Saturday, July 18, 2020

భారతదేశం హిందూదేశమా? -కర్లపాలెం హనుమంతరావు= సూర్య దిన[పత్రిక ప్వాసం



'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి
మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం
పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక
భాగం భరతవర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది
హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం
ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా
నివృత్తి అవుతుంది.

'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.

స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని
తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా
ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు
కనిపిస్తాయి.

యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి
వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం
వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు
కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు
సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ
ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం
పడింది.

రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ
రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు
పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన
విషయాలు వెలుగు చూస్తాయ్!

ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం
'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల
కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మతరూపంలో చొప్పించి పబ్బం
గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.



నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.
తాత్వికత అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు.
వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి
స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక
ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం
పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట
లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ
'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.

తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది
సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం,
ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే
సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల
నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.

ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ
మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద
'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం
హిందూధర్మంగా గుర్తింపబడింది.

'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి
రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా
ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!

స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో
మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి
నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా
బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.

మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించారు.
రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని
బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా
చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!



ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం
లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న
రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు
చేస్తున్నాయిప్పుడు!

హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో
అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో..
ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక
చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని
దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల
ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత
అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది.
మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం
చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం,
వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా,
త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే
దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం
వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత
ప్రభావం,

ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత
నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ
చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా
ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ
సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక,
ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు
నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత,
విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో
నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే.
భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు
బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు
తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వం చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత
సిద్ధాంతంతో ప్రభావితమైనవే!

కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం
రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది.
రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ
సమాజంలో చెల్లదు.



హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ
మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే
వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో
బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం
ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా
భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు
చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు
ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే
విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.

టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల
ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ
ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నడిపించారు. బెదిరిన బ్రిటిష్
దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని
ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు
మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ‘ప్రత్యేక ఇస్లాం
రాజ్యం’ కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా
చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం
చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే
కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా
పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది
బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు
విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే
ఉన్నారు.

భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం
వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ.
స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు
అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన
మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా
సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి
సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది.
చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన
పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?

