Monday, January 30, 2017

దగ్గరి దారి- మరీ చిన్న కథ

ముఫ్ఫై అపార్ట్ మెంట్ల కాంప్లెక్స్ మాది. లిఫ్ట్ పనిచేయని ఓ పరగడున పాల పాకెట్లు తీసుకొని మెట్ల దారిన వస్తుంటే రెండో ఫ్లోర్ మెట్లకు ఓ మూల నిండుగర్భిణీలా ఉన్న ఓ వ్యాలెట్ కంటబడింది. అప్రయత్నంగా వంగి దాన్నందుకొని చూస్తే బరువును బట్టి లోపల సొమ్ము భారీగా ఉందని తేలింది. సభ్యత కాదు కాబట్టి ఎంతుందో తెలీదు కానీ.. మొత్తానిక అంతా దాదాపుగా ఐదొందలు.. వెయ్యినోట్లే. క్రెడిట్ .. డెబిట్ కార్టుల్లాంటివీ ఏవేవో ఉన్నాయి.  అన్నింటి మీదా బి. గోవింద రాజన్ అన్న పేరే ఉండుంటం వల్ల ఆ పర్శుతాలూకు ఆసామి ఎవరో తేలిపోయింది. వాచ్ మెన్ అప్పారావును అడిగితే .. అలాంటి పేరున్న వాళ్లెవరూ అపార్టుమెంట్లలో లేరని తేల్చాడు.
'ఇంత సొమ్ముంది. పై పెచ్చు ప్లాస్టిక్ కార్డులు! పోగొట్టుకొన్న మనిషి తానే వెదుక్కుంటూ రాడా? అప్పుడు తిరిగిచ్చేద్దాంలే!' అనిపించి ఇలా పర్శు నా దగ్గరుందని వాచ్ మెన్ కు చెప్పి  వచ్చేసాను.

ఒకటి రెండు రోజుల్దాకా ఎవరూ రాలేదు! ఆశ్చర్యం! మరీ ఆశ్చర్యం ఒక నెల రోజులు దాటినా ఎవరూ రాలేదు.

పరాయి సొమ్మును పాములా భావించే చాదస్తం  నాది. పోనీ  పోలీసులకిలా దొరికిందన్న సమాచారమిద్దామా అనిపించింది. వాళ్ల పోకిరీ బుద్ధి బాగా తెల్సుండబట్టి మనసొప్పలేదు. గుళ్లో హుండీలో వేయమని మొదలు పెట్టింది మా శ్రీమతి. పోలీసులకన్నా దేవుడి చూట్టూతా చేరిన  వాళ్లేమన్నా బుద్ధిమంతులా? ఆ పనీ చెయ్య బుద్ధి కాలేదు.
ఇంట్లో మధన ఇలా సాగుతుండగానే  మా  ధర్మ విచికిత్సను పటాపంచలు చేస్తూ  కాలింగు బెల్ కొట్టి మరీ ఓ నడి వయసు శాల్తీ లోపలి కొచ్చింది. అయిన పరిచయాలను బట్టి అతగాడు ఏదో ప్రైవేటు కాలేజీ లక్చెరరని తేలింది. అందరికీ    'గోరా'గా తెలిసిన అతగాడి అసలు పేరు 'గోవింద రాజ కుమారన్'ట! మా కాంప్లెక్సులో అద్దెకు దిగి ఇంకా రెండు నెలలు కూడా నిండక పోవడంతో అతగాడి ఆరిజన్ తమిళనాడు సైడు వేలూరని పసిగట్ట లేకపోయాం.   కృష్టాజిల్లా బ్రాహ్మణ యాసతో స్పష్టమైన తెలుగు మాట్లాట్టం వల్లా  గోరా రూట్స్ గోరైంతైనా పసిగట్టలేక పోయాం ఎవ్వరం.
పర్శులో ఐదువేల ఏడొందలు .. ఐదు వెయ్యి నోట్లు.. ఒక్క ఐదొందల నోటు.. నాలుగు యాభై నోట్లున్నాయని చూడకుండానే చెప్పేసాడు. క్రెడిట్.. డెబిట్ కార్డు వివరాలు కూడా అన్నీ పొల్లుపోకుండా చెప్పడంతో .. ఇంకా సందేహించడం అవమానించడమే అవుతుంది. అంతే కాదు. ఆ పరాయి సొమ్మును ఇంకా మోసే మానసిక స్థైర్యం నాకు లేదు. మా శ్రీమతిగారి హుషారుక్కూడా  అడ్డుకట్ట పడినట్లుంటుందన్న ఆత్రంతో పర్శు తిరిగి తెచ్చిస్తూ' అన్నీ సరిగ్గా  ఉన్నాయో.. లేవో.. ఒకసారి సరి చూసుకో బాబూ!' అన్నాను,
'ఉంటాయంకుల్! మీ నిజాయితీని గురించి  ఇక్కడందరూ చెప్పుకుంటుంటారు. ఆ  ధీమతోనే  ఆ రోజు మీ కంట బడేట్లు ఈ పర్సును  మెట్ల మూల పడేశాను. మీరా పరగడుపు చీకట్లలో  చూడ లేదు కానీ.. నేనక్కడే ఓ వారగా నిలబడున్నాను' అన్నాడు!
ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టడం నా వంతయింది. ఇన్నాళ్ళూ నన్నవసరంగా టెన్షన్ పెట్టడం కొద్దిగా కోపం కూడా తెప్పించింది. నా ముఖంలోని భావాలను చదివినట్లుగా నొచ్చుకుంటున్నట్లు మొహం పెట్టి అన్నాడు గోరా 'సారీ! పెద్దవారు. మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేం  చేసేది? ఆ టైంలో ఇంట్లో మా అమ్మ నాన్నలున్నారు. మా నాన్నగారికి మందు పిచ్చి, దానికి తోడు నా జేబులు తడిమి ఎంతుంటే అంత పట్టుకేళ్లే అలవాటు. అడిగితే పెద్ద రభస అమ్మతో కూడా. బైకుమీదనుంచి పడి బాగా దెబ్బలు తగిలున్నాయని నన్ను చూడ్డానికి  హఠాత్తుగా ఊడి పడ్డారిద్దరూ. మర్నాడు మళ్లా బ్యాంకులో వేద్దును కానీ కుంటికాలు.. పెద్ద పెద్ద  క్యూలు! కుదర్లా! అంతకు ముందు రోజు రాత్రే మోదీగారీ పెద్దనోట్లు రద్దుచేసారు.  మా   వాళ్లిద్దర్నీ ఇప్పుడే బస్సెకించి  వస్తున్నా. సారీ  అంకుల్..  మా పేరెంట్సిద్దరూ  ఊరికెళ్లిందాకా నా హార్డ్ ఎరన్డ్ మనీ భద్రంగా ఉండాలంటే ఇంతకు మించి నాకు మరో దారి కనిపించలా’
.  
డబ్బు దాచుకోడానికి డబ్బు పోగొట్టుకోడం కూడా ఓ దగ్గరి దారని కనిపెట్టిన గోరా తెలివికి నోరెళ్ల బెట్టడం నా వంతయింది!
లకీగా ఇవాళ్టికింకా ఒక్క రోజు గడువు మిగిలుంది రద్దైన పెద్ద నోట్లు బ్యాంకులో వేసుకోడానికి. సంతోషమూ అయింది.
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రికలో మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)

