Thursday, February 4, 2021

ఎవరు గొప్ప నియంతో?-సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

                                                           


నరకలోకపు శిక్షలలో పూర్వపు కాఠిన్యం కరవవుతోంది. యమధర్మరాజుకు  ఓ మాసం పాటు ధర్మాధర్మవిచక్షణ అధికారాల్లో కర్కోటక శిక్షణ ఇచ్చే గట్టి నియంత

అవసరం అనిపించింది.  అందు నిమిత్తమై అన్వేషణ ఆరంభమయింది.

వడబోతలన్నీ అయి ఆఖరి అంచెగా బృందచర్చలు జరుగుతున్నాయి.  శివయ్య పర్యవేక్షకుడు.

 ‘నియంతల  జాబితాలో నేనే ఎప్పుడూ నెంబర్ వన్. దయ, జాలి వంటి మానవీయ

పదాలకు మన నిఘంటువులో చోటుండదు’ అన్నాడు గొప్పగా  జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్!

 ’లిబియాతో నాలుగు దశాబ్దాల  నియంతృత్వ అనుభవం నాది. అమానుషత్వానికి కోటు తొడిగి చేతికి లాఠీ ఇస్తే గడాఫీనే! ప్రపంచ ఉగ్ర్రవాదానికి  ఆర్థిక పోషకుణ్ని. నా గొప్పలు నా నోటితో వినడం ఎబ్బెట్టు అనుకుంటే.. లింగాయా

ప్రభుత్వాన్ని వాకబు చేసుకోండి.. మా ఘాతుకాలన్నీ బీరుపోకుండా

బైటికొచ్చేస్తాయ్’ అంటూ లేని మీసాలు దువ్వుకున్నాడు మువమ్మర్ గడాఫీ.

కొత్త శతాబ్దంలో సిరియా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి బట్టి రెండు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన వాణ్ని. జనం ఎన్నుకున్న తరువాత ఇదేమని అడిగే దమ్ము ఎవరికి ఉండద్దన్నది నా ఉద్దేశం.  మహిళలపై హింస, అత్యాచారాల మొదలుకొని,  మనుషుల మారణహోమం వరకు మనమే కొత్త శతాబ్దానికి తగ్గట్లు గొప్ప భాష్యం చెప్పిన  మొదటి సూత్రకారులం’ అన్నాడు సిరియా దురహంత బషర్ అల్-అస్సాద్.

హలో!  ఉగాండా ఉగ్రవాద సింహం ఇడి- అమిన్ ఇక్కడే ఉంది! చెండుకుతినడం

ఒక్కటే కాదు రాజకీయంగా చేసే అధికార దుర్వినియోగం సైతం నియంతకు  శోభనిచ్చే అదనపు గుణం. నేను చచ్చి జనం బతికిపోయారు. ఇంకా బతికుండి ఉంటే ఇంతకు ముందే చచ్చి ఇక్కడికొచ్చిన ఐదు లక్షల ప్రాణాలకు  మరో ఐదు లక్షల ప్రాణాలు కలిసుండేవి! రికార్డు స్థాయిలో అత్యాచారాలు చేయాలన్న  ఉబలాటం ఒక్కటే తీరింది కాదు. ప్చ్!’

బర్మా తిరుగుబాటును నిరోధించడం  బ్రహ్మతరం కూడా కాదనుకున్నారు. ఆ ఫీట్

దిగ్విజంగా నిర్వహించి మానవ హక్కులు కాలరాయడంలో  ‘టెక్ట్స్ బుక్’ కేసు

సృష్టించిన నీచుణ్ని నేను. ‘పరేడ్‘ అనే పత్రిక ఎన్నో సార్లు నాకు జనహంత’గా బిరుదిచ్చి సత్కరించింది!’  ష్వే కంటే జనరల్ గోతాలు!

తాజా శతాబ్దపు ఆదర్శ నియంతంటే మన పేరే తలుచుకుని వణికిపోవాలి ప్రపంచం. ప్రియమైన నేతా’ అన్న పిలుపుతో మాత్రమే నన్ను పిలవాలి ముందు. మచ్చలేని దానవత్వం ప్రదర్శించడంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. నా సొంత దళాలతో సహా రెండు కోట్ల మందికి ప్రాణనష్టం కలిగించిన మహాజ్యేష్ఠను నేను’ అని ఉరిమాడు ఉత్తర కొరియా నరహంత కిమ్ జోంగ్ ఇల్.

