Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Thursday, February 18, 2021

మహాత్ముడూ మామూలు మనిషే! కానీ మన కళ్లాకు కాదు! వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

 


 

గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా ఓవర్ భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.

కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది. 

అటెన్ బరో 'గాంధీచిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద,వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటేనిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట  గ్యారంటీ!

వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా మొదలై .. బాపూజీగామహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని పెళ్లి చేసుకునిఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగాను  అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశానికి తిరుగుముఖం పట్టింది. 

దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా  వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటాను'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక పూట ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందిఅంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు. 

మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల్ ఉద్దేశం. 

బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలుఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?! 

ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడుసీత,ఆంజనేయుడు వంటి ఎన్నో పౌరాణిక  పాత్రలకూ తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!

-కర్లపాలెం హనుమంతరావు

19 -02 -2020

(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)

***

Thursday, February 4, 2021

వేదకాలం నాటి 'సాగు' సంప్రదాయం- కర్లపాలెం హనుమంతరావు

                                                                   


నిప్పు పుట్టించే విద్య మనిషికి నేర్పించిన గురువు తరువు. ఎండు కొమ్మలు ఒకదానినొకటి రాచుకుని నిప్పు పుట్టడం చూసిన మనిషి ఆ చమత్కారం తాను కందిపుల్ల మీద గుమ్ముడు పుల్ల రాసి పడేసి నిప్పుపుట్టించడంగా మల్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. రాయీ రాయీ రాసినా నిప్పుపుడుతుంది. అయినా ఈ చెట్టు కొమ్మల రాపిడి పద్ధతే   అనువుగా మనిషికి అనిపించింది. రావికర్ర మీద జమ్మికర్ర పెట్టి మథించి నిప్పు పుట్టించే శౌత్రిక కర్మ విధానం ఇప్పటికీ అమలులో ఉంది.

అడవుల్లో, కొండల మీద వాటంతట అవే మొలిచే తృణధాన్యాలను గమనించిన మనిషి వానకారు దయన, తన భుజబలంతో కూడా  ఆ పని చేయవచ్చిన గ్రహించినప్పటి నుంచే 'సేద్యం' మొదలయింది అనుకోవాలి. సేద్యం మూలరూపం ఛేద్యం(ఛేదించబడేది) కావచ్చని పండితులు వేలూరు శివరామశాస్త్రిగారు అభిప్రాయ పడుతున్నారు. రుగ్వేదంలో 'నాగలి' ప్రస్తావన, అథర్వణవేదంలో ఎరువుల  ప్రస్తావనలు కనిపిస్తున్నాయి కాబట్టి సేద్యం భారతీయుల అతిపురాతన ప్రావృత్తిగా వ్యాఖ్యానించక తప్పదు. వేదసంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారీ కృషివర్ణనలు కల్పించడం ఈ వాదనకు వత్తాసు పలుకుతుంది. భారతంలో భీష్ముణి నిర్యాణకాలం, విష్ణుపురాణం తాలూకు 'మఘాదౌచ తులాదౌచ' లూ పరిశీలించాలి ఇందు కోసం.

 

పరాశర సంహిత కర్త పరాశరుడు కృషీపరాశరుడిగా ప్రసిద్ధుడు కూడా. పాశ్చాత్య చరిత్రకారులూ ప్రస్తావించిన ఈ పరాశరుడి కాలం మన లెక్కల ప్రకారం దాదాపు 3వేల సంవత్సారల గతం. భారతదేశంలో వ్యవసాయం ఎంత ప్రాచీనమైనదో వివరించేందుకే ఈ వివరాలన్నీ.

సేద్యం శ్రేష్ఠతను గురించి బహుధా ప్రశంసిస్తుందీ పరాశర సంహిత. ఎడ్లు వాటి లక్షణాలు, గోష్ఠం గోచరాలు, గోమయాన్ని ఎరువుగా మార్చే విధానాలు, నాగలి.. ఏరుకట్ట సామాను, దుక్కి దున్నే పద్ధతులు, విత్తులు కట్టి కాపాడి చల్లుకునే సూచనలు, పైరు కోసి ధాన్యం నూర్చి తూర్పార పట్టి క్రైలు చేయడాలు, పాతర్లు, గాదెలు,  నిలవున్న ధాన్యం పురుగుపట్టకుండా తగు జాగ్రత్తలు, పైరుకు నీరుపట్టే పద్ధతులు, భాద్రపదమాసంలో పంటకు తెవులు తగలకుండా నీరు పోయడాలు, తెవుళ్ల నివారణ, మళ్లల్లో నీరు నిలిపి వుంచే ఉపాయాలు.. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ పరాశర సంహితలో కనిపించడం విశేషం.

శునం వహా శునం నరః శునం కృషతు లాంగలం/

శునం వరత్రా బధ్యంతాం శున మష్ట్ర మ్ముదిజ్ఞ్గయ (4 -57- 4)

(ఎడ్లు సుఖంగా లాగు గాక, మనుషులు సుఖంగా పనిచేయుదురు గాక, నాగలి సుఖంగా దున్ను గాక, ములుకోలు సుఖంగా తోలు గాక అని ఈ శ్లోకానికి అర్థం). 

