Monday, November 21, 2016

గురువుకు 'నామాలు'!- ఓ సరదా వ్యాఖ్య

గురువును పరబ్రహ్మగా గౌరవించే స్వర్ణయుగం ఎన్నడో వెళ్లిపోయింది.  బ్రహ్మానందంలాంటి హాస్యనటులిప్పుడు గురువు పాత్రల్లో నవ్విస్తున్నారు. 
గురువుని విష్ణువంటారు. ఆ దేవుడివి పది అవతారాలే.  అంతకు  పదింతల అవతారాలు ఈనాటి గురువులు ప్రదర్శించేవి. చీటీ పాటలనుంచి.. ప్రేమపాఠాల వరకు. టెక్స్టు బుక్కులెవరూ ముట్టుకోడంలేదు.  టెక్స్టులు పెట్టుకోడంలోనే ఒజ్జలంతా బిజీ.. బిజీ!
సర్కార్ల పాలనా వాహనాలక్కూడా..పాపం.. పంతుళ్లే చక్రాలు. జనాభా లెక్కల్నుంచి.. ప్రభుత్వ పథకాల  ప్రచారాల్దాకా ఏ గలభాకైనా  దభాల్మని గురొచ్చేది గురువులే ప్రభుత్వాలకి. ఎవరికీ ఏ పనీ తోచనప్పుడు మాత్రమే అయ్యవార్లు బళ్లకెళ్ళి పాఠాలు చెప్పుకొనే వీలు!
హిందీలో చదువును 'శిక్ష' అంటారుట! తెలుగు చదువు' మాత్రం?!  ఇంతుండడు..  బుడతడు! ఇంగిలిపింగిలీసులో తప్ప ఏడవడం తప్పు. దొరల హుకూం! 'టెట్టు'  టిక్కుల పరీక్షలో  గట్టెక్కొచ్చిన గురువులేమైనా 'గుడ్ సామర్టిన్'  తరహా బళ్లల్లో తర్ఫీదయొచ్చిన ‘రెన్ అండ్ మార్టిన్లా’? నామినేటివ్ కేసు.. ఆబ్జెక్టివ్ కేసంటే. ‘అహో! అదోరకమైన సూట్ కేస’నుకునే   చిలకమర్తివారి గణపతి  తంతు అంతా. 'రామా కిల్డ్ రావణ' లో ‘రామా’ది  ఏ కేసని అడిగితే  బల్లగుద్ది మరీ 'మర్డర్ కేస’ని వాదించే జ్ఞానులెంతమంది లేరూ?! తమకే అర్థం కానా పలుకురాయి భాషను.. బలవంతంగా కుక్కేందుకు  బుడతల బుర్రలేమన్నా దూదిబేళ్లు తొక్కే నార బస్తాలా? నేరుగా బెత్తం ఆడిస్తే నేరస్థుల ‘శిక్షా స్మృతి'!  జానా బెత్తెడైనాలేని బొట్టికాయ నెత్తికొక్క మొట్టికాయ తగలకుండా  జ్ఞానసింధువై పోడానికి ఇదేమైనా ‘మహాకవి కాళిదాసు’ సినిమా కథా?!
ఫురువంటే ‘గైడు’ట! సర్కార్లకీ.. పిల్లలకీ మధ్య నలిగే ‘సర్'లకన్నా  కృష్ణార్జునలమధ్య నలిగినా  ఆ గయుడే నయం. .  పంతుళ్లంటే.. తుళ్లుతూ.. తూలుతూ .. పని బాధ్యతలు పట్టకుండా తిరిగే సౌభాగ్యవంతులని 'పన్'చులు మళ్లా! బతకలేక చేసే గొడ్డుచాకిరీనా గతంలో లాగా ఇవాళ్టి బడిపంతులుద్యోగం? బతకడం నేర్చిన గడుసుపిండాలు ఒడిసిపట్టుకొనే ఉపాధి ఉపాయం! 'అ' అంటే అలసత్వం. 'ఆ’ అంటే ఆలస్యం. 'ఇ' అంటే ఇస్పేటాసూ.. 'ఈ' అంటే ఈడు ఆడపిల్లల్ని ఈలేసి ఏడిపించుడు! ఇవేగా  ఇవాళ్టి అలగా పంతుళ్లు పిల్లకాయల కెలాగ మెలగాలో నేర్పే  ఆగామాగం చదువులు! నైటవుట్లు..  కాఫీ కొట్లో కూర్చున్నా కాపీ కొట్టించి మరీ  పరీక్షలు  గట్టెక్కించే నెట్లు  కోట్లున్నప్పుడు.. టీలు.. బట్టీలంటూ పాతకాలంనాటి మోటు పధ్ధతలుఅతో పంతుళ్ల కెందుకు పాట్లు ? ఈ కాలం గురువులీ తరహాలో యువతను తయారు చేస్తున్నారు.
కాబట్టే.. ఇంజనీర్లకు సున్నబట్టీల్లో కూడా  ఉపాధి దొరక్క .. 'జిన్.. బీర్లు' అందించే బార్లల్లో పనిక్కుదురుకుంటున్నారు. గురువులు లఘువులయితే శిశువులు పశువులక మోక్షగుండం విశ్వేశ్వరయ్యలవుతారా? అని వెటకారాలు!

విసుర్లు చాలా ఆయ్యాయిగానీ.. అయ్యవార్ల  వైపు వాదానలుకూడా కాస్త కనికరించి వినండయ్యా స్వాములూ!
గుమ్మడి కడివెడంతుంటేనేమి.. తుంటెంత కత్తికి లోకువంట. చేత బెత్తంలేని గురువుముందు..  శిశువు సుదర్శన చక్రంలేని కృష్ణుడిముందు శిశుపాలుడయ్యలారా! అయ్యవారంటే.. ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం వండి వార్చి పెట్టే గాడిపొయ్యిముందట చేరిన వంటవాడయిపొయ్యాడయ్యా!
గురువంటే దేవుడే కదా? ఆ దైవానికి మల్లే తనదైన శైలిలో ఒక్క హాజరుపట్టీలో మాత్రమే దర్శనమిస్తే  చాలదా? తరగతి గదిలో సైతం ప్రతీ క్షణం  ఆ గొంతు ఖంగుమంటూ మారుమోగాలా?
ఆన్ లైనులో గురువులు.. ఆఫ్ లైనులో కౌరవలని అంతలేసి రవరవలు అవసరమా?  జాతిపరువు బరువు ఒక్క గురువులే మోయాలని ఏ పాఠ్యప్రణాళికల్లో రాసుందో.. రాళ్లేసేవాళ్లెవరైనా చూపిస్తారా?
గురజాడవారి గిరీశం తిరిగొచ్చినా సరే .. ఏ అంటే యాప్.. బి అంటే బైక్.. సి అంటే సెల్.. అనే వెంకటేశానికి నూరిపోయాల్సిందేనండీ! అప్పుడే సజావుగా  నడిచేది   బడిపంతుల బతుకు బండి! ఈ-కాలంలో కూడా మీ కాలంలా  చెట్టుకింద చదువులా? ఉన్న కులాల క చాలకా.. ఈ గురుకులాల గోల? 'టీ' డబ్బులన్నా  గిట్టుబాటవుతాయని  కాకపోతే ఇంతలా కాకెక్కి పోయే టీచరుద్యోగానికి ఎవరండీ ‘ఠీక్ హైఁ’ అని మొగ్గు చూపేదీ? ఏ ప్రైవేట్లు.. ఫీజులు.. పుస్తకాలు..  వంకతోనో నాలుగంకెల గీతమైనా అదనంగా రాబట్టలేనప్పుడు.. ఈ తెల్లటి బట్టలేసుకునే తంటాలు పడ్డమెందుకంట? వీధికో  ఏటిఎమ్ రాత్రింబవళ్లు వెలిగి పోతుంటుంది. వాచ్ మెన్ చేతికో వాచి తొడిగినా చాలు.. మాస్టర్ పాస్ వర్డుతో వేలు.. లక్షలు!  
భీమ్ రావ్ అంబేద్కర్ (B.R.A) ఓపెన్ విశ్వవిద్యాలయాన్ని  తెలివెక్కువైన తుంటరి గురువెవరో 'బ్రా' ఓపెన్ పెద్దబడి' అన్నాడని   పడీ పడీ నవ్వులా? హరి.. హరీ!  మనమంతా  ఎగబడి మరీ ఓట్లేసి గద్దెలెక్కించేసిన  పెద్దమనుషుల 'ముద్దు' ముచ్చట్ల మాటేమిటో మరి?

ఏకలవ్యుడే మళ్లీ పుట్టొచ్చి ఎల్కేజీ చదువుకోవాలన్నా ఏ అయ్యోరి చెయ్యో తడపకుండా   ముందుకు సాగని ముదుర్రోజులయ్యా ఇవి!
బోర విరుచుకొని  మరీ  'మాది అధ్యాప'కుల'మని టాంటాం కొట్టుకుంటాం. బొక్కబోర్లా పడి మొక్కుకోడానికి మేం ఎవరికన్నా  తక్కువగా తిన్నాం? ముష్టి మూడు లక్షల  ఫీజు.  వేదవేదాంగాలు మీ బిడ్డకి  వంటబట్టించేసెయ్యాలని జులుములు! చచ్చుపుచ్చు సందేహాలడిగినప్పుడు 'షటప్' అని అరవక పోవడమే షడంగాలని మించిన చదువులు మీ బిడ్డలకు  చెప్పినట్లు.
'లీకు వీరుల'మని లేకి మాటలేల? ఆ సందు ఉందనే గదా లక్షలైనా లక్ష్యపెట్టకుండా సందు గొందుల్లో తెరిచిన బడులకైనా  మీ కన్నవాళ్లలా  ఎగబడేస్తున్నది? నిజంగా మేం చండామార్కు మార్కు మాష్టర్లవతారాలే ఎత్తితే  మీ అడ్డాలనాటి బిడ్డడు గడ్డాలు పెంచే వయసుకొచ్చినా  ఫస్టు గ్రేడు గడపైనా  దాటలేడు.
చదువుకునే బళ్లకన్నా..చదువమ్ము'కొనే' బళ్ళకే తమరంతా రాబళ్లెందుకు పెంచుతున్నారో.. ముందా రహస్యం తేల్చాలి. తరువాతే మా మీదే ఔట్లన్నా పేల్చాలి.
ఉపాధ్యాయుడికి ప్రధానోపాధ్యాయుడంటే భయం. ప్రధానోపాధ్యాయుడికి బడి నిర్వాహకుడంటే  భయం. బడి నిర్వాహకుడికి బడి యాజమాన్యమంటే  భయం. బడియాజమాన్యానికి  తల్లిదండ్రులంటే భయం. తల్లిదండ్రులకి పిల్లలంటే భయం. ఆ పిల్ల రాక్షసులకే  ఏ దయ్యాల్ని చూసినా  భయం శూన్యం.  అదే ఇవాళ్టి దైన్య విద్యావవస్థ నిజమైన అవస్థ. 