***


వినోద వల్లరి- ఎన్నికల్లో


రోజూ ఒకే మాదిరి రాజకీయాలంటే మజా ఏముంటుంది? చట్టసభలు నడిచే సమయలో అంటే అదో రకం వినోదమైనా దొరిదేది. సభాసమయాలూ సినీతారల వస్త్రవిశేషాలకు మల్లే దినం దినం కురచనై పోతున్నప్పుడు ఓట్లేసి గెలిపించిన జనాలను ఏం చేసి మెప్పించేట్లు ప్రజాప్రతినిధులు?
మామూలుగా అయితే మామూలు జనం వినోదార్థం  చలన చిత్రాలాడించే   థియే'టర్లను నమ్ముకోడం ఆచారం. బోలెడంత సొమ్ము..  విలువైన సమమం రెండూ వెచ్చించి టిక్కెట్లు కోయించి హాల్లో కెళ్ళి కూలబడ్డా మూడుగంటల్లో కనీసం ఒక్క సెకనైనా గాట్టిగా ఈలేసే పాటగానీ.. కేకేసే కామెడీగానీ కరవవుతున్నప్పుడు .. ఇహ నటించి అలరించే బాద్యత ప్రజాప్రతినిధులదే అవుతుంది కదా! కుదరదంటే వచ్చే ఎన్నికల మాటా?!
నిమ్మళంగా ఊరుకొంటే పక్క రంగాల పోటీకూడా ఎక్కువై పోవచ్చు. ఆశారాం బాపూజీ జాతిపిత బాపూకన్నా పాప్యులరై పోవచ్చు. నిత్యానందుల   ప్రియసఖి నిత్యా మీనన్ కన్నా గ్లామరు గార్ల్ గా పేరు కొట్టేయచ్చు. జనం వినోదం కోసం వెంపర్లాడే అదను చూసి నయీం  మార్కు భాయీలు సతీ సక్కుబాయి డ్రస్సుల్లో కనిపిసే ప్రజాప్రతినిధుల గతేంటీ?!
బంగారక్క.. కేతిగాడు, పిట్టల దొర, కట్టె తుపాకీ రాముడు, గడ కర్ర నడక, గంగిరెద్దు పాట,  చిందు భాగోతం, భామా కలాపం..  అంటూ ఏ మూలనుంచి ఏ నటనా దురంధరులో నటనా రంగంలోకి దూకేస్తే ప్రజానాయకుల కార్యరంగం కబ్జా అయిపోయినట్లే! కోలాటం కర్రలొకసారి పక్క చేతుల్లోకి మారితే.. ఇక్కడ  చెక్క భజనెంత చక్కగా చేసినా జనాలకిక పట్టి చావదు.
అక్కడికీ ఓటర్ల నమ్మకం వమ్ముకాకుండా ఆమరణ నిరాహారానికి బదులు  ఆమరణ రిలే నిరాహార దీక్షలు.. నీళ్లు లేని నదుల్లో దిగి ముక్కుమూసుకు  నిలబడ్డాలు, విజయరథాల్లో నిలబడి పాదయాత్రలు  చేయడంలాంటి చిత్ర విచిత్రాలతో చపలచిత్త జనాల చిత్తాలని  చిత్తు చేసే విన్యాసాల జోరు పెంచుతూనే ఉన్నారు. అయినా ఆశించిన ఫలితాలు ఏ ఎన్నికల్లోనూ ప్రజలు ప్రసాదించడం లేదు!
పసికూనలమీద అఘాయిత్యాలు జరిగి వాతావరణం వేడెక్కినప్పుడుకూడా జనవినోదం సంగతి మన నేతాజీలు పక్కన పెట్టడం లేదు. 'మగకుంకలు  కదా! వయసు కాక మీదున్నప్పుడు దున్నపోతుల్లాకాక ధర్మరాజుల్లా ప్రవర్తిస్తారా! ఆడపిల్లలే కాస్త చూసీ చూడకుండా సహకరించాలి.. కానీ' అంటూ నవ్వించే  కాకాజీలక్ కొదవుండటం లేదు. 'పశు మూత్రం ఫినాయిల్ లాంటిది. ఆసుపత్రుల పరిశుభ్రతకు ఆ ద్రావకం ఉపయోగిస్తే ఫినాయిల్ ఖర్చు బొక్కసానికి ఆదా అవుతుంద'ని మరో ప్రజానేత సెలవివ్వడం.. జనాలు కష్టాలు మరిపించి నవ్వించేందుకు  చేసే బృహత్ప్రయత్నమే!  స్వీయ మూత్రంతో పెరటి సాగును దివ్యంగా సాగించొచ్చని సాక్షాత్తూ ఓ కేంద్రమంత్రులే  ఉధ్భోధించారంటే.. ప్రజావళిని కన్నీళ్ల సాగరంనుంచి గట్టెంక్కించేందుకు హోదాలతోకూడా నిమిత్తం పెట్టుకోకుండా  హాస్యరస పోషణ చేసేస్తున్నారనేగా అర్థం!
ఒక్క అమాత్యులనేమిటి కర్మభూమిలో పుట్టిన ఖర్మానికి పశుపక్ష్యాదులు సైతం ప్రజల వినోదార్థం తమ వంతు పాత్ర నిస్వార్థంగా పోషిస్తున్నాయి. ఆ మధ్య జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పాలిటెక్నిక్కు ప్రవేశ పరీక్షల్లో గోమాతలు కూడా పరీక్షలు రాసి ప్రజలను నోటమాట లేకుండా చేసాయి. వత్తిళ్లల్లో ఉన్న సరిహద్దు ప్ర్రాంతానికి  గోమాత పుణ్యామా అని ఒకపూట ఉపశమనం.
'దేవుడున్నాడా? ఉంటే గింటే ఏ రాజకీయ పక్షం? మూడు సింహాల అశోకచక్రంమీద కనువిందు చేసే 'సత్యం' ప్రస్తుత నివాసం ఏదీ?'అంటూ సమాచార చట్టం కింద యోగాచార్యులొకరు సత్యాన్వేషణకు పూనుకున్నారు. దేవుళ్లమీద జోకులేస్తే ఏమవుతుందో ఫ్రాన్స్ దేశం మనకు ముందే ఉదాహరణగా ఉంది. అయినా ప్రజా వినోదంలో తనవంతు హాస్యపాత్ర నిర్వహించేందుకు అంతలా దుస్సాహం చేసారా ఆ చార్యులవారు.  ఆధ్యాత్మిక రంగం సైతం పోటీకి వస్తున్న సందర్భంలో ప్రజల మధ్య నిత్యం నలిగే ప్రజానాయాకుడు నిమ్మకు నీరెత్తినట్లు ఎట్లా ఉండిపోగలడు?
అందుకే 'దడా దడా పడే వడగళ్లను దారి మళ్ళించి అన్నదాతను ఆదుకోకుంటే  భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ఇళ్లముందు ఆమరణ నిరాహార చేస్తా'నంటూ ఓ ప్రజానాయకుడు ఆందోళనలు లేవదీసాడీ మధ్య. దిగజారుడు రాజకీయంగా చీదర పుట్టించ వచ్చేమో గానీ.. చట్టసభల సమావేశాలు సరిగ్గా సాగని కాలంలో ఓట్లేసి గెలిపించిన జనాలను ఏదో విధంగా వినోదపర్చక తప్పుతుందా మరి! అందులో తప్పు మాత్రం ఏముంది? 
ప్రతిపక్షంలో ఉండీ చట్టసభలకు హాజరవలేని కష్టకాలంలో ప్రశ్నలేసి ప్రజాసమస్యలు వెలుగులోకి తెచ్చే సావకాశం తక్కువ. ఆ కొరత తీర్చేందుకే నవ్వు పుట్టించే చురకలిలా   సర్కార్లమీద  వరసబెట్టి పడుతున్నాయని  అర్థం చేసుకోవాలి.
వినోదానికి ఉన్నంత గుర్తింపు వ్యాపార రంగానికి లేదు. ఆధ్యాత్మిక రంగానికి రాదు. న్యాయరంగానికి నవ్వులాట అసలు పొసగదు. ఉద్యోగ రంగానికది పెద్ద చేటు. రాజకీయరంగమొక్కటే మినహాయింపు. కనకనే ఎన్నికల్లో జనం చీదరించి అవతల పారేసిన చేదు మాత్రనే చక్కర బిళ్లగా చప్పరిస్తూ .. జనాల చేత ఎలాగైనా చప్పట్లు కొట్టించుకోవాలని ప్రజానేతలు తిప్పలు పడుతున్నారు.
నేపాల్ భూకంప బాధితుల పరామర్శకు వెళ్లిన విషాదఘట్టంలో కూడా రాహుల్ బాబు వినోదానికే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వడం మనం మర్చిపోకూడదు. సంతాప సందేశాన్ని కావాలనే కెమేరాలముందు జాతికంతటికీ కనిపించే విధంగా కాపీ కొడుతూ నవ్వు తెప్పించేసాడు. ప్రధాన సమస్యలు చట్టసభలో చర్చకు వచ్చిన సందర్భంలో కూడా బల్లమీద గుర్రు కొడుతూ భలే వినోదం కలిగించాడు. నిద్రలో సైతం జనవినోదం సంగతి మరచిపోలేని మంచిబాలుడన్న జాలైనా లేకుండా మనమే మొన్నటి ఎన్నికల్లో బాబును నిర్దాక్షిణ్యంగా 'ఎడం' చేసుకున్నాం.
అవేమీ మనసులో పెట్టుకోకుండా మళ్లీ ఓటర్ల మనసులు ఆకట్టుకొనేందుకు కిసాన్ యాత్రంటూ  యూపీమీదకొచ్చి పడ్డాడా! ఈ సారైనా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధికారం 'చేయి' జారిపోరాదనే. మోదీజీ  'చాయ్ పే చర్చా'కి పోటీ.. 'కాట్ పే చర్చా' భేటీ!  ఎవరికీ తట్టని ఈ కొత్త వినోదంతో జనాల మధ్యెలా చెలరేగి పోయాడో ఆ మధ్య!
కెమేరాల సాక్షిగా కడుపుబ్బే కామెడీ షో. కుర్చీ మళ్లీ సంపాదించాలంటే 'మంచమే' మంచి ఆయుదమని ఎలా తట్టిందో మరి! మోదీజీ మీద అతగాడు రువ్వే నిప్పు రవ్వల్లాంటి  మాటలు జనాలకు ఎలాగూ జోలపాటల్లాగుంటాయని కాబోలు.. ప్రశాంత్ కిశోర్  సాబు.. బాబు సభల్లో నులక మంచాల డాబు.. సందర్భోచితంగా ప్రవేశ పెట్టేయించింది . సమావేశాల అనంతరం     కనిపించిన  'మంచాల'  సమరావేశాల దృశ్యం  ఆసేతు హిమాచల పర్యంతం రాహులుకి అశేషమైన  గుర్తింపు తెచ్చి పెట్టింది.  సైకిలు అఖిలేషు బాబుతో కలిసి పోటీచేస్తున్నాడుగా ఉత్తర ప్రదేశులో! చూద్దాం! నిజంగానే ఈ నయా గాంధీ  వర్గానికి  అధికార పగ్గాలందితే ఇంకెన్ని వినోద వల్లరులు చెలరేగిపోతాయో దేశం నిండా?!
-కర్లపాలెం హనుమంతరావు