ఇదే నాగలిని ఒక యంత్రంగా సంబోధిస్తూ, ఐదు మూరల ఏడి, ఐదు జానల నాగలి, దున్నే ఎడ్ల చెవుల చివరకు వుండే కాడి,  ఒకటిన్నర మూర నిర్యోలం, పన్నెండంగుళాల పాశికా అడ్డ చీలలు, మూరెడు శౌలం, తొమ్మిది నుంచి పన్నెండున్నర అంగుళాల  పిడికొలతలుండే ములుకోలు-గా నాగలి ఆరు భాగాలను కొలతలతో *'ఈషాయుగోహల’ లో వివరించింది ఈ పరాశరసంహిత. (ఈషాయుగోహల స్థాణుర్నిర్యోల సస్య పాశికా/

అడ్డ చల్లశ్చ శౌలశ్చ పచ్చనీచహలాష్టకమ్/

పంచహస్తా భవేదీషాస్థాణుః పంచవిత స్తికః/

సార్దహస్తస్తు నిర్యోలోయుగః కర్ణ సమానకః/

నిర్యోలపాశికాచై వ అడ్డచల్లస్త థైవచ/

ద్వాదశాంగులమానోహి శౌలోఽరత్ని ప్రమాణకః/

సార్ద ద్వాదశ ముష్టిర్వా కార్యావానవముష్టికా/

దృఢా పచ్చనికాజ్ఞేయేలోహాగ్రా వంశసంభవా') అని శ్లోకం.

వేదకాలంనాటి  వ్యవసాయ పనిముట్లు, వాటి తీరుకూ ఇప్పటి పరికరాలు వాటి పనితీరుకూ ఆట్టే భేదం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాని ఆ కాలంలో మాదిరిగా నేడు పంటల అభివృద్ధి సమృద్ధితనంలో తప్ప ఆహారపుష్టిలో కనిపించడంలేదు! దేశీయావసరాలకే సరిపడినంతగా పండని నేపథ్యంలో ఇహ విదేశే ఎగుమతులను గురించి ఆలోచించడం పేలాలపిండి కథ సామెత అవుతుందేమో!

భారతదేశంలో సాగుకు రాని భూవిస్తీర్ణం చాల ఉన్నట్లు అథర్వణ వేదం చెబుతోంది.  ఆ  పరిస్థితే నేటికీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నదాత ఆర్థిక స్తోమతు  పరిగణలోకి తీసుకున్నా నిరాశాజనకమైనా దృశ్యమే కంటి ముందు కనిపించేది. అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి అగ్రరాజ్యాలలో వంద ఎకరాల సాగుభూమి ఏకఖండంగా గల ఆసామీ కూడా పేదరైతుగానే పరిగణింపబడుతుంటే.. ఇక్కడ సెంటు భూమి  సొంత పేరు మీద లేకుండానే కొన్ని తరాల బట్టి కౌలుదారీ సాగు చేసుకునే దైన్యస్థితి అన్నదాతది.

పురాణాల కాలంలో 'ఖిలం'  అనే పదం తరచూ వినబడేది. ఏడాది మార్చి ఏడాది పంట వేసేందుకు వీలుగా రెండు మూడు పంటభూములున్న ఆసాములు ఒక భూమిని ఒక సంవత్సరానికి  సాగుచేయకుండా వదిలేసేవాళ్ళు. భారతదేశంలో ఔత్తరేయులు 'ఖిల్'గా పిల్చుకునే ఈ పైరు మార్పు విధానం ఇప్పుడు కనిపించడంలేదు.

'తథా వర్షేషు వర్షేషు కర్షణద్భూ గుణక్షయంః/

ఏకస్యాం గుణహీనాయాం కృషి మన్యత్ర కారయేత్' అంటూ

'యుక్తి తల్పతరు' తప్పని సరి అని చెప్పిన  పైరు మార్పు విధానం వ్యవసాయరంగం సైతం వ్యాపారమయంగా మారిన  తరుణంలో వృథా ప్రయాసగా తోచడంలో ఆశ్చర్యం లేదు.

పైరుమార్పు కోసమే కాకుండా పశువుల తిండి కోసం కూడా గాను సాగుచేయకుండా గతంలో కొన్ని భూములను అట్లాగే వదిలేసే పద్ధతి ఉండేది.

వైదిక కాలాలలో కేవలం పశువుల మేత కోసం గానూ కొన్ని బీళ్లను దున్నకుండా అలా వదిలేసే రివాజు ఉండేది. వ్రజం, గోష్ఠం, సుయవసంగా పిలిచే ఈ గోచరాల పద్ధతి ఇప్పుడు అమలులో లేదు.  పురాణాల కన్నా ముందున్న వేదసంహితలలో పలురకాల ధాన్యాల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. వాజసవేయ సంహితలోని చమకంలో ఇప్పటి మన వడ్లు, మినుములు, యవలు, నువ్వులు, సెనగలు, స్వాల్వము, పశుగ్రాసం, ప్రియంగువులు (ప్రేంఖణం), నవము, చామలు, నెవ్వగులు, గోధుమలు, మసూరాలు పేర్లు వినిపిస్తాయి. అధర్వణ వేదంలో మినుములు ప్రస్తావన ఉంది. రుగ్వేదంలో యవలు, వరులు కనిపిస్తాయి!

ఇప్పుడంటే వేరుశనగ వేస్తున్నారు, కానీ ఇటీవలి కాలం వరకు  మెరకభూముల్లో పునాస పైరులు కోసిన తరువాత  మళ్ళీ దున్ని ఉలవ వేసే ఆచారం ఉండేది. పంటలకు ఎల్లకాలం ఉండే వెల ఆధారంగా ఈ రకమైన రెండు పంటల విధానం తైత్తరీయంలో . (దీర్ఘ సంవత్సరస్య సస్యం వచ్యతే(5 -1 -7 -3) కనిపిస్తుంది.