***
(సూర్య దినపత్రిక - ఆదివారం - 18 -07 -2020 ప్రచురితం) 



Saturday, July 11, 2020

మేధస్సు రాజకీయం వెంట ‘పడి’పోకూడదు! -కర్లపాలెం హనుమంతరావు - సూర్య సంపాదకీయ వ్యాసం





పశ్చిమ జర్మనీ పురాప్రాణి విజ్ఞానవేత్తలలో ప్రముఖుడైన మానసిక విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ రూడోల్ఫ్ బిల్జ్ మనిషి చిత్త ప్రవృత్తి మీద అనేక పరిశోధనలు చేసిన అనంతరం తేల్చి చెప్పిన సారాంశం – మనిషి మనసు ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుంది’ అని గట్టిగా స్థిరపరిచి చెప్పడానికి  ఏ మాత్రం వీలులేని బ్రహ్మపదార్థం- అని. పరిస్థితిని బట్టి ప్రవృత్తి మార్చుకోవడం మనసు బలం. అధునాతమైన ఏ విజిజ్ఞాసాపథప్రమేయ విజ్ఞానమైనా ఈ తరహాలో ఉన్నప్పుడు ఇవాళ జరిగే సంఘటనకు మనిషి రేపు ఎలా స్పందిస్తాడో అన్న ఊహ ఊసుబోకకు మాత్రమే పరిమితమవుతుంది. సాహసించి ఏ కొద్ది మంది బుద్ధిబద్ధ మేదావుల కొంత కల్పన చేసినా ఆ ఊహపోహలు వేటికీ గతకాలపు అనుభవాలను దాటి ముందు వచ్చే పాటి శక్తి చాలదు. ఆ మేధోవర్గ ప్రవచనాలను ఆధారం చేసుకుని తతిమ్మా సామాన్య జనం పడే గుంజాటనల ఫలితాంశమే  లోకంలో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రాజకీయ  గందరగోళ వాతావరణం.
మేధోవర్గంగా మన్ననలు పొందిన బుద్ధిజీవులు ఈ రోజు తమకు తాముగా అస్వతంత్రులవుతున్నారు.  ప్రయోజిత  ఆలోచనాధారకు తమదైన శైలిలో ముద్రలు వేస్తూ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.  మద్దతు  లభించని పక్షంలో  ఆకృతి లేని మాటలకు, నిరాకార భావాలకు ఏలుబడికి వచ్చే అవకాశం ఉండదని తెలిసే ఈ ప్రక్రియ కొనసాగడం ఆందోళన కలిగించే అంశమే కదా?
సమూహాలను మించి వ్యక్తులను అభ్యుదయ శక్తులుగా చూడడమూ, సముదాయాల మీద  వ్యక్తుల ఆధిపత్య ధోరణికి హారతులు పట్టడమూ.. రెండూ వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య పంథా ఏలుబడి మార్గంగా ఎంచుకోబడిన చోట అది మరీ ప్రమాదకరం.  నిబద్ధ రాజకీయాలు (కమిటెడ్ పాలిటిక్స్) అన్న అభాసాలంకారమే అసలు పుట్టేందుకు ఆస్కారం ఉండకూడని జనస్వామ్య వ్యవస్థలో ‘నిబద్ధ మేధోవర్గం’ కూడా ఒకటి పుట్టుకురావడం విషాదకర పరిణామం.
కాలగమనాన్ని, సాంకేతిక విజ్ఞాన ప్రగతిని, విజ్ఞానశాస్త్రపు మనోవేగ ప్రసరణ తీవ్రతను గమనించనివారు మాత్రమే నిబద్ధ రాజకీయం’ అనే ఆలోచన చేసి ఆనక దాని చూట్టూతా సమాజాన్ని సైతం తిప్పించాలని తాపత్రయం చూపించేది. అది వృథా ప్రయాసగా మారిందని గ్రహించే వేళకు వారి పొద్దు ఎటూ వాటారిపోతుంది. దానితో కొంత మంది స్తబ్దుగా  తెర వెనకకు మలిగిపోతారు. మరి కొద్దిమంది బుద్ధిజీవులు ఆగలేక ఆఖరి నిశ్వాసలో నిట్టూర్పు ధ్వని వినిపిస్తారు. విన్యాసం ఏదైనా కావచ్చు కానీ.. రెండు చర్యల సారాంశం మాత్రం ఒక్కటే.. ‘ఏకబద్ధ మేధోసిద్ధాంతం’ అనే ఆలోచనకు ఎప్పుడైనా చివరకు దక్కేది  వైఫల్యమేనని.
 రాజకీయాలలో మాత్రమే ఈ తరహా నాటకీయ ప్రవృత్తులు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. రాజకీయవేత్తలకు ఉండే ప్రత్యేక లాభం కూడా అదే. పరార్థాన్ని స్వార్థం ఆక్రమిస్తుందో, స్వార్థం స్థానే పరార్థం రూపు దిద్దుకుంటుందో.. ఒక పట్టాన అర్థం కాని మయసభ మాదిరిది ఈ ఊసరవెల్లి క్షేత్రం. రాజకీయాలలో వ్యక్తిగతప్రయోజనం పార్టీ ప్రయోజనంగా విలసిల్లడమూ, పార్టీ ప్రయోజనం ప్రజాభీష్టంగా  ప్రదర్శించే ప్రయత్నాలు సందర్భాన్ని బట్టి ముమ్మరించడమూ మనం చూస్తుంటాం.  అందులో ఏది ఏదో చెప్పడం బ్రహ్మకైనా సాధ్యంకాదు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఉండే విశాలమైన అర్థం పరిమిత ప్రయోజనాలకు కుచించుకునిపోయే సందర్భాలు అవే. ఈ వైపరీత్యానికి కారణమేంటని గాని ఆలోచించగలిగితే రాజకీయవేత్తలలో నిరంతరం గూడుకట్టుకుని ఉండే సంకోచం.. భయం అని నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. బహుత్వంలో ఏకత్వం దర్శించలేక తమ అస్తిత్వం పట్ల గూడుకట్టుకునే అభద్రతాభావన అది. ఆ భావన ప్రసరణ వివిధ రూపాలే రాజకీయాలలో క్షణక్షణం సాగే రసవత్తర నాటక ప్రదర్శనలకు మాతృక.
ద్వంద్వాలను చూస్తూ, వాటికి అతీతంగా ఉంటూ,  ప్రకృతిని, దాని సృష్టిని జడం నుంచి స్థావరం వరకు, స్థావరం నుంచి జంగమం వరకు సూక్ష్మ అనుశీలన చేసి లోకానికి స్థూలం నుంచి విపులంగాను, విపులం నుంచి స్థూలం వరకు వివరించి చెప్పవలసిన బాధ్యత  మేధోసంపన్నులది. ఆ మేధోవర్గమూ రాజకీయవేత్తల పాత్రల్లో ఇమిడే ఇప్పటి ప్రయత్నాలు విచారం కలిగించే వైపరీత్య విపరిణామం.  
రాజకీయవేత్తల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి, మేధావుల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి విధిగా తేడా ఉంటుంది. ఉండాలి కూడా. ఆ అంతరం గుర్తెరుగకుండా మేధావిత్వం వెలగబెడుతున్నామనే మెజారిటీ  ఆలోచనాశీలులు తమ్ము తాము వంచించుకుంటున్నారు; తమను నమ్మిన  సామాన్య లోకాన్ని సైతం వంచించాలని చూస్తున్నారు.
రాజకీయవేత్త ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపు ఎల్లలు దాటి బైటికి చూడవు. మేదావికి ఆ అడ్డమాకులతో ఏం పని నిజానికి? అతని మనసు ఆకాశంలో స్వేఛ్చావిహారం చేసే విహంగంతో సమానమని కదా లోకం మన్నన! నిస్సీమమర్యాదగా సంచరించే ఆ మనసుకు హద్దులెక్కడివి? కేవలం సంకెల బద్ధం కాని బుద్ధిబలం ఒక్కటే మేధావిని కాని, రచయితను కాని, కళాకారుడిని కాని రాజకీయవేత్త నుంచి వేరు చేసి చూపించే గొప్ప లక్షణం. మేధావికీ   కమిట్ మెంటులు, కట్టుబడులు, బిగింపులు, అదుపాజ్ఞలకు లొంగుబాట్లు ఉన్న పక్షంలొ అతని ఆలోచనాధార, ప్రవాహఝరులకు అడ్డుకట్టలు డుతున్నట్లే లెక్క!
 ఇప్పుడు ఈ దేశపు మేధోలోకంలో గోచరించే ఈ సీమాయితబుద్ధిమత్వమే భయపెడుతోంది. రాజకీయవేత్తలోని రాజకీయ పదజాలాన్ని అరువు తెచ్చుకుని తమ ఆలోచనలకు తామే బందీలవుతూ.. లోకాన్ని సైతం తమ పరిమిత భావధారతో బంధించాలని చూస్తున్నారు మేధావులు! మనిషిని విశ్వరూపుణ్ణిగా మార్చవలసిన మేధావి పరిమితుణ్ని చేయాలన్న ప్రయత్నం విచారం కలిగిస్తోంది.
భూమి బంధాలను  సైతం విజ్ఞానశాస్త్ర సాధనతో ఒక వంక తెంచివేస్తోనే మరో వంక నుంచి తనలోని పెరగలేనితనం వెర్రిపిలకలు వేస్తున్నా నిర్లిప్తత పాటించడం నిజంగా ఒక వైపరీత్యమే! ఉత్తమోత్తమమైన  ఉత్ఠానమే సిద్ధాంతంగా అమలు కావాలన్న పంతంలేమి ప్రధానంగా ముందుకు రావడం.. అంటే మేదావులు తమ పాత్ర నిర్వహణలో విఫలమవుతున్నట్లే లెక్క. సంకోచం లేకుండా మేధావులు రాజకీయాలలో పడిపోతున్నారన్న మాటే.. అనుమానం లేదు!

