Wednesday, February 17, 2016

గెలుపు పిలుపు- ఈనాడు ఆదివారం సంపాదకీయం


'గెలుపు ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమిదే ముందు గెలుపు' అని చైనా సూక్తి. ప్రతి విజయం వెనక ఓ ఓటమి చల్లని చూపు తప్పనిసరి.. బావి తవ్వేవాడి చేతికి మొదట మట్టే అంటుకున్నట్లు. శరీరం మినహా  మరే ఆధారమూలేని జీవజాలానికి పోరాటం, బతకి తీరాలనే ఆరాటం మినహా జయాపజయాలు పట్టవు. కష్టించి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడూ ఆత్మాహుతి చేసుకోదు.  మళ్ళీ చినుకుపడి చెరువు నిండేదాకా కప్ప మండుటెండయినా  బండమధ్యే రోజులు గడుపుతుందికానీ, గుండె పగిలి చావాలనుకోదు. శీతోష్ణాలు, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులు తరహానే గెలుపు ఓటములు!  రాయితో రాయిని కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పు రాజేయటంనుంచి  చంద్రమండలంమీది నీటిజాడలు ఆనవాలు పట్టిందాకా  అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి! అమ్మ కడుపులో పడ్డ మరుక్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్సు పరుగుపందెం ప్రథమ విజేతైనా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నో సార్లు తడబడి పడిపోయుంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాలవారధి దాటినప్పుడే అవరోధాలదీవిలోని 'ఆనంద నిధి' సొంతమయేదని చాటేందుకు. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణంముందు అన్నీ తృణప్రాయమే' అన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవన సూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతంకోసం దాయాదివైరం సైతం   తోసిరాజని  క్షీరసాగర మథనయాగానికి పూనుకున్నది దేవదానవులు. యమధర్మరాజంతటి సాక్షాత్‌ మృత్యుస్వరూపుడే  దండంతో ప్రాణాలు హరించేందుకు  వచ్చినా శివలింగంపట్టు వదలలేదు మార్కండేయుడు!

పెద్దలు 'జాతస్య మరణం ధ్రువమ్‌' అన్నారని చేతిగీతలను చేజేతులా చెరిపి
వేసుకోవాలని అనుకోవడం పిరికితనం. మన ప్రమేయంతో మనం పుట్టామా.. మన ప్రమేయంతోనే పోయేందుకు! తల్లి తొమ్మిది నెలలు కడుపున మోసి జన్మనిస్తే.. తండ్రి
తొమ్మిదేళ్ళు కంట్లో పెట్టుకుని పెంచుకున్న శరీరం ఇది. బిడ్డ ఆటపాటలకు, ముద్దుముచ్చట్లకు తమ జీవితాలను చాదగా చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్‌ పాణి పాద  పాయు, ఉపస్థలలు  అనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్‌ చక్షు శ్రోత జిహ్వ ఆఘ్రాణాలు అనే అయిదు జ్ఞానేంద్రియాలు.. మనోబుద్ధిచిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పంథొమ్మిదిమంది దేవతలకు ఆవాసం’గా మానవ శరీరాన్ని ప్రశ్నోపనిషత్తు ప్రస్తుతించింది.  శాస్త్రోక్తమా.. కాదా అన్న వాదన  తరువాత. నేటి సామాజిక జీవన వాతావరణంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగే వీలులేనిది. 'పుటక నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులు అర్పించారు. బతుకంతా దేశానిది అనిపించుకోవడం ఆనక..  కనీసం  కన్నవారిది, మనం కన్న వారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా అనిపించుకోవాలి!  బిడ్డ ఒక్కపూట పాలుమాలితేనే పాలు కుడిపే తల్లిరొమ్ము ఎలా తల్లడిల్లుతుందో తెలుసుకోవాలి! ఆకాశంలో అకాలచుక్క పొద్దుగా మారతాడనా  కన్నతండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసేదీ! 'నాతి చరామి' అంటూ చేయిపట్టుకొని పెళ్ళిపీటలమీద  ఇచ్చిన హామీని నమ్మేకదా  బిడ్డకు తల్లిగా మారేది  పిచ్చితల్లి! 'అమ్మా.. నాన్నేడే!' అని  బిడ్డలు నిలదీసినప్పుడు నీకు బదులుగా తనెందుకు తలొంచుకోవాలి!