Sunday, January 29, 2017

హే.. గాంధీ! -జనవరి- 30 గాంధీజీ వర్ధంతి సందర్భంగా


'హే.. గాంధీ!' అన్నాడు రాముడు.
'మహాత్మా! నువ్వు బతికున్నంత కాలం 'రఘుపతి.. రాఘవ.. రాజా.. రాం..' అంటూ పద్దాకా రాంకీర్తనలతో నా బుర్ర పాడుచేసేవాడివి! అందరికీ సన్మతి ఇవ్వమని తెగ ఇబ్బంది పెట్టేవాడివి. ఇప్పుడు ఆ రఘు.. రాఘవులు... రాజా.. రాం' లంతా .. ప్రతిపక్షాలలో చేరిపోయారయ్యా!  నా రామరాజ్యస్థాపనకి అడ్డు పడుతున్నారయ్యా!'
‘నారాయణ.. నారయణ.. అల్లా,, అల్లా..   భగవంతుడి బిడ్డలమే మేమల్లా!.. అనుకొని సర్దుకు పోరాదా రామా?'
'అల్లా వచ్చి నచ్చి చెప్పినా ఆ నారాయణా.. ఈ  సత్యనారాయణా.. అంతా  అవతలి పక్షంలోనే ఉండి పుల్లలు పెడుతున్నారు కదయ్యా!’
ఆలోచనలో పడ్డాడు మహాత్ముడు.
సందుచూసుకొని అందుకొన్నాడు ఆంజనేయుడు 'బాపూజీ!. నరలోకంనుంచి నాకూ సమాచారం ఉంది. నువ్వు సత్యంతో  ప్రయోగాలు చేసావు.   నీ వారసులు  ఇప్పుడు అక్కడ అసత్యాలతో ప్రయోగాలు చేస్తున్నారు. అమాయకులైన జనాలలో అయోమయం సృష్టిస్తున్నారు'
'అసత్యాలతో ప్రయోగమా?!'
'అవును మహాత్మా! ఎన్నికలు తన్నుకు రాగానే ముందు అసత్యం సత్యం మేకప్పేసుకొని తైతెక్కలాడేందుకు  తయారవుతోంది! చాలా పార్టీల ఎజెండాలు అసత్యాలతో చేసే ప్రయోగాలే! అభ్యర్థులైతే సాక్షాత్తూ  మూర్తీభవించిన అసత్యనారాయణమూర్తులు! ఎన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన షావుకారైనా .. ఎన్నికల సంఘం ముందు ఒకటో అరో  తప్ప ఏ కారూ లేని   బికారి. ఆ డొక్కు కారూ ఏ బ్యాంకువారి  సహకారంతోనో అరువుమీద  తెచ్చుకొన్నదంటున్నాడు.. పాపం. ఇంటాడాళ్ళ  షాపింగు పనికే  ఆ కారు.  అయ్యవారు చట్టసభకు వెళ్లి రావాలన్నా షేరు ఆటోనే గతి. ఆస్తి పాస్తులకన్నా.. అప్పులు, పన్నులు.. పస్తులైనా ఉండి కట్టాల్సిన బొచ్చెడు శిస్తులు! ఇంత కష్టంలో ఉండీ మరి ఎన్నికల్లో పోటీ ఎందుకయ్యా? అంటే..  ప్రజాసేవ ఓ గ్రామైనా చేయకపోతే  జీవితానికసలు పరమార్థమే లేదు. వృథా ఐపోతుందని  బతికున్న రోజుల్లో తవరు ఏ  సేవాగ్రామ్ లోనో సెలవిచ్చారుట! మీ మాటే మీ వారసులకు శిరోధార్యమట!’
బిత్తర పోయి చూశాడుబాపూజీ.
తవరు చెట్టైతే వాళ్లు తమరి పేరుతో అమ్ముడయ్యే పచ్చికాయలు. తవరు తల్లైతే వాళ్లు తమరి  కొంగుచాటున ఎదిగిన  పసిపిల్లకాయలు! '
'నిజంగానే వాళ్లు నా సిధ్ధాంతాలను నమ్మి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారేమో?  అనుమానం.. అవమానం అవుతుందయ్యా హనుమంతయ్యా!’
'మరే.. మహాత్మా! వాళ్లంత ఉగ్రభక్తులు కాబట్టే తవరు తాగద్దన్నారని  కల్లు గట్రా  మానేసి ఖరీదైన సీమ సరుకుతో సర్దుకుపోతున్నారు. సన్నకారుకంత భరించే స్తోమతుండదు కాబట్టి.. చీపు లిక్కరు బట్టీలు పెట్టించి  ప్రజాసేవలో తరిస్తున్నారు. చాలా సర్కారులకు మొన్నటి వరకూ అబ్కారీ వసూళ్ళే అసలైన ఆదాయం. జనంకూడా జాతిపితను మర్చి పోలేక .. తవరి జయంతి, వర్ధంతుల రోజుల్లో.. మందు  దుకాణాలు  బందుపడున్నా ఏ సందులో షట్టరు సందులో నుంచైనా పుడిసెడు పుచ్చుకోనిదే  నిద్రపోవడం లేదు.. పాపం'
'రామ!.. రామ! రామరాజ్యం వస్తే జనమంతా సుఖపడతారని కదా హనుమా  నా కల!’
‘సుఖపడే పాలన  యధేఛ్ఛగానే సాగుతోంది మహాత్మా అక్కడా! చెప్పడానికి  నాకే సిగ్గేస్తోంది.. రాజభవనాల్లో సైతం రాసలీలల స్వేఛ్చకు ఇబ్బందుల్లేవు. మోక్షమందించే ఆశ్రమాలు గొంది గొందికీ వందలు వందలు వెలుస్తూనే ఉన్నాయ్! మాయా మర్మాలతో  ప్రయోగాలు సాక్షాత్తు న్యాయదేవత కళ్లముందే  సశాస్త్రీయంగా సాఫీగా సాగిపోతున్నప్పుడు ఇహ  జానకీరాముడొచ్చి పాలనలో  కలగ చేసుకోవాలా? బంగారం  బిల్లులు.. ఆస్తి పత్రాలు..  బ్యాంకు కాతాలు.. బినామీలు..  నోట్ల నకిలీలు..  అన్నీ అసత్యంతో నల్లమారాజులు నిత్యం చేసే ప్రయోగాలేగదా!  నీది చరఖా చక్రం తిప్పుకొనే తిప్పలు. నీ వారసుల్ది  రాజకీయచక్రం స్వలాభంకోసం తిప్పే ఎత్తులు!’
‘చెడు.. వినొద్దు.. కనొద్దు.. అనొద్దు.. అన్న నా మొత్తుకోళ్లో మరి?’
‘చెడు అన్న ఆ ఒక్క పట్టింపు తప్పించి మిగతా ఆ ‘అనద్దు.. కనొద్దు.. అనద్దు’  సూత్రం మాత్రం మహా నిబద్ధతతో పాటిస్తున్నారు మహాత్మా తమరి వారసులు.. గాంధీలు. ఆడది అర్థరాత్రి ఒంటరిగా నిర్భయంగా బైట తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమని మీరు మరీ అత్యాశ పెట్టారు కదా పిచ్చితల్లులకు!  మగాడే బైట పగటిపూట పదిమంది మధ్యలో ధీమాగా తిరిగే రోజులు కావని తెలుసుకోలేని అమ్మళ్లు ఇప్పుడు నానా అగచాట్లు పాలవుతున్నారు! ఏ మాటకు ఎవరు ఏ పూట ఏ  విపరీతార్థం లాగుతారో.. ఏ వైపునుంచి ఏ వాహనం తూలుతూ వచ్చి మీదెక్కుతుందో.. ఏ ముఖపుస్తకం టపా ‘ఠపా’మని పేలి ఎవరు ఎప్పుడు టపా కట్టాల్సొస్తుందో .. అంతా గందరగోళంగా ఉందిప్పుడు కింది భూగోళంలో! జీవితం క్షణభంగురం. నిజవేకానీ.. మరీ భంగుతాగినోడి మాదిరి తూలుతో సాగడం ఎంత ఇబ్బందో  సామాన్యులకు?’
‘ఐతే మళ్లీ ఓ సారి నా భరత ఖండాన్ని దర్శించి రాక తప్పదంటావా హనుమా?’ లేచి నిలబడ్డాడు బాపూజీ.
'బొడ్దులో గడియారం, బోసి నోరు, చేతిలో కర్ర, కొల్లాయి గుడ్డ, కళ్ల జోడు.. వంటివన్నీ వంటిమీదుంటేనే గాంధీతాత అనుకొనే తరాలు తెరమరుగయ్యాయి పిచ్చి మహాత్మా! గాంధీ అంటే మొన్నటోళ్లకి ఇందిరా గాంధి, నిన్నటోళ్లకి సోనియా గాంధి. ఇప్పటోళ్లకి రాహుల్ గాంధి. రేపటోళ్ళకి ఏ ప్రియాంక గాంధీనో.. అమె బిడ్డో!’
అంటే నా'దేశం నన్ను మర్చి పోయినట్లా.. నా బోధలు గుర్తుకురానట్లా?’
'’గాంధీ’ అని కొట్టి చూడు బాపూజీ ఈ కంప్యూటర్లో! ‘రాహుల్ గాంధీ’ అన్న హిట్లే ఎక్కువ కనిపిస్తాయయ్  గూగుల్ వెదుకులాట యంత్రంలో!  ఇప్పట్టున ఏ ఇండియా టు-డేతో సర్వే తీయించినా  ఇందిరా గాంధీకన్నా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకే తక్కువ ఓట్లొస్తాయి కచ్చితంగా ‘మహాత్ము’ల జాబితాలో!’
‘నడి రోడ్డుమీద  నా విగ్రహలు అడుగడుక్కీ కనబడుతుంటాయి కదయ్యా హనుమయ్యా! వాటి వల్ల మరి ఎవరికీ ఏ ఉపయోగమూ లేనే లేదంటావా?’
‘ఒక్క పిట్టలు రెట్టలేసుకోడానికి, గల్లీ బుల్లి నాయకులు .. ఎన్నికలప్పుడు  కటౌట్లు పడిపోకుండా నిలబెట్టుకోడానికీ పనికొస్తాయి బాపూజీ న్ విగ్రహాలు!’
‘కొత్త రెండు వేల నోటుమీద నా మొహం ముద్రించి నా స్థాయి రెట్టింపు చేసారని  విని సంబర పడుతున్నాను కదయ్యా.. అదీ మరి వట్టి పటాటోపానికేనంటావా!’
‘ఆ   నోట్లమీద నీ బొమ్మకింద ‘మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ’ అని గానీ రాయించుకొనే ఏర్పాటు చేయించుకోకపోతే గాంధీ మూవీలో ఏ కిన్ బెన్స్లేనోలే అనుకునే  రోజులూ ఆట్టే దూరంలో లేవు! తమరు   ప్రబోధించిన సత్యం పథ్యంగా మాత్రమే పనికొస్తుందన్నదీ నాటి నాయకుల నమ్మకం. అహింస అంటే  చేతిలో ఏ కత్తో.. కర్రో.. కనీసం పాత చెప్పైనా  లేని నిస్సహాయ స్థితిలో  పనికొచ్చే ఆఖరి అస్త్రం అని జనమూ బలంగా నమ్ముతున్నారు. 'భలే తాత మన బాపూజీ' అని పాడిస్తో నిన్ను బాలలకి మాత్రమే ఓ మోడలుకింద  పరిమితం చేసేసి  తమ రాజకీయ లీలలను స్వలాభాలకోసం కొనసాగించే వ్యూహానికి పదును పెడుతున్నారు నీ గాంధీ వారసులు.  నిన్ను నమ్ముకున్న వారి ముందు   నవ్వుల పాలవకుండా ఉండేందుకైనా నువ్వు పెందలాడే మేలుకొంటే నీ పేరుకు మరింత మచ్చ రాకుండా ఉంటుంది. ఇవాళ నీ వర్ధంతి. కాబట్టి ఎక్కడున్నా నీ వారసులంతా నీ సమాధి  'రాజఘాట్' కొచ్చి కనీసం రెండు నిమిషాలైనా నిశ్శబ్దంగా తలొంచుకొని క్కూర్చోక తప్పదు.. మంచి అదను. ఇది తప్పితే మళ్ళీ అక్టోబరు రెండు దాకా నీకు అప్పాయింట్మెంటు దొరకదు. ఏం చేస్తావో.. ఎలా దారికి తెస్తావో మరి.. నీ వారసులమని వరసబెట్టి జనంలో కొచ్చి పడే వాళ్ల సంగతిహ నువ్వే చూసుకోవాలి’
'నిజమే! ఇదిగో  బైలుదేరుతున్నా!'
'ఇలాగా!  ఎవరూ నిన్ను గుర్తు పట్టరయ్యా పిచ్చి మహాత్మా! ఏ తెదేపా శివప్రసాదో మారు వేషంలో వచ్చాడని నవ్వుకుంటూ పోతారు. వంటికి వెండి పూత పట్టించు దట్టంగా!  ఓ గంట ముందే వెళ్లి ఆ ఎండలో రాజఘాట్ గేటు బైట శిలావిగ్రహంలా దారి కడ్డంగా నిలబడు. అదను చూసుకొని వాళ్ల చూపు నీ మీద పడ్డ తరువాత.. ఇహ నీ ఇష్టం'
కొల్లాయి గుడ్డ బిగించుకొని చేతి కర్ర పుచ్చుకొని  లేచి నిలబడ్డాడు అహింసా మూర్తి బాపూజీ ఆవేశంగా.
'అదీ వరస. శుభం. ముందే ప్రధాని మోదీ అక్కడ నువ్వు ప్రబోధించిన   ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టేసాడు.  నువ్వూ  ఓ చెయ్యి వెయ్యి. నా రామరాజ్య స్థాపనకి ఓ ఇటుక వెయ్యి!’ అంటూ ఆశీర్వదించాడు పరంథాముడు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో.. ఈనాడు దినపత్రిక యాజమాన్యంవారి సౌజన్యంతో)


