Showing posts with label Personalities. Show all posts
Showing posts with label Personalities. Show all posts

Wednesday, February 3, 2021

హేట్సాఫ్ టు.. రంధి సోమరాజూ! -కర్లపాలెం హనుమంతరావు- కవిత

 




 







అయోమయం

అవతారం

ఎత్తింది ఎప్పుడనా

సందేహం?

 

అయితే మన రంధి

సోమరాజు ఏమందీ

 ఈ కింద  ఓసారి

చిత్తగించండి మరీ!-

 

 వీపులేని రోడ్డుమీద

ముక్కులేని కుళ్ళు కాల్వ

ఊపిరి తీసుకుంటున్నప్పుడు..

 గుడ్డలేని బజారు

గొడ్డు వోయిన మబ్బుతో

సరసాలకు దిగిపోయినప్పుడు..

 

నీటి తెగులుతో ఎండిన పాలు

మీటరు మొగుణ్ణి

కాస్త దూరంగా తొలగమని

దండం పెడుతున్నప్పుడు..

 

పచ్చగడ్డి

ఆవును మేసి

మాంసం దుకాణం

పెట్టేసినప్పుడు..

 

నామాల షావుకారి

చేతిలోని తక్కెడ

సూర్యుడి రాయికి సరిసమానంగా

చంద్రుణ్ణీ తూచిచ్చేసినప్పుడు..

 

నీడ నిచ్చే చెట్టుకు

నీడ కావాలని

పెద్దలు లెక్చర్లు

దంచుతున్నప్పుడు..

 

ముక్కు మూసుకుని

నోటితో చెడుగాలిని పీల్చడం

చాలమంది వంటికి సులువుగా

వంటబట్టిన అలావాటుగ మారినప్పుడు..

 

 

పకోడీ ఉద్యోగానికి

ఉల్లిపాయ కూడా

దరఖాస్తు పెట్టుకునే

దుష్టకాలం దాపురించినప్పుడు..

 

వల్లకాటిలో

నిద్ర చాలడం లేదని

శవాలు

ఏడుపు మొగాలు పెడుతున్నప్పుడు..

 

థీరీ ఆఫ్ రెలిటివిటీ

 మంది తెలివిని

వెన్నముద్దల్లా

ఆరగించేసున్న సంధికాలమప్పుడు..

 

అడుక్కునే

అజ్ఞానాన్ని చూసి

విజ్ఞానం ఉడుక్కుంటూ

బొడ్డుని మురు కుంటోన్నప్పుడు..

 

చావుకసలు చావేలేని

రోజొకటి వచ్చేస్తుందేమోనని

ఓ పిచ్చి సన్నాసికి

చచ్చేచావు ఇప్పుడే

వచ్చేసినప్పుడు..

 

దోమకవిగారు

తమ-'గీ'గీతాన్ని

ప్రచురించే పత్రిక బ్రతకాలని

రక్తాన్ని పోగుచేస్తున్నప్పుడు..

 

ఇంత వేగంగా తిరుగుతున్నా

గగ్గోలు పెట్టడం రాని భూమి

విమానం మోతను చూసి

విస్తుపోతున్నప్పుడు..

 

తన కీ తనే ఇచ్చుకుంటే తప్ప

బతికే దారింకేదీ లేదని  

గడియారం బెంగటిల్లి

తపస్సుక్కూర్చున్నపుడు..

 

వెలుతురుతో సహా

వస్తువునీ స్వాహా

చేసెయ్యాలని నీడ

ఆబగా మాటేసినప్పుడు..

 

కళ్ళున్నవాళ్లకూ కళ్ళులేనివాళ్లకూ

ఒకేలా తను కనిపిస్తున్నందుకు

చీకటి కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నప్పుడు..

 

దేవుడికే దేవుడెవడో

తేలలేదని

కబురందిన వేదాంతులు

గుడ్లు తేలవేస్తున్నప్పుడు..

అయోమయం

అవతారం ఎత్తిందని

సోమరాజు రంధి   థీరీ!

నులక మంచం దుమ్ము నుండయినా

శనగపిండి కారబ్బూందీ నలా

వండి వార్చే నలమహారాజు

మన రంధి సోమరాజులు!

.

 

పదికాలాల పాటు

పంటికింద నలిగే

హాటూ స్వీటూ

అందించినందుకు

చేద్దామా 

రంధి సోమ రాజుకు

 'హేట్సాఫ్' అంటూ బిగ్ ఓ సెల్యూటు!

-కర్లపాలెం హనుమంతరావు

జనవరి 19, 2013

 

 

 

 

 

 

Saturday, August 29, 2020

బాపూజీ పట్ల ఇంత అపచారమా? -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ




'అసంఖ్యాకమైన భారతీయులకు నేనివాళ ప్రతినిధిగా నిలిచానంటే .. అదిఆయాచితంగా నాకు దక్కిన స్థానం కాదు. కష్టించి నేను సాధించుకున్న గౌరవం'అన్నాడు గాంధీజీ. వినేందుకు డంబంగా అనిపించినా తనను గురించి  తానా హాఫ్నేకెడ్ ఫకీర్ బాహాటంగా చెప్పుకున్న మాటల్లో వీసమెత్తైనా అసత్యం లేదు.

బాపూజీ తనకు తానుగా సంకల్పించుకుని ఉత్తమ మానవుడుగా ఎదిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి చిత్తశుద్ధితో కృషిచేసిన రుషితుల్యుడు! ఆయన సత్యంతో చేసిన ప్రయోగాలు పుస్తకం నిజానికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వ వికాస పాఠ్యగ్రంథం. జీవితంలో మనిషి మనీషిగా ఉన్నత దశ వైపుకు ఎదగాలంటే, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆయన ఎక్కడా పాఠంలాగా చెప్పకపోయివుండవచ్చు. కానీ ఆ మహాత్ముడు తనలో తానుగా ఎచెప్పుకున్న నా జీవితమే నా సందేశం అన్న ఆ



ఒక్క ముక్కలోనే అన్ని అర్థాలు దాగి ఉన్నాయి.   ఎవరికి కావాల్సిన అర్థాలు వాళ్లు సులభంగా వెదుక్కోనేందుకు వీలైన నిండు ప్రయోగశాల  బాపూజీ జీవితం.