పండే పొలాలు ఎండిపోయాయనో, ప్రే మించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళయిపోయిందనో, ఉద్యోగమూడి బతుకూ పరువూ బజారున పడ్డాయనో, స్టాక్‌- మార్కెట్‌ కుప్పకూలి షేర్లు 'బేర్‌' మంటూ  భయపెడుతున్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా తొలిప్రదర్శన  టిక్కెట్లు దొరకలేదనో,  నూటికి నూరు మార్కులు పరీక్షల్లో  రాలేదనో, ఇష్టమైన మహానేత హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడనో, క్రికెట్టాటలో తనజట్టు ఓడిపోయిందనో, నిరాహారదీక్షలకు కూర్చున్న  నేతలు అర్థాంతరంగా నిమ్మరసం తాగారనో.. తాగాలనో స్వీయప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమంగా పెరిగడం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణాల పాలయ్యారు. స్వహననం సమస్యకు పరిష్కారం కానే కాదు. విసుగుదలకీ, ఓటమికీ  ఔదలచి ఉసురు తీసుకోవటం విరుగుడు అసలు కాదు. యోధులుగా మారి ప్రతీ అడుగూ ఓ దీక్షాశిబిరంలా మార్చుకొనే సమరాంగణం జీవితమంటే. ఒడుపు మరనంతకాలం జీవనయానం  ఏ వంకర టింకర మలుపుకూ అవరోధం కాబోదు. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...' న్న పాట అర్థం ఒంటపట్టించుకొంటేనే వంటికి, ఇంటికి, దేశానికి మంచిది.
                                   ***
(ఈనాడు ఆదివారం 27-12-2009 నాటి సంపాదకీయం- ఈనాడు యాజమాన్య సౌజన్యంతో.. కృతజ్ఞతలతో)

మనవిః

కొన్ని సేకరించిన ఈనాడు- ఆదివారం సంపాదకీయాలను ఇక్కడ వరసగా ప్రచురించడానికి కారణం.. మరింతమంది విజ్ఞులైన పాఠకులకు మంచి విషయాలు  చేరాలనే. ఈనాడు సంపాదకీయాలమీద సర్వహక్కులు ఈనాడు యజమాన్యానివే. ఈనాడు యాజమాన్యం సౌజన్యం- కృతజ్ఞతలతోనే ఈ వ్యాసాల ప్రచురణ ఇక్కడ జరుగుతున్నదని మనవి. ప్రచురించిన వ్యాసాలమీద ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియ చేయగలరు. వెంటనే ఈ వ్యాసాలను ఇక్కడినుంచి తొలగించడం జరుతుగుతుంది అని గమనించ గలరు.

Monday, February 15, 2016

దేవుడి పాలన- ఓ సరదా గల్పిక

దేవుడి పాలన'.. 'దేవుడి పాలన' అంటూ అంతా అలా ఊదరగొట్టే
సజ్జేగానీ.. ఆ పాలించే దేవుడుగారెవరో ఇతమిత్థంగా ఎవరూ తేల్చిచెప్పరు! ఎందుచేతనంటావ్ బాబాయ్!'
'నీ ద్యాసీ పొద్దు  దేవుడిగారిమీదకు మళ్లిందే! వివరాలేమన్నా తెలిస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యమేదన్నా లాగిద్దామన్న దుర్భుద్ధి కాదుగదా!'
'అపార్థాలొద్దు బాబాయ్! మన ప్రపంచ జనాభా ఏడొందలకోట్ల పైచిలుకు మైలురాయికి చేరుకుంది కదా ఇప్పటికేఅదే దామాషాలో దేవుళ్లసంఖ్యా పెరుగుతున్నదా.. లేదా.. అని నాకో ధర్మసందేహం! మనకి ముక్కోటి దేవతలున్నట్లు ఎక్కడో చదివాను. ఆ లెక్కన ఒక్కో దేవుడికి రెండువందల ముఫ్ఫైముగ్గురు భక్తులను ఆదుకోవాల్సిన బాధ్యతా ఉందిగదా! ఈ కరువు రోజుల్లో అదెంత బరువు! అందుకే వాళ్ళ కష్టనష్టాలేమిటోకూడా కాస్త  వాకబు చేద్దామనీ,,!'
'ఇహనేం! జనగణన మాదిరిగా దైవగణనకీ బైలుదేరూ! ఎలాగూ పనీ పాటా లేనట్లుందిగా నీకీ మధ్య!'
***