Thursday, January 26, 2017

ఎద్దై పుట్టేకన్నా.. ఓ వృషభం సరదా విలాపం


ఎద్దై పుట్టే కన్నా ఏ అడవిలోనో  చింత మొద్దై పుట్టడం మేలు.
ఆరుగాలం పరుగులే పరుగులు. కొండ్రలు దున్నే వేళా  చెవుల్లో చెర్నాకోలు ‘ఛెళ్లు’ శబ్దాలు!

ఎంకి పెళ్లి సుబ్బి  చావుకొచ్చిందంటారు.  ఎంకి మా తమిళబ్బయితే. సుబ్బి.. ఇంకెవరు.. ఖర్మ కాలి మా ఎద్దు జాతే!

పొంగళ్ళ పండుగొచ్చిందన్న పొంగు ఒక రోజన్నా  ఉండదు. మూడో రోజునుంచే  ఎద్దుకు  యమలోక దర్శనం.  'దౌడో! దౌడో' అంటో ఒహడే గోడు! గుండాగి పోయేట్లు పరుగెత్తడానికి మేమేమన్నా సర్కారు పోలీసు ఉద్యోగాలు కోరుకొంటున్నామా?

మానవా! ఉరుగులు పరుగులు తప్ప  తమరికింకేమీ తెలీవా? పొద్దు పొడిచింది మొదలు.. పొద్దు గడిచేదాకా .. పరుగులు నురుగులేనా గురువా? కొవ్వు కరిగించుకోడానికి పరుగులు. బడులకు.. పన్లకు  పరుగులు. బాసుల వెనకాల బడి పరుగులు. ఆడాళ్లవెంట పడీ పడీ   పరుగులు. అప్పులోళ్లు వెంటబడితే పక్క సందుల్లోకి పరుగులు. చిల్లర  మాట చెవినపడ్డా పరుగులు! కొత్త  నోట్లకోసం నురుగులు! ఒక్క ఒలంపిక్కు పరుగుల్లోనే నింపాదిగా పెళ్లివారి నడకలు!

ఎద్దు మొద్దు స్వరూపాలని ఎద్దేవా చేసే పెద్దమనుషుల్లారా.. మా కాడెద్దులకన్నా  తవఁరెందులోనండీ పోటుగాళ్లు? గిట్టని మాట చెవిన బడితే చాలు..  గిట్టలిసిరే అసహనంలోనా? మా గడ్డిక్కూడా పాలుమాలే పోటీల్లోనా? 

ఏడాదికోసారే  వచ్చి పోయేది  పెద్దపండుగ. ఏదోలే.. ఏడ్చిపోతారని కదా  మేం   మీ కుళ్ళు  గుడ్డల్తో  ఊరేగేది?  గడప గడపకీ  వచ్చి దణ్ణాలు.. దస్కాలు పడీ పడీ పెట్టి పొయ్యేది  తవఁరి  గొప్పతనాలు చూసనా అయ్యల్లారా!   నిన్నటి దాకా ఒక పురచ్చి తలైవికి.  ఆ తల్లి తరలెళ్ళి పోయిన తెల్లారినుంచే మరో పుచ్చిన తలైవికి. మా గంగిరెద్దులకన్నా నంగిగా బుర్రలూపే తవఁరు .. ఎందులోనండీ బాబులూ  మా ఎద్దుజాతి కన్న మెరుగులు?

