Saturday, August 29, 2015

మనమూ-మన తెలుగూ -శ్రీ తోట భావనారాయణ

               ఆగష్టు 29- తెలుగు భాషాదినోత్సవం- సందర్భంగా 
సమాజం వాడుతున్న భాషను ప్రజామాధ్యమాలు ప్రతిబింబించాలి. కానీ ఆచరణలో అది ఎంతవరకు నిజమవుతున్నదన్నదే ప్రశ్న. గ్రాంధికం నుంచి వ్యావహారిక భాషలోకి పత్రికలను నడిపించిన వారి కృషి ఒక దశలో ఆగిపోయింది. తొలినాళ్ళలో కనిపించిన స్ఫూర్తి ఆ తరువాత సన్నగిల్లింది. వేగంగా సృష్టించే సాహిత్యం’అని అభివర్ణించుకుంటూ పత్రికా రచయితలు ఆ వేగంలో ఇంగ్లీషు యథాతథంగా  ఉపయోగించటమో, సంస్కృత పదబంధాలతో సరిపెట్టడమో కొనసాగించారు. అదే సంప్రదాయాన్ని టీవీ మరింత ముందుకు నడిపించింది. కాకపోతే సంస్కృతం స్థానంలో ఇంగ్లీషు వచ్చి పడింది. సరికొత్త యాసతో టీవీ తనవంతు సేవగా భాషను కొత్తదారి పట్టించింది.  మరో వైపు సినీ రచయితలు  చేసే  నీ యెంకమ్మా ,  బాక్సు బద్దలయింది , ఇరగదీశాడు’ లాంటి ప్రయోగాలే తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్నాయని ఆనందించాల్సిన దయనీయ పరిస్థితి వచ్చిపడింది.  తెలుగు సినిమా ఒకసారి వాడిపడేస్తే వాటికి మరింత ప్రచారం చేయడానికి టీవీలు ఉబలాటపడుతున్నాయి. ఈ గందరగోళం మధ్య తెలుగుభాషాపరిరక్షకుల ఆవేదన ఎవరికీ వినపడటం లేదు.

తొలి తెలుగు భాషా దార్శనికుడు గిడుగు రామమూర్తి, ఆ తరువాత తాపీ ధర్మారావు నాయుడు వేసిన తొలి అడుగులలో నడక ఎంతో వేగంగా, అంకితభావంతో ముందుకు సాగింది.  కానీ ఆ వేగం ఎక్కువకాలం కొనసాగలేదు. సంపూర్ణవ్యావహారికం వైపు నడవకుండా ఇంగ్లీషు పదాలను అనువదించాల్సిన ప్రతిసందర్భంలోనూ సంస్కృతాన్ని ఆశ్రయించటంతో అసలు సమస్య వచ్చిపడింది. తెలుగు అందవిహీనంగానూ, సంస్కృతం అందంగానూ కనిపించేలా చేశారు. నగలు అని రాయటం నామోషీ అయింది. ఆభరణాలు అందంగా కనిపించాయి. దొంగతనం’ కంటే చౌర్యం’ బాగా ఆకట్టుకుంది. చనిపోవటం’ కంటే మృతి చెందటం’  గౌరవప్రదంగా కనిపించింది.  బడి లాంటి తెలుగు పదం  వదిలేసి స్కూలు పరిచయం చేశాక ఇప్పుడు ఇంగ్లీషు వద్దంటూ పాఠశాల వాడవలసిందిగా  ఉచిత సలహా ఇస్తున్నారు. కృతకమైన భాషను ఇంతకాలంగా జనం మీద రుద్దిన పత్రికలే ఇప్పుడు తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాయి. తెలుగు భాషను రక్షించటమంటే సంస్కృతాన్ని బలవంతంగా నేర్పటమా ? డ్రిప్ ఇరిగేషన్ ను తెలుగు చేశామంటూ చెప్పుకుంటున్న బిందు సేద్యం లో తెలుగెంత ? పశ్చిమ గోదావరి కి ఆనాడే పడమటి గోదావరి అని పేరు పెట్టి ఉంటే ఎంత హాయిగా ఉండేది ! ఇప్పుడు పచ్చిమ గోదావరి అని ఉచ్చరించే పరిస్థితి వచ్చేది కాదు కదా ?  చీడపీడలు సోకినట్టు చెప్పాలంటే చీడపీడలు ఆశించాయి అని రాస్తాం, రేడియోల్లో చెబుతాం. వడుగు అనే తెలుగు పదం కంటే ఉపనయనం’ మనకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది.
నిరుడు లాంటి తెలుగు పదం ఉండగా గత సంవత్సరం అనే పదమే వాడుతున్నాం. కొంతమంది గతేడాది లాంటి తప్పుడు ప్రయోగాలు చేస్తున్నా పత్రికలు అలాగే ప్రచురిస్తున్నాయి. భాషమీద జరిగిన ఒక సదస్సులో నేను నిరుడు’ గురించి  ప్రస్తావిస్తే ఒక పెద్దమనిషి సరికొత్త వాదన లేవనెత్తారు. జర్నలిస్టులకోసం పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వేసే ఆయనగారి వాదన ఏంటంటే, నిరుడు అనటానికి బదులు పొరపాటున నీరడి అనే ప్రమాదం ఉందనీ, తెలంగాణ ప్రాంతంలో అది ఒక కుల వృత్తిని ఎత్తి చూపినట్లవుతుందనీ అందువలన నిరుడు వాడకపోవటమే మంచిదని. సంస్కృత పదబంధాలతో సమాసభూయిష్టంగా ఉండేదే అసలైన తెలుగు అని ప్రవచించే పండితమ్మన్యులైన వైతండికులకు ఎవరైనా ఏం చెప్పగలరు ?  తామే శిష్టులమనీ, ఆర్యులమనీ చెప్పుకునే వారే శిష్ట వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు, ఆర్యుల దోషంబు గ్రాహ్యంబు అని పదే పదే గుర్తుచేస్తూ భాష భూమార్గం పట్టకూడదని పనిగట్టుకుని ప్రచారం చేస్తుంటే అచ్చ తెలుగు  బతికి బట్టకట్టగలుగుతుందా ?  తెలుగు భాషాపరిరక్షణకు నడుం బిగించిన వారు ఎంతమంది ఎంత మేరకు తెలుగు వాడుతున్నారో (సమానమైన తెలుగు పదాలు ఉన్నప్పుడు) ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయమిది.
కొత్త పదాలకు… ముఖ్యంగా  ఇంగ్లీషు పదాలకు సమానమైన తెలుగు పదాలను సృష్టించటం గురించి ఎప్పుడు చర్చ జరిగినా తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని పదే పదే చెబుతుంటారు. తమిళుల భాషాభిమానాన్ని గుర్తుచేసుకుంటారు. తెలుగు భాషాదినోత్సవాలు జరుపుకునే ఇలాంటి సందర్భాలలో ఇది మరీ ఎక్కువ. అయితే వాళ్ళకున్న చిత్త శుద్ధి మనకుందా ? అంతకంటే ముఖ్యంగా, వాళ్ళకున్నంత ధైర్యం మనకుందా ? విప్ ను కొరడా అని అనువదించుకోగలిగిన చొరవ మనకుందా ?  ఇంగ్లీషు పదాలే కాదు, హిందీ, సంస్కృత పదాలు సైతం దరిజేరనివ్వకుండా  ఎప్పటికప్పుడు కొత్త పదాలకు తమిళ పదాలు తయారుచేసుకోవడం వాళ్ళ అలవాటు. మనకు భేషజాలు ఎక్కువ. స్వైన్ ఫ్లూ’  ను యథాతథంగా వాడుకోగలిగేంత విశాలహృదయం మనది. వాళ్ళు నిర్మొహమాటంగా పన్రి కాయ్‌చ్చల్ ( పంది జ్వరం ) అని మార్చుకున్నారు. బర్డ్ ఫ్లూ ను పరవై కాయ్‍చ్చల్ ( పక్షి జ్వరం ) చేసుకున్నారు. వింటేనే మనకు నవ్వొస్తుంది. మనవాళ్ళు అలాంటి అనువాదం చేస్తే ఎంతమంది ఎగతాళి (క్షమించాలి… మన పత్రికల భాషలో అపహాస్యం’ అని వాడి తీరాల్సిందే !) చేస్తారో తెలియని విషయమేమీ కాదు. మనం హంగ్ అసెంబ్లీ’ అని రాస్తూ ఒక్క క్షణమైనా తెలుగులో ఆలోచించే ప్రయత్నం చేయం. తమిళంలో తొంగు శట్టసబై’ ( వేలాడే చట్టసభ ) అని అనువదించుకున్నారు. ఎప్పుడో నార్ల వెంకటేశ్వర రావు గారు డ్రెడ్జర్ అనే పదాన్ని అక్కడి జాలర్ల భాషలో తవ్వోడ గా అనువదించారని ఇప్పటికీ వల్లె వేసుకోవటం మినహా మనం నిర్మించుకున్న పదాలు ఎన్ని ? అనువదించుకున్నవెన్ని ?