భారతదేశంలో స్థల, కాల భేదాలను అనుసరించి పంటలు వేసే ఆచారం ప్రచులితం. హేమంతంలో యవలు గొర్తుబట్టడం, మఖ పుబ్బ కార్తెలలో మొక్కజొన్న, వానకారుకాలంలో కోసుకునేందుకు  వీలుగా ఓషదులు,  వరులు శరత్కాలంలో కోతకు వచ్చేందుకు వీలుగా  గ్రీష్మ, వర్షర్తువుల ప్రారంభ కాలంలో పైర్లు పెట్టడం సస్యసాంప్రదాయాల కింద ఆ విధంగా వస్తోవుంది. మౌర్యుల కాలంలో సస్యపరివర్తనం అమలులో ఉన్నట్లు అర్థశాస్త్రం - రెండో భాగం(మైసూరు ప్రతి)లో ఆధారాలున్నాయ్!

కేంద్రాలు, ప్రేంఖణాలు, నువులు గ్రీష్మాంతంలో, సెనగలు, మినుములు, పెసలు వానకారు నడిచే సమయంలో, యవ, గోధుమ, కుసుంబ, కుడువ,మసూరు, కలాయ, సర్షపాదులు శరదృతువుల్లో పైరుపెట్టే  నేటి ఆచారాలు వేదకాలం నుంచి సాంప్రదాయికంగా వస్తున్నవే.

ఆరు రుతువుల విధానం కూడా క్రీస్తుకు పూర్వం రెండువేల ఐదు వందల ఏళ్ల కిందటనే ఆరంభమయినట్లు అనిపిస్తుంది. చాంద్ర సంవత్సరం అయినా ఆంధ్రదేశంలో నేటి రుతువులను పట్టి ఆర్యావర్తము లాంటి ఉత్తరదేశ రుతువులను లెక్కబెట్టకూడదు. దేశ భేదాలను బట్టి మార్పులుంటాయి . కాబట్టి మాన భేదాలను గూడా ఆ పద్ధతి ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలి.


భారీ యెత్తున ట్రాక్టర్లతో దున్నుతున్న నేటి యంత్రాల వాతావరణంలోనూ  అంతర్గతంగా అణిగివున్నది వేదకాలం నాటి కృషీవలుడు నాగలి ధరించి  కార్యక్షేత్రంలోకి అడుగువేసే ముందు వినమ్రంగా చేసిన ప్రార్థన సారాంశమే!  ఆ ప్రార్థన 

'అర్వాచీ సుభగే భవ/

సీతే! వందామ హోత్వా/

యథా న స్సుభగా మసి/

యథా న స్సుఫలా మసి॥'-

ఓ సీతా!(నాగేటి చాలు) మాకు అభిముఖివి కమ్ము. నీకు నమస్కరిస్తున్నాం. మాకు నిండుగా పండుము! ' అనే అర్థంలో సాగుతుంది.


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

05 -02 -2012 ***

(శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు వ్యాసావనిలో ప్రాచీన సేద్య విధానాలను గురించి విస్తారంగా చెప్పుకొచ్చిన ఓ వ్యాసంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాల ఆధారంగా)

Saturday, July 18, 2020

భారతదేశం హిందూదేశమా? -కర్లపాలెం హనుమంతరావు= సూర్య దిన[పత్రిక ప్వాసం



'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి
మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం
పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక
భాగం భరతవర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది
హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం
ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా
నివృత్తి అవుతుంది.

'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.

స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని
తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా
ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు
కనిపిస్తాయి.

యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి
వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం
వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు
కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు
సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ
ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం
పడింది.

రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ
రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు
పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన
విషయాలు వెలుగు చూస్తాయ్!

ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం
'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల
కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మతరూపంలో చొప్పించి పబ్బం
గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.



నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.
తాత్వికత అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు.
వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి
స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక
ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం
పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట
లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ
'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.

తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది
సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం,
ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే
సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల
నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.

ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ
మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద
'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం
హిందూధర్మంగా గుర్తింపబడింది.

'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి
రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా
ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!

స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో
మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి
నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా
బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.

మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించారు.
రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని
బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా
చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!



ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం
లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న
రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు
చేస్తున్నాయిప్పుడు!

హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో
అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో..
ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక
చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని
దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల
ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత
అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది.
మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం
చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం,
వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా,
త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే
దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం
వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత
ప్రభావం,

ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత
నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ
చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా
ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ
సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక,
ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు
నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత,
విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో
నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే.
భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు
బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు
తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వం చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత
సిద్ధాంతంతో ప్రభావితమైనవే!

కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం
రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది.
రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ
సమాజంలో చెల్లదు.



హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ
మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే
వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో
బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం
ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా
భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు
చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు
ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే
విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.

టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల
ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ
ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నడిపించారు. బెదిరిన బ్రిటిష్
దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని
ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు
మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ‘ప్రత్యేక ఇస్లాం
రాజ్యం’ కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా
చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం
చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే
కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా
పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది
బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు
విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే
ఉన్నారు.

భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం
వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ.
స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు
అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన
మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా
సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి
సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది.
చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన
పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?

