Sunday, October 2, 2016

భార్యావిధేయత- 'తెలుగు వెలుగు' మాస పత్రికలోని సరదా వ్యాసం

విధివిధేయతకన్నా గడుసుపురుషుడు భార్యావిధేయతను నమ్ముకుంటాడు.
భగవంతుడు కనిపించడు. భార్య కనిపిస్తుంది. భయం భార్యమీదా, భక్తి భగవంతుడిమీదా ఉంచుకొంటే బతికున్నంతకాలం భుక్తికి వెదుకులాట తప్పుతుంది.
పెళ్లినాడే పెళ్లాం కొంగుకి పంచఅంచు ముడివేయించి మరీ పెద్దలు భార్యామణి ఆధిక్యతను అధికారికంగా ప్రకటిస్తారు.   బరువు భాద్యతలు భర్తవంటారుగాని.. వట్టిదే! భర్త బరువుభాధ్యత భార్యదే! భార్య బరువుబాధ్యత భర్తకు పడకటింటివరకే పరిమితం,
 పెళ్ళికోసం పాపం మొగాడు కలఫుర్ ఫుల్ కలలు కంటాడుగానీ .. భర్తబతుకు ఉత్తరకుమారుడికన్నా ఉత్తమంగా ఉంటుందన్న భరోసా ఎక్కడా లేదు. పెళ్లయిన ఉత్తరక్షణంనుంచే పిల్లాడికి  లక్ష్మణకుమారుడి లక్షణాలు ఆవహిస్తాయి.
బైట పల్లకీమోత సంగతేమోగానీ.. ఇంట పెళ్లాన్ని తప్పించుకొనే రాత విధాత ఏ మగవాడి నుదుటా రాయలేదు.
పెళ్లాం చెబితే వినాల్సిందేరాముడు అదే చేసాడు. అష్టకష్టాల పాలయ్యాడు అయినా కృష్ణుడూ అదే బాటపట్టి భార్యకాళ్లు పట్టాడు. పడకటిల్లే కదా! ఏ పాట్లు పడితే మాత్రం తప్పేంటి! అనేది వట్టి బుకాయింపులకే! గడపకవతలా  తనతరుణి గీచిన గీత  మగవాడు జవదాటరాదు. దాటితే ఏమవుతుందో ఏ మొగుడూ బైటికి చెప్పడు!
ఎన్నికల్లో ఓటేసే జనాలంత అమాయకంగా ఉంటారా భార్యలెవరైనా! మగాడేదో మానసిక సంతృప్తికోసం ఆడదాని జడత్వంమీదనో.. పతివ్రతామహత్యంమీదనో కథలు కవిత్వాలల్లుకుంటే అల్లుకోవచ్చుగాక. ఆడవాళ్ళు వాటిని చదివి లోలోన నవ్వుకుంటారని పాపం మగభడవాయికి తెలీదు!
లల్లూప్రసాదు అర్థాంగి   శ్రీమతి రబ్రీదేవమ్మగారి కథల్లోనే స్త్రీశక్తి ఏంటో  తేటతెల్లమవడంలేదా! పోనీలే పాపమని మొగుణ్ణి తనమీద పెత్తనం చెలాయించేందుకు ఆడది అంగీకరిస్తుంది కానీ.. వాస్తవానికి ఇంటి పెత్తనం, మొగుడి కంటిపెత్తనం.. వంటిపెత్తనం.. చివరాఖరికి.. జైలుకెళ్ళినభర్త కుర్చీమీదకూడా దాన వినిమయ విక్రయాది సర్వహక్కుభుక్తాలు తాళికట్టించుకొన్న భార్యామణికి మాత్రమే దఖలుపడి ఉంటాయి.