కొత్త మాటలూ, అనువాదాల ప్రస్తావన కాసేపు పక్కనబెడితే, భాష వాడుక మీద ఎలాంటి పట్టింపులూ లేకపోవటం బాగా పెరిగిపోతోంది. రాసే పద్ధతి మీదా, మాట్లాడే పద్ధతి మీదా పట్టు కోల్పోతున్నాం. పైగా,  ప్రవాహం లాంటి భాషకు కట్టుబాట్లు ఉండాలనుకోవటం మంచిది కాదనేది కొందరి వాదన. అంతమాత్రాన గతేడాది లాంటి ప్రయోగాలు యధేచ్చగా చేస్తుంటే చూసీ చూడనట్లు వదిలేయటమే మంచిదా ? మొత్తానికి తెలుగు అక్షరాలే రాస్తున్నందుకు సంతోషించటమే మంచిదంటారా ? ఆశావహం అనే పదం నుంచి ఆశావహులు అనే అపప్రయోగాన్ని పత్రికలు వాడుకలోకి తెచ్చినప్పుడు పత్రికా సంపాదకులు దిద్దవలసిన అవసరం లేదా ?  తెలుగు సంపాదకులు కొత్త పదాలమీద కలిసి చర్చించిన సందర్భాలు  దాదాపు లేనట్టె. ఫ్లై ఓవర్ ను పైదారి అనవచ్చునని సూచించటమే తప్ప ఎవరైనా వాడుతున్నారా ?
టీవీ వచ్చిన తరువాత రాసే భాషతో బాటు మాట్లాడే భాషను కూడా కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. టీవీకోసం రాసేవాళ్ళు మనం అలాగే మాట్లాడతామా అనే విషయం ఒక్క క్షణం ఆలోచించినా చక్కటి రచన తయారవుతుంది. సుబ్బారావుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు లాంటి వాక్యాలు చాలా సహజంగా టీవీలలో వినిపిస్తుంటాయి. నిజానికి పత్రికలవాళ్ళు ఇలాగే రాస్తారు. కానీ టీవీకోసం  సుబ్బారావు మీద ఎస్పీ కోప్పడ్డారు అని రాయవచ్చు. ఈ రెండు వాక్యాలు గమనిస్తే ఏది మాట్లాడే భాషకు దగ్గరగా ఉందో, ఏది వినడానికి సులభంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఎన్ని ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే అంత గొప్ప. ఎంత ఇంగ్లీషు యాస వుంటే అంత బాగా ఆకట్టుకోగలమని నమ్మకం. రేటింగ్స్ ద్వారా లాభం పొందాలనుకునే టీవీలు ఇంగ్లీషు ఎక్కువగా వాడుతున్నాయి. పైగా జనం భాషలో ఎక్కువగా ఇంగ్లీషు పదాలు దొర్లుతున్నప్పుడు ఇంగ్లీషు వాడకం గురించి టీవీలను విమర్శించడం కంటే వాక్య నిర్మాణంలో లోపాలను ప్రస్తావించడం మంచిది. వాడుక భాష ఎంత సరళంగా ఉండాలో టీవీలకు నేర్పాలి. వాడుక మీద పట్టు కోల్పోతే భాషకు మనుగడ ఉండదనే వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి.

ఇదంతా ఒక వంతయితే ఇప్పుడు జనం మాట్లాడే భాష అంతా పత్రికలు నేర్పిన భాషే ! జనం భాషను తీసుకొని అదే భాషలో వార్తలు అందించాల్సిన పత్రికలు అందుకు విరుద్ధంగా వాటి భాషను జనానికి నేర్పుతున్నాయి. గ్రామీణ ప్రజలు కూడా స్వచ్చమైన తెలుగు నుడికారం స్థానంలో కృతకమైన పత్రికాభాష మాట్లాడుతున్నారు. టీవీల వాళ్ళు మైకు పెడితే నాయకులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. భాష మీద ఏమాత్రం ప్రేమ లేకుండా నడుస్తున్న ప్రజామాధ్యమాలు ఆత్మ పరిశీలనతో ధోరణి మార్చుకుంటే తప్ప మంచి తెలుగు ను రక్షించుకోవటం సాధ్యం కాదు***
***
                              శ్రీ తోట భావనారాయణ 

శ్రీ తోట భావనారాయణ గారిని పరిచయం చేసేటంత ఘనుడిని కాదు గానీ విధాయకం గనుక నాకు వారితో కలిగిన చిరు పరిచయాన్ని గురించి ఒక్క ముక్క చెబుతాను.ఈ బ్లాగు ప్రపంచం లోకి నేను అడుగు పెట్టిన మొదటి రోజుల్లో అనుకోకుండా ఒకసారి నా అదృష్టం  కొద్ది  http://bhavanarayana.co.tv/ బ్లాగు చూడటం జరిగింది. అప్పటినుంచి నేను వారికి వీరాభిమానిగా మారిపోయిన నిజం నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాను. వీరి బ్లాగ్ లోని ఒక్కక్క టపా ఒక సీమటపాకాయ...చిచ్చుబుడ్డి... మతాబు ... వెరసి తోట వారి  బ్లాగు మొత్తం ఒక నిప్పుల పొట్లం. ఈ దీపావళి సరుకు నుంచి ఒక్క తెలుగు మతాబు తీసుకుని నా బ్లాగునీ వెలిగించుకుంటానంటే వెంటనే వప్పుకున్నందుకు తోట భావనారాయణ గారికి శత కోటి వందనాలు.నేటి మన తెలుగు భాష తీరు మీద ఇంత చక్కటి వ్యాసం రాసినందుకు అభినందనలు .కృతజ్ఞతలు.మీకూ నాకు లాగా ఈ వ్యాసం నచ్చితే వారికే నేరుగా మీ స్పందన నందించినా ఆనందమే.మరొక సారి వారి బ్లాగు చిరునామా http://bhavanarayana.co.tv/
                          -శ్రీ తోట భావనారాయణగారికి 
కృతజ్ఞతలతో
-కర్లపాలెం హనుమంతరావు