అబ్బాయి ముందుగా బ్రహ్మలోకంలోకి ప్రవేశించాడు.
తామరతూడులో తామరాసనుడు లేడు! అక్కడే మానససరోవరం మడుగులో  కునికిపాట్లు పడే హంసవాహనం అంది 'మీ లోకానికి సెకనుకి నాలుగు శాల్తీలయ్యా  తయారవ్వాలి! ఇక్కడికి తిరిగొచ్చేవి మాత్రం రెండంటే రెండే! ఈ లెక్కన మనుషుల్నిచేసే ముడిసరుక్కి ఎంత కరువొచ్చి పడిందో తెలుసా అబ్బాయ్! పనిభారమూ ఎక్కవపోయింది  పాపం మా పెద్దాయనకి. బ్రహ్మ రాసిన నుదుటిరాతల్నీ మీరవేవో కంప్యూటర్లో.. పాడో.. వాటి సాయంతో తిరగరాసేసుకుంటున్నారంటగా! బోలెడన్ని ఫిర్యాదులు వచ్చిపడుతున్నయ్ బాబూ బ్రహ్మలోకానికి  రోజూ! వీటన్నిటికీ చెక్ పెట్టేసే కొత్త సాఫ్టువేరేదన్నా దొరుకుంతేమోనని వాకబు చేయడానికి వెళ్లారు విశ్వకర్మ దగ్గరకు  విధాతగారు'
'వాణీమాతకూడా కనిపించడం లేదే!'
'బ్రహ్మ కష్టాలు బ్రహ్మవి. అమ్మ కష్టాలు అమ్మవి. మీ మానవుల బుర్రల్లో బుద్ధి ఎక్కువ  దోపడం బుద్ధితక్కువ పనయిందనుకుంటున్నారయ్యా  ఇక్కడంతా! అంత కష్టపడి ఎన్నో భాషలు కనిపెట్టి ఇంచక్కా ఎవరి పుట్టుకభాష వాళ్ళు మాట్లాడుకోమంటే.. మీరేం చేస్తున్నారబ్బాయ్! అన్నింటినీ కలగలిపేసి ఓ కొత్త సంకరభాష తయారు చేసేశారు! ‘నా భాష గొప్పదంటే నా భాష గొప్పదని దుర్భాషలు మొదలుపెట్టారు! మైకులముందు మీరు కూసే కూతలు.. పత్రికల్లో మీరు రాసే రాతలు భాషామతల్లికే  ఓ పట్టాన బుర్రకెక్కి చావడం లేదు! 'మానవా! దూర్భాష మానవా!' అని మీకు అర్థమయేలా అర్ధించాలన్నా ఆమ్మకూ సంకరభాషే గతయిపోయింది.. ఖర్మ! ఎవరో టీ.వీ యాంకరమ్మట! ఆమె దగ్గర సంకరట్యూషను పెట్టించుకొందీ మధ్య. అక్కడికెళ్లింది.. ఇంకా రాలేదు
అబ్బాయి అటునంచటే విష్ణులోకానికి  పయనమయ్యాడు.
పాలకడలిమీది పాముపడగా బోసిగా ఉంది. పరమాత్ముడేమన్నా కొత్త అవతారం ఎత్తేందుకని వెళ్లాడేమో! ఆ మాటే ఆదిశేషుని అడిగితే ఇంతెత్తున బుస్సుమని లేచింది!
'అదొక్కటే తక్కువయ్యా ఇప్పుడు మా పరంధాముడికి! మీ లోకంలో ఎవరో
గాలి సోదరులంటగా! నలభైమూడు కోట్లుపోసి వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటమొకటి స్వామివారి నెత్తికి తగలేసారు అప్పుడెప్పుడో! అప్పుడొచ్చిన మాడుపోటు.. ఇప్పటికీ తగ్గలేదు. మా ధన్వంతరిగారేమో వల్లకాదని చేతులెత్తేసాడు! మంచి వైద్యుడేమన్నా దొరుకుతాడేమోనని  మీలోకంలోనే.. గాలించడానికని ఎక్కడికో వెళ్ళారు.. ఇంకా రాలేదు’
'మరి సిరి? అమ్మగారూ అయ్యగారి వెంటనే వెళ్లారా?’
'అమ్మో! మీ లోకమే! డబ్బుకాకలో కొట్టుమిట్టాడుతున్నారంటగా మీరంతా! ఎక్కడే పాపాత్ముడు కట్టిపారేస్తాడోనని స్వామివారే లక్ష్మమ్మను వెంట రావద్దన్నారు. అయినా.. మీ మానవులమీదే ఆ తల్లికి ఆదరం ఎక్కువ. అక్కడి బీదాబిక్కిని ఆదుకుందామని వస్తే ఆదిలక్ష్మనికూడా గౌరవం లేకుండా ఏంచేసారయ్యా మీ పెద్దమనుషులు! నల్లరంగు పూసేసి నేలమాళిగల్లో  దాచేస్తారా! అహ్వ..!' అంటూ జిహ్వనిండా నిప్పులు గుమ్మరించింది ఆదిశేషు.
ఇంకాసేపు అక్కడే ఉంటే ఏం జరుగుతుందో తెలీనంత పిచ్చికొయ్యేంకాదు అబ్బాయి. అమాంతం కైలాసం జంప్!

