Friday, March 3, 2017
జ్ఞాన 'సముపార్జన' - వ్యంగ్యం
" 'అజ్ఞానం' అంటే ఏంటి గురువా?"" 'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?""తెలీదు కనకనే కదా స్వామీ.. తమరి దగ్గరికీ రాక!""ఆ తెలీక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా""ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా సెలవివ్వండి స్వామీ?"" 'స్వ' అనద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది. ఆ విశేషణం నీ సొంతానికి వర్తించేది. రాజకీయాల్లో ఉంటే మినహా డాంబిక పదప్రయోగాలు హాని చేస్తాయ్. అది తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే' ""చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడుంటుందో కూడా వివరించి పుణ్యం కట్టుకోండి స్వామీ?"గురువుగారు గడ్డం నివురుకున్నారు.
Thursday, March 2, 2017
పిల్లాడొస్తాడా? - పి. సత్యవతిగారి కథ- నా పరామర్శ
ఆదివారం
ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని నా అభిప్రాయం.
ఒక సాధారణ
మధ్యతరగతి కుటుంబం. కుటుంబ ప్రధాన పాత్ర చుట్టూ సుళ్ళు తిరిగే ఆలోచనా స్రవంతిని కథారూపంగా
మలిచారు రచయిత్రి.
ఆ ప్రధాన పాత్ర
విజయ ఒక సాధారణ గృహిణి. భర్త ఏదో వృత్తిపని మీదా,
ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసుకుని వేరే దేశాల అవతలా. ఎదిగిన కొడుకు మాత్రం ఇక్కడే ఇంజనీరింగు చదువుతున్నాడు.
ఎనభైయేళ్ళ అమ్మమ్మను నాలుగు రోజులు ఉండిపోతుందని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటుందా ఇల్లాలు.
ఆ ఆమ్మమ్మ
ఒకానొక కాలంనాటి గృహిణికి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఈ అమ్మాయి ఈనాటి గృహిణి ఆలోచనలకు
ప్రతిరూపంగా కనబడుతుంటుంది.
ఇంజనీరింగు
చదువుకునే పిల్లాడు ఒక వానరాత్రి ఎప్పటిలాగా పెందలాడే ఇంటికి రాకా.. ఎక్కడున్నాడో ఫోను
చేయకా.. తల్లి చేసే ఫోనులకూ అందుబాటులో లేని నేపథ్యంలో కథ ఆసాంతం సాగుతుంది. పిల్లవాడికి సంబంధించిన ప్రపంచమేదీ తల్లికి ఏ కోశానా ఆచూకీ దొరకని సందర్భంలో తల్లిహృదయం తెల్లార్లూ ఎంతలా తల్లడిల్లిపోతుందో ప్రతీ ఇల్లాలకీ ఎప్పుడో ఒకసారి తప్పక అనుభవంలోకి వచ్చే అనుభవమే అయివుంటుంది. అటువంటి
సందర్భాలలో ఏ తల్లికయినా
కొడుకు యోగక్షేమాలను గూర్చి వచ్చే ఆలోచనల్లో అపశకునపు పాళ్లే అధికంగా ఉంటాయి.
తాగి బైకు
నడుపుతుంటే ఎదురుగా వచ్చిన మరో తాగుబోతు లారీ గుద్దేసినట్లు, లిఫ్టిచ్చిన ఆగంతకుడు
సందు చూసుకుని ఉంగరాలు, వాచీలు, సెల్ఫోనుల్లాంటి
ఖరీదైన వస్తువులకోసం ప్రాణాలు తీసి పారిపోయినట్లు, స్నేహితుల పుట్టిన్రోజు పార్టీలో గర్ల్ ఫ్రెండ్సు గురించిన వివాదం ముదిరి
బిడ్డ ప్రాణాలకు ముప్పం ఏర్పడినట్లు, సందుచివరి పిల్ల సంధ్యతో కలివిడిగా తిరగడం చూసి
నచ్చక ఆ పిల్ల తాలూకు వాళ్లెవరో ఏదో అపాయం
తలపెట్టినట్లు… ఇలా అన్నీ ప్రతికూలమైన ఆలోచనలు
చేస్తుండే నేటితరం గృహిణి విజయ. ఆ ఇల్లాలి ఆలోచనలు అత్యంత సహజంగానే సాగుతున్నాయని చదువరులకూ
అనిపిస్తుంటుంది. కానీ ఎనభైయేళ్ళ ఆమె అమ్మమ్మకు
మాత్రం విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ ముసలమ్మా
తన రోజుల్లో ఇలాగే మొగుడూ, బిడ్డలూ
వేళకు ఇంటికి రాకపోవడంలాంటివి అనుభవాలు చవిచూసిన ఘటమే. అయినా ఎన్నడూ ఈ విధంగా ప్రతికూలమైన ఆలోచనలు చేయాలని తోచనేలేదు. ఎంత ఆలస్యమైనా ఎక్కడో ఒకచోట ఏదో ఒక మంచిపనిలో ఉండుంటారన్న పాజిటివ్ ఆలోచనలే సాగుతుండేవి
మనసులో. స్వాతంత్ర్యయుద్ధానంతరం సాంస్కృతికి
పునరుజ్జీవనం పుంజుకునే రోజులు. కాబట్టి ఇంట్లోని మగవాళ్ళు వాటికి సంబంధించిన ఏవో పునర్నిర్మాణ కార్యక్రమాల్లో మాత్రమే తలమునకలై ఉంటారనే ఒక గట్టి నమ్మకం. ఆ భావనవల్ల ఏర్పడ్డ గుండె నిబ్బరంతో తమ వాళ్ళను గురించిన ఆలోచనలు ఆ విధంగానే చేసుకుంటూ ఇంటిపనులు చక్కబెట్టుకునే
తత్వం అలవడ్డంవల్ల మనుమరాలు చేసే ప్రతికూల
ఆలోచనలు అబ్బురం అనిపిస్తుంటాయి. పిల్లాడు ఇంటికి వచ్చిందాకా పచ్చి మంచినీళ్ళయినా ముట్టనని
మనుమరాలు భీష్మించుకుని కూర్చోవడం అందుకే ఆ పెద్దావిడకు అంతలావు విస్మయం కలిగిస్తుంది.
సొంతచేతులతోనే
కనిపెంచిన బిడ్డల సంస్కారాలమీద పరోక్షంలోనైనా
కన్నతల్లులకు కించిత్ విశ్వాసం లేకుండా పోవడం
ఆ పెద్దావిడ విస్మయానికి అసలు కారణం.
కథ అంతటా పరుచుకుని
ఉన్న అమ్మమ్మగారి అనుకూల మనస్తత్వ ధోరణి (పాజిటివి పర్సనాలిటీ). మనమరాలు తాలూకు ప్రతికూల
మానసిక ధోరణి (నెగటివ్ పర్సనాలిటీ).. రెండు
విభిన్న తరాల సంస్కారలమీద 'ధ్వని'మాత్రంగా
రచయిత ప్రకటించిన అభిప్రాయంగా 'పిల్లాడొస్తాడా?'
కథను నేను భావిస్తున్నాను.
కథాంతంలో-
తెల్లారిని తరువాత కాలింగ్ బెల్ మోగినప్పుడూ.. ఎవరే దుర్వార్త మోసుకొచ్చారోనని మనుమరాలు
సోఫాలో కుప్పకూలినట్లు కూర్చుండి పోతే.. 'ఒక వేళ పిల్లాడే వచ్చాడేమో .. త్వరగా తలుపు
తీయి!' అని ఆశావాదం ప్రకటిస్తుంది అమ్మమ్మ.
తరాలమధ్య గల
తల్లుల ఆలోచనల్లో వస్తోన్న తారతమ్యాలను.. పక్కపక్కన
నిలబెట్టి పోల్చి చూపించేందుకు చెయితిరిగిన కథారచయిత్రి పి.సత్యవతి ఎంచుకున్న ఈ కథ.. కథనం.. అధునాతనంగానే కాదు.. ఆలోచనాత్మకంగానూ ఉండి 'కథ'
సాధించవలసిన ఉత్తమశ్రేణి ప్రయోజనాన్ని సాధించింది అని నా అభిప్రాయం. రచయిత్రికి అబినందనలు.
-కర్లపాలెం
హనుమంతరావు
(29, జూన్,
2014 నాటి ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితం)
కథ కావాలనుకున్నవారు
ఇక్కడ చదువుకోవచ్చు!
పిల్లాడొస్తాడా?
అమ్మమ్మ సావిత్రమ్మకు ఎనభై ఏడేళ్ళు.. ఆమెను తన దగ్గర పదిరోజులుంచుకు పంపిద్దామని మొన్న తీసుకొచ్చుకుంది విజయ..... విజయ వాళ్ళాయన ఏదో సమావేశంకోసం సింగపూర్ వెళ్ళి వున్నాడు.కూతురికి
వివాహం అయి అమెరికా వెళ్ళింది.కొడుకు ఇంజినీరింగ్
చదువుతున్నాడు. నమూనా కుటుంబం.
అమ్మమ్మకి బుల్లితెర కార్యక్రమాలు నచ్చవు. గదిలో
కూచోడమూ గిట్టదు .ఆకాశంలో ఒక చిన్న ముక్కా , నాలుగుచుక్కలూ, రెండు మొక్కలూ కనపడతాయని
సాయంత్రం కాగానే బాల్కనీ లోకి చేరుతుంది . అలా బాల్కనీలో కూచున్న అమ్మమ్మ హడావిడిగా
లోపలికొచ్చి “ బాగా మబ్బేసింది.చినుకులు కూడా మొదలయినై. .ఇంకా పిల్లాడు రాలేదే!” అంది
రాజాగారి కోడలు
కోడలికి కోడలు పాత్రధారిణి సకలాలంకార భూషితంగా అప్పుడే తెరమీదకొచ్చి వీక్షకులకు వినమ్రంగా
నమస్కారం చేసింది.”ఆ పిల్ల పెట్టుకున్ననెక్లేసు చాలాబాగుంది “ అనుకుంటూన్న విజయ, అమ్మమ్మ మాటలకి ఉలిక్కి పడింది.అవునూ
రాత్రి ఎనిమిదౌతున్నా పిల్లాడింకా ఇంటికి రాలేదేమిటీ? అయ్యో పిల్లాడు రాలేదు. రోజూకన్న
ఒక అరగంట ఆలస్యమైనా అమ్మ కంగారుపడుతుందని ఫోన్ చేసి చెబుతాడు కదా?
వాడు ఫోన్
కూడా ఎత్తడంలేదే! ఏమైంది వీడికి?
దబ దబ చినకులు.
ఒరేయ్ మోటూ,చింటూ
,బబ్లూ బంటీ ,మున్నా ,రహీం రాజా ,మా వాడేడిరా? ఫొన్ మీద ఫోను.
“ఏమో ఆంటీ
“ వాళ్లంతా.
“ మీరంతా ఇంటికొస్తే
వాడెందుకు రాలేదు? కాస్త ఫోన్ చేసి కనుక్కోండి మా బాబులు కదూ?”
“ మాకూ పలకడం
లేదు ఆంటీ”
వందోసారికూడా
వాడి ఫోన్.స్విచ్డ్ ఆఫ్.
రోజూ ఏడుగంటలలోపు
వచ్చేవాడు పదైనా రాలేదు.ఏం చెయ్యాలిప్పుడు?
వాళ నాన్నకూడా
దేశంలో లేడే!! ఇప్పుడు ఫోన్ చేసి చెబితే కంగారుపడిపోడా?
“ వస్తాడులే
అమ్మా! ఎక్కడో చిక్కడిపోయి వుంటాడు .వాన తగ్గనీ వాడే వస్తాడూ” అని ,తనకోసం పెట్టిన
జావ తాగేసి సోఫామీద ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ.
వాడు వెళ్ళే
చోట్లు ,వాడికున్న స్నేహితులు పరిచయస్తులు అన్ని నంబర్లూ అయిపోయాయి
పన్నెండు.
చుట్టుపక్కల
ఇళ్లల్లో టీవీ లన్నీ బందయ్యాయి.అపార్త్మెంట్ సెల్లార్ లోకి రావాల్సిన వాహనాలన్నీ వచ్చేశాయి.