Friday, August 28, 2015

అమ్మ- నాన్న

మనం భూమ్మీద పడకముందే భగవంతుడు మనకోసం రెండు అవతారాలు ఎత్తి సిద్ధంగా ఉంటాడుట! ఒక అవతారం అమ్మ అయితే.. రెండో అవతారం నాన్న.
అమ్మ జోలపాట. నాన్న నీతికథ. వెరసి ఇద్దరూ కలసి ఓ పెద్దబాలశిక్ష. కన్నవారి ప్రేమ ఊటబావిలోని నీటిచెలమట. బిడ్డ బతుకును ఎప్పుడూ అది పొడారిపోకుండా కాపాడుతుందని ఒక అరబ్బీ కవి ఎంత ఆర్ద్రంగా చెప్పాడో! తల్లిదండ్రుల ప్రేమలోని మాధుర్యానికి ద్రాక్ష అవమానంతో నలబడిందని, కలకండ అసూయతో గట్టిబడిందని, అమృతం చిన్నబోయి స్వర్గానికి పారిపోయిందని మరో సంస్కృత కవి చమత్కారం.
భూమ్మీద పడ్డ ఓంప్రధంలోనే బిడ్డ కంటబడేది తల్లి రూపం. ఓనామాలకన్నా ముందు పలికేది 'అమ్మ' పదం. ఆ అమ్మ చూపించే నాన్నే బిడ్డకు అన్నీ అవుతాడు. 'నాన్నా' అన్న పిలుపులోనే రెండు 'నా'లు దాగున్నాయి కదా!
అమ్మ ఒడి గుడి అయితే.. నాన్న ఒడి చదువుల బడి. బిడ్డ ఎదగడానికి ముందుగా కొలమానంగా భావించేది కంటిముందున్న అమ్మానాన్నల వ్యక్తిత్వాలనే!
సంతాన సౌభాగ్యంకోసం యవ్వనకాలాన్నంతా సంతోషంగా కారాగారంలో వృథాచేసుకొన్న దేవకీ వసుదేవుల కథ మనకు తెలుసు. కాకిపిల్ల కాకికి ముద్దు. గాంధారీ ధృతరాష్ట్రుల్లా బిడ్డల్ని గుడ్డిగా ప్రేమించడమే  కన్నవారికి తెలిసిన వాత్సల్య విద్య. బొజ్జగణపయ్యను చూసి నవ్వాపుకోలేనందుకేగదా చందమామమీద పార్వతమ్మంత లావు చిందులేసింది! పుత్రవియోగం తట్టుకోలేకేగదా దశరథ మహారాజంత దయనీయంగా ప్రాణాలు విడిచింది! బిడ్డకోసం ఆ బిడ్డనే మూపునేసుకొని కదనరంగానికి తరలివెళ్ళింది ఝాన్సీమాత. లోకం, కాలం ఏదైనా సరే తల్లిదండ్రుల లోకంమాత్రం బిడ్డచుట్టూతానే ప్రదక్షిణాలు చేస్తంటుంది. ఈ ప్రేమాకర్షణసూత్రం ఏ విజ్ఞానశాస్త్రానికి అంతుచిక్కని   విచిత్రం.
కన్నవారంటే అంతే మరి! తము కన్నవారు తమకన్నా గొప్పవారు కావాలని పగలుకూడా కలలు కనేవారు! స్వీయప్రాణాలను సైతం సొంతబిడ్డలకోసం తృణప్రాయంగా సమర్పించేందుకు సదా సర్వసిద్ధంగా ఉండే పరమత్యాగుల వరసలో ముందుండే వారు. పిల్లకాయలంటే తల్లిదండ్రులకు కంటిముందు తిరిగే గుండెకాయలు కదూ! బిడ్డలకోసం గాలిమేడలు కట్టడమే కాదు! క్రమం తప్పకుండా వాటి దుమ్మూ ధూళీకూడా దులిపే పనిలో ఉంటారు తల్లిదండ్రులు.మనమూ అమ్మానాన్నలమైతేగాని మన అమ్మానాన్నల మనసఏమిటో మనకు అర్థం కాదు.
ఎన్ని తరాలైనా మారనీ.. ఎంత ప్రగతిపథాన అయినా సాగనీ,, '' అంటే 'అమ్మ' అనే అర్థం మారరాదని.. 'నా' కన్నా ముందు 'నాన్నే' గుర్తుకు రావాలని అందుకే పెద్దలు సుద్దులు చెప్పేది.
అమ్మ దీవెన లేనిదే ఏ పని జయప్రదం కానేకాదని, నాన్న చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని నడిచినప్పటి చిన్ని పాదాలే ..ఎదిగిన పిదపా..  నాన్న అడుగుజాడలకు ఎడంగా జరగి పోరాదని తెలుసుకొంటే చాలు బిడ్డ బతుకంతా భద్రం.. బంగారం!
అమ్మ పేగు ఇస్తే నాన్న పేరు ఇస్తాడు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మంచిపేరు తెస్తాడని ఆశించడంలో  అత్యాశ ఏముంటుంది?! అడిగినా  అన్నీ సమకూరని ఈ వ్యాపారప్రపంచంలో అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మనాన్నలను మించిన పిచ్చివాళ్ళు ఎవరుంటారు!  నిజమే! బిడ్డమీది పిచ్చిప్రేమే వాళ్లనలా ప్రేమపిచ్చివాళ్లను చేసిందని తెలుసుకోవడంలోనే ఉంది వాత్సల్య రహస్యం.
మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు, డబ్బులు లేనప్పుడు బంధువులు, శక్తి తగ్గినప్పుడు సంతానం చులకన చేయవచ్చేమోగాని.. ఉన్నప్పుడూ లేనప్పుడూ ఒక్కలాగే ఉండేవాళ్లు మాత్రం జన్మనిచ్చిన తల్లిదండ్రులే! హిమాలయాలు దేశానికి ఉత్తరానే ఉన్నాయి. వాటినిమించిన ఉన్నత ప్రేమాలయాలు ప్రతీ ఇంటా అమ్మానాన్నల రూపంలో ఉంటాయి. అమ్మానాన్నల అనురాగం అరేబియా సముద్రంకన్నా వెడల్పైనది. బంగాళాఖాతంకన్నా లోతైనది. హిందూమహాసముద్రం వారి ప్రేమసింధువుముందు పిల్లకాలువ!
ఈ గజిబిజి జీవితంనుంచి ఎప్పుడైనా విరామం దొరకబుచ్చుకొని జన్మనిచ్చిన ఊరికి వెళ్ళినప్పుడు కోతికొమ్మచ్చులు, దాగుడుమూతలు ఆడుకొన్న ఆ ఇంటిముందు ఆరుబయలు వంటరిగా ఓ మంచంమీద పడుకొని ఆకాశంవంక తేరిపారజూడు! అమ్మ చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తూ నిన్ను మురిపించేందుకు 'రా రమ్మ'ని పిలిచిన చందమామ దోస్తునొకసారి పలకరించు! మీ అమ్మ నీకోసం ఎన్ని కమ్మని కథలు కల్పించి చెబుతుండేదో గుర్తుచేస్తాడు! ఆ వెన్నెల్లో మీ నాన్న నిన్ను తన మోకాలి గుర్రంమీద సవారీ చేయిస్తూ ఎన్నెన్ని సరదా కబుర్లు చెప్పేవాడో నెమరు వేయిస్తాడు. అయినదానికీ కానిదానికీ మీ అమ్మ నీకు తీసే దిష్టి, కానిదానికీ అయినదానికీ మీ నాన్న నీకోసం పడే హడావుడి..  మళ్లా గుర్తుకొస్తే నీ కళ్లు చెమర్చకుండా ఉండవు!
అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు బుడిబుడి అడుగులు వేసే  ఓ పాపాయి. ఆ పాపాయి బుడిబుడి నడకలతో బైటికి పోకుండా తన కొంగు చివరకి ముడి వేసుకొని పనిపాటలు చూసుకొనేది అమ్మ.
పాపాయి ఎదుగుతున్నాడు. కిటికీగుండా బైట కనిపించే కొండా కోనా, చెటూ పుట్టా.. పాపాయిని రారమ్మని బులిపిస్తున్నాయి! పాపాయికేమో.. పాపం..  తల్లికొంగు బంధమాయ!
ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది. ఆకాశంలో ఏడురంగుల ఇంద్రధనుసు విరిసింది. పాపాయిని అదే పనిగా అందుకొమ్మని.. ఆడుకొందాం రమ్మని.. ఆగకుండా ఆహ్వానిస్తున్నది. తల్లి గాఢనిద్రలో ఉంది.  అదను చూసి చాకుతో చీరకొంగు కోసి.. గడప దాటి..  గబగబా కొండకొమ్ముకేసి ఎగబాకుడు మొదలుపెట్టాడు బుడతడు. ఇంద్రచాపం ఎక్కి   జారుడుబండాటాడాలని  బుడతడి కంగారు. ఆ తొందరలో పాచిబండమీద కాలు జారాడు.  భయంతో 'అమ్మా! అమ్మా!' అని అరుపు. లోయలోకి జారిపడే చివరి క్షణంలో ఠకాలుమని ఆడ్డుపడి ఆపేసింది.. రెండుబండలమధ్య ఇరుక్కున్న అమ్మకట్టిన లావాటి కొంగుముడి! దూరంనుంచి పరుగెత్తుకొస్తున్న అమ్మను చూసి 'హమ్మయ్య' అనుకొన్నాడు బుడతడు!
నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు అదే బుడతడు మరికాస్త ఎదిగిన తరువాత. 'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాదు హఠాత్తుగా!
'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా!  నాకు సైకిలు కొనివ్వచ్చుగా!  రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న. 'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉంది. ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగుపడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా. 'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.
చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు. ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'
ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా నాన్నలకు నిండుమనసుతో రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు ఆ క్షణంలో. ఒక చేత్తో అమ్మకు.. మరో చేత్తో నాన్నకు!
'పేరెంట్స్ నీడ్ అవర్ ప్రెజన్స్.. నాట్ అవర్ ప్రెజెంట్స్!' అన్నాడు ఆంగ్లంలో ఓ కవి. ప్రపంచంమొత్తం ఏడాదిలో ఓ రోజు( జులై నెల నాలుగో ఆదివారం) తల్లిదండ్రులను తలుచుకొంటుంది.  ఏడాదిమొత్తం పన్నెండు నెలలూ రోజూ ఇరవైనాలుగ్గంటలపాటు గడియ గడియకు జన్మదాతలను..
బతికుంటే బాగా చూసుకోవడం.. పైనవుంటే ప్రేమగా స్మరించుకోవడం  భారతీయుల కుటుంబ సంస్కృతి. తరాలు మారినా ఆ సంస్కారంలో తరుగుదల రాకుంటేనే ప్రతి చిరంజీవికి శుభం.. లాభం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(జులై 26, 2009 నాటి ఈనాడు సంపాదక పుటలో ప్రచురితం)