కైకేయిని కాదని దశరథుడు ఏమన్నా చేయగలిగాడా? సత్యభామను రావద్దని కృష్ణస్వామి యుద్ధభూమికి వెళ్లగలిగాడా? భార్యను కాళ్లదగ్గరుంచుకున్నట్లు బైటికి వీరబిల్డప్పే  శేషప్పశయనుడిదిభృగుమహర్షి పాదాలు  పట్టాడని అలిగి భూలోకం తారుకున్న శ్రీలక్ష్మమ్మను  ప్రసన్నం చేసుకోడానికి  ఆ ఏడుకొండలవాడు పడ్డ ఇడుములు అన్నీ ఇన్నీనా! సహధర్మచారిణి సాహచర్యంలో ఏ మజా లేకపోతే  మహావిష్ణువంతటి భగవంతుడూ అన్నేసి కోట్లఖర్చుకు  వెనకాడకుండా పెళ్లిపిటలమీదకు తయారవుతాడు.. చెప్పండి! విరాగి.. బికారి.. అంటూ వీరబిరుదులు ఎన్ని తగిలించుకుంటేనేమి! ఇద్దరు భార్యలనూ  సుబ్బరంగా ముద్దు చేశాడా లేదా  ఉబ్బులింగడు! విధాతగారి కథయితే మరీ విచిత్రం. అర్థాంగి  అవసరం ముదిమితనంలో మరీ ఎక్కువ.   వావివరసలైనా చూసుకోకుండా అందుకే సరసమహాదేవి సరసన చేరిపోయాడు ముసలిబ్రహ్మ!
పూర్వాశ్రమంలో ఎంత చింకిపాతలరాయుడైనాగానీ .. తన మెళ్లో తాళి కట్టిన అదృష్టానికి  'శ్రీవారు' హోదా ప్రసాదిస్తుంది స్త్రీమూర్తి! అలాంటి ఒక ఉదారమూర్తిని మగాడు ఓ దినం ఎన్నుకొని  అభినందించేందుకు పూనుకోడమేంటి! ఫన్నీ! ఇంగ్లీషువాడికదో  చాదస్తం. మనదేశీయ మగవాడు మాత్రం అడుగడుగునా ఏడడుగులు తనతో కలిసి నడిచిన  ఇల్లాలి అడుగులకు మడుగులు వత్తుతూనే ఉంటాడు.. ఇంట్లోబైటకు చెబుతారా అన్నీ!
భార్య కొన్నవి మినహా ఏ మగవాడైనా స్వంత అభిరుచి మేరకు దుస్తులు  ధరించే సాహసం చేయగలడా! విసుగుపుట్టో, జాలి కలిగో.. రీమోటు వదిలితే తప్ప మగవాడన్నవాడు స్వంత ఇంట్లో పడకటింట్లో అయినా ఇష్టమైన ఏ 'ఎఫ్' చానల్నైనా  మనసారా చూడగలడా! 'భోజనంలోకి ఏం చేయమంటారండీ!' అంటూ భార్యలు తలుపు చాటునుంచి  బిడియపడుతూ అడిగి.. చేసి.. వడ్డించే   స్వర్ణయుగం కేవలం ప్రబంధాలలోనే!     వంటకు వంకపెట్టటం అటుంచండి మహాశయా! భార్య బజారునుంచి కొనుక్కొచ్చిన ప్రియా పచ్చడికైనా వంకపెట్టే గుండెదైర్యం ప్రపంచంలో ఏ మొగాడికైనా ఉంటుందా.. చెప్పండి! పచ్చడి పచ్చడి ఐపోదూ ఆ రోజంతా బతుకంతా!
స్త్రీ పాత్ర లేని నాటకాలంటే మగాళ్ళు ముచ్చటపడి రాసుకొనే ఉటోపియాలుస్త్రీ ప్రమేయంలేని.. ముఖ్యంగా భార్యామణి హస్తాలులేని సంసారాలను ఆ విధాతకూడా సృష్టించలేడు. సృష్టించాలని ఉన్నా కట్టుకున్న శారదమ్మ చూస్తూ ఉరుకోదు!
'కవులేల తమ కావ్యములలో భార్యలగూర్చి వర్ణించరు?' అని వెనకటికి  తర్కం లేవదిసింది ఓ  ఎల్లేపెద్ది వెంకమ్మగారు 'విద్యానంద'మనే పాత పత్రికలో!
(విద్యానంద- 4-1928) కాళిదాసు శకుంతలను వర్ణించాడుగాని..  కట్టుకున్న భార్య కట్టుబొట్టుల్నైనా గట్టిగా ఓ శ్లోకంలో వర్ణించలేదని ఫిర్యాదు.  శూలపాణీ అంతే! ముఫ్ఫైయ్యేడు నాటకాల్లో లెక్కలేనంతమందిని ఆడవాళ్లను  అణువువదలకుండా వర్ణించిన శృంగారపురుషుడు!   అణిగిమణిగి ఉందన్న చులకనభావం  కాబోలు.. అన్న వస్త్రాలు వేళకు అందించే భార్య సుగుణాలలో ఒక్కటీ సదరు శూలపాణిగారి దృష్తికి ఆనలేదు తల్లులను తలుచుకొన్నవారు కొందరున్నారు. అవ్వలమీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించిన కవులూ కద్దు.  అన్ని దేశాలకవులు తమతమ  రాజులనే కాకుండా వారి వారి దేవేరులను, భార్యలను, వేశ్యలను సైతం  వర్ణించి తరించడం కనిపిస్తున్నదేగాని.. సొంతభార్యల ప్రస్తావనల దగ్గరమాత్రం  ఎందుచేతనో సర్వే సర్వత్రా పస్తాయింపులే!  ఏ కావ్యపీఠికైనా పరకాయించి చూడండి! కావ్యపోషకుడి వంశవర్ణనలే మెండు. ఒక్క రెండు మూడు మంచిపద్యాలైనా సమయం సందర్భం చూసుకొని  కంచిగరుడ చేసే ఇంటి ఇల్లాలును గురించి రాద్దామన్న బుద్దే ఏ కవిమన్యుడి మనసులో కలక్కపాయ!
భార్య లఘువుగా ఉండి మరీ భర్తను గురువు చేస్తుందని మళ్లీ షేక్ష్పియరే స్త్రీమూర్తిని మోస్తాడు! భార్యలేని మొగాడు పైకప్పులేని తాటాకుగూడని జర్మనీలు కూడా వంతపాడారు. అదృష్టం ఎన్ని భాగ్యాలైనా ప్రసాదిస్తుందిటగానీ.. అనుకూలమైన భార్యమాత్రం  ఈశ్వరేచ్చే'నని చివరికి పెళ్ళికాని ప్రసాదు  జాన్ పోప్ పాలుసైతం  అన్నారే! మరెందుకీ మగాళ్ళందరికీ తాళికట్టిన మఃహిళమీదంత మత్సరం!
'నిప్పు.. నీరు..  భార్య' అందుబాటులో ఉండే అత్యంత  అపాయకరాలని ఆ ఎద్దేవాలెందుకు! ఏ మాటకామాటే! నిప్పూ నీరుకు మల్లే ఆడదీ  వళ్ళు మండితే వేడి పుట్టిచ్చేస్తుంది. కన్నీళ్ళతో వణుకూ పుట్టిస్తుంది! మగాడిదే మాయదారి బుద్ధి. చచ్చినపెళ్లాంమీదా ఆ గాడిద దుఃఖం వాకిలి దాకానే!
అందరు మగాళ్ళూ అలాగే ఉంటారని కాదు. మంచన మహాకవి 'కేయూరుబాహు చరితం'లో మగాడి ప్రేమకు అద్దంపట్టే ఓ చిత్రమైన కథా ఉంది.భార్య వయసులో చిన్నది. భర్తకు ఆమె అంటే అంతులేని అనురాగం. ఆమె గర్భందాల్చింది. ఆ  సమయంలోనే ఊరువాళ్ళంతా  తీర్థయాత్రలకని బైలుదేరారు. 'వయసులో ఉన్నదానివి. నాలుగూళ్లు తిరిగాలన్న సరదా సహజం. నీ గర్భం నేను మోస్తాను. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి తిరిగి తీసుకో!' అంటూ భార్యగర్భం తనకు బదిలీచేయించుకొని ఆపసోపాలు పడేందుకు సిద్ధపడతాడు ఓ అద్భుతమైన మగవాడు!  చూలు మోయడమంటే పేలాలమూట మోయడమా! అన్నం సయించదు. నిద్రబాధలు. బిడ్డకుట్లకు ఓర్చి  నీళ్లాడినా.. తరువాత వాతాలు తగలుకోకుండా  పథ్యపానీయాలతో పంచకరపాట్లు పడాలి! గర్భంమోసి బిడ్డను కని.. పెంచి పోషించేందుకు ఆడది  సుకుమారయీ ఎన్ని కష్టాలను   ఇష్టంగా ఓర్చుకొంటుందో మగవాడు తెలుసుకోవాలి. నాగరీకులమని బోరవిరుచుకు తిరిగే  నేటితరాలకన్నా.. ఆనాగరికులుగా ముద్ర వేయించుకొని హీనంగా బతుకులు వెళ్లమార్చే జాతులు కొన్నింటిలో మగవాడు భార్య ప్రసవవేదనలను పలురీతుల్లో తానూ పంచుకొంటూ నిజమైన సహచరుడు అనిపించుకొంటాడు.
ఎరుకల కులంలో  భార్య ప్రసవించే సమయానికి  మగవాడు అమె కట్టు బొట్టులను  తాను అనుకరిస్తూ చీకటిగది కుక్కిమంచంమీద దుప్పటి ముసుగులో  దాక్కుంటాడు. భార్యకు సుఖంగా ప్రసవమయితేనే  మంచం దిగేది! బాలింత తినాల్సిన గొడ్డుకారం.. ఇంగువ ముద్దలు భర్తే మింగుతాడుఅండమాను దీవుల్లోని మరోతెగలో అయితే   గర్భిణీభార్య తినకూడని గొడ్డుమాంసం, తేనెవంటి పదార్థాలు తనూ ముట్టడుబిడ్డ పుట్టగానే పెనిమిటి ఉయ్యాల్లో పడుకొనే వింత ఆచారం న్యూగినియా ఆదిమజాతుల్లో నేటికీ ఉంది. పార్శీసుజాతి మగాడికి ఉయ్యాలశిక్షతో పాటు వంటికి నల్లరంగు పులుముడు అదనం. మైల తీరేదాకా గది బైటికి రాడుకూడా. బిడ్డ బొడ్డుతాడు ఊడేవరకు ఉపవాసాలుంటాడుఫిలిప్పీన్ దీవుల్లో   ప్రసవసమయంలో  భార్యగది గస్తీబాధ్యత కట్టుకొన్న భర్తదే. బిడ్డ పుటకకు తనే కారణమన్న వాస్తవం  లోకానికి చాటిచెప్పే ఇలాంటి తంతులు ఇంకెన్నో పలుదేశాల ఆదిమజాతులు ఈ నాటికీ ఆచరిస్తున్నాయిపురిటిబాధల్లో భాగం పంచుకోవాలని  ప్రసవ సమయంలో   భార్య మంచానికి తనను తాను కట్టేసుకొనే  మియాస్ తెగ మగాడికి మించి భార్యలను  ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? ప్రశంసించగలరు?
బుద్ధభగవానుడు భార్యాభర్తలిద్దరూ పాటించవలసిన   సూత్రాలు చెరి ఐదేసి  బోధించాడు. 'భార్యను చీదరించుకోకుండా, సంపూర్ణ గౌరవం అందిస్తూ, ఆమె  తనివితీరా అన్నవస్త్రాలు, ఆభరణాలు  క్రమం తప్పకుండా అందించడం భర్త భాద్యత. పరస్త్రీలను కాముక దృష్టితో చూడకపోవడాన్నిమించి మగవాడు మగువకు ఇవ్వగల గొప్పప్రశంస మరేదీ లేదనికూడా బుద్ధుడు చురకలంటించాడు.