 మహాప్రళయంలో కూడా నిర్భయుడు, నిరాసక్తుడు అయివుండవలసినవాడు, భయభ్రాంతులుగా, మమతాచిత్తులుగా మారిపోవడం దేనికి సంకేతం? అనుశీలన పరిశీలన కన్నా దిగువ స్థాయికి దిగజారిపోవడం ఏ ప్రమాదానికి ఆహ్వానం? ఏకదేశసిద్ధాంతాలకు తమను తాము బిగించుకున్న ఫలితంగా మేధావులలో వ్యుత్పన్నత పలచబారిపోతోన్నది. 'నాతనం' నావారు అనుకున్నవారి చేతకానితనాన్ని  వేలెత్తి చూపించడానికి నామోషీ పెడుతోన్న సందర్భం దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు మేధావులూ బరితెగింపు మార్గం పట్టేసారని లోకం బాహాటంగానే విమర్శిస్తున్నది. ఎవరు నొచ్చుకున్నా చెప్పక తప్పని  చేదు నిజం ఇది.
గిట్టని వర్గాల చేవకు చెయ్యెత్తి జైకొట్టడం జైళ్లకు చేర్చే సాకుగా  మారడం స్వార్థరాజకీయాలకు అతుకుతుందేమో! ఆ తరహా  కుతిల(బాధామయ) స్థితులకూ ఒక అంతస్తు కల్పించే ప్రయాస మేధోలోకం నుంచీ ఔత్సాహికంగా రావడమంటే.. నిస్సందేహంగా జనస్వామ్యవ్యవస్థ సర్వవినాశనానికి నాందీ వచనం ఆరంభం అయినట్లే! చీకటిలో తచ్చాడే మనుషులకు  ఏ ఒక్క మేధోజీవీ అనధికార దీపంగా అయినా  వెలిగి రహదారికి ఎక్కే  దోవ చూపించేందుకు సిద్ధంగా లేని  దుస్థితులు మళ్లీ దాపురించాయని నిస్సందేహంగా చెప్పేయవచ్చు. 
ఇక్కడ ఇప్పుడు ఏది లేదో దాని వల్లనే అంతటా చీకటి. ఆ చీకటి పారదోలడమే పనిగా ఉండవలసిన మేధోవర్గమే జనం చీకటిపాలబడేందుకు మొదటి కారణమవుతున్నది. దో విచిత్ర పరిస్థితి.
మేస్సుకు ఎవరో భాష్యం మార్చేసినట్లుగా ప్రస్తుతం ఏ ప్రచార మాధ్యమం గమనించినా ఆలోచనాపరుడంటే ఏకదేశ రాజకీయభావవిన్యాసకుడుగా మాత్రమే దర్శనమిస్తున్నాడు!


సమాజం మహాసముద్రం. గభీరం, గంభీరమైన అగాధమొకటి ఎదు ఉండగా, దానిని వివిధ నత్తల్లో అనుశీలన చేసి వడగట్టిన ఫలితాంశాలను సమాజశ్రేయస్సుకు అంకితమిచ్చే పని మేధావిది. ఆ విధి దిక్కులేనిది అయిపోయింది.
అభివృద్ధికి అర్థం నాలుగు రాళ్లు చేతుల్లో ఆడడం కాదు. సామాజికుణ్ణి ఎంత వరకు స్వతంత్రుణ్ణి, సమగ్రుణ్ణి, సర్వతోముఖుణ్ణిగా తీర్చిదిద్దుతుందన్న దాని మీదనే దాని  ప్రకాస్తి నిలుస్తుంది. ఎటూ రాజకీయవేత్త వల్ల కాని పని ఇది. మనిషిని బంధించేందుకు మాత్రమే ఎత్తులు  వేసేది రాజకీయం. జన బంధ విముక్తి తన ఉనికికి ఇబ్బందని దానికి తెలుసు. కనుక విడిచే పరిస్థితి ఉండదు. సామాజికుడి విముక్తి, జీవన విస్త్రృతులే లక్ష్యంగా పనిచేసే మేధావి  పనివిధానం అందుకు విభిన్నం.
ప్రపంచ దేశాల  వర్తమాన పరిస్థితులతో దేశీయుడి జీవన స్థితిగతులను ఎప్పటికప్పుడు తుల్యమాన పద్ధతిలో బేరీజు వేసుకుంటూ మంచి చెడులను చర్చకు పెట్టడం, క్రియాశీలులు  తమ ఉద్యమాలకు ఉత్తమ లక్ష్యాలు సిద్దంచేసుకునేందుకు వీలుగా వేదికల కల్పనలో తమ వంతు అంకితభావంతో నిర్వహించడం  మేధోజీవి పాత్ర. మేధావి  ఎట్టి సంకటంలో కూడా ప్రతినివిష్ఠ బుద్ధి కాకూడదు.  మనసుకు సంకెళ్లను పడనీయకూడదు. బంధం ఒకరు వేసినా, తనకు తానుగా వేసుకున్నా.. ఆ క్షణం నుంచి   అతని వాణి స్తబ్దము, దభ్రమూ కాకతప్పదు.

రాజకీయం, మేధస్సుకుకానొక అంగం మాత్రమే! ఎల్లవేళలా ఒకే ఆకారంలో ఉండని రాజకీయ వ్యవహారాలను తన సర్వస్వంగా భావించిన మేధావి మేధోమధనను నమ్మలేం. కారణం, అతడూ రాజకీయవేత్తతోనే తన బాణి, వాణి మార్చుకునే వర్గంలోకి దిగజారుతాడు కనక.