Wednesday, August 26, 2015

'ఛీర్' కొడదామా? 'ఛీఁ!' కొడదామా? ఓ సరదా గల్పిక



 'ఛీ!' కొడదామా? 'చీర్' కొడదామా? 
( ఈనాడు - ప్రచురితం ) 
*

గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి గుండ్రంగా తిరుగుతున్నదని  కనుగొన్నాడు .

కథలు చెప్పేవాళ్లందరూ తాగుబోతులని  చెప్పలేం.కానీ.. తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటి ఇల్లాలుకి కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత సృజనాత్మకత సాధ్యం కాదు.

మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందీ  కాదు. రామాయణకాలంలో- సీతమ్మవారి అన్వేషణలో   ఆంజనేయుడు లంకలో ముందుగా చూసింది  ఆరగా ఆరగా ద్రాక్షారసాలు సేవించే రాక్షసులనే ! 

భారతం మార్క్  కీచకుడుకి మగువల మీద కన్న మధ్యపానం మీద మక్కువ ఎక్కువ . 

ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా నేటి సారాయి!

మందులో ఏముందనీ  గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు చెప్పగలిగిందీ?  అజంతా హరప్పా శిథిలాలు తవ్వినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తప్ప తాగి పారేసిన చట్లూ పిడతలేని వినికిడి. 

నిప్పు కనిపెట్టక ముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకుఎల్లా  తట్టుకొని నిలబడ్డాడంటారూ? అంతా యిప్పసారా మహత్తు. యుద్దసమయాల్లో ఏనుగులకీ  బాగా మద్యం పట్టించి శత్రుసైన్యం మీదకు ఉసిగొల్పేవారని  'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి మహానుభావుడే రాసినప్పుడు..  'రా' పనికిరాదంటే కుదురే పనేనా!

కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునీశ్వరులు  మధుపానానికి శాస్త్రాలు రాయలేదంటే నమ్మలేం! తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు బైటపడక మానవు. 

మౌర్యులకాలంలోనే మనవాళ్ళు 'అంగుళం' కనిపెట్టారట! ఎందుకట ? లోటాలో మందు కొలతలు చూసుకొనేందుకుగాక మరి దేనికట ! 

‘చంద్రయాన్’ మిషన్ ఇంజన్లో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో  కొట్టించి వదిలుంటే.. సముద్రంలో పడే బదులు ఇంచక్కా చందమామ చూట్టూ చక్కర్లు కొట్టొచ్చుండేది.

దేవుడుకూడా ఆదాము అవ్వల్ని ఆపిల్ ముట్టద్దన్నాడుగాని.. మందు జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టలేదు కదా! మరెందుకు అందరూ ఈ మందును ఆడిపోసుకొందురు? 

 ఒత్తిడినుంచి ఉపశమనం పొందే గమ్మత్తు ఉపాయం ఈ మత్తిచ్చే మందు. శతాబ్దాల కిందట మనోళ్లు  మేధస్సును మధించి మరీ  సాధించిందీ  మధిర. అష్టాంగమార్గాల్లో ఆఖరి మెట్టు  'సమాధి' అంటే ఫుల్లుగా ‘రా’ కొట్టి చల్లంగా పడుంటమే! మందుగుండు కనుక్కొన్నది చైనానే కావచ్చుకానీ.. 'మందు' కనుక్కొంది  మాత్రం ఖచ్చితంగా  మన హిందూ దేశమే!
‘సారే జహాఁసే అచ్ఛా !.. సారా భారత్ మహాన్!’
***
మనోడికి మరీ మందెక్కువైంది . పీకెల్దాకా తాగినోడు మరి..  కన్యాశుల్కం బైరాగికే   క్లాసు పీకేస్తాడు చూడు ! చీపులిక్కరుకు అలవాటుపడ్డ నాలిక్కదా! అందుకే  అక్కరకురాని ‘మద్యా’క్కరలు ఏకరువు పెట్టేస్తోంది . ముందు ముందు దగ్గుక్కూడా పెగ్గే మంచి మందని ఎంత స్సిగ్గుగా వాదిస్తాడో .. ఓపికుంటే ఓ చుక్కేసి వినచ్చు మరి !

