Saturday, August 8, 2020

వివిధ కోణాలలో శ్రీకృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు -సూర్య దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురణ


కృష్’ అంటే శాశ్వతమైన, ‘ణ’ అంటే ఆనందం. పేరులోనే సూచితమయే  ఆ శాశ్వతానందం  అందించే   అవతారమూర్తి శ్రీకృష్ణుడిని విభిన్న కోణాలలో  సందర్శించే  చిన్ని ప్రయాసే ఈ వ్యాస రూపం.
కృష్ణుడు శ్రీకృష్ణుడుగాః
కృష్ణుడు యమునా తటి మధురానగరిలో కళ్ళు తెరిచిన కాలం మౌర్య పాలనకు(క్రీ.పూ.321)  సమకాలీనం. ఉత్తరభారతమంతా చిన్న చిన్న తెగల స్వీయపాలనలు ఉండిన  సమయమది. కృష్ణుడూ ఒక స్వతంత్ర రాజ్య సంస్థాపకుడే! స్వయంగా వీరుడు. అయినా,  రాజ్యాల మధ్య  సమన్వయం సవ్యంగా లేని నాటి రాజకీయ వాతావరణంలో సందర్భాన్ని బట్టి సాటి పాలకులకు సలహాదారుడిగా, రాజ్యాల మధ్య సయోధ్య కుదిర్చే రాజకీయవేత్తగా, రాజధర్మం బోధించే యోగపురుషుడుగా, సామాజికన్యాయం ప్రవచించే సుంఘసంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞలను విజయవంతంగా ప్రదర్శించిన ప్రతిభ కృష్ణయాదవుడిది. పాండవుల పట్ల  పరమాప్తుడుగా ప్రవర్తించిన ఆ లౌక్యుడు కాలక్రమేణా మోక్షకాముకులంతా కాంక్షించే దైవసమానుడి స్థాయికి ఎదిగేందుకు కాలం కూడా కలసిరావడం ఒక కారణమని చరిత్రకారుల అభిప్రాయం.
దేవతారూపాలుః
ఎనభైనాలుగు లక్షల జీవజాతులతో వర్ధిల్లే సృష్టిలో వివేచనబుద్ధిగా   మేధస్సులో స్థిరపడి మానవజన్మను మహోన్నతంగా తీర్చిదిద్దే చోదకశక్తి పరమాత్ముడన్న పారమార్థిక చింతన మనిషిలో ఎప్పటి బట్టి  ప్రబలమయిందో   రుజువులు దొరకని అంశం. పరమాత్మ, దివ్యత్వం వంటి అలౌకిక  భావజాలం బలం పుంజుకున్న కొద్దీ ఆరాధనార్థం  మనిషికి ఒక  బౌద్ధిక మూర్తి ఆవశ్యకత ఏర్పడింది. మానసిక భావోద్వేగాల అక్కరలు  నిమిత్తం పుట్టుకొచ్చినవే దేవతారూపాలు.
మహిమలుః
వాస్తవజీవితంలో తాను అనుభవించాలని ఆరాటపడే భోగభాగ్యాలన్నిటికీ ‘స్వర్గం’ పేరుతో ఓ ఊర్థ్వలోకం కల్పన చేసుకున్నట్లే, ఓపలేని ఈతి బాధలకూ ‘నరకం’ పేరుతో ఓ అథోలోకం కల్పించుకున్న ఘనుడు మనిషి. సహజంగానే  భగవంతుడు ఆ తరహా అతని స్వర్గానికి అధిపతి. స్వర్గప్రాప్తి, నరకవిముక్తి  మనిషి ఇహలోకంలో ఉన్నప్పుడే సాధించవలసిన పారమార్థిక లక్ష్యాలయాయి.  వాటిని పొందే వైనం లౌకిక భావజాలంతో నిర్వచించుకునే శక్తి చాలక ‘మహిమలు’ వంటి   అలౌకిక శక్తులను భావించుకుని, వాటిని  ప్రదర్శించే బాధ్యత భగవంతుడికే అప్పగించాడు మనిషి.
భగవంతుని అవతారాలుః
బిడ్డల కోసం కన్నవారుగా తాము పడే తపన మనిషికి  స్వానుభవమే! తల్లీ.. తండ్రీ వంటి దేవుడూ తమ భద్రత  కోసమై ఆయా సందర్భాలకు అనుగుణంగా  భూతలానికి  దిగివచ్చి  దుష్టశిక్షణ, శిష్టరక్షణల వంటి ధర్మకార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన  ‘భగవంతుని అవతారం’. భగవద్గీత 4వ అధ్యాయంలోని 7,8  శ్లోకాలను('యధా యధా హి ధర్మస్య; పరిత్రాణాయ సాధూనాం) బట్టి భారతయుద్ధం నాటికే ఈ అవతార సంపద్రాయం స్థిరపడినట్లు, భగవానుడు  ధర్మోద్ధరణ కోసమే కృష్ణావతారమెత్తినట్లు  జనం భావించినట్లు అర్థమవుతుంది.
సమకాలికుడు కావడంతో కృష్ణుడి దివ్యత్వాన్ని(మానవ మాత్రులకు అసాధ్యాలనుకునే పనులు) వ్యాసుడు కళ్లారా చూసే అవకాశం కద్దు. తన అవగాహన  మేరకు శ్రవణాసక్తుల మేధోసామర్ధ్యమే లక్ష్యంగా వాసుదేవుడిని ఓ అవతారమూర్తిగా చిత్రించడం రచనా ప్రయోజనం సాధించడానికైనా కావచ్చు. ఏదేమైనా  కృష్ణకథను  ‘శ్రీకృష్ణవృత్తాంతం’గా  ఒక క్రమపద్ధతిలోఉదాత్తంగా చిత్రించిన ప్రథమ సాహిత్యరచన చరిత్రకు తెలిసినంత వరకు  మహాభారతమే. కాకపోతే  భారతవాజ్ఞ్మయంలోని శ్రీకృష్ణుని విశేషాలకు, వైదికవాజ్ఞ్మయంలోని శ్రీకృష్ణుని విశేషాలకు మధ్య కొంత సమన్వయ లొపం ఉందని చెప్పుకోవాలి.
వైదికవాజ్ఞ్మయంలో శ్రీకృష్ణుడుః
రుగ్వేదంలో కృష్ణుడు  చాలా చోట్ల కనిపిస్తాడు. ఎనిమిదో మండలంలో  అంగీరసుడు సోమపానీయం చేసే  సోముణ్ణి స్తుతించినప్పుడు, మొదటి మండలంలో విష్ణాపు తండ్రి 'కృష్ణీయ'గా సూచితుడయినప్పుడు, ఎనిమిదో మండలంలొ ఆర్యదేవతలకు వ్యతిరేకంగా వృత్తాసురుడిగా చిత్రితుడయినప్పుడు, కౌషీతకం బ్రాహ్మణంలో  అంగీరస మహర్షిగా అభివర్ణితుడయినప్పుడు, ఐతరేయ అరణ్యకం కృష్ణహరీతుని పేరున మహర్షుల కోవలోచేర్చి ప్రస్తుతించినప్పుడు.   ఛాందోగ్యోపనిషత్ అయితే 'తద్దైవద్యోరంగీరసంః కృష్ణాయదేవ’(3-17-6) అనే శ్లోకం ద్వారా ఘోరఅంగీరసుని శిష్యుడైన దేవకీపుత్రుడిగా కూడా కృష్ణుడిని  పేర్కొన్నది. వైదికవాజ్ఞ్మయం ఇట్లా పరస్పర విరుద్ధ చిత్తప్రవృత్తులున్నఒక మహర్షిని, మరో అనార్యనాయకుడిని కూడా కృష్ణనామధేయంతో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే అంశం! కానీ,  ఈ రెండు పాత్రలకూ, దేవకీ పుత్రుడైన  కృష్ణుడుకి పేరులో మాత్రమే పోలిక.
ఉపనిషత్తులలో శ్రీకృష్ణుడుః
ఉపనిషత్తుల కాలానికే ‘అవతారమూర్తుల’ భావన ఆరంభమైందని చరిత్ర భావిస్తుంది. 'అగ్నిం వరుణ మిత్రం ఇంద్రం ఆర్యమా ఐమాహః'  అన్న రుగ్వేదంలోని శ్లోకాన్ని బట్టి ఒకే దేవుడికి వివిధ నామాలు గల సంప్ర్రదాయం నుంచి ఉపనిషత్తుల కాలం(క్రీ.పూ 7వ శతాబ్దం)  వచ్చే సరికి ఒక్కో దేవుడికి ఒక్కో పేరు స్థిరపడే  సంప్రదాయం బలపడినట్లు చరిత్రకారుల అభిప్రాయం.  దశావతారాల సంప్రదాయానికీ ఆరంభం కూడా   అదే అయే అవకాశం కద్దు.