'టిక్కు' పెట్టే 'టెట్'లు గట్టెక్కి వచ్చిన వాళ్లంతా అచ్చమైన  గురువుల పదవులకు 'ఫిట్' అవుతారనే!

చదువంటే ఆట. పాటగా సాగే జ్ఞానపు బాట.  ఆ దారిలో చురుకుగా నడిపించే అచ్చమైన ఖేల్ రత్నలిప్పుడెక్కడో తప్ప  మెరవడం లేదే!  'స్పాట్ వాల్యూయేషన్'లాంటి సందర్భాలొచ్చినప్పుడు తప్ప   గురుస్థానం విలువ ప్రభువులకైనా గుర్తుకు రావడం లేదే!
చెరువుల్ని పట్టించుకుంటునారు దొరలు. సంతోషం. 'గురువుల్ని కూడా పట్టించుకుంటే మరింత సంతోషం. నదుల అనుసంధానంమీద దృష్టి పెడుతున్నారు  ప్రభువులు. ఆనందం. గురుశిష్యుల అనుబంధాల పునస్సంధానంమీదా శ్రద్ద పెడితే బ్రహ్మానందం.
 మాష్టర్లంటే శిష్యుల మనసు రాతబల్లలమీది పిచ్చిగీతలను చెరిపేసే డస్ఠర్లు. తరగత గదంటే  వట్టి నల్లనల్ల.. తెల్ల సుద్ద.. చెక్క బెంచి.. పుస్తకాల సంచీనే కాదుగా! బిడ్డ కడుపుకి అమ్మ.. ఉడుపుకి  నాన్న.. పూచీ  పడ్డట్లే.. గురువూ బిడ్డ ఆ రెండూ స్వయంగా జీవితంలో సాధించుకొనే వడుపుకు పూచీ పడతాడు. పడాలి కూడా. గురువంటే తరగతి గదిలో విధ్యార్థి సమక్షంలో నిలబడ్డ తల్లి..తండ్రి.. విధాత.. కలగలపు రూపం.
రేపటి జాతి స్వర్ణయుగ భవన నిర్మాణానికి  అవసరమైన బంగారు కణికలెను అందించే విశ్వకర్మ పనితనం విధాత కేవలం ఒక గురుకులానికి మాత్రమే అప్పగించిన విధి. పిల్లలతో కలకలసి గురువు  చేసే  అల్లరిలోనూ ఒక పరమార్థం ఉండటం తప్పనిసరి. తప్పుదారిన నడిస్తే..  విద్యార్థికేనా.. ఉపాద్యాయుడికి శిక్షలుండటం తప్పని సరి. కుర్చీ ఇచ్చి గౌరవించిన సమాజమే గోడకుర్చీ వేసి మరీ శిక్షిస్తుంది.

శిలను శిల్పంగా మలిచే కళాకారుడు కదా ఉపాద్యాయుడు.! చిత్తశుద్ధితో విధి నిర్వహించే ఆ అపర బ్రహ్మకి ప్రతీ విద్యార్థీ ఒక ప్రశ్నాపత్రమే. శిష్యులతో గడిపే ప్రతీ క్షణమూ ఒక పరీక్షా సమయమే! ఆ పరీక్షలో ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం పెరగాలంటే.. ముందుగా జరగాల్సింది ఈ-కాలం వంకన గురు-శిష్య అనుబంధాల్లో క్రమంగా పెరుగుతున్న వంకర సంబంధాలు. ఆ దిశగా మార్పు చేయవలసిన పాఠ్యప్రణాళిక రూపకల్పనలో అటు ప్రభువులే కాదు.. ఇటు సమాజమూ  అంతకు మించిన  ఉత్ప్రేరక పాత్ర నిర్వహించాల్సుంది. వూరికే గురువుల నిర్వాకంమీద ఊకదంపుడు విసుర్లతో శిష్యుల  భవిష్యత్తులు బాగు పడతాయా?!
-కర్లపాలెం హనుమంతరావు
 

అత్తలూ కోడళ్లు- ఈనాడు ఆదివారం సంపాదకీయం


అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లంత అందమైన ద్వంద్వ సమాసం. అత్త అంటే మెట్టినింటి అమ్మ. కోడలంటే అత్తింట కాపురానికొచ్చిన కూతురు.అత్తాకోడళ్ళు కత్తులూ డాళ్లూ కాదుగదా ఇల్లు యుద్ధరంగం  చేసుకోడానికి! జానపదులనుంచి అన్నమయ్యవరకు అంతా ఆతాకోడళ్ళను గూర్చి చింతించినవారే! ఆచార్యులవారి ఓ శృంగార సంవాదంలో లక్ష్మీసరస్వతులు ఆరడి బూకటి  అత్తాకోడళ్ళు.  'రావే కోడలా! .. రట్టు కోడలా!' అంటూ అత్తలక్ష్మి రట్టు చేస్తుంటే .. కోడలు అంబశారద గమ్మునుంటుందా!  'పోవే పోవే అత్తయ్యా!.. పొందులు నీతో చాలును' అంటూ చిందులు వేస్తుంది.అత్తలందరూ ఆదిలక్ష్ములు కారు. కోడళ్లందర్లో శారదాంబలూ లేరు. అత్తాకోడళ్ల సఖ్యతను ఎంతో చక్కంగా విప్పిచెప్పే  'సీత గడియ'  అందుకు సోదాహరణం. సీతమ్మ రాక తాత్సారానికి అలిగి రామయ్య పడకగది గడియ లోపలికి బిడాయిస్తాడు. అత్తను వత్తాసు తెచ్చుకొంటుంది అవనిపుత్రి. 'దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు/ భూదేవి అల్లుడవు బుద్ధిటర నీకు!/సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు నాకు!' అంటూ ముద్దుల కొడుక్కే సుద్దులు చెబుతుంది. కొడుకుకిక తలుపు తీయక తప్పుతుందా! కథంతటితో సుఖాంతమయితే ఆ తీపిలో విశేషమేముంది! అత్త సౌజన్యానికి బదులు తీర్చద్దా కోడలుసీత! 'మా మామ దశరథులు ఒక్కరున్నారు అత్త/మీరు పోండి మా మామ కడకు!' అంటూ సగౌరవంగా అత్తగారిని శయ్యాగారానికి సాగనంపడంలోనే  కోడళ్ళు నేర్వదగిన పాఠాలు బోలెడున్నాయి. కొట్టుకొచ్చినవాడు ఒక్కడైతే.. అత్త కట్టుకొమ్మన్నది ఐదుగురు సోదరులను! కిమ్మనలేదు కోడలు ద్రుపదరాజపుత్రి! అన్నవెంటబడి అడవుల పాలయాడు  చెట్టంత కొడుకు!  దుఃఖబారంతో దీర్ఘనిద్రకు పడింది లేతకోడలు. అయినా పన్నెత్తి ఒక్కఫిర్యాదు చేయలేదు పథ్నాలుగేళ్ళు అత్త సుమిత్ర! పురాణేతిహాసాల నిండుగా  పండంటి అత్తాకోడళ్ల జతలిన్ని ఉండగా.. ఒక సక్కుబాయి కథనే అత్తాకోడళ్లకు ఆపాదించడమే లోక విచిత్రం!