రెండు పుంజులు, రెండు పిల్లులు, ఎలుకలు, ముసలివాళ్లు, పడుచుపెళ్లాం ఉంటే  ఇంట రభస తప్పదని డచ్ దేశంలో ఓ సామెత ఉంది. ‘మగవాడి జీవితానికి రెండే శుభసందర్బాలు.. పెళ్లయిన రోజు, భార్యను పూడ్చిపెట్టిన రోజు’ అని పంచ్ పత్రిక పంచ్! ఎంత అన్యాయం! ‘నీ భార్యను నువ్వు గాడిద చేసావంటే.. ఆ గాడిద నిన్ను ఎద్దును చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!- అని మాత్రమే నేటి వనిత మగవాడిని హెచ్చరిస్తోంది.
మగవాళ్ళు తమ ఎద్దు మొద్దు స్వరూపాలు గుట్టుగా ఉండాలంటే ఆ 'గాడిద' కూతల జోలికి వెళ్ళకూడదు మరి. భార్యలను ప్రశంసించేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు నెల  మూడో ఆదివారంనాడు  ‘భార్యామణిని ప్రశంసించే దినం’ (Wife Apptreciation Day) జరుపుకుంటారు పశ్చిమదేశాల్లో మగవాళ్ళు! ప్రశంసలు అనక! సర్వస్వాన్ని నిస్వార్థంగా అర్పించడానికి సిద్ధపడి మగాడి గడప తొక్కిన ఆడదాన్ని ముందు సాటి మనిషిగ్గా గుర్తించడం   నేర్చుకోవాల్సుంది పురుషప్రపంచం.

ప్రతి పురుషుని విజయం వెనకా ఒక  స్త్రీ ఉంటుందంటారు కదా! ఆ స్త్రీ కట్టుకున్నది కాకపోతే ఆ పురుషుడి బతుకు ఇక ఇస్త్రీనే! ఆ సంగతి  గుర్తుంచుకోవాలి మగమేస్త్ర్రీలు.
-గుడ్లదొన సరోజినీదేవి
ఎమ్.ఏబి.ఎడ్ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు
(ఈనాడి సంస్థ 'తెలుగు వెలుగు' మాస పత్రిక, సెప్టెంబరు, 2016 సంచికలో ప్రచురితం)

