Showing posts with label Eenadu. Show all posts
Showing posts with label Eenadu. Show all posts

Friday, December 24, 2021

ఈనాడు- సంపాదకీయం కల్యాణం... కమనీయం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 04-2012 )

 



ఈనాడు- సంపాదకీయం 


కల్యాణం... కమనీయం!

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 04-2012 ) 


కీర్తి, కాంత, కనకం ఒకేసారి వరుడికి కలిసొస్తుంటే, వధువుకు జీవన మధువు అందివచ్చేది మెడలో మూడుముళ్లు పడే తొలి ఘడియల నుంచి.  ప్రకృతి మూలశక్తి, పురుషుడు ఆ శక్తిధరుడు. ఇద్దరూ పరస్పరాధారితులు' అని గీతావాక్యం! 'జీవితాంతం కలిసి ఉందాం. స్నేహితుల్లా జీవిద్దాం' అంటూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి వధూవరులు చేసుకునే ప్రమాణాలే వివాహకాండలోని ప్రధాన ఘట్టం. 'వంశం నిలబడాలన్నా.. ముక్తి సాధించాలన్నా గృహస్థాశ్రమం అత్యంత ఆవశ్యకం' అని  యాజ్ఞవల్క్యస్మృతి విధి . ఉగ్రుడు నారదుడికి గృహస్థు ధర్మ ప్రాశస్త్యాన్ని ప్రబోధించిన 'అయుతు- నియుతుల కథ' తెనాలి రామ కృష్ణ కవి 'శ్రీపాండురంగ మాహాత్మ్యం'లో కనబడుతుంది. అగస్త్యుడంతటి మహర్షి ప్రియశిష్యులు ఆయుతు, నియుతుల ఆలనా పాలనా చూసుకొనేటందుకు విధాత తనయలను తెచ్చి పాణిపీడనం (పెండ్లి) చేయించబోతాడు. 'అడవుల నవయు తపస్వికి/ గడు సౌఖ్యముకోరు సతికి కలయిక తగునే!' అని తలపోస్తాడు అయుతుడు. కపట గృహ స్థుగా రంగప్రవేశం చేసిన ఇంద్రుడు ఆ సందర్భంలో విశదీకరించే గృహస్థాశ్రమ ధర్మ మర్మాలు ఏ కాలానికైనా సర్వజన శిరోధార్యాలు. పాడిపం టలు, విందు వినోదాలు, దానధర్మాలు, దాసదాసీలు, బంధుబలగాలతో గ్రామపెద్దగా గౌరవం పొందుతూ, నిత్యనైమిత్తికాలు నిష్ఠగా ఆచరిస్తూ, ధర్మపత్ని ప్రేమతో వడ్డించే మృష్టాన్నపాయసాలను స్వీకరించడంలోని బ్రహ్మానందం రాయిలాగా జీవితం గడిపే నిత్యబ్రహ్మచారికి - ఆ దేవరాజు దెప్పినట్లు నిజంగా ఏం బోధపడుతుంది!


పచ్చపచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కల్యాణ మందిరాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య వధూవరుల సిగ్గులూ స్వప్నాలు, పట్టుచీరెల రెపరెపలు, పడు చుజంటలు పక్కచూపులు, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, విందులు, వియ్యాలవారిమధ్య వినోదాలు, ఎదుర్కోల పన్నీరునుంచి అప్పగింతల కన్నీరుదాకా ఎన్నెన్ని అపూర్వ అపురూప అనిర్వచనీయ చిరస్మరణీయ మధురానుభూతులో... కల్యాణమంటే! 'వధువు వరు డును ద్వంద్వమై మధువు గ్రోలు' ఆ ప్రేమ బృందావనారామసీమ' గురించి కాళిదాసునుంచి కరుణశ్రీ వరకు వర్ణించని కవులు అరుదు. ఉమను పెళ్ళికూతురు చేస్తూ 'శృంగారక్రీడలో నీ భర్త తలమీది చంద్రకళను తాడించవలసింది ఈ వామపాదంతోనే సుమా!' అన్న సమకత్తెను  పూమాలతో ఉమ కొట్టిన తీరును కాళిదాసు వర్ణించిన వైనం అనుపమానం. సప్తమాతృకలు అందించిన విలాస సామగ్రిని విధా యకంగా మాత్రమే సృజించి వదిలేస్తాడు విరాగి గిరీశుడు. అయి తేనేం... ఒంటిమీది విభూతే సుగంధ లేపనం, కపాలం హస్తభూ షణం, గజ చర్మం చక్కని అంచున్న దుకూలం(తెల్లని వస్త్రం). మూడోకన్ను కల్యాణ తిలకం. సర్పాలు సర్వాంగాభరణాలు. వాటి శిరోమణుల వెలుగుల్లోని ఆ సహజ సౌందర్యమూర్తిని 'ఉమ' దృష్టితో చూడాలే గానీ... ఒడలు పులకరించిపోవూ! రాయలవారి ఆముక్తమా ల్యద రంగనాథుని వివాహ వైభోగం మరీ అతిశయం. ద్వాదశాదిత్యులు దివిటీలు. చంద్రుడు స్వామికి పట్టిన గొడుగు. నక్షత్రాలు దాని కుచ్చులు. కళ్లాపి చల్లినవాడు సముద్రుడు. అగరుధూపం అగ్నిదే వుడు. పందిళ్ళు చాందినీలు... దేవేంద్రుడు. నారద తుంబురులా



 దులు సంగీతం. గరుత్మంతుడు అంబారీ.  ఆదీ ఆ రంగనాథుడు కళ్యాణ వేళ తరలివచ్చినప్పటి ఆర్భాటం.  అల్లుడి కాళ్లుకడిగి, నిజపత్నితో కలిసి ఆనాడు విష్ణుచిత్తుడు చేసిన కన్యాదాన మహోత్సవమే నేటికీ తెలుగునాట పరిణయమంటే.


' స్వర్లోకమందున్న మానినులయందు బెండ్లిళ్లు  లేని కార ణమున మరులెత్తి మర్త్యలోకమున దేశ/ దేశముల పయింబడి వారు తిరుగుచుండ్రు' అని కవిరాజు త్రిపురనేని 'నందనోద్యానం'లోని ఒక చమత్కారం. ' తాడులేని బొంగరం- జోడులేని జీవితం' అని సామెత. వయసు పిల్లలు కనిపిస్తే ఇప్పటికీ పెద్దలు వేసే కుశల ప్రశ్నలలో  మొదటిది పెళ్ళి గురించే. ' పరిచారికల నడుమ మనోహర కాంచన మంటపంలో/ మసృణ  పర్ణాల నడుమ మందారం మాదిరి/ కూర్చొన్న మహారాజ్ఞి' అలవోకగా కేలనున్న జిలుగు చామరాన్ని కదిలిస్తే చాలునట... మరకత ఖచిత కనక పీఠిక పై/ మంతనాలయంలో మంత్రి మాండరీనులతో/ సామ్రాజ్య సంబంధ చర్చల మధ్య చిక్కిన మహామహీ మండలేశ్వరుడైనా ఆ పరిమళ సందేశాన్ని అందుకునేం దుకు కదలిపోవాల్సిందేనం' టారు కవి కృష్ణశాస్త్రి.  నిజమే. 'ఒక్కసారి ఈ కెమ్మోవి రుచి మరిగితిరా మరి వదలరు! ఒక్కసారి ఈ (ప్రేమ) బాహువులకు చిక్కితిరా మరి కదలరు' . ఆదికావ్యం రామాయణమే 'చతురాశ్రమాలలో  గార్హస్త్య జీవితం శ్రేష్టం.. ఉత్తమమ్' అని నిర్ధారించింది. ప్రతిదీ ప్రచండ వాయువేగంతో మార్పులకు లోనవుతున్న ఈ ఆధునికయుగంలో సైతం వేలాది సంవత్సరాలుగా వీస మెత్తయినా  తేడా లేకుండా తరంనుంచి తరానికి తరలివస్తున్నదంటేనే తెలు స్తోంది- మన వివాహ వ్యవస్థ ఎంత సుదృథమైనదో ! ... మరెంత సుందరమైందో!  శతాబ్దాల కిందట సోమేశ్వరదేవుడు 'అభిలాషితార్ధ చింతామణి'లో అభివర్ణించిన వధువు నిర్ణయం, నిశ్చితార్ధం, పెళ్ళి ఏర్పాట్లు, వివాహ కార్యక్రమం (నాతిచరామి, జీలకర్రబెల్లం, మంగళ సూత్ర ధారణ, సప్తపది, అగ్నిసాక్షి ప్రమాణాలు, లాజహోమం, అప్ప గింతలు లాంటివి) నేటికీ మనం తు.చ. తప్పకుండా ఆచరిస్తున్న పెళ్ళితంతు. ఏకపతి, ఏకపత్నిత్వాలకు  మొదటినుంచీ మనకు సీతారాములే ఏకైక ప్రతీకలు. శ్రీరామనవమి పేరుతో ఊరూ వాడా జరిగే సీతారాముల పెండ్లివేడుకలు  సువ్యవస్థితమైన వైవాహిక బంధంమీద ఈ జాతికున్న అచంచల భక్తివిశ్వాసాలకు గుర్తు.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 04-2012 ) 

Thursday, December 23, 2021

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక ఎన్నికల్లో ఉగాది రచన - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు ప్రచురితం - 27-03 -2009)


 


ఈనాడు - హాస్యం-  వ్యంగ్యం - గల్పిక

ఎన్నికల్లో ఉగాది 

రచన -  కర్లపాలెం హనుమంతరావు 


(ఈనాడు ప్రచురితం  - 27-03 -2009) 


'అసలే విరోధి.  ఆపై ఎన్నికల ఏడాది . అందుకే నేననేది.. 

ఈ ఉగాది ఉత్తి జగడాలమారిది' అంటూ పదోసారి పండుగ కవితలు వినిపించారు మావారు. 


ఆ సోదింకా భరించే ఓపిక లేక శ్రీవారి నాలిక్కింత ఉగాది పచ్చడి తగిలించా! అంతే, ఆ చేదుకి నోరు ఠక్కుమని మూతబడింది.


' నీతో పనికాదులే... నేరుగా జాతికే వినిపిస్తానీ కవితలు ఆవటా అంటూ పేంటూ చొక్కా వేసుకుని విసురుగా వాకౌట్ చేసేశారు.. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక బైటికి పారిపోయే మంత్రులకి మల్లే.


ఇదిగో ఇప్పుడు అదనంగా ఎన్నికలు కూడా కలిసొచ్చాయి. కనక పండగకళలో మరింత మార్పు వచ్చేసింది. మెగాస్టార్ కోరుకొనే మార్పు ఈసారి ముందుగా ఈ కొత్త సంవత్సరం పండగలోనే కొట్టొచ్చినట్లు కనిపించేస్తుంది. చూశారా! 


పండక్కి చాలాముందు నుంచే అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలను ఉగాది పచ్చడి మాదిరి రుబ్బేస్తున్నాయి గదా! మూడు నాలుగు రోజుల బట్టి  పంచటం కూడా మొదలె ట్టేసరికి... పండగ 'మూడే' ఎలా మారిపోయిందో చూడండి!


టికెట్టొస్తే తీపి . రాకపోతే చేదు. ఎదుటివాడి కొస్తే కారం. అడిగింది రాకపోతే పులుపు . అన్ని రుచులూ పండగ ముందే రుచి చూపించేస్తుందీ ఉగాది మరి!


సంకురుమయ్య ఈసారి ఎప్పుడో సంక్రాంతి దాకా ఆగే మూడ్ లో  లేనట్లుంది ... కప్ప వాహనమెక్కి ఇప్పుడే హడావుడిగా వచ్చేస్తున్నాడు.

అందుకేనేమో ఢిల్లీ నుంచి గల్లీదాకా చోటామోటా నాయకులతో సహా అందరూ ఆ పార్టీనుంచి ఈ పార్టీలోకి .. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి దూకేస్తున్నారు. 


ఈసారి పండక్కి కవుల గోలకన్నా ముందే ఈ కప్పల  బెకబెకల గాల ఎలా మొదలయ్యాయో చూశారా!


ఎన్నికల తేదీలు ప్రకటించినప్పట్నుంచీ ఈసీ రోడ్ కొరడా పట్టుకుని కాచుక్కూర్చొనుంది. దెబ్బలు కాచుకుంటూ పబ్బం గడుపుకోవడం మన నాయకులకు తెలీని విద్యేం కాదుగానీ.. ఇలా పండగ పంచాగ శ్రవణాలమీద డేగకన్నేసి ఉండటం పాపం కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నట్లుంది ప్రభుత్వ సిబ్బందికి.