పిల్లాడురాలేదు
“ వాడెక్కడో
చిక్కుపడి వుంటాడు అని చెప్తున్నా కదా!!నువ్వలా
జావకారిపోకు.వెళ్ళి కాస్త ఎంగిలి పడు” అంది అమ్మమ్మ మళ్ళీ
విజయకి ఒళ్ళుమండింది.
“ వాడు రాలేదని
నేనిక్కడ భయపడి చస్తుంటే తినమంటావేమిటీ? నువ్వు జావ తాగేశావుగా పడుకో!” అని కసిరింది
“ నేను నీరసంతో కళ్ళుతిరిగి పడిపోతే నా సేవ చెయ్యాలి
నువ్వు... అందుకని ఎక్కడున్నా ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నా సంగతి నేను చూసుకుంటాను అట్లా వూరికే కంగారు పడి ఏం చేస్తావ్? “ అంది ఆవిడ.
బుల్లితెర
రూపం సంతరించుకున్న విజయ మెదడు పైన ఎర్రని
భయంకర దృశ్యాలు.
అంతులేని వేగంతో
వస్తున్న మోటర్ సైకిల్ మీద ముగ్గురు పిల్లలు. ముగ్గురి చెవుల్లోనూ సెల్ఫోన్లు .మద్యం
మత్తులో జోగుతూ అంతకన్న వేగంగా వస్తున్న లారీ డ్రయివర్! రోడ్డుమీద అడ్దదిడ్దంగా నెత్తురోడుతూ మూడు శవాలు.తెల్లటి
టీషర్టు ఎర్రగా తడిసి ముద్దై!
వానలో వస్తున్న మోటర్ సైకిల్.....చెయ్యి ఊపి లిఫ్ట్
అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి.మోటర్ సైకిల్ ఆగింది.ఆ వ్యక్తి వీడిని రోడ్డు మీదకి
ఈడ్చి బాగాకొట్టి ల్యాప్టాపూ సెల్ఫోనూ పర్సూ ,మోటర్ సైకిల్ తాళాలూ లాక్కుని వెనక్కి తిరిగిచూడకుండా పోయాడు,వీడు స్పృహలేకుండా
రోడ్డుమీద.పడి వున్నాడు... వెంకటేశ్వరస్వామీ
అలా జరగనివ్వకు .మెట్లన్నీ ఎక్కి కొండకొస్తాను.
ఎవడిదో పుట్టిన
రోజు.. వాడు వీడిని. పార్టికి రమ్మన్నాడు.వీడు రానంటాడు.వాడు వెక్కిరిస్తాడు. వీడికి
రోషమొచ్చి వెడతాడు .. అక్కడ వాదాలు.. వాదాల్లోనించీ ముష్టి యుద్ధాలు. కొట్టుకోడాలు,వీడి
గర్ల్ ఫ్రెండ్ ని వాడేదో అన్నాడనీ వాడి గర్ల్
ఫ్రెండ్ ని వీడేదో అన్నాడనీ ! ఆ వూపులో .. ఎవడిప్రాణం పోతుందో తెలీదు.
కృష్ణలో ఈతకి
పోయి మునిగిపోయిన యువకుడు.
కొన్ని వేల
రూపాయల క్రికెట్ బెట్టింగ్ లు! డబ్బొచ్చిందా జల్సాలే జల్సాలు. ఎక్కడినించీ తేవాలి ఓడిపోయిన
డబ్బు? స్కూటర్లు మోటర్ బైకులు ల్యాప్టాపులు దొంగిలించి అమ్మాలి.పోలీసులు పట్టుకుని
మొహనికి ముసుగేసి వీక్షకులముందు పెడతారు. ఆ ముసుగుల్లో అమాయకుడైన మనవాడు తెలీకుండా
ఇరుక్కోలేదు కదా?
“ మన పిల్లాడు
అట్లాంటి వాటి జోలికి పోడు. ఊరికే పిచ్చి ఆలోచనల చెయ్యకు.. ఇరవై ఏళ్లకి పైగా పెంచుకొస్తున్నావు నీకొడుకు ఎలాంటివాడో
నీకు తెలీదా? చూడు ఎట్లా చెమటతో తడిసిపోతున్నవో నిస్త్రాణ వస్తుంది.. కాసిన పాలు తాగు”
మళ్ళీ అమ్మమ్మ
“నా పిల్లాడొచ్చేదాకా
పచ్చిమంచినీళ్ళుకూదా ముట్టను. నా ఒక్కగా నొక్క కొడుకు నా ప్రాణం”
అమ్మమ్మ మాట్లాడలేదు
“ఈ మధ్య వీడు మన సందుచివరి ఇంట్లో వుండే సంధ్య ని
నాలుగైదు సార్లు మోటర్ సైకిల్ ఎక్కించుకొచ్చాడు. అదేమైనా ప్రేమ వ్యవహారం అనుకుని వాళ్ల
వాళ్ళు వీణ్ణి చావకొట్టారేమో! మనకులంకాదు కదా వాళ్ళు. .మన వెంకట్రత్నంగారి మనవణ్ణి
అట్లాగే కొట్టి పడేశారు తెలసుగా?” విజయ చెప్పింది మౌనంగా విని ఊరుకుంది అమ్మమ్మ
రెండు ,మూడు
నాలుగు గంటలు
గదిలో పచార్లు
చేస్తూ ప్రతిచిన్న అలికిడికీ ఉలిక్కిపడుతున్న విజయకి ఉన్నట్లుండి వాంతి అయింది.అమ్మమ్మే
మెల్లిగా ఆమెని మంచందాకా నడిపించి మార్చకోడానికొక నైటీ ఇచ్చింది
మంచం మీద పడుకున్న
విజయను శోకపు వరద ముంచెత్తింది. నిస్సహాయంగా ఆ వెక్కిళ్ళు వింటూ వుండిపోయింది అమ్మమ్మ.
విజయ ఇంకా చెప్పింది.. మొన్నటికి మొన్న స్నేహితులే ఒక పిల్లాడిని చంపేసి కాలవలో పడేశారు.ఇప్పుడెవరు
స్నేహితులో ఎవరు శత్రువులో కనుక్కోలేం అమ్మమ్మా!
“ నీకన్నీ
ఇట్లాంటి ఆలోచనలే ఎందుకొస్తయ్ తల్లీ ! రాత్రి నుంచీ నువ్వు అన్నీ అపశకునాలే మాట్లాడుతున్నావ్?
మీ తాతయ్య ఉద్యమంలో పనిచేసేటపుడు పదేసిరోజులు ఇంటికొచ్చేవారే కాదు .అప్పుడిట్లా సెల్ఫోన్లా
ఏమన్నానా? అట్లాగ ఎదురుచూస్తూ మాపన్లు మేం చేసుకునే వాళ్ళం..” అంటూ ఆ రోజులు గుర్తు
చేసుకుంది అమ్మమ్మ
తన పెళైన మూడేళ్ళకే అత్తగారు పోతే
మావగారు తన ఈడావిడని మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ పిల్లల్నీ తన పిల్లల్నీ
కలిసి ఇద్దరూ పెంచేవాళ్ళు.అదీకాక . మావగారి పెద్ద భార్య తాలూకు ఆడపిల్లలు పురుళ్ళు
పోసుకోడానికొచ్చేవాళ్ళు. ఎడపిల్లలు పసిపిల్లలు ఇంటనిండా!! ఆ గుంపెడు పిల్లల్లో ఎవడెప్పుడు
ఇంటికొచ్చేవాడొ ఎందుకు రాలేదో ఇట్లా ఊహించుకుంటూ ఏడుస్తూ కూచోడానికి ఎవరికి తీరింది?
? పిల్లలతో కూచుని కాసేపు మంచీ చెడూ మాట్లాడుకోడానికి సమయం ఎక్కడిది? మావగారే పిల్లందర్నీ
కూచోబెట్టి ఎపుడైనా కథలు చెప్పేవాడు.ఆడవాళ్ళకి ఇంట్లో పనులే సరిపోయేవి. తన భర్తకి
ఉద్యమాలు. మీటింగులు. పెద్దకొడుక్కి
ఇరవై ఏళ్ళోచ్చాయోలేదో సంఘాలు ఊరేగింపులు! పోలీస్
భయాలు ,అజ్ఞాత వాసాలు.. .వాళ్ళేవో మంచిపన్లు చేస్తున్నారనే నమ్మకంతో తమ పన్లు తము చేసుకుంటూ
వుండేవాళ్లు. ఎప్పుడూ ఇట్లా హైరాన పడలా...ఒక
వేళ వీడూ ఏదో మంచిపని కోసం ఎక్కడైనా ఆగిపోయాడేమో !ఎవరికైనా సాయం చేయడానికి వుండిపోయాడేమో!
అని ఎందుకనుకోదీ పిల్ల? తన పిల్లాడిమీద తనకే
నమ్మకం లేకపోయే! లోకం మీదా నమ్మకం లేకపోయే ! అనుకుని అమ్మమ్మ కాస్త చిరాకుపడింది
“ఆ రోజులు వేరమ్మమ్మా! ..ఇప్పటి పిల్లల సంగతి నీకు
తెలీదు రోజూ పేపర్ చదువు తెలుస్తుంది.”
’అవున్లే అమ్మా!
అప్పుడు వాళ్లకి ఏవో ఆశయాలనీ అవీ వుండేవి..కోరికలూ డబ్బులూ కూడా తక్కువే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ మామయ్య అక్కడ ఉండిపోయేవాడు,వాడికి
తిండీ నీళ్ళూ కూడా గుర్తొచ్చేవి కాదు వీడికి వాడి పోలిక వచ్చిందేమో .అనుకుంటూన్నాను..”అంది
అమ్మమ్మ .
“ వాడికి ప్రతిరోజూ
చెబుతాను. తనకు మాలిన ధర్మానికి పోయి నువ్వు అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకు, లేని పోని బురద అంటించుకోకు అని,.మనం ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదు
మనని మనం ఉద్ధరించుకుంటే చాలనీ ! మన చదువేదో
మనం చూసుకుని జీవితంలో స్థిరపడాలని!!. అడిగిన వన్నీ ఇస్తాను .ఏదిష్టమో అదే వండిపెడతాను.
బయటికెళ్లాక ఎట్లా వుంటాడో ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది ” కళ్ళు తుడుచుకుంటూ అంది విజయ.
అంటే ,వాడు
ఎవరికోసమూ ఏమీ చెయ్యడనీ ఇట్లా తను ఊహించే ప్రమాదాల్లో ఇరుక్కుంటాడనీ విజయ ఉద్దేశమా
ఒక వేళ వాడికే ఏ ప్రమాదమన్నా జరిగుంటే వాడికి సాయం చేసి ఇంటికి తెచ్చేవాళ్ళే వుండరా?
ఆ ఊహ కూడా రావడం లేదు.,ఆ ఇంట్లో పుట్టి పెరిగిన తన మనవరాలికి! పైగా గట్టి నమ్మకంతో
వుంది ఏదో చెడే జరిగిందని! పరిస్థితుల్లో అంత మారొచ్చిందా అని ఆశ్చర్యపోయింది అమ్మమ్మ.
కొన్ని యుగాలకి
సూర్యుడొచ్చాడు.పిల్లాడురాలేదు.వాకిట్లో పడివున్న పాల పొట్లాలూ వార్తాపత్రికా తీసుకుని
పని చేసిపెట్టే దుర్గ వచ్చింది.
“లేమ్మా !
లేచి కాసిని కాఫీ తాగి ఇప్పుడేం చెయ్యాలో చూడు .నీ స్నేహితులెవరికైనానో మీ ఆయన స్నేహితులకెవరికైనానో
ఫోన్ చేసి పిలు . అట్లా ఏడిస్తే ఏమవుతుంది “ అని మళ్ళీ బ్రతిమిలాడింది అమ్మమ్మ
విజయ పత్రికలోని సిటీ టాబ్లాయిడ్ తీసుకుని అందులో హత్యలు, ప్రమాదాలూ
దొంగతనాలూ వేసే పేజీ చూసింది. ఎక్కడా తన పిల్లవాడికి సంబంధించిన వార్తలాంటిది కనిపించలేదు.