మీ పెట్ర్రోలోళ్ళ మాదిరి పూటకో రేటుతో అదరగొట్టం మేం. ఆయిలు ధరలు  అలా ఓ పది పైసలు పెరిగినప్పుడల్లా మీ నేతలే కదా మా బుల్లక్కార్ట్ల మీద ఊరేగుతూ  మా గొప్ప బిల్డప్పులిచ్చేది!  కార్నుంచి కార్లోకి తప్ప కాల్తీసి పెట్టని  షావుకార్లక్కూడా ఎన్నికలొస్తే చాలు   మా ఎద్దులబళ్లమీదెక్కినప్పుడే గొప్ప  కిక్కొచ్చేది.  

మళ్లీ జన్మంటూ ఉంటే ఆ మడోనా బాబులాగా పుట్టి మీ గోముఖ వ్యాఘ్రం మార్కు తొడుగుల్తో చెడుగుడాడేయాలని ఉంది! ‘గుడ్డే’ తప్ప చెడుతో ఆడ్డం చేతకాని పశువులం. అందుకే ఇప్పుడిన్ని  తిప్పలు !

అలవాటు లేని మందూ మాకు  మాకు పట్టించి బరికెల్తో, బరిసెల్తో  నడివీదుల్లోబడి దౌడు  తీయించే పాడు బుద్ధులెందుకండీ కామందులూ ప్రదర్శిస్తారు మా   ముందు? మీ బడి పిల్లకాయల   పుస్తకాల బస్తాలకన్నా ఎక్కువ బరువులు చడీ చప్పుడు లేకుండా మోస్తున్నందుకా ?

తవఁరికేవఁన్నా వినోదాలు  తక్కువయ్యా దొరబాబులూ మా బతుకులనిలా వీధుల పాలు చేసి అల్లరి చేసేస్తున్నారూ ?  వారానికో అయిదు అన్రియల్  చలన చిత్ర రాజమ్ములు..  అరగంటకో పాలి తింగిరి పింగిరి టీవి సీరియళ్లు! అదనంగా.. ఇప్పుడీ ఐదు రాష్ట్రముల ఎన్నికల  పాంచ్ పటాకా చాలకా..  వినోదానికింకేం కరువొచ్చిందని ధర్మప్రభువులూ.. మా ఎనుబోతుల మీదిలా పడి కరవొస్తున్నది అందరూ.. 'జల్లికట్టు' సంప్రదాయమని వంక బెట్టుకొని!

ఆంబోతేమన్నా  అప్పుడే విడుదలైన కొత్తైదొందల నోటా ?  అందరూ కల్సి అలా కుమ్మేసుకోడానికి కనీసం  ఆ పూటే విడుదలైన సినిమా ఆటైనా కాదే?!

పురచ్చి తలైవమ్మలా మెరీనా బీచ్ రీచవగానే పొయస్ గార్డెన్ మార్క్ దస్కత్  కుర్చీ కోసం.. అది  సంపాదించే డబ్బూ దస్కంకోసం ఎన్ని ముఠాలు?  ఎంతమంది మాయల మరాఠీలు? ఎద్దు కాలి ముల్లంత లేకపోయినా ఏడూళ్ల పెత్తనానికి తయారై పోయారందరూ.  ఎలపటి ఎద్దు ఎండకు లాగా.. మలపటి ఎద్దు నీడకు లాగా సామెతలాగా  సాగే రాజకీయాలని మళ్లీ ఒక్క  కట్టుమీదకు లాక్కొచ్చినందుకన్నా జల్లికట్టును జాలితో  వదిలేసెయ్యచ్చు కదయ్యా?

నవరసు పేటల నగా నట్రా ఏమన్నా అడుగుతున్నామా? ఆ ‘పేటా’ పెద్దలు ఫిర్యాదులకు పీటముళ్లేసి న్యావానికి అడ్డు రావద్దనేది ఒక్కటే దయగల పెద్దలకు మా విన్నపాలు!

తవఁరు పెట్టే గడ్డి విషంకన్నా హీనం.  పట్టించే కుడితికన్నా గరళం మహా సరళం.   అయినా కిమ్మనకుండా కొమ్ములొంచుకొని  బండ బరువులన్నింటినీ మౌనంగానే భరిస్తుంటిమి గదా యుగ యుగాల బట్టీ. జల్లికట్టు మిషతో మా వళ్లనింకా ఇలా  జల్లెళ్ల మాదిరి తూట్లు పొడవడం అన్యాయం.. ఈ అత్యాధునిక యుగంలో కూడా!

'అరవం.. అరవం' అంటూనే ఎంతలా అరిచి అల్లరి చేస్తున్నారర్రా అందరూ! ఎంత లావు ఒంగోలు జాతైనా రాజకీయాలముందు ఒంగోక తప్పదని తేల్చేసారు! న్యాయస్థానాల దగ్గర పప్పులుడకవని.. రాజాస్థానాలను ఆశ్రయించేసారు! ఎద్దు తంతుందని గుర్రం చాటున నక్కే నక్క జిత్తులు ప్రదర్శించారు!

ఎవర్నని ఏం లాభం? ఎన్నుబోతు ఖర్మ రుచి చూడాలంటే  ఎద్దుగా ఏడాది ఎందుకు.. ఆంబోతుబా ఆర్నెల్లు బతికి చూడాలి! అదీ అరవనాడులో.. పొంగలు సంబరాల్లో. పశువు జీవితమంటేనే వికారం  పుడుతుంది.   రాజకీయాలమీదకే  మళ్లీ మమకారం మళ్లుతుంది.
ఏదేమైనా ఎద్దు చచ్చినా వాత బాగా వేశారర్రా అంతా  కల్సి. ఈ సారికేదో జల్లి కట్టు ‘కుమ్ములాట'కు సిద్ధం చేసేసామంటారా అంతా.
గిత్తలుగా పుట్టడం తప్పయి పోయింది.  సారీ! ఏ నత్తలుగానో.. సోనియాజీ అత్తలుగానో పుడతాం అవకాశం వస్తే వచ్చే సారి. పోనీ ఇహ ముందైనా  మా పశుజాతిమీద  పిసరంత జాలి చూపండయ్యా కామందులూ! కావాలంటే చచ్చి మీ రాజకీయ నేతల కడుపుల్లో పుట్టడానికైనా మేం సిద్ధం.

ఇన్ని చెప్పుకున్నా ఎనుబోతుమీద వాన కురిసినట్లే అంటారా?.. ఇహ మేం మాత్రం చేసేదేమంది.. కొమ్ములకు పదును పెట్టుకోడం మినహా!
-కర్లపాలెం హనుమంతరావు




  

Sunday, January 22, 2017

తొలి కలల ప్రేమలేఖ- ఈనాడు ఆదివారం సంపాదకీయం


ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి? 'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథి వంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన. 'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి. పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచరణీయం.

(06-10-2011నాటి ఈనాడు సంపాదకీయం)