అక్కడే ఉన్న సద్దాం హుస్సేన్ పెదవి విప్పకపోవడం చూసి ‘ఇరాక్ మీద దాడి

చేసి రెండున్నర లక్షల మంది అమాయక పౌరులను అతిదారుణంగా పొట్టనబెట్టుకుంటివి కదా!  మానవ హక్కుల ఉల్లంఘన నేరం  నీ మీద కూడా  ఉన్నప్పుడు యమధర్మరాజుగారికిచ్చే నియంతృత్వపోకడల శిక్షకుల జాబితాలో  నీకూ చోటివ్వాలి కదా న్యాయంగా? నోరెత్తవేంటి సద్దాం హుస్సేన్ సాబ్?’ అంటూ రెచ్చగొట్టే ఓ చిన్న ప్రయత్నం వచ్చ్ఈ రాగానే మొదలు పెట్టాడు కలహభోజనుడు

ఎప్పట్లానే.

సద్దాం సాబ్ లో కొంతమంది హీరోనూ చూస్తున్నారు. మానవజాతి మొత్తం ఏకపక్షంగా చీదరించుకునే త్రాష్టుడికే యమధర్మరాజు శిక్షకునిగా అర్హత! చైనా మావో, రష్యా స్టాలిన్ లాంటి వాళ్లను ఈ ఇంటర్వ్యూకు  పిలవని కారణం కూడా అదే!’ అంటు గుడ్లురిమాడు కాలకంఠుడు.

నారాయణ! నారాయణ! ఆ లెక్కన అయితే కింద  మన భరతవర్షంలోనే బోలెడంత మంది కర్కోటకులున్నారు కదా మహాదేవా? వాళ్ల ఆగడాల ముందు  ఈ హిట్లర్లూ,

ఇడీఅమీన్లూ   చెడ్డీలేసుకకున్న బుడంకాయలు! ఈ సద్దాం హుస్సేన్, మావో,

స్టాలిన్ లాంటి వాళ్లలో నియంతృత్వానికి తోడు ఓ మూల  మానవత్వం, స్వాభిమానం, ప్రజాభిమానం లాంటి మంచి లక్షణాలు  తొణికిసలాడే మాటా నిజమే! ఆ తరహా మచ్చలేవీ లేని పచ్చి దురహంకారంతో ఆర్షమండలాన్ని పీల్చి పిప్పిచేసేందుకు  భరతఖండం మీదనే బోలెడంత మంది పీడకులు పోటీలు పడుతున్నారు.  తమరే స్వయంగా వెళ్లి ఒకరిని ఎన్నుకుని తెచ్చుకోరాదూ! మచ్చలేని కుత్సితుడు దొరుకుతాడూ’ అన్నాడు నారదుడు.

తాను  చెవిలో ఊదిన ఆయా ప్రదేశాల పర్యవేక్షణకని మహోత్సాహంగా బైలుదేరిన  బృందంతో ‘ఆ భూలోక నియంతలతో జర భద్రం మహాదేవా! ఎవడు మూడో కన్ను తెరిచినా ముందు మీరు మాడి మసైపోవడం ఖాయం.  కరోనా మహమ్మారొకటి మహా విలయతాండవం చేస్తుందక్కడ వాళ్లకు సాయంగా. అసలే బోళా శంకరులు తమరు. అమాయకంగా ఏ పాలకనేతనైనా నిలదీసే ప్రయత్నం చేసినా చేస్తారు. కటకటాలపాలవుతారు! ముక్కుకు గుడ్డేదీ ముక్కంటీ? మీ నంది వాహనుడికైనా అది తప్పనిసరి. ఇబ్బందంటే బొక్కలో ఇరుక్కుంటారు. ఈసారి ఏ

బ్రహ్మావిష్ణాదులొచ్చీ ప్రయోజనం ఉండదు. చెప్పానుగదా! ఆక్కడ ప్రస్తుతం

రాజ్యమేలేది.. ఈ హిట్లరూ కాదు.. ఇడీ అమీనూ కాదు! కిమ్ కు  పదింతలు మించిన మొగుళ్ళు! వాళ్ల పేర్లా? నారాయణ! నారాయణ!’ అంటూ గభాలున అంతర్థానమైపోయాడు కలహభోజనుడు.

నారదులవారికి అంత  భయం కాబోలు! ఏం రోజుల్రా బాబూ!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ.ఎస్.ఎ

04 -02 -2021

 

***

లేచింది మహిళాలోకం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడులోని ఓనాటి నా సంపాదకీయం)

 


                               