రోజూ వుండే వివాహితల ఆత్మహత్యలూ రోడ్డుప్రమాదాలూ వైగైరాలున్నాయి.కాస్త కుదుటపడి కాఫీ
తాగుదాం అనుకుంది కానీ అది నోటికి పోలేదు. కడుపులో తిప్పింది. అయినా రాత్రి జరిగిన
సంఘటన అప్పుడే పేపర్లోకి ఎట్లా ఎక్కుతుంది? ప్రమాదం పాలై రోడ్డు మీద పడి వున్న వాడిని
పట్టించుకునేదెవరు? పోలీసులకో, నూట ఎనిమిదికో ఫోన్ చేసే తీరిక ఎవరికి? లేనిపోని బురద
అంటించుకోడం ఎందుకు, మన పని మనం చూసుకుపోదాం అనుకుంటారు కదా అందరూ!
అప్పుడు
పిలిచే గంట
మోగింది;
“ఎవరే వార్త
మోసుకొచ్చారో “ అని సోఫాలో కూలబడి పోయింది విజయ
“ఒకవేళ పిల్లాడే
వచ్చాడేమో! దుర్గమ్మా త్వరగా తలుపు తియ్ తల్లీ” అంది అమ్మమ్మ***
satyavathi-p.blogspot.in/2014/12/blog-post.html
రచయిత్రిని గురించి సంక్షిప్త పరిచయం కావాలంటేః
http://www.teluguone.com/sahityam/single.php?content_id=679
(తెలుగువారి అక్షర సంపద- సౌజన్యంతో)
Tuesday, February 28, 2017
పోతపోసిన ప్రజాకవి- ఆదివారం ఈనాడు సంపాదకీయం
ఈ లంకెను నొక్కండి. పూర్తి పాఠం విచ్చుకుంటుంది!
-కర్లపాలెం హనుమంతరావు
https://1drv.ms/b/s!AkJxy28EyDZLje9mqo4X3RG8LyLorg
(ఈనాడు- ఆదివారం సంపాదకీయం)
Sunday, February 26, 2017
లేచింది మహిళాలోకం!
పరమేశ్వరుడు
సమస్త వేదాంతరహస్యాలను పార్వతమ్మకు చెప్పినట్లు శివపురాణ కథనం. నారాయణమూర్తి భూదేవితో
వైష్ణవాగమన విశేషాలు పంచుకొన్నట్లు విష్ణుపురాణం విశ్వాసం. స్త్రీ విద్యాధికారాన్ని
దైవలోకమే మన్నించింది. కిందిలోకంలోనే ఎందుకో మగువకు దిగువస్థానం! ఆదిమయుగం సంగతేమోగానీ.. అంతా వేదమయంగా
సాగిన రుగ్వేదకాలంలో మాత్రం అమ్మదీ అయ్యతో పాటు సంసార అరద చోదనంలో సమానపాత్రే! బృహదారణ్యకంలో
యాజ్ఞవల్క్యుడు భార్య మైత్రేయికి సాంఖ్యశాస్త్రం, భాగవతంలో కపిలాచార్యుడు తల్లి దేవహూతికి
బ్రహ్మతత్వం బోధపరిచారు. మతంగ మహర్షి శబరిని జ్ఞానమాతగా ఉద్ధరించిన రామాయణగాథనే నేటికీ
మనం నిత్యం పారాయణం చేస్తున్నది! వాసంతినుంచి ఆత్రేయివరకు ముదితలెందరో మున్యాశ్రమాలలో వేదవేదాంగాది విద్యలలో కాణాచీలుగా
వెలిగొందిన కథలు చదువుతూకూడా స్త్రీ బుద్ధిని చంచలం, ప్రళయాత్మకంగా కించపరచడం మగవాడి
దాంబిక భావానికి నిలువెత్తు దర్పణం. ‘నృణాతి నయతి స్వవశం పురుషమితి నారీ- పురుషుణ్ని
స్వాధీనపరుచుకొనే శక్తే నారి’ అని దుష్టాన్వయం చేయడం నెలత ఆభిజాత్యాన్ని అవమానించడం!
‘నారి’ అంటే వాస్తవానికి న అరి- శత్రువులు లేనిది. ఏ భూమ్మీద సావిత్రి పతిభక్తి భర్త
ప్రాణాలను రక్షించిందో, ఏ భువిలోన సీతమ్మవారి
పాతివ్రత్యం అగ్నిపరీక్షలో సైతం నెగుకొచ్చిందో, ఏ పృథ్వి అత్రిసతి అనసూయ సౌశీల్యం త్రిమూర్తుల
లౌల్యాన్ని బాల్యచేష్టగా మార్చి లాలించిందో, ఏ వసుంధర అరుంధతి.. లోపాముద్రాది నాతిజాతి
సృష్టికర్త ఉనికిని సైతం ప్రశ్నార్థకం చేసి చూపిందో.. ఆ భూఖండంలోనే ఆడదానికి అడుగడుగునా అఖండ అగ్నిగుండాలు! నవనాగరీకులమని నయగారాలుపోయే మగవారి
లోకంలో మహిళ బతుకు ఇంకా ముల్లు పక్కన అల్లాడే అరిటాకే! దేవనాగరీకంలో శర్వరి ద్విశతాధిక
పర్యాయపదభూయిష్ట! ‘మానవతీ!.. మానినీ!’గా సంబోధించినంత మాత్రాన మహిళ సమానవతి.. సన్మానినిగా మన్నింపబడుతున్నట్లా!
ఒక బిడ్డకు
తల్లయీ పుట్టినింటికి పోయిరావాలంటే పట్టెమంచం మామగారినుంచి.. వంటగది తోడుకోడలువరకు
ఇంటిసభ్యులందరి అనుమతులు తప్పనిసరి. అందుకోసం ఇంతి కన్నీటితో
దేబిరించే జానపదులపాట చాలదా.. కలికి కామాక్షి ఎంత కలవారి కోడలైనా ఒలికి వళ్లోకి
వచ్చి వాలేది వట్టిసున్నా మాత్రమేనని తెస్లుసుకోవడానికి!
‘బాలప్రాయమునాడు నాతి పడుచూను/ వేల్పులెత్తగలేని విల్లు తానెత్తే/’ సీత. అది చూసి ‘ఈ సీత నెవ్వరికిత్తునని దలచీ/ ఘనులు
ఎవ్వరూ రానీ కరమునా బట్టీ/ పూని వంచితే ఇత్తు పొలతి వారికినీ’ అని జనకముని నిశ్చయించుకొన్న
‘సీతమ్మ స్వయంవరం’ గీతికలో మాత్రం ఏమంత నీతిసూత్రం
ఇమిడి ఉందని! సీత రాత బాగుండి ‘రఘువంశ తిలకుడు రామచంద్రుడు మునుకొని హరివిల్లు ముమ్మారు
వంచి’ విరిచేయబట్టి సరిపోయింది! రుగ్వేదయుగంలో మాదిరి సౌందర్యం, సౌశీల్యం, బుద్ధి,
బలం, యవ్వనం, సమయానుకూల ప్రవర్తనం.. గమనించుకొనిగదా వరుడిమెడకు వధువు స్వయంనిర్ణయానుసారం
వరమాల తొడగవలసిందీ! ‘పెళ్లయిన ఇంట ఆరునెల్ల కరువంట’ అని సామెత! ‘ఆడపిల్లంటే గుండెలమీది బరువు. అటూ ఇటైతే.. కన్నకడుపు
చెరువు’ వంటి భావనలు నవసమాజంనుంచీ తొలగక పోవడం
భామినుల ఆభిజాత్యానికి ఎంత భంగకరం! శాస్త్రాలు సైతం సుతోదయ భాగ్యంకోసం మాత్రమే క్షీర,
సోమాది రసాభిషేకాల ప్రస్తావనలు చేయడం గమనార్హం. గర్హనీయం. ‘ఆడదై పుట్టేకన్నా అడవిలో
మానై పుట్టడం మేలు’ అన్న ఆత్మన్యూనతా భావంలోనే అధికశాతం మగువలు ఈ నాటికీ మగ్గడం విచారకరం! మగవాడు తిరిగితే చెడనిది.. ఆడది
తిరిగితే ఎలా చెడుతుందో? ‘చక్రవర్తులైనట్టి
చానలుండ/ దరుణు లుద్యోగములు చేయ దగరటంచు/’ బల్కనేమిటి?’ అని వెనకటికి ఓ కవిపురుషోత్తముడు కడిగిపారేశాడు. ‘విమల సచ్చరిత్ర విమలామహాదేవి- కాంతుని
నేపాటి కలత పఱచె?/అపర సరస్వతి యననొప్ప దమయంతి- నాథు నేపాటి నమిలి మ్రింగె?/.. తక్కుగల
రామలందరు మిక్కుటముగ- జదువ నేర్చియు బతుల కసౌఖ్యములను/ కలుగ జేసిరె?’ అన ఆ కవిప్రశ్నకు
ఈనాటికీ సమాధానం కరువు. ఇంటగెలిచిన ఇంతికి
రచ్చ గెలవడం ఎంతని! అవకాశమంటూ ఒకటి దక్కడమే
ముఖ్యంగాని!
పురుషునిలో
నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని వెన్నుతట్టి లేపేది అమ్మగా, ఆలిగా, చెల్లిగా.. స్త్రీమూర్తే!
బుద్ధిలో నాలుగింతలు, శక్తిలో అంతకు రెట్టింపు ఆధిక్యంలో ఉండీ.. వెనకుండి గెలిపించేందుకే ఆసక్తి చూపించే మగువను మగవాడు ఏనాడు
అర్థంచేసుకొన్నాడు కనుక! అంగనంటే వాడికి అంగడిబొమ్మ.
ముంగిల్లో తిరిగే మరబొమ్మ. తిమ్మిరి దింపుకొనే పడక గుమ్మ. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’
అని మనువేనాడో అప్పటి అవసరాల నిమిత్తం ఎందుకు చేసాడోగాని.. ఆ పాడుబడ్డ సిద్ధాంతంచూరుకే మగవాడు
ఈనాడూ గబ్బిలంలా వేలాడ్డం నవ్వు పుట్టిస్తుంది. ఆగ్రహమూ తెప్పిస్తుంది. ‘ఆకొన్న అతిథిని
ఆ పూట నిల్పం- నతివను ముందుగా నడుగవలయు/ అతిరిక్తుడౌ రోగి ఔషధం బిప్పింప- బడతి ఆజ్ఞ
బొందవలయు ముందు/ బైరాగికిని నొక్క పాత వస్త్ర మొసంగ- బొలతి శాసనంబు బొందవలయు /.. ఇంక
స్వాతంత్ర్య మనునది యెందు గలదొ- యెరుగగా రాదు మీకును బురుషులార!’ అని బుడమగుంట శివరామయ్యకవిగారు
వందేళ్ల కిందటి ఆంధపత్రిక(అబలావిలాపం)లో హేళనచేసిన
నాటి పరిస్థితుల్లో ఈవేళ్టికీ వీసమెత్తు మార్పు లేదు. సరికదా మహిళామణి ఆలోచనల్లో..
ఆచరణలో.. అభివ్యక్తీకరణలో.. ఆభిజాత్యం పాళ్ళు
పొంగుకొస్తున్నాయి. సంతోషమే! వలతి మగవాడికన్నా
ఎందులో వెలితి? ‘అగ్బరంతటి వైరి నాజి జయింపదే– రాణి వీరాబాయి రౌద్ర మెసగ?/ నిరుపమ శౌర్యవార్నిధి
గుతుబుద్ధీను- దురమున దోలదే కరుణదేవి?/ తన బాణ నైపుణ్యమున కెర సేయదే- సంయుక్త రిపులను
సమరమందు?’ ‘అట్టి యసమాన శూరత్వ మతివలకును/
గలుగ జేయరె తొల్లింటి కాలమునను?’ అని తొయ్యలులంతా ఏకమై కొంగులు బిగిస్తే అయ్యలెంత మొనగాళ్లైనా మునుపటంత
మొండిగా ముందడుగు వెయ్యలే రీనాడు. జన్మతః జన్మదాతల వర్గానికి దఖలుపడ్డ హక్కులకు ఇంకేమాత్రం
మోకాలడ్డడం సాధ్యం కాదన్న ఇంగితమే సౌదీ పాలకులకు కలిగుండాలి. పోయిన వారం ఆ సంప్రదాయిక
దేశంలో జరిగిన పురపాలకసంఘం ఎన్నికల్లో సౌదీసోదరి
తొలిసారి ఓటుహక్కు వినియోగించుకుంది. శుభం. వాహన చోదననుంచి.. సరుకుల బేరంవరకు ఎన్నో
ఆంక్షలు మహిళకు ఆ గడ్డమీద! ఎన్నికల్లో నిలబడే హక్కూ ఆమెకిప్పుడు దఖలు పడడం సామాన్యమైన
గంతు కాదు. ముందు ముందు మరిన్ని మహిళాసంస్కరణలకు ఇది నాందీ ప్రస్తావన కావాలన్నదే అభిలాష. సౌదీ సోదరీమణులందరికీ శుభాభినందనలు!