గాంధీజీ ద్వారా సాధించబడిన స్వాత్రంత్ర్యం ఒక్కటే కాదు, కొల్లాయిగుడ్డ, మేకపాలు, బాదంపప్పు, ప్రకృతివైద్యం, అల్పాహారం, నిరాడంబరత, అహింసావాదం, పేదరికం ఇత్యాదులన్నింటికి భారతీయుల వరకు బాపూజీనే తిరుగులేని అంబాసిడర్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ. ఆయన జనంమనిషి అన్న మాట అసత్యం  కాదు.  కానీ, సాధారణ జనం అయన దాకా చేరుకునేందుకు ఎన్నో అసాధారణ

శక్తులు అడ్డుండేవి ఆ రోజుల్లో. బడా బడా వ్యాపారవేత్తలను, బడాయిలు పోయేరాజకీయనేతలను, అసంఖ్యామైన కుబేరులను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి

మామూలు మనిషికి ఇబ్బందిగా ఉండేది. గాంధీజీ కోరుకుంటే తప్ప ఆయన దర్శనం సామాన్యులకు అంత సులభంగా సాధ్యమయ్యే వ్యవహారంగా ఉండేది కాదన్న మాట నిజం. అయినా  భరతజాతికి ఆయన మీద ఉన్న అభిమానం కాలం గడిచే కొద్దీ పెరిగిందే తప్పించి తగ్గుముఖం పట్టిన దశ ఎన్నడూ లేదు. గుళ్లో దేవుడి దర్శనం కాలేదని దేవుడి నెవరూ తప్పుపట్టరు కదా! గాంధీజీ విషయంలోనూ అదే ప్రభ సాగింది

చివరి రోజు వరకు.


గాంధీజీ సిద్ధాంతాలు గాజు అద్దాలు బిగించిన షో కేసుల్లో అందంగా అమర్చిన కళాఖండాల స్థాయికి ఎదిగి చాలా కాలమయింది. కేవలం వాటిని కళ్లతో చూసి ఆనందించడమే తప్పించి, చేతిలోకి పుచ్చుకుని వాడుకునే సౌకర్యం లేకుండా పోయిందన్న నిష్ఠురం ఉండనే ఉంది. నాడు గాంధీజీ చుట్టూ చేరినవారు గాని,

నేడు గాంధీజీ  జపం చేస్తున్నవారిలో గాని, ఆయన భావజాలం పట్ల ఏ మేరకు అవగాహన ఉందో .. అనుమానమే! బాపూజీ బతికున్న రోజుల్లోనే ఆయన ఆదర్శభావాల పట్ల అంతులేని అయోమయం ప్రదర్శించిన నేతాగణం, ఇన్ని తరాలు గడచిన తరువాతనా ఇహ ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేసేది? బాపూజీ చేసిన ఆఖరు పోరాటం ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం  ఇన్ని తరాలుగా మనం అనుభవిస్తున్నాం.  అయినా ఇంకా 'గాంధీయిజం   రెలెవెన్స్' ను గురించి దేశం ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేకపోవడం ప్రపంచంలో మరెక్కడా జరగని వింతగానే చెప్పుకోవాలి గదా!  బాపూజీ నిరాడంబరతను గురించి కథలు కథలుగా చెప్పుకునే మనమే, ఆయన  జీవన శైలి ఎందువల్ల ఎందుకంత ఖరీదైన సింప్లిసిటీ చట్రంలో బంధించివుంచామో చెప్పగలమా?  పుట్టపర్తి సాయిబాబా చుట్టూ చేరిన భక్తబృందానికి, బాపూజీ చుట్టూ ఆనాడు చేరిన భజనబృందానికి వేష భాషలలోనే తప్ప ఆచరణ వ్యవహారాలలో ఆట్టే తేడా లేదంటే నొచ్చుకునేవారే ఎక్కువగా ఉండవచ్చు. బాబా చెప్పిన ఆచరణీయ సాధ్యంకాని ఆధ్యాత్మిక సిద్ధాంతాల వల్లెవేతకు బాపూజీ నోట పలికిన అభ్యుదయ భావజాలానికి ట్యాగులోనే తప్ప

స్వభావంలో ఆట్టే తేడాలేదంటే కొట్టొస్తారేమో కూడా మూఢభక్తులు. నిజానికి ఖరీదైన జీవితం గడిపేవారూ, జనాలను రకరకాల మార్గాల ద్వారా          దోపిడీచేసేవారు,

అధికారదాహార్తులు బాపూజీ భజన బృందంలో ఆనాడు ఎక్కువగా కనిపించేవాళ్లు. అట్లాంటి వాళ్లని దూరంగా పెట్టాలని బాపూజీ అంతరంగం ఎంతలా కొట్టుమిట్టులాడినా అది బాపూజీకే స్వయంగా సాధ్యంకాని పరిస్థితి.