ప్రత్యక్ష ప్రసారం కూడా పరోక్ష ప్రమేయాలను  ఈజీగా తీసుకొనేట్లు లేదు ఈసీ. అభ్యర్థుల ఆదాయ వ్యయాల మీద అభ్యంతరాలుంటే పరిశీ లన తప్పదంటున్నారు సీఈసీ. మాజీ డి.జీ. పి రాజపూజ్యం మీద తీసుకున్న చర్యే దీనికి సజీవ ఉదాహరణ.


మామూలుగా సర్వజనాలకు మాదిరిగా చదివే పంతులుగారికి కాస్త మామూళ్ళు ఎక్కువగానైనా చదివించి, వచ్చే జనాలు మెచ్చేవిధంగా ఫలితాలు అనుకూ లంగా చదివించుకోవడం ఏ సర్కారైనా ఎప్పుడూ చేసే పనేగానీ.. ఈసారి ఈ వేడుక కోడ్ మూలంగా సాధ్యపడే సాధనం లేదు. అందుకేనేమో అవధానిగారు టీవీలో చాలా కాలానికి మొదటిసారి కాస్త నిజాయతీగా ఎన్నికల స్పృహ ధ్వనిస్తున్నారు. 


వరి, గోధుమలు, జొన్నలకన్నా ' ఓట్ల'కు మద్దతు ధర అధికంగా పలికే సమయం ఇది. ఉచిత హామీలు పుష్క లంగా పండుతాయి. రథాలు రోడ్ల మీదా, జనాలు రథాల కింద నలిగి ఆస్తినష్టం, ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. తగ్గేది రూపాయి ధర ఒక్కటే.  చమురు ధరలు పడిపో యినా చేతి చమురు రేట్లు యధావిధిగా పెరుగుతూనే ఉంటాయి. 


శిలా ఫలకాల వాడకం అధికమవటం చేత ఇంటి నిర్మా రాళ్ళ కరవు ఏర్పడు తుంది. జలాలు లేకపోయినా జలాశయాలు నిర్మిస్తారు. ఆర్థిక మాంద్యం వల్ల పావలా వడ్డీలు చెల్లవు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యో గాలు ఊడే పరిస్థితి ఉన్నా ఇక్కడ ఎన్నికల మూలాన జనం చేతిలో చిల్లర ఆడుతుంది. 


అందరూ మళ్ళా మరోసారి  కులమతాలను గుర్తు చేసుకునే సమయం. గ్యాసు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. పోటీలుపడి ఛానెళ్ళు నిజాలు చెబుతాయి. నీరుకన్నా బీరు అధికంగా దొరుకుతుంది. ఓట్లు తక్కువగా వచ్చినవాళ్ళకు సీట్లు ఎక్కువగా వచ్చే విచిత్ర పరిస్థితి. జొన్నపొత్తులకన్నా పార్టీల పొత్తులు ఎక్కువ. భిక్షకులు సుభిక్షంగా ఉంటారు. 


చంద్రుడు రసాధిపతి, రాజు నీరసాధిపతి. రాహుల్.... అనగానే సభలో సగం జనం లేచి నిలబడ్డారు. పంచాంగం చెప్పే పంతులుగారితో ఏదో లోపాయకారీ ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం . రాహుల్ గాంధీ తప్ప రాహు, కేతువుల ఊసే లేదు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం.. అంటూ విసురుగా నినాదాలు చేసుకుంటూ బయటకు వెళ్లిపోతున్నారు. 


పంచాంగ పఠనం సాగుతుండగానే ఉగాది పచ్చడి పంచుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. 


మావారు కాల్ చేశారు. 'టీ.వీ.లో చూస్తున్నావా! ఉగాది పచ్చడి తినాల్సి వస్తుం దని ప్రతిపక్షాలవాళ్లు ఎలా పారిపోతున్నారో! పచ్చడి వెండి గిన్నెల్లో పెట్టి ఇస్తున్నారు. పంచాంగాల మధ్య పార్టీలు మేనిఫెస్టోలు అచ్చేశాయి. నువ్వు మాత్రం టీవీ కట్టేయద్దు. చివరిలో నా కవితాపఠనందాకా ఆగు' అంటూ...!


శాస్త్రులుగారు ఆ రణగొణ ధ్వనిలోనే తన ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. 


'రాజకీయాలలో 'మాయ' ప్రభావం అధికంగా ఉంటుంది. లోటు బడ్జెట్లకు లోటుండదు. రాష్ట్రా దాయం రెండు, వ్యయం పన్నెండు. రాజుగారి ఆదాయం పన్నెండు వ్యయం సున్నా.' 


హాలులో మిగిలిన సగం లేచి హాహాకారాలు చేశారు. ఎందుకో బయటకు పారిపోతున్నారు. క్షణంలో హాలు ఖాళీ అయిపోయింది కవులు కాగితాల కట్టతో వేదిక మీదకు ఎగబాకుతున్నారు.


మావారు మైకు పట్టుకుని ఖాళీ హాలుని చూసి ఉద్రే కంగా ఊగిపోతూ చదువుతున్నారు. 


చూశారా.. రంగు రంగుల కతలు అల్లగలరు నేతలు... 

కళ్ళు పడినా మూతలు...

ఓటరూ నీకు మిగులును పల్లకి మోతలు/' అంటూ... 


-రచన -  కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు ప్రచురితం  - 27-03 -2009) 


ఈనాడు - సంపాదకీయం ప్రణయ పరిమళం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 


ప్రణయ పరిమళం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 ) 


కంటిరెప్పల మైదానాలమీద కలల విత్తులు చల్లి అనుభూతుల పంట పండించేది ప్రేమ. హరిహర సుర జ్యేష్ణాదులు, కౌశిక శుక వ్యాసాదులు సైతం వలపు వలకు చిక్కి చిక్కిసగమైనవారే! ' కాయజుడు చేయు మాయల/ కా యజుడు, హరుండు, నంబుజాక్షుడు లోనై! తోయజ నయనల బాయరు/ హేయ జనుల్ నరులనంగ నెంత ధరిత్రిన్!' అన్న వైజయంతీ విలాసకర్త సారంగు తమ్మయ వాదన- కాదని కొట్టిపారేయలేనంత గట్టిది. చెట్టు నీడుండి, రుచియైన రొట్టె ఉండి/ దివ్యమైనట్టి శృంగార కావ్యముండి/ పరవశము చేయ గల మధుపాత్ర ఉండి/ పాడుచు హాయిగా ప్రియమైనవారు'  పక్క నుంటే ఉమర్ ఖయ్యామంతటి వాడికే- 'వట్టి బయలున స్వర్గం ఉట్టి పడుతుందట! వలచిన చిన్నది చాలాకాలం సుదూరంలో ఉన్నందువల్లే కాళిదాసు మేఘదూతం కథానాయకుడు చిక్కి శల్యమై చేతి కంకణాన్ని జారవిడుచుకొన్నది. 'మరలు కొనుచు హరిని వీడి/ మరలిన నర/ జన్మమేమి? ' అన్నంత భక్త్యావేశం ఉన్న విప్రనారాయణుడూ 'ఆడ ఉసురు తగలనీకు స్వామీ/ ముసురుకున్న మమతలతో కొసరిన అపరాధమేమి? ' అని ఒక ఆడుది ఇలా వేడుకొన్నదో లేదో రంగనిమాలా కైంకర్యమంతా ఆ అంగన సాంగత్యం పాల్జేసాడు! కావ్యాలంకార సంగ్రహ కర్త భట్టుమూర్తి- స్వాధీనపతిక, వాసవ సజ్జిక, విరహోత్కంఠిత , విప్రలబ్ధ , ఖండిత, కలహాంతరిత, ప్రోషిత భర్తృక, అభిసారిక అంటూ అష్టవిధ నాయికలుగా విభజించి చూపించాడు . కానీ - నిజానికి 'ఈ స్థాయీ భావాలన్నీ స్త్రీ పురుష భేదం లేకుండ పడుచు గుండె లన్నింటిలో సందర్భానుసారం గుబాళించే ప్రణయ పుష్ప పరిమళాలే! కొసచూపు దూసినప్పుడు, కులుకు నడక కంటబడ్డప్పుడు, సంయోగ శర్వరీలో, వియోగ విభావరిలో హృదయ సంబంధమైన సమస్తావస్థలలో  సరసులందరి మనసు లో పొరల్లో ముందుగా తళుక్కున మెరిసేది శృంగార భావమే! 'నాలో నన్ను ఇలా కలవరపరచేదేదో తెలీడం లేదు' అంటూ చలం 'గీతాంజలి'లో పడే ఆ అవ్యక్త మధుర బాధే ప్రేమికులందరిదీ. 'యెనక జల్మంలోన యెవరమో? ' అని బావ నాయుడంటే సిగ్గొచ్చి నవ్విన యెంకి, 'ముందు మనకే జల్మ ముందోలే' అనగానే తెల్లబోయిందట. ఎన్నాళ్లు మనకోలె ఈ సుకము లంటూ ఆ బావ దిగాలుపడితే కంట నీరెట్టేసుకుంటుంది ఆ నండూరివారి వెర్రి యెంకి. | నెత్తురు చెమ్మైన క్రమ్మకుండు/ పచ్చి గాయము లవి యమబాధ- పడవ/ కదిపితిని పొమ్ము, లక్షల కత్తులచట/ దిగ బడునయన్న భీతితో దిగులు నాకు' అని 'నాయని' ప్రేమను కత్తిపడ వ'తో పోల్చి మొత్తుకుంటారు. పువ్వులో తావిలా- తావిలో తలపులా/ కోకిలా గొంతులా- గొంతులో కోర్కెలా/ వెన్నెలా వెన్నలా వెన్నలో వెలుగులా నింగిలో నీడలా- నీడలో నిదురలా ప్రణయం ఒక్కొక్క రికి ఒక్కోవేళ ఒక్కో రూపంలో కనిపించి మురిపిస్తుంది. . కనిపించక కవ్విస్తుంది. . కనిపించీ కనిపించవండా ఏడిపిస్తుంది. గోడచాటున చేరి గుటకలేయడంతో మొదలయ్యే ప్రేమయాత్ర చూపులే ఆపేసి , రూపు పూసే మరిసి/వొకరెరుగ కింకొకరు వొంగి నిదరోదాము' అన్నంతదాకా సాగి సుఖాంతం కావాలంటే ధైర్యంగా దాటవలసిన  అవాంతరాలు ఎన్ని ఉంటాయో! మధ్యలో పడవలసిన  అవస్థలూ అంతే.  నిదురపోని కనుపాపలకు జోలపాట పాడలేక, ఈలవేసి చంపుతున్న ఈడుపోరు ఆపలేక పడుచుగుండెలు పడే దుర్భరానంద బాధ మేఘదూతం కాళిదాసు ఊహలకు సైతం అందనంత వింతైనది. మనసిచ్చినట్లు మాటొచ్చిన దాకా ఒక అంకం. మాటిచ్చినట్లు చివరిదాకా మనసును నడిపించుకో వడం మరో అంశం.  ప్రేమంటే రెండు గుండెలు చేసే సాము. గెలుపు కోసం ఓటమి, ఆ ఓటమికోసం అలుపెరుగని పోటీ.  వలపు- ప్రేమ పిచ్చివాళ్ల కూటమికి మాత్రమే అంతుబట్టే ఓ వింతక్రీడ.