***
-కర్లపాలెం హనుమంతరావు
Friday, February 24, 2017
ఎన్ని గిన్నీసు రికార్డులో!- ఓ సరదా వ్యాఖ్య
'ముంబైలో మొన్న
సామూహికంగా పద్దెనిమిదొందలమంది ఒకేసారి క్షవరం చేయించుకొని ప్రపంచ రికార్డుల కెక్కేసారంట!
వింటున్నావా బాబాయ్?
'రికార్డుల
కెక్కడంలో మనదే గదరా ముందునుంచీ రికార్డు! అందులోనూ క్షవర కళ్యాణమంటే.. మన వాళ్లదే ముందు
వరస! 'షేవ్ ఇండియా' అంటూ ఏకంగా కురకర్మకాండమీదే మన దండ్లు ఇలా చెలరేగి పోవడానికి కారణమేంటబ్బా? వృథాగా టైం షేవింగ్! ఇంటా బైటా, ఆఫీసుల్లో, ఆసుపత్రుల్లో, గుళ్ళల్లో,
బళ్లల్లో, దుకాణాల్లో, పెట్రోలు బంకుల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, ఆన్లైన్లో, ఆఫ్ లైన్లో..
నిత్యం జరిగే కళ్యాణకట్ట ఘట్టాలేగదరా ఇవన్నీ? దీనికింత 'కటింగ్' ఎందుకంట?'
'ఎటకారమా?'
'ఎటకారమా..
ఉప్పూ కారమా? పాతిక పెట్టి గుళ్లో దేవుడికి
టెంకాయ కొడితే.. శఠగోపురమూ, ఇంత చిన్నముక్కా తక్క ప్రసాదంగా అంట్లు తోముకునే కొబ్బరి
పీచైనా ఉదారంగా దక్కదీ ధర్మభూమిలో ఎంత వి ఐ పి భక్తవర్యుడికైనా! మన కొబ్బరి ప్రసాదంతోనే చేసిన చట్నీకి రెండోసారి ఆశపడితే రెండ్రూపాలు ఎక్స్ట్రా చెల్లింపు తప్పదు. క్షవరం కాక ఇదేవన్నా ఆ దేవదేవుడి వరమా
నాయనా?'
'ఓస్.. అంతేనా!
మనం గుడికెళ్లేది దేవుడి ప్రసాదం కోసమూ కాదు. హోటలు కొచ్చేది కేవలం కొబ్బరికోరు కోసమూ కాదు. క్షవరమంటే నువ్వింకా ఏ ఓబులాపురం గనుల బులబాటాల టైపులో గంభీర నిజాలెన్నో వెలికి
తీయబోతున్నావనుకున్నానే!'
'అరేయ్! మనం
తాగి చెత్తకుండీలో పారేసిన సీసాల్లోనే తేరగా కారే నల్లానీళ్లను
పట్టేసి బాటిలిరవై రెండన్నా ఆబగా కొని గబగబా గొంతులో పోసుకుంటున్నామే! మన గనుల్లో పడి ఎవరెవరో ఇనప ఖనిజాన్ని ఒక్క పైసా చెల్లించకుండా
దొడ్డిదారిన తవ్వుకు పోతున్నారు.. అంతా క్షవరమై
పోతోన్నది. నిజంగా నాలాంటి వెర్రి పుల్లయిలెవరైనా నిజాయితీగా గొడవలు పెట్టుకోవాలనుకున్నా
.. దొరగారేదో రెక్కల కష్టంమీద నాలుగు రాళ్లు వెనకేసుకుంటుంటే కడుప్మంట! అల్లర్లకు దిగుతున్నావంటూ అంతా నామీద దాడికి తయారయ్యేవారే కానీ.. రాష్ట్రం నిలువు దోపిడీ పాలైపోతున్నదనే అని దిగులు పడే ఏ సన్నాసైనా కనుసన్నల్లో కనపడుతున్నాడా? అందుకే.. అంతలేసి గంభీరమైన క్షురకర్మకాండల జోలికి పోయే సాహసం చేయకుండా..
అందరికీ తేలికగా అర్థమవుతుంది కదా అనీ..'
'నిజవేఁ కానీ
బాబాయ్.. జానా బెత్తెళ్లో తేల్చెయ్యాల్సిన మేటర్ని జానారెడ్డిగారి మోడల్లో ఎంతకీ
తెమల్చకుండా నువ్విలా నోట్లో నువ్వుగింజేసుకున్నట్లు నానుస్తోంటే ఎంతలావు తెలివితేటలున్న మేధావికైనా తెల్సినవీ తెలీకుండా
అయోమయంలో పడిపోయే ప్రమాదం పొంచుంది. తూకాల్లో మోసాలు, మందుల్లో కల్తీలు, బియ్యంలో
రాళ్లు, బాలల్లో దేవుళ్ళు, రాళ్లల్లో అదృష్టాన్నిచ్చే రంగు రాళ్లు, పాస్ గ్యారంటీ క్రాష్
కోర్సులు, పార్టీలిచ్చే హామీలు, అసుపత్తుల్లో వైద్యాలు.. లాంటివేవీ కాకుండా కటింగు రికార్డు లేవఁన్నా మనం నిజంగా సాధించుంటే.. చెప్పు! వింటా! లేకుంటే నీ టైమూ.. నా టైమూ రెండూ కటింగు'
'జనాభా కన్నా
ఓటర్లెక్కువుండే మన ప్రజాస్వామ్య దేశంలో రికార్డులక్కొదవేముంటుందిరా కన్నా పట్టించుకునే బుద్ధిమంతులుండాలే
గానీ! మొన్నా మధ్యనే బైట పడ్డది స్పెక్ట్రమ్ స్కాం. అంతకు మించిన బడా కుంభకోణం భూమండలంమీద ఇంకెక్కడుందో నువ్వే చెప్పు! రాత్రికి రాత్రే యల్లంపల్లి అంచనాలను
కోట్లక్కోట్లు పెంఛేసి బొక్కసానికి భారీ బొక్కేసినా ఏ సర్కారూ చీమైనా కుట్టినంత శబ్దం చెయ్యలేదు..ఆ పత్రికలోళ్లే చివరికి ముక్కులు చిట్లించిందాకా! మొన్నా
మధ్యొచ్చిన వరదల్లో సారాయి గిడ్డంగుల్లోకి నీరు చేరి సరుకు పాడయిందని.. ఏలినవారు 'తాగబోయించే శాఖ' వారికి నష్టపరిహారం కింద
పన్నుల్లో భారీ రాయితీ లిచ్చేసుకున్నారు. వరదనష్టం లోటునూ పూటుగా తాగించి పూడ్చేసుకోవచ్చన్న
గొప్ప రహస్యం ఎక్సైజుశాఖవారికి వేరెవరో వచ్చి చెవుల్లో ఊదిపోనక్కర్లేదు.'
'దేవదాసుల
జేబుల కెంత కోతేసినా తప్పులేదులే బాబాయ్!'
'దేవదాసులకే
కాదురా.. దేవీ దేవతలక్కూడా కటింగులు తప్పడం లేదబ్బీ ఈ మన ధార్మిక దేశంలో! తన కొండకొచ్చేవాళ్ల గుండు గీయించేదాకా వదిలి పెట్టని ఆ ఏడుకొండలవాడి
హుండీకే 'గండ్లు' పడ్డం ఎక్కువయిందని గాఢభక్తులు
గగ్గోలు పెడుతున్నార్రా బాబూ.. చెవిన పడ్డం లేదా? లేదా.. నీ చెవినీ ఎవరైనా 'కటింగ్' ఖర్చులో జమ చేసేసారా? రికార్డుల కెక్కడం లేదు కానీ.. పంగనామాల పాలవుతున్న ఆ నామాలవాడి సొమ్మూ సమ్మంధం
లెక్కలన్నీ కూపీ తీయిస్తే.. గిన్నీసు రికార్డు బుక్కే బద్దలయ్యేటన్ని కటింగులు బైటపదతాయ్! ఉద్యోగాల్లో కోత, ఉద్యోగుల జీతాల్లో
ఆదాయప్పననీ, వృత్తి పన్ననీ, ఆ పన్ననీ ఈ పన్ననీ తెగ్గోసుకుంటూ పోతే సగటు వేతన జీవి జీవితం బెత్తెడు తోకున్న గొర్రెకన్నా పొట్టిదైపోయిందని తేలిపోతుంది!
నెల నెలా నువ్వు చెల్లించే ఫోను బిల్లుల్నెప్పుడైనా పరీక్షగా చూసుకునావురా? సేవా సుంక వంకతో పది శాతం అదనంగా క్షవరం చేసే సొమ్ములో విద్య సెస్సు రెండు శాతం, ఉన్నత విద్య సెస్సు ఒక శాతం కటింగులు కనపడుతుంటాయ్!'
నెల నెలా నువ్వు చెల్లించే ఫోను బిల్లుల్నెప్పుడైనా పరీక్షగా చూసుకునావురా? సేవా సుంక వంకతో పది శాతం అదనంగా క్షవరం చేసే సొమ్ములో విద్య సెస్సు రెండు శాతం, ఉన్నత విద్య సెస్సు ఒక శాతం కటింగులు కనపడుతుంటాయ్!'
'అవునా? నేనెప్పుడూ
చూసుకోలేదే!'
'అదే మరి నేననేది
కూడా! విషయం కొత్తగా అనిపించినా కత్తిరింపులన్నీ పాత మోడల్లోనే సాగుతున్నాయని. సోపు కూడా పూయకుండా
సుతిమెత్తంగా చేసే ఈ తరహా క్షవరాలను రికార్డుల్లోకి తీసుకుంటే .. మొదట్లో నువ్వన్నావే..
ఆ ముంబాయిలో ఏదో పది.. పద్దెనిమిది వందలమందో
సాముహికంగా కూలబడి ఒకేసారి గొరిగించేసుకొని రికార్డు సృష్టించేసారని.. ఆ లెక్కకన్నా ఎక్కువా రికార్డులు గిన్నీసుల్లోకెక్కి
తీరతాయి'
'…!'