వెండికొండా భూత్ బంగళానే తలపిస్తోంది.
తెల్లకార్డువాళ్లకి చంద్రన్నలిద్దరూ రూపాయిక్కిలో బియ్యం పంచుతున్నారు  కదా ఈ మధ్య! దారిద్ర్యరేఖకు ఎల్లప్పుడూ దిగువునే ఉండే  మారాజాయ  ఈ  ఆదిభిక్షువు! చౌకబియ్యంకోసం అటుగానీ వెళ్లాడేమో!
అదే అడిగితే 'కాదయ్యా!' అంది నంది 'ఆ ముక్కసరుక్కి కొండలెక్కి దిగాలా! మింగి హరాయియించుకోడానికి ఆ నూకలేమన్నా  అలనాటి హాలాహలమా నాయనా! వ్యాహ్యాళికని వెళ్లిన అమ్మవారు వెండికొండకు ఇంకా  తిరిగి రాలేదు.  ‘విచారిద్దామని  వెళ్లారు మా స్వామివారు!' అంది నంది.

దేవుళ్ళంటే ఒక్క త్రిమూర్తులే కాదుగదా!
బాపట్ల భావనారాయణ స్వామివారేమన్నా వివరాలు చెబుతారేమోనని అటుగా వెళ్లాడు అబ్బాయి. ఆ మధ్యనే ఏదో చిన్నగాలితెర వీస్తే నెత్తిమీది గాలిగోపురంకాస్తా ఠప్పుమని కూలిపోయిందట! ఆ కుములుడింకా తీరనే లేదేమో! బైటికొచ్చి మొహమే చూపించలేదు నారాయణస్వామి!
శ్రీ కాళహస్తీశ్వరుడిదీ అదే చేదుఅనుభవం. దర్శనభాగ్యం  కలగలేదు!
'ఏడుకొండలవాడి గుడికి బంగారు తాపడాలేమిటి? చిన్నగుళ్లమీద చిన్నచూపేమిటి? దేవుళ్లంతా సమానమే అయినప్పుడు ఒక్కోగుడికి ఒక్కో తీరు కెటాయింపులు.. అన్యాయం! నడవనివ్వం' అంటూ కొట్లాడేందుకు  చిల్లర దేవుళ్లంతా కలిసి  కొత్తగా ఓ  సంఘం (చిదేసం) పెట్టుకొనే పనిలో బిజీగా ఉన్నారన్న సమాచారం అందింది అబ్బాయికి.

మర్రిచెట్టు నీడలో కునికిపాట్లు పడుతున్న పోతురాజు దొరికాడు చివరికి  అతికష్టంమీద. 'మీరు నిజంగా ముక్కోటి దేవతలేనా! మూడురోజులబట్టీ కాలికి బలపం కట్టుకు తిరుగున్నానయ్యా దేవుడా! ఒక్క దేవుడూ కనిపించడేమయ్యా మగడా!' అంటూ గట్టిగానే  నిలదీసాడు పోతురాజును ఆబ్బాయి.
'గాలి సోదరుల్లాంటి మాఫియా దెబ్బలకు సుంకాలమ్మల్లాంటి
గ్రామదేవతలకు    నిలవనీడా! కరువు కాటకాలతో అల్లాడే చిన్న చితకా జనతా.. ఎక్కడ చిన్నపిల్లలకు కాన్వెంటు బళ్లల్లో ఫ్రీ సీట్లు..పెద్దతలకాయలకు స్టారాసుపత్రుల్లో  బెడ్లు అడుగుతారోనని కలల్లోనైనా  కనిపించాడానికి  జంకుతున్నారయ్యా దేవుళ్లంతా!' అని మళ్లీ నిద్రకు పడ్డాడు పోతురాజు.
ఒక్క చిన్నదేవుడితోనైనా మాట కలవకుండానే అబ్బాయి దైవగణన కార్యక్రమం  ఆ విధంగా విఫలమయింది.
***
'పెట్రోలు సుంకాలు తగ్గించమని, పచారీ సామాను చవక దుకాణాల్లోనైనా చవగ్గా ఇప్పించమని, కోతల్లేని కరెంటు కంటిరెప్ప పాటైనా కనికరించమనినలకలున్నా సరే నాలుగు నిమిషాకు ఆగకుండా  నల్లాల్లో  నీళ్లు ధారకట్టాలని.. ఏవేవో మనం గొంతెమ్మ కోరికలు  కడుపులో పెట్టుకొని వెంటబడితే  పాపం.. దేవుళ్లుమాత్రం ఏం చేయగలరూ! దోమలుజైకా' వైరస్సున మోసుకుంటూ ప్రపంచమంతటా ఝామ్మ న  జైత్రయాత్రలు  చేసే తరుణంలో దైవగణనకని బైలుదేరాను చూడూ.. నాదీ బుద్ధితక్కువ! నా ముక్కోటి దేవతల సందేహం ప్రస్తుతానికి అలాగే పెండింగులో పడిపోయింది బాబాయ్ చివరికి.. ప్చ్!’ అని నుదురుబాదుకొన్నాడు అబ్బాయి.
'ముక్కోటి ఏం ఖర్మరా పిచ్చోడా! మూడొందల కోట్లమంది దేవతలున్నారు..  మన చూట్టూతానే! ఆ దేవుళ్ల దగ్గరికి నువ్వసలు వెళ్లనే లేదు. వెయ్యినోటు చూపిస్తే బొందితో కైలాసానికైనా తోసేస్తామని ప్రకటనలు గుప్పించే  బాపతు  చిల్లర దేవుళ్ళు.. ఎంత మందున్నారో నీ లెక్కలేం తేలుస్తాయ్.. అమాయకుడా! ఎన్నికలముందు దేవుడి పాలనఅందిస్తాం.. 'దేవుడి పాలన' అందిస్తామని మన నేతాశ్రీలు.. ఓహో.. అదేపనిగా  హామీలు కుమ్మేస్తుంటారు కదా! ఆ దేవుళ్ళు ఈ   దేవుళ్లేరా పిల్లగాడా!  చిల్లర  దేవుళ్ల ఆశీర్వాదాలతోనే మనం ఓట్లేసి గెలిపించే నేతలు మనల్ని  తోకున పరిపాలించేస్తున్నది!’ నేసాడు బాబాయ్!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సెప్టెంబరు 9, 2011 నాటి  సంపాదకీయ పుటలో ప్రచురితం)