***
(సూర్య దినపత్రిక - ఆదివారం - 18 -07 -2020 ప్రచురితం) 



Thursday, December 12, 2019

జగదానందకారకం- ఈనాడు ఆదివారం సాహిత్య సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు





'నాదాధీనమ్ జగత్ సర్వం' అని సామవేద వాదం. బ్రహ్మ సామవేద గానాసక్తుడు. వాణి వీణాపాణి. శంకరుడిది ఓంకార నాద ప్రీయత్వం. అనంతుదు సంగీత స్వరాధీనుడు.   మతంగ, భరత, శుక, శౌనక, నారద, తుంబుర ఆంజనేయాది రుషిసత్తములందరూ మోక్ష సామ్రాజ్యాన్ని సాధించింది నాదబ్రహ్మోపాసనా మార్గంలోనే అన్నది శ్ర్రుతి స్మృతి పురాణేతిహాసాదుల మాట. సామవేదం ప్రకారం చేతనాచేతనాలైన సమస్త భూతజాలాన్ని ఆకర్షించే ఐహిష్కాముష్కికాలైన చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శక్తి ఉన్నది ఒక్క సంగీత విద్యకే. 'సరిగమపదని'సలనే సప్త స్వరాల పునాదులపై నిర్మించిన భారతీయ సంగీత మహాహార్మ్యం ఎంతో అనాదిది. ఆరంభంలో ఒకే లక్ష్య లక్షణ సంప్రదాయాలతో విరాజిల్లినా విజాతీయుల పాలనా ప్రభావం ఉత్తర దక్షిణాలనే అంతరాన్ని ఏర్పరిచింది. ఆంధ్ర కవితాపితామహుడుగా పేరుగాంచిన నన్నయ భట్టారకునికి చాలా ముందు నుంచే ఏలపాటలు, తుమ్మెద పాటలు వంటి జానపద గులాబీలు సౌరభాలు గుబాళించేవి. అన్నమాచార్యులు, పురందరదాసు, క్షేత్రయ్య వంటి పదవాగ్గేయకారులూ   ప్రచారం చేసిన జనసాహిత్యమూ అపారమే! 'సంగీతం' అంటే 'తంజావూరు పాట' అన్నంతగా స్థిరపడిన నాయజరాజుల పాలనలో తెలుగు నేలల నుంచి  గుర్తింపు కోసం వలసపోయిన మహానుభావులు ఎందరో! ఆ వలసజాతి కాకర్లవారి వంశంలో సుస్వర జనసంగీత పునరుద్ధరణార్థమై భువికి దిగివచ్చిన అపర పరమేశ్వరుడు 'శ్రీరామ తారక మహా మంత్రోపాసన' మహిమతో అసంఖ్యాకంగా భగవత్ సంకీర్తనా సాహిత్యం సృజించిన కర్ణాటక సంగీత వైతాళికుడు  త్యాగరాజు. పద్దెనిమిదో శతాబ్ది పూర్వార్థంలో తంజావూరు సంగీత సాహిత్య క్షేత్ర వృక్షాల 'అంటు'గా ప్రవర్థిల్లిన 'త్యాగరాజం' అనే కొమ్మ వెదజల్లిన ఫలాలు, పుష్పాలు, బీజాలే నేటికీ మహావృక్షాలుగా ఎదుగుతూ నేల నలు చెరగులా పరిమళాలు ప్రసరిస్తున్నది.
సరిగమలతో పరిచయం ఉండని సామాన్యుడిని సైతం సమ్మోహనపరిచే ఆ సంగీత మాయావినోదం మూలాలు- రాగాలలో అంతర్లీనంగా ఒదిగుండే పదాల పొహళింపులో ఉంటుంది. పండితులు అంత వరకు తమ సొంత సొమ్ముగా భావిస్తూ వచ్చిన సంగీత సాహిత్యాలు రెండింటినీ తనదైన అజరామర సృజన ముద్రతో సామాన్యజన పరంచేసిన రాగ భగీరథుడు త్యాగరాజయ్యర్. 'ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ముగ్గురే కవిబ్రహ్మలు' అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ; తిక్కన, పోతన, వారిద్దరి తేటతనం, భక్త్యావేశాలను వాగ్గేయరూపంలో తేటపరిచిన  త్యాగరాజు. త్యాగయ్య పల్లవులు, చరణాల నిండా కండ గల కలకండ తెలుగు పలుకులే! నిత్య వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్న అచ్చతెనుగు పలుకుబడులను పునరుజ్జీవింపచేసిన త్యాగరాజుది భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సైతం వైతాళిక పాత్ర.  'సానుభూతి' అనే పదానికి సాధారణంగా మనం వాడే అర్థం 'జాలి'. 'త్యాగరాజు 'నగుమోము గనలేని'  అనే కీర్తనలో 'నా 'జాలి' దెలిసి నను బ్రోవగ రాద' చరణంలో ఆ పదం 'నిస్సహాయత' అనే అర్థంలో ధ్వనిస్తుంది. పాటకజనం నిత్యవ్యవహారంలో సన్నిహితులను చనువుతో పిలిచే విధంగా 'రారా మా ఇంటి దాకా' అంటూ మనసారా ఆహ్వానించడంలోని మర్మం; రాముణ్ని ఎప్పుడూ త్యాగయ్య మానవాతీతుడిగా భావించకపోవడమే! తెలుగు వాజ్ఞ్మయంలోని గేయ సంప్రదాయాన్ని స్వీకరించి ఉత్తమోత్తమమైన సంగీత సాహిత్యాలను సమపాళ్లలో ప్రజాబాహుళ్య ప్రయోజనార్థం మేళవించిన జనవాగ్గేయకారుడు త్యాగయ్య. అంతకు మించి  వైదేశిక రాటుపోట్లతో అగ్గలమయిపోయిన తెలుగువాణిని సముద్ధరించిన శుద్ధ భాషాసేవకుడు కూడా!