పరమేశ్వరుడు సమస్త వేదాంతరహస్యాలను పార్వతమ్మకు వివరించినట్లు  శివపురాణ కథనం. నారాయణమూర్తి భూదేవితో వైష్ణవాగమన విశేషాలు పంచుకొన్నట్లు విష్ణుపురాణం విశ్వాసం. స్త్రీ విద్యాధికారాన్ని దైవలోకమే మన్నించింది. కిందిలోకంలోనే ఎందుకో మగువకు దిగువస్థానం! ఆదిమయుగం సంగతేమోగానీ.. అంతా వేదమయంగా సాగిన రుగ్వేదకాలంలోనూ అమ్మదీ, అయ్యతో పాటు సంసార అరద చోదనంలో సమాన పాత్రే! బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు భార్య మైత్రేయికి సాంఖ్యశాస్త్రం, భాగవతంలో కపిలాచార్యుడు తల్లి దేవహూతికి బ్రహ్మతత్వం బోధపరిచారు. మతంగ మహర్షి శబరిని జ్ఞానమాతగా ఉద్ధరించిన రామాయణగాథనే నేటికీ మనం నిత్యం పారాయణం చేస్తున్నాం! వాసంతి నుంచి ఆత్రేయి వరకు ముదితలెందరో మున్యాశ్రమాలలో వేదవేదాంగాది విద్యలలో కాణాచీలుగా వెలిగొందిన కథలు చదువుతూ కూడా స్త్రీ బుద్ధిని చంచలం, ప్రళయాత్మకంగా కించపరచడం మగవాడి దాంబిక ప్రవృత్తికి నిలువెత్తు దర్పణం. ‘నృణాతి నయతి స్వవశం పురుషమితి నారీ- పురుషుణ్ని స్వాధీనపరుచుకొనే శక్తే నారి’ అని దుష్టాన్వయం చేయడం నెలత ఆభిజాత్యాన్ని అవమానించడమే! ‘నారి’ అంటే వాస్తవానికి న అరి- శత్రువులు లేనిది. ఏ భూమి మీద సావిత్రి పతిభక్తి భర్త ప్రాణాలను రక్షించిందో, ఏ భువి లోపల సీతమ్మవారి పాతివ్రత్యం అగ్నిపరీక్షలో సైతం నెగ్గుకొచ్చిందో, ఏ పృథ్వి అత్రిసతి అనసూయ సౌశీల్యం త్రిమూర్తుల లౌల్యాన్ని బాల్యచేష్టగా మార్చి లాలించిందో, ఏ వసుంధర అరుంధతి.. లోపాముద్రాది నాతి జాతి సృష్టికర్త ఉనికిని సైతం ప్రశ్నార్థకం చేసి చూపిందో.. ఆ భూఖండంలోనే ఆడదానికి అడుగడుగునా అఖండంగా అగ్నిగుండాలు! నవనాగరీకులమని నయగారాలు పోయే మగవారి లోకంలో మహిళ బతుకు ఇంకా ముల్లు పక్కన అల్లాడే అరిటాకంత సున్నితమే! దేవనాగరీకంలో 'శర్వరి' ద్విశతాధిక పర్యాయపదభూయిష్ట! ‘మానవతీ!.. మానినీ!’గా సంబోధించినంత మాత్రాన మహిళ సమానవతి.. సన్మానినిగా మన్నింపబడుతున్నట్లెనా!

ఒక బిడ్డకు తల్లయీ పుట్టినింటికి పోయిరావాలంటే పట్టెమంచం మామగారినుంచి.. వంటగది తోడుకోడలు వరకు ఇంటిసభ్యులందరి అనుమతులు తప్పనిసరి. అందుకోసమై అత్తింట కొత్తగా కాలు పెట్టిన ఇంతి కన్నీటితో దేబిరించే జానపదుల పాట సరిపోదా.. కలికి కామాక్షి ఎంత కలవారి కోడలైనా ఒలికి వళ్లోకి వచ్చి వాలేది వట్టిసున్నా మాత్రమేనని! ‘బాలప్రాయమునాడు నాతి పడుచూను/ వేల్పులెత్తగలేని విల్లు తానెత్తే/’ జనకముని పుత్రిక సీత. అది చూసి ‘ఈ సీత నెవ్వరికిత్తునని దలచీ/ ఘనులు ఎవ్వరూ రానీ కరమునా బట్టీ/ పూని వంచితే ఇత్తు పొలతి వారికినీ’ అని ఆ మారాజు నిశ్చయించుకొన్న ‘సీతమ్మ స్వయంవరం’ గీతికలో మాత్రం ఏమంత నీతిసూత్రం దాగుందని? సీత రాత బాగుండి ‘రఘువంశ తిలకుడు రామచంద్రుడు మునుకొని హరివిల్లు ముమ్మారు వంచి’ విరిచేయబట్టి సరిపోయింది! రుగ్వేదయుగంలో మాదిరి సౌందర్యం, సౌశీల్యం, బుద్ధి, బలం, యవ్వనం, సమయానుకూల వర్తన.. గమనించుకొని గదా వరుడి మెడను వధువు స్వయంనిర్ణయానుసారం వరమాలాకృతం చెయవలసిందీ? ‘పెళ్లయిన ఇంట ఆరునెల్ల కరువంట’ అని సామెత!ఆడపిల్లంటే గుండెలమీది బరువు. అటూ ఇటైతే.. కన్నకడుపు చెరువు’ వంటి భావనలు నవసమాజం నుంచి ఇంకా తొలగకపోవడం భామినుల ఆభిజాత్యానికి ఏమంత శోభస్కరం? శాస్త్రాలు సైతం సుతోదయ భాగ్యంకోసం మాత్రమే క్షీర, సోమాది రసాభిషేకాల ప్రస్తావనలు చేయడం గమనార్హం. గర్హనీయం. ‘ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలు’ అన్న ఆత్మన్యూనతా భావంలోనే అధికశాతం మగువలు ఈ నాటికీ మగ్గడం విచారకరం! మగవాడు తిరిగితే చెడనిది.. ఆడది తిరిగితే ఎలా చెడుగవుతుందో? ‘చక్రవర్తులైనట్టి చానలుండ/ దరుణు లుద్యోగములు చేయ దగరటంచు/’ బల్కనేమిటి?’ అని వెనకటికి ఓ కవిపురుషోత్తముడు కడిగిపారేశాడు. ‘విమల సచ్చరిత్ర విమలామహాదేవి- కాంతుని నేపాటి కలత పఱచె?/అపర సరస్వతి యననొప్ప దమయంతి- నాథు నేపాటి నమిలి మ్రింగె?/.. తక్కుగల రామలందరు మిక్కుటముగ- జదువ నేర్చియు బతుల కసౌఖ్యములను/ కలుగ జేసిరె?’ అన్న ఆ కవిప్రశ్నకు ఈనాటికీ సబబైన సమాధానం కరువు. ఇంట గెలిచిన ఇంతికి రచ్చ గెలవడం ఎంతని.. అవకాశమంటూ ఒకటి దక్కడమే ముఖ్యం గాని!

పురుషునిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని వెన్నుతట్టి లేపేది అమ్మగా, ఆలిగా, చెల్లిగా.. స్త్రీమూర్తే! బుద్ధిలో నాలుగింతలు, శక్తిలో అంతకు రెట్టింపు ఆధిక్యంలో ఉండీ.. వెనకుండి గెలిపించేందుకే ఆసక్తి చూపించే మగువను మగవాడు ఏనాడు అర్థంచేసుకొన్నాడు కనుక! అంగనంటే వాడికి అంగడిబొమ్మ. ముంగిల్లో తిరిగే మరబొమ్మ. తిమ్మిరి దింపుకొనే పడక గుమ్మ. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని మనువేనాడో అప్పటి అవసరాల నిమిత్తం ఎందుకు చేసాడోగాని.. ఆ పాడుబడ్డ సిద్ధాంతం చూరుకే మగవాడు ఈనాడూ గబ్బిలాయిలా వేలాడ్డం నవ్వు పుట్టిస్తుంది. ఆగ్రహమూ తెప్పిస్తుంది. ‘ఆకొన్న అతిథిని ఆ పూట నిల్పం- నతివను ముందుగా నడుగవలయు/ అతిరిక్తుడౌ రోగి ఔషధం బిప్పింప- బడతి ఆజ్ఞ బొందవలయు ముందు/ బైరాగికిని నొక్క పాత వస్త్ర మొసంగ- బొలతి శాసనంబు బొందవలయు/.. ఇంక స్వాతంత్ర్య మనునది యెందు గలదొ- యెరుగగా రాదు మీకును బురుషులార!’ అని బుడమగుంట శివరామయ్యకవిగారు వందేళ్ల కిందటి ఆంధపత్రిక (అబలావిలాపం) లో హేళనకు దిగిన నాటి పరిస్థితుల్లో ఈవేళ్టికీ వీసమెత్తు మార్పు లేదు. సరికదా మహిళామణి ఆలోచనల్లో.. ఆచరణలో.. అభివ్యక్తీకరణల్లో.. ఆభిజాత్యం పాళ్ళు పొంగుకొస్తున్నాయి కూడా. సంతోషమే కదా! వలతి మగవాడికన్నా ఎందులో వెలితి? ‘అగ్బరంతటి వైరి నాజి జయింపదే– రాణి వీరాబాయి రౌద్ర మెసగ?/ నిరుపమ శౌర్యవార్నిధి గుతుబుద్ధీను- దురమున దోలదే కరుణదేవి?/ తన బాణ నైపుణ్యమున కెర సేయదే- సంయుక్త రిపులను సమరమందు?’ ‘అట్టి యసమాన శూరత్వ మతివలకును/ గలుగ జేయరె తొల్లింటి కాలమునను?’ అని తొయ్యలులంతా ఏకమై కొంగులు బిగిస్తే అయ్యలెంత మొనగాళ్లైనా మునుపటంత మొండిగా ముందడుగు వెయ్యలేరీనాడు. జన్మతః జన్మదాతల వర్గానికి దఖలుపడ్డ హక్కులకు ఇంకే మాత్రం మోకాలడ్డడం సాధ్యం కాదన్న ఇంగితమే సౌదీ పాలకులకు కలిగుండాలి. పోయిన వారం ఆ సంప్రదాయిక దేశంలో జరిగిన పురపాలకసంఘం ఎన్నికల్లో సౌదీసోదరి తొలిసారి ఓటుహక్కు వినియోగించుకుంది. శుభం. వాహన చోదన నుంచి.. సరుకుల బేరం వరకు ఎన్నో ఆంక్షలు మహిళకు ఆ గడ్డమీద! ఎన్నికల్లో నిలబడే హక్కూ ఆమెకిప్పుడు దఖలు పడడం సామాన్యమైన గంతు కాదు. ముందు ముందు మరిన్ని మహిళాసంస్కరణలకు ఇది నాందీ ప్రస్తావన కావాలన్నదే అభిలాష. సౌదీ సోదరీమణులందరికీ శుభాభినందనలు!