రాజకీయాన్ని, దానిలోని వైవిధ్యాన్ని మేధావి ద్రష్ట బుద్ధితో అనుశీలన చేసి అందులోని ఋతానికి, ధర్మానికి మాత్రమే ఆవిష్కర్తృత్వం వహించే బాధ్యత భుజాన వేసుకోవాలి. అట్లా వేసుకోగలిగిన మేధావులే నామవాచ్యులయినట్లు చరిత్ర రుజువులు చూపిస్తోంది. ఆ విధంగా చేయలేనివారు విపరీతపు సిద్ధాంతాలను బుర్రలోకి చొప్పించుకుని మేధోమార్గాన్నే మొత్తంగా పర్యాప్తమూ, పరిమితమూ చేసుకుంటున్నారని చెప్పాలి. పరిమిత సూత్రాలకు అపరిమతమైన ధార్మికతను అంటకట్టి కోరి కోరి తమకు తామే భావనాపంజరాలలో చిలకలుగా మార్చుకుంటున్నారు తాజా మేధావులు! ఎవరి పలుకులో అస్తమానం  చిలుకల్లా వల్లించడంతో మేధస్సుకు దక్కవలసిన న్యాయమైన గౌరవం దూరమవడానికి  కారకులవుతున్నారు.
లోకంలో ఏ సిద్ధాంతమూ, ధర్మమూ సమగ్రంగా ఉండవు. ఎల్లాకాలం ఒకే రూపంలో  చెల్లుబాటవాలనుకోవడం ధర్మం కూడా కాదు.  నిన్నటి ధర్మం ఈ రోజు చద్దివాసన వేయక తప్పదు. కారణం ఏ సిద్ధాంతమైనా ఏదో ఒక  వర్గ  ప్రయోజనానికి పరిమితమయి స్థిరపరచిందవడమే! అప్పటి కాలానికి అది ఉత్తమమని తోచినా.. కాలగమనంలో అవసరాల నిమిత్తం రంగప్రవేశం చేసే నూతన సిద్ధాంతాలు దానిని నిర్వీర్యం చేయడం తప్పనిసరి. అప్పుడు రాజకీయవేత్త కన్నా ముందు దాన్ని నిర్ద్వందంగా సమర్థిస్తూ వచ్చిన మేధావి సమాజం ముందు బోనులో నిలబడే  దుస్థితి వస్తుంది. 
 మానవ చరిత్రలో ఇంత వరకు ఎన్ని రాజకీయ సూత్రాలు అవతరించలేదు! అవధులులేని అధికారాలు అనుభవించీ కాలానుగతంగా అంతరించిపోలేదు! సిద్ధాంతం ఏదైనప్పటికి, ప్రతిదీ మంచి చెడుగుల కలగలుపు నేతే. తానులోని ఏ పోగులు శాశ్వత, సర్వహిత ధర్మ  సమ్మత లక్షణ సమన్వితమైనవో అనుశీలన చేసి ప్రపంచానికి  విడదీసి చూపించడంతో మేధావి బాధ్యత సంపూర్ణమయినట్లే!
కాలం అచంచలం, పృథివి పరిమితం -అన్నట్లుగా నిత్యం ప్రజాజీవితాలతో స్వీయప్రయోజనార్థం రాజకీయవేత్తలు రూపకాలు ప్రదర్శిస్తుంటారు. మేధావులు  వాటికి సూత్రధారుల వేషం కట్టకూడదు. పాత్రధారణనయితే బొత్తిగా దూరం పెట్టడం ఉత్తమం.
బంధాలు లేని  విచారధార వల్లనే కదా విజ్ఞానశాస్త్రం మానవపురోగతికి శక్తి మేరకు సమిధలు సమర్పించ గలుగుతున్నది! ఈ ఒక్క సూత్రం పట్టుకుని మేధోవర్గమూ ముందుకు పోగలిగినప్పుడే ప్రకృతి జనిత సర్వ పదార్థాల క్రమావిష్కార రహస్యాలను   అనుశీలించ గలిగే తన ప్రత్యేక శక్తిసామర్థ్యాలను   నిలుపుకునేది. మనిషిని సర్వతోముఖమైన సర్వజన సంక్షేమంకరమైన కళ్యాణమార్గం వైపుకు మళ్లించే సంకల్పం నిలుపుకోదలుచుకుంటే .. ఇప్పటిలా  ఏదో ఓ రాజకీయ పక్షాన్నో, పంథానో అదే శాశ్వతమని నెత్తిన పెట్టుకు వూరేగే మూఢత్వం ప్రదర్శించకూడదు. ఎంత లావు మన్నన పొందిన మహామేధావికయినా ఈ నియమంలో మినహాయింపులేదు.
 ఏకసిద్ధాంతబద్ధతకు లొంగని నిబద్ధత నిలుపుకున్నంత వరకే మేధావిలోని అసలు మేధస్సుకు జవం, జీవం.. మన్ననా, మర్యాదా. మాన్యత సాధించిన మేధోవర్గం ద్వారానే సామాన్య జనానికి ఎప్పటికప్పుడు వర్తమాన సమాజంలోని రాజకీయ స్థితిగతులు, మంచి చెడ్డలు వడగట్టినట్లు బోధపడేది.
***
(11 -07 -2020 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)



Thursday, July 9, 2020

బుర్ర కాదు.. బుద్ధి ప్రధానం! -కర్లపాలెం హనుమంతరావు



జింజాం త్రోపస్, జావా, నియాండర్లల్, సోలో, స్టీన్ హోం లాంటి దశలన్నీ దాటేసి హోమో సెపైన్స్ గా అవతరించి ప్రకృతి మీద పూర్తి ఆధిపత్యం సంపాదించినట్లు విర్రవీగే దశలో మనిషి పొగరును అణచడానికి సృష్టి ఉనికిలోకి వచ్చిన కొత్త మహమ్మారి కరోనా వైరస్ ఉపద్రవం. ఆకూ అలమల సేకరణ దశ నుంచి, ప్రకృతి వనరుల రహస్యాలను ఒక్కొక్కటినే ఛేదించుకుంటూ.. విశ్వాంతరాళలోకి రాకెట్లు తోలే వికాస స్థాయి వరకు చేరిన మనిషి తెలివితేటలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అగత్యమైతే లేదు. కానీ మనిషి ఆలోచనలు ఒక చోట నిలబడతాయా? నిలబడితే వాడు మెదడు గల మనిషవుతాడా? సృష్టిలో తతిమ్మా జంతుజాలల కన్నా తనకు అదనంగా లాభం చేకూరింది చంచలించే మెదడు స్వరూపం అని ముందు అర్థం చేసుకున్నాడు. సామాజికంగా, సామూహికంగా రోజుకు కొన్ని వేల కొత్త పదాల సృష్టి మెదడు లేకుండా సాగే వ్యవహారం కాదుగదా? బయో మెడిసిన్ అంటూ మొదలు పెట్టి ఇప్పుడు బయోవార్ వరకు ఆలోచన సాగించడం మనిషి మెదడులో పుట్టుకొస్తున్న కొత్త ఆలోచనల వల్లనే అర్థమవుతుంది.