'

Sunday, February 14, 2016

సృజన


సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపు  సహజచర్య. మానవేతర జంతుజాలం తమలాంటి జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషిది. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలూ చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికి ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం సృజనగా గుర్తిస్తున్నాం.  ఆ శక్తి గలవారిని  సృజనశీలురు, స్రష్టలు అంటున్నాం.
కళాకారులందరూ స్రష్టలే. కాని అంతకన్నా ముందు మానవులు. అలాగని మానవులందరూ కళాకారులు కాదు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలోనూ పిసరంతైనా కళంటూ ఏదో ఒకటి దాగుండక పోదు కానీ..ఆ కళేదో బహిర్గతమైనప్పుడే అతనికి    కళాకారుడిగా గుర్తింపొచ్చేది.
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఆలోచనను బట్టే ఉనికి’ (Cogito ergo sum)సిద్ధాంతం ప్రకారం మనిషి సృజనశీలి కన్నాముందు బుద్ధిజీవి.   ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం దీనికి బద్ధ వ్యతిరేకి.  ‘I exist.. therefore I think’ అంటుంది అస్తిత్వ వాదం. ఈ వాదం ప్రకారం మనిషి బుద్దిజీవికన్నా ముందుగా సృజనశీలి.  జెన్ తత్త్వం, మన  భారతీయుల భక్తి యోగాలకూ రసవాదంతోనే చుట్టరికం. హేతువు
కన్నాముందు  అనుభూతికే మనిషి ప్రాధాన్యత ఎందుకిస్తాడు?- ఇది అంతుబట్టని రహస్యం.  కానీ సృజన అంటే మాత్రం స్థూలంగా ఒక అభిప్రాయానికి రావచ్చు. శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండికలో మాదిరి కవితాత్మకంగా చెప్పాలంటే  అదొక
సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి
డాంధకార నిర్జన వీధికాంతరముల
నా చరించెడు వేళ ప్రోన్మత్త రీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి’.
లేని దాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందటం, తోటివారినీ తన్మయపరచడానికి  ప్రయాస పడటం.. సృజనశీలత  కొన్ని  ప్రధాన  లక్షణాలు.
సరసియై చల్లనై నన్ను జలకమార్చె,
నందన నవ నీలతాంత కాంతస్రజమ్ము
గా నొక క్షణమ్ము నామెడ కౌగలించె’
అని మహాకవొచ్చి మొత్తుకున్నా సరే ‘ఎవరా ‘సరసి’ మహానుభావా?’ అని మాత్రమే వివరాలడుగబోతాడు శుద్ధ లౌకికుడు. లౌకికులకు ఒక పట్టాన అంతు పట్టని వింత చేష్టలింకా ఇలా చాలానే ఈ అలౌకిక ప్రాణుల్లో ఉంటుంటాయి మరి. నిశ్శబ్దం విసుగెత్తినప్పుడు  శబ్దాన్ని సృష్టించటం, శబ్దం ఎక్కువైనప్పుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం ఈ అలౌకిక లక్షణాలే. ఈ అలౌకిక మహాశయుడు శబ్దాలకేవో అర్థాలు కల్పించి కవిత్వమంటాడు. ఎక్కడా లేని ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ కనిపెట్టి నృత్యం పేరుతో సొంత లోకంలో విహరిస్తుంటాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.
అస్తిత్వ సిద్దాంతాన్ని పైపైన చూస్తే మాత్రం-  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్రమే నిర్థారించిన సత్యం.
కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలు కూడా మాని ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడెందుచేత?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడినుంచీ ముక్తి పొందటానికిలా   ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.
కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరెందు కెంత తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్చన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్లా, అనుకూల పరిస్తితుల చలవ వల్లా శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు మన సమాజంలో మన మధ్యనే  ఎప్పుడూ సంచరిస్తుంటారు’అనీ ఆయన వాదం. కాదనలేము కదా!
ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా ..సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లోలాగా బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతననెంత  మాత్రం  ప్రభావితం చేయ లేవు.  సందుఛూసుకుని మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది..చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేసినట్లు.

కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానం దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చవెచ్చని చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..
ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు
పక్షపాతపు రచనల పస నశించె
రసికులకు మీ చరిత్ర విసువు దోచె
పరువుగా నింతట బ్రబంధపురుషులార!
కదలిపొం డెటకైనను..మీకు
నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.
అలాగని లోకమంతా  ఆషాఢభూతుల బంధువులతో నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చెసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు
అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.
సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలు.. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  హేతువాదం వికాసం.  సృజనశక్తికి సాయంగా  సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత సమాంతరంగా వెలిగే ఆ కళాజ్యోతుల జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడుగా కూడా సమాజానికి సదా ఆదర్శప్రాయుడై ఉండి తీరాలని చిత్తశుద్ధితో నమ్మి ఆచరించి చూపించిన కళావైతాళికుల అడుగుజాడల్లో నడవడానికి కవులుగా మనకెవరు అడ్డొస్తున్నట్లు!

నడవడకయ నడచివచ్చితి
నడచిన నే నడచిరాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’
అని కదా సృజన  బులపరింపు!
పరిసర ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నాస్వయంప్రతిభతో ఆ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేయడం,   సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవడమూట -మనలోని సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువులు. కాదంటారా?

-కర్లపాలెం హనుమంతరావు

Saturday, February 13, 2016

మళ్ళీ 'దోడ తిత్తివా!' అని ఆ సారు అడిగితే వినాలనుంది!


ఈతిబాధలు ఎప్పుడు ఉండేవే! నీతిబోధలూ ఎప్పుడూ ఉండేవే!  ఈతిరీతిని  నిలదీసే పలుకులకు ములుకురాగాలు చెక్కి   అరుణ్ సాగర్ సారుకి మల్లే సంధించగల విలుకాడు మళ్లీ ఎన్నటికి దొరికేనో!
మేల్ కొలుపులో కోలుపోతను కలిపి.. భోరుమనే  జాలిఅక్షరాలెన్నింటినో  కుండపోతగా కురిసి.. గుండెల్ని ముంచెత్తెయ్యడం ఎంతమందికి తెలుసో తెలీదు! అరుణ్ సాగర్ సారుకి తెలుసన్న మాట మాత్రం తెలుసు. 
ఆ జడివానల్లో తడిసి ముద్దైన ఓ నాటి ఎన్నటికీ మరుపురాని  ఆ తీపిచేదు ముంపుఅనుభవాల సాక్షికంగా  అనుకుంటున్న మాటలివన్నీ.
ఒక్కసారా సార్! 
పచ్చదనమంతా ఆవిరయి.. మబ్బుదేవుడు విదిల్చే ఆ ఒక్కవాన చినుక్కోసం  ఒంటికాలి జపంచేసే.. మోడుముని మాదిరి.. ఎన్ని లక్షణ క్షణాలు తపించిపోయిందో   పిచ్చి మనసు!  
తప్పిపోయిన తల్లిని  ముక్కుపచ్చలారని బిడ్డ సంతలోపడి వెక్కివెక్కి ఏడుస్తూ వెదుక్కొన్నట్లు!
ఆ అరుణ సాగరంనుంచి ఆవిర్లై లేచి గాలిమబ్బు ముసుగులో సాగొచ్చి   బీడుదాహం తీర్చింది  వట్టి నీటిచుక్కే అయుంటే ఈ ఏడుపంతా ఇప్పుడెందుకు! 
శిశిరంలో పరిసరాలు  బరిబెత్తలు కావడం.. 
వసంతుడలా విలాసంగా వచ్చి యధావిధి  పచ్చడాలు  కప్పిపోయే ఇచ్చకాల  విధాయకాల కాలచట్రానికి చిక్కి ముక్కే చమత్కారాలో .. సత్కారాలో కాదు! గాడిదగుడ్డు కారాలు అంతకన్నా కానే   కాదింతా! 
నాలుగు మెతుకులు కతికిన ఎద సొద!