‘నూటికి ఇరవై ప్రమాదాలు తాగుబోతులవల్లే’ అని లెక్కలు చెబుతుంటే 'మిగతా ఎనభయ్యీ తాక్కపోవడం వల్లే భయ్యా  ! అని అడ్డంగా  వాదించే తాగుబోతుని ఏమనాలి! భూమ్మీదపడ్డ బిడ్డ గుక్కపెట్టేది  ఆ గుక్కెడు ‘చుక్క’కోసమే అని కూసే ఇల్లాంటి  తాగుబోతుల వాగుళ్ల వల్లే  ఇల్లూ వళ్లూ గుల్లయేది అని  ఇల్లాళ్లు ఘొల్లుమనేది.

దేశాన్నిలాగే మందుకు వదిలేస్తే పదమూడేళ్ల పిల్లాడుకూడా 'పద! మూడు బాగా లేదు! ఏదైనా బారుకెళదాం!' అనే రోజు రేపే వస్తుంది . బారుకి ఏజ్ బారు ఎత్తేసే మంచిరోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది. 

మందుల షాపులకు మించి  మందుషాపుల పెంచితే  ఎంత ప్రమాదం ? ! ఇండియానాలో చాటుగా పొగతాగినా కఠినదండన తప్పదు. ఇండియాలో బాహాటంగా తప్ప  తాగినా తప్పట్టేవాడు లేడు. 

ఏడాదికి ఈ   ముందు మీదయ్యే దుబారా  సొమ్ముతో నలభై లక్షల మందికి సలక్షణమైన డబుల్ బెడ్ రూములు కట్టించియ్యచ్చని ఒక అంచనా!

సర్కార్లే రాష్ట్రాలను 'రా' కొట్టేవాళ్లకు రాసిచ్చేస్తుంటే మందు వ్యాపారానికి మాద్యం ఎందుకుంటుంది  .. చెప్పండి! 
గుడీ  . . బడీ అన్న తేడా కూడా లేదు. ఎడ పెడా  ఊరుకో బారు! పేటకో బెల్టు! 

ఆంధ్రా.. నైడెడ్.. నిజాం.. రాజకీయాల వరకే ! 'రా' రాజకీయాలకి  ప్రాంతం.. కులం.. మతం.. అడ్డంకులు కావు !  రెండు  తెలుగు రాష్ట్రాలను మందుపాతర్లగా మార్చేందుకు   పోటీ  ఎంత రసవత్తరంగా సాగుతోందో చూస్తూ ఉంటే  'చీర్' లీడర్లకి 'చీర్'   .. కాదు ...   'ఛీ!' కొట్టేద్దామనిపించదా  మరి ?! 

( 21-06-2010 నాటి 'ఈనాడు' సంపాదకీయ పుటలో ప్రచురితం)

Monday, August 24, 2015

ఒంటరులం కాలేం!- కవిత



1
అనుకుంటాం కానీ
ఎవరమూ
ఎన్నటికీ  ఒంటరులం కాము

2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది.

ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి-  నేలబడకుండా
నాన్న నీడ పహరా కాస్తుంది.

4
తోబుట్టువులనే తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనులా
ఎప్పటికీ సందడే!


5
నీ రాలి పడే నవ్వులకు
ఒడిపట్టి
వెంటబడే లోకమో!

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా
చెక్కిలి తడపకుండా!
తుడెచే చెలిమిహస్తం
చెంత ఉండనే ఉంది

7
చీకటిలో.. చింతలలో
వేకువలో.. వేడుకలో
అర్థభాగం
అద్దంముక్కలా
పక్కలోనో.. పక్కనో!

8
అమావాస్య నాటి
వెన్నెల ఊహలా
కన్నపిల్లల గోల!

9
చావుతో అంతా ఐపొయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం
భ్రమ!

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎన్నటికీ  ఒంటరులం కాము
కాలేం మిత్రమా!
***

-కర్లపాలెం హనుమంతరావు

తెలుగుతక్కువతనం- ఓ సరదా గల్పిక

రాళ్ళులేని బియ్యమైనా చౌకధరల దుకాణాల్లో దొరకటం తేలికేమోకానీ.. దొరలభాష దొర్లని తెలుగుపలుకులు వినటం దుర్లభంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల  శాసనసభల్లోనూ ఇదే దుస్థితి. 'అమ్మా' అని అమ్మభాషలో పిలిస్తే అమ్మయినా 'ఓయ్' అని పలికే పరిస్థితి లేదు ప్రస్తుతం. తెలుగు బోధించే ఉపాధ్యాయులకు సైతం తెలుగులో సంతకం చేయటం నామోషీ. రాజకీయ నినాదాలకు మినహా తెలుగు ఇప్పుడు ఆకాశవాణి సంస్కృత వార్తల్లాగా ఎవరికీ పట్టని గోడుగా మారింది ! ఎందుకిలా? !

సున్నా కనుక్కున్నది భారతీయుడే అయినా అరసున్నాని కనిపెట్టి మరీ  వాడుకున్నదిమాత్రం మన తెలుగువాడే !  మన 'అజంత భాష' తెలుగును బ్రౌనుదొర  ఎంతగా ప్రేమించాడు! తెలుగువాడికే ఎందుకో మొదటినుంచి పరాయితనం మీదంత పరమ మోజు!
ఆంధ్రులకోసం భారతాన్ని తెనుగిస్తున్నానన్న నన్నయ భట్టారకుడు ఆరంభంలోనే సంస్కృత శ్లోకంతో శ్రీకారం చుట్టాడు! ఆంధ్ర కేసరి, ఆంధ్రాస్కాటు, ఆంధ్ర హేస్, ఆంధ్రా దేవానందంటూ అస్తమానం పరాయితనంతోనే గుర్తింపు పొందాలన్న తాపత్రయమేందో తెలుగువాడికి.. ఖర్మ కాకపోతే!   
'ఆంధ్రత్వం తపస్సిద్ధి పుణ్యం' అన్నాడు అరవ పండితుడు అప్పయ్య దీక్షితులు. 'సుందర తెనుంగు' గా  తెలుగుకి  హారతి  పట్టాడు
తమిళ  భారతి. 'కన్నడం వచ్చుగదా! ఆముక్తమాల్యదను తెలుగులోనే రాయాలని ఎందుకనిపించిందయ్యా రాయలా!' అని అడిగితే 'నేను తెలుగు రాజును. నాది తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స కనక' అంటూ పలుకారణాలు వినిపించిన రాయలు పిచ్చివాడా?! అచ్చులతో అంతమయ్యే అపురూప పదసంపద తెలుగు సొంతం. డాంటే వంటి ఉద్దండపిండాలకేమో ఇది  'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'! తాటాకుపాలెం చంటాడికేమో ఇది 'వేస్టు'! ఆంగ్లంలో వర్ణక్రమాలు తప్పుల్లేకుండా చెప్పి కప్పులు కొట్టుకొచ్చే తెలుగుపిల్లలుకూడా  తెలుగుపత్రిక పుటలోని ఒక్క పేరాని  తప్పుల్లేకుండా గడగడా చదవమంటే మాత్రం  తడబడిపోతారు!