భూమ్యాకర్షణ శక్తి సూత్రాన్ని సాధించినంత సులభం కాదు ప్రేమ ఆకర్షణశక్తి మూలాన్ని శోధించడం. ప్రణయ గణితంలో సంతోషం గుణకారం, సంతాపం భాగహారం, స్నేహం కూడిక, ద్వేషం తీసివేత అంటారు యండమూరి సమాధానంతో నిమిత్తం లేకుండా. ప్రశ్నలా పుట్టి మనసును సలిపేదే ప్రేమ.  ప్రేమను గురించి వివరిం చమని ఆల్మిత్రా అడిగినప్పుడు అలుస్తఫా సుదీర్ఘమైన వివరణ ఇస్తారు.  ఖలీల్ జిబ్రాన్ ప్రవక్త సందేశంలో ప్రేమమార్గం పరమ కఠినం. భీతి చెందకుండా విశ్వాసంతో వశమైపోయేవాళ్లను పరవశుల్ని చేసేది ప్రేమ పరుసవేది. నిజం. ప్రేమభావన సముద్రతీర లాంతరుగా మారి దారి చూపకపోతే జీవన సాగరంలో మనిషి ఏనాడో జాడ తెలియని ఓడగా కనుమరుగైపోయి ఉండేవాడు. మనిషి ఉనికికి ప్రేరణ ప్రేమే. నది ఇంకిపోయిన పిదప ప్రవాహపు గుర్తులు ఇసుక మేటలో కనిపించినట్లు- మనిషి కనుమరుగైన తరువాత అతను విత్తిన ప్రేమ వృక్షాలు పుష్పించి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. జీవితం వెలుగు చీకట్ల పడుగు పేకయితే, వెలుగు ప్రేమభావన. చీకటి దాని ఛాయ. 'లోకము నవ్వునంచుదనలో జనియించిన ప్రేమ నాపగా /నే కమలాక్షికైన దరమే!' అంటారు కొప్పరపు సుబ్బారావు 'తారాశశాంకం'లో. ఒయాసిస్సుల తడిసోకని ఎడారిలా బతుకు గడచిపోవాలని ఎవరు కోరుకుంటారు? కలల్ని రుమాలులో మూట కట్టుకోవాలన్నా, పిడికిలితో సముద్రాలని ఒడిసి పట్టుకోవాలన్నా- ప్రేమలో పడటమొక్కటే సులభమార్గం. మనసు నుంచి ప్రేమను దూరం చేయడం అంటే నదినుంచి నీటిని తోడేయటమే' అని ఒక ఆధునిక కవి భావన. కంటినుంచి దృష్టిని గెంటేయడం సాధ్యమా? ప్రేమా అంతే 'ఈసు కన్నుల దోయి/ చూచు చెడుపులు వేయి/ గుడ్డిప్రేమే హాయి' అంటారు కూనలమ్మ పదాల్లో ఆరుద్ర. ' ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును/ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును/ ప్రేమ కలుగక బ్రతుకు చీకటి'  అని ఎలుగెత్తారు యుగకవి గురజాడ. హింస, ద్వేషం, ఆవేశం, ఆక్రోశాలకు తావులేని ప్రేమ తావిని పంచుకోవాలన్నదే రాబోయే ప్రేమికుల దినం' యువలోకానికి అందిస్తున్న పరిమళ సందేశం.


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రేమకు వందనం - పేరుతో ప్రచురితం - 12 -12-2012 ) 



Wednesday, December 22, 2021

ఆదాయ యోగం రచన - కరపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 20-02-2015)



ఆదాయ యోగం 

రచన - కరపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 20-02-2015) 


' సబ్ కా సాథ్ ... సబ్ కా వికాస్' 

నీ ఆయోగ నీతి- ఆ  యోగమేంటో అంతా కొ త్తగా ఉంది. నా బాధంతా నీ భాష గురించి కాదు. వృద్ధి, ఉద్యోగాల కల్పన, బీదరికం నిర్మూలన, పథకాల అమలు... ఇలాంటి అంశాలన్నీ వినసొంపుగా ఉంటాయేగానీ, కాసులు రాలేందుకు వేరే దగ్గర దారులు ఇంకేమీ లేనేలేవా అన్నదే నా శంక! నిధులు, విజ్ఞానం లాంటివాటినన్నింటినీ కేంద్రం ఉదారంగా పంచి రాష్ట్రాలకు సాధికారత కల్పించడం అంతా వినసొంపుగానే ఉంది!' 


' స్వచ్ఛ భారత్ అంటూ కనబడ్డ చెత్తనల్లా అలా ఊడ్చిపారేయమని సతాయిస్తున్నారు కానీ, నిజానికి ఈ చెత్త నుంచి ఎన్ని కొత్తకొత్త ఆదాయ వనరులు సాధించు కోవచ్చు! ' 


' పాత రాష్ట్రం, ప్రత్యేక హోదాల్లాంటి హామీలన్నీ అమలు కావాలని ఒకరు, కొత్త రాష్ట్రం... కొండలా మీ అండ కావాలని మరొకరు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మొన్న నీతి ఆయోగ్ సమావే శంలో మోదీ బుగ్గ పట్టుకుని బతిమాలుతుంటే- ఎంతో విడ్డూరమనిపించింది. 


కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందన్న విషయం  పక్కన పెడితే, ఎక్కడ చూసినా తుక్కూ దూగరా  కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చే మన పుణ్యభూమిలో వేరే ఆదాయ వనరులకు వెదుకులాట అంతలా  అవసరమా?' 


' తెలుగు రాష్ట్రాలు రెండూ నిండు పూర్ణగ ర్భలు కదా! తుంగభద్రలో, తెలుగు గంగలో ఇసుకను బంగారంగా మార్చుకోవచ్చు.  మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోని ఎర్రచందనం దుంగలే ఇప్పుడు ఓ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయవనరు. మద్యం గురించి ఇహ చెప్పేదే ముంది! ప్రజాసంక్షేమ పథకాలన్నింటికీ అదే ప్రధాన వనరైన దుర్గతి మనది. పనికిరాని బొట్టు బిళ్ల లతో సైతం మదర్ థెరెసా బొమ్మలు చేసి అమ్మగల ప్రతిభావంతులైన మహిళలకు కొదవలేదు.' 


' చీపుగా చూసే చీపురు పుల్లల్ని కూడా ఓ మఫ్లరు మనిషి అధికారానికి సోపానంగా ఎలా మలచుకున్నాడో ఢిల్లీ ఎన్నికల్లో చూశాం గదా! కూచిపూడి, కొండపల్లి బ్రాండులతోనే కాదు, పూచిక పుల్లలతో సైతం సామాన్యు లను కోటీశ్వరుల్ని చేసేయొచ్చు.  సహజ వనరు నీరు. వాటిని  బాటిళ్లకు  పట్టి, మూతి బిగించి మంచి కంపెనీ లేబులొ కటి అందంగా అతికిస్తే సరి- లీటరు ఇరవై రూపాయలన్నా  వాటంగా చెల్లిపోతుంది. ' 


' దేవుడు వృథాగా దేన్నీ ప్రదానం చేయడు కదా! వీటికి సెన్సెక్సుల అదుపు లేదు. సెబీల గుబులు లేదు. సెన్సారు వాళ్ల కత్తెర్లూ అడ్డురావు. ఇంత సులభంగా నాలుగురాళ్లు సంపాదించుకునే అవకా శాలెన్నో ఆకాశమంత విస్తారంగా ఉన్నాయి. మన సీఎంలు మాత్రం మోదీ ముందలా సాగిలపడి బీదరువులు అరవడ మేమిటి? ! ' 


' రాజకీయ నాయకులైతే డబ్బు సంపాదనకు చూపిన అక్రమ దారులు ఇన్నీ అన్నీ కావు. నాలుగు రాళ్లు సంపా దించుకోమని మన పెద్దలు అస్తమానం పోరుతుంటారు. అదెంతో నిజం. రాళ్లు రప్పలకు ఉన్న గిరాకీ నిజమైన

డబ్బుకు ఎక్కడుంటుంది చెప్పు! గాలిని తరంగాలుగా మార్చేసి వేలు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే యడం లేదూ! బొగ్గు, ఇనుప ఖనిజాలను తవ్వి పోసుకుని కోట్లకు పడగలెత్తినవారి కథలకైతే లెక్కే లేదు. పాత పాలకుల పాలన పుణ్యమా అని దేశంలో ఏదీ వ్యాపారా నికి అనర్హమైనది  కానే కాదని ఎన్నడో తేలిపోయింది. పశుదాణా నుంచైనా బంగారు కాసులు రాబట్టుకోవచ్చని లాలూ ప్రసాదు లాంటివారు ఎన్నిమార్లో  నిరూపించారు. ఎక్కడ చూసినా అవినీతి బాగోతాలు. కానీ, జాతికి అవి నేర్పే పాఠాలు ఏమిటన్నదే మనకు ముఖ్యం! ' 


' తట్టెడు సిమెంటు తయారు కాకుండానే రెట్టింపు రేట్లకు

షేర్లు అమ్మేసే తోలు పెట్టి కంపెనీలు బోలె డన్ని వర్ధిల్లిన భూమి ఇది. జనాలకూ ఇలాంటి కిలాడీ పథకాలలో  తర్పీదు ఇప్పిస్తే  తప్పేముంది! ' 


' అత్యధిక బిలియనీర్లున్న ప్రపంచ దేశాల్లో మనదింకా మూడో స్థాన మేనా? సిగ్గుచేటు. బిల్ గేట్సన్నను  మించి సంపాదిస్తున్నారే మన పెద్దమనుషులు ! చట్టం చూసీచూడనట్లు పోతే చాలు, చట్టిలో .. ముంతలో కూడా బంగారం ముద్దలు దాచుకునే స్థాయికి ఎదక్కపోతే నన్నడుగు! ' 


' మేక్ ఇన్ ఇండియా' అనేది మన ప్రధాని నినాదం కూడా. గోడకు కొట్టుకునే మేకు కూడా ఇక్కడే తయారవాలన్న  ఆయన ఆకాంక్ష నుంచైనా మన జనాన్ని స్ఫూర్తి పొందనీయకపోతే ఎలా? ' 


' దేశభక్తితో పాటు స్వయంభుక్తికి సులభ మార్గాలెన్నో కళ్లముందే ఇన్ని వూరిస్తున్నా . . నిద్రమత్తులోనే ఉంచి జనాలను మనం జోకొడుతున్నామన్నదే నా బాధ.' 


' వనరులు అపారం. సద్వినియోగం చేసుకునే యోగమే అవసరం. కోళ్ళక్కూడా పనికిరాని ఫారాలలో  పాఠశాలలు పెట్టి పిల్లకాయల భవిష్య త్తును అలా బుగ్గిపాలు చేసేకన్నా చిన్నతనం నుంచే చిన్నతనం లేకుండా ఏ చెత్తతోనైనా సరే కొత్త కొత్త పద్ధతుల్లో ఆర్జించడం నేర్పించాలి. ఆ సెట్టులనీ ఈ సెట్టులనీ పసిబిడ్డల్ని పెసరట్ల మాదిరిగా, పరీక్షల పెనంమీదలా కాల్చుకు తిన కుండా వేడివేడి పకోడిల్లాంటి మంచి రుచికర మైన పథకాలు మరిన్ని సెట్ చేసి పెట్టి ఉంచాలి. పర్యాటకానికి కాణాచి మన దేశం. ఆ పేరు చెప్పి ఎక్కడికక్కడ గదులు అద్దెకు ఇచ్చినా పదులు, వేలల్లో ఆర్జించుకోవచ్చు. ప్రభుత్వ సారాయి దుకాణమైతే ఏ కొద్దిమంది తాగుబోతులకే పరిమితం. పరమాత్ముడి ప్రసా దాలకైతే సర్వే సర్వత్రా గిరాకీ. ఆశ్రమాలను మించిన శ్రమరహిత ఆదాయ పథకాలు ఇంకెక్కడున్నాయి స్వామీ?' 


' నాలుగు రాళ్లు జమ కూడాక బోర్డు తిప్పేసే కళ బీసీ కాలంనాటిదే కావచ్చు కానీ, ఈ రోజుకూ  అలాంటివారు కోకొల్ల లుగా మహారాజుల్లా వెలిగిపోతున్నారు. | 


' ఇన్నేసి ఆదాయవనరులు సహజసిద్ధంగా మన దగ్గర దండిగా పోగుపడి ఉండగా, కొత్త ఆలోచనలతో సమాజా న్ని కదం తొక్కించే నేర్పు ముఖ్యమంత్రులు చూపించాలి తప్పించి నేల చూపులు చూస్తే పెద్ద తప్పిదమవుతుంది . 