పురాణాలలో శ్రీకృష్ణుడుః
మహాభారతం తరువాత వెలసినవే కాబట్టి శ్రీకృష్ణ పాత్రను ఒక 'పూర్ణతమావతారం'గా దాదాపు అన్ని పురాణాలు  గొప్ప హంగులతో తీర్చిదిద్దాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 'యస్తు నారాయణో నామదేవ దేవః తస్యాంశో మానుషేష్వా సీద్వాసుదేవః ప్రతాపవాన్' అని భారతం చెబితే, 'మత్సాశ్వకచ్చప నృసింహ వరాహహంస రాజస్య విప్రవిబుధేషు కృతావతారః' అని అన్ని అవతారాలు తాను ధరించినవే అన్నట్లు స్వయంగా శ్రీకృష్ణుడే భాగవతంలో చెప్పుకొచ్చాడు. కృష్ణుని రాసలీలలు నుంచి రాచకార్యాల వరకు అన్నీ దైవలీలలే  అన్నంత భక్తిపారవశ్యంతో పూసగుచ్చినట్లు వర్ణించాయి దాదాపు వైదిక  పురాణాలన్నీ!  రాధాకృష్ణుల ప్రణయ వృత్తాంతాన్ని ఏకరువుపెట్టింది ఏ చరిత్రా కాదు.. సాక్షాత్ పురాణాలే! పురాణాల కాలం వరకు ఉత్తర భారతానికి మాత్రమే పరిమితమైన కృష్ణకథ తదనంతర కాలంలో తెలియని ఏ కారణం చేతనో  దక్షిణావనికీ  పాకి అత్యంత తక్కువ వ్యవధానంలోనే మహా విస్తృతంగా వ్యాపించింది. తెలుగునాళ్ల వరకు ఈ వ్యాప్తిలో   బమ్మెర పోతన భాగవతం పోషించిన పాత్ర అనన్యం. బౌద్ధసాహిత్యమూ కృష్ణకథ (ఘటజాతకం)ను ప్రచారంలో ప్రదర్శించిన ఉత్సాహం ఆశ్చర్యకరం.
పాశ్చాత్యుల  దృష్టిలో శ్రీకృష్ణుడుః
సనాతనకాలంలో రాముడు, కృష్ణుడు వంటి గొప్ప వ్యక్తులు  దివ్యశక్తులుగా వర్ధిల్లారు.  ఒకరి తరువాత ఒకరుగా అవే  దివ్యాకర్షణలతో వరుస చెదరకుండా మానవాతీతులు ఉద్భవించే  క్రమం ఆస్తికులలో  అవతారాలపై   విశ్వాసం మరంతగా  పెంచిందన్నది పాశ్చాత్య పరిశోధకుల భావన. అవతార సంప్రదాయానికి అదనంగా  పడమటి మేధోవర్గం  తమదైన వ్యూహాల (strategies) సిద్ధాంతం  జతచేయడం ప్రత్యేకంగా పరిశీలించదగ్గ విశేషం.
అవతారాలు వేరు.. వ్యూహాలు వేరు. ఒకే అవతారంలో భిన్న కార్యాల నిర్వహణకై  విభిన్న రూపాలు ధరించడం వ్యూహాల ప్రయోజనం. పాశ్చాత్యుల భావధారకు అనుగుణంగానే,  కృష్ణావతారంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.  భీష్మపర్వం ఈ వ్యూహాలనే వైదాంతిక   ధోరణిలో పురుషుడు, జీవుడు, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలుగా భావించింది(42-314). ఈ వ్యూహ సముదాయాన్నే మరో సందర్భంలో నరనారాయణులు, హరికృష్ణులనే  వ్యూహాలుగా కూడా భావించింది. 
గ్రీక్ తత్వవేత్త హెలియోడోరస్  ప్రతిష్ఠించిన గరుడస్తంభ వృత్తాంతంతో ఈ వ్యూహాలకు పోలిక కద్దు. ఆర్య సంస్కృతి ప్రారంభ దశల్లో పశుపాలన, వ్యవసాయం ప్రధాన వృత్తులు కాగా వాసుదేవ, సంకర్షణ వ్యూహాలు ఈ రెండు వృత్తులకు ప్రతీకలుగా భావించబడి ఆ ధోరణిలోనే  కాల్పనిక సాహిత్యం పుట్టుకొచ్చినట్లు పాశ్చాత్య పండితుల భావిస్తున్నారు.
శ్రీకృష్ణుని జీవితకాలం:
మహాభారతంలో శ్రీకృష్ణుడిది ప్రధాన పాత్ర. కురుక్షేత్రయుద్ధ కాలాన్ని బట్టి  కృష్ణుడి జీవితకాలం మీదా ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారతంలో  పర్షియన్లు, గ్రీకులు, రోమన్ల తాలూకు ప్రస్తావనలు ఉండటం వల్ల మహాభారత కథాకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీ.పూ 4వ శతాబ్దానికి ముందు నాటిదిగా చెప్పడానికి లేదన్నది  సుప్రసిద్ధ పురాతత్వశాస్త్రవేత్త బి.బి. లాల్ పరిశోధన (మహాభారత్ మిత్ అండ్ రియాలిటీ -1976 -పుట.52) అభిప్రాయం. పాణిని అష్టాధ్యాయీ మహాభారత కథాకాలాన్ని క్రీ.పూ 5 వ శతాబ్దం దాకా  తీసుకువెళ్లడం గమనార్హం. రెండవ పులకేశి  తాలూకు క్రీ.పూ.634 నాటి ఐహొళె శాసనం  ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది సదరు శాసనం నాటించిన 3735 సంవత్సరాలకు ముందు.
అంటే (3735-634=3101) క్రీ.పూ 3101 ప్రాంతంలో!  మహాభారతం మౌసలపర్వం మొదటి శ్లోకం ప్రకారం కృష్ణుడి నిర్యాణం జరిగింది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత. అంటే (కలియుగం ఆరంభమయిన క్రీ. పూ 3101+ మౌసలపర్వం ప్రథమ  శ్లోకం చెప్పిన 36 సంవత్సరాలతో కలుపుకొని) క్రీ.పూ3137 లో!
పురాతత్వచరిత్ర కోణంలో విశేషాలుః
చరిత్ర అంటే  జరిగిన సంఘటనల సాధికారిక ప్రకటన. 'హెలియో డోరస్' అనే గ్రీకు దేశీయుడు  క్రీ.పూ 2వశతాబ్దిలో విదిసా నగరం నడిబొడ్డున  గరుడ ధ్వజాన్ని ప్రతిష్ఠి౦చినట్లు   శాసన మొకటి  కనిపిస్తుంది. ఇదే శతాబ్దిలో సంకర్షణవాసు దేవతత్వాన్ని గౌరవించే  కట్టడం  ఉదయ్ పూర్ లో నిర్మించినట్లు డి.పి.సర్కార్ 'సెలెక్ట్ ఇన్ స్క్రిప్షన్స్' మొదటి సంపుటి తెలుపుతోంది. ఈ కాలానికి  ముందూ వెనుకలుగా వైష్ణవతత్వం తెలియచేసే పాంచరాత్రం ప్రాధాన్యత గల ఛాందగ్యోపనిషత్ రచన జరిగింది. మహాభారతంలోని హస్తినాపురం ఇప్పటి ఢిల్లీ, మీరట్ ప్రాంతాలు. అక్కడ  జరిగిన తవ్వకాల తాలూకు బైటపడ్డ రంగుల కుండ పెంకుల ఆధారంగా భారతయుద్ధ కాలం క్రీ.పూ 1100 ఏళ్ల కిందటిది.  ఐహొళె శాసనం పేర్కొన్న విధంగా క్రీ.పూ 3101 కాకుండా, మహాభారత కాలం మరింత ముందుకు జరికి క్రీ.పూ 1200 నాటిది కూడా అయివుండవచ్చు, ఇన్ని కారణాలుగా శ్రీకృష్ణుడి జీవిత కాలమూ అదేనన్న భావన క్రమేపీ బలపడుతున్నది ఇప్పుడు. ఏదేమైనా, కృష్ణుడు శ్రీకృష్ణుడుగా సుమారు 3200 సంవత్సరాల నుండి ఈ భరతభూమిలో ఆరాధ్యుడన్నది  ఒప్పుకోక  తప్పని నిజం.  చిత్రకళల్లోని శ్రీకృష్ణుడూ  ఈ వాదన వైపుకే మొగ్గు చూపడం విశేషం,
