Friday, October 21, 2016

రాచకులం కన్నా యాచకులం మిన్న- ఈనాడులో ఒకనాటి వ్యంగ్యం



యాచకులు ఎక్కడుంటారో సంపదలు అక్కడ సమృద్ధిగా ఉంటాయంటారు.
భిక్షువులే సుభిక్షానికి ప్రత్యక్ష సూచికలు. కులాల వారీగా అధికారంలో పాలు  దబాయించి మరీ అడుక్కుంటున్న ఈ కాలంలో మా మానాన మేం మౌనంగా 'భిక్షాం.. దేహీ!' అనరుచుకుంటూ తిరుగుతున్నాం. అయినా మా మీదే అందరికీ అనుమానాలు! మాకే ఎందుకో ఇన్నిన్ని అవమానాలు?! పిడికెడు ముష్టికే పాపిష్టి జనాలకి కడివెడంత పుణ్యం సంపాదించి పెట్టడమేనా మేం చేసిన పాపం?
ఆ మాట కొస్తే యాచక భుక్తి భూం పుట్టకముందునుంచీ వస్తున్నదేగా! మా కులదైవం మహాశివుడు ఆది భిక్షువు. ఆ తోలువస్త్రధారి దర్శనంకోసం అలమటించే  భక్తులు సైతం మేం కనిపిస్తే చాలు.. ‘తోలు వలిచేస్తా’మని వెంటబడతారు! సాక్షాత్తూ లక్షీనాథుడై వుండీ  విష్ణుమూర్తి వామనావతారంలో బలిని మూడడుగులు అడుక్కుంటే 'ఆహోఁ! ఏం లీల!' అంటూ ఈలలేస్తారు! మేమేదో మా జానెడు పొట్టకోసం 'భవతీ.. భిక్షాం దేహీ!' అంటూ బజార్న పడితే పెద్ద రాద్ధాంతాలు సిద్ధం చేస్తారు!
ఇంద్రుడినుంచి.. హిరణ్యకశిపుడి వరకు.. దేవదానవులందరూ ఏదో ఓ సందర్భంలో సందు చూసుకొని  చేతులు చాచిన మహానుభావులే కదా! లేనివాడండే అందరికీ లోకువే కానీ.. ఆ దౌర్భాగ్యుడనేవాడే లేకుంటే బలినుంచి.. అంబరీషుడి వరకు.. కర్ణుణ్నుంచి.. దధీచి దాకా 'మహాదాతలనే కీర్తి కిరీటాలు గడించడం సాధించగలిగేవారా? చేతికి ఎముకలేదన్న ఆ ఖ్యాతి మా యాచక వృత్తివల్లనే  కదా సాధ్యమయిందీ?
బిచ్చగాళ్లంటే సర్కారుకైనా లెక్కుండదుకానీ.. నిజాయితీగా గణాంకాలుగానీ సేకరిస్తే  మా యాచ'కుల'దే మెజారిటీ వర్గం.  దామాషా ప్రకారం మా యాచకులే అన్ని చట్టసభల్లోనూ మూడొంతులు మించి ఉండాలి.  ఎన్నికలముందీ  ప్రజాప్రతినిధులంతా మా బిచ్చగాళ్ళ ఓట్లనీ అడుక్కున్న సంగతి అప్పుడే మర్చిపోతే ఎలా?
'అడగనిదే అమ్మైనా పెట్ట'దని మీరే అంటారు.  అడుక్కుంటుంటే 'ఎద్దులా ఉన్నావ్.. ఏదైనా పని చేసుకొని బతకరాదా?' అని ఈసడించుకుంటారు! పంట పొలాలన్నింటినీ కుహనా పరిశ్రమల కప్పనంగా  ధారాదత్తం చేసి ఉన్న దున్నపోతులకీ.. ఎద్దులకే పని.. పాటా లేకుండా చేసారు. మీ మాట విని పాపం ఆ మూగజీవుల నోటికూటిక్కూడా మేం పోటీకి పోనందుకు 'శభాష్' అని భుజం చరిచి మెచ్చుకోడం పోయి ‘శనిగాళ్ల’ని శాపనార్థాలా? చిన్ని కడుపుకోసం మేం పడే పాట్లనిలా చిన్నబుచ్చుతారా? ఎంతన్యాయం?
యాచకత్వాన్నింతగా తక్కువ చేస్తున్నారుగానీ అసలు అడుక్కోవడమెంత గొప్ప కళో ఏ జ్ఞానికైనా తెలుసా? అస్తమానం హస్తిన చూట్టూ కాళ్ళరిగిపోయేట్లు సియం సార్లు ఎన్నేసి సార్లు తిరిగొస్తున్నారు? ఒక్క పథకం.. ప్రాజెక్టు.. నిధి.. నిఖార్సైనది.. ‘ప్రత్యేక హోదా’లో  లేనిది సాధించుకొచ్చారా? ‘పని చేసుకో’మని మాకు ఉచిత సలహాలు దయచేయకుండా మా సలహాలు గానీ చెవినపెట్టుంటే ప్రపంచబ్యాంకునుంచైనా సరే ఎప్పటికీ తీర్చనక్కర్లేని అప్పులు.. కుప్పలు తెప్పలుగా తెచ్చిపడుండేవాళ్ళు కదూ ఇప్పటికే!
పుట్టినప్పట్నుంచీ ముష్టిబొచ్చె పట్టడం తప్ప మరొహటి ఎరగని పరమ వీర ముష్టి చక్రవర్తులు అడుక్కొక అరడజనుకు తగ్గని ఆగర్భ గడ్డ మనది. ఒక్క ముష్టి మేథావి దగ్గరైనా యాచకశాస్త్రంలో సక్రమంగా శిక్షణ ఇప్పించి ఉంటే.. ఉత్తర కొరియావాడి అణుబాంబేంటి.. వాడి బాబు చైనావోడి ‘మేకింగ్ ‘ కళక్కూడా కాపీలు అడుక్కునైనా తెచ్చి పడేసుండే వాళ్ళు కదూ మన  యువనిపుణులు!
పెరటి చెట్లం కాబట్టి మా కళ మీకెందుకూ కొరగాకుండా పోతోంది గానీ.. అమెరికా ఒబామాగారుకూడా మన యాచక నైపుణ్యాన్ని గూర్చి సందర్బం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తేస్తుండేవారు.
పంచయితీలని, మండలాలని, జిల్లాలని, మంత్రి పదవులని, మంచి అధికార పదవులని, నిధుల్లో కోటాలని, పనుల్లో వాటాలని.. దేనికో దానికి.. ఎవరో ఒకరు.. ఎప్పుడంటే అప్పుడు.. దేవురించడం అధర్మం కాదు కానీ.. ఏదో రోడ్డువారగానో.. గుడి మెట్లమీదనో.. ఇంటి గుమ్మంలోనో.. ఒదిగొదిగి  నిలబడి 'ఒక్క రూపాయి ధర్మం చేయమ'ని వచ్చే పోయే అమ్మలు.. అయ్యలముందు  మేం చేయి చాపి అడగడంమాత్రం అధర్మం! ఏ రాజ్యాంగంలోని సెక్షన్ల ప్రకారం అడుక్కు తినడం శిక్షార్హమవుతుందో తేల్చాలి!
చదువుకున్న బాబుల్లాగా సర్కారు జాబులిప్పించాలని డిమాండ్లేమన్నా చేస్తున్నామా? డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కావాలని.. రేషను బియ్యం కోటాలు పెంచాలని.. ధరలమాంతం పాతాళానికి దించాలని.. ధర్నాలేమన్నా చేస్తున్నామా? మగపిల్లకాయల మాదిరి ప్రేమించి తీరాలని యాసిడ్ సీసాల్తో ఆడపిల్లలెంట పడుతున్నామా? శనల్లుళ్లకు మల్లే అదనపు కట్నకానుకలు ముట్టకపోతే కట్టుకున్నదనైనా జాల్లేకుండా గేసునూనెతో కాలుస్తామని అల్లర్లు పెడుతున్నామా? ‘చందా’మావఁలకన్నా.. పార్టీ విరాళాలకు వేధించే యములాళ్లకన్నా.. పనులు తెమలాలంటే 'చాయ్.. పానీ'ల సంగేతేంటని నిలదీసే అవినీతివంతులకన్నా.. చీటికి మాటికి చీకటి మాటున తోటి తల్లులనైనా చూడకుండా ‘చీరలిప్ప’మని చికాకులేమన్నా పెడుతున్నామా? 'మాదా కబళం తల్లీ!' అంటూ మర్యాదపుర్వకంగానే కదా మా దారిన మేం  ఇంటి గుమ్మాలముందు గంటలకొద్దీ నిలబడుతున్నాం?
గొంతెత్తి అరవడం, గొప్పలు చెప్పడం , ఇచ్చకాలు పోవడం, భట్రాజులకు మల్లే  స్తోత్రాలు చదవడం.. యాచకుల నీచలక్షణాలని వెనకటి కెవరో మహానుభావుడు యాచకగుణాన్నిగూర్చి నిర్వచించాడంట! మంచిది. ఆ కొలమానం ప్రకారం చూసుకొన్నా కాన్డబ్బులకోసం జోలట్టుకు తిరిగే మా కుచేలజాతికన్నా ముందుచ్చోది నిత్యం రాజకీయాల్లో నలిగే పెద్దమనుషులేనంటే చిన్నబుచ్చుకోకూడదు మరి!
'సాధు మేధానిధి' అనే శతకంలో పుష్పగిరి అమ్మన అనే పెద్ద పండితుడు - ప్రపంచంలో బిల్ గేట్స్ బికారిలాగాను..  బికారి బిర్లా తాతలాగానూ మారువేషాల్లో తిరుగుతూ మాయ చేస్తుంటారని కుండబద్దలు కొట్టేసాడు. ఏ మాయలు మంత్రాల జోలికి పోకుండా కేవలం పొట్టకూటి కింత ముద్ద కోసం మాత్రమే జోలె పట్టుకొని తిరిగే మేమే ఎన్ని అవమానాలైనా భరించే అమాయకులం.
ఏ అమెరికానుంచి అధ్యక్షులవారో.. బ్రిక్స్  దేశాల్నుంచీ అధినేతలో   వ్యాపారొప్పందాలు అడుక్కునేందుకు  మన దేశానికి ఎప్పుడూ వచ్చి పోతుంటారు.  ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని వీధుల్లో కనిపించకుండా దాచేయాలనుకోడం..  చిన్నగాళ్లమనేనా పెద్దబిచ్చగాళ్లముందు మా కిన్నేసి అవమానాలు?! ధర్మం కాదు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు 24 అక్టోబరు, 2009 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం- చిన్ని సవరణలతో)