Saturday, October 1, 2016

పేపర్ వర్క్- వాకిలి- లాఫింగ్ గ్యాస్

మా చిన్నతనంలో వార్తాపత్రికల ప్రయోజనాలను గురించి రాయమన్న ప్రశ్న తరచూ మార్చి మార్చి వస్తుండేది. వార్తాపత్రికలమీద పెట్టిన దృష్టి అవి తయారయే కాగితంమీద ఎందుకు పెట్టలేదనే సందేహం ఎప్పుడూ నన్ను పీడిస్తుంటుంది.
రాతకు కాగితం తప్పని సరి. కాగితాలు అందుబాటులో ఉండబట్టే కవులు.. కథకలూ..  మన జీవితాలతో చెలగాడమాడుతున్నది. అలా కాదు.. కాగితం అంటూ ఒకటి హద్దుగా  ఉండబట్టే కదా వాళ్ల ధాటికి సమాజం తట్టుకో గలుగుతున్నది?’ లేకపోతే.. వాళ్ల ఆశుధారాశక్తికి మానవ సంఘం ఎప్పుడో కొట్టుకు పోయుండేది.. అనే విరసలూ కద్దు. ఆ ఊసులు మనకిప్పుడు వద్దు.  కాగితాలతో ఒనగూడే ఇతర ప్రయోజనాలూ బోలెడున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో! వాటిని గురించి ముచ్చటించుకుందాం.. ముచ్చటగా ఉంటుంది.
మన దేశ మంత్రివర్యుడొకడు చైనా సందర్శనకు వెళ్లాడుట ఒకసారి. అక్కడి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించే సందర్భంలో వంద కి.మీ పొడుగున్న ఒక వంతెనను చూపించి ఎంత పకడ్బందీగా అది కట్టబడిందో.. ఆ కట్టుబడికి ఎన్ని మిలియన్లు ఖర్చు అయిందో వివరించాడు చైనా మంత్రివర్యుడు. మరో సందర్భంలో అదే మహాశయుడు ఇంకేదో టూరు సందర్భంగా  ఇండియా వచ్చినప్పుడు.. ఇక్కడి అభివృద్ద్జిని అతగాడికి వివరించాల్సిన బాధ్యత ఇదివరకటి మంత్రివర్యుడికే అప్పగించబడింది.  ఆ నేపథ్యంలో ఒక ప్రాంతాన్ని చూపిస్తూ 'మీ దగ్గరున్న వంద కి.మీ  వంతెనకన్నా.. రెట్టింపుంటుందీ నిర్మాణం. కాకపోతే ఖర్చు కట్టుబకి కాస్త ఎక్కువయింది..' అనంటూ  ఏవేవో వివరాలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. అసలక్కడ ఏ వంతెనా లేకపోవడంతో నోరు వెళ్ల బెట్టిన చైనా పెద్దమనిషి.. అదే విషయం అడిగితే 'అక్కడే ఉంది.. మీకూ మాకూ తేడా. మీకు కాగితాల ప్రయోజనం పరిమితంగానే తెలుసు.  మాకు అపరిమితంగా తెలుసు' అనేసాడు మన ఇండియా పెద్దాసామి.
కాగితాలనగానే సాధారణంగా మన మనసుల్లో మెదిలేవి బడిపిల్లకాయలు బస్తాల్లాంటి సంచుల్లో కుక్కుకొని మోసుకుంటూ తిరిగే బుక్కులు.. వార్తా పత్రికలుకార్యాలయాల తాలూకు దస్త్రాలు.. గట్రా!
రోడ్లమీదపార్కుల్లో.. చెల్లా చెదరుగా పడుండే పోగులు. రచయితలు, కవులు.. వాడే  వాటితో ఏ ఉపయోగమూ ఉండక పోవచ్చుగానీ.. పాతకాగితాలను రోట్లో రుబ్బి ఆ గుజ్జుతో బుట్టలు చేసేది మా అవ్వ. కాగితాలను రకరకాలుగా కత్తిరించి రంగులద్ది ఆ ముచ్చటైన బొమ్మల్ని ఇంటి గుమ్మాలకు వేలాడదీసేది మా అత్త. కాగితాలు ఉండలుగా మార్చి పురుగూ పుట్రా లోపలికి రాకుండా తూములకు అడ్డం పెడుతుండేవాడు మా తాత.  బస్తాలకి బెజ్జం పడి   ధాన్యం కారిపోకుండా కాగితాలడ్డం పెట్టి మా మామయ్య.. రాసుకునే బల్ల ఎత్తుపల్లాలు సరిచేసుకునేందుకు  ఉపయోగించి  మా నాన్న.. కాగితాలు  బహుళార్థ సాధకాలని నిరూపించారు. ఎదురింటి రెండు జడల సీతకి పొద్దస్తమానం మా బాబాయి పై డాబామీదనుంచి గురిచూసి విసిరేదీ కాగితాలతో చేసిన రాకెట్లనే. మా పెద్దతమ్ముడు కాగితాలతో గాలి పటాలు. చిన్న
తమ్ముడు కత్తి పడవలు చేసి ఆడుకునేవాళ్లు చిన్నతనంలో.
కాగితాల్తో అన్నీ ప్రయోజనాలే అనుకొంటే పప్పులో కాలేసినట్లే. ఊళ్ళో  మనుషుల్లేకుండా .. పొలం పుట్రా ఉన్నవాళ్ల తాలూకు పత్రాలకి నకిలీలు సృష్టించి అమ్ముకునే మా ఊరి పుల్లారావులాంటి నమ్మకద్రోహులకి ఈ కాగితాలే ఆసరా! కొంచెం  బాధాకరమే కదా! మా ఊరి కరణం ఆంజనేయులుగారు ఇలాంటి లాలూచీ వ్యవహారాల్లోనే బోల్డన్ని పచ్చకాగితాలు కళ్లచూసాడని చెప్పుకునే వాళ్ళు చుట్టుపక్కల ఊళ్లల్లో.
అన్నట్లు రూపాయి.. పది రూపాయల్లాంటి వాటి ముద్రణక్కూడా కాగితాలే కదా గతి! దేశ ఆర్థికస్థితంతా బంగారంమీదుందంటారుగానీ.. వట్టిదే. అదీ వట్టి కాగితాలమీదే అధారపడుంది. మన దేశంలో బంగారం నిల్వలకు తగ్గంతగా మాత్రమే కరెన్సీ చలామణిలో ఉందంటే నమ్మదగ్గ మాటేనా?
ఉత్తరాలు.. ఆత్మకథలు.. మంచి మంచి పుస్తకాల్లాంటి వాటికీ కాగితాలే ఆధారం. కాబట్టే.. ఆ పెద్దలు.. మహాత్ములెవ్వరూ మన కంటి ముందుక్కిడ   ఇప్పుడు లేకపోయినా.. వాళ్ళు బోధించిన మంచి సూక్తులు.. ఆలోచనలు మన మేథస్సుల  ఎదుగుదలకు అంతో ఇంతో  దోహదం చేస్తున్నాయి.
గత్సంలో పెద్దలమధ్య.. దేశాలమధ్య జరిగిన ఒప్పందాలు.. రాతకోతలన్నింటికీ కాగితమే వేదిక. కాబట్టే కట్టెదుట వాళ్ళు కనిపించక పోయినా 'conversation with the legends' సాధ్యమవుతోంది. గాంధీ మహాత్ముడు ఈ కాగితం విషయంలో ఎంతో పీనాసితనం చూపించేవాడంటారు. తనకొచ్చిన ఉత్తరాల వెనక ఉన్న  ఖాళీ జాగానికూడా ఆయన వృథా పోనిచ్చేవాడు కాదుట. మరీ వ్యక్తిగతానికి సంబంధించిన  విశేషాలను మినహాయించి మిగతా సంగతులేవైనా సరే  రాసుకొనేందుకు వాటిని ఉపయోగించే వాడుట. తనకొచ్చిన కవర్లను చింపి కాగితాలుగా మార్చి వాటినీ వాడిన విచిత్రమైన  పొదుపరితనం బాపూజీది. మరీ ఉపయోగం లేని చెత్తకాగితాలతో ఆశ్రమానికి అవసరమైన  బుట్టలు.. తట్టలు.. వగైరా తయారు చేయించేవాడని వినికిడి.
ఆడపిల్లల సంసారాలతో చెడుగుడు ఆడుకునే ఆకాశరామన్నలకూ ఈ కాగితాలే ఉత్తరాల రూపంలో సాయపట్టడం కొంత విచారకరమైన విషయం. ఇప్పుడంటే విద్యుత్ బుగ్గలు కానీ.. ఒకానొక కాలంలో మునిమాపటి చీకట్లు కమ్ముకోడానికి ఇంత సమయం ఉందనగానే నూనె దీపాలు శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు ఆడంగులు. ముందురోజు దీపం గ్లాసులకు పట్టిన మసిని తుడిచేందుకు బొగ్గు.. ఆ తరువాత ఆ బొగ్గుమరకలు పోవడానికి కాగితాలనే  వాడేవాళ్ళు. కుంపటి రాజేసుకొనేందుకు  కావాల్సిన మంటను అమ్మ కాగితాలు అంటించే సాధించేది.   అద్దాలమీద మరకలు పోవాలన్నా.. ముందు ఏ పౌడరుతోనో శుభ్రం చేసి ఆనక కాగితంతో   తుడిచేస్తే అద్దం ఆడపిల్ల చెక్కిళ్లలాగా తళ తళలాడుతుంది.
ఇన్నేసి ప్రయోజనాలున్న కాగితాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞానం పక్కన పెట్టేస్తోంది. పేపర్లెస్ ఆఫీసులమీద మోజు పెంచేస్తోంది. విదేశాలలో టాయిలెట్ అవసరాలక్కూడా టిస్యూ పేపర్ వాడుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ స్థానంలో పేపర్ బ్యాగులను ప్రోత్సహిస్తున్నారు. అయినా డిజిటల్ వర్చ్యవల్ వరల్డ్ విస్తురిస్తున్న కొద్దీ పేపరు ప్రపంచం కుచించుకుపోతోంది.
ఒక రీము పేపరు తయారవడానికి పెరట్లోని చెట్టూ చేమా ఉపయోగించాలి. పచ్చదనం  తగ్గిపోతున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన.
కాదనలేం కానీ.. కాగితాల కత్తిపడవలతో.. గాలిపటాలతో బాల్యానికున్న అనుబంధాన్ని అంత తొందరగా మర్చిపోలేం కదా! వేళకి జీతాలు రాని బడిపంతుళ్ల  ఇళ్లల్లో పుట్టిన పిల్లలం. మావి చిన్ని బొజ్జలే అయినా వాటిని నింపేందుకూ ఆ కాలంనాటి అమ్మలను ఈ కాగితాలే ఆదుకొనేవి. పదో పన్నెండో పాత వార్తా పత్రికల పేపర్లను సీతయ్య చిల్లర  దుకాణంలో మారకానికని వేస్తే వచ్చిన పప్పూ బియ్యంతోనే బిడ్డలకొక పూటైనా కడుపు నిండేది. పొట్టకోస్తే కనిపించే అక్షరం ముక్కే కాదు.. పొట్ట హరాయించుకొన్న పులుసు ముక్కలక్కూడా కాగితాలే ఆధారంగా గడిచిన ఆ కాలాన్ని అంత తొందరగా మర్చిపోగలమా?!
అలాంటి కాగితంమీదకు జాగిలంలా  వచ్చిదూకుతోంది ఆధునిక సాంకేతిక విజ్ఞానం. అభివృద్ధికి కాలడ్డం లేం.. అలాగని మధుర స్మృతుల పేటికను కాలప్రవాహానికి వడ్డలేం! ఇదో విచిత్రమైన సంధి దశ చీలే రెండు సంస్కృతుల కూడలిమీద నిలబడ్డ మా తరానికి.
--కర్లపాలెం హనుమంతరావు