Monday, January 16, 2017

డిపాజిట్- క్రైం కథల పోటీలో బహుమతి పొందిన కథ


ఒంటిగంట కావస్తోంది. సోమవారాల్లో సాధారణంగా రద్దీ ఉంటుంది. పేరుకి అది కో-ఆపరేటివ్ బ్యాంకే అయినా.. మంచి బిజినెస్ సెంటర్లో ఉన్నందువల్ల దానికీ ఆని బ్యాంకుల మల్లేనే ఆ వేళ కస్టమర్స్ తాకిడి ఎప్పటికన్నా ఎక్కువగానే ఉంది.
లంచ్ టైముకి ఇంకో పావుగంట ఉందనగానే.. అయ్యర్ మెల్లిగా బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్రీఫ్ కేసులోంచి ఓ ఫిక్సుడ్ డిపాజిట్ బాండు తీసి బ్యాంకు మేనేజర్ ముందు పెట్టి అన్నాడు 'సార్! ఈ బాండ్ ఇవాళ మెచ్యూర్ అవుతుంది. కాస్త తొందరగా డబ్బిప్పించరా! రెండు గంటల బండికి చెన్నై పోవాలి. ఇవాళ ఈవెనింగే నా వైఫ్ కి ఆపరేషన్. ఈ మనీ చాలా అర్జంట్!'
మేనేజరుగారా బాండందుకొని చూసి 'మీరేనా అయ్యర్?' అనడిగాడు.
'అవును సార్!' అంటూ ఐడీ తీసి చూపించాడు అయ్యర్.
బాండు వెనక సంతకం తీసుకొని కంప్యూటర్ తెరమీద వెరిఫై చేసుకొని తృప్తి పడిన తరువాత 'ఓకె! ఒక్క హావెనవర్ వైట్ చేయండి! క్యాషియర్ లంచికి వెళ్లినట్లున్నాడు. రాగానే అరేంజ్ చేస్తాను' అంటూ బాండుతో సహా బ్యాంకు హాల్లోకి వెళ్ళి పోయాడు మేనేజర్.
అద్దాల్లోంచి ఆయన ఎవరో ఆఫీసరుకి ఐడి చూపించి మాట్లాడుతుండటం.. ఆ ఆఫీసరు మధ్య మధ్యలో తలిటు తిప్పి చూస్తూ ఉండటమూ కనిపిస్తూనే ఉంది అయ్యరుకి.
మేనేజరుగారు ఎటో వెళ్లిపోయాడు.. బహుశా లంచికేమో!ఇంకో ముప్పావు గంట తరువాత అటెండర్ వచ్చి 'సార్! క్యాష్ రెడీగా ఉంది. అటొచ్చి తీసుకోండి1' అన్నాడు.
అయ్యర్ బ్రీఫ్ కేస్ తో సహా వెళ్లి క్యాష్ కౌంటర్ ముందుకెళ్లి నిలబడ్డాడు. లంచవర్ జస్ట్ అప్పుడే అయిపోవడం వల్లనేమో హాల్లోనూ బైటా జనమాట్టే లేరు.
ముందే అరేంజి చేసినట్లున్నాడు.. వందనోట్లు రెండు బండిల్స్, చిల్లర పన్నెండు వేలూ కౌంటర్ మీద పరిచి చూపించాడు క్యాషియర్. 'సారీ సర్! మండే కదా! హెవీ పేమెంట్స్ వచ్చాయి. పెద్ద డినామినేషన్ అరేంజ్ చేయలేకపోయాం' అని నొచ్చుకున్నాడు కూడా.
బండిల్ అంటే పది ప్యాకెట్లు. మొత్తం ఇరవై ప్యాకెట్లు. పదులు పది ప్యాకెట్ల మీద రెండూ! చిన్న సూట్ కేసులో సర్దుకోడం కుదరక సతమతమవుతున్న అయ్యర్ని చూసాడు మేనేజర్ గారు 'బాలప్పా! ఊరికే అట్లా చూస్తూ నిలబదక పోతే సారుకి మన దగ్గరున్న బ్యాగేదన్నా ఇవ్వచ్చు కదా!' అని అరిచాడు.
బాలప్ప లోపలికి తెచ్చిన బ్యాగులో డబ్బు సర్దుతుంటే.. అయ్యర్ మేనేజరుగారి దగ్గరికెళ్లి  'థేంక్స్!' చెప్పాడు. 'ఇట్సాల్ రైట్! ఇందులో నేను చేసింది మాత్రం ఏముంది. ఎవరి మనీ వాళ్లకి సేఫ్ గా చేర్చేట్లు చూడ్డమే కదా.. యాజే మేనేజర్ నా ప్రైమరీ డ్యూటీ!ఆల్రెడీ టూ ఓ క్లాకయింది. ఈ టైములో ఆటోలు దొరకడం కూడా కష్టమేనే! బాలప్పా! బైట మన రెడ్డి ఆటో స్టాండులో ఉందేమో చూడు! సార్ ని స్టేషన్లో దిగబెట్టి రమ్మను!' అంటూ తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు మేనేజర్ గారు.
అయ్యర్ బ్యాంకు బైటికొచ్చి రెడీగా ఉన్న ఆటో ఎక్కి కూర్చున్నాడు. బాలప్ప ముందే చెప్పి పెట్టిన ఆటో అదే లాగుంది.. బాలప్ప అందించిన అయ్యర్ బ్యాగ్ లోపల పెట్టుకొని బాణంలాగా ముందుకు దూసుకు పోయింది.
ఆటో వేగంగా కన్నా ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నాయి అయ్యర్ గుండెలు! 'ఒకటా.. రెండా? రెండు లక్షల చిల్లర! ఇంత ఈజీగా పనయిపోతుందనుకోలేదు. ఒక్కో సారంతే! వెంటనే అయిపోతాయనుకొన్న పనులు ఏళ్లూ పూళ్లూ గడిచినా ఒక పట్టాన తెగవు. అసలు తెమలనే తెమలవనుకోనే పనులు .. ఎవరో తరుముతున్నట్లు.. ఇదిగో.. ఇలా.. చక చకా జరిగిపోతుంటాయి! లేచిన వేళా విశేషం. ఎన్నేళ్ళు కష్టపడితే ఇంత డబ్బొచ్చి వళ్లో బడుతుంది!' వళ్లోని క్యాష్ బ్యాగుని మరింత ఆబగా దగ్గరికి తీసుకున్నాడు అయ్యరు.
అప్పుడు చూసాడు బ్యాగుమీది ఆ అమ్మాయి బొమ్మని. ఎక్కడో చూసినట్లుంది ఆ పాప ఫోటో! ఆఁ! గుర్తుకొస్తోంది గోవింద రెడ్డి కూతురు ఫోటో కదూ అది? రెడ్డికి ఆ పాపంటే ప్రాణం. లాడ్జికొచ్చినప్పుడు చాలా అల్లరి చేస్తుండేది. లాడ్జిక్కూడా ఆ కూతురు పేరే పెట్టుకున్నాడు రెడ్డి.. 'మంగతాయారు లాడ్జి'
అలివేలు మంగనుకుంటా ఆ పాప పేరు.
తను ఈ బ్యాగులో తెచ్చిన లాడ్జి డబ్బే అప్పుడు  బ్యాంకులో డిపాజిట్ చేసింది. అప్పటి బ్యాగింకా బ్యాంకులో భద్రంగా ఉందా?!
'నిజానికీ సొమ్ము దక్కాల్సింది సాంబశివుడికి. చచ్చి ఏ లోకాన ఉన్నాడో పుణ్యాత్ముడు?' అయ్యర్ ఆలోచనలు ఒక్కసారి పదేళ్లు వెనక్కి మళ్లాయి.
మంగతాయారు లాడ్జిలో ఆ రోజు అట్టహాసంగా దిగిన చెన్నయ్ చెట్టియార్ తెల్లారే సరికల్లా బెడ్డుమీద శవంగా మారాడు! తెల్లారు ఝామున బెడ్ కాఫీ ఇవ్వడానికని వెళ్లిన తనే ఆ దృశ్యం అందరికన్నా ముందు చూసింది. కేష్ కౌంటర్లో పడి నిద్రపోతున్న సాంబశివుణ్ని నిద్రలేపి తీసుకొచ్చి చూపించింది కూడా తనే! ఆ తరువాత .. పోలీసులు రావడం.. విచారణలు..  సాంబశివుణ్ని గుచ్చి గుచ్చి అడగడం.. అన్నీ తాను అక్కడక్కడే తచ్చర్లాడుతూ గమనిస్తూనే ఉన్నాడు. అంత గందరగోళంలోనూ సాంబశివుడు తన పేరు బైట పెట్టలేదు! ఎందుకో.. ఆ మధ్యాహ్నం తెలిసింది.