 (ఈనాడు యాఅమాన్యానికి- కార్టూనిష్టు శ్రిధర్ గారికి ధన్యవాదాలతో)

Monday, October 10, 2016

గురువు.. దేవుడూ ఒకేసారి కనిపిస్తే..?

'
గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. 
యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు.
'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు.
గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.
అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం
ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది.
 మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.
అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు
కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు.
సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.
చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.
క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు.
అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.
కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే!
మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.
పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష.
గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు.
జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు.
'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.
బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన
విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.
'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు,
గాయత్రి ఉపదేశించినవాడు,
వేదాధ్యయనం చేయించినవాడు,
శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,
పురోగతి కోరేవాడు,
మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు,
మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,
మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.
దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
- కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, o5-o9-2009)

వార్తా వ్యాఖ్య-1 - సి.సి. కెమేరాలు

సి సి కెమేరాలు అంటే క్లోజ్డ్ సర్క్యూట్ కెమేరాలు. నిజానికి ఇవి సర్వ సాక్షి ధర్మాన్ని నిర్వహించే ఆధునిక యంత్రాలు. 'అంతటా ఉండి.. అన్నీ గమనిస్తుంటాడు దేవుడు' అని భక్తుల విశ్వాసం. అదెంత వరకు నిజమో .. చర్చనీయాంశం.  ఆ వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే ఆ నమ్మకాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించే అమాయకులు దైవభీతితో అయినా కొన్ని దుష్ట కార్యాలను ప్రయివేటుగానైనా చేసేందుకు జంకే అవకాశం కద్దు. సమాజానికి  మేలు కలిగే వరకు సి సి కెమేరాల ఉనికికి  అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు కూడా.
అభివృద్ధి చెందిన దేశాల్లొ సి సి కెమేరాలే నిఘా వ్యవహారాల్లో అధిక శాతం మానవ ప్రమేయాన్ని తగ్గిస్తున్నాయి. అమెరికా వీధుల్లో అడుగడుగునా ఈ నిఘా కెమేరాలు  కళ్లు విప్పార్చుకొని చూస్తుంటాయి రాత్రింబవళ్ళు. రోడ్డుమీద పోలీసుల ఉనికి ఆట్టే కనిపించక పోయినా .. ట్రాఫిక్ రూల్సు కాస్తంత ఉల్లంఘించినా ట్రాఫిక్ వ్యవస్థనుంచి తాఖీదులు రావడం.. కోరితే  వాటికి సంబంధించిన  సె. సి. కెమేరాల క్లిప్పింగులూ జత చేసుండటం వల్ల తప్పు చేసిన వారికి తప్పించుకొనే మార్గాంతరం తోచదు. అక్కడి నేర శిక్షా స్మృతులూ  సి సి క్లిప్పింగులను ముఖ్యమైన అధికారిక సాక్ష్యంగా అంగీకరిస్తాయి. కాబట్టి దోషికి జరిమానాలు చెల్లించక తప్పని పరిస్థితి. సి సి కెమేరాలకు మనుషులకు మల్లే రాగ ద్వేషాలు ఉండవు. కాబట్టి.. తప్పు పోలీసు వ్యవస్థనుంచి జరిగినా నిస్సంకోచంగా ఎత్తి చూపిస్తాయి. ఆ భయం వల్ల కూడా అమాయకులమీద అన్యాయంగా నేరారోపణలు చేసేందుకు జంకుతారు పోలీసులు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ సి సి కెమేరాలు క్రియాశీలకంగా తమ పనిచేసుకుంటున్నాయి.  నిత్యానందస్వామి రాసలీలలనుంచి..  'నోటుకి ఓటు వ్యవహారం' వరకు సి సి కెమేరాల పాత్ర ఎంతటిదో  వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టి యం లలో దూరి రొక్కం దొంగతనం చేసేవాళ్లు.. బంగారం దుకాణాల్లో దూరి  బెదిరించి సరుకు కొల్లగొట్టేవాళ్ల పాలిటి సింహస్వప్నం సి సి కెమేరా. ఇది నాణేనికి ఒక కోణం. రెండో కోణం నుంచి చూస్తే జరుగుతున్న అపాకారాలు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు దుస్తులు మార్చుకొనే  వ్యక్తిగత ప్రదేశాలలో, బసచేసే హోటళ్లలో దొంగతనంగా పెట్టిన కెమేరాల మూలకంగా అసాంఘిక శక్తులకు మరింత శక్తినిచ్చినట్లు అవుతున్నది. ఎంతో మంది అమాయకులు ఈ సి సి కెమేరాల వలల్లో చిక్కి విలవిలలాడడం.. పరువుకి భయపడి ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. సి సి కెమేరా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పండు కోసుకున్నట్లే.. గుండెల్నీ చీల్చవచ్చు. ఉపయోగించే వాడి మనస్తత్వంమీద అదంతా ఆధారపడి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్రం భూముల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇప్పుడు సి సి కెమేరాలు ఉపయోగించే ఆలోచన చేసున్నది ప్రభుత్వం. ఒకే సందర్భంలో ఒకే వ్యక్తి పేరుమీద ఒకటికి మించి రిజిస్ట్రేషన్లు జరపించడం, నకిలీ
 వ్యక్తుల ద్వారా పత్రాలమీద సంతకాలు చేయించడం, కార్యాలయాలకు ఆవల భూముల రిజిస్ట్రేషన్లు లోపాయికారీగా జరిగిపోవడం.. వంటి ఇంకా ఎన్నో చట్టబాహ్యమైన వ్యవహారాలకు సి సి కెమేరాల ప్రయోగంతో చెక్ పెట్టినట్లవుతుంది. కాకపోతే ఈ
సి సి కెమేరా ప్రయోగంకూడా దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్ట గలిగేది.
ఈ దేశం అత్యున్నతంగా భావించే రాజ్యాంగ వ్యవ్యస్థల్లో ఒకటైన పార్లమెంటు సభాప్రాంగణంలోనే.. ఒక అత్యంత విశాలమైన రాష్ట్రాన్ని రెండుగా విభజించే రాజ్యాంగ నిర్వహణ  సందర్భక్రమాన్ని  దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూసేందుకు
సి సి కెమేరాల అవకాశం కల్పిస్తున్నా.. వాటి కన్ను కప్పిన క్షణాలను మనం మర్చిపోకూడదు.
-కర్లపాలెం హనుమంతరావు
10-10-2016


    

Friday, October 7, 2016

కథానికః మా తెలుగుతల్లికి మల్లెపూదండ!- రచన మాస పత్రికలో ప్రచురితం


విద్యారణ్య- 
అన్ని రకాల హైటెక్ హంగులతో నేను నడుపుతున్న విద్యాసంస్థ అది. ర్యాంకులు పండించే విద్యాక్షేత్రంలో మా సంస్థ స్థానం మొదటినుంచి మొదటి మూడింటిలో ఒకటి. శాశ్వతంగా మొదటిస్థానంలోనే స్థిరపడాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో భాగంగానే ప్రపంచస్థాయి గుర్తింపున్న 'జీనియస్' గ్రూపుతో 'టై అప్' అవ్వాలని వ్యూహం. ఆ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఇప్పుడు చివరిదశకు చేరుకొన్నాం. ఇంకో గంటలో జరగబోయే సాంస్కృతిక ప్రదర్శనల్లోకూడా మా ప్రత్యేకత నిరూపించుకుంటే.. ఇహనుంచి నగరంలో మా విద్యారణ్యదే ప్రప్రథమ స్థానం.