చిత్రకళలో శ్రీకృష్ణుడుః
భారతీయ చిత్రకళలో కృష్ణుని చిత్రం క్రీ.పూ 2వ శతాబ్ది నుంచి దర్శనమిస్తోంది.  నేటి హర్యానా సగ్ ప్రాంతంలో దొరికిన (ఆధారం: పి.బెనర్జీగారి 'కృష్ణా ఇన్ ఇండియన్ ఆర్ట్) సాందీపుని దగ్గర్ర శ్రీ కృష్ణుడు బ్రహ్మీ అక్షరాలను అభ్యసించే చిత్రం మొదటి సారి నాణేల మీద ముద్రించిందీ  ఇదే శతాబ్దానికి చెందిన అగతక్లీన్. కుషాణశైలిలో శిల్పాలపై చెక్కిన కృష్ణ చిత్రాలు విస్తారంగా కనిపిస్తాయి.  శ్రీకృష్ణుడిని క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాలలో మధుర ప్రాంతాలలో దైవంగా భావించి, ఆరాధించడటమే ఇందుకు నిదర్శనం. తిలక్ తన  గీతారహస్యంలో భగవద్గీతను క్రీ.పూ 500 సంవత్సరాల నాటిదిగా తేల్చిచెప్పారు. ఆ భావనకే పాశ్చాత్య పరిశోధకులూ తలలాడించారు. పాశ్చాత్య పండితుడు డి.హిల్ కృష్ణావతారం క్రీ.పూ 2వ శతాబ్దం నాటికే స్థిరపడ్డట్లు భావించడం ఇందుకో ఉదాహరణ.(ఆశా గోస్వామి 'కృష్ణా అండ్ అల్లైడ్ మ్యాటర్స్ -1954,పుట 189).
కృష్ణకథ- భారతకథ- వాస్తవికత
కృష్ణకథ- భారతకథకు అనుసంధానం సరే! అసలు మహాభారతం నిజంగా జరిగిందా?అనే  సందేహం సహజంగానే తలెత్తుతుంది  కదా ఏ పరిశోధనకైనా? యధాతధంగా కాకపోయినా వ్యాస విరచిత భారతంలోని కొన్ని సంఘటనలకు వాస్తవ జగత్తులో రుజువులు లభిస్తున్నాయి. వి.సి. పాండే మహాభారతం మిత్ అండ్ రియాలిటీ (పు.183) ప్రకారం భారతం కథలోని పాత్రలు వైదికవాజ్ఞ్మయంలో కనిపిస్తున్నాయి. భారతం చెప్పిన  యాత్రాస్థలాలు కొన్ని ఈనాటికీ  మన కళ్ల ముందు కనిపిస్తున్నవే! కృష్ణుడు భీమార్జునులతో కలసి జరాసంధుని నగరానికి పయనిస్తూ మార్గ మధ్యంలో చూసిన పద్మ సరస్సు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రానికి 182 కి. మీ దూరంలో నేటికీ దర్శనమిస్తున్నది. అగస్త్యుని పేరు మీద ఏర్పడ్డ ప్రాంతంగా ప్రాంతీయులు విశ్వసించే  ‘అమీన్’  ప్రాంతమూ కురుక్షేత్రానికి 9 కి.మీ దూరంలో ఉంది.  'సపిదన్'  జనమేజయుడు చేసిన సర్పదమన యజ్ఞాన్ని తలపుకు తెచ్చే మరో స్థలం. కురుక్షేత్ర సమరం కేవలం వైదికమతమే కాదు, జైన, బౌద్ధ మతాలూ అంగీకరిస్తున్న సమాచారమే.  పురాతత్వశాఖవారి  తవ్వకాలలో భారతకాలానికి చెందిన   అవశేషాలు విశేషంగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బైటపడుతున్న నేపథ్యంలో   భారతకథ వాస్తవీయతను గూర్చి చర్చ అసందర్భమేమో!
మహాభారతం పునర్నిర్మాణం:
యుద్ధం జరిగే వేళ వ్యాసుడు రాసినట్లు చెప్పిన భారతం ఈనాడు మనకు అందుబాటులో లేదు.  ప్రచారంలో ఉన్న ప్రతి మూలభారతానికి ఎంత సమీపంలో ఉన్నదో   తెలిసే సాధనమూ లేదు. ప్రస్తుతం లభిస్తున్న భారతం కొద్ది మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం  క్రీ.శ ఒకటో శతాబ్దిది. ఇదీ భారతకథను విపులంగా చెపుతున్నదే తప్పించి.. శ్రీకృష్ణుని దివ్యత్వం మీద ప్రజావళికి విశ్వాసం ఎప్పుడు ఏర్పడిందో  నిరూపించే ఆధారాలేమీ అందులో కనిపించలేదు.
భరతభూమిలో ఎప్పుడో జరిగిన శ్రీకృష్ణుని కథ ఆ తరువాత ఎప్పుడో రాసిన భారతానికి ఎక్కిన కారణంగా భారత రచనాకాలం, కృష్ణుని జీవితకాలం ఒకటి కాకపోవచ్చు అనిపిస్తున్నది. కాకపోతే భారతంలో కనిపించే కృష్ణుడి కథ ఒక క్రమాన్ని అనుసరించి సాగడం, ఆ క్రమాన్నే ప్రమాణంగా తీసుకున్నట్లు తరువాతి కృష్ణసాహిత్యం మొత్తం మరింత విస్తరించడం.. దానికే క్రమేపీ దివ్యత్వం ఆపాదించడం మాత్రం కాదనలేని వాస్తవాలు.
అయినా వ్యాసమహాభారతమే శ్రీకృష్ణుడిని విష్ణువు అవతారంగా చూపించి కథమొత్తానికి సూత్రధారిగా మలిచిన సత్యం మనం మరచిపోకూడదు. భారతయుద్ధం క్రీ.పూ 3101 నుండి క్రీ.పూ 1200 మధ్య కాలంలో జరిగినట్లు చారిత్రిక ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో శ్రీ కృష్ణుని జీవితమూ  ఈ మధ్య కాలంలోనే గడిచింది అనుకోవడం సబబేమో!
ప్రాచీన కృష్ణపాత్రకు అర్వాచీనత సొబగులు:
శ్రీకృష్ణుడు జీవించి పోయిన ఎన్నో ఏళ్లు గడిచిన తరువాత కాని కృష్ణకథ గ్రంథస్తం కాలేదు. ఆ గ్రంథస్తం చేసిందీ  మొదటిసారి  మహాభారతమే. అందులోనూ యెకాయెకి శ్రీకృష్ణునికి దివ్యత్వం నిర్మొహమాటంగా అపాదింపబడింది. మౌర్యులకాలం నుంచి విదేశీ దాడుల వల్ల ఎంతో భారతీయ వాజ్ఞ్మయం నాశనమయింది. ఎప్పటికప్పుడు కోల్పోయిన వాజ్ఞ్మయాన్ని లభ్యమయిన మౌఖిక  కథనాల  అరకొత ఆధారాలతో పునర్నిర్మించుకునే క్రమంలో మూలభారత రూపంలో కొన్ని మార్పులు అనివార్యంగా వచ్చి చేరాయి. అయినా కృష్టతత్వం వెలుగుల మీద ఛాయలెప్పుడూ పడకపోవడం విశేషం. మొత్తానికి క్రీ.పూ 3101 నుండి క్రీ.పూ 1200 మధ్య కాలంలో శ్ర్రీ కృష్ణుని జీవితం బాల్యదశ నుంచి దైవీయభావనలతోనే వర్ధిల్లినట్లు భావించడం ఒక్కటే ముక్తాయింపుగా ప్రస్తుతానికి చెప్పుకొనే సబబైన మాట.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక - ఆదివారం  సంచికలో ప్రచురణం)