ఉపనిషత్తుల ప్రకారఁ అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం, ఆనందం - అనే అయిదు అంచల సోపాన మార్గాన మాత్రమే ఈశ్వర తత్వ సాధన సాధ్యమన్నది భారతీయ ఆధ్యాత్మిక  చింతన. త్యాగరాజస్వామి పంచరత్నమాల అంతస్సూత్రమూ అందుకు అనుగుణంగా సాగుతుంది. పరమేశ్వరాత్మతో తాదాత్మ్యత సాధించే నిమిత్తం సాధించవలసిన బ్రహ్మానందం కోసమై ఆలపించే 'జగదానందకారక' కీర్తన ఆలాపనకు మిగిలిన నాలుగు ఘనరాగరత్నాలను సోపానాలుగా ఆ రాగయోగి మలచిన తీరు నిరుపమానం! ఆనందమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల శుద్ధిని ఉద్దేశించి సృజించినవని ఘనరాగపంచరత్నాలను యోగ శాస్త్రజ్ఞులూ సమర్థిస్తున్నారిప్పుడు. రామకృష్ణుడు ప్రవచించిన సర్వమత సహన సూత్రాన్ని తన సంకీర్తనల ద్వారా లోకానికి ఎలుగెత్తిచాటిన మత సంస్కర్త త్యాగరాజస్వామి. రాగకళకు రాగద్వేవాలతో నిమిత్తం లేదని త్యాగరాజయ్యవారి శిష్యకోటిలోని ఆంధ్రేతరులు చాటిచెప్పే మాట.  'జయదేవుని కడ క్రోధమై రాధ చరణాలు-ముద్దుల మోళిపై మోసి మోసి/ అన్నమాచార్యుల సమక్షమందేడు కొండల- నొంటిగా కాపురముండి  యుండి/ క్షేత్రయ్య రసమయ్య క్షేత్రమున పలు నాయికల బిగి కౌగిళ్ల నలిగి నలిగి/ విసిగిపోయి సుంత విశ్రాంతి కోసమై- సీత తోడ అనుగు భ్రాత తోడ / విశ్వమయుడు ప్రభువు వేంచేసియున్నాడు- రాముండగుచు త్యారరాజు నింట' అంటారు కవి కరుణశ్ర్రీ! నిజానికి ఆ రామచంద్రుడు లౌకికమైన చీకాకులకు అలసి రవ్వంత సాంత్వనకై తపించే మనలోని ఆత్మారాముడికి ప్రతీక. 'ఇంద్రియ జ్ఞానానికి, ఆత్మానందానికి మధ్య స్థానాన్ని సంగీతం ఆక్రమిస్తుంది' అంటారు ప్రముఖ  ఆంగ్లకవి బ్రౌనింగ్. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ  'లోచెవి' కలిగిన సంగీత సాహిత్యశాస్త్రవేత్త కాగలిగేది. త్యాగరాజస్వామి అంతటి అదృష్టవంతుడు. ఆ స్వామి తెలుగువాడు కావడం తెలుగువాడి అదృష్టం. స్వామి 'తన్మయ సమాది' నుంచి తన్నుకువచ్చిన సంగీత ఝరిని దోసిళ్లకు పట్టి శిష్యులు స్వరసాహిత్యంగా పదిలపరచని పక్షంలో జాతికి ఈ మాత్రమైనా 'సుస్వర గంగ' సంప్రాప్తమైవుండేదా? ఎనభై ఐదేళ్లు అఖండంగా వెలిగిన ఆ త్యాగరాగజ్యోతి ఈ బహుళ పంచమి నాటికి 'నచ పునారావర్తి' పదవిని అలంకరించి 173 ఏళ్లు
(2020 నాటికి). ప్రతీ ఏటా జరుపుకునే త్యాగరాజ సంగీత ఉత్సవాలు వాస్తవానికి స్వర,సాహిత్యాలు రెండింటికీ జరిగే మహోత్సవాలు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయం 15 -12 -2012)

Thursday, June 14, 2018

ఇదేం సమాఖ్య స్ఫూర్తి మోదీజీ?