రచన - కరపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 20-02-2015) 


ఈనాడు- సంపాదకీయం సౌహార్ధ దౌత్యం - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 )

 




ఈనాడు- సంపాదకీయం 


సౌహార్ధ దౌత్యం


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 ) 


పురాణాల ప్రకారం భారతీయులకు ప్రథమ దూత ఆంజనే యుడు. వాలి భయంతో రుష్యమూకంమీద కాలక్షేపం చేస్తున్న రాజు సుగ్రీవుడికి రామసోదరులకు మధ్య మంత్రి హోదాలో రాయబార మంత్రాంగం నడిపింది వాయుపుత్రుడే. సాధారణంగా ఎవరినీ  ప్రశంసించని రాఘవుడిని  ప్రథమ పరిచయంలోనే మెప్పిం చిన వాక్యవిశారదుడు హనుమంతుడు. 'ఇక్ష్వాకల  దశరథ తనయుడు పితృవాక్య పాలనకోసం అడవుల పాలయ్యీ కోల్పోయిన భార్య పునస్సాధనకోసం సాయం ఆశిస్తూ మన దరిచేరాడు. అంటూ ఆ విజ్ఞుడు చేసిన రామ పరిచయంలో ఒక్క పొల్లు పలు కైనా ఉందా! 'దూతకు ఉండవలసిన  ప్రధాన లక్షణం వాక్య విజ్ఞత'  అంటాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో.  రాయబారం అంటేనే రాజకీ యాల బేరం. నియమానుసారం  అజ్ఞాత వాసానంతరం రాజ్యభాగాన్ని తిరిగి ఇచ్చే ఉద్దేశం లేని కౌరవులు యుద్ధభయంతో సంజయుడిని  పాండవుల వద్దకు రాయబారం పంపిస్తారు. యుద్ధ నివారణ సంజయుని రాయబార లక్ష్యం. యుద్ధ సన్నద్ధత పాండవుల ఆలోచన. రాయబారం విఫలమైనా దౌత్యకార్యంలో ప్రతిఫలించే లౌక్య లక్షణాలన్నింటికీ ధర్మరాజు, సంజయుల సంవాదం దర్పణం పడుతుంది. రెండు విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ ఏర్పడి నప్పుడు నివారణార్ధం రాయబారం అవసరం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సాగించిన ప్రఖ్యాత రాయబారం అందుకు విరుద్ధమైనది. కురుపాండవుల మధ్య సంధి కుదిరితే ద్రౌపది మానావమాన దుష్కార్యాలకు శిక్ష ఎక్కడుంటుంది? దుర్యోధన దుశ్శాసనులవంటి దుర్మదాంధులు కర్మఫలాన్ని అనుభవించకుండా తప్పించుకుంటే 'కృష్ణావతార ధర్మసంస్థాపన' కు మరేమి సార్థకత? రాయబారాలన్నీ ఒకే లక్ష్యంతో సాగవు. ఏ సాగరం లోతు దానిది.


పిల్లలమర్రి పిన వీరభద్రకవి 'శృంగార శాకుంతలం'లో శకుం తల దుష్యంతుల మధ్య కణ్వమహాముని పంపున  శిష్యులు రాయబారం నిర్వహిస్తారు. 'అగ్నిద్యోతనుడు' అనే పురోహితుడి అసమాన  రాయబార సామర్థ్యంవల్లే 'రుక్మిణీ కల్యాణం' సాధ్యమైంది. మనసు- వలచిన కన్యదే కావచ్చు. మాటల రూపంలో దానికి  దర్పణం పట్టవలసింది దూతగా వచ్చిన పురోహితుడే గదా! సందర్భం చూసి రుక్మిణి ఆకార సౌందర్య విశేషాలను ఆ భూసురుడు అత్యంత రసవత్త రంగా ఏకరువు పెట్టబట్టే గోపికానాథుడికి అగ్గిలం పుట్టింది. పురో హితులవారి చేత 'పెండ్లి నక్షత్రం' తెలుసుకొని మరీ విదర్భ దేశానికి పరుగులెత్తాడు.  ఆ కార్య సామర్థ్యమంతా భూసురుడి రాయ బారంలో ఉంది. ఆకాశ మార్గంలో సంచరించే మేఘశకలాలలకూ 'ప్రేమ సందేశాలు' మోయక తప్పలేదు. కాళిదాసు ' మేఘ దూతం' పేరుకు రెండు సర్గల ఖండకావ్యం కావచ్చునేమోగానీ.... దానిని  అనుసరిస్తూ వచ్చిన సందేశ కావ్యాలు లెక్కలేనన్ని. నలదమయంతులను కలిపే నిమిత్తం  బంగారు రెక్కల రాయంచ  రాయబారి పాత్ర నిర్వహించిందీ పరమేశ్వరుడే. నలుడి గుండెల్లో అగ్గి పుట్టించడం నుంచి, దమయంతిని నలుని దక్కంగ నొరునినే దలతునెట్లు? అన్నంత దాకా తీసుకుని పోయింది రాయంచ రాయబార విన్యాసమే. పింగళి సూరనార్యుని ' ప్రభావతీ ప్రద్యుమ్నం'లోని రాజ హంస శుచిముఖి ప్రేమరాయబారమూ అమోఘం. కథానాయిక అంగాంగాలను తనివితీరా వర్ణించి 'వచింపలేనయా/ క్కొమ్మ బెడం గులోన నొక కోటి తమాంశమునైన' అన్నదంటే 'శుచిముఖి వాణి'  వాస్తవంగా 'ఉపమాతిశయోక్తి కామధేనువే' !


పరవస్తు చిన్నయసూరి 'మిత్రభేదం'లోని దమనకుడు- వన రాజు పింగళకుడికి, వృషభరాజు సంజీవకుడికి నడుమ నిలబడి నడిపిన రాయబార మంత్రాంగం దౌత్యరీతులకే కొత్తపాఠాలు కూర్చినట్టిది . కొలువిచ్చిన పెదకోమటి వేమారెడ్డి పంపున బాల్యమి త్రుడు అవచి తిప్పయసెట్టిని కంచి రాయబారంలో శ్రీనాథుడు మంచి చేసుకొన్న తీరు సృజనరంగంలో రాయబారాలకు విలువ పెంచింది. మనిషి జీవితానికి, దేవుని రాయబారానికి మధ్యగల అనుబంధం అనుభవాలకు అతీతం. దైవ వాక్యాన్ని భూతలం మీదకు మోసుకొచ్చిన దేవదూత యేసు. 'లోభ మోహ మద కామ క్రోధ మాత్సర్య దుర్వ్యాళక్ష్వేళ కరాళ హాలాహల కీలాభిలమై అల్ల కల్లోమైన జగమ్ము సర్వమ్ము'నకు 'ఓం శాంతి' మంత్రాన్ని మోసు కొచ్చిన దూత బుద్ధభగవానుడు. భారతీయత ఔన్నత్యాన్ని ఎల్లల 'కావల మోతలెక్కించిన యువదూత వివేకానందులు. 'పవలున్ రాత్రులు నెత్తుటేళ్ళు ప్రవహింపన్ పాప భూయిష్టమౌ నవకళా నరకమ్ములో చరణ విన్యాసమ్ము గావించిన విశ్వమానవ సౌభ్రాత్ర దూత గాంధీతాత. 'ప్రాజ్యమైన సంగీత సామ్రాజ్యమునకు రాగ దూత'  త్యాగయ్య. ఇంటిదీపాన్ని ఆర్పిన గబ్బిలాన్నే తన కన్నీటి కథ ఈశ్వరునికి వినిపించే దూతగా మార్చుకున్నారు కవిపీష్వా జాషువా. దౌత్యకార్యాలతోనే ప్రపంచ తంత్రం ప్రస్తుతం నడుస్తున్నది . యుద్ధతంత్రాలకు, వ్యాపార సంబంధాలకు, సాంస్కృ తిక విశేషాల మార్పిడికే కాదు... శరణార్థుల సంక్షేమాలకూ రాయబారులను నియమించే కొత్త విధానానికీ నాంది పలికింది. హాలివుడ్ అందాలనటి ఏంజెలీనా జోలీ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమి షన్ ప్రత్యేక సౌహార్ద రాయబారిగా నియమితులు కావడం అభినం దనీయం. ఆరుబయట మలమూత్రాల విసర్జనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చేపట్టబోతున్న పారిశుధ్య ప్రచారోద్యమ ఆరోగ్య రాయబారులుగా బాలీవుడ్ నటీనటులు విద్యాబాలన్, షారుక్ ఖాన్  ఎంపికయ్యారు. తెరవేల్పుల మాటే మంత్రమై, ఆరోగ్య సూత్రాలపై కనీస అవగాహన అట్టడుగు స్థాయి చేరితే అంతకన్నా కోరదగినది ఇంకేముంటుంది ?


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 ) 


Tuesday, December 21, 2021

ఈనాడు - గల్పిక మేరా భారత్ మహాన్ రచన - కర్లపాలెం హనుమంతరావు ఈనాడు - ప్రచురితం - 26-10- 09


 


ఈనాడు - గల్పిక


మేరా భారత్ మహాన్


రచన - కర్లపాలెం హనుమంతరావు 

ఈనాడు - ప్రచురితం - 26-10- 09


ఏంవాయ్  వెంకటేశం, ఏంటలా టీవీకి అతుక్కుని కూర్చున్నావ్? పెరేడ్  వస్తుందా? ప్రెసిడెంట్ గారి స్పీచి వింటు న్నావా? మేడం గారు ఏ శారీ కట్టు కొస్తుందో చూసి మీ అక్కకు కొనిద్దావనే! దిస్... ఐ థింక్.. ఎండాఫా ల్ ఇండియన్ వ్యాల్యూస్.. అనగా మన భారతీయ విలువల అంతిమ దిన మన్న మాట. అంతిమదినం కాదు... గణతంత్ర దినమంటావ్... సరే.. అలాగేకానీయ్!


గంట నుంచి ఆ టీవీ చూస్తున్నావు గదా! ఏదీ, గణతంత్ర దివస్ అంటే ఏంటో వివరంగా చెప్పూ .. చూతం! సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్కా! ఆ ముక్క తెలుగువాడివి... తెలుగులో ఏడవ్వచ్చు గదా! తెలీదా... నోట్ బుక్ .తీసుకో..రాసుకో! కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాతంత్ర స్వతంత్ర రాజ్యం. ఇది తెలుక్కా దా? తెలివిమీరిపో యావోయ్ మై బోయ్!


సర్సరే .. వదిలేయ్... మన కంట్రీ స్పెసాలిటీస్... అనగా ప్రత్యేకతలేంటో అవన్నా తెలుసా! జనాభాలో చైనా కాక మన తర్వాతే ఇంకెవరైనా! పరెగ్జాంపుల్ ... మీ ఇంట్లోనే చూసుకో... మీ నాయనా, అమ్మా, బుచ్చెమ్మా, నువ్వూ, నీ, చెల్లెలూ, మీ మామ మైరావణుడు... ఆయన శిష్యుడు. వుపరి ఇప్పుడు నేనూ, ఒక్కింట్లోనే సెట్విన్ బస్సునిండే జనం ఉన్నామా... అందుకే థర్డువరల్డులో మనదేశందే తడాఖా ! శ్రీమాన్ ఒబామాగారు కూడా ఎప్పుడో వప్పేసుకున్నారోయ్ బాబ్జీ ! మరో తమాషా చూసావూ... ముఫ్ఫైయ్యొక్క స్టేట్లూ, ఆరువేల కులాలూ, మరో నాలుగొందలపైన ఉపకులాలూ, అందులో సగం మతాలూ, మూడు కోతులూ, ముక్కోటి దేవతలూ, పదహారొందల భాషలూ, ముప్పై మూడు పండగలు, తొమ్మిదొం దల ఆరు పార్టీలు, పార్టీకో రెండు అజెండాలు.. ఇంకో రహస్య అజెండా. . ఆఖరికి ఒక్కో ఓటుకి రెండేసి రాష్ట్రాలూ.... ఒక్కదాంట్లోనైనా మచ్చుక్కి ఏకత్వం లేకపోవటమేనోయ్ మన భిన్నత్వంలోని విచిత్రం! మన దేవుళ్ళక్కూడా మనుషులకు మల్లే మోర్ దేన్  టూ వైవ్స్ ఉండాలాయె! అటు కాశ్మీర్నుంచీ ఇటు కన్యాకుమారి దాకా ఒక్క విష యంలో మాత్రం మనవాళ్ళంతా ఘట్టిగ ఒక్కపట్టు మీద నిలబడుతున్నారోయ్ ! అదేంటంటావూ! ఆఖరికి చెప్తాగానీ... ఇప్పటికైతే మీ మామ పంచాగ ప్పొదిలో దాచిన పొగాకు పొయొకటి పట్రా... ఫో... పొయెట్రీ తన్నుకొచ్చేస్తుంది! 