***
n








Saturday, August 1, 2020

దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు- సూర్య ఆదివారం ప్రచురితం





నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' న్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది.
ఆయుర్వేదమంత్రం(14 -20) చదవండి. అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసిలే   శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవస్తున్నదన్నది ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం.
ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా కుడా దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దివ్యత్వం ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?
దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమించేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు ప్రారంభమవడం.. అదో విచిత్ర గాధ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలుగనంత వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు!
భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలల్లో ఎడతెరిపిలేకుండా. మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.
స్వాత్రంత్ర్య సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ ర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం.
దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  బౌతిక రూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోక తప్పదు. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పైనా మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే .. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిష ఎన్నిరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  
కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకే తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా?! విచారకరం.
'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి – వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబదుతున్నరు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూమ్మీది నిప్పు, మబ్బులోని గాలి.. వెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!
రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళేఅగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.
వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాథనలు అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం కొత్త పరిణామం.
జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతిదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేథోసామర్థ్యం సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాథ్యమన్న వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ.
వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించి ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం.
జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖిసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాథాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంఛమంతటా ఉన్నట్లే,రతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శీవాజీ వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, సంతోషిమాత, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు.
మతాల గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథా ప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రం మిత్రం’ అనే  శ్లోకార్ధాన్ని బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న
రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు.
కంటికి కనిపించని దేవుళ్ల కౌటింగ్ కన్నా.. కంటి ముందు కదిలే  నుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక-  ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం)






పాత సాహిత్యం మీద బ్రౌన్ దొర మోజు - కర్లపాలెం హనుమంతరావు


తెలుగు సారస్వతం తాటాకుల్లో మూలుగుతూ, రక్షించే నాథుడు కరవైన రోజుల్లో విదేశీయుడైన బ్రౌన్ (పుట్టింది భారతదేశంలోనే ఐనా) తెలుగు నేర్చుకుని, పండితులను తన స్వంత డబ్బుతో పోషించి, తాటాకుల్లోని వాజ్ఞ్మయాన్ని కాగితాలమీద రాయించి,అనేక గ్రంథాలకు సంస్కరణ ప్రతులు తయారు చేయించి, వాటికి వ్యాఖ్యానాలు, పదసూచికలు ఏర్పాటుచేసి, కొన్ని గ్రంథాలను ముద్రించి.. ఆంధ్రభాషోద్ధారకుడిగా చరిత్ర ప్రసిద్ధికెక్కాడు.
కోల్ బ్రూక్, విల్కిన్స్, విల్ ఫోర్డ్, విల్సన్ సంస్క్తతభాషావ్యాప్తికి నిస్వార్థంగా పనిచేయాడానికి కారణం వాళ్ళకున్న మత సహనమే అనీ, వాళ్ళు ఒక రకంగా Western Brahmins తో సమానమని కాల్డ్ వెల్ నిర్మొహమాటంగానే అన్నట్లు బంగోరె సంపాదకత్వంలో 1978లో వచ్చిన 'లిటరరీ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సి.పి.బ్రౌన్' పుస్తకంలో కనబడుతుంది(పే.87).బ్రౌన్ వాళ్ళకోవలోకి కచ్చితంగారాడు. హిందూమతంమీద ప్రత్యేకమైన గౌరవం ఉన్నవాడేమీ కాదు.మరి తెలుగుభాషనీ రకంగా ఉద్దరించడానికి కారణం ఏమై వుంటుదనే సందేహం తప్పక అందరికీ కలుగుతుంది.
బ్రౌన్ కి స్వతహాగా పురాతనంమీద గాఢాభిమానంట! పాతపుస్తకాలు చదవడం, వాటిమీద రిమార్కులు రాయడం, విసుగు విరామంలేకుండా సమాచారాన్ని సేకరించడం, పనికిమాలిన విజ్ఞానంపైన అతనికి వుండే ఓ రకమైన ప్రత్యెకమైన ఇష్టం,-ఇలాంటి లక్షణాలన్నీ కలగలసి తెలుగు సాహిత్య పునరుజ్జీవానికి అతడిలో ప్రేరణను కలిగించాయంటున్నారు కాల్డ్ వెల్. బ్రౌన్ కి వుండే ఏనుగుజ్ఞాపకశక్తి, పిడివాదం చేస్తూ ఏది అడిగినా 'ఓహ్..నొ' అంటూ చెప్పటం మొదలుపెట్టే గుణం..ఇవన్నీ ఆయన స్వంతానికి ఎంతవరకూ ఉపయోగపడ్దాయో తెలీదుకానీ..వివిధ కారణాల మూలకంగా అంతవరకూ స్తబ్దంగా పడివున్న తెలుగుభాషామతల్లికి మాత్రం ఎనలేని మేలు కలిగించాయనే చెప్పాలి.ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు

Monday, July 27, 2020

గడసరి ఇల్లాలి పెద్దపండుగ చమత్కారం!


Best Vacuum Cleaners 2020: Top Picks for Your Home | Tom's Guide


పండుగ సీజన్లలో రకరకాల వస్తువులు అమ్మేందుకు బ్రాండెడ్ కంపెనీలు సైతం తమ ఏజెంట్లను డెమాన్ స్ట్రేషన్స్ కోసమని ఇళ్లకు పంపించడం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అందులో భాగంగానే పేపర్లలో వరుసబెట్టి వాక్యూమ్ క్లీనర్ కంపెనీల ప్రకటనలు గుమ్మెత్తిపోతున్నాయి ఈ దఫా. తెలివిగల ఒక ఇల్లాలు ఏం చేసిందంటే…
ఒక్కో రోజు ఒక్కో కంపెనీవాడికి ఫోన్ చేసి మరీ ఏజెంటును రప్పించుకుంది. ఇంటిలోని ఒక్కో గదిని ఒక్కో కంపెనీ వాక్యూమ్ క్లీనర్ మనిషి  డెమాన్ స్ట్రేషన్ వంకన శుభ్రం చేయడంతో పైసా ఖర్చులేని గృహప్రక్షాళన!  గడుసుతనమంటే అదీ మరీ!
***
సేకరణః కర్లపాలెం హనుమంతరావు

Saturday, July 25, 2020

హేతువాదమే ప్రగతి బాటకు రహదారి! -కర్లపాలెం హనుమంతరావు = సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం - కర్లపాలెం హనుమంత్తరావు