గాంధీజీలోని ప్రధాన లోపం.. ఆయన తన జీవించివుండగానే బహుశా మానవమాత్రుడెవరూ ఊహించనైనా లేనంత అపారమైన అద్భుత జనాకర్షణ  కూడగట్టుకోవడం. దేవుడిని నిందించినా ఏ కొద్ది మందో కొంతయిన సద్దుకుపోయేవారేమో గానీ, బాపూజీ మీద ఈగ

వాలినా సరే భరించలేనంత ఉద్వేగం  ప్రదర్శించిన  జనాభిమానం ఉన్న ఒకానొక కాలం కద్దు. అతనిపై ఉన్నతవర్గాల ఆకర్షణకు స్వార్థం కారణమైతే, కింది వర్గాల వారి ఆకర్షణకు కేవలం అమాకమైన అభిమానమే కారణం. వీధిలో నిప్పంటుకుంటే ఎంత అసూర్యంపశ్యజాతి వారైనా ఒకసారి అటుకేసి తొంగిచూడకుండా ఉండలేరు. నిప్పుకున్న ఆకర్షణ శక్తి బాపూజీ వ్యక్తిత్వానికి సమకూరడం కాకతాళీయమేమీ కాదు. అసలే మేలిమి బంగారం. ఆ పైన అద్భుత ప్రచారం. మహాత్ముడు సమకూర్చుకున్న అశేష అమితాకర్షణ శక్తికి జంకే తెల్లవాడు ఠారుకుని  భరతగడ్డ మీద నుంచి తారుకున్నది కూడా.



బాపూజీ పై 1948, జనవరి, ముఫ్ఫై నాడు జరిగిన అఘాయిత్యం కాకతాళీయమేమీ కాదు. అంత ఊహించకుండా వచ్చిపడిన ఉపద్రవమూ కాదు. చరిత్రలో ఆ తరహా పాఠాలు ఏ వైరుధ్య వర్గాల మధ్య సామరస్యం కోసం చేర్చడం తప్పించారో అప్పడున్న పరిస్థితుల్లో నిగ్గుతేల్చడం కష్టతరమయివుండవచ్చు గాని.. ఇప్పుడంతా నీళ్లకు నీళ్లు. పాలకు పాలుగా తేటతెల్లమవుతూనే ఉన్నమాట నిజం.  బాపూజీ

దరిద్రకోటి ఉద్ధరణకై తన జీవితాన్ని మీదు కట్టినమాట ఎంత వాస్తవమో, ఆయన ముద్ర చూపించి ధనవంతులు, బలవంతులు మరింత ధనం, బలం సాధించుకున్న మాటా అంతే వాస్తవం. ఇందులో బాపూజీ ప్రమేయం ఏమీ ఉండకపోవచ్చును గానీ, తన పరంగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాల పట్ల ఆయన కేవలం ప్రేక్షకపాత్ర వహించడం మాత్రం విమర్శనార్హమే అవుతుంది కదా సమానమానవత్వకాంక్షాపరుల దృష్టికి!గాంధీమతం అభివృధ్ధి చెందుతున్న దశకు ముందు నుంచే దేశంలో ఎక్కువ మంది విశ్వసించే మతం అంతకు మించిన స్థాయిలో   చెలరేగిపోతోంది. స్వాతంత్ర్యపోరాటంలోకి ఆ విశ్వాసులు కేవలం దినదినప్రవర్థమానమయే 'గాంధీ'తేజం నిలవరించే ముఖ్యోద్దేశంతోనే లాగబడ్డారనే వాదానికి ఆధారాలులేకపోలేదు. అప్పటికే గాంధీ ప్రవచిత హరిజనోద్ధరణ,  మతసామరస్యం  వంటి సగుణాత్మక భావజాలం ప్రజాకోటి గుండెలను పట్టేసున్న పరిణామం. సంకుచిత మతతత్వ శక్తులకు  మింగుడుపడని విపరిణామం. బాపూజీ సైతం హిందూ ధర్మోద్ధరణకై పంతగించినవాడే అయినప్పటికి, ఆయనది ఉదారవాదం, సంస్కరణకోణం. నేరుగా బాపూని ఎదుర్కొనే పరిస్థితులు రాను రాను మరింత దుర్భరమయ్యే పరిణామాలను ముందే ఊహించి, ఆ మతవాదులు సహజంగానే అందుకు అడ్డుకట్టవేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బాపూజీకి దేశం మూలమూలలా పూజలు అందే కాలంలోనే, అదే దేశంలో ఆయనను అంతమొందించే పథకాలకు దేశమంతటా ఆలోచనలు చేయబడ్డాయి. 'ఒక మహాపురుషుడి కోసం దేశమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది' అన్న బాపూజీ హత్యనాటి నెహ్రూజీ విషాదప్రకటనలో ఉన్నదంతా 'శుద్ధసత్యం' అంటే ఒప్పుకోలేం. శాంతిదూత చావు ఆవశ్యకతపై ముందు నుంచే  రహస్య కరపత్రాలు పంచబడ్డాయని వినికిడి. ఆ 'శుభ' వార్త వినేందుకు కొంతమంది 'విశ్వాసులు' టెలిఫోన్ల వద్ద కాచుకుని కూర్చున్నట్లు రికార్డులు తరువాత బైటపడ్డాయి. బాపూజీ 'హే..రామ్' అంటూ  నేలకొరిగిన రోజున వేలాదిమంది సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారంటే.. 'బాపూజ్యోతి' మలిగిపోవడం భారతీయం వంకన జరిగే ఒక మతప్రాభవానికి ఎంత

అగత్యమయిందో అర్థంచేసుకోవచ్చు.



