Saturday, June 16, 2018

కొమఱ్రాజుగారి ‘వియోగ గీతి’ కత!




వడ్డాది  సుబ్బారాయుడిగారు ‘సతీ స్నృతి’ తెలుగులో వచ్చిన ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వైవాహిక జీవితం చాలా పరితాపకరమైనది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది. మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాని దుర్గతి. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన  ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి ‘సతీ స్మృతి’ చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా ‘వియోగ గీతి’ ఒకటి మరాఠీలో వెలువరించారు. యథాప్రకారం దానికీ అశేషంగా పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్ర వియోగానికి చింతించని వాడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని మరీ  కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని మరి పరామర్శల కొచ్చేసారుట!
కొసమెరుపేమిటంటే.. కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు  పెళ్లి ప్రస్తావనలు సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్! ఆ తరువాత ఆయన రాసినవనీ కవిత్వానికి ఆమడ దూరం ఉండటం గమనార్హం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 4వ సంపుటి- పుట 235)

కొమఱ్రాజు లక్ష్మణరావుగారి వివరాలు కొన్ని
(సోర్స్ః వికీపీడియా) 
జననం మే 18, 1877
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా
మరణం జూలై 12, 1923
మద్రాసు
మరణ కారణము    అనారోగ్యం
వృత్తి    దివాన్, రచయిత
ప్రసిద్ధి   చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త
భార్యః   కోటమాంబ
పిల్లల:  వినాయకరావు
తండ్రిః   వెంకటప్పయ్య
తల్లిః     గంగమ్మ


Thursday, June 14, 2018

ఇదేం సమాఖ్య స్ఫూర్తి మోదీజీ?