చదువుకున్నవాడికీ, చదువులేనివాడికీ మధ్య ఉండే తేడా మనకు విద్యాలయాల ద్వారా సాధించే పట్టాల రూపంలో మాత్రమే చూడడం అలవాటు. ఇప్పుడా విద్యారేఖా అడ్డుగా ఉండని గొడ్డుమోతురోజులు ముంచుకొచ్చేసాయి. ఆక్స్ ఫర్డ్ లో చదివినా అమ్మనా బూతులు కూస్తేనే తప్ప 'పప్పూ కాదురా సోదరా.. పొరపడ్డాం.. మగాడేరా'! నే మెప్పులు పొందే తప్పుడు సమాజంలో మనమిప్పుడు  అతి కష్టం మీద  ఎట్లాగో ఊపిరి పీలుస్తున్నాం.  హేతువును గురించి ఏమన్నా రెండు హితవైన ముక్కలు చెప్పాలన్నా జంకే! ఎక్కడ 'గిరీశం లెచ్చర్ల ' కోవలోకి జారిపోతామోనన్న బెంగతోనే నోళ్లు కుట్టేసుక్కూర్చునే మేధావులే మట్టంగా దర్శనమిస్తున్నా రిప్పుడు సర్వత్రా. విశ్వాసాలకు, మూఢవిశ్వాసాలకు.. జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉండే అడ్డుగీతలు మామూలు చేతులతో స్పర్శిస్తేనో, కళ్లతో దర్శిస్తేనో నిర్ధారణ చేసుకునే వెసులుబాటు ఉండదు. వీక్షణ, ఆలోచన, విశ్లేషణ, వివేచనలతో కూడిన పని ఎవరైనా బుద్ధిశాలి కొద్దిగా ధైర్యం చేసి  కాస్త కూడబలుక్కునైనా   విడమరచి చెప్పే దుస్సాహం చేయబోతే.. ఠక్కున ఏ దిక్కు నుంచైనా పాతచెప్పులు రేకేట్లలా దూసుకొచ్చే ప్రమాదం కద్దు. 
బుద్ధి కర్మానుసారిణి, అంతా విధి చేతుల్లోనే ఉంది.. మనుషులం కేవలం నిమిత్త మాత్రులం .. లాంటి అహేతుక  భావజాలాంధకారంలో పడి విద్యలు నేర్చినవారు, రాజ్యాలు చేసేవారు, జీవితాలు తీర్చిదిద్దే బాధ్యతలు నెత్తికెత్తుకున్నవారు కూడా కొట్టుమిట్టులాడుతుంటే, పొట్ట కూటికై పాకులాడేందుకే ఎక్కడి జీవితకాలమూ చాలని బక్క మనిషి నుంచా  మనం  మంచిబుద్ధి,  సదసద్విచక్షణలు ఆశించేది?! తరతరాలుగా భావదాస్యంలో మునిగి తేలే అక్కచెల్లెళ్లు, అట్టడుగు జాతుల వంటి విస్మృతవర్గాలవారిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఇంటా బైటా సవాలక్ష ఆంక్షలతో సతమతమయ్యే బక్కజీవి మతి కుదిరి, ఓ మూలను చేరి మంచిచెడులు తీరికగా తర్కించుకునే పాటి సావకాశం పాడు ఆధిక్యతాభావ  ప్రపంచం ఎక్కడ ఏకాలంలో పడనిచ్చింది గనక?! జీవికకు ఏ మాత్రం అక్కరకు రాని  దురభిమానాలు, హెచ్చుతగ్గులు, జాత్యహంకారాలు, కుల మత భేదాలు, అవినీతి, కాముకత్వం వంటి మానసిక జాడ్యాలు నానాటికి పెచ్చుమీరుతున్నాయంటే, అందుక్కారణం  మంచేదో, చేడేదో తర్కింఛుకోవలసిన గత్యంతరం బొత్తిగా లేని అడ్డుగోలు గొడ్డుమోతుతనమే గద్దె మీద చేరి గద్దించి మరీ పనులు సానుకూలపరుచుకునే  కువిధానాల వల్ల.  నాగరికత- పేరుకే ఇరవయ్యకటో శతాబ్దానిది. సంస్కారం- ఒకటో శతాబ్ది కాలాన్నైనా దాటి రాని దుస్థితి. సంఘంలో, ఆర్థిక రంగంలో అశాంతి, అక్రమాలు అంతకంతకు తమ రికార్డులు తామే బద్దలు కొట్టుకుంటున్నాయంటే.. అన్యాయమే రాజకీయగద్దె మీద గజ్జె కట్టి హేతువనే పదానికుండే మూలార్థాన్ని మొదలంటా పెళ్ళగించేందుకు కంకణం కట్టుకోబట్టి కాదూ!
సమాజానికి, కుటుంబానికి కూడా ఎంతో కీలకమయినవి బడుగుల పాత్ర, స్త్రీ పాత్ర. విస్మృతులకు దక్కే హోదా, స్థాయిలే ఆయా సమాజాల ప్రగతి వికాసాలకు కొలమానాలు. తక్కువవర్గాలుగా బావించుకునేవారులోని తతనాన్ని తామే స్వయంగా  గ్రహింపుకు తెచ్చుకుని కలిసొచ్చే సానుకూల శక్తులని తోడు తెచ్చుకునైనా చొరవగా ఒక అడుగు ముందుకు చొచ్చుకుపోకపోని పక్షంలో ఈ సమాజానికి ఇక సమంజసత, సున్నితత్వం, సహేతుకత, సమ్యక్ దృష్టి ఏకమొత్తంగా అలవాటు తప్పిపోయే  పరిస్థితులు దాపురించినట్లే లెక్క.. నిజం చెప్పాలంటే!
సమాజమనే కాదు, వ్యక్తి జీవితంలోనూ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన  వాతావరణం వర్ధిల్లినప్పుడే సర్వే జనా సుఖినో భవన్తు అనే  సూత్రసారం ఆసాంతం సాకారమయే సావకాశం! ఉదాత్తమైన ఆశయాలు, ఉత్తేజకరమయిన ఆలోచనలకు సహేతుకతా తోడయే తప్ప మనిషి ఆలోచనల్లో మంచి మార్పు రాదు. మంచి మార్పు వస్తేనే  ప్రపంచానికి ప్రస్తుతం దాపురించిన దుస్థితుల నుంచి విముక్తయేందుకు  మార్గం దొరికేది.  చార్వాక, కపిల, కణాదుల సిద్ధాంతలతో కూడా బాల్యం నుంచే పరిచయం పెంచుకోవాల్సిన అగత్యంలో ప్రస్తుతం మన సమాజమున్నది. అట్లాగని తిరుగుబాటే మా వేదాంతం అని నినదించాలని కాదు. విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణులకు ఎల్లవేళలా స్వాగతపత్రం అందించేందుకు మనసును  సిద్ధం చేసుకొనుంచుకోవాలనేదే.. హితవు.
తిరుగుబాటు వేరు.. విప్లవం వేరు. సిపాయిల తిరుగుబాటు వంటి తిరుగుబాటులకు అన్ని వేళలా సహేతుకమైన కారణాలే ప్రేరణలవుతాయన్న హామీ ఏమీ లేదు. కానీ.. భావవిప్లవం అంటే మాత్రం కణకణ మండే  అఖండ జ్వాలామాల. దానికి ఉత్తేజమనే ఇంధనమందేది మాత్రం అన్ని వేళలా అన్ని వైపులా  హేతుబద్ధమైన వికాసాలోచనల స్రవంతుల నుంచి మాత్రమే! ఆంగ్లసీమలో 1689లో హద్దులెరుగని రాచరికానికి కళ్లెమేసిన తీరులో సాగేదీ విప్లవోద్యమం. ప్రాతినిధ్య అధికారం ఉన్నవారికే పన్నులు విధించే హక్కన్న హేతుబద్ధ ఆలోచనే 1776 నాటి అమెరికన్ ప్రజాస్వామిక విప్లవానికి దారి తీసిన  ప్రేరణ.  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శవంతమైన  భావజాలం బలం పుంజుకుని 1789 ప్రాంతంలో  ఫ్రెంచి విప్లవానికి ప్రోద్బలంగా నిలచిన సందర్బం గమనించినా, 'భూమి.. తిండి.. శాంతి' వంటి వాస్తవావసరాల నిమిత్తం హోరెత్తిన 1917నాటి రష్యన్ల విప్లవం పరిశీలించినా, కార్మిక, కర్షక, మధ్యతరగతి, అణగారిన వర్గాల వంటి ఇతరేతర విస్మృత శక్తులు  ఆయా దేశాలలో  సాధించిన అన్ని విజయాల వెనకున్నదల్లా హేతుబద్ధమైన ఆలోచనాక్రమ వికాససరళి వెన్నుదన్నులు మాత్రమే అని అర్థమవుతుంది. 1947 నాటి భారత స్వాత్రంత్ర్యసమరం గాని, మరో రెండు ఏళ్ల తరువాత చైనాలో చెలరేగి విజయం సాధించిన జనచైనా విప్లవం గాని.. లోతైన సునిశిత పరిశీలనకు దిగితే చివరికి తేల్చేవి..  హేతువుతో కూడిన సమ్యక్ దృష్టి సమాజం అట్టడుగు వర్గాల వరకు చేరి ప్రభావితం  చేస్తేనే తప్ప అమానుషత్వం అణగారి సమసమాజ నిర్మాణానికి సానుకూల బాటలు పడబోవని.  
సమాజ పరివర్తనకు, భావగమనానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఆ భావాలు ఎవరి ద్వారానో ప్రతిపాదితమై ప్రభావితం చేసేవా? మన మెదడులోనే కదలడం మొదలయినప్పటి బట్టి స్వత్రంత్ర బుద్ధితో పెంపొందేవా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వవిఖ్యాత ఆలోచనావిప్లవ మేధావి ఎమ్.ఎన్. రాయ్ రెండవదే శిరోధార్యమని బల్లగుద్ది  మరీ చెప్పిన సత్యం మనమిక్కడ స్మృతికి తెచ్చుకోవడం అవసరం.
రాయ్ ఆలోచనా సరళి ప్రకారం, వ్యక్తివాదం, హేతువాదం , మానవవాదం..  అనే మూడు గుణాలతో మనిషి ఆలోచనా క్రమం ప్రభావితం అవుతుంది. తతిమ్మా అన్ని జీవులకు మల్లేనే మనిషి పుట్టుకా ప్రకృతి నుంచే. ప్రకృతి నియమం క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మానవ వికాసమూ, మనిషి పెరుగుదలా నియమబద్ధంగా.. అంతే హేతుబద్ధంగా సాగుతాయనేది  రాయ్ రేడికల్ హ్యూమనిజం సూత్రం. 
మానవవాదం పురాతనకాలం నుంచి సదాలోచనా పరంపరగా సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నదే! కదిలే కాలంతో కదా మనిషి సహప్రయాణం చేస్తున్నది!   పెరుగుతున్న మానవ మేధస్సు, నాగరికతల మూలకంగా సమకాలీన భావజాలం సంధించే క్లిష్టమైన ప్రశ్నలు సహజంగానే ఎన్నో పుట్టుకువస్తాయి.  ఎప్పటికప్పుడు మొలకెత్తే కొత్త కొత్త సందిగ్ధాలకు సంబద్ధమైన బదుళ్లిచ్చే క్రమంలో నవ్యమానవవాదం అనే మరో భావధారకు పురుడుపోసిన ప్రజామేధావి ఎమ్.ఎన్.రాయ్.