ఖాళీ కడుపుతో నకనకలాడుతూ వీధులవెంట వెర్రిగా తిరిగే రోజుల్లో  ఆ సారు  ఇంటి వసారా గుప్పెడు మెతుకులూ  పొట్ట నింపాయి. 
ఆ ఇంటికబళం ఒక్కమెతుకు వాసనకే ఓ పూటంతా  మిఠాయిదుకాణం సరుకు  వెగటనిపించేది! 
ఆ దొడ్డయ్య ఏం పెట్టి  వండుతాడో! తిన్నదంతా వంటికా పట్టింది! 
ఆత్మగుజ్జుకు అంటుకున్న ఆ మెతుకుల రుచయ్యా! మరుపుకెలా వస్తుంది.. ఊపిరిలో ఉత్సాహం చచ్చుబడిందాకా!
మాయదారి కాలం! 
ఉన్న కాసిన్ని మంచిమనసుల్ని ఇలా ఆత్మనాలికమీద గీకి  
'హుఫ్ .. కాకి!' అంటూ  ఇప్పుడు అర్థాంతరంగా దాచేయడం ఏమిటి! 
ఇదేం ఆట.. !
మళ్లీ మా అరుణ్ సాగర్ మాట వినాలనుంది! 
'దోడ తిత్తివా!' అంటూ ఆ సారు  మూలవాసుల యాసలో పలకరిస్తుంటే 
చెవులు రిక్కించి మరీ వినాలనుంది! 
కుదరదా! 
అయినా 
రెక్కీఅయినా నిర్వహించకుండా   
కర్కశంగా ఇలా రెక్కుచ్చుకుని మంచివాళ్ళనే లాక్కుపోవడమేమిటి
కాలమా! 
నీ సాడిజం మరోసారి రుజువయింది!
ఈ హేట్ యూ 
యాజ్ లాంగ్ యాజ్ ఐ లవ్ అవర్  అరుణ్ సాగర్ సార్!

***
(విలక్షణ కవి, ప్రజా పాత్రికేయుడు కామ్రేడ్ అరుణ్ సాగర్ 
హఠాన్మరణానికి  విలపిల్లుతూ)

Friday, February 12, 2016

అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం

"ఈనాడు ఆదివారం సంపాదకీయాలకు సంబధించి నాకు తోచిన నాలుగు మాటలు.
ఈనాడు ఆదివారం సంపాదకీయం  ఒక రకంగా తెలుగు పాఠం. ఆదివారంనాటి  సంపాదకీయం  సాహిత్యవిశేషాలతో  పుష్టిగా ఉంటుంది.  సంపాదకీయం ఉటంకించే సంగతులు ప్రధానంగా పురావైభవానికి సంబదించినవి.  శిష్టగ్రాంధికం సజీవ ప్రదర్శనకు అక్షర  వేదిక ఆదివారం సంపాదకీయం.   ప్రాచీనసాహిత్యక్షీరం  మధించి తీసిన  వెన్నముద్దరుచి పదప్రయోగాలు.. మీగడతరకతీపి పెద్దలసూక్తులు బారులు తీరి అలరించే పద్యపాదాల.. పదాలకొలువు ఈనాడు సంపాదకీయం. భాషలో పొదుపు  ఈ రచనల ప్రత్యేకత. సాధారణ పాఠకుడికి  సాహిత్య పరిజ్ఞానం రేఖామాత్రంగానైనా అందించాలన్న ఆరాటం ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. దైనందిక వార్తావేదిక అయినందువల్లనేమో సమకాలీన స్పృహనూ  సంపాదకీయం విస్మరించ జాలదు. ఆ వారం జరిగిన ఏదైనా విశేషాన్నో.. ఆదివారానికి అటూ ఇటుగా వచ్చే ప్రత్యేకదినోత్సవాన్నో.. ఏదీ లేదంటే విశ్వవ్యాప్తంగా విజ్ఞానశాస్త్రాల్లో వికసించే  నవ్యపరిశోదనల్లోనుంచి విత్యవ్యహారానికి సంబంధించి ఉత్సుకత పెంచే ఆంశాన్నో..  సూత్రంగా మలుచుకొని  అందంగా అల్లే మూడుమూరల పదకదంబం ఆదివారం సంపాదకీయం.  'భళా!' అనే రీతిలో సాగి సానుకూల ఆలోచనలతో స్వస్తివాక్యం పలికే  ఈ తరహా సంపాదకీయాలు నాకు తెలిసి తెలుగులో నాటికీ నేటికీ ఈనాడులోనే నిరంతరాయంగా వస్తున్నాయనిపిస్తుంది. సాధారణంగా వీలున్నంత వరకూ   ఈ సంపాదకీయభ్రమరం తెలుగురుచి కుసుమం చూట్టూతానే పరిభ్రమించడమూ అభినందనీయం.
చక్కని చిక్కని శిష్టతెలుగులో కృషిచేయాలని
కోరుకొనే సాహితీ ప్రేమికులకు ఈనాడు ప్రతీ ఆదివారంనాడు ప్రచురించే సంపాదకీయం ఓ నమ్మదగిన తోడు"
***


అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం
కౌసల్య తన 'పేరేమిటో' చెప్పమంది. 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు  'లాములు' అంటాడు. 'నాన్నపేరేమిటి నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు ' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న.  అమ్మతోనే కానీ..ఆమె పేరుతో పనేంటి చంటి పిల్లలకి? 'అమ్మగాలు' అంటాడు.. పాపం..ఆ బాలరాముడు అత్యంత కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక
తిప్పటం రాని రాముని కళ్ళలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం  ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న- పాప కనుపాప కన్న ఎక్కువ అనటం  'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను  తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి సంతత యోగ దాయి.' 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కు' మాత  వాత్సల్యాన్ని ప్రసిద్ద ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్  మాటల్లో చెప్పాలంటే 'తల్లి నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన  చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో తనకన్న ముందుగా  అన్నగారే మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం

  వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడలేదు.   వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా!' అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ తలతుడుస్తుందిట. అమ్మంటే అది. హిందువులు  సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను ప్రార్థించేది అందుకే.



ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ  అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం
కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా/తండ్రిం దల్లియు నంచు నుండుదుము..యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్థమై రేపల్లె వచ్చిన  సందర్భంలో భాగవతంలో. ఈశుడు ఓంప్రథమంగా సృష్టించిన  ఈశానాం(లక్ష్మీ దేవి) ఈశిత్రి( జగత్తు)ని అమ్మలా పాలిస్తుందని పరాశరబట్టర్ ద్వయమంత్ర శ్లోక సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు  చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన  గొప్ప సంపద అమ్మే' అని కదా  శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్' అని అల్లా చల్లని దయమీదో చక్కని  అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుని మేనత్త  గోతమి, బహాయీల తాయి  తాహిరి, మహావీరుని తల్లి  త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాలని దేశకాలాలని ఎల్లలేముంటాయిగ్రీకులకు వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్‌లో తల్లులందరికీ  'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాళ్టి రోజును  మరెన్నోదేశాలూ తల్లికి నివాళులిచ్చే  ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ అవడం అబ్బురం కాదు.



కాలం సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్నిఅడిగాడు ఓ సత్యాన్వేషి  'అమ్మ' అంటే  ఏమిటని? 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!'అని దేవుడి  ఉత్తరం. భిక్షమడిగే బికారి నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకుల'ని సమాధానం. మానవులతో పని కాదని చివరికి  పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే దారిలో  ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి  తన పెదాల మీదే  సదా 'అమ్మా!'లా   దాగుండేదే అమ్మేనని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా'. తెలుసుకున్న వారికి 'అమ్మో..ఇంతనా!' 'ఆపదవచ్చినవేళ నారడి బడినవేళ/పాపపు వేళల భయపడిన వేళ/వోపినంత హరినామమొక్కటే గతి..' అనే అన్నమాచార్యులవారి సంకీర్తన హరినామానికి అమ్మపదమొక్కటే ఇలలో సరి. అడ్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి బెల్లం..తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ..పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా?బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరిదశన కాస్తింత చెట్టునీడ కరవవుతున్నది.పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి  'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్నిఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన  ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు.. అమ్మ పాదాలు కొండంత అండ! స్తోత్రాలు సరే. 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు  నిజమైన పండుగ. ఈ 'అమ్మల పండుగ' నుండైనా చాలు..  అమ్మ మేలుకు బిడ్డలు పునరంకితమవుతే.. అదే పదివేలు.
***
(ఈనాడు దినపత్రిక సౌజన్యంతో- కృతజ్ఞలతో)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...