భజనల ద్వారా, కల్లిబొల్లి కన్నీళ్ల ద్వారా ఒక సత్యాన్ని మరుగుపరిచే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడమే జుగుప్సాకరం. నీచశక్తుల పెత్తనానికి ఒక వైయక్తిక శక్తి  అడ్డంకి అయిన  ప్రతీ సందర్భంలోనూ చరిత్రలో ఏం జరిగిందో, మహాత్ముని జీవితంలోనూ అదే జరిగింది. మనిషిని మట్టిలో కలిపేసి, మట్టి విగ్రహాలను నెలకొల్పడం జాతి పట్ల చేసే ద్రోహానికి కొనసాగింపే తప్ప మరోటి కాదు. విశ్వాస పునరుద్ధరణ మిషన స్వార్థశక్తుల పెత్తనం అప్రతిహతంగా కొనసాగేందుకే బాపూజీ బలికావలసొచ్చిందన్న మాట పచ్చి నిజం.  బాపూజీని గొప్పచేసి ఇప్పటి వరకూ బతికేసిన వారి పాత్రా ఈ వంచనాత్మక రూపకంలో తక్కువేమీ లేదు.



ఏటేటా మహాత్ముడి జయంతులు, వర్థంతులు దశాబ్దాల తరబడి మహా ఆర్భాటంగా  జరుగుతున్నా .. ఆయన అహర్నిశలు కలవరించిన బడుగుజీవుల ఉద్ధరణల వంటి

సంస్కరణలు ఒక్కరడుగైనా ముందుకు పడ్డాయా? స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దరిద్రుల బతుకు మరీ దుర్భరమయిందని నిస్పృహచెందేవారు ఇన్ని దశాబ్దాలు

గడిచినా తగ్గుముఖం పట్టడంలేదంటే ఏమిటర్థం?



తుపాకీల నీడన పాలన ఇప్పుడు సర్వసామాన్యమైపోయింది. అహింసాసూత్రమయితే ఏనాడో చేవచచ్చిపోయింది. సత్యంతో సమాజం, రాజకీయం ఇప్పుడు చేసే తమాషా ప్రయోగాలు బహుశా బాపూజీ బతికున్నా ఊహించగలిగివుండునా? తెల్లవాళ్లను మించినన్ప్రన్జాకంటకులు ఇప్పుడు ఎన్నికల నెచ్చెనలేసి జాతి నెత్తినెక్కి మొత్తేస్తున్నారు. గ్రామస్వరాజ్యం గుత్తకు ఇచ్చే పెత్తందారీల వ్యవహారమయిపోయింది. వంటికి నిండుగా బట్ట, కడుపుకు నిండుగా తిండి కోరడమే ఇప్పుడే పెద్ద దేశద్రోహం. సాంఘిక దోపిడీ అనేది ఒకటి ధాటిగానడుస్తున్నదన్న స్పృహే సమాజానికి ఇవాళ బొత్తిగా లేకుండా పోయింది. హరిజనుడు, బడుగుజీవుడు, బలహీనుడు, గ్రామీణుడు, శీలవతి, పసిబాలుడు, వికలాంగుడు, ముసలిమనిషి, సాగు పనులు, చేతివృత్తులు, కుటీర పరిశ్రమ, స్వపరిపాలన, పారదర్శకత, నీతి మార్గం.. ఇలా బాపూజీ భారతీయుల అభ్యున్నతి కోసమై కలవరించని అంశం కనిపించనే కనిపించదు. ఏ ఒక్క రంగమైన బాపూజీ కలలు కన్న రామరాజ్యం తీరులోన సాకారమయే లక్షణాలు కనిపిస్తున్నాయా?

'నేను గాంధీజీ వారసుణ్ణి' అని ప్రకటించుకున్నా ఒక్క ఓటు అదనంగా సాధించే పరిస్థితులు లేనప్పుడు గాంధీగిరీ రెలెవెన్సు గురించి ఇహ చర్చలెందుకు? తాగడం మానెయ్యమని ఆయన నెత్తీ నోరు కొట్టుకుని బోధించినమద్యం మీది ఆదాయమేఇప్పుడు ప్రభుత్వాలు పేదల కోసమై నడిపించే  సంక్షేమ పథకాలకు    ప్రధాన వనరు. ఒక్క కరెన్సీ నోటు పైన మినహా  దశాబ్దాల కిందట జాతి మొత్తాన్నీ సమ్మోహపరచిన ఆ బోసినవ్వుల బాపూజీ మందహాసం మరెక్కడా కనిపించనప్పుడు .. ఇంకా 'రామ్.. రహీమ్ భాయీ.. భాయీ' అంటూ నాటకాలు ఆడడం  రాజకీయం కాక మరేమిటి?