అందాలు చిందేటి కొత్తకోడలంటే ఏ అత్తకైనా  మహా మురిపమే గదా!'చిలుకల్లు చిలుకల్లు అందురేగాని/చిలుకలకు రూపమేమి?పలుకులేగాని/ చిలుకల్లు మా ఇంటి చిన్నికోడళ్లు' అంటూ పదిమందికీ చెప్పి మురుసుకుంటుంది అత్త. కాలుపెట్టిన కొత్త తీరిపోగానే మరి కోడలు ఆ అత్తగారికే  బద్దశత్రువు ఎందుకవుతుందో.. బ్రహ్మయ్యకే తెలియాలి! పడకలో మగడు చేరిన సందు చూసుకొని 'చందమామకన్న చక్కని మగడా!/వేరె పోదామా!/ అత్తమామల పోరు నేను పడలేను/ వేరె పోదామా!' అంటూ జోరీగ రొదలు మొదలుపెడుతుంది. కోడళ్లందరూ అత్తలని కోఱుపెడతారని కాదూ! పుట్టినింటిని మించి మెట్టినింటిని ప్రేమించే ఆడబిడ్డలకూ లోకం గొడ్డుపోలేదు. 'పుట్టింటి దీర్ఘాయువు కావలనంచు/ పున్నమి చంద్రుడికి పూజ నే సేతు/ అత్తింటి దీర్ఘాయువు కావలెనంచు/ ఆదినారాయుడికి ఆజ్యమ్ములిత్తు' లాంటి  పాటలు ఎందుకు పుడతాయి కోడళ్ల మనసుల్లో ప్రేమాభిమానాలు లేకపోతే! ఆదరించే కోడళ్లకూ కొడుకులు కోదండాలు వేసి ఓ మూల కుదేయాలని కొందరు అత్తలు ఎందుకు కోరుకొంటారో! విధాతకే ఎరుక పడాలి! కాలం మారుతున్నది. అనుగుణంగా మగవాడి గుణగణాలూ మారుతున్నాయి. పాతకాలపు చాదస్తం అత్తగారిది. 'పాలల్లో మురిపాలు కలిపి/ కారంలో మమకారం నింపి/ అరచేతులని పాదాలకింద నిలిపి/ అపురూపంగా' పెంచుకొచ్చిన కొడుకు మరో కోమలికొంగు తాళంచెవికింద మారడం మందు మింగినట్లే ఉంటుంది. కోరి కొడుక్కని ఏరి తెచ్చుకొన్న బెల్లం  అంగిట్లో అల్లమయితే ఏ ఆత్తగారికయినా 'పచ్చిపాలమీద మీగడలు.. వేడిపాలమీద వెన్నతరకలే' గుర్తుకొస్తాయికదా కోడళ్లను రాచి రంపాన పెట్టే వంకలకు! కోడళ్లు చదువుకొంటున్నారు. సామ్ర్యాజ్యాలు ఏలుతున్నారు ఇప్పుడు. మాట పడతారా! 'వచ్చితి మే మత్తింటికి పుట్టింటిని వీడి పెక్కు యాశలతోడన్/ తెచ్చితి మేమింటి వెలుగు, మెచ్చుచు మా భర్తలు కడు డెందము మీరన్/ ముచ్చటపడి ఇంటిపనులు మురిపముగ చేయబూన ముందుకు రాగా/ రచ్చన ప్రకటించి నీవు పరిహాసము చేయబూన తగునే యత్తా!' అంటూ తగవుకు దిగడంతో అత్తాకోడళ్ల యుద్ధం ఆరంభం!



పెత్తనాలకోసం ప్రపంచయుద్ధాలే జరుగుతున్నాయి.. పంచయుద్ధాలు అబ్బురమా.. అనుకోవద్ధు! చెప్పులోని రాయి.. చెవిలోని జోరీగలా ఇంటిలోని పోరు ఇంతటితో పోయేదా! ఆత్త ఆడమని.. కోడలు కుంటమంటే మధ్యనున్న మగవాడు ఏ గోదారి ఈదాలి? 'ఏరేరు సంసార మెన్నాడు మొగుడో!.. మడికాడి సెల్కా మనపాలి కొచ్చింద/ మంచిగా దున్నించి మొక్కజొన్నేయించి/ నడీత కూసోని నా పెగ్గె సూయిత్త' అని కోడలందుకొందంటే ఇంటిపగ్గాలు అత్తనుంచి ఊడలాగాలనుకొన్నట్లే! 'అత్తమ్మ అమ్మకు మరోరూపం' అని కోడలనుకోవాలి. అందుకు  కూతురంత అపురూపంగా కోడల్ని అత్తగారూ చూసుకోవాలి. శాంతిభద్రతలు ఏ గడ్డమీదైనా ముందు ఇంటినుంచే కదా మొదలయేది! అమ్మకు చెప్పలేక, ఆలికి నచ్చచెప్పలేక.. ఇంటాయన పాటించే అలీనవిధానాలవల్లే వందకు ముప్పైమూడు ఇళ్లు వల్లకాడుల్లా కాలుతున్నాయని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. పదిమందికి ఇద్దరు కోడళ్ళు అత్తారింట్లో కత్తులబోను కాపురంతో చిక్కులు పడుతుంటే.. అంతకు రెట్టింపుమంది అత్తలు అవసానదశలో కొడుకింట  పున్నామనరకంతో ముమిలిపోతున్నారని  సర్వే సారాంశం. సంసారమంటే సమస్యల తోరణం.. సరే! సమస్యలతోనే నిత్యం రణం అయితే ఎలా? శిక్షా స్మృతి  ఏవో 498 (ఏ) సెక్షనుకింద కోడళ్లకో వజ్రాయుధం అందించవచ్చు. అత్తలకోసం ఆత్మరక్షణార్థం మరేదో బ్రహ్మాస్తం తయారు చేయనూవచ్చు. అస్త్రశస్త్రాలతో సాధ్యమయేదనేనా అత్తాకొడళ్ల మధ్య సామరస్యం?  కుమారీ శతకాల వల్లెవేతలు లేకబోతే మానె.. పెళ్లిచేసి అత్తారింటికి  అప్పగించే సుకుమారీలకు కాళిదాసు కణ్వమహర్షిలా కనీస సుద్దులన్నా కన్నవారు మప్పుకోవద్దా! 'పోయేది అత్తలకాలం.. వచ్చేది కోడళ్ల కాలం' అని సామెత. అత్తలామాత్రం పెద్దరికంతో సర్దుకుపోవద్దా! అత్తాకోడళ్లంటే కలిసి 'సెల్ఫీ'లు తీసుకోవడమే కాదుగా! 'సెల్ఫ్'(స్వార్థం) పుడకలను తీసిపారేసి  సుఖశాంతులనే పానకాలని  ఇంటిల్లిపాదితో తాగించడం కూడా! 

(ఈనాడు సంపాదకీయం- ఈనాడు యాజమాన్యానికి, సంపాదక వర్గానికి ధన్యవాదాలతో)