***

-కర్లపాలెం హనుమంతరావు

04 -0౨2021

బోథెల్; యూఎస్ఎ

( సౌదీ మహిళకు పురపాలక సంఘ ఎన్నికలలో మొదటిసారి ఓటు వేసే హక్కు దఖలు పడిన సంబరంలో రాసినది)

 

వేదకాలం నాటి 'సాగు' సంప్రదాయం- కర్లపాలెం హనుమంతరావు

                                                                   


నిప్పు పుట్టించే విద్య మనిషికి నేర్పించిన గురువు తరువు. ఎండు కొమ్మలు ఒకదానినొకటి రాచుకుని నిప్పు పుట్టడం చూసిన మనిషి ఆ చమత్కారం తాను కందిపుల్ల మీద గుమ్ముడు పుల్ల రాసి పడేసి నిప్పుపుట్టించడంగా మల్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. రాయీ రాయీ రాసినా నిప్పుపుడుతుంది. అయినా ఈ చెట్టు కొమ్మల రాపిడి పద్ధతే   అనువుగా మనిషికి అనిపించింది. రావికర్ర మీద జమ్మికర్ర పెట్టి మథించి నిప్పు పుట్టించే శౌత్రిక కర్మ విధానం ఇప్పటికీ అమలులో ఉంది.

అడవుల్లో, కొండల మీద వాటంతట అవే మొలిచే తృణధాన్యాలను గమనించిన మనిషి వానకారు దయన, తన భుజబలంతో కూడా  ఆ పని చేయవచ్చిన గ్రహించినప్పటి నుంచే 'సేద్యం' మొదలయింది అనుకోవాలి. సేద్యం మూలరూపం ఛేద్యం(ఛేదించబడేది) కావచ్చని పండితులు వేలూరు శివరామశాస్త్రిగారు అభిప్రాయ పడుతున్నారు. రుగ్వేదంలో 'నాగలి' ప్రస్తావన, అథర్వణవేదంలో ఎరువుల  ప్రస్తావనలు కనిపిస్తున్నాయి కాబట్టి సేద్యం భారతీయుల అతిపురాతన ప్రావృత్తిగా వ్యాఖ్యానించక తప్పదు. వేదసంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారీ కృషివర్ణనలు కల్పించడం ఈ వాదనకు వత్తాసు పలుకుతుంది. భారతంలో భీష్ముణి నిర్యాణకాలం, విష్ణుపురాణం తాలూకు 'మఘాదౌచ తులాదౌచ' లూ పరిశీలించాలి ఇందు కోసం.

 

పరాశర సంహిత కర్త పరాశరుడు కృషీపరాశరుడిగా ప్రసిద్ధుడు కూడా. పాశ్చాత్య చరిత్రకారులూ ప్రస్తావించిన ఈ పరాశరుడి కాలం మన లెక్కల ప్రకారం దాదాపు 3వేల సంవత్సారల గతం. భారతదేశంలో వ్యవసాయం ఎంత ప్రాచీనమైనదో వివరించేందుకే ఈ వివరాలన్నీ.

సేద్యం శ్రేష్ఠతను గురించి బహుధా ప్రశంసిస్తుందీ పరాశర సంహిత. ఎడ్లు వాటి లక్షణాలు, గోష్ఠం గోచరాలు, గోమయాన్ని ఎరువుగా మార్చే విధానాలు, నాగలి.. ఏరుకట్ట సామాను, దుక్కి దున్నే పద్ధతులు, విత్తులు కట్టి కాపాడి చల్లుకునే సూచనలు, పైరు కోసి ధాన్యం నూర్చి తూర్పార పట్టి క్రైలు చేయడాలు, పాతర్లు, గాదెలు,  నిలవున్న ధాన్యం పురుగుపట్టకుండా తగు జాగ్రత్తలు, పైరుకు నీరుపట్టే పద్ధతులు, భాద్రపదమాసంలో పంటకు తెవులు తగలకుండా నీరు పోయడాలు, తెవుళ్ల నివారణ, మళ్లల్లో నీరు నిలిపి వుంచే ఉపాయాలు.. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ పరాశర సంహితలో కనిపించడం విశేషం.