అమ్మఒడే బడి అంటారు. ఆ అమ్మకే  కమ్మని తెలుగు నూరారా పలకటం నామర్దా మారిపోయిన దుర్దశ ప్రస్తుతం  నడుస్తున్నది. 
'మా తెలుగుతల్లికి మెల్లెపూదండ' అంటూ పిల్లలకు  పాటలు నేర్పేందుకే గురువూ దొరకడం లేదు.  మన గుర్తు పూర్ణకుంభం,  మన పిట్ట పాలపిట్ట, మన ఆట క్రికెట్టు కాదు.. కబడ్డీ’ అని కన్నతండ్రికి తెలిస్తేనే కదా చిన్నబిడ్డకు నూరిపోసేది! ‘గొడుగు’ అంటే ఎండా కాలంలో వాడేదని .. ‘గిడుగు’ అంటే వానాకాలంలోవాడేదని గురువుకు తేడా తెలిసుంటేనే గదా శిష్యుడికి నేర్పగలిగేది! 'తెలుగు పలకటమే నేరమనే బడులకు భారీరుసుములు కట్టి మరీ ఎగబడే మన తల్లిదండ్రుల వేలంవెర్రిని ఏమని పిలుచుకోవాలి! నాణేలమీద ఆనాటి  కాలంలో  ఆంగ్లం, హిందీ, బెంగాలీ భాషలతోపాటు 'ఒక అణా' అని ఒక్కతెలుగులోనే రాసేవారు. నాలుగు వందల పదాల సాయంతోనే తెలుగింటి ఆచార వ్యవహారాలన్నింటిని స్పష్టంగా చెప్పుకోవచ్చని తాపీ ధర్మారావు గారు  ఏనాడో చెప్పుకొచ్చారు. ఆలకించే నాథుడేడీ!

గోరింటాకును ఆంగ్లంలో ఏమంటాం? గోరుముద్దలకు కాకియెంగిగిలికి ఆంగ్లంలో సమానార్థక పదాలున్నాయా? 'బుజ్జివెధవ'నే పిలుపులోని  మధురిమ చెడకుండా  మనం అస్తమానం నెత్తికెక్కించుకొని ఊరేగే  ఏ భాషలోకైనా  తర్జుమా చేసి చూపమనండి! మంగళంపల్లి బాలమురళైనా మంగళ హారతిని శుద్ద ఆంగ్లంలో పాడి తలూపించగలరా?

'విద్యనిగూడ విత్త'మని ఏనుగు లక్ష్మణకవి ఏ ముహూర్తంలో అన్నాడో గానీ- నేడు మనం విద్యనికూడా కేవలం విదేశీ విమానమెక్కే  నిచ్చెనగా మాత్రమే చూస్తున్నాం. తెలుగుగడ్డమీద ఒకబిడ్డ పుడితే భావి అమెరికాపౌరుడొకడు పెరిగినట్లే భావిస్తున్నాం!
ఓనమాల వర్ణమాలకు ఏనాడో పంగనామాలు పెట్టేసుకొన్నాం. ఏ మారుమూల చిన్నబడిలో చూసినా ఏబిసిడీలే మారుమోతే!  సరైన పరిజ్ఞానం,  శిక్షణలేని ఉపాధ్యాయులు ఆంగ్లపాఠాలను   తెలుగులిపిలో రాసి వినిపిస్తున్నారని వింటుంటే- గురజాడ మార్కు గిరీశం 'మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్' అన్న మాటే  అక్షరాఆ  నిజమనిపించడంలా!

తెలుగు ప్రాచీనభాషగా గుర్తింపుపొందినందుకు సంతోషమే! కానీ.. దాన్ని మరింత సరళం, అధునికం చేసి..  నేటి అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దకపోతే ముందుతరాలతో నిందపడేది మన తరమే! చిన్నతనంలోమాతృభాషలో విద్య నేర్పనందుకు ఔరంగజేబు చేత గురువు ముల్లాసాహెబు పడ్డ నిందవంటిదే ఆ నింద. ఆ నిందాభయమైనా నిద్రాణమైవున్న  ఆత్మగౌరవాన్ని తట్టిలేపి తెలుగుతక్కువదన్నాన్ని తరిమిగొడితే బాగుణ్ణు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సంపాదక పుటలో ప్రచురితం)

***

Sunday, August 23, 2015

భగవంతుడి వాణి- కవిత

కడుపు కోతకు ఆడపడుచును కాను
కాయకష్టం దోపిడీకి బడుగుజీవిని కాను
పడుపుకూటికి  ఆటవెలదిని కాను
పలక మోతకు బడిబుడతడిని కాను
బండబూతులకు  సబ్బండను కాను
చీదరింపులకు  శిఖండిని కాను
జాలిచూపులకు బికారిని కాను
వెక్కిరింతల కష్టానికి వికారిని కాను
చీత్కారింపుల సత్కారానికి ముంగాళ్ల ముసలిని కాను
ఆకలిశోకానికి ఆగర్భ దరిద్రుడినసలే కాను
అరణ్యరోదనకు అగ్రకులం దౌర్భాగ్యుణ్ని కాను
దమ్మిడీకి కొరగాని నిరుద్యోగిని కాను
అన్నివిధాలా అన్యాయమైన అన్నదాతను  కాను
మనుషుల అమానుషానికి బలైన గొడ్డూ గోదను కాను
రాళ్ళదెబ్బలు తినే పండ్లచెట్టునైనా కాను
మామూలు మనిషిని!

వ్యథార్థ జీవుల కష్టాలకు
కరిగి నీరవడమే కానీ
'ఛూ'మంత్రమేసే  శక్తిమంతుణ్ణి కాను
భగవంతుణ్ణి కాను!


భగవంతుడి వాణిః
 ఏవీ కాకపోతేనేమి మానవా!
అన్నీ అనుభవించే మంచి మనసున్న కవివి కావా!
నా మనసును మనుషుల మధ్య  చాటింపు వేయి .. చాలదా!
వద్దు దేవుడుగా పుట్టలేదన్న కలవరం
నా హృదయద్వారం దగ్గరుండటమే నీకు నేనిచ్చిన  వరం
దేవుడికీ.. దీనుడికీ  మధ్య నువ్వొక వారధివి
వ్యథార్థుల
 స్వరంగా మారితే

నీ అక్షరంతో సహా నువ్వే చిరంజీవివి!

