 
(కార్టూనిస్టు శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...