శునం వహా శునం నరః శునం కృషతు లాంగలం/

శునం వరత్రా బధ్యంతాం శున మష్ట్ర మ్ముదిజ్ఞ్గయ (4 -57- 4)

(ఎడ్లు సుఖంగా లాగు గాక, మనుషులు సుఖంగా పనిచేయుదురు గాక, నాగలి సుఖంగా దున్ను గాక, ములుకోలు సుఖంగా తోలు గాక అని ఈ శ్లోకానికి అర్థం). 

ఇదే నాగలిని ఒక యంత్రంగా సంబోధిస్తూ, ఐదు మూరల ఏడి, ఐదు జానల నాగలి, దున్నే ఎడ్ల చెవుల చివరకు వుండే కాడి,  ఒకటిన్నర మూర నిర్యోలం, పన్నెండంగుళాల పాశికా అడ్డ చీలలు, మూరెడు శౌలం, తొమ్మిది నుంచి పన్నెండున్నర అంగుళాల  పిడికొలతలుండే ములుకోలు-గా నాగలి ఆరు భాగాలను కొలతలతో *'ఈషాయుగోహల’ లో వివరించింది ఈ పరాశరసంహిత. (ఈషాయుగోహల స్థాణుర్నిర్యోల సస్య పాశికా/

అడ్డ చల్లశ్చ శౌలశ్చ పచ్చనీచహలాష్టకమ్/

పంచహస్తా భవేదీషాస్థాణుః పంచవిత స్తికః/

సార్దహస్తస్తు నిర్యోలోయుగః కర్ణ సమానకః/

నిర్యోలపాశికాచై వ అడ్డచల్లస్త థైవచ/

ద్వాదశాంగులమానోహి శౌలోఽరత్ని ప్రమాణకః/

సార్ద ద్వాదశ ముష్టిర్వా కార్యావానవముష్టికా/

దృఢా పచ్చనికాజ్ఞేయేలోహాగ్రా వంశసంభవా') అని శ్లోకం.

వేదకాలంనాటి  వ్యవసాయ పనిముట్లు, వాటి తీరుకూ ఇప్పటి పరికరాలు వాటి పనితీరుకూ ఆట్టే భేదం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాని ఆ కాలంలో మాదిరిగా నేడు పంటల అభివృద్ధి సమృద్ధితనంలో తప్ప ఆహారపుష్టిలో కనిపించడంలేదు! దేశీయావసరాలకే సరిపడినంతగా పండని నేపథ్యంలో ఇహ విదేశే ఎగుమతులను గురించి ఆలోచించడం పేలాలపిండి కథ సామెత అవుతుందేమో!

భారతదేశంలో సాగుకు రాని భూవిస్తీర్ణం చాల ఉన్నట్లు అథర్వణ వేదం చెబుతోంది.  ఆ  పరిస్థితే నేటికీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నదాత ఆర్థిక స్తోమతు  పరిగణలోకి తీసుకున్నా నిరాశాజనకమైనా దృశ్యమే కంటి ముందు కనిపించేది. అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి అగ్రరాజ్యాలలో వంద ఎకరాల సాగుభూమి ఏకఖండంగా గల ఆసామీ కూడా పేదరైతుగానే పరిగణింపబడుతుంటే.. ఇక్కడ సెంటు భూమి  సొంత పేరు మీద లేకుండానే కొన్ని తరాల బట్టి కౌలుదారీ సాగు చేసుకునే దైన్యస్థితి అన్నదాతది.

పురాణాల కాలంలో 'ఖిలం'  అనే పదం తరచూ వినబడేది. ఏడాది మార్చి ఏడాది పంట వేసేందుకు వీలుగా రెండు మూడు పంటభూములున్న ఆసాములు ఒక భూమిని ఒక సంవత్సరానికి  సాగుచేయకుండా వదిలేసేవాళ్ళు. భారతదేశంలో ఔత్తరేయులు 'ఖిల్'గా పిల్చుకునే ఈ పైరు మార్పు విధానం ఇప్పుడు కనిపించడంలేదు.

'తథా వర్షేషు వర్షేషు కర్షణద్భూ గుణక్షయంః/

ఏకస్యాం గుణహీనాయాం కృషి మన్యత్ర కారయేత్' అంటూ

'యుక్తి తల్పతరు' తప్పని సరి అని చెప్పిన  పైరు మార్పు విధానం వ్యవసాయరంగం సైతం వ్యాపారమయంగా మారిన  తరుణంలో వృథా ప్రయాసగా తోచడంలో ఆశ్చర్యం లేదు.