Saturday, November 19, 2016

పెద్దనోట్ల రద్దు చిన్న వ్యూహమేం కాదు! -వార్తా వ్యాఖ్య


2016, నవంబరు 8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో 500, 1000 నోట్లు రద్దయినప్పటి రెండు రోజుల వరకు ప్రతికూలమైన స్పందనలు అంతగా ఏ దిశవైపునుంచి రాకపోవడం గమనించాలి. ముఖ్యంగా.. ప్రతిపక్షాలనుంచి. ఈ పథకం వల్ల పెనునష్టానికి గురయ్యే వర్గాలనుంచైతే అస్సలు మాటా పలుకు లేదు. ప్రధాని తన ప్రకటనలోనే సామాన్యులకు ఈ సంస్కరణ వల్ల కొన్ని రోజులు ఇబ్బందులు ఎదురవుతాయి.. దేస సంక్షేమం కోసం, తనకోసం కనీసం ఓ 50  రోజులు సహించమని చేసిన విన్నపంలోని నిజాయితీ కూడా సామాన్యుణ్ణి కదిలించింది. మాటలు వేరు.. అనుభవం వేరు. ఒక లెక్క ప్రకారం దాదాపు 8.25 లక్షల కోట్ల 500 నోట్లు, 6.70 లక్షల కోట్లకు విలువైన 1000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ ఈ ప్రకటన నాటికి చలామణిలో ఉంది. అదంతా ఒక్క రద్ధుతో కొద్ది కాలంలోనే  చిత్తు కాగితాల పోగుగా మారడానికి సిద్ధమై పోయింది. పెద్ద నోట్లు అధిక శాతం సహజంగానే నల్ల కుబేరుల దగ్గర పోగై ఉంటాయి, వాస్తవానికి వాళ్లు ఆందోళన చెందాల్సిన అతి పెద్ద దుర్ఘటన. నిరసన అటు వైపునుంచి కాకుండా.. సామాన్యుల వైపునుంచి రావడం మొదలు పెట్టింది. చిన్న జనం ఆక్రోశమంతా తమ దగ్గర ఉన్న కాస్తో కూస్తో పెద్ద నోట్లు ఎక్కడ చెల్లకుండా పోతాయోనని. వాటి మీద ఆధారపడే నిత్యజీవితావసరాలను గడుపుకోడానికి బాగా అలవాటు పడిన జనానికి ఆ మాత్రం ఆందోళన ఉండటం తప్పదు. రద్ధైన నోట్లను చిన్న నోట్లతోగాని.. కొత్తగా తాయారు చేసిన 500, 2000 నోట్లతోగాని బదిలీ చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న నిబంధనలను సక్రమంగా పాటిస్తే. కానీ ఎందుచేతనో నోట్ల జారీని  పాటించవలసిన ఆర్థిక సంస్థలు.. బ్యాంకులు.. తపాలా ఆఫీసులముందు.. చాంతాండంత క్యూలు ఎన్ని రోజులకూ ముందుకు  కదలకుండా ఉండిపోవడంతో నిరసన గళాలకు మెల్లిగా స్వరం పెరిగింది. కొత్త నోట్లను ఇవ్వవలసిన ఏటియంలు బొత్తిగా చేతులెత్తేయడం కూడా ఈ అయోమయానికి మరింత గందరగోళం జత చేసింది. పండగ రోజుల్లో.. పెళ్లిళ్ల సీజనులో ప్రధాని ఇంత పెద్ద రద్ధు సంస్కరణను ఎందుకు చేసారో అర్థం కాలేదు. దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం ఆశించినంత చురుగ్గా నోట్ల బదిలీ.. నగదు జమ వ్యవహారం నిర్వహణ సాగడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు కనీసం కనుచూపు మేరలోనైనా కనిపించక పోవడంతో.. సామన్యుల నిరసన సాకుని పెద్ద వర్గాలు.. ప్రతిపక్షాలు.. నల్లకుబేరులు.. ఈ సంస్కరణ మూలకంగా తాత్కాలికంగా నష్టపోతున్న వ్యాపార వర్గాలు.. ఓపిక పట్టే అలవాటు లేకుండా అలవోకగా కువిమర్శలకు దిగిపోయే మధ్య తరగతి జీవులు.. నిరసన జ్వాలలను ఎగదోస్తున్న సమాచార మాధ్యమాలు.. ఇవన్నీ కలిపి సృష్టిస్తున్న ఆందోళనకరమైన వాతావరణం పుణ్యమా అని  వాస్తవంగా ఈ పెద్ద నోట్ల రద్దు దేశానికి ముందు ముందైనా ఏదైనా  మేలు చేస్తుందా? అని కుశంక పెంచుతోంది.
సరైన ముందస్తు చర్యలు చేపట్టకుండా  ఇంత పెద్ద సంస్కరణను ప్రధాని ముందుకు తీసుకు రాకుండా ఊండవలసిందని సర్వోన్నత న్యాయస్థానమూ వ్యాఖ్య్లలు చేయడం గమనార్హం. సందు దొరికతే ఆందోళనకు దిగి చట్టసభలను స్థంభింప చేసే రాజకీయ వాతావరణం మన దేశ ప్రజలు ఇవాళే కొత్తగా  చూస్తున్న విషయం కాదు కాబట్టి దాన్ని గురించి ఏ వ్యాఖ్యానమూ అవసరం కాదు.
స్వతంత్రం వచ్చిన ఈ ఏదు దశాబ్దాలలో నోట్ల రద్దు ఇవాళే కొత్తగా మొదటి సారి జరిగింది కాదు అంటున్నారు, నిజమే.. కానీ.. నోట్లు రద్ధయిన సంధర్భం.. రద్దుచేసిన ప్రభత్వాన్నికూడా పరిగణనలోకి తీసుకుంటే.. కచ్చితంగా.. జాతికి మునపటి సంస్కరణల మాదిరిగా కాకండా మేలు చేసే చర్యే!
2014 ఎన్నికల ప్రచార సందర్భంలో ప్రధాని అభర్థిగా మోదీ ప్రజలముందు  పదే పదే విదేశాల్లో దాగిన  నల్లధనం  తిరిగి స్వదేశానికి రప్పించడం గురించి ప్రస్తావించేవారు. ఈ దేశానికి చెందిన ఆ చట్టబద్ధమైన సొమ్మునంతా తెప్పించగలిగితే ఒక్కో పౌరుడికి 15లక్షల రూపాలయదాకా లాభం వస్తుందన్నది  ఓ లెక్కగా సామాన్యుడికి వివరించేందుకు చెప్పిన వివరం. అలా ఆయాచితంగా డబ్బు వచ్చి పడుతుందని ఏ అమాయకుడూ ఆశ పడలేదుగానీ.. హామీ ఇచ్చిన మేరక్ కొన్నైనా చర్యలుంటాయనై ఆశపడ్డ మాట నిజం. మోదీకి వచ్చిన భారి మెజారిటీల కారణాలలో ఇదీ ఒకటి. గద్దె ఎక్కైనప్పట్నుంచీ మోదీని ప్రతి పక్షాలు ఎద్దేవా చేస్తూనే ఉన్నాయి.. నల్లధనమెక్కడా? 15 లక్షల జమ ఎప్పుడు? అంటూ. నరేంద్ర మోదీ నైజం తెలిసిన వాళ్ళెవరూ ఇలా ఎగతాళికి పూనుకోరు. ఈ దేశపు రాజకీయ నెతల మాదిరి మాటకు మాట చెప్పడం ఆయనకు అలవాటు లేదు. మొనంగా ఉంటూనే.. తన మానాన తాను నిశ్శబ్దంగా పని చేసుకుంటూ .. చివరి ఫలితం ద్వారా జవాబు చెప్పడం ఆయన రాజకీయ విధానం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనివిధానాన్ని గమనించిన వారందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. నల్లధనం విషయంలోనూ ఆయన నిమ్మకు నీరెత్తినట్లేం  కూర్చో లేదు. గద్దెనెక్కిన కొత్తల్లోనే విదేశాల్లోని నల్లధనం వెలితీతకు
సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పరిశోధక బృంధాన్ని ఏర్పాటు చేసారు. బ్యాంకింగు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఒకరికొకరు మార్పిడి చెసుకోనే విదేశీ ఒప్పందాలకు చొరవ చూపించారు. బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. జనధన్ యోజన- నగదు చెల్లింపులమీద వత్తిడి తగ్గించి లావాదేవీలన్నీ బ్యాంకు కాతాల ద్వారా సాగించేందుకు చేసిన తొలి చొరవ. మన దేశంలో అధిక శాతం ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలో సాగడం వల్ల.. అక్రమార్జన పరులకు పెద్ద నోట్లు ఓ గొప్ప వరంగా మారింది. ఈ పరిస్థితి ఇప్పుడే కొత్తగా వచ్చింది కూడా కాదు. గతకాలపు యూడిఏ పాలనలో కూడా నల్లదనంగో  ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థ నిర్భయంగా సాగుతుండేది. కట్టడి చేసేందుకు ప్రభుత్వం తరుఫునుంచి నామామాత్రపు చర్యలే కొనసాగుతుండడం.. పన్నులు చెల్లించకుండా సొమ్మును దాచుకొనే నైజాన్ని మరింత ఈ దేశవాసులకు మరింత నేర్పించినట్లయింది. ఏవేవో స్వచ్చంద ఆదాయ ప్రకటనల పథకాలు వస్తూ పోతుండేవే కాని.. వాటిని చిత్తశుద్ధితో అమలు చేసే యంత్రాంగం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థను 70% నల్లధనమేమో నడిపించే దురవస్థ కొనసాగుతూ వచ్చింది. దీనికి తోడు సరిహద్దుల కవతల నుంచి ఉగ్ర వాదులు చైనా సాంకేతిక సహాయంతో నకిలీ నోట్లు గుద్ది చలామణీలో పెట్టేవారు. అలా పెడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించే స్థాయికి వచ్చిన తరువాతే మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టింది. అన్ని విషయాలమీద చక్కని అవగాహన ఏర్పరుచుకున్నందువల్లే  నల్లధనం కట్టడికి తీసుకునే ముందస్తు చర్యలను గుట్టు చప్పుడు కాకుండా ఉంచడం జరిగింది. ఆఖరి అవకాశంగా మొన్నటి 'స్వచ్చంద ఆదాయ ప్రకటన' పథకం ప్రకటించినా.. కొత్త ప్రభుత్వం పనితీరుని సరిగ్గా అర్థం చేసుకోలేని నల్లకుబేరులు ఎప్పటిలాగానే నల్లమందు మింగిన రోగుల్ల చల్లంగా ఉండి పోయారు. అక్కడికీ వెంకయ్యనాయుడు గతి కొద్ది కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాడు.. మోదీ మిగతా ప్రధానుల్లా కాదని.. కశ్మీర్ ఉగ్రవాదులమీద చేసిన సర్జికల్ దాడుల్ని చూసైనా అర్థం చేసుకోవాలని. ఏమయింది? దేశ నల్లకుబేరులమీద సర్జికల్ దాడి మొదలైంది. మందు ముందు మరిన్ని ఆపరేషన్లుంటాయని మళ్ళీ మళ్ళీ హెచ్చరికలూ వస్తున్నాయి.
ప్రధాని టైమింగుని గురించి జనసామాన్యం ఓ రకంగా విమర్శిస్తుంటే.. రాజకీయ పక్షాల
విమర్శ మరో విధంగా ఉంది. త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసిన దొంగదెబ్బగా మమతా బెనర్జీనుంచి.. ములాయం సింగుదాకా అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఈ దేశంలో చివరికి పంచాయితీ ఎన్నికనైనా సరే.. డబ్బు ప్రమేయం లేకుండా ఊహించుకోడం సాధ్యం కాని స్థితికి చేరుకున్నాం మనం. రాష్ట్రాల ఎన్నికలంటే ఎన్ని వేల కోట్లు కుమ్మరించాలో వేరే వివరించనక్కర్లేదు. దానికీ సిద్ధపడి దాచుకొన్న దొంగ డబ్బు  సంచీ మూటలను అభ్యర్థులు విప్పుతున్న చివరి దశలో ఉరుములేని పిడుగులాగా నరేంద్ర మోడీ ఒక్క మధ్యరాత్రి ప్రకటనతో మొత్తం తలకిందులు చేసేసాడు! ముందు ముందు ఇంకేమోమో చేసేస్తానంటున్నాడని దుగ్ధ. మమతా బెనర్జీ..సిపియం వంటి బద్ధ శత్రువులు సైతం ఏకం అవాల్సి వచ్చిందంటే.. మోదీజీ తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు ఎంత పెద్ద సంస్కరణో అర్థమవుతోంది కదా!
నిజమే! సరైన హోం వర్కు కొరవడ్డం వల్ల తగినంత చిల్లర నోట్లు  లేక  చిన్న చిన్న వ్యాపారులు .. వయోధికులు.. రోగులు..రోజు కూలీలు.. రైతులు..  పసిపిల్లలు.. చిరు జీతగాళ్లు.. వండి వార్చి పెట్టవలసిన మహిళలు.. ఆగచాట్లు పడుతున్న మాట అక్షరాలా నిజం. ఇంత పెద్ద చర్య తీసుకునేముందు ఎంత గోప్య్తత అవసరమైనా .. సామాన్య జనం నిత్యావసర జీవనాధారాలమీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉండవలసింది. ఎంత ఉపద్రవంలో అయినా దొంగదారులు వెతికే నల్లకుబేరుల నక్కజిత్తు వ్యూహాలను నిరోధించేందుకు మరికొంత అధ్యయనం చేసి ఉండవలసింది. ఆ మాట ఇప్పుడు మోదీజీ కూడా ఒప్పుకుంటున్నారు. కనక ఊహించని లోపాలు బైటపడిన ప్రతి సందర్భంలోనూ.. వెంటనే తగు చర్యలు తీసుకొనే ప్రణాళికలు సిద్ధం చేయాల్సుంది. దేశాధ్యక్షుడు ఒక్కడి చేతే 'సరే' అనిపిస్తే చాలదు. దేశం మొత్తం 'శభాష్' అనే రీతిలో ఈ సంస్కరణల పర్వం నిరాటంకంగా కొనసాగిస్తే.. దశాబ్దాలుగా దేశానికి పట్టిన పీడ నివారణ అవడం ఎంత సేపు! రాజకీయాలతో సామాన్యుడికి సంబంధం లేదు. సామాన్యుడు పేరుమీద సాగే రాజకీయాలతో అసలే సంబంధం లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన అవుతుందంటున్నారు. ఉగ్రవాదుల ఆట కడుతుందంటున్నారు. దరలు తగ్గి సామాన్యుడి నిత్యజీవనంలో అనన్యంగా గణనీయమైన మేలు సంభవమంటున్నారు. ప్రపంచంలో పదేళ్లలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామంటున్నారు. ఆన్నీ కాకపోయినా .. కొన్నైనా నిజమైతే.. ఇన్ని రోజులుగా సామాన్యులు పడుతున్న కష్టాలకు ఒక సార్థకత ఏర్పడినట్లవుతుంది.
రాజకీయాలదేముంది? ఈ దేశంలో ఎప్పుడూ అవసరార్థం అటూ ఇటూ మరుతుండేవే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం.. ప్రజల వలన.. ప్రజల కొరకు కదా సాగాల్సింది!
-కర్లపాలెం హనుమంతరావు