'ఇండియా దటీజ్ భారత్ షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని భారత రాజ్యాంగం నిర్దేశించింది. అంటే భారతదేశం కొన్ని రాష్ట్రాల కలయిక- అని అర్థం.
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థది ‘సమాఖ్య స్వరూపమా? ఏక కేంద్ర స్వభావమా?  అని అడిగివాళ్లకి ఇతమిత్థంగా  సమాధానం ఇవ్వడం కష్టం. ఈ అంశం మీద ఎన్నో ఏళ్లబట్టి ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యాఖ్యానాలు చేసుకొస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన దేశ సమాఖ్య స్వరూపం ‘సమ్మిళిత’ స్వభావం కలిగివుంటుంది.. రాజ్యాంగం ప్రకారం.
సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ అంతిమంగా  కేంద్రీకృత అధికారానికి లొంగి ఉండేది ఈ 'సమ్మిళిత సమాఖ్య'.
అమెరికా సమాఖ్య రెండు పౌరసత్వాలు కలిగి ఉంటుంది. రాష్ట్ర పౌరసత్వం.. కేంద్ర పౌరసత్వం. బ్రిటన్ సమాఖ్యలో ఒకే పౌరసత్వం.. అదీ కేంద్రం అధీనంలో  ఉండేది. మన దేశ సమాఖ్య ఈ రెండిటికీ మధ్యస్థంగా సాగే వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఒకే రాజ్యాంగం,  ఒకే పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు.. తాజాగా ప్రవేశపెట్టిన జి.ఎస్.టి విధానం.. కేంద్రం నియమించే గవర్నరు రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే అంతిమ రాజ్యాంగాధికారిగా ఉండటం.. ఇవన్నీ కేంద్రీకృత అధికారాన్ని నిర్దేశించే లక్షణాలు.
 కానీ మనల్ని రెండు చట్టసభలు పాలిస్తుంటాయి ఇక్కడ. ఒకటి రాష్ట్రస్థాయిలో, మరోటి కేంద్రస్థాయిలో. కేంద్రస్థాయిలో కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా  రాజ్యసభ కూర్పు  ఉంటుంది. ఇవీ  సమాఖ్య లక్షణాలు. అంటే కొన్ని కేంద్రీకృత అధికారాలు, కొన్ని రాష్ట్ర స్థాయి పెత్తనాలు. అందుకే  రాజ్యాంగ నిపుణులు కొందరు మనది 'అర్థ సమాఖ్య' (Half Federalism) వ్యవస్థగా అభివర్ణించారు. కానీ ఆ నిర్వచనం కూడా మన సమాఖ్య వాస్తవ స్వరూప స్వభావాలను నిర్వచించే విధంగా లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే మన సమాఖ్య వ్యవస్థ ‘సహకార సమాఖ్య(Co-operative Federalism)’ లక్షణాలను కలిగి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో మాత్రమే సాగించవలసిన ప్రజాపాలన వ్యవస్థ ఇది.
అందుకే రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం మితి మీరినప్పుడల్లా విమర్శలు జోరందుకుంటుంటాయి. కేంద్ర, రాష్ట్రాలలో వేరు వేరు రాజకీయపక్షాలు పాలన చేస్తున్నప్పుడు  ఈ విమర్శల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పుడు కేంద్రాన్ని నియంతగా చిత్రించే ధోరణీ ఉధృతంగా సాగుతుంది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రసవత్తర రాజకీయ వాతావరణానికి ఈ తరహా పరిస్థితులే ప్రథాన నేపథ్యం.
అటు కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో సైతం పరిస్థితి విభిన్నంగా లేదు. కేంద్రం రాష్ట్రాలకు తగినన్ని  నిధులు, నీళ్ళతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ, అధికారం ఇవ్వడం లేదని యాగీ చేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. బలమైన ప్రాంతీయపార్టీల ఏలుబడిలో ఉన్న బీహారు,  పశ్చిమ బెంగాలు కమ్యూనిష్టుల ఏలుబడిలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలలో ఈ సంఘర్షణాత్మక వైఖరి మరింత దూకుడుగా సాగుతోంది.
ఆ మధ్య దక్షిణాది రాష్ట్రాలు తమకు న్యాయంగా దక్కవలసిన పన్నుల వాటాలో సైతం కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, దక్షిణప్రాంతంలో వసూలు అయే పన్నుల్లో అధికభాగం ఉత్తరాది రాష్ట్రాలకు ఉదారంగా దోచిపెడుతోందని  వివాదం లేవదీసాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర పక్షపాత ధోరణిని ఎండగట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. ముందు ముందూ కేంద్రం మొండి వైఖరి   ఇదే విధంగా  కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడే రోజులు వస్తాయని పార్టీ ప్రారంభించిన ప్రారంభదినాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం గుర్తుంది కదా!  