కల్చరల్ ఈవెంట్ ఇన్-చార్జ్ మిసెస్ కపర్దీది ఓ ప్రసిద్ధ విద్యాసంస్థకు చెందిన  ప్రధానోపాధ్యాయురాలి హోదాలో దాదాపు ముఫ్ఫైఏళ్ల అనుభవం. అక్కడ పదవీ విరమణ అయిన వెంటనే ఇక్కడకు రప్పించాను పెద్ద జీతంతో! ఆమె గత సంబధాలమూలకంగానే 'జీనియస్' దృష్టిలో మా సంస్థ పడగలిగింది. నిలబడగలిగింది.
గ్రీన్-రూంలో మిసెస్ కపర్దీ విద్యార్థులకు చివరి హచ్చరికలు జారీ చేస్తున్నది. పదో తరగతి పిల్లలు హేమ్లెట్ ప్లేలెట్, దిగువ తరగతులవాళ్ళు బెంగాలీ రవీంద్రగీత్, పంజాబీ భాంగ్రా, ఒరియా ఒడిస్సీ.. అందరికన్నా ముందు కిండర్ గార్టెన్ పసిమొగ్గలతో వందేమాతరం! అన్నీ చక్కగా అమిరినట్లే కదంబంలో పూలవరసలా!
కార్యక్రమం పర్యవేక్షణకొచ్చిన బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో జాతీయస్థాయిలో నిష్ణాతులు. శ్యాంలీలా పర్షాద్, మాతంగి రమణ, బిజయ్ మిశ్రో, మదన్ లాల్ కథేరియా, దివిజశర్మ. దివిజశర్మకు మాత్రమే కొద్దిగా తెలుగు భాషతో పరిచయం. తెలుగు తెలిసినవారు లేకపోవడం నిజానికి ఒక అనుకూలమైన అంశం. ఒక తెలుగువాడు మరో తెలుగువాడిని ఎక్కిరానీయడన్న సామెత మనకుండనే ఉందిగదా! అదీ నా బాధ!
తెర లేచింది. 'వందేమాతరం' అద్భుతంగా పేలింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం మిసెస్ కపర్దీ చేసిన ఆంగ్ల ప్రసంగమూ అంతే 'ఇంప్రెసివ్'! పావుగంట బాలే, అరగంట ఆంగ్ల నాటిక. హిందీ గీతమాలిక జరుగుతున్న సమయంలో దివిజశర్మ వచ్చింది.' మావాళ్లు మీ తెలుగు ప్రోగ్రామ్సు చూడాలనుకొంటున్నారు. ఇంటర్మిషన్ తరువాత అవే అరేంజి చేయండి! ఒక గంట చూస్తాం' అంది.
నా గుండెల్లో రాయి పడింది. కార్పొరేట్ కల్చర్ కదా! హిందీ, ఇంగ్లీష్ లాంటివాటిమీద మాత్రమే మోజుంటుందని అనుకొన్నాం!
''ఫైవ్ ఆర్ టెన్ మినిట్సు అంటే ఏదో మేనేజ్ చేయగలంగానీ.. ఇప్పటికిప్పుడు గంటపాటు తెలుగు ప్రోగ్రామంటే ఎలా సార్?!' అని నాకే ఎదురు ప్రశ్న వేసింది మిసెస్ కపర్దీ!
'ఏదో ఒకటి మేనేజ్ చేయండి మ్యాడమ్! నెక్స్ట్ ప్రోగ్రాం మాత్రం తెలుగులోనే ఉండాలి. ఏం చేస్తారో .. మీ ఇష్టం!' అని చెప్పి  నా ఛాంబరుకి వచ్చేసాను.
వచ్చానన్నమాటేగానీ.. మనసు మనసులో లేదు. పర్యవేక్షక బృందం ఏదో ఆంతరంగిక చర్చల్లో ఉంది.. లంచ్ చేస్తూనే! వాళ్ల మధ్యలో దూరడం మర్యాదకాదు గనక కాఫీ  నా చాంబరుకి కాఫీ తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. ఆరు దశాబ్దాల కిందట బెనారస్ యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది.
అవి నేను ఎమ్మెస్సీలో ఫిజిక్సు చేసే రోజులు. అన్ని భాషలవాళ్లకి మల్లేనే తెలుగువాళ్ళకీ ఒక ప్రత్యేకమైన మెస్సు ఉండేది. ఓ చలికాలం ఆదివారం మధ్యాహ్నం. భోజనం లాగించి ఆరుబైట బండలమీద వెచ్చదనంకోసం కూర్చొని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం తెలుగు విద్యార్థులం.
ఒక పొట్టి మనిషి. నుదుట పట్టెనామాలు. ముతక పంచె.. లాల్చీ.  చేతిసంచీ ఊపుకొంటో  మా మధ్యకొచ్చి నిలబడి 'మీరంతా తెలుగు పిల్లలే కదుటోయ్! నాకో పని చేసి పెట్టాలి. ఓ గంటపాటు నేనో ఉపస్యాసం ఇచ్చిపోతా.  తెలుగు తెలిసినవాళ్లందర్నీ  వెంటనే పోగేయాలి!' అన్నాడు!
'ఈయనెవడ్రా బాబూ! పిలవని పేరంటానికొచ్చిందికాక.. ఉపన్యాసాలిస్తానంటున్నాడు!' అని మాకు ఒకటే ఆశ్చర్యం. మా బృందనాయకుడు సుబ్బరాజుకి మొహమాటం తక్కువ. పొట్టిమనిషి మొహంమీదే 'తమరెవరు మహానుభావా?' అంటూ   వెటకారంగా వెళ్ళబోసాడు.
పొట్టాయన ఆ వెటకారాన్నేమాత్రం పట్టించుకోలేదు. 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ!' పాట ఎప్పుడన్నా విన్నారుటోయ్? ఆ గీతాన్ని రాసింది నేనే!' అనేసాడు.
ఇండియాకు స్వాతంత్ర్యంవచ్చి అప్పటికి నిండా పదేళ్ళుకూడా నిండలేదు. జనంలో ఇంకా దేశభక్తి ఇప్పట్లా పూర్తిగా ఇంకిపోని కాలం. 'మా తెలుగుతల్లి' పాట చాలా సార్లు వినివుండటంచేత మా ఎదురుగా నిలబడి ఉన్నది శంకరంబాడి సుందరాచారిగారని తెలుసుకొన్నాం. అమాంతం గౌరవం పెరిగిపోయింది. సుబ్బరాజూ అందుకు మినహాయింపు కాదు. స్వరంలోని మునుపటి దురుసుతనం తగ్గించుకొని ‘ఇప్పటికిప్పుడు జనాలని పొగేయాలంటే ఎలా సార్?' అని నసిగాడు.'సరేలేవోయ్! రేపు నాలుగ్గంటలకి పెట్టుకోండి. నేను నేరుగా మీ మీటింగుహాలుకే వచ్చేస్తా!' అంటూ చేతిసంచి ఊపుకొంటూ మాయమైపోయారు శకరంబాడి సుందరాచారిగారు.