***

Tuesday, November 15, 2016

ఫ్రీవర్స్ కి మరి కాస్త వివరణ- ఒక పరామర్శ



'వచన కవిత- ఒక అలోచన' అన్న ‘కవిసంగమం’లోని నా టపాకి స్పందిస్తూ  భాస్కర్ కొండారెడ్డిగారు ఫ్రీవెర్స్ ను గురించి మరికాస్త  వివరించమని సూచించారు. విజ్ఞుల సలహాలెప్పుడూ శిరొధార్యమే. స్థలాభావాన్ని, చదువరుల సమయవిలువను దృష్టిలో ఉంచుకుని ఓ పది వాక్యాలలో మరి కొంత వివరణను ఇక్కడ జత చేసే ప్రయత్నం చేసాను.. కొంతకాలం కిందట. 
భాస్కర్ గారికి ధన్యవాదాలు.

ఫ్రీవర్స్ అంటే సూటి అర్థం చందస్సు నుంచీ విడివడ్డదని. బైబిల్ కి జాన్ విక్లిఫ్ చేసిన అనువాదాల్లో దీని తొలిరూపం ఉందనే ఒక అభిప్రాయం ఉంది. యూరోప్ లో వచ్చిన మతసంస్కరణోద్యమాలకీ ఈ ఫ్రీవెర్స్ కీ సంబంధముంది. అక్కడ మతసంస్కరణలూ బూర్జువాయిజం ఒకే కాలప్రవాహంలో కలిసి ప్రవహించాయి. రెండూ వ్యక్తివాదాన్ని బలపరిచే మార్గాలే. ఫ్రీవెర్స్ కూడా వ్యక్తినిష్ఠను నొక్కి చెబుతుందని  మనకు తెలుసు. బైబిల్నుంచీ హీబ్రూ కవిత్వం నుంచీ వాల్ట్ విట్మన్ లాంటి వాళ్ళు ప్రభావితం అయ్యారు. ఇవాళ మనం వచన కవితగా భావించే రూపానికి వాల్ట్ విట్మన్ పితామహుడుగా భావించినా తప్పు కాదేమో!


రాజకీయంగా, మతపరంగా అవ్యవస్థ, అనిశ్చితి ఉన్నప్పుడు పాత వ్యవస్థలు కూలిపోవాలని, కొత్తరూపాలు స్థిరపడాలని జనసామాన్యం కోరుకోవడం సహజమే. కవిత్వంలో కూడా అదే జరిగిందనిపిస్తుంది. సంప్రదాయ కవితనుంచీ, నియమనిబంధనల మధ్య నలిగే కవిత్వానికి సంపూర్ణ స్వేచ్చ కల్పించాలన్న కాంక్ష నుంచే తెలుగునాటా 1930ల దశకంలో ఇప్పటి వచన కవిత తొలిరూపం పుట్టినట్లు విమర్శకులు భావిస్తున్నారు. ప్రపంచ సాహిత్యాన్ని అప్పటికే విపరీతంగా ప్రభావితం చేసిన ఫ్రీవెర్స్ రూపమే సహజంగా మన తెలుగుకవిత్వాన్ని ప్రభావితం చేసిందనుకోవాలి.
ముద్దుకృష్ణ జ్వాల తొలి సంచికలో వచనకవితావాదాన్ని స్పష్టమైన గొంతుతోనే వినిపించే ప్రయత్నం చేశాడు.”ప్రపంచం ఒక ఇల్లుగా, మానవజాతి ఒక కుటుంబంగా మారిపోయే రోజులు వస్తున్నవి. హిందూ సమాజంకూడా కదిలింది. నూతన సత్యాన్ని, నీతిని అంగీకరిస్తున్నది. ధర్మాలలో, సంఘంలో, భాషలో, భావంలో మార్పు తప్పదు. దీనికి అడ్డు వీల్లేదు. వచ్చినా ఆగదు. నచ్చని పాతబంధాలను తెంపివేయడానికి ఎంతైనా సాహసిస్తాము. నచ్చిన కొత్తదనానికి దూకుతాము. సర్వమతాలని అంగీకరిస్తాము. మాకు మతం లేదు. జాతి లేదు. వర్ణం లేదు. ఆడవాళ్ళిందుకూ…మగవాళ్ళందుకూ అనే బేధం లేదు. యువకులు ఉద్రేకంతో ఏది తెచ్చినా దాన్నే ప్రచారంలో పెడతాము. ఉన్నది ఉన్నట్టు అంగీకరించి నిర్జీవంగా తుప్పు పట్టడంకన్నా నష్టం కలిగించినా సాహసించి ఏదో యత్నించి జీవించడం ఉత్తమం” ఫ్రీవెర్స్ ప్రాదుర్బావం మూలాలు కూడా సరిగ్గా ఇవే కావడం మనం గమనించాలి.

ఛందోనియమాలనుండి విడివడటమొక్కటే వచనకవిత లక్షణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నన్నయగారి నాటినుంచీ మనకు వచనంతో పరిచయం ఉంది. మన ప్రాచీన కావ్యాలు చాలావరకూ చంపూ కావ్యాలే. పద్యగద్య మిశ్రితాలు. పద్యాలకు పద్యాలకు మధ్య వచనమే వచ్చేది. ఆశ్వాసాంతాలలో గద్యమే ఉండేది. వామనుడులాంటి సంస్కృత లాక్షణికులు వచనాన్ని వృత్థగంధి, చూర్ణిక, ఉత్కళికగా విభజించడం గమనించాలి. కృష్ణమాచార్యుల ‘సింహగిరి వచనాలకి, పెదతిరుమలాచార్య వెంకటేశ్వర వచనాలకి  ఇవాళ మనం రాసే వచనకవితా రూపానికి పోలిక లేనేలేదు. రూపం, భాష, భావం, ఫిలాసఫీ, ప్రయోగం, ప్రయోజనం.. ఏదృష్టితో చూసినా రెండింటి దారులు వేరు వేరు.ఇవాళ మనం వాడుతున్న వచనకవితకు మూలాలు కచ్చితంగా పాశ్చాత్య సాహిత్యంలోనే ఉన్నాయి. ఆ మూలం పేరే ఫ్రీవెర్స్. చందస్సు, మాత్రాగణాలు,  గ్రంధభాష,  గ్రంధవ్యాకరణం… లాంటి ఏ నియమనిబంధనలకూ వదగాలని చూడకుండా అనుభూతిని యథాతధంగా హృదయం ఎలా కంపిస్తే అలా కవిత్వం పాలు తగ్గకుండా వ్యక్తీకరించడంగా వచనకవిత ఫిలాసఫీని చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలన్నీ ఉన్నకవితారూపం పేరే ఫ్రీవెర్స్. ఎజ్రాపుండ్, విలియం కార్గోస్, విలియమ్స్ రాసినట్లే   దాని అధునాతన సానపెట్టిన రూపాన్ని ఇవాళ  మన హెచ్చార్కె, దర్భశయనం, యాకూబ్, శిఖామణి, అఫ్సర్, విమల, స్కైబాబా, ఎండ్లూరి వంటి ఎందరో  వాడుతున్నారు. సానపెట్టి రోజు రోజుకీ ప్రయోగించే యువకవుల సంఖ్యకైతే ఇంక లెక్కే లేదు.

-కర్లపాలెం హనుమంతరావు

Thursday, November 10, 2016

దుర్భాషా సాహిత్య ప్రయోజనం- వ్యంగ్య కథానిక


ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు. ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా! నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్ ఎగదన్ని గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు. ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే చెమటలు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.
గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.
హార్ట్ ఎటాక్?!’ అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.
ఇప్పుడేం చేయడం?
సమయానికి ఇంటి దగ్గరా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో  పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది.. ఇంట్లో పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ. 
ఇప్పుడిలా అవుతుందని కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగుంటే తగిన  జాగ్రత్తల్లో ఉండేవాడే కదా!
కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి. 
డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్భాందవుల ఫోన్ నెంబర్లు దొరికాయి. డాక్టర్ గోవిందు. డాక్టర్ బండ కోదండం. డాక్టర్ దూర్వాసిని.
డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.
'గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్ చేద్దామనుకొనే లోపు గుర్.. గుర్ మంటూ గొంతు వినిపించింది.
'హలో!.. ఎవరూ?'
'డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో... న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'
అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'
'కాదా?'
'కాదండీ బాబూ! మంది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్  ‘బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలుఅనే అంశంమీద   పరిశోధన చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ఇప్పుడా సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’
రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.
'యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'
'ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసి పోయేలా  వివరించాడు. ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉఛ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ! మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా సాహిత్యానికి సంబంధించింది బ్రో! ప్రాచీనకాలంలో జంతువుల జీవన  విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశంమీద కుంభకోణం విద్యాపీథం వారిచ్చిన స్నాతకొత్సవానంతర  పట్టా! బండ కోదండంఅన్న పేరు విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విఛారకరం..' ఉండేలు  సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.
మిగిలిందిక డాక్టర్ దూర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తే!  సంకోచిస్తూనే నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.






చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం మినహా! అదే పనిగా ప్రయత్నించిన మీదట  అవతలవైపునుంచి రెస్పాన్స్ వచ్చిం దీసారి! ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం! సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు అవతలి వైపు  శాల్తీ కాళికా దేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవర్రా నువ్వు? నీకు అసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్  చేసేది?  కాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు? ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు పేషెంటేవన్న గ్యారంటీ ఏంటి? నిజంగా నీది గుండె నొప్పేనని రుజువేంటి? నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో.. అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?  పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు పోలీస్ స్టేషన్  సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని ఫోన్ కట్టయి పోయింది.
సుబ్బారెడ్డిట్లా  నేరుగా డాక్టర్లనే తగులుకోడానికి కారణం లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచ్చావదు! ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా  మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ  ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.
ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!
పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై పోతోంది. చెమటలూ ధారగా కారి పోతున్నాయి. అక్కడికీ    నొప్పినుంచి దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ చానెలేదో ఆన్ చేసాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్.. హిల్లరీల ప్రచారానికి సంబంధించిన వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు హిల్లరీమ్యాడమ్మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే స్థాయిలో హిల్లరీ అమ్మగారి భాషా ప్రయోగాలు కూడా!
మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే దుర్భాషలవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికిమాత్రం హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు  సెల్ ఫోన్ అందుకున్నాడు.


మళ్లీ డాక్టర్ దూర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో  దూర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని లేచారు మేడమ్గారిమీద 'మీ ఆసుపత్రినుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవక పోతే ఎట్లా?  ఆనక సమస్యలొచ్చి పడతే సర్ధిపెట్టలేక చచ్చేది నేనే. ముందా ఫోన్ చూడు!' అంటూ.  
భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది డాక్టర్ దూర్వాసనమ్మ.
 …
సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో ఉండేలు సుబ్బారెడ్డి యమగండంనుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!
పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే ప్రముఖ రచయిత   సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దూర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి 'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  'షిటీం సీరియస్ గా తీసుకోబట్టి గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోతోన్న  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో ఉన్న ఊరిబైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే  దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ సుఖాంతమైంది.
అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దూర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో మరింక ముందుకు పోదల్చుకోలేదు.
వాస్తవానకి మనం మెచ్చుకోవాల్సింది సుబ్బారెడ్డిని.. అతగాడి సమయస్ఫూర్తిని  కాదు. అతగాడు అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని అందించిన అమెరికన్ రాజకీయ మేధావులు ట్రంప్ గారిని.. హిల్లరీ మ్యాడమ్ గారిని.
'ట్రంపు- హిల్లరీ'లని మించిన కంపు రాజకీయాలు మన దేశంలోనూ ప్రతీ క్షణం బరితెగించి మరీ  జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో నీతి.. మర్యాదలు అంతరించిపోతున్నాయని వూరికే  దురపిల్లే  ఆదర్శవాదులు.. దుర్భాషా సాహిత్య ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి అవసరం ఉందన్నదే ఈ కథ నీతి!

-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగిల్లు- అంతర్జాల పత్రిక ప్రచురితం)

ఎందుకో?!.. ఎందుకో?!.. ఎందుకో?! -కవిత


ఆమెః






పాప ఏడుస్తున్నప్పుడు
పనిమనిషి రానప్పుడు
కేంపులో ఉన్న శ్రీవారు
రాత్రిదాకా ఒక్కసారన్నా
ఫోన్ లో పలకరించనప్పుడు
ఎందుకో
నేను
మనుషుల్లో ఉండను

అతనుః








బాసు పిలిచి
‘శభాశూ’ అన్నప్పుడు
బేరుమంటున్న నా షేర్లు
స్టాక్ మార్కెట్లో బుల్లుల్లా దూసుకెళుతున్నప్పుడు
నడిరోడ్డు మీద
నా బైకాపి
టీనేజి బ్యూటీ లిఫ్టడిగినప్పుడు
నిజం చెప్పద్దూ
ఎందుకో
నేనూ
మనుషుల్లో ఉండను


పాపః








లక్కపిడతల్లో
అన్నాలు ఉడుకుతున్నప్పుడు
కుక్కపిల్ల తోకకు
బుజ్జిగాడు బండరాయి కట్టి ఏడిపిస్తున్నడు
చూరుకింద జారే
వానదారాలనుంచీ
వెండిపతీగలు పోగేసుకుంటునప్పుడు
నేనూ
ఎందుకో
మనిషిని కాను.
మరీ ముఖ్యంగా
అమ్మ తీరిగ్గా అద్దం ముందు చేరి
జడపాయలల్లుకుంటో
జావళీల్లో పారుతున్నప్పుడూ
నాన్న
మాసిన గడ్డంతో
ఆఫీసుటైములో
బెడ్రూముమంచుముక్కై
గడ్డకట్టుకు పోయినప్పుడూ
ఎందుకో
నేనస్సలు మనిషిని కాను
అమ్మానాన్నలు ఒకేసారి
నా చెరో బుగ్గమీదా
ముద్దులై వేళ్ళాడితేగానీ
మళ్ళా మనిషిని కాలేను

ఎందుకో!.. ఎందుకో!.. ఎందుకో.. ఎందుకో!

-కర్లపాలెం హనుమంతరావు
***





Tuesday, November 8, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్ని మెరకలో.. అన్ని పల్లాలు- వార్తా వ్యాఖ్య

“Government of the people, by the people, for    the people, shall not perish from the Earth”                      Abraham Lincoln

ప్రజల వలన.. ప్రజల కొరకు.. ప్రజల చేత - నడిచే పాలన 'ప్రజాస్వామ్యం' అని అబ్రహాం లింకన్ కాబోలు మొదటిసారి సుపరిపాలన ఎలా ఉండాలో వివరించే ప్రయత్నంలో వ్యాఖ్యానించింది.
 ఆ పెద్దమనిషి పుట్టిన దేశంలోనే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎన్ని వన్నెచిన్నెలు పోతోందో? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని పద్దాకా మనం గుండెలు గుద్దుకొంటుంటాంగా! మరీ అంత ప్రమాదకరమైన నెంబర్ వన్ స్థానంలో లేకపోయినా .. అమెరికా టైపు ప్రజాస్వామ్యాన్నే ప్రపంచం ప్రమాణంగా తీసుకొంటూ వస్తున్నదిప్పటిదాకా! అక్కడి నేతల నైతిక స్థాయి ఎలా ఉన్నా.. ప్రజలమాత్రం .. అధికశాతం ప్రజాస్వామ్య ప్రియులే. ఆ విధంగానే నిరూపణ అవుతూ వస్తున్నదిప్పటి వరకు.
స్వేఛ్చను కాంక్షించడం.. వ్యక్తిగత విషయాలను బహిరంగ చర్చకు పెట్టడం గిట్టకపోవడం అమెరికన్ పౌరసమాజంలో సాధారణంగా కనిపించే మంచి లక్షణాలు. సున్నితమైన విషయాలమీద అతిగా స్పందించడం బలమో.. బలహీనతో తెలియదు మనకు.  మొత్తానికి.. అమెరికా దేశాన్ని మిగతా దేశాలకన్నా విభిన్నంగా ఉంచడానికి కారణభూతాలని ఇప్పటి వరకూ అందరం  అనుకుంటూ వస్తున్న వ్యక్తిగత విలువల్లో చాలా వరకు ఈ సారి అధ్యక్షపదవికి జరుగుతున్న ఎన్నికల్లో తలకిందులైనట్లే అనిపిస్తున్నది.. రోజూ.. మీడియాలో వస్తున్న వార్తల సరళిని గమనించే ఆసక్తి ఉన్నవాళ్లకి.

స్వేచ్చని ఒక విగ్రహంగా మలుచుకొని ప్రపంచానికి ప్రజాస్వామ్యమెంత విలువైనదో.. అవసరమైనదో.. చాటి చెబుతున్న దేశంలో..  ఈ సారి శ్వేత సౌధం మీద అధిపత్యానికని పోటీపడే అభ్యర్థుల్లో సభ్యత ఎంతగా దిగాజారిందో గమనిస్తుంటే.. మన భారతీయ ప్రజాస్వామ్యవాదులకు సంతోషం కలుగుతుంది. సంతోషం ఎందుకంటే.. మనకన్నా.. నీతిబాహ్య దారుల్లో అధికార దుర్గాలని చేరుకోవలనే యావగల దేశం మరోటున్నది కదా అని!