రాజ్యాంగానికి రూపకల్పన కమిటీ అధ్యక్షులు డాక్టర్ దాదా సాహేబ్ అంబేద్కర్ ఈ సమాఖ్య వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యానం ఈ సందర్భంగా స్మరించక తప్పదు. 'భారతీయ సమాఖ్య ఒప్పందం ప్రకారం ఏర్పడింది కాదు. కాబట్టి రాష్ట్రాలకు విడిపోయే హక్కు ఉండదు. సాధారణ పరిస్థితుల్లో నిజమైన సమాఖ్యగానూ, అత్యయిక పరిస్థితుల్లో ఏక కేంద్ర వ్యవస్థగానూ పనిచేసేందుకు మాత్రమే వీలు కలుగుతుంది' అని బాబా సాహేబ్ వ్యాఖ్య.
రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి ఉందని ప్రకటించే అధికారం సెక్షన్ 356 కింద కేవలం కేంద్రానికి మాత్రమే సోపడానికి వెనకున్న లక్ష్యం సమాఖ్య స్ఫూర్తి తిరిగి బాగుపడనంత పరిస్థితికి దిగజారకూడదనే.
దివంగత ప్రధాని ఇందిర హయాంలో దేశం ఒకసారి ఈ అత్యయిక దుస్థితిని  చవి చూసింది. అప్పటి నుంచి ఆ ఆర్టికల్ రద్దు కోసం  దేశంలోని రాష్ట్రాలన్నీ వత్తిడి చేస్తోన్న విషయం మనం మర్చిపోకూడదు.
కాంగ్రెసు పార్టీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నియంతృత్వ పాలనతో రాష్ట్రాలను వేధిస్తున్నదన్న విమర్శలతో 2014లో అధికారంలోకొచ్చిన నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో క్రమక్రమంగా తానూ అదే తరహా ఏకీకృతకేంద్ర పాలన దిశగా అడుగులు వేస్తున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఆ తరహా నియంతృత్వ పాలనకు విరుద్ధంగా ప్రతిపక్షాలు, పలు ప్రాంతీయపార్టీలు సహజంగానే  గగ్గోలు పెడుతున్నాయి.
గ్రామస్థాయి పథకాలపై సైతం కేంద్ర నియంత్రణ, పర్యవేక్షణ ఎక్కువై రాష్ట్ర ప్రభుత్వాల  పరిస్థితి పురపాలక సంస్థల స్థాయికి దిగజారిందని పలురాష్ట్రాల ఆవేదన. సంక్షేమరాజ్య స్ఫూర్తితో అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబధాలు కలిగివుండే రాష్ట్రాలకు మాత్రమే సంపూర్ణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని డిమాండు పెరుగుతోన్నదిప్పుడు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల అధికార పంపిణీ విధానాన్ని పునస్సమీక్షించాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు అప్పగించాలని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో కేంద్రం అతిజోక్యం తగ్గించుకోవాలని, దుర్వినియోగమవుతున్న గవర్నర్ల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని, రాష్ట్రపతి విచక్షణాధికారంతో రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి విధించే ఆర్టికల్ 356 ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్లు రోజు రోజుకూ బలంగా పెంచుకుంటూ పోతున్నాయి రాష్ట్రాలు.
ఎవరి అవసరాలకు తగ్గట్లు వారు రాష్ట్రస్థాయిలో  రిజర్వేషన్లు  కల్పించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండ్ తో మొదలైన తెలంగాణా రాజ్య సమితి ఉద్యమం ఇప్పుడు క్రమంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు.. నిజమైన ఫెడరల్ సమాఖ్య' అన్న డిమాండ్లకు పెరిగి.. కలసి వచ్చిన పార్టీలతో కేంద్రస్థాయిలో మరో 'కూటమి' ఏర్పరచే ప్రయత్నం దిశగా సాగుతున్నది. మరో వైపు కేంద్రం అతిజోక్యంతో రాజ్యాంగం కల్పిసున్న సహకార సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నదంటూ ప్రాంతీయపార్టీలన్నీ మరో కూటమిగా  ఏకమయి పోరాడే దిశగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి.
ఇప్పుడైనా కేంద్రంలో పాలన చేసే అధికార పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాజ్యాంగం ప్రసాదించిన సహకార సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా స్వీయపాలనలో మార్పులు చేసుకుంటుందని సుపరిపాలన కోరుకొనే పౌరులుగా మనందరం ఆశిద్దాం.
(‘డెబ్బైయ్యేళ్ల భారత రాజ్యాంగం -విశ్లేషణాత్మక పరిచయం’  పుస్తక రచయిత శ్రీ అనిసెట్టి సాయికుమార్ వ్యాసం భారత రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థ స్వరూప స్వభావాలు’ స్ఫూర్తితో)
రచయితకు ధన్యవాదాలు
-కర్లపాలెం హనుమంతరావు
15 -06 =2018