తెలుగు సంఘం ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి. ఈ వంకతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో అది తనకు ఉపయోగపడుతుందని సుబ్బరాజు ఎత్తుగడ. వాడి పూనికతో భారీగానే పోగయ్యారు జనం.
నాలుగ్గంటలకు అనుకొన్న కార్యక్రమం ఆరుగంటలగ్గానీ మొదలవలేదు. ఆలస్యానికి కారణం సుందరాచారిగారే! ఆలస్యానికి క్షమాపణలైనా అడగలేదు. వచ్చీ రాగానే మైకు అందుకోబాయారు. 'ఇప్పుడు మొదలైతే ఎప్పటికయ్యేను? ఇంకో రెండు గంటలయితే మెస్సుకూడా మూసేస్తారు!' అంటూ సుబ్బరాజు బిగ్గరగానే గొణుకుడు.
విన్నారులాగుంది పెద్దాయన 'తిండికోసం వెంపర్లాడేవాళ్ళకోసం కాదు నా ప్రసంగం. ఇష్టం లేనివాళ్ళు నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా!' అంటూ మైకందుకొన్నారు.
ఆద్యంతం ఆయన ఉపన్యాసం సాగిన తీరు అత్యద్భుతం. తెలుగుభాష విశిష్టతనుగూర్చి సాగిన ఆ ప్రసంగం ఓ రసగంగాప్రవాహం. తలమునకలా ఆ గంగలో తడిసి ముద్దవని తెలుగువాడు లేడు.
తొలిఝాములో వినిపించే కోడికూతలనుంచి పొద్దుపోయిన తరువాత వీధుల్లో సంచరించే కుక్కల అరుపులదాకా.. ఆయన అనుకరించని జీవజాలం లేదు. పల్లెజీవనంలోని తెలుగుదనం కమ్మదనం సుందరాచారిగారి స్వరంలో ఆవిష్కరణ అయిన వైనం మామూలు మాటల్లో వర్ణించనలవి కానిది.
తొలిసంజె వెలుగుల్లో ఇంటిగుమ్మాలముందు  రంగవల్లులు తీరుస్తూ ఇంతులు పాడుకొనే పాటలు, కోడికూతతో లేచి పొలంబాట పట్టే రైతన్నలు ఆలమందలని అదిలించుకొంటూ తీసుకొనే కూనిరాగాలు, అత్తాకోడళ్ళు, వదినామరదళ్ళు రోటిపోటుల దగ్గర ఆడిపోసుకొనే సరదా సూటిపోటు పాటలు, పెద్దపండుగ సంబరాల్లో వీధివీధీ తిరిగే హరిదాసయ్యల చిందులు,  ఇంటిల్లిపాదిని ఆశీర్వదించిగాని పక్కగుమ్మం తొక్కని గంగిరెద్దుల ఆటలు.. శంకరాచారిగారి గొంతులోనుంచి అలా అలా జాలువారుతుంటే మెస్సు భోజనం సంగతి ఇంకేం గుర్తుకొస్తుందెవరికైనా?! 'తప్పయిపోయింది స్వామీ! క్షమించండి' అంటూ సుబ్బరాజే చివరికి చేతులు జోడించాల్సి వచ్చింది. అంతకన్నా తమాషా ఆయన అవేవీ పట్టించుకోకుండా అప్యాయంగా సుబ్బరాజును అక్కున చేర్చుకోవడం!
మెస్సువాళ్లూ సభలోనే ఉండిపోవడంతో అందరికీ ఉపవాస బాధ తప్పిందనుకోండి ఆఖరికి!
ఆ రాత్రంతా సుందరాచారిగారు మా హాస్టలుగదిలోనే బస చేసారు. ఉపన్యాసం ఎంత ఉదాత్తంగా ఉందో.. ఆ పూట ఆయన చెప్పిన మాటలు అంతకన్నా ఉత్తేజకరంగా ఉన్నాయి. 'తేనెలొలికే తెలుగుభాష సౌందర్యాన్ని వివరించి చెప్పడం నా బోటి వామనుడికి తలకుమించిన పని. అయినా కాని, చేతకాదని చేతులు ముడుచుకొని మూల వదిగే మనస్తత్వం కాదు నాది.  కాబట్టే చేతనైనంతలో అమ్మభాష కమ్మదనాన్ని నేల నాలుగుచరగులా ప్రచారం చేయడానికి పూనుకొన్నది.' అంటో చేతిసంచిలోనుంచి కొన్ని పుస్తకాలని తీసి పంచిపెట్టారు మాకందరికీ! అదృష్టంకొద్దీ నాకూ ఒక పుస్తకం దక్కింది సుందరాచారిగారు స్వహస్తాలతో  చేసిన సంతకంతో సహా! ఆ నాటి ఆ పల్లెపదాల పుస్తకం  ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.
పండిత పామర జనరంజకంగా తెలుగుభాషా సౌందర్యాన్ని పుస్తకరూపంలో ప్రచురించాలని సుందరాచారిగారి ఆశయంట. అందుకోసం ఓ అయిదంచల ప్రణాళిక సిద్ధంచేసుకొని  ఆర్థికవ్యవహారాలను చక్కబెట్టుకొనే ఉద్దేశంతో పెద్దలందరిని కలుస్తున్నారుట. అప్పట్లో హస్తినలో పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యక్షపదవిలో ఉన్నారు. 'ఆయన్ని కలసి తిరిగి వెళుతూ ‘తెలుగు పిల్లలు మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. తెలుగు ఎక్కడుంటే నేనక్కడ ఉండాలన్నది  నా ఆకాంక్ష. తెలుగును ఎవరన్నా చిన్నచూపుచూస్తే నాకు తిక్కరేగుతుంది. వేల ఏళ్ళ చరిత్రగల మన తెలుగు ఇతర భాషల ధాష్టీకంవల్ల నష్టపోరాదన్నదే నా పంతం' అని చెప్పుకొచ్చారాయన.. ఆ రాత్రంతా నిద్రమానుకొని.. మమ్మల్నీ నిద్ర పోనీయకుండా!