స్వభావసిద్ధంగా స్వేచ్ఛాపిపాసి, సత్యాన్వేషి- మనిషి. అతను తన మనుగడ సాగించుకునే క్రమంలో అంతరాత్మ చెప్పే నీతి.. (అదే ఎక్కువ మందికి భగవంతుడు చెప్పే నీతిగా అనిపించేది), ప్రయోజనం కలిగించే నీతి అనే రెండు దోవల నుంచి ప్రేరణ పొందుతాడని, ఈ రెండు దిశలకు ప్రత్యామ్నాయంగా హేతుబద్ధమయిన నీతిమార్గంమాత్రమే మనిషి నడిచే సన్మార్గంగా ఉండాలనేది రాయ్ నవ్యమానవవాద మూల సూత్రం.

రాజకీయాలలో పార్టీలు లేని వ్యవస్థను, ఆర్థికరంగంలో సహకార సంబంధమైన ప్రణాళికా రచనలు ప్రతిపాదించే తీరులోనే,  సాంస్కృతిక రంగంలోనూ స్వతంత్ర బుద్ధితో హేతుబద్ధంగా చేసే ఆలోచనాధారను ప్రోత్సహిస్తుందీ సిద్ధాంతం. సంఘపరంగా సాగే అన్ని రకాల వివక్షలను నిర్ద్వందంగా నిరసిస్తుంది కూడా. కుల, మత, వర్గ, ప్రాంత, భాష, జాతి, దేశ విభేదాల జాబితాలో లింగ విభేదమూ ఉంది. విశ్వజనీనమైన సంస్కృతికి విలువిస్తూనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం చూడగల సత్తా ఈ మానవవాదానికి ఉంది. ఆఖరుదే  అయినప్పటికీ అత్యంత ప్రధానమైన అంశం, విశ్వాసాలు మూఢవిశ్వాసాల కిందకు దిగజారడాన్ని నిర్మొహమాటంగా నిరసించే పదునైన ఆయుధం నవ్యమానవవాదం.


ప్రకృతికి మించిన శక్తి మరేదీ లేదు. మనిషి తన మనుగడకు, తన భవిష్యత్తుకు తానే బాధ్యుడు. తన మేలుకు, సాటి మనిషి మేలుకు మధ్య ఘర్షణ లేదని.. ఉండకూడదన్న జీవన సూత్రాలను మాత్రమే సామాజిక పరిస్థితుల మెరుగుదలకు సాధనాలుగా వాడుకునే ప్రయత్నం చేయాలని నవ్యమానవవాదం హితవు చెబుతుంది.
ప్రస్తుతం ప్రపంచ మానవాళి సంస్కృతులే మహాచిక్కుల్లో నలుగుతున్నాయి. మత ప్రాబల్యం, ఫాసిజం తరహా ఎన్నో ఇతరేతర నియంత్రణ విధానాలు సర్వజనసంక్షేమ కాంక్ష మీద నిప్పులు కురిపిస్తున్నాయి. విజ్ఞానం సహేతుకమైన మార్గంలో అభివృద్ధిచెందడం, మేధస్సు కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చెయ్యడం, సృజనశక్తి సరికొత్త జవసత్తువలు పుంజుకునే నూతన తాత్విక చింతనలకు ప్రాతిపదికలుగా వాతావరణాన్ని మలుచుకోవడం తప్పనిసరి అయిన ఈ తరుణంలో, లోకం రోజురోజుకూ మూఢవిశ్వాసాలు, మూర్ఖాలోచనల రొంపి వైపుకు శరవేగంగా అంగలువేయడం  సామాజిక శ్రేయోకాముకులు ఎవరికైనా అమితాణ్దోళన కలిగించే అంశమే!
పదునెక్కిన నైతిక దృక్పథం మొక్కటే ముందుకు చొరబడి రాక తప్పని తరుణమిది. సమయానుకూలమైన మౌనభంగిమలనే హూందాతనంగా మేధావులు భావిస్తుండవచ్చు. పెద్దరికం ప్రదర్శంచడమంటే ఇతరుల హక్కులకు భంగం వాటిల్లని పద్ధతిలో స్వయం వికాసమార్గాలను అన్వేషించుకునే మార్గాలు వెతికి సూచించడం. అర్థం. క్రమశిక్షణ మిషతో మనిషిని ఒక యంత్రంలా మార్చే విధానాలకు సత్వరమే తిలోదకాలు ఇవ్వడం అవసరం. యాంత్రీకరణ మానవీయ విలువలను.. క్రమంగా మానవతను కూడా ధ్వంసం చేసే మహారక్కసి. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన, సమగ్రమైన విలువలను ఫణంగా పెట్టే జీవనవిధానాలను చెత్తబుట్టలో వేసి తొక్కేస్తే తప్ప ఆ రక్కసి కర్కోటకం నుంచి నిజమైన విముక్తి అట్టడుగు జీవి వరకు  చేరే అవకాశంలేదు.
వ్యక్తి స్వేచ్ఛ ఆవశ్యకతను తక్కువ చేయలేం.. కాని సమాజశ్రేయస్సు  తరువాతనే దానికి ప్రాధాన్యత. భౌతికపరమైన అవసరాలు తీరే నిమిత్తం పరుల స్వేచ్ఛను హరాయించడం అమానుషమవుతుంది. మానసిక స్వేచ్ఛ, సామాజిక చింతన లేకుండా ప్రగతిని సాధించడం మోచేతి కింది బెల్లం నాలుకతో అందుకోవడంతో సమానం.
నిజం చెప్పాలంటే, మానవవాదంలో పిడివాదానికి, పిడిగుద్దుల సిద్ధాంతానికి  తావేలేదు.  మానవవాదం మరో పేరే వ్యక్తి స్వేచ్ఛ. మారే సమాజానికి అనుగుణంగా అభ్యుదయ పంథాలోనే విధానాల మార్పుకు సౌలభ్యం కల్పించే మౌలిక జీవనసూత్రానికి హేతువాదం కట్టుబడి ఉంటుంది. విజ్ఞాన కాంతిని ప్రపంచశాంతికి వినియోగించే సమన్వయ బుద్ధి సాధించాలన్నా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సవాలక్ష సవాళ్లకు సహేతుకైన సమాధానాలు  వెతికే మనస్తత్వం బాల్యం నుంచే అలవరచుకోవడం ఒక్కటే గతి.  
-కర్లపాలెం హనుమంతరావు
(26-07 -2020 నాటి సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురితం)