లంచ్ సప్లై చేయడానికని వెళ్లిన తనను టాయిలెట్లోకి లాక్కెళ్లి ఈ బ్యాగే చేతిలో పెట్టి చెప్పాడు 'ఇందులో యాభై వేలున్నాయ్! ఇప్పుడే పోయి పండ్ల బజారులో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చెయ్.. నీ పేరున! ఈ హడావుడంతా తగ్గింతరువాత ఆలోచిద్దాం ఏం చేయాలో!'
ఆ సాయంకాలమే గోవింద రెడ్డిని పోలీసులు పట్టుకుపోయారు. సాంబశివుడు గాయబ్! భయమేసి తనూ చెన్నయ్ పారిపోయాడు.
కేసునుంచి బైట పడ్డానికి రెడ్డి చాలా కష్టపడ్డాడని విన్నాడు తను. ఏడేళ్ల కిందట సాంబశివుడూ ఏదో రోగమొచ్చి పోవడంతో డిపాజిట్ రహస్యం అతగాడితోనే సమాధి అయిపోయింది.
మధ్యలో రెండు మూడు సార్లొచ్చి బ్యాండును గడువు కన్నా ముందే తీసుకోవాలనుకొన్నా ధైర్యం చాలలేదు. ఇవాళకూడా బ్యాంకులో ఉన్నంత సేపూ ప్రాణాలు పింజం పింజం అంటూనే ఉన్నాయ్! ఆ ఏడుకొండలవాడి దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండానే పెద్ద మొత్తం చేతిలోకొచ్చి పడింది. ఈ చిల్లర పన్నెండు వేలూ మందు తిరుపతి వెళ్లి ఏడుకొండలవాడి హుండీలో వేస్తే గానీ మనశ్శాంతి లేదు.
ఆటో ఠకాల్మని ఆగిపోయింది. డ్రైవర్ సెల్లో మాట్లాట్టానికి ఆపినట్లున్నాడు. మళ్లా స్టార్ట్ చేయబోతే ఒక పట్టాన స్టార్ట్ కాలేదు.
డ్రైవర్ బండిని ఓ వారకు లాక్కెళ్లి ఆపి 'ఆయిల్ అయిపోయినట్లుంది. ఇక్కడే పెట్రోలు బంక్. ఒన్ మినిట్ సార్!'అంటో ఓ బాటిల్ తీసుకొని మాయమై పోయాడు.
తిరిగి వస్తూ ఓ పోలీసాయన్ని వెంట బెట్టుకొచ్చాడు! ఆ కానిస్టేబులు కూడా ఎక్కంగానే బండి స్టార్టయింది.. ఏ ఆయిల్ పోయకుండానే!
ఆటో రైల్వేస్టేషను ముందు కాకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆగడంతో అయ్యరుకి సీన్ అర్థమై పోయింది. పారిపోవడానిక్కూడా లేదు. క్యాష్ బ్యాగే కాదు.. తన చెయ్యీ కానిస్టేబుల్ చేతిలో ఉంది. మారు మాట్లాడకుండా కానిస్టేబుల్తో పాటు స్టేషన్లోకొచ్చాడు అయ్యర్. బ్యాంకు మేనేజరూ అక్కడే ఉన్నాడు!
'నిన్నెందుకు అరెస్ట్ చేసామో తెలుసా?' అనడిగాడు స్టేషనాఫీసరు.
'పదేళ్ళ కిందట గోవిందు లాడ్జిలో చెట్టియారుకు కాఫీలో విషమిచ్చి చంపినందుకు.' చెప్పాడు సి.ఐ.
'నో! అబద్ధం!' పెద్దగా అరిచాడు అయ్యర్. 'తననింకా బ్యాంకులో దొంగతనంగా డబ్బు డిపాజిట్ చేసినందుకు.. అనుకుంటున్నాడు అయ్యరు ఇప్పటి దాకా.
'మర్డర్ కేసా? యావజ్జీవమో!.. ఉరిశిక్షో!' పెళ్ళాం పిల్లలు గుర్తుకొచ్చారు. 'చెట్టియార్ చావుకీ నాకూ ఏ సంబంధం లేదు సార్!' బావురుమన్నాడు అయ్యరు.
'ఏ సంబంధమూ లేకపోతే ఎందుకురా అట్లా పారిపోయావూ?' అంటూ ఠప్పుమని లాఠీ ఝళిపించాడు సి.ఐ. 'ఇంత డబ్బు నీ కెక్కడిది బే! ఏం పని చేస్తే ఇంతొచ్చింది? దీనికోసమె నువ్వా  చెట్టియార్ని చంపావని సాంబశివుడు చచ్చేముందు స్టేట్మెంటిచ్చాడురా బెవకూఫ్!'
ఠపా ఠపా పడుతున్న లాఠీ దెబ్బలకు అయ్యరు కళ్లు బైర్లుకమ్మాయి. పోలీసువాళ్ల మర్యాదలెలా ఉంటాయో మొదటిసారి తెలిసొచ్చింది అయ్యరుకి. అట్లా ఎందుకన్నాడో తెలియదు 'సార్! సత్య ప్రమాణకంగా చెబుతున్నా. చెట్టియారు చావుకీ నాకూ ఎలాంటి లింకూ లేదు సార్! నా పిల్లలమీద ఒట్టేసి చెబుతున్నా. కావాలంటే ఈ డబ్బంతా తీసేసుకోండి! నన్నీ ఒక్కసారికీ ఒదిలేయండి సార్!'
'అట్లా రాసిస్తావు బే!' అనడిగాడు సి.ఐ. సీరియస్ గా మరో దెబ్బేస్తో.
తలూపాడు అయ్యర్.  బ్యాంకు మేనేజరు తయారు చేసుంచిన పేపర్లమీద గుడ్డిగా సంతకం చేసేసాడు కూడా.
అయ్యరుని బైటికి తీసుకు పోయి వచ్చిన ఆటోలోనే కుదేసిపోయాడు కానిస్టేబుల్.
దారిలో అన్నాడు ఆటో డ్రైవర్ 'అయ్యరంకుల్! నన్ను గుర్తు పట్టారా? నేను.. సాంబశివుడి కొడుకుని శ్రీనివాసుని. గోవింద రెడ్డి కూతురుతో కలసి లాడ్జిలో ఆడుకోడానికి వస్తుండేవాణ్ని. మా అయ్యా, నువ్వూ కల్సి చేసిన వెధవ పని నాకు తెలుసు. అయ్యే చెప్పేడు పొయేముందు. మీరిద్దరూ చేసిన వెధవ పనికి గోవింద రెడ్డి జైలు పాలయ్యాడు. కేసునుంచి బైటపడ్డానికి బోలెడంత ఖర్చయింది. ఆ అవమానంతో ఎక్కువ కాలం బతకలా!' అంటూండంగానే ఓ పాతకాలం బిల్డింగుముందు ఆటో ఆగింది. 'రెడ్డి కూతురు మంగతాయారుండేది ఈ అనాథ శరణాలయంలోనే. దానికి తండ్రినెట్లాగూ తెచ్చియ్యలేం. వాళ్ల నాయన సొమ్ములో కొంతైనా ఇప్పిస్తే ఏదో మంచి కాలేజీలో చేరి ఓ దారి చూసుకొంటుందని..నేనే ఈ ఎత్తు ఎత్తా.. స్నేహితుడిగా! ఇవాళ డిపాజిట్ మెచ్యూరవుతందని నాకు తెలుసు. బ్యాంకు సారు, సి.ఐ సార్ కో అపరేషన్ ఇవ్వబట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. దిగంకుల్! నీ చేత్తోనే మన తాయారుకి ఈ డబ్బిచ్చి 'సారీ!' చెబితే బాగుంటుంది' అంటూ సి. ఐ. సారిచ్చిన డబ్బు సంచీని తీసుకొని బండి దిగాడు ఆటో డ్రావర్  శ్రీనివాసులు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(చిత్ర సకుటుంబ సచిత్ర మాస పత్రిక  2011 లో నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథానికి. జూన్- 2011 అనుబంధ సంచికలో ప్రచురితం)