పైరుమార్పు కోసమే కాకుండా పశువుల తిండి కోసం కూడా గాను సాగుచేయకుండా గతంలో కొన్ని భూములను అట్లాగే వదిలేసే పద్ధతి ఉండేది.

వైదిక కాలాలలో కేవలం పశువుల మేత కోసం గానూ కొన్ని బీళ్లను దున్నకుండా అలా వదిలేసే రివాజు ఉండేది. వ్రజం, గోష్ఠం, సుయవసంగా పిలిచే ఈ గోచరాల పద్ధతి ఇప్పుడు అమలులో లేదు.  పురాణాల కన్నా ముందున్న వేదసంహితలలో పలురకాల ధాన్యాల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. వాజసవేయ సంహితలోని చమకంలో ఇప్పటి మన వడ్లు, మినుములు, యవలు, నువ్వులు, సెనగలు, స్వాల్వము, పశుగ్రాసం, ప్రియంగువులు (ప్రేంఖణం), నవము, చామలు, నెవ్వగులు, గోధుమలు, మసూరాలు పేర్లు వినిపిస్తాయి. అధర్వణ వేదంలో మినుములు ప్రస్తావన ఉంది. రుగ్వేదంలో యవలు, వరులు కనిపిస్తాయి!

ఇప్పుడంటే వేరుశనగ వేస్తున్నారు, కానీ ఇటీవలి కాలం వరకు  మెరకభూముల్లో పునాస పైరులు కోసిన తరువాత  మళ్ళీ దున్ని ఉలవ వేసే ఆచారం ఉండేది. పంటలకు ఎల్లకాలం ఉండే వెల ఆధారంగా ఈ రకమైన రెండు పంటల విధానం తైత్తరీయంలో . (దీర్ఘ సంవత్సరస్య సస్యం వచ్యతే(5 -1 -7 -3) కనిపిస్తుంది.

భారతదేశంలో స్థల, కాల భేదాలను అనుసరించి పంటలు వేసే ఆచారం ప్రచులితం. హేమంతంలో యవలు గొర్తుబట్టడం, మఖ పుబ్బ కార్తెలలో మొక్కజొన్న, వానకారుకాలంలో కోసుకునేందుకు  వీలుగా ఓషదులు,  వరులు శరత్కాలంలో కోతకు వచ్చేందుకు వీలుగా  గ్రీష్మ, వర్షర్తువుల ప్రారంభ కాలంలో పైర్లు పెట్టడం సస్యసాంప్రదాయాల కింద ఆ విధంగా వస్తోవుంది. మౌర్యుల కాలంలో సస్యపరివర్తనం అమలులో ఉన్నట్లు అర్థశాస్త్రం - రెండో భాగం(మైసూరు ప్రతి)లో ఆధారాలున్నాయ్!

కేంద్రాలు, ప్రేంఖణాలు, నువులు గ్రీష్మాంతంలో, సెనగలు, మినుములు, పెసలు వానకారు నడిచే సమయంలో, యవ, గోధుమ, కుసుంబ, కుడువ,మసూరు, కలాయ, సర్షపాదులు శరదృతువుల్లో పైరుపెట్టే  నేటి ఆచారాలు వేదకాలం నుంచి సాంప్రదాయికంగా వస్తున్నవే.

ఆరు రుతువుల విధానం కూడా క్రీస్తుకు పూర్వం రెండువేల ఐదు వందల ఏళ్ల కిందటనే ఆరంభమయినట్లు అనిపిస్తుంది. చాంద్ర సంవత్సరం అయినా ఆంధ్రదేశంలో నేటి రుతువులను పట్టి ఆర్యావర్తము లాంటి ఉత్తరదేశ రుతువులను లెక్కబెట్టకూడదు. దేశ భేదాలను బట్టి మార్పులుంటాయి . కాబట్టి మాన భేదాలను గూడా ఆ పద్ధతి ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలి.


భారీ యెత్తున ట్రాక్టర్లతో దున్నుతున్న నేటి యంత్రాల వాతావరణంలోనూ  అంతర్గతంగా అణిగివున్నది వేదకాలం నాటి కృషీవలుడు నాగలి ధరించి  కార్యక్షేత్రంలోకి అడుగువేసే ముందు వినమ్రంగా చేసిన ప్రార్థన సారాంశమే!  ఆ ప్రార్థన 

'అర్వాచీ సుభగే భవ/

సీతే! వందామ హోత్వా/

యథా న స్సుభగా మసి/

యథా న స్సుఫలా మసి॥'-

ఓ సీతా!(నాగేటి చాలు) మాకు అభిముఖివి కమ్ము. నీకు నమస్కరిస్తున్నాం. మాకు నిండుగా పండుము! ' అనే అర్థంలో సాగుతుంది.