నౌ బ్యాక్ టు పాయింట్! మన ప్రత్యేకతల గురించి మరో ముక్క చెప్పేదా! గుండుసున్నా కని పెట్టింది మనమేనోయ్ సన్నాసి! ఆ సంగతి సమస్తానికి  తెలియాలనే గదా జెండా మధ్య బండిచక్రంలా పెట్టి మరీ రెపరెపలాడించేస్తున్నాము! చక్రం తిప్పటంలోని చాణక్యమంతా శ్రీకృష్ణుడి నుంచీ లాగేసుకున్నారోయ్ మన లీడర్లు! 


మనరాజ్యాంగంలోని మరో చిత్రం చెప్పనా! ఇంత పెద్ద ఇండియాలో ఇంకేం లేనట్లు కాన్స్టిట్యూషన్ మొత్తం రెండొందలిరవైఐదు పేజీలూ చైనా ఇంకుతో రాయించేసారు మనసార్లు.... ఏ ఇండి యనింకో యూజు చేయచ్చుగదా!... ఊహూ... మనవాళ్ళకి మొదట్నుంచీ పరాయి సొమ్ముమీదే కదా పరమ మోజు! లేకపోతే నైరుతివైపున్న సముద్రానికి అరేబియా పేరు పెట్టుకోటమేంటోయ్! ఆగ్నేయంలో ఈవైపు నీళ్ళకు బే ఆఫ్ బెంగాలని బెంగాలువాళ్ళు పేరు పెట్టేసారు గదా! రేప్పొద్దున బెంగాలోళ్ళు... బంగలాదేశంగాళ్ళూ కొట్టుకు చేస్తారని బెంగగా వుందోయ్ ! ధరలూ, జలయజ్ఞం, అణుబాంబూ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలూ, ఆర్థిక మాంద్యం, కల్తీలూ, కరవులూ, అవినీతి, పిల్లల 

ఉద్యోగాలూడిపోవటాలూ, ప్రత్యేక రాష్ట్రాలూ, సత్యం గోలా  ఇన్ని బిలియన్స్ ఆఫ్ బర్నింగ్ ప్రాబ్లమ్సుంటే ... మళ్ళీ కొత్త తకరారులు నెత్తికి తెచ్చుకోటం తెలివైన వాళ్ళు చేసే పనేనా! .. అబ్బే.. ఈ చుట్ట అంటుకోటం లేదోయ్ .. ఇదే పెద్ద బర్నింగ్ ప్రాబ్లం అయిందోయ్ ఇప్పుడు! 


అవునూ.. మధ్యాహ్నం భోజనం సంగతేం చేశావోయ్! అహహ.. నేనంటున్నది మీ ఇంట్లో సంగతి. మన రాజశేఖర్రెడ్డిగారిది కాదు మేన్! పొలిటికల్ ఫ్లోలో  నువ్వలా పిలవటం బిట్ నేచుర లేగానీ.. ప్రెసిడెంటు స్పీచిక్కూడా నువ్విలాగే పాలిటిక్సూ గట్రా అంటగడితే చుట్ట తిరగేసి అంటించాలని అధర్వణ వేదంలోని అయిదో అధ్యాయంలో రాసి ఉంది. తస్మాత్ జాగ్రత్త! 


 ఎలక్షన్ రోజులు గదా.. ఏ జెండా చూసినా నీ పార్టీ ఫ్లాగే అనిపిస్తుందా? 'వందేమాతరం' అన్నా వంద ఏ మాత్రం అని వినిపి స్తుందా? సహజం. జెండా పోలుకి, పోలింగుకీ సౌండులో తప్ప మరిదేని లోనూ పోలికలేదన్న కామన్ సెన్సు కోల్పోతే రాజకీయాల్లో ఇంకెలా రాణి స్తావో బోధపడకుండా వుంది. పాలిటిక్స్ అంటే ఏంటనుకున్నావోయ్? ఆర్టాఫ్  నాట్ డూయింగ్ ఎనీథింగ్... అసలేమీ చేయకుండా అన్నీ చేస్తున్నట్లు బిజీగా వుండే కళ ! అంటే మీ అగ్గిరాముడి దగ్గర ఇంగ్లీషు దంచటమన్న మాట. మనం మీ అక్కయ్యకిచ్చే హామీలన్న మాట. పార్లమెంటులో ప్రత్యక్షంగా నోట్ల కట్టలు చూపెట్టినా అబ్బే... అదేం లేదని తేల్చేసారే. దటీజ్ పాలిటిక్స్ ! 


పండుగపూట ఈ కప్పల తక్కెడ తెరవటమెందుకంటావా! ఓకే. మేరా భారత్ మహాన్... అని ఏఆర్ రెహమాన్ వరసలో పాడు కుందామా! అలాగే కానీయ్... అదిగో... అల్ల దిగో టీవీలో మన ఆంధ్రా శకటం అందరికన్నా ముందొస్తుందే ఈసారీ! అన్నమయ్యను చూస్తున్నా అదేంటో రామలింగరాజే గుర్తొస్తున్నాడు ... సారీ.. మైబోయ్! 


వచ్చేసారికైనా మనం రిపబ్లిక్ డే పండగని ఇంతకన్నా ధైర్యంగా పబ్లిగ్గా జరుపుకోవాలని ఆశిద్దామా....


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26-10- 09) 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం శాఖాహారులు - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

శాఖాహారులు 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 ) 


పరమ భక్తులకు తప్ప దేవుళ్లు అందరికీ కనబడరు. ఆదాయానికి మించిన ఆస్తులున్నవాళ్లదీ అదే బాపతు.  ఏ ఏసీబీ దాడులో జరిగేదాకా మన మధ్యనే మహరాజుల్లా తిరుగుతున్నా వీళ్లు  మామూలు మనుషులకు కనపడరు. 


మీ ఉద్యోగానికేమండీ బాబూ మూడు పూవులూ... ఆరు కాయలూ అని యాష్టపడతారుగానీ, వట్టి పూలు ఏం చేసుకొంటాం? 


కట్టుకున్న భార్యే కాసులు వాసన చూడనిదే- తలుపు గడియ తీయని రోజులివి. నల్లపూసల నాంతాడు. ఒకటి మెళ్ళోవేసి పంపిస్తే పిల్లను కళ్ళకు అడ్డుకుని తీసుకెళ్ళే అల్లుళ్ళున్న కాలమా ఇది! కాలం అలా కాలిపోయింది. 


నాలుగు రాళ్ళు వెనకేయకపోతే మోయడా నికైనా ఓ నలుగురు ముందుకురాని కాలమిది. పచ్చనోట్లు పది ఉంటేనేగదా ఎవరి బతుకైనా ఈ రోజుల్లో పచ్చగా ఉండేది!


ఈ చరాచర సృష్టిలో సంపాదించే స్థిర చరాస్తులే మనిషికి కడదాకా మిగిలిపోయే స్మృతి చిహ్నాలు. తాజ్ మహాల్  కట్టించిన షాజహాన్ పేరును ఇప్పటికీ చెప్పుకొం టున్నాం. తరువాత తరాలవారికి ఏవో నాలుగైదు వందల కోట్ల విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు వంటివి నాలుగు పాట్లు పడి సంపాదించి పెట్టినందుకే ఇంత అల్లరి తగునా? 


ధనవంతుడి తరవాతే గదా భగవంతుడైనా! రామకోటి నోటు బుక్కు.. రూపాయల నోట్ల కట్ట పక్కపక్కనే పెట్టి ఒక్కటే తీసుకోమంటే కోటికి ఒక్కడైనా రామకోటి కోరుకుంటాడా? 


పళ్ళెంలో రూపాయి బిళ్ళ చూస్తేనేగానీ గుళ్లో పూజారయినా  మనసారా శఠగోపం పెట్టడం లేదే! ఏదో సందు దొరికినప్పుడు చాయ్ పానీకోసమని ఓ నాలుగైదువందల కట్టలు నొక్కితేనే తప్పని గగ్గోలు పెడితే ఎలా? 


ఊరకే వచ్చిందా ఈ సర్కారు ఉద్యోగమైనా? ఎన్నెన్ని దక్షిణలు, ప్రదక్షిణాలు ! 


పోనీ... పనికి ఆహార పథకమేమన్నా ప్రభుత్వాలకు కొత్తా! పాపం సర్కారైనా అంతంత మందికి ఆహారమెలా సరఫరా చేస్తుందని? ఆ ఉపాధి పథకమేదో స్వయంగా కల్పించుకుని తంటాలు పడుతుంటే దానికి ఇన్నిన్ని రాద్ధాంతాలా?


'చేదుకోవయ్యా!  మమ్మేలుకోవయ్యా! ' అంటూ పనిమీద వచ్చినవాళ్లే బల్లల కింద డబ్బు సంచులు పెట్టి బలవంతపెడుతుంటే చేదుకోకుండా చేతులు ఊపుకొంటూ కూర్చోవడం చేతగానితనం అనిపించు కోదూ! అయినా డబ్బెవరికి చేదు? చిత్తశుద్ధని చేతులు ముడుచుకు కూర్చుంటే బుద్ధిలేని మగడని తాళి కట్టించుకున్న భార్య కూడా ఎగతాళికి దిగుతుంది. 


ఏదొచ్చినా  సరే శుద్ధినీళ్లిన్ని చల్లి జేబులో  వేసుకొస్తేనే గదా- 'మా ఆయ 'బంగారం' అని భార్యామణైన మురిసిపోయేది! 


తినమరిగినవాడికి నోరు తిరగని మాట నిజాయతీ . నిబద్ధత బద్ధకస్తుల నిఘంటువు పదం. శాఖాహారులకే తప్ప శాకాహారులకు సరిపడని వ్యహారాలివి. 


జీతగాళ్లందరూ మేతగాళ్ల కాలేదు. అన్ని నోటు పుటప్పు'లకు టపుటప్పుమని నోట్ల కట్టలు రాలిపడవు. భరతఖండంబు పాడియావని ముందు కని పెట్టింది తెల్లవాడే అయినా, పాలు పితికే కళలో రాటుదేలింది మాత్రం .. ఎందుకులేండి నా నోటితో చెప్పడం బాగుండదు!


కొన్ని కొలువులంటే- అల్లాఉద్దీన్ అద్భుత దీపాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం చాతగానివాళ్ళు ఇంకా ఈ దేశంలో నూటికి ముప్ఫై అయి దుమంది ఉన్నారని అవినీతి నిరోధక్  శాఖ అనడం నిజంగా బాధ కలిగిస్తోంది. ఎలాగూ ఏసీబీ దాడులు సాగుతు న్నాయి గదా! నీతిపరుల జాబితా నిగ్గు తేల్చి వారి స్థానంలో 'మామూలు'  వాళ్లకు అవకాశం కల్పిస్తేతప్ప అంతర్జాతీయంగా మన పరువు నిలబడేటట్లు లేదు. 


స్వతంత్రమొచ్చి ఇన్ని దశాబ్దాలు దాటినా, ఇంకా ఏమిటండీ అవినీతి దేశాలు జాబితాలో మన ర్యాంకు మధ్యలో ఉండటం ! ఎక్కడైనా బావా అనుగానీ... ఆఫీసులో 'బావా అనొద్దు'  అనే నిబద్ధతున్న దేవుళ్ళే దండిగా కావాలిప్పుడు! 


అవినీతి లేనిదెక్కడ?' అని సన్నాయి నొక్కులు నొక్కగానే సరిపోదు. అది సత్యమే అనే విధంగా మనం ఎప్పటికప్పుడు చర్యలూ తీసుకుంటూ ఉండాలి గదా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 ) 





ఈనాడు - చిన్న కథ - హాస్యం - వ్యంగ్యం మీటమీద రాతలు.. రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 )


 


ఈనాడు - చిన్న కథ - హాస్యం - వ్యంగ్యం 


మీటమీద రాతలు.. 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 )


పట్టువదలని ఓటరు విక్రమార్కుడు ఆటకమీది నుంచి పాత పత్రికలని  దించి ఏ పార్టీకెక్కవ ఓట్లు, సీట్లు వస్తాయో లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. 


ఓ పత్రికలోని బేతాళుడు ' ఓటరయ్యా!  దేశమంతా ఇంకా ఎన్నికల యాగం జరుగుతూనే ఉంది. అప్పుడే నీకి  లెక్కల యావ ఎందుకు? నీలాంటి ముగ్గురు  పెద్దమనుషులు తమ పార్టీల స్కోరు తెలుసుకునేందుకు పడిన తాపత్రయం గురించి చెబుతా విను' అంటూ ఇలా చెప్పసాగాడు.