'ఇండియా దటీజ్ భారత్ షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని భారత రాజ్యాంగం నిర్దేశించింది. అంటే భారతదేశం కొన్ని రాష్ట్రాల కలయిక- అని అర్థం.
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థది ‘సమాఖ్య స్వరూపమా? ఏక కేంద్ర స్వభావమా?  అని అడిగివాళ్లకి ఇతమిత్థంగా  సమాధానం ఇవ్వడం కష్టం. ఈ అంశం మీద ఎన్నో ఏళ్లబట్టి ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యాఖ్యానాలు చేసుకొస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన దేశ సమాఖ్య స్వరూపం ‘సమ్మిళిత’ స్వభావం కలిగివుంటుంది.. రాజ్యాంగం ప్రకారం.
సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ అంతిమంగా  కేంద్రీకృత అధికారానికి లొంగి ఉండేది ఈ 'సమ్మిళిత సమాఖ్య'.
అమెరికా సమాఖ్య రెండు పౌరసత్వాలు కలిగి ఉంటుంది. రాష్ట్ర పౌరసత్వం.. కేంద్ర పౌరసత్వం. బ్రిటన్ సమాఖ్యలో ఒకే పౌరసత్వం.. అదీ కేంద్రం అధీనంలో  ఉండేది. మన దేశ సమాఖ్య ఈ రెండిటికీ మధ్యస్థంగా సాగే వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఒకే రాజ్యాంగం,  ఒకే పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు.. తాజాగా ప్రవేశపెట్టిన జి.ఎస్.టి విధానం.. కేంద్రం నియమించే గవర్నరు రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే అంతిమ రాజ్యాంగాధికారిగా ఉండటం.. ఇవన్నీ కేంద్రీకృత అధికారాన్ని నిర్దేశించే లక్షణాలు.
 కానీ మనల్ని రెండు చట్టసభలు పాలిస్తుంటాయి ఇక్కడ. ఒకటి రాష్ట్రస్థాయిలో, మరోటి కేంద్రస్థాయిలో. కేంద్రస్థాయిలో కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా  రాజ్యసభ కూర్పు  ఉంటుంది. ఇవీ  సమాఖ్య లక్షణాలు. అంటే కొన్ని కేంద్రీకృత అధికారాలు, కొన్ని రాష్ట్ర స్థాయి పెత్తనాలు. అందుకే  రాజ్యాంగ నిపుణులు కొందరు మనది 'అర్థ సమాఖ్య' (Half Federalism) వ్యవస్థగా అభివర్ణించారు. కానీ ఆ నిర్వచనం కూడా మన సమాఖ్య వాస్తవ స్వరూప స్వభావాలను నిర్వచించే విధంగా లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే మన సమాఖ్య వ్యవస్థ ‘సహకార సమాఖ్య(Co-operative Federalism)’ లక్షణాలను కలిగి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో మాత్రమే సాగించవలసిన ప్రజాపాలన వ్యవస్థ ఇది.
అందుకే రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం మితి మీరినప్పుడల్లా విమర్శలు జోరందుకుంటుంటాయి. కేంద్ర, రాష్ట్రాలలో వేరు వేరు రాజకీయపక్షాలు పాలన చేస్తున్నప్పుడు  ఈ విమర్శల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పుడు కేంద్రాన్ని నియంతగా చిత్రించే ధోరణీ ఉధృతంగా సాగుతుంది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రసవత్తర రాజకీయ వాతావరణానికి ఈ తరహా పరిస్థితులే ప్రథాన నేపథ్యం.
అటు కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో సైతం పరిస్థితి విభిన్నంగా లేదు. కేంద్రం రాష్ట్రాలకు తగినన్ని  నిధులు, నీళ్ళతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ, అధికారం ఇవ్వడం లేదని యాగీ చేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. బలమైన ప్రాంతీయపార్టీల ఏలుబడిలో ఉన్న బీహారు,  పశ్చిమ బెంగాలు కమ్యూనిష్టుల ఏలుబడిలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలలో ఈ సంఘర్షణాత్మక వైఖరి మరింత దూకుడుగా సాగుతోంది.
ఆ మధ్య దక్షిణాది రాష్ట్రాలు తమకు న్యాయంగా దక్కవలసిన పన్నుల వాటాలో సైతం కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, దక్షిణప్రాంతంలో వసూలు అయే పన్నుల్లో అధికభాగం ఉత్తరాది రాష్ట్రాలకు ఉదారంగా దోచిపెడుతోందని  వివాదం లేవదీసాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర పక్షపాత ధోరణిని ఎండగట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. ముందు ముందూ కేంద్రం మొండి వైఖరి   ఇదే విధంగా  కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడే రోజులు వస్తాయని పార్టీ ప్రారంభించిన ప్రారంభదినాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం గుర్తుంది కదా!  