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

05 -02 -2012 ***

(శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు వ్యాసావనిలో ప్రాచీన సేద్య విధానాలను గురించి విస్తారంగా చెప్పుకొచ్చిన ఓ వ్యాసంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాల ఆధారంగా)

Wednesday, February 3, 2021

హేట్సాఫ్ టు.. రంధి సోమరాజూ! -కర్లపాలెం హనుమంతరావు- కవిత

 




 







అయోమయం

అవతారం

ఎత్తింది ఎప్పుడనా

సందేహం?

 

అయితే మన రంధి

సోమరాజు ఏమందీ

 ఈ కింద  ఓసారి

చిత్తగించండి మరీ!-

 

 వీపులేని రోడ్డుమీద

ముక్కులేని కుళ్ళు కాల్వ

ఊపిరి తీసుకుంటున్నప్పుడు..

 గుడ్డలేని బజారు

గొడ్డు వోయిన మబ్బుతో

సరసాలకు దిగిపోయినప్పుడు..

 

నీటి తెగులుతో ఎండిన పాలు

మీటరు మొగుణ్ణి

కాస్త దూరంగా తొలగమని

దండం పెడుతున్నప్పుడు..

 

పచ్చగడ్డి

ఆవును మేసి

మాంసం దుకాణం

పెట్టేసినప్పుడు..

 

నామాల షావుకారి

చేతిలోని తక్కెడ

సూర్యుడి రాయికి సరిసమానంగా

చంద్రుణ్ణీ తూచిచ్చేసినప్పుడు..

 

నీడ నిచ్చే చెట్టుకు

నీడ కావాలని

పెద్దలు లెక్చర్లు

దంచుతున్నప్పుడు..

 

ముక్కు మూసుకుని

నోటితో చెడుగాలిని పీల్చడం

చాలమంది వంటికి సులువుగా

వంటబట్టిన అలావాటుగ మారినప్పుడు..

 

 

పకోడీ ఉద్యోగానికి

ఉల్లిపాయ కూడా

దరఖాస్తు పెట్టుకునే

దుష్టకాలం దాపురించినప్పుడు..

 

వల్లకాటిలో

నిద్ర చాలడం లేదని

శవాలు

ఏడుపు మొగాలు పెడుతున్నప్పుడు..

 

థీరీ ఆఫ్ రెలిటివిటీ

 మంది తెలివిని

వెన్నముద్దల్లా

ఆరగించేసున్న సంధికాలమప్పుడు..

 

అడుక్కునే

అజ్ఞానాన్ని చూసి

విజ్ఞానం ఉడుక్కుంటూ

బొడ్డుని మురు కుంటోన్నప్పుడు..

 

చావుకసలు చావేలేని

రోజొకటి వచ్చేస్తుందేమోనని

ఓ పిచ్చి సన్నాసికి

చచ్చేచావు ఇప్పుడే

వచ్చేసినప్పుడు..

 

దోమకవిగారు

తమ-'గీ'గీతాన్ని

ప్రచురించే పత్రిక బ్రతకాలని

రక్తాన్ని పోగుచేస్తున్నప్పుడు..

 

ఇంత వేగంగా తిరుగుతున్నా

గగ్గోలు పెట్టడం రాని భూమి

విమానం మోతను చూసి

విస్తుపోతున్నప్పుడు..

 

తన కీ తనే ఇచ్చుకుంటే తప్ప

బతికే దారింకేదీ లేదని  

గడియారం బెంగటిల్లి

తపస్సుక్కూర్చున్నపుడు..

 

వెలుతురుతో సహా

వస్తువునీ స్వాహా

చేసెయ్యాలని నీడ

ఆబగా మాటేసినప్పుడు..

 

కళ్ళున్నవాళ్లకూ కళ్ళులేనివాళ్లకూ

ఒకేలా తను కనిపిస్తున్నందుకు

చీకటి కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నప్పుడు..

 

దేవుడికే దేవుడెవడో

తేలలేదని

కబురందిన వేదాంతులు

గుడ్లు తేలవేస్తున్నప్పుడు..

అయోమయం

అవతారం ఎత్తిందని

సోమరాజు రంధి   థీరీ!

నులక మంచం దుమ్ము నుండయినా

శనగపిండి కారబ్బూందీ నలా

వండి వార్చే నలమహారాజు

మన రంధి సోమరాజులు!

.

 

పదికాలాల పాటు

పంటికింద నలిగే

హాటూ స్వీటూ

అందించినందుకు

చేద్దామా 

రంధి సోమ రాజుకు

 'హేట్సాఫ్' అంటూ బిగ్ ఓ సెల్యూటు!

-కర్లపాలెం హనుమంతరావు

జనవరి 19, 2013

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...