మనిషి మెదడు బరువు సగటున మూడు పౌన్లు అని ఒక అంచనా. రష్యన్ రచయిత్ తుర్జనీవ్ మెదడు బరువు నాలుగు పౌన్ల చిలర. ఫ్రెంచి రచయిత్ అనటోల్ ఫ్రాన్స్ మెదడు బరువు ప్రపంచంలో కెల్లా చిన్నది. బరువు రెండు పౌన్ల పై చిలుకు.ఈయనా రచయితే. ఇద్దరికీ ప్రపంచ సాహిత్యంలో సమానంగానే పేరుంది. మెదదు బరువు సంగతి ఆనక, ముందు ఉన్న మెదడు చేత సక్రమంగా చాకిరీ చేయించుకునే ఇంగితం కదా ప్రధానం! బుర్ర ఎంత పెద్దదయి వుండీ ఏం ప్రయోజనం బుద్ధి కురచనైతే! బుద్ధి పెద్దదై బుర్ర బరువులో తేడా వచ్చినా మానవాళికి పోయేదేం లేదు. తమ కంటే ఇతర జాతులు తెలివిలో తక్కువవి, ఆ కారణం చేత అవి స్వాతంత్ర్యానికి అనర్హమని నిన్న మొన్నటి వరకు యూరోపియన్లు, వలసదార్లు నమ్ముతూ వచ్చారు. తెల్లవాళ్లకు తమ బుద్ధి కౌశలం మీద అతివిశ్వాసం. సాటి నీలివర్ణంవాళ్ల తెలివితేటలను మీద కొంచెంచూపు. కాని చరిత్ర తిరగేస్తే నాగరికతను సానుకూల పరిచిన వివిధ వస్తు సముదాయం సృష్టికర్తలలో నల్లజాతీయులే అధికం. నిన్న మొన్నటి వరకు బానిసలుగా బతుకులు బరువుగా ఈడ్చిన జాతులు ఎన్నో గత శతాబ్దిలో విమోచనాలు నడిపి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సాధించడం చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. బైటికి అనరు కానీ ఇప్పటికి సామ్రాజ్యవాదుల మనసుల్లో తమ ఆదిక్యతాభావన పైన  విపరీతమైన విశ్వాసం కద్దు. దానిని ప్రశ్నించే వర్గాల మీద అంతే విద్వేషమూ సహజంగా వెంట ఉంటుంది కదా! సందు దొరికితే తమ ఉక్రోషం తీర్చుకునే అవకాశం పెత్తందారి వర్గాలు ఎన్నటికీ వదులుకోవు. మొన్న అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రో- అమెరికన్ అకారణ దారుణ మరణం వెనుక తాత్కాలికమైన కోపతాపాలు ఒక్కటే కారణం అనుకోవడం సరికాదు. ఒక్క అమెరికా అనే కాదు.. ప్రపంచమంతటా ఇప్పుడు నడుస్తున్నవి విద్వేష పురాణాలే అనిపిస్తుంది. ఒక దేశంలో రంగుల తేడా అయితే, మరో దేశంలో మతాల మత్సరం. ఇంకో ప్రాంతంలో కులాలపై చిన్నచూపు. కరోనా ప్రబలిన కొత్తల్లో అకారణంగా చైనాను అమెరికా నిందించడం, మతావేశాలు పెచ్చరిల్లే ప్రస్తుత సందర్భంలో భారతదేశంలో మైనారిటీ మతాన్ని మూలకారణంగా ప్రచారం చేసే ప్రయత్నమూ ఇవన్నీ మనిషి మెదడులోని చీకటి పార్శ్వం చురుకుతనం పుణ్యం. అన్ని ఆధిక్యతల మీద ఆధిక్యత ప్రదర్శించేది అంతిమంగా ఆర్థికకోణమే. డబ్బు శక్తి పెట్టుబడిదారుడికి తెలిసినంతగా కార్మికుడికి తెలిసే అవకాశం లేదు. ఇవాళ చైనా అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్నంగా సాగుతున్న పోరుకు కూడా ఈ ఆర్థికమే మూల కారణం. గత శతాబ్దమంతా తన కర్రపెత్తనం మీద ప్రపంచాన్ని నడిపించిన అమెరికాకు కొత్త శతాబ్దిలో పరిస్థితులు చేజారిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపించడంతో ఆందోళన పెరిగినట్లు అర్థమవుతూనే ఉంది. ప్రపంచ మార్కెటు గతంలో మాదిరి గుత్తంగా తన దగ్గరే ఉండే పరిస్థితులు కచ్చితంగా లేవు. ఉత్పత్తి రంగంలో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ అశేషమైన మానవ వనరులు, మేధో వనరులకు తోడుగా మంచి ప్రణాళికతో ముందుకు దూసుకొస్తున్న చైనా జోరుతో అమెరికా బెంబేలెత్తుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. మరో మూడు దశాబ్దాలకు శతవర్షోత్సవంలోకి అడుగుపెట్టబోతున్న చైనా ప్రపంచ మార్కెటు మీద తన పట్టు పూర్తిగా బిగించేందుకు ఎన్ని చెయ్యాలో అన్నీ చేయడం గమనించవచ్చు. స్వావలంబన దిశగా స్థిరబడుతూ ప్రపంచమంతా తన ఉత్పాదక వస్తువుల మీద ఆధారపడేలా ఆ దేశం వేసే అడుగులతో అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా పోటీపడే అవకాశం లేదు. అందుకే చైనాను వంటరి చేసి ఆర్థికంగా దమ్మున్న దేశాలను తన వైపు ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా చైనా లేని జి- 7లో భారత్ లాంటి అభివృద్ధి చెందే దేశాన్ని కూడా కలుపుకోవాలని కొత్త ఎత్తుకు తెరలేపింది. ఏళ్ల తరబడి ఒకే ఆట ఆడుతున్న అమెరికాకు ఇప్పుడు ఆ విడగొట్టి పాలించే ఎత్తు పారడం కష్టంగా ఉంది. అమెరికా చైనా వస్తువుల మీద ఆధారపడి ఉండటం, చైనాకు ఏ విదేశీ వత్తాసు వస్తూత్పత్ప రంగంలో అవసరం లేకపోవడం ప్రధానకారణాలు. ముఫ్ఫై ఏళ్ల కిందటి చైనాకు ఇప్పటి చైనాకు హస్తిమశకాంతరం తేడా ఉంది. ఎంతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసుకుంటూ ఒక లక్ష్యంతో ముందుకు దూసుకుపోయే చైనీయుడి మెదడు బరువు, కొన్ని దశాబ్దాల తరబడి అభివృద్ధి రంగంలో అగ్రగామిగా ఉంటూ వచ్చిన అమెరికన్ జాతీయుడి  మెదడు బరువు కన్నా తక్కువ అవడం ఇక్కడ గమనించక తప్పని ముఖ్యమైన అంశం. 'స్నేహితులను ఎలా సంపాదించాలి?'   అనే పేరుతో గొప్ప గొప్ప హిట్ ఫార్ములాలతో వక్తిత్వవికాస గ్రంథాన్ని రాసిన డేల్ కేర్నజీ.. ఆంగ్లేయుడు.. ఆనక ' డబ్బు ఎలా సంపాదింఛాలి?' 'కోటీశ్వరులు ఎలా కావాలి?' అంటూ ఆర్థిక సంబంధమైన పుస్తకాలనూ రాసిన విషయం మనం మర్చిపోకూడదు. అదే బాటలో నడిచిన పార్కిన్ సన్లు, లారెన్స్ పీటర్ల తరహాలో ఏ పుస్తకాలో రాయడంలో కాకుండా  దేశ జి.డి.పి ని పెంచే కృషిలో పెట్టి తన మెదడు బరువును నిరూపించుకుంటున్నాడు ఇవాళ చైనా జాతీయుడు. 'బుర్ర తాటికాయంత ఉంటే ఏం లాభం.. బుద్ధి చింత పిక్కంత 'అని తెలుగులో ప్రచారంలొ ఉన్న సామెత సారాంశం ముందు అర్థం చేసుకోవాలి. వట్టిగా యాప్స్ నిషేధించినా  చైనాకు వచ్చే నష్టం తాత్కాలికమే అని మనమూ తెలుసుకోవడం మేలు. అంతకు అంత  గుంజే మరేదో ఆర్ర్థిక తారక మంత్రంతో నష్టం పూడ్చుకోగలడు. చైనాను చూసైనా మనం మన స్వంత కాళ్ల మీద నిలబడే మంచి తంత్రం గ్రహించడమే మేలు. ఈ కయ్యాలు, కాలు దువ్వుళ్లు ఎత్తుల తతంగాలన్నీ ముగించుకున్నాక!
***
- కర్లపాలెం హనుమంతరావు