-కర్లపాలెం హనుమంతరావు

ఏది ఉత్తమ కథానిక- సాహిత్య విమర్శ

ఆధునిక సాహిత్యంలో ఆబాలగోపాలాన్ని అమితంగా ఆకర్షిస్తున్న ప్రక్రియ 'కథానిక'. ప్రచురించే పత్రికల సంఖ్య గణనీయంగా పెరగడం, సర్క్యులేషనుకి ప్రధాన ఆకర్షణగా మారడం, పాఠకుల  రసానందానికి స్వల్పవ్యవథి సరిపోవడం.. కథానికల ప్రాథాన్యత పెరగడానికి గల అనేక కారణాలలో కొన్ని ముఖ్యమైనవి. లోతైన సాహిత్యాభినివేశంతో నిమిత్తం లేదు.  కేవలం తీవ్ర ఆవేశం, గాఢపరిశీలనాసక్తి ఉంటే చాలు..  సాహిత్యరంగ ప్రవేశం చేయడం కథానికద్వారా సులభం.
అక్షరాస్యులంతా కావ్యాలు, ప్రబంధాలే కోరుకోరు. సులభంగా అర్థమవుతూ, సత్వర మనసిక ఆనందానుభూతులకు దోహదం చేసే సాహిత్యానికే అత్యధికుల ఓటు. 
వారానికి కనీసం రెండు, మూడు ప్రచురణ అవుతున్నా వెలుగు చూడని కథానికలు పత్రికల  కార్యాలయాల్లో పేరుకుపోతూనే ఉన్నాయి! కథానికలకు ఆ స్థాయిలో పాఠకాభిమానం, రచయితల ఆదరణ ఉందీ కాలంలో. ఒక్క రాశిలోనే కాకుండా వాశిలోనూ తెలుగు కథానిక ఎన్నోరకాలుగానో వన్నెచిన్నలు పోవడం  ఆనందించదగ్గ పరిణామమే!
రోజువారీ జీవితంలోని తొడతొక్కిళ్ళనుంచి తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే వినోదప్రక్రియలు పుంఖానుపుంఖంగా పుట్టుకొస్తున్న ప్రస్తుత వ్యాపార వాతావరణంలోనూ కథానికకు అపూర్వ ఆదరణ లభిస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశమే! వాస్తవజీవితంలోని అనుభవాలను, అనుభూతులను విపులంగా విస్తారంగా చర్చించే వీలున్న 'నవల' ఓ వంక అంతే దూకుడుతో ముందుకుపోతున్నా.. ఉన్నంతలో సంక్షిప్తంగా సమగ్రతకు లోటు రాకుండా విషయ విశ్లేషణ చేసే 'కథానిక' వైపుకూ పాఠకుడు మొగ్గు చూపడానికి మరేమైనా ప్రత్యేక కారణాలున్నాయా?
కథానిక ప్రధానంగా ప్రజాసాహిత్యం. రచయుతదీ పాఠకుడిదీ ఒకే మేథోస్థాయి కావడం కథానికకు కలిసొచ్చే అంశం. కవిత్వంలోలాగా నియమ నిబంధనలేవీ  కథానిక నడకకు అడ్డం పడవు. చదివేకథ తనదో.. తన చుట్టూగల సమాజానిదో అనే భావం కథానిక కలిగించినంత బలంగా సాహిత్యంలోని మరే ఇతర ప్రక్రియా  కలిగించలేదు. ఎంత కల్పన అయినా కథ సామాజిక  సరిహద్దులు అతిక్రమించలేదు. సాగతీతలకు, ముక్కు చుట్టూ తిప్పి చూపించడాలకు, విశ్లేషణల మిషతో సుదీర్ఘచర్చలు సాగించడానికి   అవకాశం లేని స్థల, కాల పరిమితులు 'కథానిక'కు కలసివచ్చే బలమైన అంశాలు.
అశ్వహృదయం అవపోసన పట్టిన యోధుడికి పంచకళ్యాణి స్వారీ అంత  స్వారస్యంగా   ఉంటుంది మంచికథతో  ప్రయాణమంటే.
స్వల్పవ్యవధానంలోనే కల్పాంతజీవితాన్ని  ఆవిష్కరించే గొప్పశిల్పకథలకు మన తెలుగు గొడ్డుపోలేదు.  అందుబాటులో ఉన్న పరికరాలతోనే మనసులను అందలాల్లో ఊరేగించే అందమైన కథలకూ మనదగ్గర కరువు లేదు. కొండను అద్దంలో చూపించడమే కథానిక ఉత్కృష్ట లక్షణం  అనుకుంటే .. అ కళలో విశ్వస్థాయికి దీటుగా కలంనడిపిన తెలుగు కథకుల జాబితా అప్పటిలా  ఇప్పుడూ సశేషమే!
కథానికకు ఇంత ప్రత్యేకమైన స్థానం సాహిత్యంలో ఎందుకున్నట్లు? కుదింపు, మదింపు లక్షణాలవల్ల ఎన్నుకున్న అంశంమీదే ఏకాగ్రత నిలబడుతుంది. వేళకు ప్రయాణీకుణ్ణి రైలుకు అందించే జట్కాబండిగత్తర కథానికలోని ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. వట్టి వేగమేకాదు.. ఒడుదుడుకులేవీ లేకుంటేనే ఆ  ప్రయాణం ప్రాణానికి సుఖం. గోలీ పేలీ పేలకముందే పరుగందుకునే పందెం ఆటగాడి చురుకుతనం కథానిక ప్రతి పదం పుణికిపుచ్చుకోవాలి. ఎత్తుగడ, నడక, ముగింపులో చదరంగంతో పోలిక కథానికది. ఆసాంతం చదివిన పాఠకుడి మానాసికప్రపంచం కొలతల్లో సగుణాత్మకమైన మార్పు సాధించగలిగినప్పుడే కథానికకు సార్థకత చేకూరినట్లు.   మంచికథానిక మెదడుకు కళ్ళు మొలిపించాలి. మనసుకు కన్నీళ్ళు తెప్పించాలి.  సాధారణ జంతుజాలంతోనే వింత వింత విన్యాసాలు చేయించే సర్కస్ ప్రదర్శనలాంటిది కథానిక రచన. మామూలు పదాలే విచిత్ర భావాలుగా  కూడబలుక్కుని పాఠకుడి మానసంమీద చేసే రసదాడి కథానిక.
ఎడ్గార్ ఎలెన్ పో దృష్టిలో కథంటే- స్వీయభావనలను పాఠకుడి మదిలో ముద్రించేందుకు రచయిత ఎన్నుకునే సహజసంఘటనల సంక్షిప్త కల్పిత సన్నివేశ మాలిక. ఫ్రెంచి కథారచయిత గైడీ మొపాసాకు కథంటే- నీరవ మానవ జీవన అగాథల్లోకి దూకి అక్కడ జరిగే యుద్ధాలను ఉత్కంఠభరితంగా చిత్రించడం. మొపాసా దృష్తిలో కథానిక అంటే సమాజమనే అంశంమీద రాసుకున్న షార్తుహ్యాండ్ నోట్సు. సత్యాన్ని సూటిగా చెప్పడం మించిన మంచికథావిధానం మరొకటి లేదంటాడు రష్యన్ రచయిత చెకోవ్. అనుభవానికి రాని సంఘటనలకు దూరం పాటించడం చెకోవ్ నిజాయితీకి నిదర్శనం.  ముగింపు, బిగింపులమీదకన్నా జీవితంలోని కొత్తకోణాలని అనూహ్యరీతిలో ఆవిష్కరించడంలోనే చెకోవ్ కి ఆసక్తి జాస్తి. 'అప్రస్తుతమైనది ఏదీ కథలో ప్రస్తావించరాదు' అనే  ప్రసిధ్ధ సూక్తి చెకోవ్ దే! సహజ సుందర సరళ ప్రాకృతిక వర్ణనలు కథానిక ‘కళ’నెలా పెంచుతాయో నిరూపించిన కథకుడు చెకోవ్. మొదలూ చివరా ముందే రాసి మధ్యభాగమంతా వంతెనలా నిర్మించడమే మంచికథ శిల్పరహస్యమని  చెకోవ్ భావిస్తాడు. మామూలు మనుషుల మామూలు జీవితాలనుంచి యధాతథంగా ఎత్తిరాసినట్లుండే సంఘటనలు సైతం చెకోవ్ మేధోకొలిమిలో పడి నిప్పులు విరజిమ్ముతుంటాయి. చెకోవ్ ఒక్కో కథానిక ఎంతమంది కొత్తరచయితలను సృష్టించిందో లెక్కతేల్చడం కష్టం. మొపాసా చెకోవ్ కిమ్ ఆదర్శం అంటారు.  
మొపాసా మరో అభిమాని సోమర్ సెట్ మామ్. అనుకోని సంఘటనలు అతని కథావస్తువులు. నాటకీయత పాలు జాస్తి. వినోదమే ప్రధాన ఎజెండా. ఒక్క తత్వానికే కట్టుబడని మనస్తత్వం. మానవనైజం చుట్టూతానే మామ్ కథలు ప్రదక్షిణం చేస్తుంటాయి. సంప్రదాయంమీద తిరుగుబాటంటే  మొపాసాకమహాఇష్టం. 'మనిషంటే మంచి చెడుగుల సమ్మిశ్రితం. సమస్యకు పరిష్కారం చూపించడం  రచయిత బాధ్యత కాదు. ఉపదేశాలు ప్రవక్తల పని. సాహిత్యేతర ప్రయోజనలకోసం రాయడమంటే రచనను దుర్వినియోగం చేయడమే!' ఇవీ స్థూలంగా కథానికమీద మామ్ అభిప్రాయాలు. మన బుచ్చిబాబు 'ఉత్తమ పురుష' కథావిధానంమీద మామ్ ప్రభావమే ఉందని  విమర్శకులు అభిప్రాయ పడుతుంటారు.
పడమటిదేశాల్లో కథానిక ప్రక్రియమీద అమోఘమైన ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. సన్నివేశ చమత్కారం ప్రధానంగా 'పో' కథలు రాస్తే.. హెన్రీ జేమ్స్, హాథరన్ ఆంతరంగిక జగత్తుమీద ధ్యాస ఎక్కువ పెట్టి కథలు రాశారు. దేశీయ వాతావరణంమీద దృష్టి చెదరకుండా బ్రెట్ హార్టే కథలు రాస్తే.. భాషలో బిగువు చూపిస్తూనే నిరలంకార శైలిలో మంచికథలు సృష్టించిన మహానుభావుడు క్రేన్.  ఓ. హెన్రీ కథలు కొసమెరుపుకి పెట్టింది పేరు.