రాజ్యాంగానికి రూపకల్పన కమిటీ అధ్యక్షులు డాక్టర్ దాదా సాహేబ్ అంబేద్కర్ ఈ సమాఖ్య వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యానం ఈ సందర్భంగా స్మరించక తప్పదు. 'భారతీయ సమాఖ్య ఒప్పందం ప్రకారం ఏర్పడింది కాదు. కాబట్టి రాష్ట్రాలకు విడిపోయే హక్కు ఉండదు. సాధారణ పరిస్థితుల్లో నిజమైన సమాఖ్యగానూ, అత్యయిక పరిస్థితుల్లో ఏక కేంద్ర వ్యవస్థగానూ పనిచేసేందుకు మాత్రమే వీలు కలుగుతుంది' అని బాబా సాహేబ్ వ్యాఖ్య.
రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి ఉందని ప్రకటించే అధికారం సెక్షన్ 356 కింద కేవలం కేంద్రానికి మాత్రమే సోపడానికి వెనకున్న లక్ష్యం సమాఖ్య స్ఫూర్తి తిరిగి బాగుపడనంత పరిస్థితికి దిగజారకూడదనే.
దివంగత ప్రధాని ఇందిర హయాంలో దేశం ఒకసారి ఈ అత్యయిక దుస్థితిని  చవి చూసింది. అప్పటి నుంచి ఆ ఆర్టికల్ రద్దు కోసం  దేశంలోని రాష్ట్రాలన్నీ వత్తిడి చేస్తోన్న విషయం మనం మర్చిపోకూడదు.
కాంగ్రెసు పార్టీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నియంతృత్వ పాలనతో రాష్ట్రాలను వేధిస్తున్నదన్న విమర్శలతో 2014లో అధికారంలోకొచ్చిన నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో క్రమక్రమంగా తానూ అదే తరహా ఏకీకృతకేంద్ర పాలన దిశగా అడుగులు వేస్తున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఆ తరహా నియంతృత్వ పాలనకు విరుద్ధంగా ప్రతిపక్షాలు, పలు ప్రాంతీయపార్టీలు సహజంగానే  గగ్గోలు పెడుతున్నాయి.
గ్రామస్థాయి పథకాలపై సైతం కేంద్ర నియంత్రణ, పర్యవేక్షణ ఎక్కువై రాష్ట్ర ప్రభుత్వాల  పరిస్థితి పురపాలక సంస్థల స్థాయికి దిగజారిందని పలురాష్ట్రాల ఆవేదన. సంక్షేమరాజ్య స్ఫూర్తితో అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబధాలు కలిగివుండే రాష్ట్రాలకు మాత్రమే సంపూర్ణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని డిమాండు పెరుగుతోన్నదిప్పుడు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల అధికార పంపిణీ విధానాన్ని పునస్సమీక్షించాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు అప్పగించాలని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో కేంద్రం అతిజోక్యం తగ్గించుకోవాలని, దుర్వినియోగమవుతున్న గవర్నర్ల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని, రాష్ట్రపతి విచక్షణాధికారంతో రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి విధించే ఆర్టికల్ 356 ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్లు రోజు రోజుకూ బలంగా పెంచుకుంటూ పోతున్నాయి రాష్ట్రాలు.
ఎవరి అవసరాలకు తగ్గట్లు వారు రాష్ట్రస్థాయిలో  రిజర్వేషన్లు  కల్పించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండ్ తో మొదలైన తెలంగాణా రాజ్య సమితి ఉద్యమం ఇప్పుడు క్రమంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు.. నిజమైన ఫెడరల్ సమాఖ్య' అన్న డిమాండ్లకు పెరిగి.. కలసి వచ్చిన పార్టీలతో కేంద్రస్థాయిలో మరో 'కూటమి' ఏర్పరచే ప్రయత్నం దిశగా సాగుతున్నది. మరో వైపు కేంద్రం అతిజోక్యంతో రాజ్యాంగం కల్పిసున్న సహకార సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నదంటూ ప్రాంతీయపార్టీలన్నీ మరో కూటమిగా  ఏకమయి పోరాడే దిశగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి.
ఇప్పుడైనా కేంద్రంలో పాలన చేసే అధికార పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాజ్యాంగం ప్రసాదించిన సహకార సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా స్వీయపాలనలో మార్పులు చేసుకుంటుందని సుపరిపాలన కోరుకొనే పౌరులుగా మనందరం ఆశిద్దాం.
(‘డెబ్బైయ్యేళ్ల భారత రాజ్యాంగం -విశ్లేషణాత్మక పరిచయం’  పుస్తక రచయిత శ్రీ అనిసెట్టి సాయికుమార్ వ్యాసం భారత రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థ స్వరూప స్వభావాలు’ స్ఫూర్తితో)
రచయితకు ధన్యవాదాలు
-కర్లపాలెం హనుమంతరావు
15 -06 =2018