'రికార్డులమీద
మరీ ఎంత మోజున్నా వృథాగా పెరిగే జుత్తునా అలా త్యాగం చేయడం? అదేం ఘనతబ్బీ! ప్రపంచంలో ఎవరూ ఎప్పుడూ సాధించలేని రికార్డులు ఇక్కడ మన దగ్గరా ప్రతీ రోజూ చచ్చేటన్ని సాధిస్తూనే ఉన్నాంగా! పసిపిల్లలు తాగాల్సిన పాలు నాయకులకు, వినాయకులకు క్షీరాభిషేకాలుగా
పునీతమవుతున్నాయ్! ఒక్క గంటలో రైలు బండిని బుగ్గిపాలు చేసేసి.. ఏ సంబంధమూ లేని అమాయకులెందరినో
పొట్టన పెట్టుకునేలాంటి దుర్ఘటనలెన్నింటికో ప్రపంచంలో మనదే పెద్ద రికార్డు. దిష్టిబొమ్మలీ గడ్డమీద
రికార్డు స్థాయిలో తగలడుతుంటాయ్ ప్రతీ రోజూ. బతికున్నోళ్లకు చేసే శవయాత్ర లెక్కలు
బైట పడితే రేపు పోయేవాడి ప్రాణాలు ఈ పూటే గాల్లో కల్సిపోడం ఖాయం! ద్రవ్యోల్బణం సూచికల్ని
మైనస్ లెవెల్లోకి దింపేసిన ఘనతా అచ్చంగా మన మాజీ ఆర్థిక శాఖామాత్యుల వారిదే! ప్రభుత్వ
కార్యాలయాలకు సెలవులూ మనకున్నన్ని ప్రపంచం మొత్తంలో మరెక్కడా కానరావు. చదువులు చెప్పే విద్యాలయాలు వరసగా మూడు వారాలు మూతబడ్డా చీమకుట్టినంతైనా చీకు చింతా కనబర్చని యోగపుంగవుల రికార్డూ మన దేశంలో బిడ్డల్ని కనే తల్లిదండ్రులదే భూమండలం మొత్తంమీద ఎంత గాలించినా! ప్రపంచంలో కెల్లా అతి పిన్న
వయసున్న బాల దేవత గల సౌభాగ్యభూమి మనదొక్కటేరా పిచ్చికన్నా! ఇక్కడి భద్రతా సిబ్బంది ఒక్క నిరపరాధినే రోజుకు రెండేసి సార్లైనా కష్టడీలోకి తీసుకోగల నిబద్ధత ప్రదర్శించేది. ఇక్కడి అమాత్యుల్లో కొందరు అధికారులనైనా సరే చితకబాది మరీ ముఖ్యమైన దస్త్రాలు పట్టుకెళ్ళగలిగేటంత పట్టుదలగల సమర్థులు. ఇక్కడి
అధికారులు రాత్రికి రాత్రే వందలాది జీ.వోలు కళ్ళు తిప్పేలోగా గెజిట్ చేయించగల సేవాతత్పరులు. జాతిపిత బాపూజీకైనా అదురు బెదురు లేకుండా ఆధార్ కార్డు సృష్తించడంలో రాజీలేని నైపుణ్యం మన ఔట్ సోర్సు సిబ్బంది పుణ్యం. ఇహ ధరవరల రికార్డులంటావా? కంది గింజ వంద.. బియ్యం కిలో రెండొందలు..'
'చంపకు బాబోయ్! మన రికార్డులు వల్లెవేయడంలో ముందు నువ్వు గిన్నీసు రికార్డులు చింపేట్లున్నావ్! హెల్తు
కార్డుకూడా లేదు.. నేనుగానీ పడిపోతే రికార్డు స్థాయిలో వచ్చే ఆసుపత్రిబిల్లులకు ముందు నేను చిత్రగుప్తుడి రికార్డుల్లోకి జంపు చేయాలి'
***
(ఈనాడు-
20-12-2009 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)
Wednesday, February 22, 2017
స్టాకింగ్ హార్స్- రచన మాస పత్రిక కథ
కథ
స్టాకింగ్ హార్స్
- కర్లపాలెం హనుమంతరావు
(రచన మాసపత్రికలో ప్రచురితం)
మే నెల మధ్యాహ్నం. ఎండ మండిపోతోంది.
చలువ చేసిన తెల్లటి వాయిల్ చీర.. మేచింగ్ బ్లౌజులో రాధమ్మ అచ్చంగా రాక్షసులకూ దేవతలకూ అమృతం పంచి పట్టేందుకు బయలు దేరిన జగన్మోహినిలా ఉంది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నది అమృత భాండం కాదు. చెప్పుల జత!
చెప్పుల అలికిడయితే చిన్నారి బైటకొచ్చి గడపకడ్డం పడుతుందని ఇట్లా చేత్తో పట్టుకుని బైటి గేటు దాటిన తరువాత అవి వేసుకొంది. రెండగల్లో రోడ్డు మీద కొచ్చి పడింది.
రోడ్డుమీద నర పురుగు లేదు. ఓ గోడ వారన నీడలో పడుకోనున్న రిక్షా అబ్బిని లేపి 'ఆణుమల్లిపేట కొస్తావా? అనడిగింది.
వాడు నిశ్శబ్దంగా లేచి కూర్చుని 'పది రూపాయలవుతుందమ్మా!' అన్నాడు.
'ఐదు చేసుకో!' అంది రాధమ్మ.
'ఏడు ఇవ్వండి తల్లీ! ఉల్లి కూడా రెండు పెట్టందే గడ్డ రావడం లేదు' అన్నాడు.. అంటూ తలమీది గుడ్డ విప్పి మళ్ళీ కట్టుకుని .
రిక్షా సీటు దులిపి 'ఎక్కండమ్మా!' అన్నాడు. రాధ ఎక్కి కూర్చోగానే బండి బయలుదేరింది.
రిక్షా పోలేరమ్మ గుడి దాటకుండానే నరసింహారావుగారు కనిపించారు. బండి దిగి బాడుగిచ్చి పంపించేసింది రాధమ్మ.
నరసింహారావుగారితో పాటే ఆయన ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చి వరండాలోని చెక్క బెంచీమీద చతికల బడింది ఉస్సులు తొక్కుకుంటూ.
'ఇంత ఎండలో పడి వచ్చింది మా ఇంటికా?! కాస్త చల్లబడిం తరువాత రాకపోయావూ!' అన్నాడా నరసింహారావుగారు ఆశ్చర్యంగా.
నరసింహారావుగారు పల్లెపట్టువారి ధర్మసత్రం ధర్మకర్త. సుమారుగా అరవై, అరవై ఐడేళ్లుంటాయ్. నిదానస్తుడిగా ఊళ్లో మంచి పేరుంది. రాధమ్మ పని చేసేది ఆయన కార్యనిర్వహణలో నడిచే హైస్కూలులోనే.
నట్టింటి గడప కవతల నిలబడి చోద్యం చూస్తున్నా ఆయన కూతురు కమలనడిగి ఓ గ్లాసెడు చల్లటి మంచినీళ్లు తెప్పించుకొని తాగి స్తిమిత పడిన తరువాత నెమ్మదిగా అంది రాధమ్మ 'బాబాయ్ గారూ! మన స్కూలుకి ఆడిటింగు కొచ్చారే.. ఆయన పేరూ..'
'పరశురామ్మూర్తి. ఆయన పేరెందుకూ ఇప్పుడూ?!'
నరసింహారావుగారి ఆశ్చర్యం.
రాధమ్మ తన భుజం సంచీనుంచి ఒక నోట్ బుక్ తీసి చూపిస్తూ 'ఈ పాటల పుస్తకం ఆయనకోసారి చూపించి పోదామనీఁ' అంది రాధమ్మ.
'పాటల పుస్తకమాఁ! ఆయనేం చేసుకుంటాడూ దాన్నీ?!' మళ్ళా ఆశ్చర్యం నరసింహారావుగారికి.
'బాబాయిగారూ! పరశురామ్మూర్తిగారు మంచి సంగీత ప్రియులు. మంచి మంచి కీర్తనలు కూడా రాసారుట ఆయన'
'అవునా? నాకు తెలీదే! అయినా.. ఇప్పుడీ పుస్తకం ఆయన కివ్వడానికి ఇంత ఎండన బడి రావాలా?!'
రాధమ్మ అసలు విషయం బైట పెట్టేసింది. 'తప్పులేవైనా ఉంటే సరిదిద్ది పెడతారని వచ్చా బాబాయ్! మళ్లా సాయంత్ర మయితే ఆడిటింగ్ పనిలో పడతారు కదా! అప్పుడు అడిగితే బావుండదేమోననీ..'
'ఎవరండీ అదీ?' గదిలోనుంచి మాటలు వినిపించాయి.
అది పరశురామ్మూర్తిగారి గొంతే! ఇక్కడి మాటలన్నీ చెవులో పడుతూనే ఉన్నాయన్న మాట.
డోర్ కర్టెన్ తొలగించి తల లోపలికి పెట్టి ఏం చెప్పాడో కానీ .. 'నిన్ను రమ్మంటున్నారమ్మా!' అంటూ అదో రకంగా ముఖం పెట్టుకొని తాను ఇంట్లోకి తప్పుకున్నాడు నరసింహారావుగారు.
రాధమ్మ లోపలికి వెళ్లి 'నమస్కారమండీ!' అంది.
వంటిమీద ఒక్క బనీనే ఉండటం వల్ల కాస్త కంగారు పడుతూ లేచి నిలబడ్డాడాయన.
'ఇప్పుడే మొగం కడుక్కొని వస్తాను! అలా కూర్చోండి!' అంటూ చిలక్కొయ్యకు తగిలుంచున్న చొక్కాను తీసుకొని బైటికి వెళ్లి పోయారు
పరశురామ్మూర్తిగారు. రాధమ్మ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. రెండో కుర్చీ లేదు. అతను వస్తే మంచంమీదే కూర్చోవాలి. తప్పదు.
రిఫ్రెషయి వచ్చిన రామ్మూర్తిగారి చేతికి పుస్తకం అందిస్తూ అడిగింది రాధమ్మ 'సార్! ఇది మా నాన్నగారు జీవించి ఉన్న రోజుల్లో ఆ ఏడుకొండలవాడి మీద రాసిన కీర్తనలు. ఒకసారి వీలుచూసుకొని చూసి లోపాలు కనిపిస్తే పరిహరించి పెట్టాలి మీరు!'
'ఓహో! మీ నాన్నగారు కవా? సంతోషమండీ!' అంటూ ఆ పుస్తకం అందుకొని రెండు పేజీలు అటూ ఇటూ తిరగేసి చూసి ఆశ్చర్యంగా 'ఇందులోని సాహిత్యమంతా భావగాంభీర్యంతో తొణికిసలాడుతోంది. పదాల తూగు సంగీత లయకు అనుగుణంగా సాగే లక్షణం అన్ని సంకీర్తనలకు సర్వసామాన్య ధర్మమే. కానీ ఆ పదాల ఎంపిక ఎంత సహజ సుందరంగా సాగిందో ఈ సంకీర్తనలనిండా! ఒక్క లయజ్ఞానం పుష్కలంగా ఉన్నంత మాత్రానే సాధ్యం కాదు ఇంత ఒదుగుదల! మీ నాన్నగారి పేరు?'
'నడింపల్లి శ్రీనివాసాచారిగారు సార్!'
'మీరు శ్రీనివాసాచారిగారి కూతురా?!' రామ్మూర్తిగారి గొంతులో తేడా వచ్చేసింది అప్పుడే.
పుస్తకాన్ని మరో రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరగేసి 'ఇందులోని గుణదోషాలను ఎంచడం నా శక్తికి మించిన పని. ఆచారిగారి సంగీతం వింటూ .. పాడుకుంటూ ఎదిగిన వాళ్లం మేమంతా. ఆకాశవాణి ద్వారా వారు మాకు పరోక్ష గురువులు కూడా. మాష్టారుగారిలాగా అన్నమయ్య 'పరికరాలంకారాల'ను సందర్భోచితంగా వాడే బుద్ధివైశాల్యత గలవారు అరుదు.. పేరెన్నికగన్న విద్వాంసుల్లో కూడా'
'పరికరాలంకారాలంటే?'
'సందర్భానికి తగ్గట్లు విశేషణాలను ఉపయోగించే విశిష్ట లక్షణం. మీ నాన్నగారు సంగీత మహోపాధ్యాయులు కదా! మీకూ కొంతయినా ప్రవేశం ఉండుండాలే?'
'ఏదో కొద్దిగా సార్! మరీ అంత లోతుల్లోకి వెళ్లే అవకాశం దొరకలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నది'
'జయ జయ రామా సమర విజయ రామా!' అన్న అన్నమాచార్యులవారి సంకీర్తనం మీకు గుర్తున్నదా?'
'ఆఁ! ఆఁ! 'జయహర నిజభక్తి పారణ రామా! జలధి బంధించిన సౌమిత్రి రామా!' అంటూ పాట ఎత్తుకున్న రాధమ్మని మొదటి చరణం దగ్గరే అడ్డుకొని వివరణకు దిగారు పరశురామ్మూర్తిగారు.