దేశాలమధ్య సాంస్కృతిక హద్దులు చెదిరిపోయిన నేటి నేపథ్యంలో.. కళాకారులు విశ్వవ్యాప్తంగా పరస్పరం ప్రభావితమయే వేగమూ అమితంగా పెరుగుతున్నది. తెలుగు కథానికకూ ఈ సూత్రం మినహాయింపు కాదు. పాలగుమ్మి, చలం, విశ్వనాథ,  బుచ్చిబాబు, కొకు, రావిశాస్త్రి, మధురాంతకం, చాగంటి, కాళీపట్నంవంటి కథావశిష్టులు ఒక తరాన్ని ఊపేస్తే.. ఖదీర్ బాబు, పతంజలి,  వేంపల్లి, తుమ్మేటి, సలీం, పెద్దింటి అశోక్ కుమార్ వంటివారు ఇప్పటి తరాన్ని    మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.
(ఏ తరంలోనైనా జాతిని ప్రభావితం చేసే సాహిత్యవేత్తల జాబితా సహజంగానే చాలా పెద్దదిగా ఉంటుంది. అందరి పేర్లు సోదహరణంగా ఉటంకించే  సమయం, సంధర్భం, స్థలం, కాలం, సావకాశం లేనికారణానే స్థాలీపులాక న్యాయంగా ఏ కొద్దిమందినో  స్మరించుకోవడం జరిగింది తప్ప.. మిగతా గొప్ప కథారచయితలను తక్కువచేసి చూపడంగా దయచేసి సహృదయ రచయితలు అపార్థం చేసుకోరాదని  మనవి)
కథలు ఎలా రాయాలి? అన్న విషయంలో  భిన్నాభిప్రాయాలెన్నైనా ఉండవచ్చుగానీ, 'ఎందుకు రాయాలీ?' అన్న విషయంలో మాత్రం ప్రజాపక్షం వహించే సాహిత్యవేత్తలందరిది ఒకే అభిప్రాయం.
చలం, కొడవటిగంటిలకు వాస్తవికతే కథకు ప్రధానం. గ్రీకుల కళాదృష్టికి దగ్గరి అభిప్రాయం ఇది. భారతీయుల కళాదృష్టికి కాస్తంత విభిన్నమైనది ఈ ధోరణి. అగోచరాన్ని ఆవిష్కరించడమే నిజమైన కళాప్రయోజనంగా భావించడం భారతీయుల కళాతత్వం. భూసారాన్ని గ్రహించి భూమినే అంటిపెట్టుకుని ఉన్నా చిటారుకొమ్మను చేరి పరిసరాలను పరిమళభరితం చేస్తేనే కదా  ఏ కుసుమాలకైనా బతుకు సార్థకం! కళకూడా కసుమ సమానమే మరి  భారతీయులకు భావనలో!
వినోదమే ప్రధానమనుకునే కథలు ఆట్టేకాలం నిలబడడం కష్టమే! రసానందానికి సంస్కారమూ జతకూడినప్పుడే 'కథ' కాలానికి ఎదురొడ్డి నిలబడగలిగేది. తొలినుంచీ తూర్పు వివిధ సంస్కృతులకు సంగమస్థానంగా వెలుగొందుతూ వస్తున్నది.  పాశ్చాత్యులకు లేని సమన్వయ దృష్టి అందుకే  ప్రాచ్యసాహిత్యానికి  అవసరమయింది. భారతీయసాహిత్యం ప్రారంభంనుంచి వైవిధ్యానికి ప్రతిబింబప్రాయంగానే ప్రకాసిస్తూ వస్తున్నది.  తెలుగు సాహిత్యంలో కథానిక హాలుని కాలంనుంచి  ఈ బహుముఖత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది.
మంచికి, అందానికీ మధ్య విరోదమేమీ లేదు కదా! తుక్కును బంగారంగా మార్చే విద్య వాస్తవికంగా ఉందో లేదో గానీ.. సాహిత్యప్రపంచానికి సంబంధించినంత వరకు ఆ రసవిద్య కచ్చితంగా ఉంది. కథలకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఈ రసవిద్యలో నైపుణ్యం ప్రదర్శించడమే!

రసానందమా? సమాజ శ్రేయస్సా? కథకుండవలసిన అంతిమ లక్ష్యం ఏది? అన్న వాదనే సహేతుకమైనది కాదు. కథానిక (ఆ మాటకొస్తే ఏ ఇతర సాహిత్య ప్రక్రియ అయినా సరే) నాలుగురాస్తాల కూడలి మధ్యలో నిలబడిన 'సైన్ బోర్డు' లాంటిది. ఫలకంమీది అక్షరాలు కొట్టొచ్చినట్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటేనే బాటసారులను దృష్టిని ఆకట్టుకునేది. ఫలకం ప్రయోజనం సిద్దించేది. ఫలకం అందంగా ఉందికదా అని.. పెకిలించుకొని తెచ్చి ఇంటిపెరట్లో నాటుకుంటానంటే?!
రసానందానికి సామాజిక హితానికి మధ్య వేసిన అందమైన బంధమే కథానిక( ఆ మాటకొస్తే  మరే ఇతర సాహిత్య రూపమయినా). సానలు తీరిన వజ్రం ఒక్కో కోణంనుంచి ఒక్కో రంగును వెదజల్లినట్లు చిత్రిక పట్టిన కథ ఒక్కో చదువరికి ఒక్కో విధమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఏతావాతా తేలేదేమంటే.. తాత్విక దర్శనం, నైతికావేశం, సొందర్యదృష్టినుంచి మళ్ళకుండా, దైనందిక జీవితమో, పరిసరాల పరిశీలనమో, ఔన్నత్యంకోసం చేసే పోరాటమో.. ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలనుంచి  నిజాయితీగా గ్రహించిన కథావస్తువును.. సంక్షిప్తీకరించో, యధాతధంగాకానీ, చిలవలు పలవులుగా పెంచో.. సరళంగా, సరసంగా, సహజంగా, సుందరంగా.. సమగ్రతకు లోటు లేకుండా.. సూటిగా, తేటగా, చమత్కారంగా ఎత్తుగడ, మధ్యనడక, ముగింపులు చెడకుండా ఎక్కడా ఉత్కంఠ సడలకుండా పాఠకులచేత చదివించి.. చివరికి కలకాలం నిలిచే రసానందం అందించగలిగితే.. అదే ఉత్తమ కథానిక!
-కర్లపాలెం హనుమంతరావు






మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...