అధర్మం ప్రబలి ధర్మచ్యుతి జరిగినప్పుడు అవతారపురుషుడు జన్మించి దుష్ట శిక్షణ, ధర్మరక్షణ కార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసం వినడానికి చెవులకు కమ్మగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏది దర్మమో, ఏది అధర్మమో రాజ్యాంగమే తేల్చలేని సందర్భాలు ఇప్పుడు తరచూ ఎదురవుతున్నాయి! పూటకో సరికొత్తనేత తానొక్కడే గాంధీ మహాత్ముణ్ణి మించి ప్రజాసేవకు అంకితమయేందుకే ముందుకు వచ్చినట్లు సరసాలాడుతుంటే జనం మరింత అయోమయంలో పడి ధర్మాధర్మ విచక్షణశక్తి సర్వం కోల్పోతున్నారు. ధర్మరక్షణకు తొమ్మిది అవతారలు వచ్చిపోయినట్లు  మనం గాఢంగా విశ్వస్తున్నామంటే, ఏ ఒక్క అవతారం సంపూర్ణంగా పాపప్రక్షాళన చేయనట్లే  కదా? రాముడంతవాడు ఏ ధర్మ రక్షణకని భూమ్మీదకుదిగివచ్చాడో.. పాపం,  ఆ ధర్మరక్షణ కడదాకా నిర్వహించలేకనే  సరయూనదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. అనుభవం మీద కృష్ణావతారంలో అందుకే భగవంతుడు  మరీ అంత ముక్కు సూటిమార్గం ఎంచుకోనిది. చక్రవ్యూహం దారిలో వెళ్లినప్పటికీ చివరికి స్వజాతిలో పుట్టిన  ముసలమే  ఆయనను ముప్పతిప్పలు పెట్టింది! కృష్ణనిర్యాణం చివరికి జరిగింది తన మానాన తాను వృత్తి చేసుకునే ఓ కిరాతకుడి ద్వారానే అయినా, కిరాతకుడు కిరాతకుడే! ధర్మావతారాలన్నీ ఇలాగే కిరాతకుల చేతనో, నీచుల చేతనో చివరికి అంతమయిపోవడం కాకతాళీయం అనుకోవడానికి లేదు, గాంధీజీని మోహన్ దాస్ గాందీలాగా  ఉండనిస్తే ఆయన కోరుకున్నట్లు నిండు నూరేళ్లు పండులాగా బతికి జాతి నుంచి అసలైన మానుషనీతిని రాబట్టి వుండేవాడేమో! భక్తి మూఢభక్తికి దిగి ఆయనను అవతారపురుషుడు స్థాయికి ఎత్తే సరికి, ఆ అవతార అంతానికి చరిత్రకు మరో కిరాతకుడి చర్య అవసరమయింది. జాగ్రత్తగా గమనించి చూడండి, అవతార పురుషులందరూ ధర్మోద్ధరణకు కాకుండా, మనుషుల్లో ఎంత నీచత్వం దాగుంటుందో చూపించడానికే అవతరించినట్లు అనిపిస్తుంది.  కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నట్లు,  బాపూజీ తన మరణం ద్వారా మన మనుషుల మధ్యలోని నీచత్వాన్ని నగ్నంగా నిలబెట్టడానికే పుట్టినట్లు అనిపిస్తుంది నిజానికి.

ఆ నీచత్వం పోగొట్టుకోవడమే బాపూజీకి మనం ఇవాళ నిజంగా ఇచ్చే నివాళి.  ఆ పని మీద దృష్టి పెట్టకుండా పై పైన కొంగభక్తి నటిస్తూ, లోలోపల ఆ మొండి మనిషి ఇప్పుడు బతికిలేనందుకు సంబరపడ్డమే నీచాతినీచం. అట్లా ఆనందపడడం మన స్వార్థం కోసం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆ అహింసామూర్తిని చంపుతున్నట్లే! ఆనాడు తెల్లపాలకుడు కూడా చేయడానికి  వణికిపోయిన కిరాతకం ఈనాడు మనం చల్లంగా చేయడానికైనా వెనుకాడడంలేదు. ఎంత సిగ్గుపడాల్సిన దుర్గుణం!
 -కర్లపాలెం హనుమంతరావు
 ***
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)

Saturday, August 1, 2020

పాత సాహిత్యం మీద బ్రౌన్ దొర మోజు - కర్లపాలెం హనుమంతరావు


తెలుగు సారస్వతం తాటాకుల్లో మూలుగుతూ, రక్షించే నాథుడు కరవైన రోజుల్లో విదేశీయుడైన బ్రౌన్ (పుట్టింది భారతదేశంలోనే ఐనా) తెలుగు నేర్చుకుని, పండితులను తన స్వంత డబ్బుతో పోషించి, తాటాకుల్లోని వాజ్ఞ్మయాన్ని కాగితాలమీద రాయించి,అనేక గ్రంథాలకు సంస్కరణ ప్రతులు తయారు చేయించి, వాటికి వ్యాఖ్యానాలు, పదసూచికలు ఏర్పాటుచేసి, కొన్ని గ్రంథాలను ముద్రించి.. ఆంధ్రభాషోద్ధారకుడిగా చరిత్ర ప్రసిద్ధికెక్కాడు.
కోల్ బ్రూక్, విల్కిన్స్, విల్ ఫోర్డ్, విల్సన్ సంస్క్తతభాషావ్యాప్తికి నిస్వార్థంగా పనిచేయాడానికి కారణం వాళ్ళకున్న మత సహనమే అనీ, వాళ్ళు ఒక రకంగా Western Brahmins తో సమానమని కాల్డ్ వెల్ నిర్మొహమాటంగానే అన్నట్లు బంగోరె సంపాదకత్వంలో 1978లో వచ్చిన 'లిటరరీ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సి.పి.బ్రౌన్' పుస్తకంలో కనబడుతుంది(పే.87).బ్రౌన్ వాళ్ళకోవలోకి కచ్చితంగారాడు. హిందూమతంమీద ప్రత్యేకమైన గౌరవం ఉన్నవాడేమీ కాదు.మరి తెలుగుభాషనీ రకంగా ఉద్దరించడానికి కారణం ఏమై వుంటుదనే సందేహం తప్పక అందరికీ కలుగుతుంది.
బ్రౌన్ కి స్వతహాగా పురాతనంమీద గాఢాభిమానంట! పాతపుస్తకాలు చదవడం, వాటిమీద రిమార్కులు రాయడం, విసుగు విరామంలేకుండా సమాచారాన్ని సేకరించడం, పనికిమాలిన విజ్ఞానంపైన అతనికి వుండే ఓ రకమైన ప్రత్యెకమైన ఇష్టం,-ఇలాంటి లక్షణాలన్నీ కలగలసి తెలుగు సాహిత్య పునరుజ్జీవానికి అతడిలో ప్రేరణను కలిగించాయంటున్నారు కాల్డ్ వెల్. బ్రౌన్ కి వుండే ఏనుగుజ్ఞాపకశక్తి, పిడివాదం చేస్తూ ఏది అడిగినా 'ఓహ్..నొ' అంటూ చెప్పటం మొదలుపెట్టే గుణం..ఇవన్నీ ఆయన స్వంతానికి ఎంతవరకూ ఉపయోగపడ్దాయో తెలీదుకానీ..వివిధ కారణాల మూలకంగా అంతవరకూ స్తబ్దంగా పడివున్న తెలుగుభాషామతల్లికి మాత్రం ఎనలేని మేలు కలిగించాయనే చెప్పాలి.ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు

Wednesday, February 19, 2020

మహాత్ముడు మామూలు మనిషి కాదా.. మొదట్లో? -కర్లపాలెం హనుమంతరావు






గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా  భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.
కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది.
అటెన్ బరో 'గాంధీ' చిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద, వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటే? నిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట గ్యారంటీ !
వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మామూలు గాంధీగా మొదలై .. బాపూజీగా, మహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్' అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని , పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగా అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశం తిరుగుముఖం పట్టింది.
దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటానులే'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక రోజు ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది' అంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు.
మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల ఉద్దేశం.
బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలు' ఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?!
ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడు, సీత, ఆంజనేయుడు, అంబేద్కర్, ఫూలే వంటి ఎన్నో వ్యక్తిత్వాలకు తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020
(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)
***

Tuesday, February 18, 2020

అభినవ భీమకవిగా మహాకవి శ్రీశ్రీ! -కర్లపాలెం హనుమంతరావు





అభ్యుదయ కవిగా, ఆధునిక యుగ వైతాళికుడుగా శ్రీ శ్రీ ని అభిమానించే అనేక కోట్ల మంది తెలుగువాళ్ళల్లో నేనూ ఒకడినే. కాని మధ్య మధ్యలోఆ మహాకవి పెన్ను విదిల్చిన  వికటకవిత్వం చూసి కొద్దిగా బాధ! శ్రీ శ్రీ తిక్క రేగితే వేములవాడ భీమకవి, అడిదం సూరకవుల కోవలోకి జారిపోతూ తిట్టుకవిత్వం లంకించుకునేవారని అంటూ వుంటారు.
సినిమా పాటలకు వచ్చిన అవకాశాలు ఒకళ్లవి ఒకళ్లు గుంజేసుకున్నారన్న ఆక్రోశంతో మరో ప్రసిధ్ధ కవితో శ్రీ శ్రీ జ్యోతి మాస పత్రిక పుటల్లో కయ్యానికి కాలుదువ్వడం గుర్తుకొస్తుంది. ఆ ఇద్దరు కవులు సంచిక మార్చి సంచిక లో ఒకళ్ల మీద ఒకళ్లు దుమ్మెత్తి పోసుకున్న తీరు అప్పటి కవిత్వపాఠకులకు అదో కొత్త రకం అనుభవం. తనను 'నరసింహావతారం' అన్న అభియోగానికి ప్రతిస్పందనగా శ్రీ శ్ర్రీ 'అన్నట్టు నువ్వే నా అన్నయ్యవేమో/ఒక అవతారం ముందరివాడివి' అని బదులిచ్చారాయన. దశావతారాలలో నరసింహావతారానికి ముందొచ్చే అవతారం తమకు తెలిసిందేగా.. 'వరాహం' ! అదీ
 శ్రీ శ్రీ గారి కలం ధాటి!
1953 లో ఏర్పడ్డ  ఆంధ్రరాష్ట్రం ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ప్రకాశంపంతులుగారి పాలబడ్డదన్న ఆక్రోశం ఎంచేతనో శ్రీశ్రీగారికి. ఆ కోపం అణుచుకునే సహనం లేక 'ముక్కుపచ్చలారని న/
వ్యాంధ్ర రాష్ట్ర శిశువు/
మూలుగుతూ మూలనున్న /
ముసిలాడికి వధువు' అంటూ  ఛకాల్మని పెన్ను తీసి చమత్కారమనుకుని గిలికేసేసారు  శ్రీ శ్రీ!
ఇంకో  సందర్భంలో హఠాత్తుగా కొద్ది మంది తెలుగు సుప్రసిద్ధ కవుల మీద అలిగారు శ్రీశ్రీగార్య్! ఆ క్రుద్ధత్వానికి కవితా రూపంః 'ఏరి తల్లీ నిరుడు మురిసిన/
 ఇనప రచయితలు?/
కృష్ణశాస్త్రీ టుష్ట్రపక్షీ/
దారి తప్పిన నారిబాబూ/
ప్రైజు ఫైటరు పాపరాజూ/
పలకరెంచేత?'
కృష్ణశాస్త్రి, శ్రీరంగం నారాయణబాబు, పాలగుమ్మి పద్మరాజులను ఉద్దేశించే ఆ ఆక్రోశం అని వేరే చెప్పాలా?
స్థానం నరసింహారావుగారికి పద్మశ్రీ ఇవ్వడం ఎంచేతనో శ్రీ శ్రీ గారికి అభ్యంతరం అనిపించింది. కడుపులోని కోపాన్ని కాగితం మీద పెట్టనిదే నిద్రపట్టని మనస్తత్వం గదా మహాకవిది! 'ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు/
ముట్లుడిగిన ముత్తవ్వలు ఛద్మస్త్రీలు' అంటూ కవిసమయం వేసేశారో కవితలో. ఛద్మం అంటే కపటం.  స్త్రీకి ఇవ్వకుండా  స్త్రీ  వేషాలు ధరించే స్థానం వారికి పద్మశ్రీ వచ్చిందనా.. ఆ దుర్భాష .. తెలియదు!
శ్రీశ్రీగారిని గురించి ఇలా రాసినందుకు అభిమానులు నా మీద ఆగ్రహిస్తారని తెలుసును. మహాకవి శ్రీ శ్రీ కవిత్వం అంటే నాకూ  మహా ఇష్టమే! ఇష్టపడని తెలుగువాడు  ఎవరు? కానీ ఈ తరహా భీమకవి దారిలో సాగడమే నా బోటి అభిమానులకు బాధ కలిగించే విషయం. నన్ను తిట్టదలిచిన వాళ్లు ముందు
శ్ర్రీ శ్రీ గారు తనను గూర్చి తానే ఏమనుకున్నారో  ఈ నాలుగు పంక్తుల కవిత చదివి అప్పుడు నిస్సందేహంగా తిట్టవచ్చు! నో ప్రాబ్లమ్!
'నేలమునగ చెట్టెక్కగ/
నిచ్చెన వేస్తావుటగా/
శ్రీశ్రీనే ఎదిరించే /
ఎత్తుకి పెరిగావటరా/
ఎడా పెడా వాయిస్తా..' అంటూ వీరంగం వేస్తారు మరి మన శ్రీరంగం శ్రినివాసరావుగారు మరో సందర్భంలో.
శ్రీ శ్రీ గారే ఒక సందర్భంలో అన్నారు కదా..'వాదాన్నెదిరించలేని వాడే తిడతాడు' అని. అక్షరాల  తన మాటలతోనే తన మాటలు ఎంత నిజమో నిరూపించిన మహానుభావుడు మహాకవి శ్రీ శ్రీగారు!
బోళాతనం అలాగే బొళబొళ మాట్లాడించేస్తుందనుకుంటా.. మహాకవులనైనా సరే .. యుగవైతాళికులనైనా సరే! అదీ సంగతి!
శ్రీ శ్రీ గారి మీద అమితమైన అభిమానం ఉన్నా  తెలిసిన నిజాలని నిర్మొహమాటంగా నలుగురితో పంచుకొనే అలవాటు వల్ల ఈ రాత. అభిమానులూ.. క్షమిస్తారుగా!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020