                                                

Friday, July 24, 2020

వేటూరి పాటలతో ఆట



వేటూరి ఓ  పాటలోని  చిత్రమైన చతురత
సినిమా పాటలంటే సాహిత్యపరంగా పల్చగా ఉంటాయన్న చులకన భావం సాహిత్యంలో ఓ మాదిరి లోతు  పాతులు తమకు తెలుసును అనుకునే వాళ్లకి మనసులోనైనా కొద్దిగా కద్దు. (నాకూ ఒకానొకప్పుడు ఆ మాద్రిరి భావం ఉండేది, రవి వీరెల్లి గారి అంతర్జాతీయ మాసపత్రికలో ఆ అంశం మీద ఒక సినీరచయిత సాగించిన చర్చలో కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు గుర్తు. ఇప్పటికీ ఆ భావనలో మార్పు అంతగా లేదు. కానీ  గత కాలపు సినీకవులు కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర.. ఆత్రేయ  .. మరీ  ముఖ్యంగా వేటూరి వంటి విద్వత్ కవుల  కలంపోటుల్లో మాత్రం  తరచి చూసే ఓపిక ఉన్నవాళ్ల కళ్లకి తరచూ  మెరుపులు తటిల్లుమని మెరిసి మురిపిస్తాయి. తార్కాణానికి ఒక మచ్చు తునకః శంకరాభరణం- ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము- అనే పాట. ఆ పాటలోని - 'రసికుల కనురాగమై, రసగంగలో తానమై(స్నానం చేసి), పల్లవించు సామవేద మంత్రము'  అనే చరణంలో   సంగీతానికి ముఖ్యప్రాణులైన రాగం, తానం, పల్లవి- అనే మూడు పదాలను(అనురాగంలోని 'రాగం'; రసగంగలో చేసిన 'తానం'- సామవేద మంత్రం పల్లవించడంలోని 'పల్లవి'- పట్టు పీతాంబరంతో చుట్టిన   చందన గంధపు చితుకుల చందంగా దాచి మరీ వాడిన చతురత సుందరమూర్తిది.!  ఈ మూడు పదాలే ఆనక మరో పాట పల్లవికి తొలి పాదంగా మారడం అదనంగా అలరించే ముక్తపదగ్రస్తమంతటి చిత్రాలంకారం కూడా కదా!
-కర్లపాలెం హనుమంతరావు

***

Monday, July 20, 2020

ఆడవాళ్లూ ! ముందు మీరు మారండి! -కర్లపాలెం హనుమంతరావు= సారంగ సాహిత్య పత్రిక ప్రచురణ





అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది.  కాలానుగతంగా అది జొన్నగిరి అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.

కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా గుత్తికి దగ్గర్లో ఉన్న ఈ జొన్నగిరికి చేయి దూరంలో   ఎఱ్ఱగుడి  రాతి బండల మీద అశోకుడు చెక్కించిన కొన్ని ధర్మలిపులు.. సుమారు రెండువేల రెండు వందల ఏళ్లపాటు ఎండకు, వానకు తడుస్తూ ఉండిపోయినవి.. భూగర్భ శాస్తజ్ఞుడు ఎస్. ఘోష్  ఖనిజాల వేటలో ఉండగా కాకతాళీయంగా బైటపడ్డాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులు (దయారాం సహానీ, హరప్రసాద్ శాస్త్రి) ధృవపర్చిన మీదట 1929, జూన్ , 11 వ తేదీ నాటి పత్రికలలో అధికారికంగా  ప్రకటింపబడ్డాయి. ప్రముఖ తెలుగు చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరు వేంకట రమణయ్యల పుణ్యమా అని అవి  ఎస్టాంపేజ్ పత్రాల రూపంలో గుట్టు చప్పుడుకాకుండా  చెన్నపట్నం చేరడం,  1929, సెప్టెంబర్ నాటి భారతిలో దొరికిన రెండు లఘురూపాలు, పథ్నాలుగు పెద్ద సైజు  ధర్మశాసనాల వివరాలు లోకం విశదంగా తెలుసుకోవడం సాధ్యమయింది.

ఆ శాసనాల మూలకంగా అశోకుడి కాలం నాటి రాజకీయ వ్యవస్థకు ఇప్పటి మన రాజకీయ  వ్యవస్థకు మధ్య కొన్ని పోలికలున్నట్లు అర్థమవుతుంది. పాటలీపుత్రం ప్రధాన రాజధానిగా ఉన్నప్పటికీ అశోకుడికీ  నాలుగు ప్రాంతీయ రాజధానులు  విడివిడిగా ఉండడం, రాజధానిలోని రాచరిక వ్యవస్థ తీరునే ఉన్నట్లే, ఉపరాజధానుల్లోనూ ఉపరాచకీయ వ్యవస్థ ఉండటం గమనార్హం. ఉపరాజులు రాజుకు తోబుట్టువులయి ఉండాలనేది, తతిమ్మా పరిపాలనాంగాలు సైతం రాజబంధువుల కనుసైగలలో మాత్రమే నడవాలనే  నియమమూ ఉన్నట్లనిపిస్తోంది. ఈ ఉపరాజు కుటుంబీకులంతా రాష్ట్రీయులుగా ప్రసిద్ధులని శాసనాలు తెలియచేస్తున్నాయ్.

రాజధాని దారిలోనే ఉపరాజధానిలోనూ న్యాయవ్యవస్థ ఒకటి రజ్జుకులు, మహామాత్రలు, అంత మహామాత్రలు, ఉపమాత్రల ఆధ్వర్యంలో నడవడం గమనార్హం. ఇప్పటి మహిళా కమీషన్ తరహాలోనే అశోకుడి కాలంలో కూడా స్త్రీల కొరకు స్త్రీల చేత మాత్రమే నిర్వహింప బడే మహామాత్రలు ఉండటం చెప్పుకోదగ్గ మరో గొప్ప విశేషం.

 

అశోకుని ధర్మలిపుల వల్ల రెండువేల రెండు  వందల ఏళ్ల కిందట ఆంధ్రదేశంలోని స్త్రీల జీవన స్థితిగతులు ఏ విధంగా సాగాయో రేఖామాత్రంగా తెలుసుకునే అవకాశం లుగుతుంది. పదమూడో శిలా శాననం చెప్పిన విధంగా 'ఏదో ఒక మతమును అనుసరించని జనముండు దేశమే లేదు'. అన్న తీరులోనే నేటికీ లోకతంత్రం నడుస్తున్నది కదా!

శాసనాల వల్ల నాటికాలం సమాచారం ఆనవాలు పట్టడం సులభమవుతుంది. ఈ పై అనుశాసనాల వల్ల ఆ కాలంలో జంతుబలులు, జాతర్లు జరిగేవన్న విషయం సుస్పష్టం. తెలుగు సాహిత్యం  కూడా ఇదే విషయాన్నే నొక్కిచెబుతుంది. 'అంబోధరము క్రింద నసిమాడు/నైరావతియు బోలె సిడి ప్రేలె దెఱవయోర్తు' అంటూ తెనాలి రామకృష్ణకవి పాండురంగ మహాత్యం మూడో అశ్వాసం, డెబ్భైఏడో  పద్యంలో గంగజాతర్లలో స్త్రీలు పడే హింసాకాండ సమస్తాన్ని వళ్లు గగుర్పొడిచే రీతిలో వర్ణిస్తాడు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిణ హిందూ దేశంలో పర్యటించిన పోర్చుగీసు చరిత్ర కారుడు బర్బోసా కూడా గ్రామదేవతల కొలువులలో జరిగే హింసను విశదంగా వర్ణిస్తూ 'ఈ దేశంలోని స్త్రీలు దైవారాధన దగ్గర ఎంతటి ఆత్మహింసకైనా తెగించడం విచిత్రం' అని రాసుకొచ్చాడు. తాను ఇష్టపడ్డ ప్రియుడు తననూ ఇష్టపడే విధంగా మనసు మార్చే శక్తి స్త్రీ దేవతలకు ఉంటుందన్న నమ్మకం .. స్త్రీలను ఈ తరహా దుస్సాహసాలకు పురిగొల్పుతుదన్నది మనస్తత్వవేత్తసిద్ధాంతం.