(విజ్ఞాన ప్రచురణల సౌజన్యంతో)

Wednesday, June 13, 2018

కథలు- సినిమా కతలు




ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా..  సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం.
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి  ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు.  క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి  సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త  అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం  ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే  మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ  మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో  కథల పేరుతో వచ్చే రాతలకే  'ఏకతా'సూత్రం (theory of  unification)) అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథం ఓటి   రాస్తూ బుర్రను తొలిచే  పురుగును .. చిట్టచివరగా  మిణుగురు పురుగు మాదిరి   ఎలా మెరిపించచ్చో  ‘స్టెప్ బై స్టెప్’ లెక్కలా  సాధికారికంగా వివరిస్తాడు.   హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్   సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో  తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా  కనీసం  ఒక్కసారైనా  ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు.
కథను  తెరకు అనువదించడం  ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం.  (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో.. వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాలని  దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డంలో  మన రచయితలకదో రకమైన  థ్రిల్లు!
'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన   రచయిత  'నేటివైజేన్'  టెష్టులో 'సి' గ్రేడైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు-  నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు.  మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ  బాండీ వేసుకునే  స్థాయికి తీసుకు రాపోతే అక్కడికి అదృష్టవేఁ!  
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క  హాలీవుడ్డు మేథావుల చెవుల్లో  ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు.  ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.  కథానిర్మాణం  వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం  మేథస్సుకు సంబంధించిన  చమత్కారం.
తెరమీద కదిలే కథకి..  తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే!  వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం ఇది. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద  మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా!  వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది? భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి  అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు  స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో  చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక  సినీకథా రచయితలకు.. కథారచయితలకు..  ఒకే విధంగా ఉపకరించే  పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY-
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్
వగైరా.. వగైరా
-కర్లపాలెం హనుమంతరావు
14 -06 -2018


కలకండ పలుకు- తెలుగు పలుకు


'కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!’
అంటూ మహా అతిశయోక్తులు ప్రదర్శిస్తాడు! 
రాజుగారి కీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడం వల్ల పక్షులన్నీ హంసల్లాగా  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షుల ముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  చల్ల  సాయం తీసుకోవాల్సి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  ఏ సముద్రం గడ్డకడుతుందో అదే   తన పడక గల పాలసముద్రం అవుతుందనిట  పరమాత్ముని ఈ ప్రయోగం!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించవలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండ అవుతుందని ఈశుని ఈ విచిత్ర పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనే ఇంత దయనీయంగా మార్చివేసాయి భోజరాజు వంటి గొప్ప మహారాజు కీర్తికాంతులని కాళిదాసు  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం. రాసినవాడు అక్షరసిరి  కాళిదాసు కాబట్టి ఎంతటి  కల్పన అయితేనేమి.. అత్యంత రమణీయంగానే ఉండక తప్పదు! కాళిదాసు ప్రతిభకు సంస్కృతం శోభా తోడయిందని పండితుల గొప్పలు! ఒప్పుకుంటాం కానీ.. మరి మన తెలుగు తీయందనంలో భాషా దేవభాషకు ఏం తీసిపోయేది కాదు. ఈ తెలుగు పద్యం చూడండి!
వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు- జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు- నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియు- మేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును’
అంటూ మన తెలుగు కవి కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఓ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులు కూడా దెవేంద్రుడి ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం, నీలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండల కూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో మెరిసి  పోతున్నాయనడం,  శ్యామల వర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ శరీరకాంతితో పోటీకి దిగుతున్నాయనడం, హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం,  నదులు సర్వస్వం క్షీరసాగరానికి మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని వర్ణించడం,  వివిధ జాతుల  పక్షులన్నీ రంగులతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అతిశయోక్తులు పోవడం..  ఆహాఁ..మన తిమ్మకవి తెలుగు మాత్రం కమ్మదనంలో  కాళిదాసు సంస్కృతానికన్నా  ఏం తక్కువగా తీసిపోయింది?
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో ముక్కి ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవి శ్రేష్టతకు గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే  ఈ కమనీయమైన కల్పనలన్నీ!
అదంతా నిజమయితే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఇమిడి ఉంది. నిశితంగా గమనించి చూడండి! ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో  రసవంతమైన శైలిలో  రాయడంలోనే కవి నిఖార్సైన ప్రతిభ దాగి ఉంది!
పసిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా!
మన మాతృభాషను చులకన చెయకండి! అంతర్జాతీయంగా అదే మన ప్రాంతీయతకు  గొప్ప గుర్తింపు!
***
-కర్లపాలెం హనుమంతరావు
12 -06 -2018