(విజ్ఞాన ప్రచురణల సౌజన్యంతో)

Thursday, May 31, 2018

వాస్కోడగామా అదృష్టం.. గల్పిక





వాస్కోడగామా పోర్చుగీసు నుంచి బయలుదేరుతున్న దృశ్యం
క్రెడిట్ వికీపీదియా
ఇండియాకు సముద్రమార్గం కనుక్కొన్నమొదటి నావికుడు ఎవరు? అనడిగితే 'వాస్కోడగామా' అని ఠక్కున బదులిచ్చేస్తాడు బడికెళ్లే బుడ్డోడు కూడా! నిజానికి ఆ అదృష్టం దక్కి ఉండవలసింది బార్తొలోమ్యూ దియాజ్ కి. కొద్దిలో తప్పిపోవడానికి కారణం అతగాడి పిరికితనమే! ఈ చిన్న కథ వింటే మీరూ నా మాటను కాదనరు.
యూరోపు దేశీయులకు మన భారతదేశంతో వ్యాపార సంబంధాలు రెండువేల ఏళ్ల కిందటి నుంచే కొనసాగుతూ వస్తున్నాయ్! మన దగ్గర దొరికే సుగంధ ద్రవ్యాలు వాళ్లకు బంగారంతో సమానం. మరీ ముఖ్యంగా మన మిరియాలంటే వాళ్లకి పరమ ప్రియం కూడా.
అరబ్బు దేశాలే అప్పటికి రవాణామార్గాలు. క్రీ.1453లో టర్కీ దేశం కాన్ స్టాంటినోపుల్ ని ఆక్రమించుకుని ఆ మార్గాన్ని దిగ్బంధం చేయడంతో యూరోపు దేశాలకు చిక్కులొచ్చిపడ్డాయ్. అధిక సుంకం చెల్లించి ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించేకన్నా మరో కొత్త దారి ఏదైనా ఉందేమో కనుక్కోవాలన్న కాంక్ష మొదలయింది పశ్చిమ దేశాల్లో.
పోర్చుగీసు  మొదట్నుంచి నౌకానిర్మాణంలో అగ్రగామి. ఆ దేశం రాజు హెన్రీ వన్(ఆయన్ని కింగ్ ఆఫ్ నేవిగేషన్ అని పిలుచుకునేవాళ్లు ఆ రోజుల్లో) ఆదేశాల మేరకు భారతదేశానికి మరో జలమార్గం కనుక్కొనేందుకు నావికాబృందాలు బయలుదేరేవి.
సముద్రాలలో ప్రయాణం చేయడమే తప్ప మహాసముద్రాలలోకి అడుగు పెట్టేందుకు సాహసించేవాళ్లు కాదు అప్పటి నావికులు. దారి తప్పి పోతామేమోనని భయం. ((కొలంబస్ విషయంలో జరిగింది అదే). దిక్సూచి యంత్రం కనుక్కొన్న తరువాత నావికులకు ధైర్యం పెరిగింది. ఆఫ్రికా ఖండం అంటూ ఒకటి ఉందని తెలుసు కానీ.. అది దక్షిణ దిశగా ఎంత  వరకు విస్తరించి ఉందో తెలీని పరిస్థితి. అందుకే చీకటి ఖండంగా పిల్చుకునేవాళ్లు. పరికారాల నాణ్యత పెరిగాక వాటి సాయంతో సాహసించి అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవేశించి ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడే ప్రయాణించుకుంటూ పోయారు.  ఆఫ్రికా మీదుగా భారతదేశం చేరవచ్చని వాళ్ల ఆశ. భూమధ్యరేఖ మీదున్నందు వల్ల ఆఫ్రికా సాగరాలెప్పుడూ సలసలా కాగుతుంటాయని అప్పటి వరకు భయపడ్డ నావికులు ' బార్తొలోమ్యూ దియాజ్ ' చొరవతో సాహసించి ముందకు అడుగు వేశారు. తీరాపోతే ఆఫ్రికా తీరంవెంట అంతా పచ్చదనమే పచ్చదనం. అడవులే అడవులు. ఊహించనంత బంగారం, ఏనుగు దంతాలు, బానిసలు తేరగా దొరకపుచ్చుకోవడం మొదలుపెట్టారు తెల్లవాళ్లు. అంతటితో సంతృప్తి పడకుండా బార్తొలోమ్యూ దియాజ్ ఆఫ్రికా దక్షిణాగ్రానికి చేరగలిగాడు.  అక్కడి తుఫానులను రుచి చూశాడు. కొత్త వాతావరణంలో నెలల కొద్దీ చేసిన ప్రయాణాల కారణంగా చాలా మంది సాటి నావికులు జబ్బుపడ్డారు. మరిక ముందుకు పోయేందుకు వాళ్లంతా మొండికి దిగడంతో చేసేది లేక బార్తొలోమ్యూ దియాజ్   వెనక్కి తిరగాల్సి వచ్చింది.  తనకు దక్కవలసిన కీర్తిని వాస్కోడగామాకు వదిలేసినట్లయింది ఆ విధంగా. బార్తొలోమ్యూ దియాజ్ మూలకంగానే భారతదేశానికి  జలమార్గం దక్షిణాఫ్రికా అంచును చుట్టి వెళ్ళగలిగితే ఖచ్చితంగా దొరుకుతుందని మంచి ఆశ (గుడ్ హోప్) మొదలయింది పోర్చుగీసుల్లో. అందుకే ఆ అంచుకు 'గుడ్ హోప్' అనే పేరూ  స్థిరపడిపోయింది. 'హోప్' ను నిజమని సాకారం చేసిన సాహసయాత్రికుడు మాత్రం వాస్కోడగామానే.
అతగాడో మొండి ఘటం. మెరుగైన భూగోళ పటాలు, పరికరాలు, నైపుణ్యం కలిగిన నావికులను వెంటేసుకొని  బార్తొలోమ్యూ దియాజ్   చూపించిన దారిలోనే ఆఫ్రికా పశ్చిమ తీరం మీదుగా 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ను చుట్టుకొని తూర్పు తీరం గుండా దక్షిణానికి సాగి చివరికి  క్రీ.1498 లో భారతదేశానికి దక్షిణాన ఉన్న కేలికట్ తీరం(ఇప్పటి కొచ్చి) చేరగలిగాడు.  కొన్ని నెలల పాటు అక్కడే మాకాం వేసి నౌకల నిండుగా సుగంధ ద్రవ్యాలు సేకరించుకొని తిరిగి క్షేమంగా స్వదేశం చేరగలిగాడు.
ఆ విధంగా భారతదేశానికి మొదటి సముద్రమార్గాన్ని కనిపెట్టిన మొనగాడుగా  బార్తొలోమ్యూ దియాజ్  కు దక్కవలసిన అదృష్టం తాను దక్కించుకున్నాడు వాస్కోడగామా! 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ను చుట్టి ముందుకు సాగితీరాలన్న మొండితనమే వాస్కోడగామాకి 'గుడ్ లక్' తెచ్చిపెట్టింది!
కొలంబస్  భారతదేశం కోసం నాలుగు యాత్రలు చేసినా సఫలం కాలేదు. వెస్ట్ ఇండీస్, ఆఫ్రికా ఖండాలే  చాలా కాలం ఇండియా అనే భ్రమలో ఉండేవాళ్లు యూరోపియన్లు. ‘ఇండియాకు సముద్రమార్గం కనుక్కొన్నమొదటి నావికుడు ఎవరు?’ అనడిగితే ఇవాళ  చిన్నపిల్లల నాలుకల మీద కూడా చటుక్కున ఆడే పదంగా  'వాస్కోడగామా'. చరిత్రలో ఆ విధంగా స్థిరపడిపోవడం.. అదీ అదృష్టమేగా!
అందుకే మన పెద్దలనేది 'ధైర్యే సాహసే లక్ష్మీ'అని! కాదనగలమా?!
-కర్లపాలెం హనుమంతరావు
01 - 06 -2018
(విదేశీయాత్రికులు అందించిన మన చరిత్ర- పుట. 95  టి.వెంకట్రావ్ గారి వ్యాసం ప్రేరణతో) 
వాస్కోడగామా సంతకం


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...