Thursday, June 14, 2018

ఇదేం సమాఖ్య స్ఫూర్తి మోదీజీ?




'ఇండియా దటీజ్ భారత్ షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని భారత రాజ్యాంగం నిర్దేశించింది. అంటే భారతదేశం కొన్ని రాష్ట్రాల కలయిక- అని అర్థం.
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థది ‘సమాఖ్య స్వరూపమా? ఏక కేంద్ర స్వభావమా?  అని అడిగివాళ్లకి ఇతమిత్థంగా  సమాధానం ఇవ్వడం కష్టం. ఈ అంశం మీద ఎన్నో ఏళ్లబట్టి ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యాఖ్యానాలు చేసుకొస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన దేశ సమాఖ్య స్వరూపం ‘సమ్మిళిత’ స్వభావం కలిగివుంటుంది.. రాజ్యాంగం ప్రకారం.
సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ అంతిమంగా  కేంద్రీకృత అధికారానికి లొంగి ఉండేది ఈ 'సమ్మిళిత సమాఖ్య'.
అమెరికా సమాఖ్య రెండు పౌరసత్వాలు కలిగి ఉంటుంది. రాష్ట్ర పౌరసత్వం.. కేంద్ర పౌరసత్వం. బ్రిటన్ సమాఖ్యలో ఒకే పౌరసత్వం.. అదీ కేంద్రం అధీనంలో  ఉండేది. మన దేశ సమాఖ్య ఈ రెండిటికీ మధ్యస్థంగా సాగే వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఒకే రాజ్యాంగం,  ఒకే పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు.. తాజాగా ప్రవేశపెట్టిన జి.ఎస్.టి విధానం.. కేంద్రం నియమించే గవర్నరు రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే అంతిమ రాజ్యాంగాధికారిగా ఉండటం.. ఇవన్నీ కేంద్రీకృత అధికారాన్ని నిర్దేశించే లక్షణాలు.
 కానీ మనల్ని రెండు చట్టసభలు పాలిస్తుంటాయి ఇక్కడ. ఒకటి రాష్ట్రస్థాయిలో, మరోటి కేంద్రస్థాయిలో. కేంద్రస్థాయిలో కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా  రాజ్యసభ కూర్పు  ఉంటుంది. ఇవీ  సమాఖ్య లక్షణాలు. అంటే కొన్ని కేంద్రీకృత అధికారాలు, కొన్ని రాష్ట్ర స్థాయి పెత్తనాలు. అందుకే  రాజ్యాంగ నిపుణులు కొందరు మనది 'అర్థ సమాఖ్య' (Half Federalism) వ్యవస్థగా అభివర్ణించారు. కానీ ఆ నిర్వచనం కూడా మన సమాఖ్య వాస్తవ స్వరూప స్వభావాలను నిర్వచించే విధంగా లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే మన సమాఖ్య వ్యవస్థ ‘సహకార సమాఖ్య(Co-operative Federalism)’ లక్షణాలను కలిగి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో మాత్రమే సాగించవలసిన ప్రజాపాలన వ్యవస్థ ఇది.
అందుకే రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం మితి మీరినప్పుడల్లా విమర్శలు జోరందుకుంటుంటాయి. కేంద్ర, రాష్ట్రాలలో వేరు వేరు రాజకీయపక్షాలు పాలన చేస్తున్నప్పుడు  ఈ విమర్శల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పుడు కేంద్రాన్ని నియంతగా చిత్రించే ధోరణీ ఉధృతంగా సాగుతుంది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రసవత్తర రాజకీయ వాతావరణానికి ఈ తరహా పరిస్థితులే ప్రథాన నేపథ్యం.
అటు కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో సైతం పరిస్థితి విభిన్నంగా లేదు. కేంద్రం రాష్ట్రాలకు తగినన్ని  నిధులు, నీళ్ళతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ, అధికారం ఇవ్వడం లేదని యాగీ చేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. బలమైన ప్రాంతీయపార్టీల ఏలుబడిలో ఉన్న బీహారు,  పశ్చిమ బెంగాలు కమ్యూనిష్టుల ఏలుబడిలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలలో ఈ సంఘర్షణాత్మక వైఖరి మరింత దూకుడుగా సాగుతోంది.
ఆ మధ్య దక్షిణాది రాష్ట్రాలు తమకు న్యాయంగా దక్కవలసిన పన్నుల వాటాలో సైతం కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, దక్షిణప్రాంతంలో వసూలు అయే పన్నుల్లో అధికభాగం ఉత్తరాది రాష్ట్రాలకు ఉదారంగా దోచిపెడుతోందని  వివాదం లేవదీసాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర పక్షపాత ధోరణిని ఎండగట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. ముందు ముందూ కేంద్రం మొండి వైఖరి   ఇదే విధంగా  కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడే రోజులు వస్తాయని పార్టీ ప్రారంభించిన ప్రారంభదినాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం గుర్తుంది కదా!  