రాష్ట్రంలో రెండు దశల ఎన్నికలూ పూర్తయ్యాయి. 


తమ తలరాత ఎలా మారబోతుందోనన్న దిగులుతో నేతలకు నిద్దర కరవైపోయింది. 


ఓపిక బొత్తిగా లేని ఓ ప్రధాన పార్టీ పెద్ద నాయకుడు చీకట్లో ఓటింగు యంత్రందాకా పోయి, స్కోరు తెలుసుకుందామని మీట నొక్కబోయాడు. 


యంత్రంలోనుంచి భూతం అమాంతం బైటికొచ్చి అడ్డం పడింది. 


' ఎన్నికల కోడ్ ఉంది . మే పదహారు దాకా ఆగటం అందరికీ మేలు' అని హితవు చెప్పింది. 


' నన్నెవరూ ఆపలేదు. అపాలనుకున్నవాళ్లు అయిపు లేకుండా పోయారు. ఆపైన నీ ఇష్టం' అని బెదిరింపులకు దిగారు ఆ రాజుగారు. 


భూతం తన భవిష్యత్తునూహించుకుని స్వైన్ ఫ్లూ  వచ్చినట్లు వణికి పోయి అంది ' సరే రాజా ! ఐదు ప్రశ్నలు అడుగుతాను. నిజాయతీగా సమాధానాలు చెబితే ఈ యంత్రం నిజం స్కోరు చెబుతుంది.' 


' అడుక్కో అడిగినన్నీ  చెబుతాను.. అడగనివీ  చెబుతాను. ఐతే మీడియా మాత్రం ఉండకూడదు' అన్నారు రాజుగారు. 


' సరే సార్!  అధికారంలోకి రాగానే మీరు ముందు సంతకం చేసేది  దేనిమీద ? ఉచిత కరెంటు ఫైలుమీదా, బకాయిల మాఫీ పత్రం మీదా? ' 


' రెండింటి మీదా  కాదు.  ప్రమాణ స్వీకార పత్రం మీద' 


' నిజంగానే మీది దేవుని పాలనేనా? ' 


' జగన్ మీద ఒట్టు .  'జగన్' అంటే దేవుడునేగా అర్ధం! '


'భయమంటే ఏమిటో కూడా తెలీదా? ' 


' తెలుసు . కేవిపి  లేకుండా ఒకసారి ఢిల్లీ వెళ్లాను. చాలా భయపడ్డాను' 


చంద్రబాబు, చిరంజీవి, కెసిఆర్ ఎదురుగా ఉన్నారనుకోండి .  రెండుసార్లు


తిట్టమంటే, ఎవరిని వదిలేస్తారు? ' 


' చిరంజీవిని .. కెసిఆర్ ని ' 


గ్రీన్ లైటు వెలిగింది.


' సార్!  మీ సమాధానాలన్నీ మిషనుకి తెగ నచ్చాయి. లోపలికి పోయి మిషన్‌   మీట నొక్కండి. ఈ ఎన్నికల్లో మీ పార్టీకొచ్చే సీట్ల సంఖ్య మీకే తెలు స్తుంది. చీకటి .. జాగ్రత్త' అంది భూతం. 


లోపలికెళ్ళొచ్చిన రాజావారి మొఖం మతాబులాగా వెలిగిపోతోంది.


' కాంగ్రెస్ .. కాంగ్రెస్'  అంటూ పంచ సవరించుకుంటూ ఆ పెద్దమనిషి


అటు వెళ్లాడో లేదో భూతం ఎదుట బాబుగారు ప్రత్యక్షం. 


 అంతా చూస్తూనే వున్నాము. ఈ అన్యాయాన్నెంత మాత్రం సహించే సమస్యే లేదు. నా ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకూ... '


'బాబుగారూ అంత పెద్దమాటలెందుకు సార్ ! మిమ్మల్నీ ఓ ఐదు ప్రశ్నల


అడుగుతాను. మనసులోని మాట మాత్రమే చెప్పండి! ' 


వ్యూహాత్మకంగా ముందుకడుగు వేసింది భూతం.


' మేము సిద్ధం. మరి మీడియావారు సిద్ధంగా ఉన్నారా?' 


' వస్తారుగానీ.. ముందీ ప్రశ్నకు జవాబు చెప్పండి!  పులిరాజావారికి  ఎయిడ్సొస్తుందా? ' 


' కచ్చితంగా వస్తుంది. పులివెందుల రాజావారికి రోజుకి కోటి రూపాయల ఎయిడ్ వస్తుందని  మేం రికార్డులతోసహా ప్రూవుచేయటానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేసుకుంటున్నాను'


' సార్, సార్! అడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పాలి. మీ రెండో ప్రశ్న . 


' రాజశేఖరరెడ్డి'  నారా.... అంటే మీరు, నారాయణ, రాఘవులు, కె. చంద్రశేఖర రావు..  వీళ్లల్లో కామన్‌గా వున్నది ఏది? చిరంజీవిలో లేనిది ఏది? స్పష్టతా? అనుభవమా? రెండూనా? ఇంకేమన్నానా? ' 


' అన్నీ. అన్నింటికన్నా ముఖ్యమైనది ' రా ' అనే అక్షరం .. అని మన .. 


' .. అర్జంటుగా జవాబు చెప్పండి! బాలకృష్ణ మీ పార్టీలోనే ఎందుకు చేరాలి? ' 


' కాంగ్రెసులో చేరితో  వట్టి  కృష్ణ. ప్రజారాజ్యంలో చేరితే మెంటల్ అవుతాడు.  కనక ' 


కలరు టీవీ, తెలంగాణా,  మూడో కూటమి.. ఈ మూడింటినీ ఒక్క వాక్యంలో చెప్పండి! ' 


' కొంచెం ఇష్టం.. చాలా కష్టం'


' ఎవరు అధికారంలోకొచ్చినా ఏమీ చేయలేనిది ఏది?' 


' హైదరాబాదులో ట్రాఫిక్ కంట్రోల్' 


గ్రీన్ రైటు వెలిగింది. 


భూతం నోరు విప్పేలోగానే ' తెలుసు.  ఆ చీకట్లోకి పోయి మిషనెక్కాలి. మీట నొక్కితే మా పార్టీ కొచ్చిన సీట్ల సంఖ్య తెలిసిపో తుంది. అంతేగదా! ' అంటూ లోపలికెళ్ళి క్షణంలో బైటికొచ్చేశాడు బాబుగారు .. రెండు చేతులూ గాల్లోకెత్తి రెండేళ్ళు అపకుండా ఆడించేస్తూ. 


దబ్బుమని శబ్దం. 


భూతం ఎదురుగా మెగాస్టార్. '  సారీ:. ' మార్పు'  కోసం గోడ దూకి వచ్చా . నేరుగా మేటర్లోకొచ్చేద్దాం. కమాన్ ; విసురు నీ మొదటి ప్రశ్న!  ఇరగదీస్తా! '  


భూతం భయాన్ని దాచు కుంటూ అడిగింది.


'మీద బిసి పార్టీనా? ఏసి పార్టీనా? ' 


'మనలో మన మాట. బైట బి. సి .. లోపల ఏ.సి . నెక్స్ట్  క్వశ్చన్? ' 


' సీఎం అయితే ముందు మీరు చేసే ఘనకార్యమేంటి? ' 


'  సింగిల్ టేకులో ప్రమాణస్వీకారం చించేస్తా' 


' వైయస్ పాలన స్వర్ణయుగమా? ' 


' యస్ ఇసకతో కూడా బంగారంలాగా బిజినెస్ చేసేశారు గదా! ' 


' రైలు ఇంజను గుర్తు దేనికి గుర్తు? అది రాకపోతే మీ ఆల్టర్నేటివ్ గుర్తు? 


' రైలు . ఆల్వేస్ లేటుకి. అందుకే లేటుగా వచ్చింది మా పార్టీ . నీ రెండో ప్రశ్నకు జవాబు వీణ ' 


' సమాధానాల్లో స్పష్టత లేదే! ఓకే!  మీ పార్టీలో నెంబరు వన్ మీరా? మీ అరవిందా?' 


'నేనే' అంటూ ముఖం ముసుగు తీసేశాడు అరవింద్. '  సారీ! ప్రచా రంలో మా బావ గొంతు జీరపోయింది. అందుకే నేనొచ్చింది' అంటూ భూతం చెప్పకముండే చీకటి గదిలో కెళ్ళి వచ్చాడు. 


అంత చీకట్లోనూ. అతని ముఖం వెలిగిపోతోంది.


--- 


' ఓటరూ కథ విన్నావు కదా ! రాజావారికీ , చంద్రబాబుకూ,  చిరంజీవికీ .. ముగ్గురికీ ఓటింగ్ మిషన్‌ 160.. 160.. 160 .. చూపించింది . అసెంబ్లీలోని మొత్తం సీట్లు 234. మూడు పార్టీలకూ కలిపి నాలుగొందల ఎనభై ఎలా వచ్చాయి? సమాధానం తెలిసీ చెప్పకపోయావో బియ్యం ధర కిలో ఇంకో ఇరవై రూపాయలు పెరిగినంత ఒట్టు! ' అంది భూతం బెదిరింపుగా,


'ఇందులో తెలీకపోవటానికేముంది? వాళ్ళు చీకట్లో నిద్రమత్తులో ఎక్క నొక్కిన మిషన్ డమ్మీ ఓటింగు యంత్రం . పాల్‌ గారొచ్చినా , జేపీగారొచ్చి ఎక్కి నొక్కినా, బిజెపి ఎక్కి నొక్కినా ..  అది చెప్పే జవాబు ఒక్కటే. నూటఅరవయ్యే!  


' మే పదహారు తరువాత బైటపడేదే ఒరిజినల్ ఓటింగ్ తేల్చే స్కోరు '  అన్నాడు ఓటరు. 


బేతాళుడు  మళ్లీ పాత  పేపర్లో దూరేశాడు! 


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 ) 


ఈనాడు - సంపాదకీయం ప్రాణభయానికి పగ్గాలు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 )

ఈనాడు - సంపాదకీయం 


ప్రాణభయానికి పగ్గాలు 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 


దుఃఖాలలో  కెల్లా  మరణం భయంకరమైంది. 'మరణమను లేతనుడి చెవింబడినయంత/ దలిరు గాలికి శుష్క పత్రమువోలె' గడగడ వణకడం- మానవ బలహీనత. 'మనుజుడై పుట్టి మనుజుని సేవించి/ అనుదినమును దుఃఖమందనేలా? ' అని అన్నమాచార్యుల వంటి మహానుభావులు ఎందరు ఎన్ని వందలసార్లు వేదాంతాలు వల్లించినా ప్రాణంమీది తీపి  అంత తొందరగా పోయేది కాదు. నది, సముద్రం కడకు ఒకటే అయినట్లు కాలప్రవాహానికి జీవితం, మృత్యువు రెండు పాయలు. చనిపోవడం అంటే ఉచ్ఛ్వాస  నిశ్వాసాలు, కాల పంజరం నుంచి శాశ్వతమైన ముక్తి పొందడం- అంటాడు ఖలీల్ జిబ్రాన్. ఎవ రెన్ని సుద్దులు చెప్పినా గడిచిపోయే ప్రతిక్షణం కాలవాతావరణ కేంద్రం మరణమనే తుఫానుకు హెచ్చరికగా ఎగరేసే ప్రమాద కేతనం సంఖ్యను పెంచుతూనే ఉంటుందన్నది మనిషి దిగులు. రేయింబవళ్లు చీకటి వెలుగులు, ఇంటాబైటా, ఏ జీవీ, ఏ యుద్ధం, ఏ ఆయుధం తన మరణ కారణం కారాదని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని  వరం కోరింది ఈ మృత్యుభీతితోనే.  ఆ మరణభయంతోనే మార్కండేయుడు మారేడు దేవుడి శరణుజొచ్చాడు. మహాసాథ్వి సావిత్రి సాక్షాత్ సమవర్తినే బురిడీ కొట్టించింది. భర్త ఆయుష్ చంద్రికలను మృత్యుకేతువు మింగేసిందని  దేవతల చిరాయువు కోసం కచుడు పడిన ఆరాటమే మృతసంజీవనీ విద్య కధ. అమరత్వ సిద్ధికి జాతివైరం కూడా మరచి సురాసురులు క్షీరసాగర మధనానికి పూనుకొన్నారు. దేవదానవులదాకా ఎందుకు- ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే కాకులూ తమలో ఒకటి పడిపోతే కావు కావుమని గగ్గోలు పెడతాయి. జీవరాశులన్నింటిలోకీ తనది అత్యున్నతమైన జన్మ అని నమ్మే మనిషిని జీవితం మిథ్య అనుకొమ్మంటే అంగీకరిస్తాడా? పోయినవాడూ తిరిగి ప్రాణాలతో వస్తాడేమోనన్న ఆశతో గ్రీకులు మూడురోజులు, రోమన్లు ఏడురోజులు శవజాగారం చేసేవారు. పార్థివదేహం ప్రాణం పోసుకుంటుందేమోనన్న చివరి ఆశతో దింపుడు కళ్ళెం  పేరిట మహాప్రస్థానం వేళా మృతుడిని ఆత్మీయులు ముమ్మార్లు పేరుతో పిలిచే ఆచారం మనది. 'కన్ను తెరిస్తే జననం/ కన్ను మూస్తే మరణం/ రెప్పపాటే కదా ఈ పయనం' - అని తెలిసినా ఈ ప్రయాణం నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకోవడమే జీవనపోరాటం. ఆ ఆరాటమే మృత్యుంజయత్వంపైకి మనిషి దృష్టిని మళ్ళించింది.