Sunday, January 15, 2017

'ముగ్గు'గుమ్మలు


‘రాచవీధులన్నీ రంగు రంగుల రంగువల్లికలతో పెళ్లివారికి పరిచిన ‘పంచవర్ణ’ పాద వస్త్రాలవలె  శొభిల్లుతాయ’ని వాల్మీకి వర్ణన రామాయణంలో.  విడిది గృహానికి విచ్చేసే వాసుదేవుడికీ విదురుడిచేత  సప్తవర్ణ సంశోభాయమానంగా వివిధ ప్రాంతాల రంగవల్లికలతో స్వాగత సత్కారాలు జరిపిస్తాడు బమ్మెర పోతన భాగవతంలో. భారతీయ సంస్కృతిలో స్వాగతం, సంబరం, సంతోషం, ఆడంబరం..  సహృద్భావం ఏదైనా  సంకేతం రంగవల్లికే. సాదర స్వాగత సత్కారాలకే కాక..  ఆ అల్లిక  సుదతి   తన ఆంతరంగిక ప్రతీకగా సైతం భావించడమే  భారతీయ సంస్కృతి విశిష్ట లక్షణం. పుష్యమాసారంభంలో పౌష్యలక్ష్మికి, సంక్రాంతి పండుగ సందర్భంలో సూర్యదేవునికి, కృష్ణాష్టమినాడు చిన్నికన్నయ్యకి, నాగపంచమినాడు నాగేంద్రుడికి.. సందర్భానికి అనుగుణంగా ముగ్గులు తీర్చడంలో మగువలకుండే శ్రద్ధాసక్తులు అపరిమితం. మరీ ముఖ్యంగా ధనుర్మాసారంభంలో.. పెద్ద పండుగకి ముందు పట్టే నెల ముప్పై  దినాలూ ముద్దుగుమ్మలకు పొద్దంతా   ముగ్గుల ముచ్చట్లే! తొలి సంజె చలి పులి సైతం భయపెట్టలేదీ బేల మగువల తెగువలను. ‘ ‘ఇంత యోపిక గడించుకొన్న / దానవే తల్లి, యీ చిన్నితనమునందు?/  పిట్టలే లెక్క లల్లార్చి విడిచిపెట్ట/ బోవు మనికీ పట్టీ ముని ప్రొద్దు వేళ!’ అంటూ ‘తెలుగు కన్నె’ కర్త  బొడ్డు బాపిరాజుగారికి అంతలా ఆశ్చర్యం!  ‘కదిలి వచ్చుచున్న సంక్రాంతి రమకు/ తీపులూరించు మేటి యాతిథ్యం’ అందిచాలని తెలుగు  మిఠారీ పంతం. అందుకోసమే  ఆ భామ నరకాసుర సమరసమయ సందర్భ   సత్యభామలా కొంగు బిగించి.. ముందు వెనుకలకు వంగి.. మునిగాళ్లమీద  నిలబడి.. కదులుతూ.. ఇంటి ముంగిలి ముందు  నింగి సూర్య చంద్రులను తారా మేఘమాలికలతో సహా రేఖల సాయంతో కిందికి దించి ఏకంగా ఓ సౌందర్య సామ్రాజ్యమే సృష్టించేస్తుందట!’.. ‘సంక్రాంతి సంబరాల’ వంకన ఓ ప్రాచీన కవిగారి కల్పన.   పూర్ణ కలశం పట్టిన తెలుగు తల్లిలా, అమృతభాండమందుకొన్న జగన్మోహినిలా.. ముగ్గు గిన్నెతో కదిలే ఆ సుందరాంగి భంగిమలను దొంగచాటుగా అయినా ఆ  కవి  చూసుండాలి. తొలిజాము కలనయినా అలా గిలిగింతలు పెట్టుండాలి!
రమణులు రంగువల్లికలు  తీర్చిదిద్దే దృశ్యమాలికలు  ఎన్ని కమనీయ శృంగార ప్రబంధాలకు ప్రాణ ప్రతిష్టలు చేసుంటాయో!  ‘రంగవల్లిక అల్లికలొక స్త్రీ సంబధిత  కళాత్మక ఆభివ్యక్తీకరణం’ అంటాడు ‘కామశాస్త్రం’లో వాత్సాయనుడు.  ‘ఎక్కడ తప్పునో యని యొకించుక ఏమరపాటు లేకయే/ చుక్కలు లెక్క  పెట్టు కొనుచుండగ శ్రద్ధగ గల్పుచుండ నే/ దిక్కునుండి వచ్చెనొ అదే పనిగా తిలకించి భర్త ఓ/ ‘చక్కదనాల  చుక్క!’యన జవ్వని సిగ్గున నాపెముగ్గులన్’ అంటారు శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి ‘సంక్రాతి ముగ్గుల’లో. నిత్యోత్సవ కళాత్మక జీవితానికి అరవై నాలుగు కళలూ ఆధారమేనన్న వాత్సాయనుడు రంగవల్లికలనూ ఆ జాబితాలో అందుకే చేర్చినట్లుంది.
‘ఆవు పేద తెచ్చి అయినిళ్లు అలికి/ గోవు పేడ తెచ్చి గోపురాలు అలికి/ ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి/ పగడాలు చెడగొట్టి పట్టిలేయించి’.. ముగ్గుల ప్రాధాన్యతని ముచ్చటైన  మాటలలో కళ్లకు కట్టించే పల్లెపాటలు ఇలాంటివి ఇంకెన్నో! ముగ్గు కళ విశ్వవ్యాప్తం. దేశ కాల సంస్కృతుల ఆధారంగానే మార్పులు. నాగకుండలి బంధంలోని మెలికలు చలికాలంనాటి ప్రజల బాధలకు దర్పణం. రాధాకృష్ణల ముగ్గు లౌకిక సంసార యోగ రహస్యం. పుష్పాలంకృత రంగవల్లికలు జనజీవనంలోని సంతోష భావాల సంకేతాలు.  దుష్ట శక్తుల కట్టడికి ముగ్గులను ఒక కట్టడిగా ఆటవికుల కాలం నాటినుంచే భావించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యజ్ఞయాగాదుల్లోని ముగ్గులను గురించి రుగ్వేదం ప్రస్తావించింది. అల్పాయుష్కుడైన బిడ్డ చిరాయస్సుకోసం ఓ రాజవైద్యుడు చేసిన కఠోర దీక్షకు మెచ్చి వచ్చిన విధాత- బాలుణ్ని  పోలిన ముగ్గు వేయిస్తే.. ప్రాణ ప్రతిష్ట చేస్తాన’ని అభయమిస్తాడు. ముమ్మూర్తులా చిరంజీవిని పోలిన ముగ్గు వేయించి బిడ్డను కాపాడుకొన్న ఆ ప్రాచీన ‘సులక్షణ గ్రంథం’ కథ ముగ్గు మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేయగలదో వివరించేందుకు పనికొచ్చే   చక్కని తార్కాణం. సింధు ప్రాంతంలోని తవ్వకాలలో బైటపడ్డ స్వస్తిక్ మార్కు ముగ్గులనుంచి.. శృంగార ప్రధాన  కళ్యాణ ఘట్టాలలో  వధూవరులు అధిష్ఠించే పీటలకింది పెళ్లి పట్టీల వరకు.. ‘ఎందెందు చూసిన అందందే కలదు’  కనువిందు చేసే అందాల ముగ్గు. మలి సంజె వేళ గడపకు అడ్డంగా గీసే రెండు  కర్రల  ముగ్గు అదృష్ట లక్ష్మినయినా గుమ్మం దాటి పోనీతదని తెలుగింటి అమ్మళ్ళ ధీమా.. విశ్వాసం!

విశ్వాసాల  నిజానిజాలు ఎలాగైనా ఉండనీయండి.. మనసు సున్నిత  భావావేశాలను  సుకుమార శైలిలో వెలిబుచ్చుకొనేందుకు వెలదికి తనకంటూ దొరికే ఆ పది నిమిషాలే రోజుమొత్తంలో ఆమెకు నిజమైన విలువైన క్షణాలు. ముగ్గులు వేయడం మగువకు మంచి వ్యాయామం- అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొలి సంజెనే లేచి కళ్లాపి కలిపి.. ఆవరణలో చల్లడం కండరాలకు మంచి  వ్యాయమం! ఆసనాలు, యోగా.. అన్నీ   అతివలకు ఆ  ముగ్గులద్దే కొద్ది క్షణాలలోనే.    స్టీవ్ జాబ్స్ ‘కనెక్టింగ్ ది డాట్స్’  చదివే పాటి పరిజ్ఞానం లేకపోవచ్చు. చుక్కల లెక్కలు మహిళ బుద్ధికి చురుకు పుట్టించే మానసిక వ్యాపారం! వేలి కొసలనుంచి ముగ్గుపిండి సమంగా జాలువార్చడమంటే భావోద్వేగాలను స్వీయాధీనంలోకి తెచ్చుకుంటో వాటితో సక్రమంగా పనిచేయింధుకొనే సాధన. గీతలను కలపడం సమన్యయ సామర్థ్యాన్ని మెరుగుపెరుచుకొనే అభ్యాసం. ‘రంగవల్లికలు అర్థవంతమయిన  మనో వికాస పాఠాలు’ అంటారు మానసిక తత్వవేత రవిశంకర్.  పండుగరోజుల్లో ముగ్గు పోటీలు మగువ మనసులోని పోటీ తత్వ పటిమను గట్టిపరుస్తుంది. పండుగయిన మర్నాటినుంచి అంతా ఆటల్లో అరటి పండనే నైజం  అలవడుతుంది. ఆఖరి క్షణాల్లో హఠాత్తుగా ఏ భారీ వర్షమో కురవడం మొదలవచ్చు. ఆకతాయి వాహనాలేవైనా మీదనుంచి పోవచ్చు. ముగ్గు అందం పాడయిందని ముఖం ముడవ కూడదు. మునుపటి అనుభవంతో మరింత అందమైన ముగ్గు తీర్చిదిద్దు కోవచ్చన్న పంతం బలపడితే క్రీడాస్ఫూర్తి అలవడినట్లే. ‘తోడి కన్నె పడుచులతో గూడి పోయి/  గోమయము, బంతి పూలేరి కోరితెచ్చి/ దిద్దితీర్చివెట్టిన గొబ్బిముద్దలకును/ కొలువు పీఠమీ రంగవల్లులె  అగునగు’ అంటారొక ఆధునిక కవి. వారాలు తరబడి  నేర్చి ఎంతో శ్రమకోర్చి ముంగిలి ముందు తీర్చిన  ముగ్గయినా ఆయుష్షు ఒక రోజే! ‘నేర్చిన మరో కొత్త రతనాల రంగవల్లిక గుమ్మం ముందు కొలువు తీరాలంటే నిన్నటి ముత్యాల ముగ్గుకు సెలవు ఇవ్వాల్సిందే!’ నని  జీవిత పాఠం నేర్పించే రంగవల్లికను మించిన వికాస గురువు నెలతకు మరేమీ ఉండదు. నేలమీద చోటు కరువు. నింగికి ఆ  రంగవల్లికలు అమరవు. ఎంత ఆధునికత సంతరించుకున్నా మగువ మనసు ముగ్గుల్ని వరువవు.  అత్యాధునిక మాధ్యమం అంతర్జాలమే సాధనంగా ఇంతి ఖండాతరాలను సైతం సరకు చేయకుండా తన ముగ్గుల సామ్రాజ్యాన్ని   విస్తరించుకుంటూ పోతోంది. పుట్టింటినుంచి పసుపు కొమ్ములతో పాటు పట్టుకొచ్చిన సొమ్ములీ ముగ్గులమీది ప్రేమాభిమానాలు. మళ్లీ తన చిన్నారి చిట్టి తల్లికి ఆ ‘స్త్రీ ధనం’ పదిలంగా అప్పగిస్తేనే భారతీయ మహిళకు సంతృప్తి!  
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...