Karlapalwm2010@gmail.com
+918142283676


Sunday, June 28, 2020

కర్షకా! -శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి- సేకరణః కర్లపాలెహనుమంతరావు




కొలములని జాతులని మేలుకోవలనుచు
పేరు పేరున భేదభావ
ముగ్గడించుట యవనికో యొప్పుగాని
కర్షకా, నీకు జెల్లదా కాపథంబు!
***


ఆలతో లేగపిండుతో అహరహంబు
కాపురము సల్పు నీ కేల కాని త్రోవ!
నిఖిల జీవుల కాశ్రయ నిలయమైన
కృషియె నీ జీవితమునకు గీర్తి తెచ్చు.
***
కలిమిలేముల త్రొక్కిళ్ల వలన నమిత
మోద ఖేదము లందుట కాదు నీతి;
కాలచక్రంబు పరవళ్లు లీల దాటి
వడిదుడుకు లేక మసలుట గడుసుదనము.
***
వేడి వెలిగ్రక్కు పడమటి గాడుపులకు
గాంతి తరిగిన తీవెల దొంతియట్లు
విమల పూర్వసత్సంప్రదాయములు నేడు
సన్నగిల్లుట గురితింపు మన్న నీవు!
***
పాలకుల వేషభాషల ప్రాభవమున
పాలితుల వైఖరియు మారుపాటు నొందు;
అందు విద్యాధికుల సంఘమందు ముందు
గలుగు పరిణామ మది నీకు హితము గాదు!
***
సర్వశాస్త్త్ర విచారము సలిపి విభుధ
సంఘ మూహించి విజ్ఞానసార మెల్ల
నాట పాటల ననుభవమున
చిత్తమున హత్తుకొనుట నీ వృత్తియగును.
***
వర్తకము రాచఠీవి సంప్రతులజులుము
చదువుసంధ్య వారి సంసారగోష్ఠి
సర్వమానవగ్రాసవాసముల తృప్తి
నీదు వృత్తికి శాఖలై నెత్తికెక్కె!
***
దున్నగా దూడల జేరు నన్న రీతి
కాయకష్టంబు వంక కేగకయె, దండి
 లాభముల కాసపడి మాయవైభవంబు
లంది కులికెడి వ్యక్తుల నయయుమన్న.
**
పరుగు పరుగున బ్రాప్తించు పాలకన్న
నిలిచి శాంతించి త్రావిన నీరె మేలు;
లక్షల కొలంది జేకూర్చు లాతివృత్తి
కన్న శ్రేయంబు నీ వృత్తియన్న నిజము.
***
పశుపతికి నీకు సంబధ బాంధవంబు
లుండు నన్న అసత్యము మేముండు నన్న!
శిశువు కన్నను నిచ్చలు పశువు నెంతో
గారవింతురు నీవుగా కేరు చెపుమ!
***
అలు- పిల్లలు జెల్లలు-నాలుపిండు
గొడ్డుగోదలు-దూడలు-దొడ్డు లొక్క
చేతిన నడిచిన రీతి నున్న
గలుగు సంతోష మింతని చెప్పగలమె!
***
ఆరుగాలము కష్టించి ఆలుమగలు
బిడ్డపాపలు తమ దృష్టి పడ్డ మెదుకె
యారగింతురుగా కంతె, పారతంత్ర్య
బుద్ధి యవ్వారి పొంతకు పోవదన్న!
***
అతని కష్టార్జితమున కాసపడెడి
'పర భృతంబుల' లెక్కకు తరుగులేదు,
వాని 'సిద్ధాన్నము'ను నోటవైచుకొనుచు
నెగిరిపోజూచు డేగ ల వెన్నో కలవు!
***
నారుపోసినవాడెపొ నీరు వోయు
నను వేదాంత సూక్తి నీ కమృతగుళిక;
నమలి భక్షించుకన్నను నాణె మరయు
మ్రింగుటే యన్న సూక్తి యెరుంగవన్న.
***
లోకమును ధాత సృజియించుగాక, దాని
తిండి దండిగ సృష్టించు తెరవు నీదె,
ఉద్ధియగుదువు ధాతకు నోయి నీవు
చూడ నెచ్చటిదో యీ చుట్టరికము.
***
'ఆత్మవ త్సర్వ భూతాని'యనెడి మాట
అక్షరాలను బాటింప నర్హు డెవడో!
ఎవరి కయ్యది సరిపడు నవని నీకు
దప్ప తక్కినవారిలో నెప్పుడైన?
-శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి
(ఆంధ్రపత్రిక- శ్రీ చిత్రభాను సంవత్సరాది)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
28 -06 -2020