ఆరాటం ఆలోచనాపరుణ్ని విశ్రాంతిగా ఉండనీయదు. ఖాళీ గిన్నెను ముందేసుకుని డీలా పడేవాడే అయితే, పొయ్యిమీది గిన్నె మూతను కదిలించిన శక్తితో మనిషి ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించగలిగేవాడు కాదు. సుఖంకోసం వెంపర్లాటే లేకపోతే ఇంకా పక్షి ఈక లను చెట్టు మానులనుంచి స్రవించే ద్రవంలోనే ముంచి తాళపత్రాల మీద గిలుకుతుండేవాడు. ఆరుద్ర ఒక చిత్రంలో చెప్పినట్లు- మాన వుడు శక్తియుతుడు, యుక్తిపరుడు. దివిజ గంగను భువికి  దింపిన భగీరథుడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుడు. 'ఎంత లెక్క తిరిగినా నేమి లేదురా/ చింత చేసి చూడకున్న వింతలేదురా' అంటూ వీరబ్రహ్మేంద్రస్వామి తత్వాలు పాడారు. నిజం. ఆ కాల జ్ఞాని ప్రబోధించినట్లు- మూల మూలలా శోధిస్తేనే ముక్తి ఆ మూల నున్న జ్యోతిని ముట్టిస్తేనే బతుకులో వెలుగు.  అది తన ప్రాణజ్యోతి  అయినప్పుడు అది అఖండంగా కాంతులీనుతుండాలని మనిషి కోరుకోవడం అత్యాశ కాదుగదా! శరీరం శిథిలమైపోయింది. జుట్టు నెరిసిపోయింది. పళ్లన్నీ ఊడిపోయి నోరు బోసిపోయింది. వృద్ధుడై కర్ర సాయంతో నడుస్తున్నాడు. అయినా జీవితేచ్ఛ మనిషి శరీరాన్ని విడవడం లేదు' అని సంస్కృతంలో ఒక శ్లోకముంది. శాస్త్రవేత్తలూ తమ వంతు కర్తవ్యంగా చావు  పుట్టుకల గుట్టుమట్లను ఇప్పుడు శాస్త్రీయంగా బట్టబయలు చేసే కృషిలో తలమునకలుగా ఉన్నారు.


ఆజన్మ బ్రహ్మచారి నారదుడు ఒకసారి జన్మ రహస్యాన్ని గురించి 'ప్రారంభాది వివేకమెవ్వ డొసగుం! ప్రారంభ సంపత్తి కాధారం బెయ్యది! / యేమిహేతువు? ' అని అడిగాడట. మనిషి   దేవాంతకుడు   కదా! అందుకే 'సర్వానుసం/ధానారంభ విచక్షణత్వమ' నే      జీవరహస్యం అంతుచూసి కాలాంతకుడిగా మారాలని కంకణం కట్టుకున్నాడు. జన్యువుల కోడ్ తిరగరాయడం ద్వారా జరామరణాలను నియంత్రిం చవచ్చన్నది ఆధునిక విధాత  సిద్ధాంతం. ఇటీవలి టైమ్స్ పత్రిక ముఖచిత్ర కథనం ప్రకారం- కంప్యూటర్ పరిజ్ఞానం, బయోటెక్నాలజీ లను జోడించడం ద్వారా జీవి ఆయురారోగ్యాలను కోరుకున్న విధంగా పొడిగించుకోవడం సాధ్యమే. సింగ్యులారిటీ విభాగంలో ప్రసిద్ధులైన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త రేమండ్ కర్జల్, బ్రిటిష్ బయాలజిస్ట్ అట్రే డి గ్రే మరో రెండు దశాబ్దాల నాటికి మానవ మేధను మించిన సూపర్ కంప్యూటర్లు రంగప్రవేశం చేస్తాయంటున్నారు. వాటి సాయంతో మానసిక చైతన్యాన్ని చిప్స్ రూపంలోకి మార్చుకోవచ్చని చెబుతున్నారు. నానోటెక్నాలజీ సాయంతో ఈ చిప్సు ను  మనిషి మెదడుకు అనుసంధానిస్తే శరీరంలో అంతర్గతంగా ఏర్పడే రుగ్మతల మూలాలను ఆదిలోనే పసిగట్టి సరిచేసుకోవచ్చని ఆ శాస్త్రవేత్తల భావన. పరిశోధనలు ఫలిస్తే మనిషి మృత్యువును జయించడానికి మరో మూడు దశాబ్దాలకు మించి సమయం పట్టకపోవచ్చని ఆశ. 'అన్నా! చావనని నమ్మకం నాకు కలిగింది/ చావు లేదు నా' కని కవి తిలక్ లాగా జనం ఎలుగెత్తి చాటే రోజులు నిజంగానే రాబోతున్నాయేమో! తేనెలేని తేనెపట్టు లాగా మనిషి మారకుండా ఉంటే చాలు. చావులేని ఆ లోకం నిజంగానే అప్పుడు నేలమీదకు దిగివచ్చిన నాకంలాగా వెలిగిపోదూ!


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 

Monday, December 20, 2021

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈనాడు - గల్పిక అమ్మకు వందనం రచన- కర్లపాలెం హనుమంతరావు ( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం )


 


అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా 

ఈనాడు - గల్పిక


అమ్మకు వందనం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం ) 


ప్రేమకు తొలి చిరునామా అమ్మ! తల్లి ఒడే శిశువుకు మొదటి గుడి .. బడీ . 'మాతృదేవోభవ'  అని తైత్తరీయం సూక్తి,


ఎవ్వనిచే జనించు జగము.... అంటూ సందేహపడిన జీవుడు- పరమేశ్వరుడే ప్రాణాధారానికి మూలకారణమని సమాధానపడినా ఆ వ్యక్తి శక్తిని మాతృమూర్తిలో  సంభావించుకున్నదాకా సంతృప్తి చెందలేకపోయాడు.


ప్రపంచంలోని ఏ దేశంలోనూ... తల్లినీ, దైవాన్నీ వేర్వేరుగా చూడటం లేదు. పరివ్రాజకుడు పరమహంస కాళిని 'మాత' అని తప్ప సంభావించలేదు. గొప్ప తల్లి లేనిదే గొప్ప బిడ్డ ఉండే అవకాశం లేదు. అవతారపురుషుడు శ్రీరామ చంద్రుడిని  ' కౌసల్యా సుప్రజా రాముడ'ని విశ్వామిత్రుని వంటి జ్ఞాని సంబోధించడం వెనక ధర్మమర్మమిదే!


భక్తుల కోసం భగవంతుడు ఎత్తిన అవతారాలు పది. పిల్లలకోసం తల్లి ఎత్తే అవతారాలు కోకొల్లలు. బిడ్డకు అమ్మ నడిచే ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్.  లోకంలోని నవ రత్నాలు, మణిమాణిక్యాల పోగునొకవైపు పేగుబంధాన్ని మరో వైపు ఉంచి ఒక్కదాన్నే ఎంచుకోమంటే ఏ తల్లయినా మొగ్గు చూపేది తన కడుపుపంట వైపే !


ఏటికేడు ప్రపంచ వింతలు మారిపో వచ్చు - కానీ తల్లి ప్రేమ మాత్రం సృష్టి ఉన్నంతవరకూ చెక్కు చెదరకుండా సాగే అద్భుతం. భువనభాండాలను చిన్ని నోట చూపిన కృష్ణమాయ సైతం యశోదమ్మ పుత్ర వాత్సల్యం ముందు తన్మయత్వంలో తేలిపోయింది. త్రిలోక పాలకులను చంటి పాపలుగా మార్చిన అనసూయ అమ్మ కథ సర్వలోక విదితం. తను కన్న బిడ్డనే ' ననుకన్న తండ్రీ! నా పాలి దైవమా!' అని పలవరించేదాకా వామనుడి తల్లి ప్రేమ పొంగులు వారిందంటే వింతేముంది? అగాధాల అడుగులనైనా తడిమి చూడగలమేమోగాని అమ్మ ఆత్మీయానురాగాలకు పరిధులు వెదకడం ఎవరి తరం? మైత్రీధర్మాన్ని బుద్ధ భగవానుడు తల్లిప్రేమతో పోల్చి చెప్పింది ఎల్లలెరగక పారే ఆ వైశాల్యం  వల్లే! తల్లిలేని పాప రెప్పలేని కంటిపాప.  పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో అమ్మలేని ఆదిదే

వుడి దయనీయస్థితిని బెజ్జమహాదేవి ద్వారా కళ్ళకు కట్టించాడు. ' తల్లి గల్గిన పేల తపసిగానిచ్చు / తల్లి కల్గిన ఏల తలజడల్గట్టు? / తల్లియున్న విషంబు ద్రావనేలనిచ్చు/- అంటూ సాంబయ్యనే తన సంతుగా భావించి ఆ పిచ్చి తల్లి తల్లడిల్లిపోయింది. అమ్మ విషయంలో మనిషి దేవుడికన్నా అదృష్ట జాతకుడనే చెప్పాలి. అందుకేనేమో 'అమ్మ ఒక వైపు... దేవతలంతా ఒకవైపు ఉన్నప్పటికి  తాను అమ్మ వైపే మొగ్గుతానని ఓ కవి తన భావోద్వేగాలను చాటుకున్నారు. అమ్మతనంలోని కమ్మదనానికి నిలు వెత్తు ధనాలూ దిగదుడుపే. 'శివరాత్రి యాత్రకై శ్రీశై లమెడుతుంటే/ అమ్మమ్మ మారుపడ అమ్మ ఏడుస్తుం టె/ అదిచూచి నవ్వానురా దైవమా, అనుభవిస్తున్నా నురా!' అని కన్నతల్లి మీద గత శతాబ్దారంభంలోనే ఓ కవి స్మృతిగీతం ఆలపించాడు . 'అరువది యేండ్లు నాదగు శిరోగ్రమునెక్కిన తల్లి కంటికిన్/ జిరతను గాకపోనియది.. విచిత్రము' అంటూ జాషువా వంటి కవికోకిల గళమెత్తి మాతృస్తోత్రం చేశాడంటే ఆ మహాత్మ్య మంతా మాతృత్వా నిదే.  తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి తల తెగనరికినా, ఆ తల్లే తిరిగి సజీవంగా రావాలని భార్గవ రాముడంతటి అవతారమూర్తి కోరుకున్నాడు.  మాతృమూర్తిత్వంలో అంత  ఉదాత్తత ఉంది. 


సృష్టిలో అతిపెద్ద ఉద్యోగం అమ్మగిరీ! తరగని పిల్లల ప్రేమానురాగాలే ఆమెకు జీతభత్యాలు. ' పిల్లల్ని పెంచడంకన్నా సర్కస్ కంపెనీ నడపటం సులభం' అంటాడో రచయిత. నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి పోషించిన బిడ్డ ఈ లోకం నుంచి అర్ధాంతరంగా తప్పుకొంటే తల్లిగుండె ఎంతగా తల్లడిల్లుతుందో చెప్పనలవి కాదు. 'కన్నబిడ్డ ఒంటిమీదేకాదు, ఆత్మమీద కూడా సంపూర్ణాధికారం జన్మదాతదే' అన్నారు శంకరాచార్యులు. సన్యాసం పుచ్చుకునేముందు తల్లి అనుమతి తప్పనిసరి అని చెబుతుంది శాస్త్రం.