రాజ్యాంగానికి రూపకల్పన కమిటీ అధ్యక్షులు డాక్టర్ దాదా సాహేబ్ అంబేద్కర్ ఈ సమాఖ్య వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యానం ఈ సందర్భంగా స్మరించక తప్పదు. 'భారతీయ సమాఖ్య ఒప్పందం ప్రకారం ఏర్పడింది కాదు. కాబట్టి రాష్ట్రాలకు విడిపోయే హక్కు ఉండదు. సాధారణ పరిస్థితుల్లో నిజమైన సమాఖ్యగానూ, అత్యయిక పరిస్థితుల్లో ఏక కేంద్ర వ్యవస్థగానూ పనిచేసేందుకు మాత్రమే వీలు కలుగుతుంది' అని బాబా సాహేబ్ వ్యాఖ్య.
రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి ఉందని ప్రకటించే అధికారం సెక్షన్ 356 కింద కేవలం కేంద్రానికి మాత్రమే సోపడానికి వెనకున్న లక్ష్యం సమాఖ్య స్ఫూర్తి తిరిగి బాగుపడనంత పరిస్థితికి దిగజారకూడదనే.
దివంగత ప్రధాని ఇందిర హయాంలో దేశం ఒకసారి ఈ అత్యయిక దుస్థితిని  చవి చూసింది. అప్పటి నుంచి ఆ ఆర్టికల్ రద్దు కోసం  దేశంలోని రాష్ట్రాలన్నీ వత్తిడి చేస్తోన్న విషయం మనం మర్చిపోకూడదు.
కాంగ్రెసు పార్టీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నియంతృత్వ పాలనతో రాష్ట్రాలను వేధిస్తున్నదన్న విమర్శలతో 2014లో అధికారంలోకొచ్చిన నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో క్రమక్రమంగా తానూ అదే తరహా ఏకీకృతకేంద్ర పాలన దిశగా అడుగులు వేస్తున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఆ తరహా నియంతృత్వ పాలనకు విరుద్ధంగా ప్రతిపక్షాలు, పలు ప్రాంతీయపార్టీలు సహజంగానే  గగ్గోలు పెడుతున్నాయి.
గ్రామస్థాయి పథకాలపై సైతం కేంద్ర నియంత్రణ, పర్యవేక్షణ ఎక్కువై రాష్ట్ర ప్రభుత్వాల  పరిస్థితి పురపాలక సంస్థల స్థాయికి దిగజారిందని పలురాష్ట్రాల ఆవేదన. సంక్షేమరాజ్య స్ఫూర్తితో అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబధాలు కలిగివుండే రాష్ట్రాలకు మాత్రమే సంపూర్ణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని డిమాండు పెరుగుతోన్నదిప్పుడు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల అధికార పంపిణీ విధానాన్ని పునస్సమీక్షించాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు అప్పగించాలని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో కేంద్రం అతిజోక్యం తగ్గించుకోవాలని, దుర్వినియోగమవుతున్న గవర్నర్ల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని, రాష్ట్రపతి విచక్షణాధికారంతో రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి విధించే ఆర్టికల్ 356 ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్లు రోజు రోజుకూ బలంగా పెంచుకుంటూ పోతున్నాయి రాష్ట్రాలు.
ఎవరి అవసరాలకు తగ్గట్లు వారు రాష్ట్రస్థాయిలో  రిజర్వేషన్లు  కల్పించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండ్ తో మొదలైన తెలంగాణా రాజ్య సమితి ఉద్యమం ఇప్పుడు క్రమంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు.. నిజమైన ఫెడరల్ సమాఖ్య' అన్న డిమాండ్లకు పెరిగి.. కలసి వచ్చిన పార్టీలతో కేంద్రస్థాయిలో మరో 'కూటమి' ఏర్పరచే ప్రయత్నం దిశగా సాగుతున్నది. మరో వైపు కేంద్రం అతిజోక్యంతో రాజ్యాంగం కల్పిసున్న సహకార సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నదంటూ ప్రాంతీయపార్టీలన్నీ మరో కూటమిగా  ఏకమయి పోరాడే దిశగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి.
ఇప్పుడైనా కేంద్రంలో పాలన చేసే అధికార పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాజ్యాంగం ప్రసాదించిన సహకార సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా స్వీయపాలనలో మార్పులు చేసుకుంటుందని సుపరిపాలన కోరుకొనే పౌరులుగా మనందరం ఆశిద్దాం.
(‘డెబ్బైయ్యేళ్ల భారత రాజ్యాంగం -విశ్లేషణాత్మక పరిచయం’  పుస్తక రచయిత శ్రీ అనిసెట్టి సాయికుమార్ వ్యాసం భారత రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థ స్వరూప స్వభావాలు’ స్ఫూర్తితో)
రచయితకు ధన్యవాదాలు
-కర్లపాలెం హనుమంతరావు
15 -06 =2018

(విజ్ఞాన ప్రచురణల సౌజన్యంతో)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...