Thursday, December 12, 2019

జగదానందకారకం- ఈనాడు ఆదివారం సాహిత్య సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు





'నాదాధీనమ్ జగత్ సర్వం' అని సామవేద వాదం. బ్రహ్మ సామవేద గానాసక్తుడు. వాణి వీణాపాణి. శంకరుడిది ఓంకార నాద ప్రీయత్వం. అనంతుదు సంగీత స్వరాధీనుడు.   మతంగ, భరత, శుక, శౌనక, నారద, తుంబుర ఆంజనేయాది రుషిసత్తములందరూ మోక్ష సామ్రాజ్యాన్ని సాధించింది నాదబ్రహ్మోపాసనా మార్గంలోనే అన్నది శ్ర్రుతి స్మృతి పురాణేతిహాసాదుల మాట. సామవేదం ప్రకారం చేతనాచేతనాలైన సమస్త భూతజాలాన్ని ఆకర్షించే ఐహిష్కాముష్కికాలైన చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శక్తి ఉన్నది ఒక్క సంగీత విద్యకే. 'సరిగమపదని'సలనే సప్త స్వరాల పునాదులపై నిర్మించిన భారతీయ సంగీత మహాహార్మ్యం ఎంతో అనాదిది. ఆరంభంలో ఒకే లక్ష్య లక్షణ సంప్రదాయాలతో విరాజిల్లినా విజాతీయుల పాలనా ప్రభావం ఉత్తర దక్షిణాలనే అంతరాన్ని ఏర్పరిచింది. ఆంధ్ర కవితాపితామహుడుగా పేరుగాంచిన నన్నయ భట్టారకునికి చాలా ముందు నుంచే ఏలపాటలు, తుమ్మెద పాటలు వంటి జానపద గులాబీలు సౌరభాలు గుబాళించేవి. అన్నమాచార్యులు, పురందరదాసు, క్షేత్రయ్య వంటి పదవాగ్గేయకారులూ   ప్రచారం చేసిన జనసాహిత్యమూ అపారమే! 'సంగీతం' అంటే 'తంజావూరు పాట' అన్నంతగా స్థిరపడిన నాయజరాజుల పాలనలో తెలుగు నేలల నుంచి  గుర్తింపు కోసం వలసపోయిన మహానుభావులు ఎందరో! ఆ వలసజాతి కాకర్లవారి వంశంలో సుస్వర జనసంగీత పునరుద్ధరణార్థమై భువికి దిగివచ్చిన అపర పరమేశ్వరుడు 'శ్రీరామ తారక మహా మంత్రోపాసన' మహిమతో అసంఖ్యాకంగా భగవత్ సంకీర్తనా సాహిత్యం సృజించిన కర్ణాటక సంగీత వైతాళికుడు  త్యాగరాజు. పద్దెనిమిదో శతాబ్ది పూర్వార్థంలో తంజావూరు సంగీత సాహిత్య క్షేత్ర వృక్షాల 'అంటు'గా ప్రవర్థిల్లిన 'త్యాగరాజం' అనే కొమ్మ వెదజల్లిన ఫలాలు, పుష్పాలు, బీజాలే నేటికీ మహావృక్షాలుగా ఎదుగుతూ నేల నలు చెరగులా పరిమళాలు ప్రసరిస్తున్నది.
సరిగమలతో పరిచయం ఉండని సామాన్యుడిని సైతం సమ్మోహనపరిచే ఆ సంగీత మాయావినోదం మూలాలు- రాగాలలో అంతర్లీనంగా ఒదిగుండే పదాల పొహళింపులో ఉంటుంది. పండితులు అంత వరకు తమ సొంత సొమ్ముగా భావిస్తూ వచ్చిన సంగీత సాహిత్యాలు రెండింటినీ తనదైన అజరామర సృజన ముద్రతో సామాన్యజన పరంచేసిన రాగ భగీరథుడు త్యాగరాజయ్యర్. 'ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ముగ్గురే కవిబ్రహ్మలు' అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ; తిక్కన, పోతన, వారిద్దరి తేటతనం, భక్త్యావేశాలను వాగ్గేయరూపంలో తేటపరిచిన  త్యాగరాజు. త్యాగయ్య పల్లవులు, చరణాల నిండా కండ గల కలకండ తెలుగు పలుకులే! నిత్య వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్న అచ్చతెనుగు పలుకుబడులను పునరుజ్జీవింపచేసిన త్యాగరాజుది భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సైతం వైతాళిక పాత్ర.  'సానుభూతి' అనే పదానికి సాధారణంగా మనం వాడే అర్థం 'జాలి'. 'త్యాగరాజు 'నగుమోము గనలేని'  అనే కీర్తనలో 'నా 'జాలి' దెలిసి నను బ్రోవగ రాద' చరణంలో ఆ పదం 'నిస్సహాయత' అనే అర్థంలో ధ్వనిస్తుంది. పాటకజనం నిత్యవ్యవహారంలో సన్నిహితులను చనువుతో పిలిచే విధంగా 'రారా మా ఇంటి దాకా' అంటూ మనసారా ఆహ్వానించడంలోని మర్మం; రాముణ్ని ఎప్పుడూ త్యాగయ్య మానవాతీతుడిగా భావించకపోవడమే! తెలుగు వాజ్ఞ్మయంలోని గేయ సంప్రదాయాన్ని స్వీకరించి ఉత్తమోత్తమమైన సంగీత సాహిత్యాలను సమపాళ్లలో ప్రజాబాహుళ్య ప్రయోజనార్థం మేళవించిన జనవాగ్గేయకారుడు త్యాగయ్య. అంతకు మించి  వైదేశిక రాటుపోట్లతో అగ్గలమయిపోయిన తెలుగువాణిని సముద్ధరించిన శుద్ధ భాషాసేవకుడు కూడా!