'ఇప్పటి నా కష్టాన్నికూడా గట్టెక్కించడానికి రాకూడదా గురువుగారూ!' అనిపించింది నాకు ఆ క్షణంలో. మరుక్షణంలోనే నా పిచ్చి ఊహకు నవ్వూ వచ్చింది. ఎక్కడో ఓ కంఠం ఖంగున మోగుతుంటే ఈ లోకంలోకొచ్చి పడ్డాను.
'అదే గొంతు! అదే వాగ్ధార! శంకరంబాడి సుందరాచారిగారిది! ఇక్కడికి ఎందుకొస్తారు? ఎలా వస్తారు? నా భ్రమ కాకపోతే!' లేచి ఛాంబర్ బైటికి వచ్చాను.
వేదికమీద మైకుముందు కార్యక్రమాలకని ఏర్పాటుచేసిన అలంకరణ విద్యుద్దీపాల వెలుగులో సుందరాచారిగారు కంచుకంఠంతో ఉపన్యాసం దంచేస్తున్నారు.. తెలుగులో! తెలుగురాని పర్యవేక్షకబృందంకూడా మంత్రముగ్ధమయినట్లు వింటోంది! కనురెప్ప కొట్టడంకూడా మర్చిపోయేటంతగా కనికట్టు చేసున్నది ఆ మాట.. పాట.. ఆట!
మధ్య మధ్యలో ఆంగ్లపదాలతో.. హిందీపదప్రయోగాలతో.. సంస్కృతశ్లోక భూయిష్టంగా తెలుగుభాష ఔన్నత్యాన్నిగూర్చి ఆయన చేసేప్రసంగం అచ్చు శంకరంబాడిగారి శైలిలోనే ఉద్వేగంగా ఉరకలేస్తోంది!
'మంచి ప్రసంగం!' అంటూ మధ్యలో దివిజశర్మ లేచొచ్చి నన్ను అభినందించడంతో ఫలితం సగం తెలిసిపోయినట్లయింది.
శంకరాచారిగారి ఉపన్యాసంలోని చాలా అంశాలు నాకే చురకలు అంటించే విధంగా ఉన్నాయి. '
నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు' అని రాసిన పలకలు పసిపిల్లల మెడల్లో వేయడంకన్నా అమానుషం మరోటుందా? మాతృభాష ప్రాముఖ్యం తెలీని మూర్ఖులు చేసే వికృత చేష్టలవి. పసిబిడ్డల్ని తల్లిభాషనుంచి వేరుచేయాలనుకోవడం తల్లినుంచి వేరుచేయడమంత పాపం. పరిసరాలనుంచి సహజసిద్దంగా అబ్బేసంపద తల్లిభాషద్వారా అందే విజ్ఞానం. దానికి దూరమయే బిడ్డడు భాగ్యవంతుడు ఎలా అవుతాడు? బాల్యంలో అమ్మభాష సాయంతో లోకాన్ని అర్థంచేసుకొన్నవాడే ఎదిగివచ్చిన తరువాత  కొత్తభాషల సారాన్ని జుర్రుకొనేది.  భాషావేత్తలనుంచి, మానసిక శాస్త్రవేత్తలదాకా అందరూ నిర్ధారిస్తున్న సత్యం ఇదే! ఇహ తెలుగుకి వద్దాం! ఇటాలియన్ భాషకి మల్లే పదం చివర హఠాత్తుగా విరగని మంచిగుణం తెలుగుకి వరం. వేదాలు ఆదిలో తెలుగులోనే ఉన్నాయని ఊహించడానికి ఈ సంగీతగుణమే కారణం. ఏ భాషాపదాన్నయినా తల్లి బిడ్డను పొదువుకొన్నట్లు పొదువుకోగలదు తెలుగుభాష. సంగీతంలోని ఏ శబ్దానికైనా తెలుగంత సమీపంలోకి  రాగల ద్రావిడభాష మరొకటి లేదు. కంప్యూటర్లో వాడే బైట్స్(bytes) పరిజ్ఞానానికి తెలుగంత అనుకూలత ఆంగ్లానిక్కూడా లేదని ఏనాడో 'సైన్స్య్ టు డే' లాంటి వైజ్ఞానిక పత్రికలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. జనం నాలికలమీద సహజంగా పలికే భాషలో చెబితేనే ఏ విషయమైనా చొచ్చుకుపోవడం సులభమవుతుంది.  క్రైస్తవమత ప్రచారకులనుంచి, శైవమత ప్రచారకులవరకు అర్థమయిన ఈ విషయం మన తెలుగునవనాగరీకులకే ఎందుకో తలకెక్కడం లేదు! ఆంగ్లం పట్టుబడకపోతే నేటి పోటీప్రపంచం ధాటికి తట్టుకోవడం కష్టమని తల్లిదండ్రుల భయం. ఆ భయం అర్థం చేసుకోదగ్గదే! కానీ.. అందుకోసం బిడ్డ కడుపులో పడ్డనాటినుంచే ఏబిసిడిలు తప్ప మరోటి ‘అనరాదు.. వినరాదు.. కనరాదు' అని ఆంక్షలు విధించడమే విడ్డూరం! వసతో పాటు ఆంగ్లాన్ని రంగరించి పోయాలన్న తల్లిదండ్రుల ఆత్రం  చూస్తే నవ్వొస్తోంది. కోపమూ వస్తోంది. అభివృద్ధికి ఆంగ్లానికి ముడిపెట్టేవాళ్ళు చైనా, రష్యాల్లాంటి దేశాల ప్రగతికి ఏం సమాధానం చెబుతారు?! సొంతభాషంటే సొంత ఉనికిని చాటే ప్రకటన, తమిళుడికి తమిళమంటే ప్రేమ. కన్నడిగుడికి కన్నడమంటే ప్రాణం. మరాఠీవాడికి మల్లే మనమూ మనభాషను ఠీవీకి దర్పణంగా ఎందుకు భావించమో అర్థంకాదు! పిల్లల క్కాదు.. ముందు బుద్ధి రావాల్సింది పెద్దలకి, తల్లిదండ్రులకి, విద్యావేత్తలకి! ముఖ్యంగా  ఈ తెలుగుగడ్డమీద! ఆముక్క చెప్పిపోదామనే నేనిక్కడదాకా వచ్చింది' అంటుంటే హాలు హాలంతా కరతాళ ద్వనులతో మిన్నుముట్టింది.
'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చిన వాళ్ళలో పర్యవేక్షక బృందమూ ఉంది.
*                              *                      *