'ఆ 'పారీణ' అన్న పదమే పరికరాలంకారం. భక్తులను ఈ భవబంధ సాగరంనుండి ఒడ్డుకు చేర్చే వాడినే కదా 'పారీణ' అనాలి! 'పారీణ' అంటేనే దాటించేవాడని అర్థం. రెండో పాదంలో వచ్చిన 'సౌమిత్రి' పదం కూడా అలాంటిదే! సీతారక్షణ సందర్భంలో సముద్రుణ్ణి ప్రార్థించమని విభీషణుడు రాముడికి సలహా ఇచ్చిన ఘట్టాన్ని గుర్తుకుతెచ్చుకోండి! అశాంత స్వరూపుడైన లక్ష్మణుడు అన్నగారు ఎవర్నీ ఎప్పుడూ ఏదీ అడగడం ఇష్టంలేని వాడు. ఆ సోదరుడికి ఆనందం కలిగించే విధంగా 'సాగరుణ్ని ఎండగట్టాలి. ఏదీ నా ధనుర్భాణాలు అందుకో లక్ష్మణా!' అంటూ ఆ కరుణాపయోనిధి వీరంగాలు వేయడమే సౌమిత్రికి నచ్చిన విషయం. అందుకే అన్నమయ్య ఆ సందర్భానికి తగ్గట్లు రాముణ్ని మామూలు రాముడిగా కాకుండా 'సౌమిత్రి రామా!' అని సంబోధించాడు. ఇదే పరికరాలంకారం. బై ది బై .. ఇందాక మీరు పాడారే ఆ పాట అద్భుతంగా ఉంది. మీ గొంతులో మరీ బాగుంది'
'కమల ఒక కాఫీ కప్పుతో వచ్చి రామ్మూర్తిగారికి ఇచ్చింది. ఆమె చూస్తుండగానే ఆ కప్పు రాధమ్మకు అందించారు రామ్మూర్తిగారు.
రెండు నిమిషాల్లో మరో కప్పుతో రావాల్సొచ్చింది కమలకు.
'వారం రోజులు ఈ ఆడిటింగ్ పని. ఇంత చిన్న ఊళ్లో కాలక్షేపం అవడమెలాగా అని బెంగపడ్డాను.. బైలు దేరి వచ్చేటప్పుడు. అనుకోకుండా సంగీతనిధి దొరికిందిక్కడ. మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజుల మనం ఇలాగే సాయంకాలాలు కలుసుకుంటుందాం. మీ నాన్నగారి మిగతా సాహిత్యం కూడా చదివే సౌభాగ్యం నాకు కల్పించండి' అని లేచారు రామ్మూర్తిగారు.
రాధమ్మకు కావాల్సింది కూడా అదే!
'వీరి నాన్నగారే శ్రీనివాసాచారిగారని మీరు నాకెప్పుడూ చెప్పలేదే!' అన్నారు రామ్మూర్తి నరసింహారావుగారు లోపలికి వచ్చినప్పుడు రాధమ్మ ముందే!
ఆ గొంతులోని నిష్ఠురాన్ని పెద్దాయన గమనించక పోలేదు. పై అధికారుల ముందు ఏ మోతాదులో తమ ఇష్టాఇష్టాలను ప్రకటించాలో తెలీనంత అమాయకుడేం కాదాయన.
పెదాలమీదకు చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ 'మా అమ్మాయికి సంగీతం పాఠాలు ఈమె తండ్రిగారే నేర్పించారండీ! ఆ విశ్వాసంతోనే కదా ఈమెకు మన స్కూల్లో ఉద్యోగం కల్పించిందీ' అన్నాడు.
'మంచి పని చేసారు' అన్నారు రామ్మూర్తిగారు తృప్తిగా.
రాధమ్మ ఒక నమస్కారం చేసి వచ్చేసింది.
వెళ్తూ వెళ్తూ చిన్నారికి ఐస్ క్రీమ్ కొనడం మాత్రం మర్చి పోలేదు.
***
రెండు రోజుల తరువాత రాధమ్మను ఇంటికి పిలిపించి మందలింపులకి దిగారు నరసింహారావుగారు.
'ఆయనేదో ఇన్స్పెక్షన్ పని మీదొస్తే.. నువ్వేంటమ్మాయ్.. పాటలూ.. పద్యాలూ అంటూ ఆయనెంట బడ్డావ్? నీ మూలకంగా వారం రోజుల్లో అయే ఇన్స్పెక్షన్ పది రోజులయినా తెగేటట్లు లేదు. పై ఆఫీసర్లను ఇంట్లో పెట్టుకుని వేగడం ఎంత కష్టమో నీకేం తెలుసు?'
'నేనేం చేసాను బాబాయ్ గారూ! ఆయనేగా కదా రోజూ సాయంకాలాలు కారు పంపిస్తున్నదీ! మీ డ్రైవర్ లేని రోజున మీరే వచ్చి తీసుకెళుతుంటిరి! నేను మొరాయిస్తే ఆ ప్రభావం మీ మీద పడుతుందని వస్తున్నా గానీ.. నిజం చెప్పాలంటే దీని మూలకంగా నాలుగు రోజుల్నుంచీ నా ట్యూషన్ క్లాసులు దెబ్బతింటున్నాయి.' అంది రాధమ్మ రోషంగా.
నరసింహారావుగారింకేదో చెప్పబోయే లోపల ఫోన్ రింగయింది. రామ్మూర్తిగారి నుంచి కాల్!
'తలనొప్పిగా ఉంది. ఈ పూటకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మీరొక్కసారి ఆ రాధగారిని కాంటాక్ట్ చేయండి! ఒక్క గంటలో మీటవగలరేమో కనుక్కోండి' .. అదీ ఫోన్ కాల్ సారాంశం.
నరసింహారావుగారి మొహం జేవురించింది. 'అలాగేనండీ! తను ఇక్కడే ఉంది. ఒక్క గంట లోపే పంపిస్తాను' అంటూ ఫోన్ కట్ చేసాడు.
నరసింహారావుగారి కారులోనే ఆ సాయంత్రం ఊరిబైట కాలువదాకా వెళ్ళారు రామ్మూర్తిగారు, రాధమ్మ.
కాలువ ఒడ్డున చల్లగా హాయిగా ఉంది. సముద్రతీరాలలో పగలంతా ఎంత చిత్తడి చిత్తడిగా ఉన్నా సాయకాలాలు చల్లగాలి తిరిగి ప్రాణాలు లేచొస్తుంటాయి సాధారణంగా.
పంచదార రాసులు పోసినట్లుండే ఆ తెల్ల ఇసుక దిబ్బలమీద చేరి పటమట కుంగే నారింజ రంగు సూర్యుణ్ని చూస్తూ పనిపాటలు ముగించుకొని ఇళ్లకు మళ్లే కూలినాలి జనాల సందళ్లను చూస్తూ కాలం గడపడం సహజంగా భావుకులైన రామ్మూర్తిగారికి ఇష్టమైన కాలక్షేపంగా మారిందీ వారం రోజుల్నుంచీ!
రాధమ్మ పుణ్యమా అని ఆ సత్కాలక్షేపానికి సాహిత్య వాసనల గుబాళింపూ తోడై మనసున మల్లెల మాలల ఊగుళ్లు మెల్లగా ఆరంభయిపోయాయి. ఇద్దరూ సంగీత సాహిత్యాలమీద చర్చించుకుంటూ కూర్చుంటే గంటలు నిమిషాల్లాగా దొర్లినట్లనిపిస్తున్నాయి.
ఆ రోజు శనివారం. ఎప్పటి సాయంకాలాలకు మల్లేనే తూర్పుగాలి వ్యాహ్యాళికి వచ్చి రైలు బ్రిడ్జి కిటువైపు దిబ్బలమీద కూర్చున్నారిద్దరూ.
మాటల మధ్యలో రామ్మూర్తిగారడిగారు 'మంచి కాలక్షేపం ఇచ్చారు మీరు. ఇంకో మూడు రోజుల్లో ఆడిటింగ్ పని అయిపోతుంది. మీ గురించి మరింత తెలుసుకోవాలనుంది. మీకభ్యంతరం లేకపోతే చెప్పండి!'
'మా నాన్నగారిని గురించి మీకు తెలుసు. ఆయన ధర్మసత్రంలో పద్దులు రాసేవారు. పొట్టకూటికి ఏదో ఒకటి చేయాలిగదా! నాకు ఒక అన్నయ్య. వాడి ఎదుగదలలో ఏదో ఒక చిన్న లోపం ఉంది. పెళ్లయితే చక్కబడుతుందని పెళ్ళి చేసారు. అప్పుడు కట్నంగా వచ్చిన సొమ్ములో ఓ లక్ష నాన్నగారు నరసింహారావు బాబాయిగారి దగ్గర దాచారు.. నా పెళ్లి ఖర్చులకోసం. దానిమీద వచ్చే వడ్డీ డబ్బుల్తోనే నేను టీచర్ ట్రయినింగ్ పూర్తి చేసాను. మా నాన్నగారి సంగీతం మీద అభిమానం ఉన్న ఒక పోస్టుమాష్టరుగారితో నా పెళ్ళి నిశ్చయమయింది . 'కట్నం వద్దు. పెళ్ళి మాత్రం ఘనంగా చెయ్యండి' అని షరతు పెట్టారు వాళ్లు.
అన్నయ సంగతి చెప్పానుగా. నాన్నగారికి డబ్బు వ్యవహారాలు అంతగా పట్టవు. నరసింహారావు బాబాయిగారే పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. ఖర్చులకుంచమని నాన్నగారు తలుపూరులో ఉన్న మాగాణి మూడెకరాలు అమ్మి రెండు లక్షలు బాబాయిగారి చేతిలో పోసారు పెళ్ళిఖర్చులకోసమని.
తెల్లారి పెళ్లనంగా తరలి వస్తున్న పెళ్ళివారి బస్సును హైవే మీద ఎదురుగుండా వచ్చే లారీ గుద్దింది. ఆ ప్రమాదంలో పోయింది ఒక్క పెళ్ళికొడుకే! పెళ్ళి రద్దయింది.
ఎట్లా పుట్టిందో .. నేనొక నష్ట జాతకురాలునన్న అపవాదు పుట్టింది. ఆ తరువాత పెళ్ళి సంబంధాలు రాలేదు. ఈ దిగుల్తో నాన్నగారు రెండేళ్ళ కిందట పోయారు. పోయినేడాది ఆడబిడ్డను కని వదిన చనిపోయింది. మిగిలింది నేనూ అమ్మా .. ఆ పాప'
'మరి మీ అన్నయ్యా?'
'ఎటో వెళ్ళి పోయాడు అందిన కాడికి పెళ్లి డబ్బులు పుచ్చుకొని . ఏమయ్యాడో తెలీదు. పోయి ఏడాదిన్నర దాటింది.'
రాధమ్మ చెబుతోంటే రామ్మూర్తిగారు వింటూ కూర్చున్నారు. ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలీలేదు.
రాధమ్మను దిగబెట్టే నెపంతో ఇంటిదాకా వచ్చారు రామ్మూర్తిగారు.
చీకట్లో తలుపు తెరవగానే 'నాన్నా!' అంటూ కాళ్లను చుట్టేసుకొంది చిన్నారి.
'సారీ సార్! దీనికి ఏ మగమనిషి కనిపించినా నాన్నలాగే అనిపిస్తాడు. ఇంకా పసితనం వదలని వయసు'అంటూ మారాం చేసే చిన్నారిని తల్లికిచ్చి పంపించేసింది రాధమ్మ.
***
హైస్కూలు గ్రాంట్స్ విషయంలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని ఆకాశరామన్న ఉత్తరాలు వస్తోంటే పునర్విచారణకు వచ్చారు రామ్మూర్తిగారు. ఆయనకు తోడుగా మరో గుమాస్తా గుర్నాథం మాకాం గవర్నమెంటు గెస్టు హవుస్ లో.
మీడియా వాళ్లూ వాసన పట్టినట్లున్నారు. వేడి వేడి వార్తలేమైనా దొరుకుతాయేమోనని స్కూలుమీదే నిఘా వేసి ఉంచారు.
నరసింహారావుగారికి ముళ్ళమీద కూర్చున్నట్లుంది. ఎన్నడూ లేనిది రామ్మూర్తిసారీ సారి సీరియస్సుగా ఉన్నారు.
వచ్చి రెండు రోజులయినా ఇదివరకులా సాయంకాలాలు బైటికి రావడం లేదు! మూడో రోజు సాయంత్రం నరసింహారావుగారే చొరవ చేసుకొని 'రాధమ్మనొకసారి పిలిపించమంటారా? అని అడిగేసాడు.
'ఇప్పుడొద్దు!' అన్నారు రామ్మూర్తిగారు.
'వీలయితే నైటుకి గెస్టుహౌసుకి పంపించమంటున్నారు' అన్నాడు గుర్నాథం తరువాత రహస్యంగా.