Friday, June 26, 2020

నేను రాసిన చెడ్డ కథ- తెలుగు వెలుగు మాసపత్రిక ప్రచురణ




కథలు రాసే కొత్తల్లో నేను రాసిన ఒక కథను గురించి టూకీగా గుర్తుచేస్తాను. కథలోని ముఖ్యపాత్ర ఒక యువకుడు. అతగాడికి ఎలా తగులుకుంటుందో విచిత్రమైన ఒక సెంటిమెంటు తగులుకుంటుంది. తన దగ్గర ఉన్న పసుపు పచ్చని నిలువు గీతల  చొక్కా తనకు అదృష్టం తెచ్చిపెడుతుందన్నది ప్రగాఢంగా విశ్వాసిస్తుంటాడు. అది మూఢనమ్మకం కదా అని  ఎవరైనా అడిగితే కాదని చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలు ఏకరువు పెట్టడం అతగాడి అలవాటు. ఆ పసుపు పచ్చని చొక్కా వంటి మీదున్నప్పుడే ఒకసారి రోడ్డు మీద పది వందనోట్లు నిండిన మనీపర్సు దొరుకుతుందతనికి. మరో సందర్బంలో అనుకోకుండా పార్కులో మార్నింగ్ వాకింగుకని వెళ్లిన సమయంలో ఒక అందమైన అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయే తరువాత అతని జీవితంలోకి ఆర్థాంగిగా ప్రవేశిస్తుంది కూడా. ఆమె పేరును హరిద్రగా మార్చుకుంటాడు. ఆ హరిద్రకు కూడా పెళ్ళిచూపుల్లో ఈ కుర్రాడు  ఈ పసుపు రంగు నిలువు గీతల చొక్కాలో కనిపించడం వల్లే బాగా నచ్చుతాడు. అటువంటి అనూహ్యమైన.. అహేతుకమైన అనేక సంఘటనలన్నీ కథ చదివే పాఠకులకు మల్లే యాదృఛ్చికంగా జరిగిన  సంఘటనలని అనుకోడు ఆ కుర్రాడు. తనకు అదృష్టం తెచ్చిపెట్టేందుకే అలా కలసివచ్చిన సంఘటనలుగా విశ్వస్తిస్తాడు. అదే సెంటిమెంటుతో ఉన్న ఆ అబ్బాయి ఒకసారి తన ఉద్యోగానికి సంబంధించిన  ప్రమోషన్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సివస్తుంది.  బస్ స్టేషన్ కని బయలుదేరిన అతనికి దారి మధ్యలో తనకు అదృష్టం తెచ్చిపెట్టే ఆ పసుపు పచ్చని చొక్కా ఇంటి దగ్గరే మర్చిపోయినట్లు హఠాత్తుగా గుర్తుకొస్తుంది. ఆ చొక్కా కోసం తిరిగి ఇంటికి వెళ్లడం వల్ల బస్ తప్పిపోవడం, మరో బస్ దొరకక ఇంటర్వ్యూకి హాజరవలేకపోవడం బాగా రాసానని అప్పట్లో చాలామంది మెచ్చుకున్నట్లుగా కూడా గుర్తు. అదలా ఉంచితే..  ఆ అవకాశం మిస్సయిన విషయమై అతను రాత్రంతా తలుచుకొని బాధపడుతుండగా.. మర్నాడు ఉదయమే వార్తాపత్రికలో వచ్చిన మరో వార్త అతని సెంటిమెంటుని మరోసారి మరింత బలపరిచే విధంగా  చేస్తుంది. అతను వెళ్లవలసిన బస్సు దారిలో ఒక పెద్ద ప్రమాదానికి గురై అందులోని ప్రయాణికులంతా అక్కడికి అక్కడే చనిపోతారు. ఆ విధంగా పసుపు పచ్చ నిలువు గీరల చొక్కా మరోసారి  ముఖ్యపాత్ర ప్రాణాన్ని రక్షించినట్లుగా చెప్పి ముగించడం వల్ల జీవితంలో అహేతుకమైన సెంటిమెంటుకున్న ప్రాధాన్యత ఎంత గొప్పదో చెప్పకనే చెప్పినట్లయిందన్న ఇంగితం అప్పట్లో నాకు లేకపోయింది.  ఇప్పుడైతే ఇలాంటి చెత్త కథను, చెడ్డ కథను  చస్తే రాయను. ఈ కథ ఎంత చెడ్డదో.. ఎందుకు చెడ్డదో ఇప్పుడు నాకు స్పష్టంగా అవగాహన ఉంది. నా అవగాహన మేరకు కవివరించే ప్రయత్నమే ఈ చిన్న వ్యాసం.
జీవితంలో చాల సంఘటనలు జరుగుతుంటాయి. కాకతాళీయంగా జరిగే సంఘటనల చుట్టూ ప్రధాన పాత్రలను తిప్పడం.. కథను కొనసాగించి ముగించడం చాలా బ్యాడ్ టెక్నిక్. 'గోడకు తుపాకీ వేలాడుతూ కనిపిస్తే  కథ పూర్తయే లోపు అది పేలి తీరాల్సిందే' అంటాడు చెహోవ్. పరిసరాల ప్రభావం కథ మీద ఎంత ప్రగాఢంగా ఉంటుందో తెలియచెప్పే ఈ సూత్రం  మంచి కథకుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాడు. ఒక మామూలు సాధారణ సంఘటన పట్లే కథలో ఇంత అప్రమత్తత అవసరమైనప్పుడు.. ఇక నిజజీవితంలో  నిత్యం జరిగే సంఘటనలు కథలో పొదిగే సందర్భంలో రచయిత ఇంకెంత మెలుకువగా ఉండాలి? ఆ జాగ్రత్త తీసుకోకుండా రాసిన కథ కాబట్టే ‘పసుపు పచ్చ చొక్కా’ కథను పరమ చెత్త కథగా ఒప్పుకుంటున్నది.
'సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం సామాజికపరంగా ఉంటుంది' అన్న బాధ్యత రచయిత తీసుకున్నప్పుడు కథకు ఎంచుకొనే అంశాలు, వాటిని వివరించేందుకు ఉపయోగించుకొనే సంఘటనలు అనుకూల దృక్పథం కలిగివుంతాయి. ప్రతికూల దృక్పథం కలిగివున్నా వాటి వెనకున్న కార్యకారణాలను రచయిత అనుకూల దృక్పథంతో వివరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ రెండూ లోపించినందు వల్లే నా ‘పసుపు పచ్చ చొక్కా’ కథ చెడ్డ కథల జాబితాలో చేర్చున్నది నేను.
 రాజస్థాన్ లో ఆ మధ్య చనిపోయిన భర్తతో సహా ఒక మహిళ ఊరంతా చూస్తుండగానే చితి ఎక్కి బూడిదయింది. ఊళ్లో వాళ్లంతా ఆనక ఆమెకు గుడి కట్టించి మరీ దేవతగా కొలిచిన వార్త  ఒకటి  ఒక వారం పాటు దేశమంతటా అన్నిమాధ్యమాల్లో  చక్కర్లు కొట్టింది. మామూలు జనాలను బ్రహ్మాండంగా ఆకర్షించింది సహజంగానే!
సమాజాన్ని విశేషంగా ఆకట్టుకనే అసహజ సంఘటనలు అప్పుడప్పుడు ఇలా  జరుగుతూనే ఉంటాయి. వాటిని మీడియా తమ స్వప్రయోజనాల కోసమో, వ్యాపార లాభాల కోసమో సంచలనం చేయడం ఈ పోటీ  ప్రపంచంలో పరిపాటే. మీడియాలాగా రూపాయి లౌల్యాన్ని పెంచి పోషించడం సాహిత్యం అంతిమ లక్ష్యం కాదు.  ప్రగతిని వెనక్కు నడిపించే మూఢ విశ్వాసాల పట్ల, దిగజారుతున్న   మానవీయ విలువల పట్ల, క్షీణిస్తున్న కుటుంబ సంబధాల పట్ల, ఆర్థిక.. లైంగికపరమైన దోపిడీల పట్ల, అసమానతల పట్ల, ప్రకృతి పైన పెరిగే ఉదాసీనతల పట్ల. సాటి జీవజాతుల మీద ప్రదర్శించే క్రౌర్యం పట్ల సమాజాన్ని ఎల్లవేళలా అప్రమత్తం చెయ్యడమే సాహిత్యం ప్రథమ, ప్రధాన  కర్తవ్యంగా ఉండి తీ