'జీనియస్'సంస్ఠ నగరఫ్రాంచైసీ మా 'విద్యారణ్య'కే దక్కిందని వేరే చెప్పవల్సిన పని లేదనుకొంటా.
అరవైఏళ్ళ కిందట పిలవని పేరంటానికి వచ్చి మమ్మల్నంతా మంత్రముగ్ధుల్నిచేసారు శంకరంబాడి సుందరాచారిగారు.  మళ్ళీ అదే తరహా మాయాజాలంచేసి మమ్మల్ని గట్టెక్కించి పోవడానికి రావడం ఎలా సంభవం?!
ఎవరు పిలిచారని ఇక్కడిదాకా వచ్చి తెలుగు ఔన్నత్యంతో పాటు  అవసరాన్ని గురించీ కుండబద్దలు కొట్టినట్లు!
వేదికమీద ప్రసంగంచేసిన సుందరాచారిగారు సుందరాచారిగారు కాదు. ఆయన శిష్యపరమాణువులాంటి రామాచారిగారుట! గంటపాటు తెలుగుకార్యక్రమం సమర్పించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు   మిసెస్ కపర్దీకి ఠక్కుమని గుర్తుకొచ్చిన ఆపద్భాంధవుడు ఆయన. మిసెస్ కపర్దీ పూర్వం పనిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. పిల్లలకి ఆంగ్లపాఠాలు చెబుతూనే తెలుగుభాష గొప్పతనాన్ని గురించీ కథలు, పాటలు, పద్యాలు చెబుతుండేవాడుట! ఆ విషయమై యాజమాన్యంతో గొడవలైతే  ఉద్యోగం వదులుకోవడానిక్కూడా సిద్ధపడ్డాడుట! ‘పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు  ఆంగ్ల, తెలుగు సజ్జెక్టుల్లో  తర్ఫీదు ఇచ్చే ఏదో కోచింగు సెంటర్లో అత్తెసరు జీతానికి  పొట్టపోసుకొంటున్నాడు ప్రస్తుతం’ అని మిసెస్ కపర్దీ వివరించింది.
రామాచారిగారు చేసిన ఉపకారానికి తృణమో ఫణమో ఇద్దామనుకొన్నాను. తృణంలాగే తృణీకరించాడా సాయాన్ని! ఫణంగా కోరిన కోర్కె మాత్రం విచిత్రమైనది. 'మీ ఉదయంపూట ప్రార్థనల్లో  'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాట పాడించండి చాలు! అలాగైనా పిల్లలకు ‘మన తెలుగుభాషం’టూ ఒకటుందని మన్నన ఉంటుంది' అనేసాడు.
ఆ పని  ఎటూ నేను చేయాలనుకొన్నదే!
పాఠ్యప్రణాళికతో నిమిత్తం లేకపోయినా  మాతృభాషను కనీసం ఐదు తరగతులవరకైనా ఐచ్చికంగా నేర్చుకోవడానికి సిద్దపడ్డ పిల్లలకే  మా విద్యారణ్యలో ప్రవేశం. ఆ నిబంధన విధించడానికి అంగీకరించిన తరువాతే జీనియస్ సంస్థ మాతో టై-అప్ అవడానికి సిద్ధపడింది. .
‘తెలుగు విభాగానికి రామాచారిగారినే బాధ్యులని చేస్తే సరి. సుందరాచారిగారే మన మధ్య మసలుతున్నట్లుంది గదా సార్!’ అని సలహా ఇచ్చింది మిసెస్ కపర్దీ.
మంచి సూచన. ‘తెలుగు ఎక్కడ ఉంటుందో తనక్కడ ఉండాలన్న గురువుగారి ఆకాంక్షా నెరవేర్చినట్లుంటుంది’ అనిపించింది నాకు.
'అది సరి కాదేమో సార్! సుందరాచారిగారిలాంటి వాళ్ళెక్కడ ఉంటే అక్కడ మాత్రమే తెలుగు వినబడే పరిస్థితి వచ్చిందేమో!' అన్నాడు రామాచారిగారు ఆ తరువాత కలిసినప్పుడు!
కాదనగలమా!
-కర్లపాలెం హనుమంతరావు
మా 'తెలుగు తల్లి' గీతం వినాలనుకొనేవారికోసం ఈ లంకెః
https://youtu.be/uNE4RJ36ONU