Tuesday, June 12, 2018

కవితా.. ఓ కవితా! కఠిన పదాలకు అర్థాలు







యుగకవిగా జగం కీర్తించిన శ్రీశ్రీ గారి 'మహాప్రస్థానం'లోని అద్భుతమైన కవిత ఇది అని వేరే పరిచయం అవసరం లేదు. ఈ కవిత నోటికి రాని యువకవులు ఉండేవారు కాదు మా రోజుల్లో. ఇప్పుడూ అంతే అభిమానం అనుకోండి ఈ కవిత మీద ఈ తరం కవులకు. నిజమే కానీ..ఇందులో మహాకవి వాడిన పదాలకి అర్థాలు ఎంత మందికి తెలుసో!


వితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,

అతి సుందర సుస్యందనమందున

దూరంగా వినువీథుల్లో విహరించే

అందని అందానివిగా

భావించిన రోజులలో,

నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు విషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?


యువకాశల= ?

నవపేశల = ?
సుస్యందనం= ?
స్రుక్కిన = ?



సమాధానాలు
యువకాశల = యుక్తవయస్సులో ఉన్నప్పుడు కలిగే ఆశలు;
నవపేశల = కొత్తకోయల;
సుస్యందనం = మంచి రథం;
స్రుక్కిన = కుమిలిన

-కర్లపాలెం హనుమంతరావు

Monday, June 11, 2018

అలెగ్జాండర్ నిజంగా జగజ్జేతానా?!