వాకిలి- ‘లాఫింగ్ గ్యాస్ ‘- అక్టోబరు, 2016 సంచిక ప్రచురణ



Thursday, September 29, 2016

స్వర్గం అంటే?! - ఓ సరదా రాజకీయ వ్యాఖ్య

"స్వర్గం అంటే?" ఏంటి బాబాయ్?
 "ఏంరోయ్. ఉన్నట్టుండి చింతన ఇవాళ అటు మళ్లిందీ? కోడలింకా పుట్టింటి నుంచీ రావడం ఆలస్యమయేట్లుందా?"
"సూటిగా ఎప్పుడూ జవాబు చెప్పవు కదా! ప్రశ్నకు ప్రశ్న జవాబా? తమరేమన్నా సర్కారు తరుఫు సమాచార అధికారా"?
 "అంత పెద్ద నింద నా మీదెందుకులే! ఐతే స్వర్గం ఏంటో కావాలంటావు?  'స్వర్గం అంటే  కల్పవృక్షాలుంటాయి. రంభా ఊర్వసులుంటారు' అన్నాడురా వెనకటికి ఎవరో నీ లాంటి నిత్య సందేహి అడిగినప్పుడు మన మునిమాణిక్యం నరసింహారావు గారు.
 "ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో.. అది చెప్పరాదా బాబాయ్?"
 "ఆరగా ఆరగా తాగేందుకు మన ఆఫీసు క్యాంటీన్లలోలాగా అమృతం భాండాల నిండుగా  దొరుకుతుంటుంది అనుకుంటున్నాన్రాసర్కారు ఉద్యోగమల్లే సరదాగా కూడా ఉంటుందేమో! పనీ పాటాతొ వళ్ళు విరుచుకోవాల్సిన పనే ఉండదనుకుంటా. వేళా పాళా లేకుండా.. ఎప్పుడైనా ఎంత సేపైనా హాయిగా  గుర్రు కొట్టొచ్చు. సిసి కెమేరాల గోల ఉండదు.‘ఇదేమిటి?'..అని గద్దించేందుకు  ముఖ్యమంత్రులు సచివాలయాల్లో అసలే ఉండరు. మన చట్టసభల్లో కన్నా రెట్టింపు అల్లరీ.. ఆగం చేసినా ఇబ్బందేమీ ఉండదు. ఎత్తుకెళ్ళి బైట కుదేయడానికంటూ  ఏ సిబ్బంది నియామకం ప్రత్యేకంగా ఉండదనిపిస్తోంది."
 "ఈ మాత్రం సుఖానికే స్వర్గం కోసం వెంపర్లాడాలా బాబాయ్? ప్చ్..!"
 "నీ కిష్టమైన గానాబజానాలు కూడా పెద్దపండుగల్లోలా  నడుస్తుంటాయిరా బాబూ అక్కడా! ఇష్టమైనవాళ్ళతో ఇష్టమొచ్చినట్లు ఇష్టమైనంతసేపు మహా విచ్చలవిడిగా వీరసంచారం చేసెయ్యొచ్చు. చూసుకో! ఏదీ పాపం కాదంటారక్కడ మరిపీకల్దాకా భోజనాలుతాగి  తూము కాలవల్లో పడి దొర్లినా వచ్చి తట్టిలేపే నాథుడెవడూ ఉండని లోకంరా బాబూ స్వర్గం!"
"పో బాబాయ్! ఒక ఐదో పదో మనది కాదనుకొంటే  ఏ రేవ్ పార్టీలోనైనా  ఇంతకన్నా ఎక్కువగానే మజా చేసెయ్యచ్చుగదా! ఈ మాత్రం సుఖాలకే  స్వర్గం దాకా దేకటమెందుకంటాసరే..ఇంకో సందేహం!  స్వర్గాలన్నీ ఒకే తీరుగా ఉంటాయా? అక్కడా మన నక్షత్ర హోటళ్ళ మాదిరిగా.. సినిమాహాల్లో టిక్కెట్ల లెక్కన  తేడాలుంటాయా? ఉంటే అవి ఎన్ని రకాలు?"
 "వంట్లో ఎలా వుందిరా నీకూ? ఎందుకైనా మంచిది ఓ సారలా ఆసుపత్రి దాకా వెళ్ళొద్దామా చూపించుకోడానికీ?"
 "శవాలకు మనుషుల్లాగా.. మనుషులకు శవాలకు మల్లే  చికిత్స చేసే ఆ ఆసుపత్రిలకి ఇప్పుడెందుకులే! అసలే నా దగ్గర ఆరోగ్యశ్రీ  ఒరిజినల్ కార్డు కూడా లేదు. నా సందేహం అలాగే వుంది. ముందది తీర్చు చాలు"!
 "సివిల్ సర్వీసు పరీక్ష తెలుగు ప్రశ్నపత్రంలాగా గందగోళంగా ఉందిరా నీ సందేహం నాకు. అడగినంత సులభం కాదు బాబూ దీనికి  జవాబు చెప్పటం! ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హిమాలయాల్లా చల్లంగా ఉంటుందని సరిపెట్టుకో.. పో”’
“చంపావ్ బాబాయ్! రీ కాశ్మీరీ లోయలా  కల్పవృక్షాలు గట్రాలతో  చల్లంగా ఉంటే.. ఎవరెళతారూ బాబూ మళ్ళీ ఆ చలి చోట్లకీ.. ఇక్కడ గడ్డకట్టుకొని చావడం చాలకనా! కనీసం  తలుచుకొన్నప్పుడల్లా విస్తర్లో దండిగా పిండివంటల వర్షం కురిస్తుంటేనన్నా కాస్త ఆలోచించుకోవచ్చుగానీ..”
మన తిరుపతిలో నిత్యాన్నదానం ఫక్కీలోనా! ఎప్పుడూ తిండి రంధేనుట్రా నీకూ! బండిని మరి కాస్త ముందుకు నడిపించరా బాబూ!"
"బాబూ అంటే గుర్తుకొచ్చింది.. మా బాబుకి బడిత పూజల్లేని బడులుండే చోటే స్వర్గం  బాబాయ్! కనీసం అలాంటి బడులైనా ఉండుంటాయంటావా స్వర్గంలో?”
అసలు స్వర్గంలో బళ్ళు మాత్రం ఎందుకూ? పంతుళ్ళతో, పేంబెత్తాలతో, మెళ్లో వేలాడేసే పలక బిళ్ళలతో అవసరం ఏముంటుందక్కడ? సర్సరే..  నీ స్వర్గం, మీ బాబు స్వర్గం. నేనెట్లా కాదంటాను దేనికైనా? మరి నా స్వర్గం ఎలా ఊంటుందో తెలుసురా అబ్బిగా?"
"పరగడుపునే తిట్టకుండా లోటానిండుగా చిక్కటి ఫిల్టరు కాఫీ కలిపిచ్చే  పిన్నిగారుండాలి అనుకుంటా. పెందళాడే వార్తాపత్రిక పడేసి పోయే పేపర్ కుర్రాడు, పిలిచీ పిలవంగానే 'సార్' అంటో హాజరై పోయే చౌకీదారు, నోరు పడిపోయిన పక్కింటి కుక్కపిల్ల, ఇంట్లో పనిచేయని టీవీ, గకుండా పనిచేసే లిఫ్టు, దొంగనోట్లు కక్కని ఏటియం, చౌకధరలకే ఖరీదైన మందులు, గొణక్కుండా నాడిచూసే వైద్యుడు, పద్దాకా నీ పిచ్చిరాతలు మాత్రమే ప్రచురించే ఓ పది పత్రికలూ.." 