చిన్న ముల్లు  వంట్లో దిగినా ఓపలేని సుకుమారి సైతం సిడి ఉత్సవాల నెపంతో వంటి రక్తాన్ని  సిడి మాను(పెద్ద స్తంభం)కి కట్టిన ఏతం లాంటి వాసం ఇనుప కొక్కెం గాలాన్ని వీపుకు తగిలించుకుని గాలిలో గుండ్రంగా తిరగుతూ గొప్ప ఆత్మానుభూతి పొందడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఈ విధమైన హింసాకాండకు ఆ కాలంలో   అమితాదరణ ఉండబట్టే  అహింసా మూర్తి అశోక చక్రవర్తి మొదటి శిలాశాసనంలోనే

'ఇచ్చట ఏ సజీవ ప్రాణిని బలి ఇవ్వకూడదు'

'ఇచ్చట ఏ విధమయిన వేడుక సమూహము కూడా నిషేదిద్ధము'

'అట్టి సమావేశము వలన హాని కలుగునని దేవానాం ప్రియుని అభిప్రాయం' అంటూ మూడు ఆదేశాలు  జారీచేసివుంటాడు .

శాసించిన మాత్రాన జనం పాటించేదుంటే  పరిస్థితులు ఇప్పటంత అర్థ్వాన్నంగా ఎందుకుంటాయి? జాతి తన పాటికి తాను  తన ఆచారవ్యవహారాలను  కొనసాగిస్తూనే ఉంటుంది. నోములూ, వ్రతాలూ చేసుకోవడం, ఇంట్లో అనారోగ్యాలు కలిగితే  మొక్కుకోవడం, కోరిన కోరికలు తీర్చమని ఇష్టదైవాలకు మొక్కుబళ్లతో ఆశపెట్టడం  వంటివన్నీ మానసిక భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు. ఎంత మహాచక్రవర్తయినా   మనసులను అదుపు చేయలేడు. కాబట్టే అశోకుని 9వ శిలాశానసంలో

1.            దేవానాం ప్రియుడు ఈ విధముగా దెల్పెను.

2.          జనులు అనారోగ్యముగా ఉన్నప్పుడు, గృహములందు వివాహాది శుభకార్యములు జరుగుచున్నప్పుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు.

3.          ఆయా సందర్భాలలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా కలదు.

4.          అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుటయు కలదు.

5.          శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసినదే.

6.          కానీ సాధారణముగ మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకరములు కావు.  అని చెప్పడం జరిగింది.

 

అశోకుడు రెండున్నర సహస్రాబ్దాల కిందట చెప్పిన మాటలు అక్షరాలా ఇప్పటికీ వర్తిస్తాయి. అశోకుడి కాలమేం ఖర్మ, అధర్వణకాలంలోనూ ఈ మంత్ర తంత్రాలు, యజ్ఞయాగాదులు దండిగా ఉన్నాయి. ఆ వేదానికి అనుబంధంగా ఉండే సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం.. వగైరాలు మనిషిలోని భయాలను, ఎదుర్కొనే ప్రమాదాలను,  వాటికి  తగిన  విరుగుళ్లను తెలియచేస్తాయి. జ్వరం, వరుస జ్వరం, పసరికలు, అజీర్ణం, జలోచరం, కుష్టు, వ్రణాలు, పురుగులు పడడం, పశురోగాలు, విషప్రయోగాలు.. ఇత్యాదుల నివారణకు అధర్వణ వేదంలో మంత్రాలు కనపడ్డమే ఇందుకు ఉదాహరణ.

 

ఆరోగ్యం నిర్లక్ష్యం చేసే అంశం కాదన్న మాట అక్షరాల వేదం చెప్పే పన్నాకి సమానమైన సుభాషితమే. రోగ నిరోధానికి, వస్తే.. గిస్తే నిదానికి, శాశ్వత నివారణకు ఏ తంత్రమో, మంత్రమో శాస్త్రీయంగా(ప్రయోగ ఫలితం మీద) ఆచరించి తీరవలసిందే. ఔషధాల మీద నిషేధాలను ఎవరూ కోరుకోరు.  పెళ్లిళ్లు, పురుళ్లు వంటి శుభకార్యాలకు ఉత్సవాలు వద్దనడాన్ని ససేమిరా ఒప్పుకోరు.  అయితే, అన్నీ పద్ధతి ప్రకారం  చేసుకోవాలనుకుంటే,  ఏడాది మొత్తం ప్రతీ రోజూ     వ్రతం నిర్వహించుకునే విధంగా మన సంప్రదాయాలలో ఏదో ఒక ఏర్పాటు చేసిపెట్టారు మన పూర్వీకులు. అవన్నీ తు.చ తప్పకుండా ఆచరించడం ఈ కలికాలం, కరవుకాలం, ఏ రోజుకారోజు కడుపు నింపుకునేందుకు బతుకు తెరువు కోసం వెదుకులాడుకునే కాలంలో ఎంత వరకు ఆచరణ సాధ్యం?!

సంప్రదాయం మీద వీరాభిమానానికి తోడు, హేతువుకు అందని ఆలోచనలు సహజంగానే అధికంగా ఉండే స్గ్త్రీల చిత్త ప్రవృత్తి వల్ల  సమయం అధికంగా నిరుపయగమవుతుందనేదే ఆనాటి  అశోకుడి నుంచి నేటి అభ్యుదయవాది వరకు అందరి   అసలైన ప్రధాన బాధ,

 

వీరేశలింగంగారి మాటలే మరో సారి మననం చేసుకోదగ్గ  మంచి సందర్భం ఇది. ఆ కాలమందెల్లవారికిని దయ్యములయందలి విశ్వాసములు అధికముగా నుండెను. స్త్రీలలో నొకప్పుడును దయ్యము పట్టని వారెక్కడనో గాని లేక యుండిరి. ఎవ్వరికే వ్యాధి వచ్చినను  వైద్యుని ఇంటికి మారుగా ముందుగా భూతవైద్యుని ఇంటికో, సోది చెప్పువాని ఇంటికో  పరుగెత్తుచుండిరి'

అధర్వణవేదం కాలంలో కానీయండి, అశోకుని కాలంలో కానీయండి, తెనాలి రామకృష్ణకవి కాలంలో కానీయండి, వీరేశలింగంపంతులుగారి కాలంలో కానీయండి.. స్త్రీలందరూ ఒకే విధంగా ఉన్నారా?  అధునాతున కాలం ఇదని గొప్పలు పోతున్నాం.. పోనీ ఇప్పుడైనా  వందకు వంద శాతం స్త్రీలు మార్పు చెందారా?మారారంటున్న  ఆ కొందరిలో అయినా నూటికి నూరు శాతం  మార్పు వచ్చిందా?

నాటి  తెలుగునగరం సువర్ణగిరి దగ్గర రెండువేల రెండు వందల సంవత్సరాల కిందట 'స్త్రీలు  నిరుపయోగకరమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుట కలదు' అని అశోకుడు వేయించిన శిలాశాసనంలో అక్షరాలే శిలాశాసనాలై మిగులుతాయా'అన్న ప్రశ్న వచ్చినప్పుడు..

వ్యవస్థ మారితే తప్ప స్త్రీల దురవస్థ మారదు. స్త్రీలు మారి, పురుషులను మారిస్తే  తప్ప వ్యవస్థ అవస్థలో ఏ మంచి మార్పూ రాదు.. అని సమాధానం చెప్పుకోక తప్పదు  .. ఎవరెంత నొచ్చుకున్నప్పటికీ!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, వాషింగ్టన్ రాష్ట్రం. 

యూ.ఎస్.ఎ

***

 (సారంగ -సాహిత్య పత్రిక, జూలై 15, 2020 సంచిక ప్రచురణ)

 

 

 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...