రిపబ్లికన్ పార్టీ కదా.. రహస్య వ్యవహారాలు ఎందుకు.. పబ్లిగ్గానే అంటే బావుంటుందని  భావించాడో ఏమో.. ఆ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ మఒదలైన మొదట్రోజునుంచి.. డొనాల్డ్ ట్రంప్.. అన్నీ బాహాటంగానే వాగడం మొదలు పెట్టాడు. రిబబ్లికన్లు ఇప్పటి వరకు మరీ బైటకి అనడమెందుకులే.. అని మొహమాట పడే  మాటలన్నీ.. డొనాల్డ్ ట్రంప్.. నిస్సంకోచంగా నిస్సిగ్గుగా బైటికి అంటూ వచ్చాడు. రిపల్లికన్ పార్టీ సభ్యత్వం దొరకబుచ్చుకున్నప్పట్నుంచీ  ఇదే తంతు. సంచలనాలు సృష్టించి పోటీలో సీనియర్లను దాటి ముందుకు దూసుకొచ్చేందుకు   ఈ ఎత్తుగడే కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న ట్రంపుకి బాగా కలసి వచ్చింది. మెక్సికన్లు దేశంలోకి అక్రమంగా వలస రాకుండా గోడ కడతాననడం.. ముస్లిం మతస్థులను దేశంనుంధి తరిమి తరిమి కొడతాననడం, చిన్న.. పెద్ద  ఉద్యోగాలను.. ఉపాధులను.. కొల్లగొడుతున్న  చైనా.. భారత్ వంటి తూర్పు ఆసియా నాన్-ఇమ్మిగ్రెంట్స్ భరతం పడతాననడం.. ఇవన్నీ కచ్చితంగా ఎంత ఉదారవాదులుగా బైటికి కనిపించే సాదారణ అమెరికనుకయినా సంతోషం కలిగించే విషయాలే అవుతాయి. అక్కడి సగటు మద్యతరగతి ఇంగ్లీషు పౌరుడి ఆలోచనలను అద్దం పట్టినట్టినట్లు మాట్లాడేవాడు మొదట్లో ట్రంప్. ఆ విధంగా ప్రైమరీ ఎన్నికల్లో సాటి అభ్యర్థులను వెనక్కి తోసేయడానికి ఉపకరించిన ఎత్తుగడల మూలకంగా.. సగటు అమెరికను ఇప్పటి వరకు తగిలించుకుంటూ వస్తున్న 'జెంటిల్ మన్ షిప్' తొడుగును తొలగించి ప్రపంచానికి ఆ తెల్లతోలువాళ్ల అసలు స్వభావం ఎలా ఉంటుందో  ప్రపంచానికి చూపించిన పుణ్యాత్ముడయాడు ట్రంప్. 

అమెరికా దేశానికి .. దానితో పోటీపడే చైనా.. రష్యా వంటి దేశాలకి మౌలికంగా చరిత్ర నిర్మాణంలోనే పెద్ద అంతరం ఉంది. చైనా లాగా ప్రాచీన సంస్కృతిగల దేశం కాదు అమెరికా. అమెరికా చరిత్ర అంతా కలుపుకున్నా  రెండున్నర  శతాబ్దాలకు మించి ఉండదు. రష్యా దేశంలాగా పలు పాలనా వ్యవస్థల మంచి చెడ్డలను అనుభవించి.. చివరికి సిసలైన  సోషలిజమ్ వైపుకు మొగ్గిన పరిణతీ అమెరికాకు లేదు. అమెరికా దేశ నిర్మాణమంతా వలసపౌరుల రెక్కల కష్టం. ప్రపంచంలోని ఎన్నో దేశాలనుండి ప్రతిభావంతులు ఈ గడ్డమీదకు అడుగుపెట్టి తమ మేధోబలంతో కూడగట్టిన సంపదలనే మూల అమెరికనువాసులు నేటికీ అనుభవిస్తూ వస్తున్నది. అక్కడి భారీ నిర్మాణాలలో చాలా వంతు పలు పేదదేశాలనుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస కూలీల కాయకష్టంనుంచి లేచినవే.  ప్రపంచ మనీ మార్కెట్లో తన డాలర్ బలపడేందుకు ఆయిల్ దేశాలతో తెలివిగా ఆడిన పాచికలాటలో విజయం సాధించిన విదేశాంగ విధానం వల్ల మాత్రమే అమెరికన్లకు అగ్రరాజ్యస్థాయి దక్కేందుకు ప్రథమ.. ప్రముఖ  కారణమయింది.   అమెరికన్లను నిజంగా అభినందించవలసిన అంశం ఏదైనా ఉందంటే.. అది వాళ్ళ విదేశాంగ విధానం.. ఆ  ఎత్తుగడల్లోని ముందుచూపు. ప్రపంచంలోని ఏ మూల రెండు దేశాల మధ్య చిన్నపాటి  ఘర్షణ తలెత్తినా.. పిలవని పేరంటానికి వెళ్లినట్లు.. అమెరికా.. వాళ్ల మధ్య దూరి.. తనకు లాభించే వర్గం కొమ్ము కాస్తూ రావడం వల్ల క్రమంగా ప్రపంచం మొత్తం  దాదాపు ఆ దేశపు అదుపాజ్ఞలకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో లోబడవలసిన పరిస్థితి దాపురించింది. అగ్రరాజ్య హోదాని ఇంతదాకా సవాల్ చేస్తూ వచ్చిన యూ ఎస్ ఎస్ ఆర్.. చీలిక  వల్లకూడా అమెరికాకు  మరింత లాభించిందనుకోవాలి. ప్రస్తుతం దాని వెన్నులో చలి పుట్టించే చేవగల దేశం ఒక్క చైనా మాత్రమే! ప్రపంచ వస్తుమార్కెట్ ను తన సరుకులతో  చైనా ఇప్పటికే దాదాపు ముంచెత్తి ఉంచడం.. అమెరికా  ఆధిపత్యానికి పెద్ద అవరోధంగా ఉంది.

తాను ఎత్తుకున్న ప్రపంచీకరణ సంస్కరణల పాటకు  ప్రపంచమంతా వంత పాడేందుకు ఒక్క చైనా మాత్రమే అవరోధంగా ఉంది ప్రస్తుతం అమెరికాకి.  ఆర్థిక పరంగా లాభించిన సైనిక చర్యల  ఎత్తుగడలే ఒక దశలో అమెరికా  వదిలించుకోలేని గుదిబండలుగా మారాయి. బుష్ లిద్దరూ తలపెట్టి కొనసాగించిన ఇరాక్- ఆఫ్ఘనిస్తాన్ సమరాల ఖర్చు అమెరికా డాలరును అతలాకుతలం చేసిందన్నమాట వాస్తవం. 

2008లో అమెరికాను కుదిపేసిన ఆర్థికమాంద్యం అటు పాలకులలోనే కాదు.. ఇటు పౌరుల మనస్తత్వంలోనూ గణనీయమైన మార్పుకు కారణమయింది.  ఇంత వరకు తామనుకుంటున్నట్లు ప్రపంచానికి తామే రారాజులం కాదన్న తత్వం బాగా తలకెత్తింది. మెక్సికన్ దేశీయుల్లాగా కష్టించి పని చేసే మనస్తత్వం.. ఆసియా వలసవాదుల్లా  ప్రతిబా పాటవాలను పెంపొదించుకొనే అబ్యాసాలకి అలవాటు పడకపోతే ముందొచ్చే కాలం మరింత చేదుగా ఉంటుదన్న సత్యమూ బోధపడింది మెల్లగా. ఆ నిజం తలకెక్కినందువల్ల మూల అమెరికన్లలో ఏర్పడ్డ అభద్రతాభావననే ట్రంప్ తొలి దశలో సొమ్ము చేసుకొని కాబోయే దేశాద్యక్షుడన్న  ఇమేజిని ఖాయపర్చుకోగలిగింది. పోటీలో బాగా ముందుకు పుంజుకొచ్చింది. దురదృష్టవశాత్తూ హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ అభ్యర్థిత్వం ఖాయమయిన తరువాతా అతగాడు అదే తరహా ఎత్తుగడలకు పోకుండా.. వ్యక్తిగత స్థాయి దూషణ పర్వానికి తెగబడటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అధ్యాయంలో పూర్వమెన్నడూ లేని ఒక హేయమైన కొత్త పర్వానికి తెర లేపినట్లయింది.

ఇహ హిల్లరీ క్లింటన్ వైపునుంచి చూద్దాం. గత ఎన్నికల్లో ఒబామాకి ప్రత్యర్థిగా ప్రైమరీ స్థాయిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తే. అప్పటి పోటీలో ప్రత్యర్థి ఒబామా మెజారిటీ ఓట్లు సాధించిన వెంటనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో వైదొలిగారామె.  ఆ సందర్భంలో హిల్లరీని  బైటనుంచి సమర్థించిన వ్యాపారవేత్తల్లో డొనాల్డ్ ట్రంప్ పముఖుడు. ఈ సారి నేరుగా ఆమెతో తలపదవలసిన స్తితి వచ్చేసరికి అప్పటి మంచి ఇప్పుడు కామంచి అయిపోయింది! హిల్లరీ అల్లరి మనిషి.. అతిగా తిరిగే మహిళ.. భర్తను సంతృప్తి పరిచే సామర్థ్యం లేని ఇల్లాలయిపోయింది! హిల్లరీ ప్రైమరీ స్థాయిలో పోటి పడుతున్న సందర్బంలోనే ప్రయివేట్ సర్వర్లనుంచి ప్రభుత్వ విదేశాంగ సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించిన కేసును ఎఫ్ బి ఐ వెలికి తీసింది. విచారణ అనంతరం అభియోగాలు మోపదగినంత అభ్యంతరాలేవీ కనిపించలేదని అదే ఎఫ్ బి ఐ  తదనంతరం ధృవీకరించింది కూడా. అయినా ఆ కేసునే పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ చాలా కాలం.. హిల్లరీని జైలుకు పంపిస్తానంటూ అల్లరికి దిగేవాడు! ఇంకా దిగుతున్నాడు కూడా! ఇటీవల మళ్లీ వికీ లీక్స్ చలవవల్ల  కొత్త కోణాలు వెలుగు చూసిన సందర్భంగా ఎఫ్ బి ఐ హిల్లరీ మీద మళ్లీ కేసు బుక్ చేసే ఆలోచనలో ఉందన్న వెంటనే హర్షాదామోదాలతో ఉబ్బి తబ్బుబ్బయిన వారిలో సహజంగానే ట్రంపు మొదటి వాడు. రెండు రోజుల కిందట హిల్లరీకి ఎఫ్ బి ఐ క్లీన్ చిట్ ఇచ్చింది కొత్త కేసులో కూడా. ఇప్పుడు ట్రంప్ మహాశ.యుడు హిల్లరీ.. ఎఫ్ బి ఐ కుమ్మక్కుని గురించి రచ్చ చేస్తున్నాడు! ఎఫ్ బి ఐ నిజాయితీని ప్రశ్నిస్తున్నాడు. ఇదే ఎఫ్ బి ఐ డొనాల్డ్ తన వ్యాపార లావాదేవీల పన్నుల విషయంలో చేసిన గిమ్మిక్కుని పరిశోధించి చట్టబద్ధంగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చింది గతంలో. అప్పుడు ఆ అత్యున్నత నేర పరిశోధనా సంస్థను ఆకాశానికి ఎత్తేసిందీ మహానుభావుడే. తడవకో సారి  మాట  మార్చే నైజం అటు రాజ్యాంగ బద్ధ సంస్థల్లోనూ.. ఇటు చట్టబద్ధ పదవులకు పోటీ వ్యక్తులలోను వ్యక్తమవుతుండటం.. అమెరికా మార్కు  ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇన్నాళ్లూ ప్రపంచమంతా భావించినట్లు ఇరవై నాలుగు కేరెట్ల బంగారం కాదు..  పొట్టలో  పురుగులున్న  మేడిపండు మాదిరిదని తేల్చేస్తున్నది.