'అలెగ్జాండర్ , ది గ్రేట్' అని మాకు ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో   ఇంగ్లీషు పాఠం ఉండేది. ఆ పాఠం పంతులుగారి నోట వింటున్నప్పుడు, అచ్చులో రోజూ చూస్తున్నప్పుడు 'ఆహా! అలెగ్జాండర్.. నిజంగా ఎంత గ్రేటో!' అనుకుంటుండేవాళ్లం ఆ చిన్నతనంలో.
చాలాకాలం వరకు ఆ అభిప్రాయంలో మార్పులేదు. కానీ ఆ మధ్య సుధాకర్ ఛటోపాథ్యాయ అనే చరిత్ర పుస్తక రచయిత రాసారని చెబుతున్న ' ద అకమీనీడ్స్ అండ్ ఇండియా' పుస్తకంలోని కొద్ది భాగం ఆంధ్రజ్యోతి సంపాదక పుటలో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్దిగారు రాసింది  చదవడం జరిగింది. 'ఆహా! అయ్య.. అలెగ్జాండరుగారిలోని గొప్పతనం ఇదా!' అని ఆశ్చర్యపోవడం నా వంతయింది. అంతకు ముందూ కొన్ని అపసవ్యాలు విని ఉన్నా..
ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న పిచ్చి కోరికతో చేసిన యుద్ధాల్లో  ఆయనగారు అవసరమైన చోట యుద్ధనీతులక్కూడా తిలోదకాలిచ్చేసినట్లు చదివినప్పుడు మాత్రం  అవాక్కవక తప్పలేదు.
పెషావరు యుద్ధంలో అలెగ్జాండరుకి ఎదురైన ప్రతిఘటన చాల బలమైనది. తానే స్వయంగా యుద్ధరంగంలోకి ఆయుధం పట్టుకు దూకినా గెలుపు అంత సునాయాసంగా దక్కే అవకాశం కనిపించలేదు.  ‘అశ్వకుల’ అనే బలమైన శత్రుజాతిని  వీరోచితమైన పద్ధతిలో ఎదుర్కొనే సత్తా చాలక రాత్రి పూట చాటుగా చీకటి మాటున కోటలోకి జొరబడి సైనాన్ని  మూకుమ్మడిగా ఉచకోత కోయించాడని రాసుందా గ్రంథంలో!
అలెగ్జాండరు రక్తంలో ఉన్నది యోధత్వమా? ప్రపంచదేశాల సంపదనంతా కొల్లగొట్టి స్వదేశానికి తరలించుకుపోవాలన్న ధూర్తత్వమా? ఆ వ్యాసంలో రాసింది చదివేవారికి ఎవరికయినా ఆ అనుమానం రాక తప్పదు.
మేసిడోనియా దేశం(ఇప్పటి స్లోవాకియా) రాజు ఫిలిప్స్  బిడ్ద అలెగ్జాండరు. అతనికి చిన్నప్పట్నుంచే యుద్ధాల పిచ్చి. అరిస్టాటిల్ శిష్యరికంలో మెరికలాగా తయారయాక ప్రపంచ దేశాలన్నింటి మీదా పెత్తనం చెలాయించాలన్న కొత్త తుత్తర మొదలయిందంటారు.
సైన్యాన్ని, వనరులని దండిగా సమకూర్చుకుని ముందుగా దగ్గర్లోనే ఉన్న అకీమీనియన్ దేశం మీదకు దండయాత్రకెళ్లాడు. అప్పటికే మూడో తరం ఏలుబడిలో పడి   బలహీనంగా ఉందా దేశ రక్షాణ వ్యవస్థ.  డేరియన్ని ఓడించడం మంచినీళ్లప్రాయమయింది. ఆ విజయం ఇచ్చిన అత్మవిశ్వాసంతో ధనాగారంగా వర్ధిల్లే మన భరతఖండం మీద కన్నుపడింది అలెగ్జాండరుకి.
దారిలోని ఈజిప్టు, అసీరియాలాంటి దేశాలను ఒక్కొక్కటిగా వశపరుచుకుంటూ పర్షియా రాజధాని పెర్సిపోరస్ చేరుకొన్నాడు అలెగ్జాండర్. కొన్నాళ్లపాటు  తనకూ. తన సైన్యానికి విరామం అవసరమనిపించినట్లుంది..  ఆ దేశపు రాజు మీద పై చేయి సాధించినా అతని కూతుర్ని వివాహమాడి మనుగుడుపు అల్లుడు మాదిరి విశ్రాంతి తీసుకున్నాడు.. సామదానభేదదండోపాయాలలో ఏది ఎప్పుడు ప్రయోగించాలో అరిస్టాటిల్ శిష్యరికంలో బాగా ఆకళింపు చేసుకున్న జిత్తులమారి! లేకపోతే దక్షిణ గాంధారం రాజు అంబి తక్షశిలలో అలెగ్జాండర్  ముందు అంత సులభంగా ఎందుకు    ఆత్మార్పణ  చేసుకొంటాడు? అక్కడి గెలుపు ఇచ్చిన కిక్కులో అలెగ్జాండర్ జీలం.. చీనాబ్ నదుల మధ్య ప్రాంతాల్లో ఉన్న పోరస్ మీదకొచ్చి పడ్డాడు.