***

(రచన మాస పత్రిక అక్టోబర్, 2016  సంచికలో ప్రచురితం)







బుద్ధికి బుద్ధుండాలంటే..!

బుద్ధి కూడా శరీరంలో ఒక అవయవమే! చేతనాత్మకమైన మెదడుని బుద్ది అనుకోవచ్చు. వయసు.. ఆరోగ్యం.. పరిసరాలు.. సందర్భాలమీద ఈ బుద్ధిలోని చేతనాత్మకతలో హెచ్చు తగ్గులు సహజం.
కంప్యూటరుతో బుద్ధిని పోల్చలేం. బుద్ధి కంప్యూటరుకన్నా రెండాకులు ఎక్కువ తిన్న గడుసుపిండం. సూక్ష్మంలో మోక్షం అన్న సామెత మనకోటి ఉంది కదా! బుద్ధికి అతికినట్లు సరిపోతుందా సామెత. 
కంప్యూటరుకి మనం పనిగట్టుకొని ఆదేశా లివ్వాలి. రాంబంటులా  అది పని చేసుకుపోతుంది. బుద్ధి అంతకన్నా బుద్ధిమంతురాలది.  మనంగా  ఏ సమాచరమూ గట్రా ఇవ్వక పోయినా .. సొంత తెలివితేటలతో తనకై తాను  గ్రహించి..  భద్ర పరుచుకొని.. విశ్లేషించుకొని.. ఆనక  సమయ సందర్భాలనుబట్టి మన సాయానికొస్తుంది.. అచ్చంగా కట్టుకున్న ఇల్లాలిలాగా. 
మన శరీరం  ఎదగాలంటే ఆహారం, గాలి, నీరు, కాలం .. కావాలి! మేత ఆగితే కూత మందగిస్తుంది. కానీ మనం కాణీ ఖర్చుచెయ్యకుండానే  కొంతకాలం బుద్ధి తన మంచి చెడ్డలు చూసుకోగలదు. మరీ నిర్లక్ష్యం చేస్తే కనక.. పెళ్లాం అలిగి పుట్టింటికి పోయినట్లు.. సహకరించడం మానేస్తుంది. 
'మేథస్సు జీవితాంతం ఎదుగుతూనే ఉంటుంది'- అన్న  మిల్టన్ మహాకవి ఎందుకన్నారో కానీ ఆ  సూక్తి కొంత మేరకే నిజం. అలా  ఎదగాలంటే ఎదురుగాలి లేకుండా చూసుకోడం సదర మనిషి బాధ్యత.
మెదడుకూ ముదిమి తప్పదు. కానీ శ్రద్ధాసక్తుల కనపరుస్తే  దాని జవసత్వాలు  మనం   అధీనంలోనే పనిచేస్తాయి చివరి వరకూ దాదాపు.
మెదడుకు సంబంధించిన పదం మేథస్సు. మేథస్సు పరిరక్షణకోసం మెదడుకి మూడు రకాల ధర్మాలు నిర్దేశించబడ్డాయి. ధీ.. ధృతి.. స్మృతి.
'ధీ'-  విషయాలను గ్రహించుకొనే లక్షణం. ధృతి- విశ్లేషించుకొనే లక్షణం
స్మృతి- గుర్తుకు తెచ్చే లక్షణం.
ఈ మూడూ ఒకదానికొకటి అనుసందానంగా ఉండి పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండటమే 'మేథస్సు'. 
మేథస్సంటే ఒక విధంగా  బుద్ధిబలం. వెన్నుపూసల నెత్తిమీద ముద్దలా ఉంటుందది.  చిక్కుముడుల రూపంలో కనిపించే నరాల సముదాయానికి సైంటిష్టులు  'బైన్' పేరు పెట్టుకున్నారు. వెన్నుపూసల నరాలనుంచి అందే   సంకేతాల ప్రకారం  ప్రవర్తించడం మెదడు ధర్మం.  జంతు దశలో జరిగే జీవక్రియ ఇది. జీవపరిణామంలో మనిషి మరింత వికాసం సాధించిన తరువాత కేవలం ఈ సంకేతాలకే పరిమితం కావడం కుదరలేదు. ఆలోచన.. స్వీయ రక్షణ.. జ్ఞాపక శక్తి మరింత అవసరమయ్యాయి.  మనిషి 'బుద్ధి' మరింత బలంగా .. ధృఢంగా.. తయారు కావాల్సిన  అవసరాలు పెరుగుతో వస్తున్నాయి. కాన్సెఫలాన్(consephelon) అనే మరింత శక్తివంతమైన నరాల వ్యవస్థ అందుకే ఏర్పాటయింది.
మెదడులో లేత పదార్థం (grey matter), తెల్ల పదార్థం ( White matter), రక్త నాళాలు.. కాసిన్ని మాంస ధాతువులు కలగలసి ఉంటాయి.
మెడుల్లా అబ్లాంగేటా(medulla Oblongata), వెనక తల (Hind Brain). మధ్య తల(Mid Brain), సెరిబ్రమ్ (Cerebrum) అని నాలుగు భాగాల కూడలి అని కూడా అనుకోవచ్చు మెదడుని.
'అన్నీ వేదాల్లో ఉన్నాయిష' అని విశ్వసించేవాళ్లకు   సంతోషం కలిగించే ఒక పోలిక ఇక్కడ దొరుకుతుంది. విశ్వసృష్టికర్తగా ఖ్యాతి గడించిన విధాతక్కూడా నాలుగు ముఖాలుంటాయంటారు కదా! బ్రహ్మగారికి  శక్తి వీణాధరి వాణి. ఆమె ధరించిన  వీణ తాలుకు  తంత్రులను పోలినవే మెదడు నరాలు. కేవలం జంతుమాత్రులకు సాధ్యం కాని 'ఊహ.. ఆలోచనలు' మనిషి చేయగలుగుతున్నాడంటే  ప్రేరణ  ఈ నరాల ప్రకంపనలే.
మెదడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మేథస్సుకు తిరుగు లేదు. ఆయాచితంగా దక్కిన  మేథస్సును అపురూపంగా, పదిలంగా, ఆరోగ్యంగా చూసుకొనే సూచనలు  వివిధ ఆరోగ్య శాస్త్రాలలో పదిలంగా  ఉన్నాయి.
భారతీయుల వైద్యశాస్త్రంగా పేరొందిన  ఆయుర్వేదం మెదడును గురించి చెప్పే జాగ్రత్తల ప్రస్తావనలతో ముగిద్దాం ఈ చిన్న వ్యాసాన్ని.  నిత్య జీవితంలో తేలిగ్గా ఆచరించగల వాటిన ఏరుకొని ఇక్కడ ఇస్తున్నది.
ఆహారం, నిద్ర, జీవనశైలి మీద క్రమం తప్పని శ్రద్ద మేథస్సుని జీవిత కాలమంతా ఆరోగ్యంగా ఉంచుతున్నదన్నది ఓ నమ్మిక.
1.    తినే ఆహారానికి చేతనత్వం, ప్రాణత్వం ఉండాలని గీతలో భగవంతుడుకూడా ఉవాచిస్తున్నాడు. సాత్వికాహారంలో ఇవి సమృధ్ధిగా లభిస్తాయి కూడా. వండకుండా  ఫ్రిడ్జుల్లో  భద్రపరిచిన ఆహారం, రసాయనాలు సాయంతో పండించిన పదార్థం జీవశక్తిని బలహీన పరుస్తాయి.
2.   నెయ్యి, పాలు, తేనె.. కేవలం మధుర పదార్థాలే కాదు.. జీవరసాయనాలు కూడా.
      నెయ్యి, వాము కలిపి  తల్లి తినిపించే గోరుముద్ధలు పసిపిల్లలకు మేథోరసాయనాలే.
     ఉన్నత పాఠశాల, కళాశాలలకు వెళ్లే వయసు పిల్లలకు ఆహారంలోని మొదటి ముద్ద
     పేరిన నెయ్యి, ఉసిరికాయతో కలిపినదయితే వారి తెలివి తేటలు వృద్ధి చెందుతాయి
    ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే పిల్లలలకు నెయ్యి, మినుము, బెల్లం కలిపిన ఉండలు మనసు
    శరీరాన్ని దార్ఢ్యంగా మారుస్తాయి. ఆడపిల్లల్లో అయితే హార్మీనుల సమతౌల్యాన్ని
    సాధిస్తాయి.
3.   తేలిగ్గా జీర్ణమై రసంగా మారి శరీరానికి, జీవకణాలకి శక్తిని అందించే ఆహారం ప్రాణాహారమని భావన. రాత్రి పడుకునే ముందు వేడిపాలల్లో .. పటిక బెల్లం కలిపి తీసుకుంటే ప్రాణాహార అవసరం చాలావరకు తీరినట్లే.  బాధం, జీడి పలుకులు రెండో మూడో పాలతో కలిపి తీసుకుంటే.. పెద్దవయసువారికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి నిద్రా వస్తుంది. మంచి నిద్ర బుద్ధి వికాసానికి దోహదం.
4.   మెదడులోని జీవకణాలు ఎప్పుడూ చాలా వత్తిడిమీదుంటాయి. వాటికి ఎక్కువ ప్రాణాహారం అవసరం. ప్రాణాయామం ఆ అవసరాన్ని తీర్చే సాధనం.
5.   మన శరీరానికి అందించే ఆహారంలో ముప్పై శాతం ఒక్క ఒక్క తలే తినేస్తుంది. నిద్రలో అయినా  మెదడుకి బద్ధకం పనికి రాదు. జాగృత, స్వప్న, సుషుప్త అనే మూడు దశల్లో సైతం  విధి నిర్వహణ తప్పనప్పుడు అందుకు తగ్గట్లు ప్రాణాహారం అవసరమే కదా! లేదంటే కోమాలోకి జారిపోయే ప్రమాదం పొంచుంటుంది. మరణకారణాలలో కోమా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మెదడుకు అవసరమైన ప్రాణాహారం  సరస్వతీ లేహ్యం, బ్రహ్మీ రసాయనం, అశ్వగంధి వంటి ఔషధాలలో దొరుకుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
6.   రాత్రి పెరుగు మానేయడం బుద్ధికి మనం చేసే మంచి మేలని వైద్యుల సలహా!

ఈ సూచనలేవీ పాటించలేనంత కష్టమైనవి కాదు కదా! సూక్ష్మ బుద్ధిశాలులుగా జీవిత పర్యంతం జీవిస్తే స్వంతానికే కాదు.. మనమీద ఆధార పడ్డ వారికి, ముదిమిలో మనం ఆధార పడ్డవారిక్కూడా తప్పించుకోదగ్గ కష్టాలనుంచి తప్పించినట్లే అవుతుంది.
***
(సూచనః ఈ వ్యాసంలోని ఆరోగ్య సూచనలు దాక్టర్ ఇవటూరి రామకృష్ణగారివి. సోర్సుః స్వాతి 31-03-2009 నాటి సంచిక. కేవలం పాఠకుల ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే ఈ టపా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
-కర్లపాలెం హనుమంతరావు







మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...