నరసింహారావుగారి గుండెల్లో రాయి పడింది. పెళ్లికాని ఆడపిల్లని నైటుకి పంపించమంటాడేమిటీ? రాధమ్మ అలాంటిదో కాదో తనకెలా తెలుస్తుంది?
రాధమ్మ ఇంటికెళ్లి అడిగే ధైర్యం లేక ఆ రోజుకి అలాగే నిమ్మకుండి పోయాడు.
దాని ప్రభావం మర్నాడు పొద్దున్నే బైటపడింది.
'సార్! మీరు ప్రొడ్యూస్ చేసిన సిమెంటు.. స్టీలు బిల్లుల్లోని రేట్లు మార్కెట్ రేట్లకన్నా రెండింతలున్నాయి. రికవరీకి పెడితే చాలా రీపే చేయాల్సుంటుంది. అంతా ఏడెనిమిది లక్షలు దాకా తేలింది. ఇంకా ఫర్నిచర్.. ఫిక్చర్స్.. ఎకౌంట్ లోతుల్లోకెళితే ఇంకెంత తేలుతుందో! అసలీ కన్స్టక్షనుకి సర్టిఫై చేసిన వయబిలిటీ రిపోర్టునే సార్ సస్పెక్ట్ చేస్తున్నారు' చావు కబురు చల్లంగా బైటపెట్టాడు గుర్నాథం.
స్కూలు బిల్డింగుకని శాంక్షనయిన గ్రాంట్స్ లో సింహభాగం అల్లుడుగారికని నిర్మిస్తున్న డూప్లెక్సుకే డైవర్టయి పోయింది.
పోయినసారొచ్చినప్పుడు చూసీ చూడకుండా పోయిన పెద్దమనిషి ఈ సారెందుకిలా పట్టి పట్టి చూస్తున్నాడన్నీ?!'
'కమీషను కావాలంటే ఇంకో అరశాతం పెంచుదాం లేవఁయ్యా! సారు నొకసారి కదిపి చూడు గుర్నాథం!' అన్నాడు నరసింహారావుగారు.
గుర్నాథం అదో మాదిరిగా నవ్వాడు.
'ఈ సారి సారుగారి టేస్టు మారింది. భార్య పోయి ఏడాది దాటింది కదా పాపం.. గురువుగారి గాలి అటు తిరిగింది!'
'అంటే?!'
'అదే సార్! ముందా పంతులమ్మగారి మేటర్ సెటిల్ చేయండి! నిన్నే మీకు చెప్పాను కదా! తాత్సారం చేస్తే కోరి తెచ్చుకొన్నట్లుంది నష్టం' అని వెళ్ళిపోయాడు గుర్నాథం.
మర్నాడు కొర్రీలు మరీ ఎక్కువయ్యాయి. మనిషిని కదపడానికి లేదు. పరశురామ్మూర్తి అగ్గిరాముడై పోతున్నాడు. దాదాపు రిపోర్టు తయారై పోయింది. సంతకం చేయడమొకటే మిగిలి పోయింది. ఆ రిపోర్టులో సగం నిజమని తేలినా నిండా మునగడం ఖాయం.
డబ్బు సంగతలా ఉంచి ముందు కూతురు కాపురానికి నీళ్లొదులుకోవాల్సిందే! వయబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చింది స్వయానా అల్లుడుగారే!
ఇంట్లో కమల ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు కలగజేసుకొంది నరసింహారావుగారి భార్య వరలక్ష్మమ్మగారు.
తానే స్వయంగా రాధమ్మ ఇంటికి బైలుదేరింది.
'మనమిక్కడ కొంపలో కూర్చుని పాపం.. పుణ్యం అంటూ శతకాలు వల్లెవేస్తున్నాం కానీ.. గా మూడు లక్షలు పారేస్తే ఆ పత్తిత్తు ఎక్కడికి పోవడానికయిన సిద్ధంగా ఉంది' అంది తిరిగొచ్చి.
'రెండు లక్షలా?! తనేవఁన్నా పెద్ద సినీతారనుకుంటుందా? వెయ్యి పారేస్తే పేటనుంచి పదిమంది పరుగెత్తుకొస్తారు.' అంటూ లేచాట్ట ఫోనులో అమ్మాయి చెప్పిందంతా విన్న ఇంజనీరల్లుడుగారు.
కూతురొహటే పనిగా లబ్బుమంటుంటే కాలా చెయ్యి ఆడక లేచెళ్లిపోయాడు నరసింహారావుగారు.
రాథమ్మ పథకం ఇప్పుడిప్పుడే మెల్లంగా అర్థమవడం మొదలు పెట్టింది నరసింహారావుగారికి.
బైటికేమీ తెలీనట్లుండే ఈ జాణ ఎంత పెద్ద వ్యూహం పన్నిందీ! ఈ ఉచ్చునుంచి బైటపడాలంటే తానిప్పుడు మూడు లక్షలు అచ్చుకోక తప్పదు. కావాలనే తాను ఆ కీచకుడి కంటబడింది. సంగీతం, సాహిత్యం అంటూ కావాలనే వాడిని ముగ్గులోకి దింపింది. దాని తండ్రి అప్పుడెప్పుడో తన దగ్గర దాచిన అప్పటి పెళ్లి డబ్బు రాబట్టడానికే ఇంత పెద్ద కథ నడిపిందీ! ఆయనిచ్చింది రెండు లక్షలు . ఇప్పుడిది మూడూ లక్షలకు టెండరు పెట్టింది! '
'పోతే పోయింది వెధవ డబ్బు! ముందు పరువు నిలబడ్డం ముఖ్యం. కూతురు కాపురం నిలబడ్డం అంతకన్నా ప్రధానం.' అంటూ కట్టుకున్నది కూడా అడ్డం తిరిగేసరికి నరసింహారావుగారికీ ఇంకో దారి తోచింది కాదు .
పెళ్ళాం చేతికి డబ్బిచ్చి పంపిస్తూ ఇంకో ముక్క కూడా రాధమ్మకు చెప్పమన్నాడు. 'ఇందులో ఉన్నది సగమే! రేప్పొద్దున ఆ రిపోర్టు బైటికొచ్చిన దాన్ని బట్టీ ఉంటుంది మిగతా సగం.'
రాధమ్మ రాత్రి రామ్మూర్తిగారుండే గెస్టు హౌసుకెళ్ళొచ్చిందని తెల్లారి గుర్నాథం వచ్చి చల్లని కబురు చెప్పిందాకా నరసింహారావుగారింట్లో ఎవరికీ కంటిమీద కునుకు లేదు.
మర్నాడు ఫైనల్ రిపోర్టుమీద సంతకం చేస్తూ అన్నారు రామ్మూర్తిగారు 'నా ఇన్వెష్టిగేషన్లో చాలా తప్పులే బైటపడ్డాయి నరసింహారావుగారూ! చివరి ఛాస్నుగా లైట్ గానే రాసానీ సారికి. మళ్లా మూడు నెలలకి ఇంకో ఎన్క్వయిరీకి రావాల్సుంటుంది. ఈ లోపలే 'ఇర్రెగ్యులారిటీస్' అన్నింటినీ సెట్ రైట్ చేసి పెట్టుకోండి! ఆ రాధగారి ఇంటిల్లిపాదికీ దండం పెట్టుకోండి!'
రామ్మూర్తిగారు హింట్ చేసిన ' ఇర్రెగ్యులారిటీస్ ' ఏంటో పసిగట్టలేనంత పసిబిడ్డ కాదుగా నరసింహారావుగారు!
స్వయంగా తనే మిగతా డబ్బు తీసుకొని రాధమ్మ ఇంటికెళ్లాడు ఆ సాయంకాలమే!
వరండా అరుగుమీద ట్యూషను జరుగుతోంది.
" 'స్టాకింగ్ హార్స్' అంటే ఏంటి మేడమ్?" అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నది రాధమ్మ. 'మనిషంటే మిగతా జంతుజాలానికి అంతులేని భయం. వాడి నీడకయినా చిక్కకుండా పారిపోతుంటాయందుకే! కానీ మనిషి జిత్తులకి జాకాల్ కదా! తాను మచ్చిక చేసుకున్న ఓ గుర్రాన్ని ముందుకు నడిపిస్తూ దాని చాటున వేట జంతువును సమీపించి పట్టుకుంటాడు. అలా వేటలో మనిషికి ఉపయోగపడే గుర్రమే 'స్టాకింగ్ హార్స్'. తన ఉనికి తెలియకుండా వేరేవారి ద్వారా ఒడుపుగా పనులు చక్కబెట్టుకున్నప్పుడు అట్లా ఉపయోగ పడిన గుర్రాన్నే 'స్టాకింగ్ హార్స్' అంటారు..'
'నన్ను పట్టుకునేందుకు పరశురామ్మూర్తిని నువ్వు స్టాకింగ్ హార్స్ గా ఉపయోగించుకున్నావన్న మాట!' అనుకున్నాడు నరసింహారావుగారు మనసులో!
పెద్దాయన్ను చూడంగానే ' నాన్నా ' అంటూ కాళ్లకు చుట్టుకుపోయింది చిన్నారి ఎప్పట్లానే!
'ఈయన నాన్నారు కాదు చిన్నారీ! తాతగారు. నిన్న రాత్రి నువ్వూ, నేనూ, అమ్మమ్మా కలసి వెళ్లామే .. బంగళాకి.. అక్కడున్నారు నీ నాన్నారు!' అంటు చిన్నారిని ఎత్తుకుంది రాధమ్మ.
నరసింహారావుగారికి అంతా అర్థమైపోయింది. నీతికి నిలువుటద్ధం శ్రీనివాసాచారిగారు. ఆయన కూతురు తప్పు చేస్తుందనుకోడం తన తెలివితక్కువతనం. తల్లితో, పసిపిల్లతో వెళ్లిన రాధ అక్కడ ఇంకేదో చేసిందని ఊహించుకోవడం తన బుద్ధిహీనత.
'థేంక్స్ బాబాయిగారూ! సమయానికి పెళ్లి ఖర్చులకందించారు.' అంది నరసింహారావుగారందించిన క్యాష్ బ్యాగ్ అందుకుంటూ రాధమ్మ.
'మీ నాన్నగారు నా దగ్గర దాచి పెట్టుకున్నది అందుకే కదమ్మా! వడ్డీ డబ్బులు పెళ్ళి నాటికి అందిస్తా!' అన్నారు ఇక చేసేదేమీ లేక.
***
(రచన మాసపత్రికలో ప్రచురితం)
Saturday, February 18, 2017
పాపినేని ‘పిరమిడ్’ కథ-నా పరామర్శ
ఈవారం ఆంధ్రజ్యోతి(05-02-2017)
అనుబంధంలో పాపినేని శివశంకర్ 'పిరమిడ్’ కథ తెలుగుకథను కొత్త ఎత్తులకి ఎక్కించింది.
ఊపిరి తిరగని
పనులు, ఉద్వేగం, తెరిపిలేని ఆలోచనలు తేనెటీగల్లా ముసిరి విసిగిస్తున్నా ముసి ముసి నవ్వుల
గాంభీర్యం ఉదారంగా ప్రసాదించే దర్పం ఈనాటి ధనిక ప్రపంచపు అధినేతల ‘ది మోస్ట్ గ్లామరైజ్డ్’ గెశ్చరుగా ఉండటం తప్పని సరి! ఆ గ్లిట్టరింగ్ భంగిమల
చాటున నీలివలయాల ఊబి ఎంతాకర్షణీయంగా అల్లుకునుంటుందో
వివరించేందుకు పిరమిడ్ కథలో పాపినేని ఎన్నుకున్న
సర్రియలిస్టిక్.. తాత్త్విక ధోరణలను ప్రశంసనీయం.
ఏ మమకారం లేకుండానే
ఊళ్లకు ఊళ్లు దత్తత తీసుకొనే శ్రీమంతులు దండిగా
పెరిగుతున్న ఈ కాలంబట్టీ చూస్తే కథాంశం ఎంత
పాతదైనా అంతే తాజాదనికూడా అనిపిస్తుంది. ఏ అడ్డదారిలో అయినా సరే ఎవరూ చేరుకోలేని ఎత్తులకు ఎగబాకాలన్న మోహావేశం ఈ కథలోని ప్రధాన పాత్రది. మనందరిలోనూ..