పోరస్ పౌరుషం అలెగ్జాండర్ మునుపెన్నడూ రుచి చూడనిది. పోరస్ గజబలం ముందు  అలెగ్జాండర్ ఆశ్వికదళం డీలాపడిందంటారు.
నిజానికి అక్కడ అలెగ్జాండరుకి ఏ మేరకు విజయం లభించిందో ఇతమిత్థంగా చెప్పలేం. యూరోపియన్ హిస్టోరియన్స్ రాసిన చరిత్రే మనకు ఆధారం అప్పట్లో. తమ యూరోపు యుద్ధవీరుడికి ఆసియావాసుల ముందు  పరాజయం కట్టబెట్టడం తలవంపులుగా భావించినట్లుంది.. మధ్యగోళ చరిత్రకారులు ఆ అపజయాన్ని కనీసం రాజీగా కూడా చిత్రించేందుకు ఇష్టపడలేదంటారు సుధాకర్ ఛటోపాధ్యాయ. పోరస్ మీద పై చేయి సాధించినా అలెగ్జాండర్  శత్రువుకు రాజ్యాన్ని ఉధారంగా వదిలేసి వెనక్కి మళ్లినట్లు తమ చరిత్రలో రాసుకున్నారని ఆ చరిత్రకారుడి  ఫిర్యాదు.
‘The classical authors have evidently twisted the facts to glorify their one hero'(p.21) అని ఆ పుస్తకంలో రాసి ఉన్న దాన్ని బట్టి అలెగ్జాండర్ విజయం అనుమానస్పదమే అనిపిస్తుందిప్పుడు.
ముందున్న ప్రాంతమంతా ఎగుళ్లు దిగుళ్లు. సముద్రాలు, నదులు, దట్టమైన అడవులు. పాములు, తేళ్లులాంటి ప్రాణాంతకమైన జీవులు సంచరించే ప్రాంతాలే అన్నీ. దట్టంగా వర్షాలు దంచికొడుతున్నాయ్ ఆ సమయంలో. వరస యుద్ధాలతో బాగా అలసిపోయుంది సైనికదళం. అన్నిటికీ మించి అప్పటి వరకు వివిధ దేశాలలో దోచుకున్న సంపదతో తృప్తి చెంది తిరిగి స్వదేశంలో తమవారితో సుఖపడాలన్న కోరిక.. ఆ సైనికులలో మొండితనాన్ని కూడా పెంచిందంటారు.  అతికష్టం మీద అలెగ్జాండర్  వాళ్లకు నచ్చచెప్పుకుని ముందుకు నడిపించినా.. సింధునది దక్షిణ ప్రాంతంలో మల్లులు, క్షుద్రకులు అనే రెండు జాతులు ఉమ్మడిగా చేసిన దాడిలో అలెగ్జాండరే స్వయంగా విషపూరితమైన  అమ్ము శరీరానికి తాకి గాయపడ్డట్లు కథనం.
ఏదేమైనా ప్రపంచ విజేత కావాలన్న తన కల నేరవేరక ముందే అలెగ్జాండర్ తిరిగి స్వదేశానికి పయనమయిన మాట మాత్రం పచ్చి వాస్తవం.
అంభంలో కుంభం అన్నట్లు.. ఆ తిరుగు ప్రయాణం మధ్య దారిలో మలేరియా జ్వరం తగులుకొని బాబిలోనియాలో (సూసానగరం అని కొందరంటారు) క్రీ.పూ 324లో ఆఖరి శ్వాస విడిచాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని లొంగదీసుకోవడం మాట అటుంచి మృత్యువుకు తనకు తాను అంత నిస్సహాయంగా లొంగిపోయాడు! ఇంకా జగజ్జేత అన్న బిరుదుకు అలెగ్జాండరు అర్హుడా?
అయినా 'అలెగ్జాండర్ .. జగజ్జేత' అంటూ యూరోపియన్లు  తమకు అనుకూలంగా రాసుకున్న తప్పుల తడక చరిత్రను తెల్లవాడి పుణ్యమా అని మనం ఏళ్లతరబడి వల్లెవేసాం!  మన పిల్లల చేతా ఇప్పుడు వల్లెవేయిస్తున్నాం!
చరిత్రలూ చాలా రకాలుగా ఉంటాయి. ఎవరి విశ్వాసానికి తగ్గవి వాళ్లు  చదువుకుంటున్నారిప్పుడు! అలాంటప్పుడు ఏ సమాచారాన్నని తప్పు పట్టగలం? ఏ సమాచారం కరెక్టని నెత్తి మీద పెట్టుకోగలం?
***
-కర్లపాలెం హనుమంతరావు
11 -06 -2018
 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...