"కొంత వరకూ నిజవే కానీ.. నిజానికి నా వరకు నాకు స్వర్గం అంటే.. టీవీ సీరియల్సు పదమూడు ఎపిసోడ్లకే బందయి పోయే చోటురా! పాదచరులు రోడ్డుకు ఎడమవైపున.. వాహనాలు.. విధించిన గీతల మధ్య మాత్రమే నడిచే స్థలంపండగలు.. పబ్బాలప్పుడైనా సరే దిగి వచ్చే ధరవరలు, బళ్ళ పార్కింగులకు సరైన సదుపాయాలు, ఒకటికీ.. రెంటికీ   శుద్ధమైన ఏర్పాట్లు,. వగైరా వగైరా ఉంటేనే అది అచ్చమైన స్వర్గమైనట్లు లెక్క. ఐదేళ్ళకోసారి మాత్రమే  సజావుగా..హుందాగా ఎన్నికలు జరిగాలి. బందులూ ధర్నాలూ నిష్కారణంగా జరగద్దు, ప్రజాసేవకులు సదా చిరునవ్వుతో జనాల సమస్యలను విని జరూరు జరూరుగా పరిష్కరించేందుకు తహతహలాడే పుణ్యభూమికనీసం గాంధీ జయంతి.. వర్ధంతులకైనా నిజాయితీగా స్వచ్చందంగా మధ్యనిషేధం అమలయ్యే పొడిచోటును మించిన  అమరలోకం మరేముంటుంది! పొడిచేస్తాం.. బాంబులతో పేల్చేస్తాం.. అని బెదిరింపులు అసలు  వినపడని శాంతిభూమికూడా అయివుండాలి నా దృష్టిలో స్వర్గమంటే! చేతులు.. మూతులు తడపకుండానే కనీసం కొన్ని ప్రభుత్వకార్యాలయాల్లోనైనా సరే చకచకా దస్త్రాలు పరుగులెత్తే దేవాలయాలకి, కారణం లేకుండానే కారు కూతలు, కారణమున్నా సరే  నేతల కారుకూతలు అసలు  వినబడని నిశ్శబ్ద భూస్థలికి, సాయంకాలాలు..  ఆదివారాల పూటైనా  పిల్లల్నలా కాస్తంత  హాయిగా ఆడుకునేందుకు బళ్ళు, కన్నవాళ్ళు  కనికరించి  వదిలేసే స్వేచ్చాస్థలికి,  తెలుగుపంతుళ్ళైనా కనీసం  సగం సంభాషణ జనంభాషలోనే జంకులేకుండా సాగించే స్వర్గానికి.. హే భగవాన్.. నన్నూ..నా దేశాన్నీ నడిపించు!"
"బాబోయ్ బాబాయ్! ముందు నువ్వు నేలమీదకు దిగిరావాలి! ఇప్పటికే దేవుడికి  పైన కంగారు మొదలై నట్లుంది.. పాపం! అసలు సందేహం తీర్చుకుందికి నీ దగ్గరకని పరుగెత్తుకొచ్చాను చూడు.. నాదీ బుద్ధి తక్కువ. సందు దొరికింది కదా అని.. సందర్భంకూడా తెలుసుకోకుండా నీ కడుపులోని ఆలోచన్లను ఇలా బొళబోళా బైటికి వెళ్ళకక్కడం ..ఏమన్నా బావుందా?"
"ఆ సందర్భమేందో బైట పెట్టాల్సింది ముందు నువ్వూ! స్వర్గం గురించి చర్చ రేపిందెవరూ అసందర్భంగా పరగడుపునే పరుగెత్తుకొచ్చి!"
"అసందర్భమేం కాదులే బాబాయ్. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలొచ్చి పడుతున్నాయ్ గదా!  ఎన్నికల్లో నిలబడ్డ  అభ్యర్థులు ఎవరికి వాళ్లు ఓటర్లకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటో ఎడా పెడా హామీలు  గుప్పించేస్తున్నారు!మా  వార్డులో ఒక సన్యాసి.. ఓటేసి గెలిపిస్తే ఏకంగా స్వర్గానికి పంపిస్తానంటూ కనబడ్డవాళ్లందరి నుదుటి మీదా ఇంత పొడుగు పట్టెనామాలు దిద్ది పోతున్నాడు! మా పిచ్చిది ఇంట్లో ఒహటే నస.. ఆ సన్యాసికే తప్పకుండా ఇంటిల్లిపాదీ ఓటెయ్యాలని. ఒహవేళ అతగాడుగాని  మా ఓట్లతో  గెలిచి స్వర్గానికి  రమ్మని బలవంత పెడితే వెళ్లడానికి సిద్దమవాలా వద్దా అని సందేహంతో బుర్ర బద్దలయిపోతోంది! రాత్రుళ్ళు నిద్ర పట్టడంలే! సరే.. నువ్వున్నావు కదా.. సందేహాలు తీర్చడానికని   ఇల్లా పరుగెత్తుకొస్తే..  నువ్వంతకన్నా విచిత్రమైన స్వర్గాన్ని చూపించి బెదిరించి పారేస్తుంటివి!"
 "అదా సంగతి! నేనూ విన్నాన్లేరా ఆ స్వర్గం సన్నాసిని గురించి. అధికారంలో ఉన్నంత కాలం  జనం సంగతి పట్టకుండా.. రౌడీలకన్నా హీనంగా కాట్లాడేసుకున్న పెద్ద మనుషులు.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకొస్తే స్వర్గం సృష్టిస్తామని.. కుదరకపోతే నేరుగా స్వర్గానికే  తరలించేస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు చూడు.. దాన్ని వెటకారం చేస్తో ఎవరో జన  చైతన్య స్వచ్చంద సంస్థ పక్షాన నిలబడి పెద్దమనిషిలే ఆ సన్యాసి! ఓటర్లకు అవగాహన పెంచే వ్యూహంలో అదొక భాగం. నిజంగా స్వర్గానికెళ్ళాల్సిన గత్తరేం ఉండదులేరా నీకూ.. మీ ఆవిడకు పిల్లకాయలకు! కంగారు పడకు!"
"అరెరే! ఇప్పుడెలా బాబాయ్ మరి! ఆ సన్యాసికే ఓటేస్తామని పెద్దమ్మ గుడికెళ్ళి దీపంకూడా ఆర్పొచ్చిందే మా మొద్దుది! వృథా  అవుతుందా పవిత్రమైన ఓటు?”
"మరేం ఫర్లేదులేరా. ఆ సన్నాసి కాకపోతే ఇంకో సన్నాసి. ఎవరొచ్చినా పెద్ద తేడా ఏం ఉంటుందనీ! నిజమైన స్వర్గం  నీకు ఇక్కడే రావాలంటే ముందు ఇలాంటి తిక్క ఆలోచన్లలో మార్పు రావాలి.  తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి  తిరిగి తీసుకోవటానికి  కనీసం దేళ్ళైనా  ఆగాలి.. ఆ సంగతి  ముందు తెలుసుకోవాలి! మన ఓట్లేమన్నా వృత్తి రాజకీయనాయకులు జేబుల్లో పెట్టుకొని తిరిగే  ఉత్తుత్తి రాజీనామా పత్రాలా? చాలా అప్రమత్తంగా ఉండాలిరా అబ్బాయ్! ముందు ముందూ ఇంకా  మరన్నో కీలకమైన ఎన్నికలు ముంచుకు రాబోతున్నాయ్ మరి!"
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం)-కార్ట్యూనిష్టు శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