మనుషులందరిలోనూ.. కొందరిలో బాహాటంగా.. ఇంకొందరిలో అంతశ్చేతనలో.. సదా.. బుసగొడుతుండే
ఆవేశమే ఇది. అందుకే కథకీ సార్వజనీనత. తాజా ఆఘ్రాణత అమరింది.
అవధుల్లేని,
శక్తికి మించిన అత్యాశను జయించడం అంత సులభంగా కాదెవరికీ. కాబట్టే.. అంతులేని అధికారం
చేతుల్లో ఉండీ.. అక్రమార్జునలకు.. అడ్డదారి సుఖాలకు కక్కుర్తి పడి కేసుల గాలాలకు చిక్కి గిలగిలలాడే
పెద్దల కథలు.. పద్దాకా మనం.. వింటుండేది. ఆ వ్యథలు కళ్లారా చూస్తున్నప్పుడు..
ఆ కథలు చెవులారా వింటున్నప్పుడు .. వేరే వారివి..
ఎవరివో.. చదువుతున్నామన్న భ్రమే కానీ.. నిజానికి ఆ ఆశోపహతుల పతాక సన్నివేశ హీనత్వం
మన మోహావేశాల పతనాల పర్యవసానానిక్కూడా చెందిందేనని
తెలుసుకోలేం. అవకాశం దొరకని అదృష్టమేదో మనలోని చాలామందిని ఇంకా బుద్ధిమంతుల పద్దుకిందే
మిగిల్చి ఉందన్నదే అసలైన చేదు నిజం.
ఒక కథ గొప్పగా
కుదరాలంటే కుదరాల్సిన దినుసులేవీ? విమర్శక్కూర్చుంటే ఎవరెవరివో ఏవేవో తర్కాలు.. వాదాలు ముందుకు వస్తాయి!
విమర్శ అంటేనే వైరుధ్యం.. వైవిధ్యం తప్పని
వేదిక కదా! తప్పుకు పోవడం కుదరక పోవచ్చు. ఆ దారిలో తప్పి పోవాలన్న ఉద్దేశం ప్రస్తుతం
లేదు. ఈ నాలుగు ముక్కలూ.. ‘పిరమిడ్’ కథలో రచయిత పదును పెట్టిన పనిముట్లను గురించిన
చిన్న ప్రశంస. అంతే!
కచ్చితమైన
కొలతల ప్రకారమే కుట్టిన అంగీ యథాలాపంగా తయారైన జేబురుమాలుకన్నా అందంగా ఉండి తీరుతుందనీ ఘంటాపథంగా
చెప్పలేం కదా ఎవరమైనా? కంటి నదురు నిర్మాణంలో ఎవరం నిర్వచించలేని ఏదో పదార్థం దాగుంది.
అదే విధంగా ఓ కథ మనసుకి హత్తుకొనే తీరులోనూ ఇతమిత్థమని చెప్పలేని
ప్రతిభా పాటవమేదో ఉండే ఉంటుంది. పాపినేని
'పిరమిడ్' కథలో వాటి పాళ్లు వందశాతం కుదిరాయనిపిస్తుంది.
కాబట్టే నా బోటి అభిరుచిగలవారి బుద్ధికి ఇంతలా
పట్టిస్తోంది.. అనిపిస్తోంది.
ఆరు మూరలుగా
తీర్చి దిద్దిన ఈ హారంలోని ప్రతీ దృశ్యమూ ముందేం జరగబోతుందో మనమూహించలేనంత గొప్ప సస్పెన్సుతో అయితే ఏమీ నిండి
ఉండదు. మొదటి దృశ్యంలోనే ముఖ్య పాత్రల మనస్తత్వాల మధ్యుండే తారతమ్యాన్ని సింబాలిక్
గా రచయిత ఉప్పందించడంతో ఆరో దృశ్యంలో
ప్రధాన పాత్రకు ఏ అథోగతి పట్టపోతుందో కథాక్రమంలో మనం ముందే తేలిగ్గా ఊహించేసుకోవచ్చు. అందునా రచయిత ప్రవేశపెట్టిన పాత్రల్లో
ఏదీ కొత్త తరహాది కాదు. అన్నీ పాత సినిమా రొటీన్
యావరేజ్ కథలో మాదిరివే. ఒక అత్యాశ, ఆ దుర్గుణంతో
సర్దుకువస్తున్న బాల్యస్నేహం, కంటిముందే కానవస్తున్నా కన్నూ మిన్నూ కానకుండా ఆ ఉపద్రవాన్నుంచి తన్ను తప్పుకోగలనన్న ధీమా ఇచ్చిన అత్యుత్సాహంతో ఎత్తులెత్తుల కెగబాకే దుస్సాహసం, ఆ దుష్టసాహసంబెల్లం చూట్టూ చేరే సూడోప్రేమఈగలరొద,
ఆ రొదను భరించలేక తెగించి వదిలి వెళ్లిపోయే రక్తబంధం, అలా తెగించలేక.. అలాగని తెగింపుతో సర్దుకుపోలేక సతమతమయ్యే సతీధర్మం.. చివరాఖరికి
రొటీన్ తెలుగు సినిమా పతాకసన్నివేశం టైపు ప్రతినాయకనిర్వాకం పశ్చాత్తాపం! అందంగా నిర్మించుకున్న
భూగృహాంతరాల్లో పేర్చుకున్న కుబేరత్వం పొరల
మధ్య నిజాయితీ కంటికి స్పష్టంగా కనిపించే
'నీలి వలయాలని' నిర్లక్ష్యం చేసినందుగ్గాను పడే పశ్చాత్తాపం అది! పిరమిడ్ అట్టడుగున ఏముంటుందో తెలిసీ పిరమిడ్ కట్టేందుకే
మోహపడే మోజుకు చివరికి పట్టే గతి ఎలాగుండబోతుందో హెచ్చరించేందుకే రచయిత ఈ
కథ చెప్పాడా? .. 'ఎదుగుదలని స్కేళ్లతో, చెక్కుల్తో,
లాభాల్తో కొలిచే అత్యాశా భౌతికవాదానికి ‘పిరమిడ్’
కథ నిజంగా ఒక చెంప పెట్టు' అని ఓ సారి పొగిడి పుస్తకమవతల పారేస్తే. ఓ పనై పోతుంది.
ఎంతోమంది రచయితలు కొట్టారు అలాంటి చెంపదెబ్బలు గతంలొ. ఎన్ని వినుంటామో
మనం! మరి ఇందులో మాత్రం ప్రత్యేకంగా విశేషం ఏముంది?!
ఉంది. కనకనే
ఈ ముచ్చట.
పాపినేని చెప్పినట్లు
'పై పైకి పోయే కొద్దీ పతనభయం పెరుగుతోందన్నది’ సాధారణ సూత్రమే. ఎవరికి తెలియని రహస్యమది?
యథాతథంగా చెబితే మహా విసుగ్గా అనిపించే ఇలాంటి ఇంకెన్నో సూత్రాల చుట్టూతా కథను అల్లే
సమయంలో రచయిత ఏ ఎత్తులు వేసాడో.. ఆ ఎత్తుల్లోని
ఉత్తమ ప్రతిభనొకసారి భుజం తట్టాలన్న ఉబలాటంతో రాసిందీ ప్రశంస.
కథను పాయలు
పాయలుగా చీల్చి చెప్పడం మరీ అంత కొత్త ఎత్తుగడేం కాదు. గతంలో రావిశాస్త్రిలాంటి ప్రతిభావంతులు
ఎందరో పరిచిన దారే అది. కథనంలోనే కనిపించింది పాపినేని తనదైన ప్రతిభంతా.
దాదాపు ప్రతీ వాక్యాన్ని ఒక అధివాస్తవిక ప్రతీక ధోరణిలో..
కొండొకచో కొన్ని పదాలను అంతకు మించిన తాత్విక
'స్పృహతో..చెక్కుకుంటూ పోయాడీ రచయిత. ఎక్కడా ధారా ఉధృతి మందగించకుండా ప్రవహించడం అంత
సులభమైన విద్యేం కాదు. పాపినేనిని ప్రశంసించకుండా ఉండలేం ఈ అవిఛ్చిన్న ధారాశుద్ధికి. అందమైన ‘పిరమిడ్’ను చలవరాతి పొరలుగా పైకి పైకి పేర్చుకుంటో
పోయే తీరులో.. కథ కట్టడంలో రచయిత కనబరిచిన
మేస్త్రీ పనితనం ‘పిరమిడ్’ కథకు శాశ్వతమైన
అందాలు చేకూర్చి పెట్టింది కచ్చితంగా.
ఇటలీనుంచి
దిగిన పాలరాళ్లతో, బెల్జియం అద్దాలతో, వెనీషియన్ షాండ్లియర్సుతో, ఫ్రెంచి కళాకౌశల్యాన్ని
తలపించే అత్యంత ఖరీదైన ప్రాసాదాన్ని గొప్పకోసం ప్రధాన నాయకుడు చూపించినప్పుడు.. 'నీ
అష్టాంగాలు విడివిడిగా ఒక్కో గదిలో పడుకొన్నా ఇంకా చాలా మిగిలి పోతాయి' అంటాడా బాల్యస్నేహితుడు
సరదాగా. అతగాడిని అమాయకుణ్ణి చూసినట్లు చూస్తాడా
ముఖ్య నాయకుడా సందర్భంలో. స్నేహితుడు సరదాగా
అన్నది సరదాగా కాదు. అసలైన అమాయకత స్నేహితుడిది కాదు. ఎత్తులకెగబాకాలని పాకులాడే ఆ
ప్రధాన పాత్రదే అని ఫలితాంశంగా చెప్పేందుకు పాపినేని శివశంకర్ ఉపయోగించిన పనిముట్లకు జిందాబాద్!
ఆరో దృశ్యంలో..
కటకటాల్లో ఉన్న ప్రతినాయకుడి చేత 'How much land does a man need?' పుస్తకం చదివించాలనుకుంటుంది
రచయిత పాత్ర. మంచిదే! ఊచల వెనుక చేరగిలున్నప్పుడు
తాత్కాలిక కుంగుబాటుకు మందుగానో.. ఉబుసుపోకకో
ఆ
పుస్తకం చదవితే చదవవచ్చు. నచ్చినా నచ్చుండవచ్చేమో ఆ క్షణానికి. కానీ.. కాలం కలసివచ్చి భోగం చెరనుంచి బైట పడినప్పుడు
మళ్లీ మరో పిరమిడ్ నిర్మాణానికి సిద్దపడని పరిణతి సాధించినప్పుడు కదా కథకు సార్థకతంటూ
ఏర్పడేది? అంటారా?
‘చెప్పడమే
నా ధర్మం.. వినకపోతే నీ ఖర్మం’ అంటాడు నారాయణుడు నరుడితో భగవద్గీతలో.కథకు సంబంధించినంత
వరకు రచయితది కేవలం పర్మాత్ముడి పాత్రే. పాత్రల
పరివర్తనకు రాతగాడెంతమాత్రం జవాబుదారీ కానేరడు.
కథలోని అంతిమ
నైతిక నీతిసూత్రం కాదు పాపినేని ‘పిరమిడ్’ కథను గొప్పకథల సరసన చేర్చింది. పాతదే అయినా
కథను సరికొత్త పంథాలో నడిపించిన రచయిత ప్రతిభ.
రాన్రానూ..
రక రకాల సోయగాలతో నునుపు తేలుతున్న తెలుగు కథాసుందరికి మరో సౌందర్య హారం అమర్చి పెట్టిన
పాపినేని శివశంకర్ కు అభినందనలు. పాఠకుల తరుఫున
ధన్యవాదాలు.
-కర్లపాలెం హనుమంతరావు
ఫోన్ నెంః 8142283676
ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామధేను అపార్ట్ మెంట్.
మోతీ నగర్, హైదరాబాద్- 50001
https://onedrive.live.com/?cid=4B36C8046FCB7142&id=4B36C8046FCB7142%21227353&parId=root&o=OneUp
https://onedrive.live.com/?cid=4B36C8046FCB7142&id=4B36C8046FCB7142%21227353&parId=root&o=OneUp
Subscribe to:
Posts (Atom)
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...