Friday, October 7, 2016

బుద్ధికి బుద్ధుండాలంటే..!

బుద్ధి కూడా శరీరంలో ఒక అవయవమే! చేతనాత్మకమైన మెదడుని బుద్ది అనుకోవచ్చు. వయసు.. ఆరోగ్యం.. పరిసరాలు.. సందర్భాలమీద ఈ బుద్ధిలోని చేతనాత్మకతలో హెచ్చు తగ్గులు సహజం.
కంప్యూటరుతో బుద్ధిని పోల్చలేం. బుద్ధి కంప్యూటరుకన్నా రెండాకులు ఎక్కువ తిన్న గడుసుపిండం. సూక్ష్మంలో మోక్షం అన్న సామెత మనకోటి ఉంది కదా! బుద్ధికి అతికినట్లు సరిపోతుందా సామెత. 
కంప్యూటరుకి మనం పనిగట్టుకొని ఆదేశా లివ్వాలి. రాంబంటులా  అది పని చేసుకుపోతుంది. బుద్ధి అంతకన్నా బుద్ధిమంతురాలది.  మనంగా  ఏ సమాచరమూ గట్రా ఇవ్వక పోయినా .. సొంత తెలివితేటలతో తనకై తాను  గ్రహించి..  భద్ర పరుచుకొని.. విశ్లేషించుకొని.. ఆనక  సమయ సందర్భాలనుబట్టి మన సాయానికొస్తుంది.. అచ్చంగా కట్టుకున్న ఇల్లాలిలాగా. 
మన శరీరం  ఎదగాలంటే ఆహారం, గాలి, నీరు, కాలం .. కావాలి! మేత ఆగితే కూత మందగిస్తుంది. కానీ మనం కాణీ ఖర్చుచెయ్యకుండానే  కొంతకాలం బుద్ధి తన మంచి చెడ్డలు చూసుకోగలదు. మరీ నిర్లక్ష్యం చేస్తే కనక.. పెళ్లాం అలిగి పుట్టింటికి పోయినట్లు.. సహకరించడం మానేస్తుంది. 
'మేథస్సు జీవితాంతం ఎదుగుతూనే ఉంటుంది'- అన్న  మిల్టన్ మహాకవి ఎందుకన్నారో కానీ ఆ  సూక్తి కొంత మేరకే నిజం. అలా  ఎదగాలంటే ఎదురుగాలి లేకుండా చూసుకోడం సదర మనిషి బాధ్యత.
మెదడుకూ ముదిమి తప్పదు. కానీ శ్రద్ధాసక్తుల కనపరుస్తే  దాని జవసత్వాలు  మనం   అధీనంలోనే పనిచేస్తాయి చివరి వరకూ దాదాపు.
మెదడుకు సంబంధించిన పదం మేథస్సు. మేథస్సు పరిరక్షణకోసం మెదడుకి మూడు రకాల ధర్మాలు నిర్దేశించబడ్డాయి. ధీ.. ధృతి.. స్మృతి.
'ధీ'-  విషయాలను గ్రహించుకొనే లక్షణం. ధృతి- విశ్లేషించుకొనే లక్షణం
స్మృతి- గుర్తుకు తెచ్చే లక్షణం.
ఈ మూడూ ఒకదానికొకటి అనుసందానంగా ఉండి పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండటమే 'మేథస్సు'. 
మేథస్సంటే ఒక విధంగా  బుద్ధిబలం. వెన్నుపూసల నెత్తిమీద ముద్దలా ఉంటుందది.  చిక్కుముడుల రూపంలో కనిపించే నరాల సముదాయానికి సైంటిష్టులు  'బైన్' పేరు పెట్టుకున్నారు. వెన్నుపూసల నరాలనుంచి అందే   సంకేతాల ప్రకారం  ప్రవర్తించడం మెదడు ధర్మం.  జంతు దశలో జరిగే జీవక్రియ ఇది. జీవపరిణామంలో మనిషి మరింత వికాసం సాధించిన తరువాత కేవలం ఈ సంకేతాలకే పరిమితం కావడం కుదరలేదు. ఆలోచన.. స్వీయ రక్షణ.. జ్ఞాపక శక్తి మరింత అవసరమయ్యాయి.  మనిషి 'బుద్ధి' మరింత బలంగా .. ధృఢంగా.. తయారు కావాల్సిన  అవసరాలు పెరుగుతో వస్తున్నాయి. కాన్సెఫలాన్(consephelon) అనే మరింత శక్తివంతమైన నరాల వ్యవస్థ అందుకే ఏర్పాటయింది.
మెదడులో లేత పదార్థం (grey matter), తెల్ల పదార్థం ( White matter), రక్త నాళాలు.. కాసిన్ని మాంస ధాతువులు కలగలసి ఉంటాయి.
మెడుల్లా అబ్లాంగేటా(medulla Oblongata), వెనక తల (Hind Brain). మధ్య తల(Mid Brain), సెరిబ్రమ్ (Cerebrum) అని నాలుగు భాగాల కూడలి అని కూడా అనుకోవచ్చు మెదడుని.
'అన్నీ వేదాల్లో ఉన్నాయిష' అని విశ్వసించేవాళ్లకు   సంతోషం కలిగించే ఒక పోలిక ఇక్కడ దొరుకుతుంది. విశ్వసృష్టికర్తగా ఖ్యాతి గడించిన విధాతక్కూడా నాలుగు ముఖాలుంటాయంటారు కదా! బ్రహ్మగారికి  శక్తి వీణాధరి వాణి. ఆమె ధరించిన  వీణ తాలుకు  తంత్రులను పోలినవే మెదడు నరాలు. కేవలం జంతుమాత్రులకు సాధ్యం కాని 'ఊహ.. ఆలోచనలు' మనిషి చేయగలుగుతున్నాడంటే  ప్రేరణ  ఈ నరాల ప్రకంపనలే.
మెదడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మేథస్సుకు తిరుగు లేదు. ఆయాచితంగా దక్కిన  మేథస్సును అపురూపంగా, పదిలంగా, ఆరోగ్యంగా చూసుకొనే సూచనలు  వివిధ ఆరోగ్య శాస్త్రాలలో పదిలంగా  ఉన్నాయి.
భారతీయుల వైద్యశాస్త్రంగా పేరొందిన  ఆయుర్వేదం మెదడును గురించి చెప్పే జాగ్రత్తల ప్రస్తావనలతో ముగిద్దాం ఈ చిన్న వ్యాసాన్ని.  నిత్య జీవితంలో తేలిగ్గా ఆచరించగల వాటిన ఏరుకొని ఇక్కడ ఇస్తున్నది.
ఆహారం, నిద్ర, జీవనశైలి మీద క్రమం తప్పని శ్రద్ద మేథస్సుని జీవిత కాలమంతా ఆరోగ్యంగా ఉంచుతున్నదన్నది ఓ నమ్మిక.
1.    తినే ఆహారానికి చేతనత్వం, ప్రాణత్వం ఉండాలని గీతలో భగవంతుడుకూడా ఉవాచిస్తున్నాడు. సాత్వికాహారంలో ఇవి సమృధ్ధిగా లభిస్తాయి కూడా. వండకుండా  ఫ్రిడ్జుల్లో  భద్రపరిచిన ఆహారం, రసాయనాలు సాయంతో పండించిన పదార్థం జీవశక్తిని బలహీన పరుస్తాయి.
2.   నెయ్యి, పాలు, తేనె.. కేవలం మధుర పదార్థాలే కాదు.. జీవరసాయనాలు కూడా.
      నెయ్యి, వాము కలిపి  తల్లి తినిపించే గోరుముద్ధలు పసిపిల్లలకు మేథోరసాయనాలే.
     ఉన్నత పాఠశాల, కళాశాలలకు వెళ్లే వయసు పిల్లలకు ఆహారంలోని మొదటి ముద్ద
     పేరిన నెయ్యి, ఉసిరికాయతో కలిపినదయితే వారి తెలివి తేటలు వృద్ధి చెందుతాయి
    ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే పిల్లలలకు నెయ్యి, మినుము, బెల్లం కలిపిన ఉండలు మనసు
    శరీరాన్ని దార్ఢ్యంగా మారుస్తాయి. ఆడపిల్లల్లో అయితే హార్మీనుల సమతౌల్యాన్ని
    సాధిస్తాయి.
3.   తేలిగ్గా జీర్ణమై రసంగా మారి శరీరానికి, జీవకణాలకి శక్తిని అందించే ఆహారం ప్రాణాహారమని భావన. రాత్రి పడుకునే ముందు వేడిపాలల్లో .. పటిక బెల్లం కలిపి తీసుకుంటే ప్రాణాహార అవసరం చాలావరకు తీరినట్లే.  బాధం, జీడి పలుకులు రెండో మూడో పాలతో కలిపి తీసుకుంటే.. పెద్దవయసువారికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి నిద్రా వస్తుంది. మంచి నిద్ర బుద్ధి వికాసానికి దోహదం.
4.   మెదడులోని జీవకణాలు ఎప్పుడూ చాలా వత్తిడిమీదుంటాయి. వాటికి ఎక్కువ ప్రాణాహారం అవసరం. ప్రాణాయామం ఆ అవసరాన్ని తీర్చే సాధనం.
5.   మన శరీరానికి అందించే ఆహారంలో ముప్పై శాతం ఒక్క ఒక్క తలే తినేస్తుంది. నిద్రలో అయినా  మెదడుకి బద్ధకం పనికి రాదు. జాగృత, స్వప్న, సుషుప్త అనే మూడు దశల్లో సైతం  విధి నిర్వహణ తప్పనప్పుడు అందుకు తగ్గట్లు ప్రాణాహారం అవసరమే కదా! లేదంటే కోమాలోకి జారిపోయే ప్రమాదం పొంచుంటుంది. మరణకారణాలలో కోమా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మెదడుకు అవసరమైన ప్రాణాహారం  సరస్వతీ లేహ్యం, బ్రహ్మీ రసాయనం, అశ్వగంధి వంటి ఔషధాలలో దొరుకుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
6.   రాత్రి పెరుగు మానేయడం బుద్ధికి మనం చేసే మంచి మేలని వైద్యుల సలహా!

ఈ సూచనలేవీ పాటించలేనంత కష్టమైనవి కాదు కదా! సూక్ష్మ బుద్ధిశాలులుగా జీవిత పర్యంతం జీవిస్తే స్వంతానికే కాదు.. మనమీద ఆధార పడ్డ వారికి, ముదిమిలో మనం ఆధార పడ్డవారిక్కూడా తప్పించుకోదగ్గ కష్టాలనుంచి తప్పించినట్లే అవుతుంది.
***
(సూచనః ఈ వ్యాసంలోని ఆరోగ్య సూచనలు దాక్టర్ ఇవటూరి రామకృష్ణగారివి. సోర్సుః స్వాతి 31-03-2009 నాటి సంచిక. కేవలం పాఠకుల ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే ఈ టపా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
-కర్లపాలెం హనుమంతరావు







No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...