ఉభయ కుశలోపరి- ఈనాడు సంపాదకీయం

'స్నేహం- తేనెమనసుల్లో వెల్లివిరిసే నాకం' అన్నాడో ఆధునిక కవి. జీవితం  కురుక్షేత్ర రణక్షేత్రమయినప్పుడు విజయానికి సారథ్యం వహించేదీ స్నేహమే! కృష్ణుణ్ణి కుచేలుణ్ణి కలిపి ఉంచింది, రాముణ్ణి రావణాసురుడి సోదరుణ్ణి కలిపి నడిపించిందీ ఈ స్నేహసౌహార్ద్రమే! 'సర్వే భవన్తు సుఖినః/ సర్వే సన్తు నిరామయా/ సర్వే  భద్రాణి  పశ్యంతు/ మా కశ్చత్ దుఃఖ  భాగ్భవేత్'- అందరు సుఖంగా, నిశ్చింతగా ఉండాలి. ఆయురారోగ్యాలతో ప్రవర్థిల్లాలి. మంగళవచనాలు వీనులకు, మంగళకార్యాలు కళ్లకు విందులు చేయాలి. ఏ ఒక్కరూ దుఃఖభాజితులు కారాద'ని కోరుకొనే 'మంగళాచరణం' తెలుగునాట ప్రతి  గుడిముంగిట సమయసందర్భం వచ్చినప్పుడల్లా గుడిగంటలతో కలసి ప్రతిద్వనించడం అనూచానంగా వస్తున్న సదాచారం. 'వాక్కును మితంగా, పరహితంగా వాడితే అదే మంత్రమవుతుంది' అంటారు శ్రీశంకరులు. తామెల్లరూ భద్రంగా ఉంటూనే చుట్టుపక్కలవారందరూ క్షేమంగా జీవించాలని మనసా వాచా కాంక్షించే గొప్ప సంకల్పం 'యోగక్షేమం వహా మ్యహమ్'లో కల్పన చేయబడింది. అభయ హస్తం ఆశించి వచ్చినవాడు పరమశత్రువయినా సరే యోగక్షేమలయినా  విచారించకుండా తిప్పిపంపడం భారతీయులకి బొత్తిగా  సరిపడని సంస్కృతి. పరమబొంకుగా కొందరు భావించే భారతంలో సైతం అడుగడుగునా సత్సంప్రదాయాలు  కంటపడుతంటాయి. యుద్ధానికిముందు విధాయకం కనుక శకుని పనుపున  యాదవుల సాయమర్థించేందుకు ద్వారకాపురి చేరుకుంటాడు సుయోధన మహారాజు. కిట్టనివాడని కిట్టయ్యేమన్నా పలుచన చేసాడా! 'బావా! ఎపుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్- చుట్టముల్?'అంటూ యోగక్షేమాలన్నీ చట్టబెట్టి మరీ విచారిస్తాడు. తిరుపతి వేంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు' లోని ఈ పద్యాలు నాటికే కాదు.. నేటికీ  ప్రతి తెలుగునోటా ప్రతిద్వనిస్తూనే ఉన్నాయి. కారణం? తెలుగునాట అతిథులను ఆత్మీయులుగా భావించి ఆదరించడమే!