రాలి. ఇందులో మరో మాటకు తావు లేదు. తాత్కాలికమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే, భావోద్వేగాలతో బానిసనలుగా చేసుకునే అశ్లీల, అసభ్య, అహేతుక సాహిత్యాన్ని సృష్టించడం తేలికే.  నానాటికి మానవ సంబంధాల దిగజారుతున్న సమాజంలో ఈ తరహా ప్రతికూల సాహిత్య సృష్టి షార్ట్ కట్లో  రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది కూడా!
ఒక వంక విశ్వవ్యాప్తంగా అన్ని రంగాలలో  వైజ్ఞానికి స్పృహ పెరుగుతూ మానవ వికాసం మనోవేగంతో పురులు విప్పుతుంటే.. మరో వంక మనిషిని పూర్వపు చీకటి సంస్కృతుల్లోకి నడిపించే కళలను, సాహిత్యాన్ని సృష్టించడం, ఆకర్షించడం మనిషి పట్ల కళాకారులు, సాహిత్యజీవులు చేసే ద్రోహమే అవుతుంది.
అందుకే మూఢవిశ్వాసాలను పెంపొందించే విధంగా, అస్వాభావికమైన అరుదైన యాదృఛ్చిక సంఘటనలను ప్రధాన వస్తువుగా ఎన్నుకొని, దాని చుట్టుతానే కథనూ, కథలోని ముఖ్యపాత్రలనూ తిప్పే రచయితలను 'ఏం చేసినా పాపం లేదు' అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు.
కథ సహజంగా ఉండాలి.. అంటే కథలో రచయిత ఎన్నుకున్న ప్రధాన వస్తువు నిత్యం వర్తమాన జీవితంలో జరిగేదిగా ఉండాలి. కథ చదివిన పాఠకుడి మనసు రసవంతంగా సంతృప్తి చెందడం రచయిత శైలికి, శిల్పానికి సంబంధించిన అంశం. ఆ నైపుణ్యం లోపించిన కథ ఎలాగూ కాలానికి ఎదురీది నిలచేది కాదు.  అసలది కథగానే పరిగణింపులోకి రాబోదు. కథన నైపుణ్యాలూ కొదవ లేకుండా శైలీ విన్యాసాలను ప్రదర్శించే చెయి తిరిగిన రచయితలయినా సమాజాన్ని, మనిషిని, మనసుని వెనక్కి నడిపించే, చీకట్లోకి నెట్టే, విలువలు దిగజార్చే కథలను వండి వార్చినా అవి చెడ్డ కథలే అవుతాయి తప్ప ఎంత ఆకర్షణీయంగా సృష్టించినప్పటికీ ఎన్నటికీ మంచి కథలు  కాలేవు. నేను ముందు చెప్పిన నా ఆ పసుపు పచ్చ చొక్కా కథ అందుకే మహాచెడ్దది అని తరువాత తెలుసుకున్నాను. ఆ తరహా పొరపాతు కొత్త రచయితలు చెయ్యద్దనే ఈ చిన్ని వ్యాసం
-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగు వెలుగు మాసపత్రిక జూన్, 2020లో ప్రచురితం


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...