ఉపనిషత్తుల ప్రకారఁ అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం, ఆనందం - అనే అయిదు అంచల సోపాన మార్గాన మాత్రమే ఈశ్వర తత్వ సాధన సాధ్యమన్నది భారతీయ ఆధ్యాత్మిక  చింతన. త్యాగరాజస్వామి పంచరత్నమాల అంతస్సూత్రమూ అందుకు అనుగుణంగా సాగుతుంది. పరమేశ్వరాత్మతో తాదాత్మ్యత సాధించే నిమిత్తం సాధించవలసిన బ్రహ్మానందం కోసమై ఆలపించే 'జగదానందకారక' కీర్తన ఆలాపనకు మిగిలిన నాలుగు ఘనరాగరత్నాలను సోపానాలుగా ఆ రాగయోగి మలచిన తీరు నిరుపమానం! ఆనందమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల శుద్ధిని ఉద్దేశించి సృజించినవని ఘనరాగపంచరత్నాలను యోగ శాస్త్రజ్ఞులూ సమర్థిస్తున్నారిప్పుడు. రామకృష్ణుడు ప్రవచించిన సర్వమత సహన సూత్రాన్ని తన సంకీర్తనల ద్వారా లోకానికి ఎలుగెత్తిచాటిన మత సంస్కర్త త్యాగరాజస్వామి. రాగకళకు రాగద్వేవాలతో నిమిత్తం లేదని త్యాగరాజయ్యవారి శిష్యకోటిలోని ఆంధ్రేతరులు చాటిచెప్పే మాట.  'జయదేవుని కడ క్రోధమై రాధ చరణాలు-ముద్దుల మోళిపై మోసి మోసి/ అన్నమాచార్యుల సమక్షమందేడు కొండల- నొంటిగా కాపురముండి  యుండి/ క్షేత్రయ్య రసమయ్య క్షేత్రమున పలు నాయికల బిగి కౌగిళ్ల నలిగి నలిగి/ విసిగిపోయి సుంత విశ్రాంతి కోసమై- సీత తోడ అనుగు భ్రాత తోడ / విశ్వమయుడు ప్రభువు వేంచేసియున్నాడు- రాముండగుచు త్యారరాజు నింట' అంటారు కవి కరుణశ్ర్రీ! నిజానికి ఆ రామచంద్రుడు లౌకికమైన చీకాకులకు అలసి రవ్వంత సాంత్వనకై తపించే మనలోని ఆత్మారాముడికి ప్రతీక. 'ఇంద్రియ జ్ఞానానికి, ఆత్మానందానికి మధ్య స్థానాన్ని సంగీతం ఆక్రమిస్తుంది' అంటారు ప్రముఖ  ఆంగ్లకవి బ్రౌనింగ్. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ  'లోచెవి' కలిగిన సంగీత సాహిత్యశాస్త్రవేత్త కాగలిగేది. త్యాగరాజస్వామి అంతటి అదృష్టవంతుడు. ఆ స్వామి తెలుగువాడు కావడం తెలుగువాడి అదృష్టం. స్వామి 'తన్మయ సమాది' నుంచి తన్నుకువచ్చిన సంగీత ఝరిని దోసిళ్లకు పట్టి శిష్యులు స్వరసాహిత్యంగా పదిలపరచని పక్షంలో జాతికి ఈ మాత్రమైనా 'సుస్వర గంగ' సంప్రాప్తమైవుండేదా? ఎనభై ఐదేళ్లు అఖండంగా వెలిగిన ఆ త్యాగరాగజ్యోతి ఈ బహుళ పంచమి నాటికి 'నచ పునారావర్తి' పదవిని అలంకరించి 173 ఏళ్లు
(2020 నాటికి). ప్రతీ ఏటా జరుపుకునే త్యాగరాజ సంగీత ఉత్సవాలు వాస్తవానికి స్వర,సాహిత్యాలు రెండింటికీ జరిగే మహోత్సవాలు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయం 15 -12 -2012)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...