'నోరు మంచి- ఊరు మంచి', 'మంచిమాట మనుగడకు ఊరట', 'ధన్యత్వం అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుట' లాంటి సూక్తులెన్నోచిన్నబళ్లల్లో బాలల నోళ్లల్లో సుళ్లు తిరుగుతుంటాయి తెలుగు ఊళ్లల్లో! 'ఐకమత్యమే అసలు బలిమి' అని, కలసి ఉంటేనే కలదు కలిమి' అని, 'విడిపోతే చెడిపోతాం.. చెడిపోతే పడిపోతా' మని పిల్లలనేమిటి.. పెద్దలూ వంటబట్టించుకొనవలసిన నిత్యజీవిత వ్యక్తిత్వ వికాస సూత్రాలు కావా! 'సదాచారం, సత్సంప్రదాయం సంకలించిన జీవనవిధానమే సంస్కృతి' అని వివేకానందుని నిర్వచనం. వ్యక్తిలోని మూర్తివంతమైన సంస్కృతే పరిణత మానవత్వంగా పరిమళించేది' అని భగవాన్ రమణ మహర్షి బోధనకూడా! మంచి నడవడిక, సంఘ న్యాయౌన్నత్యం, సుఖజీవనం, సర్వమానవ సౌభ్రాభృత్వం వంటి సుగుణాలు పెంపొందించే జీవకళలు వంద ఉదహరించాడు నాలుగో శతాబ్దినాటి క్షేమేంద్రుడు తన జౌచిత్య సిద్ధాంత విచారదారలో. తండ్రి లోభం. తల్లి మాయ. కుటిలనీతి సోదరుడు. కృతక వేషభాషాదులు. భార్య స్థానీయులు, హూంకరించే  పుత్రుడుఅమాకమానవుడి జీవితాన్ని నిర్వాకంచేసేందుకు బ్రహ్మదేవుడి పనుపుమీద దంభం ఇంత పెద్ద పరివారంతో భూమ్మీద సంచరిస్తుంటుంది. తస్మాత్ జాగ్రత్త'ని క్షేమేంద్రుడు ఆనాడే వ్యంగ్యంగా హెచ్చరించాడుమనిషిని మంచిబాట పట్టించాలన్న ఆరాటంగానే క్షేమేంద్రుడి వెటకారాన్ని స్వీకరించాలి. వాస్తవానికి తెలుగువారు .. భారతంలో నన్నపార్యుడు అన్నట్లు 'స్వస్థాన వేషభాషాభిమానులు'. స్వసంస్కృతీనిష్టులయీ, స్వదేశానురాగులయీ.. పరసంస్కృతులపట్ల సంసర్గం, పరాయి దేశాలపట్ల గౌరవం పుష్కలంగా ప్రదర్శించే సామరస్య జీవన దోరణే  అనాదినుంచి  హూందాగా పదర్శిస్తూ వస్తున్నది.

'సాహసం మూర్తిగైకొన్న సరణివారు' అని క్రీడాభిరామం వాడిన పదప్రయోగం తెలుగు'వాడి'కి సరిగ్గా అతికినట్లు సరిపోయేది. కోట సచ్చిదానందమూర్తిగారన్నట్లు 'ఆత్మాభిమానం, స్వాతంత్ర్య ప్రియత్వం.. ఒక ఆకు ఎక్కువవడం చేతనేమో.. విశాలదృక్పథం ఉండీ మనసు అడుగుపొరలకింద పడి ఉంది. 'నీ అడుగులకో తుదిగమ్యం అందాలంటే/ ఎడతెగని యెదురు దెబ్బలు - గమనించు మిత్రమా! గుండెను ఒక అద్దంలా తుడిచి చూసుకో నేస్తమా!' అంటారు డాక్టర్ సినారె.   ట్రాన్సాక్షనల్ ఎనాలసిస్ప్రతిపాదకుడు ఎరిన్ బెర్న్ సిద్ధాంతం ప్రకారం ప్రతివ్యక్తిలోనూ పెత్తనం ప్రదర్శించే పెద్దాయనా, కార్యశీలత కనబరిచే పెద్దమనిషి, గారాంబంగా ప్రవర్తించే పసిబిడ్డ ఉంటారు. 'సమయానికి తగు మాటలాడు' చాతుర్యం ప్రదర్శిస్తే చాలు! 'విద్వేషం వింధ్యపర్వతంలా  అడ్డం నిలబడ్డా.. నట్టింట్లో ఆనందం వెల్లువలా పొంగులెత్తుతుంద'న్నది బెర్న్ మార్కు పరిష్కారం. మైత్రి సంపాదనకైనా, కొనసాగింపుకైనా మాటపట్టింపే గదా ప్రధాన అవరోధం! అందుకే 'ఓహో.. నువ్వా!ఎక్కడ ఎప్పుడు ఏలాగ ఏంచేస్తున్నావు/ ఏ నక్షత్రంకింద సంచారం చేస్తున్నావు' అంటూ కవి అజంతా  సరళిలో కుశల ప్రశ్నల శరపరంపర మనోచాపంనుంచి వరసబెట్టి సంధిస్తే.. ఎదుటి వ్యక్తి ఎంతపాటి రావణాసురుడైతేనేమి.. విభీషణుడిమాదిరి మారి శ్రీరామాలింగనంకోసం పరితపించడం ఖాయం. ముదిగొండ శివప్రసాదు అన్నట్లు 'వేదాంతులు ఎన్ని గ్రంథాలు వ్రాసినా.. వాదాలు చేసినా/ ఈ రంగుల తెర ఇంద్రజాలం తెలియకనే!' నిజమేకానీ.. పరిస్థితుల్లో మంచిమార్పు ప్రస్తుతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 'మంత్రకవాటాలు తీయడం..మూయడం' వంటబట్టించుకొన్న ఇద్దరు చంద్రులు తెలుగురాష్ట్రాలు రెండింటికీ అధిపతులుగా ఉండటం కలసివస్తోంది. నవ్యాంధ్రపరదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభసందర్బానే    తెలుగుసీమల సౌభాగ్యహార్మ్యాలకూ  సౌహార్ద్ర పునాది రాయి పడటం శుభసంకేతం. ఏపి ముఖ్యమంత్రి మనసారా  ఆహ్వానించడం.. తెలంగాణా ముఖ్యసచివులు అంతే హుందాగా స్పందించడం.. ఆనందదాయకం. 'ఏనాడో ఎదచేనిలో వెదజల్లిన స్నేహబీజాలు/ మొలకెత్తి పిలకలు వేసి/ మళ్లీ ఇన్నాళ్లకు మమతల ధాన్యపురాసులతో మనసుబండ్లను నింపడం' ఎవరికైనా ఎందుకు ఆనందం కలిగించదుఉభయకుశలోపరుల్లోనే తెలుగువారందరి అభివృద్ధి ఫలాలు దాగున్నాయని గదా ఆశఇద్దరు చంద్రుల పునస్సమాగనం అందుకే  ఆనందం.

***
(ఈనాడు అక్టోబరు 31, 2015 నాటి సంపాదకీయం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...