పోటీకి దిగుతున్నది దేశాద్యక్ష పదవికి. కాబట్టి చర్చకు రావలసినవి దేశానికి సంబంధమైన సమస్యలు.తుపాకీ సంస్కృతి.. విద్యావిధానం.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు.. మద్యతరగతి జీవుల బతుకుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడాలు.. ఆరోగ్య, జీవిత బీమా పథకాల పునర్విచారణలు వంటివి ఎన్నో!  అవన్నీ మొదటి అంచె చర్చల్లోనే గాలికి కొట్టుకెళ్లాయి! గాలి మాటలు మొదలయ్యాయి.  ఆ స్థానే.. వ్యక్తిగత అంశాలు ముందుకు చొచ్చుకొచ్చేసాయి. హిల్లరీకి తరచూ జలుబు చేస్తుంది కాబట్టి.. ఆమె అత్యంత వత్తిళ్లతో కూడిన అధ్యక్ష పదవికి అనర్హురాలని ట్రంపు వాదన ఒకసారి. దానికి ఖండనగా హిల్లరీ వైద్యుల తాజా ఆరోగ్య ధృవీకరణ పత్రం సమర్పించుకోవాల్సి వచ్చింది. అయినా ట్రంప్ ఆరోపణలకు అడ్డుకట్ట పడనే లేదు. బహిరంగ వేదికలమీద బఫూన్ల స్థాయికి తగ్గకుండా.. ముక్కు ఎగబీలుస్తూ ఎగతాళిచేసే వరకూ వెళ్లింది అతగాడి వ్యవహార శైలి.  పోటీ చేసే అభ్యర్థి గుణగణాలని.. సమాచార గ్రహణ  సామర్థ్యం.. విశ్లేషణ.. వాటికి తగ్గ మేథోస్థాయి పరిమితులమీద చివరి అంచె మూడు డిబేటింగుల్లో  వాదోపవాదాలు సాగడం అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వ సాంప్రదాయం. వాటినీ గాలికి వదిలి..   హిల్లరీ క్లింటన్ కి సంబంధంలేని  ఓ నాటి  మాజీ అధ్యక్షుడు  క్లింటన్ సెక్ స్కాండల్సుని తిరిగి తవ్వి తీసి వ్యక్తిశీలహననద్వారా పరువు తీసి పైచేయి సాధించే దుష్ట సాంప్రదాయం మొదటిసారి  ట్రంపు ఎంచుకున్నాడు. విధిలేని పరిస్థితుల్లోమహిళైన హిల్లరీ సైతం ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని నమ్మి.. ట్రంప్ మహాశయుడి గతకాలపు శృంగార చాపల్యాన్ని పలు కోణాలలో.. ఉదాహరణలతో సహా  ప్రదర్శించి చర్చను రక్తి కట్టించింది. ఎన్నికల మూడు డిబేటింగ్ దశల్లో రోజుకో సెక్స్ స్కాండల్ ఇరువైపులనుంచి.  వ్యక్తిగత స్వేచ్చను.. శీలాన్ని  ఓ హక్కుగా భావించే అమెరికన్ల దృష్టిలో ఇద్దరు అభ్యర్థులూ అథమస్థాయి వ్యక్తులుగా  భావించేందుకు అవసరమైన ప్రహసనాలన్నీ అత్యంత అట్టహాసంగా  జరిగాయి. ఒక్క అమెరికానే కాకుండా.. ప్రపంచం మొత్తానికి అధ్యక్ష ఎన్నికల ప్రహసనం ఓ వినోద కార్యక్రమం కింద దిగజారి పోవడం మున్నెన్నడూ జరగని దుర్ఘటనే అనుకోవాలి.

హిల్లరీకి గతంలో అధ్యక్షుడుగా పనిచేసిన క్లింటన్ సహధర్మచారిణిగా వైట్ హౌస్ పాలనలో అనుభవం ఉంది. ఒబామా హయాంలో విదేంశాంగ మంత్రిగా గడించిన అనుభవమూ దానికి తోడయి ఉంది. ఆమెది రుజువయిన పాలనా సామర్థ్యం. మొదటిసారి ఎన్నికల్లో జనం ముందుకొచ్చిన అభ్యర్థి డొనాల్డ్ ట్రంపుకు అసలు రాజకీయాలే కొత్త.  డొనాల్డ్  మాట తీరు.. గత వ్యక్తిగత చరిత్ర ఆయనకో పెద్ద ప్లస్.. అదే మైనస్సు.  దేశం ఎదుర్కొనే సంక్షోబాల నివారణకి తన దగ్గర ఉన్న తారక మంత్రాది అంశాలతో సునిశిత ప్రజాస్వామ్య దృషిగల అమెరికన్ల మనసులను దోచుకోవాల్సుంది ఏ అభ్యర్థనా.  చివరి గడియల్లో వెలువడ్డ ప్రత్యర్థి హిల్లరీ ఈ-మెయిల్స్ కుంభకోణాల వల్ల  పొందవలసిన లాభం  సైతం.. సహజ శత్రువైన రష్యాను  పొగడడంతో  స్వయంగా చేజార్చుకొన్నట్లయింది డొనాల్డుకి.

వాచాలత వల్ల.. వ్యక్తిగత నిజాయితీలోని డొల్లతనం వల్ల.. అనవసరమైన, నీచమైన లైంగిక ఆరోపణల వల్ల.. పరాయి దేశాలమీదవున్న మత్సరం   వల్ల.. లౌక్య లేమి వల్ల.. రాజకీయ అనుభవ శూన్యత వల్ల..  ఒబామా సుదీర్ఘ పాలన వల్ల జనంలో ఉన్న అసంతృప్తిని సైతం సొమ్ము చేసుకోవడంలో డొనాల్డ్ ట్రంప్  విఫలమయ్యాడనే.. వెల్లువెత్తుతున్న సర్వేల సారాంశం తేట తెల్లం చేస్తోంది. ట్రంప్ మహాశయుడు ఎక్కడ విఫలమయ్యాడో.. హిల్లరీ క్లింటనుకి అక్కడ కలసి వచ్చినట్లుంది. ఫలితాల అనంతరం కూడా తన పోరు ఆగదు అనడంలోనే విలువలతో కూడుకొన్న అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని అతగాడు అవహేళన చేసినట్లయింది. రిగ్గింగ్ మాట ఇప్పుడు వినిపిస్తున్నంతాగా మునుపెన్నడు వినిపించ లేదు అధ్యక్ష ఎన్నికల్లో.

చూడాలి! ఇహ 48 గంటల్లో వచ్చి ఒక్క రోజులో ముగిసే ఎన్నికల తరువాత  రోజు దాదాపుగా వచ్చే ముందస్తు ఫలితాల సరళే అసలు ఫలితం ఎలా ఉండబోతుందో తెలియ చేస్తుంది. మిగతా దేశాల మాదిరిగా కాదు.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అనేక దేశాలమీద.. పలు రంగాల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటుంది. అందుకే  ఇప్పుడు ఇంత పెద్ద చర్చ ఇక్కడ.
'ట్రంపు గెలిచినా.. ఓడినా.. సంచలనమే' అనుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పటి వరకు గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగిన అన్ని ఎన్నికలకూ భిన్నంగా ఓటమి వచ్చి పడ్డా.. రిగ్గింగ్ వంటి ఆరోపణలతో అల్లరికి దిగుతానన్న సంకేతాలు కూడా వెలువరిస్తున్నాడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.

ప్రపంచం దేశాలు ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకుంటున్నది అమెరికా  ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యాన్ని గురించి.  సందర్బం తటస్థపడ్డప్పుడు వచ్చినప్పుడు .. ఆ అత్యంత  ఉత్తమ ప్రజాపాలనావ్యవస్థా  ఎంతటి అధమస్థాయికైనా దిగిజారిపోగలదు' అని నిరూపిస్తున్న ఈ 2016 ఎన్నికలను ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచం మొత్తం ఒక విలక్షణమైన చారిత్రక సంఘటనగా గుర్తుంచుకోడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
-కర్లపాలెం హనుమంతరావు

***



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...