ఏ బాధకలిగినా అమ్మను తలచుకుని ఉపశమనం పొందే బిడ్డకు- ఆ తల్లికే బాధ కలి గించే హక్కు ఎక్కడిది ? తన కడుపు నలుసు లోకం కంటిలో నలుసుగా సలుపుతుంటే ఏ తల్లి మనసూ ప్రశాంతంగా ఉండదు. పెరుగు తున్న వ్యాపార సంస్కృతిలో అమ్మడానికీ, కొన డానికి ఈ భూమ్మీద ఇంకా అతీతంగా ఏదైనా ఉన్నదంటే , అది అమ్మ ప్రేమ మాత్రమే ! 


అమ్మ పట్ల క్రమంగా పెరుగుతున్న నిరాదరణ మానవతకే మాయని మచ్చ.  ఇప్పుడు పెరగవలసింది వృద్ధాశ్రమాల సంఖ్య కాదు. వృద్ధులైన తల్లిదం డ్రులమీద బిడ్డల శ్రద్ధ.  పూలు, పున్నములు, సూర్యోదయాలు, ఇంద్రధనుస్సులు- సృష్టిలోని అందమైన వస్తువులన్నీ సముదాయాలుగానే లభ్యమవుతాయి. ఒక్క అమ్మ మాత్రమే మినహాయింపు. 


ప్రేమకు తొలి చిరునామానే కాదు, చిట్టచివరి చిరునామా సైతం అమ్మే! అంతరించిపోయే జాతుల జాబితాలోకి అమ్మ చేరిపోకుండా జాగ్రత్తపడవలసిన అగత్యాన్ని గుర్తించాలి నేటితరం . 


ఏటా జరుపుకునే అంతర్జాతీయ మాతృ దినోత్సవాలైనా  ఆ సత్సంకల్పానికి ప్రేరణ కలిగిస్తే అమ్మ జన్మకు అంతకుమించిన సార్ధక్యం ఏముంటుంది?


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక ' ఆత్మ' కథ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 )


 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక

' ఆత్మ' కథ


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 ) 


ప్రతిదానికి, ప్రతివాడూ ప్రతివాడినీ ఆక్షేపించాడు ఎక్కువయి 

పోయిందీ మధ్య మన రాజకీ యాల్లో. 


 ఆ మాటకొస్తే రామాయణంలో కూడా  రాముణ్ని అందరూ దేవు డని కొలిచిందీ లేదు. శంభూకుడు, మంధర, కన్నతల్లికన్నా మిన్నగా చూసుకున్న కైకేయి, కాకి, రజకుడు- రాముణ్ని ఈసడించిన సందర్భాలున్నాయి. 


మందిసొమ్ముతో మందిరాన్ని కట్టించి, కారాగారంపాలైన కంచెర్ల గోపన్న- 'ఎవ డబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!' అంటూ నిలదీశాడు. 


ఆత్మను కూడా ఆ శ్రీరాములవారిలా భావించే సంప్రదాయం మనది. అంతలావు రాములవారే అంతలేసి నిందలుపడగా లేనిది... అంతరాత్మకు మాత్రం మినహాయింపు ఎందుకు ఉంటుందీ! అందులోనూ రాజకీయరంగంలో!


అసలు ఆత్మలకు అంతలేసి రాజకీయాలు అవసరమా అనే ప్రశ్న ఉండనే ఉంది. ఇందిరమ్మే ఆ రోజుల్లో వి.వి.గిరిని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించడానికి 'అంతరాత్మ'ను తట్టిలేపుకొచ్చింది. 


ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని అనుకున్నప్పుడల్లా నేతలు ఉద్యమాలు చేశారు. ఓదార్పు యాత్రల పేరుతో ఊరేగింపులూ చేస్తున్నారు.


కొంతమంది మంత్రులైతే ప్రమాణ స్వీకారం సందర్భంలో దేవుణ్ని, రాజ్యాంగాన్నీ తోసిరాజని ' అంతరాత్మ'  సాక్షిగా ప్రమాణాలు చేస్తుంటారు. అంటే అర్ధమేమిటి? అంత రాత్మ రాజ్యాంగేతర శక్తేనని బహిరంగంగానే ప్రకటించటమేగదా! దేవుడికన్నా అంతరాత్మే గొప్పదని అర్థంకదా? ఒకవిధంగా ఆ రెండు ముక్కలూ నిజమేనేమో!


దేవుడు అన్నీ చూస్తుంటాడు. వింటుంటాడు. కానీ పెదవి మాత్రం విప్పుడు. కాబట్టి వికీలీక్సుకిలాగా భయపడాల్సిన పని ఉండదు. వీలున్నప్పుడు విరాళాలు ప్రకటించుకుంటే చాలు.. వ్యవహారం సరళమైపోతుంది. 


అంతరాత్మతో వ్యవహారం అల్లా చెల్లదు . గమ్మున ఊరుకోదు, గోల పెడుతోందని దానిచేత గోడ కుర్చీ వేయించలేం. అంతరాత్మ క్షోభ పడలేకే అంతలావు ధర్మరాజూ 'అశ్వత్థామ హతః కుంజరః' అంటూ అబద్ధంలాంటి నిజం చెప్పాల్సి వచ్చింది. ఇక దాని గోల తట్టుకోవడం మామూలు మనుషులు తరమయ్యే పనేనా? 


ఆత్కక్షోభను తట్టుకోలేకే కొంతమంది టికెట్టిచ్చి గెలిపించిన పార్టీకి 'రాం రాం' చెప్పేసి, పనులు చేసి పెట్టే పక్షంలోకి టైం చూసి ఠక్కుమని గెంతేస్తుంటారు. సంతకాలు లేని రాజీనామాలు సభాపతులకు పంపుతుంటారు. 


తప్పుడు పనులు చేస్తున్నప్పుడు చప్పుడు కాకుండా చూస్తూ కూర్చునుండే అంతరాత్మ- ఆ దొంగతనాలు గట్రా  ఏ స్ట్రింగ్ ఆపరేషన్లో ఆపరేషన్లోనో బయటపడగానే క్షోభిం చడం మొదలు పెడుతుంది. నాన్ బెయిలబుల్ వారంట్లు రాకుండా నానాతంటాలు పడుతుం టుంది. దొంగ గుండె నొప్పులు చెప్పి ఆసుపత్రి పడకలమీద వేడి తగ్గిందాకా ముసుగుతన్ని పడుకోవాలని చూస్తుంది. 


ఆత్మలూ దేహాలూ ఒకటిగా మసిలి వ్యవహారాలు ఎన్ని సాగించినా, కాలం చెడి దేహం దూరమైతే- పాడు 'ఆత్మ పడే క్షోభ ఆ పరమాత్ముడికైనా అర్ధం కాదు! 


ఆత్మ కాలదు, చిరగదు, నల గదు, తడవదు, మాయదు .. అంటూ గీతలో పరమా త్ముడు ఎంతగా ప్రబోధించినా... ఆత్మకూ ' కాలే' సందర్భాలు కొన్ని ఉంటాయి. గిట్టనివాళ్లు తిట్టిపో స్తున్నప్పుడు అలిగి ఆ ఆరోపణలు అబద్ధమని తేలేంతవరకు తిరిగి దేశంలోకి కాలు పెట్టనని శపథాలు  చేస్తాయి. అయినా, ఆత్మలకు కాళ్లుంటాయా అని అడగద్దు . 


రావణ వధ అనంతరం పట్టాభిషిక్తుడైన రాములవారు భక్తజనులకు వరప్రదానాలు చేయాలనుకుని సతీసమేతంగా కొలువయ్యారట. భక్తులను క్రమబద్దీకరించే బాధ్యత హనుమంతులవారికి అప్పగించారు. వరాలు కోరడానికి జనా లెవరూ రాములవారిదాకా రావటంలేదు! ఒకటీఆరా వచ్చినా, వట్టి నమస్కారాలు పెట్టేసిపోతున్నారు! విషయం విచారించమని లక్ష్మణస్వామిని  పురమాయించారు సీతమ్మవారు. మరిది చెప్పిన మాటలు వినగానే ఆమెకు కోపమొచ్చింది. అడిగిన వారందరికీ హనుమంతుడే వరాలిచ్చి అటునుంచి అటే పంపేస్తున్నాడట' ఆవాటా అంటూ . శపించ బోయిన భార్యను వారించి, ఆనక ఆంతరంగికంగా అసలు రహస్యం బైటపెట్టారు శ్రీవారు. 'వచ్చిన వారు కోరదగినవి, కోరదగనివీ అడుగుతుంటారు. ప్రసాదిస్తే ఒక ఇబ్బంది. ప్రసాదించకపోతే మరో ఇబ్బంది. అందుకే, ఆ పాపపుణ్యాల భారం నేనే హనుమ మీదకు వదిలేశాను. హనుమ నేను వేరువేరు కాదు. నేను దేహమైతే... అతడు నా ఆత్మ' అని సెలవిచ్చారు. ఈ పురాణం ఎంతవరకు పుక్కిటిదో చెప్పలేంగానీ, ఈ మధ్యదాకా మనమధ్య ఒక 'మహానేత, ఆయన అనుంగు దూత రామ హనుమల మాదిరిగా మసిలిన మాట మాత్రం నిజమే కదా! 


ఇప్పుడా రాంబంటునే 'గుండెలుతీసిన బంటు' అంటున్నారు. వెంటనే ఉద్వాసన పలకవలసిందే' నంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఇది సాధ్యమా! 


అప్పాజీలేని రాయల రాజ్యం ఉంటుందా? చాణక్యులవారిని చంద్ర గుప్తుడు- ఛీ ... పొమ్మని చీదరించుకోగలడా?


ఆత్మ అంటే శరీరానికి సలహాదారే కదా! దేహం తిరిగిన దారులన్నీ అంతరాత్మకు కొట్టిన పిండైనప్పుడు- ఆ అంతరాత్మను అంత తేలికగా వదిలించుకోవడం వీలయ్యే పనేనా? తల్లిపేగుతో బంధం పుట్టినప్పుడే తెగుతుందిగానీ, అంతరాత్మతో సంబంధం పుడకల తరవాత కూడా  పోయేది కాదు. 


అన్ని తలలున్న రావణా సురుడు సలహాలు చెప్పే తమ్ముణ్ని దూరం చేసుకున్నందుకు ఏ దుర్గతి పాలయ్యాడో తెలిసి, ఏ కొత్త ప్రభుత్వమూ పాత సలహాదారుల్ని అంత తొంద రగా వదిలించుకోదు. వదిలించుకోలేదు. 


ఇన్ని చెబుతున్నారు... జీతంబత్తెం లేకపోయినా పక్కన చేరి ఊరికే సలహాలిస్తోందని ఎవరైనా జీతం మొత్తం నొక్కేస్తున్న జీవిత భాగస్వామికి విడాకులి స్తున్నారా? ఇదీ అంతే! 


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 ) 


ఈనాడు హాస్యం - వ్యంగ్యం స్త్రీ సూక్తం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 07-03-2009)


 


ఈనాడు హాస్యం - వ్యంగ్యం 

స్త్రీ సూక్తం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-03-2009) 


'న స్త్రీ  స్వాతంత్ర్య మర్హతి' అన్నవాణ్ని ఇస్త్రీ చెయ్యాలి అంది మా ఆవిడఇంటి దుస్తులు  ఇస్త్రీ చేస్తూ కసిగా.  


చలంగారి పుస్తకమేదో చదివినట్లుంది. ముందామెను చల్లబరచడం ముఖ్యం.


' మొన్నీమధ్యే కదంటోయ్ మన ఏఆర్ రెహమాన్ ఆస్కారందుకుంటూ ' మా! తుఝే సలామ్' అన్నాడు. మన చిరంజీవి తిరుపతి సభలో తన తల్లిని ఎన్నిసార్లు తలచుకున్నాడూ! మనదేశంలో ఆడాళ్ళకు దక్కే మంచీమర్యాద మరెక్కడా  దొరకదు తెలుసా?' అన్నాను.


'మర్యాదా, మన్నా! పబ్బులో పడి ఆడపిల్లలకు పబ్లిగ్గా బడితెపూజ చేశారే మీ మగాళ్ళూ!  ప్రెస్ క్లబ్బులో ' లజ్జ ' రాసినావిడను తరిమి తరిమి కొట్టలేదూ! ప్రేమించలేదంటే యాసిడ్ పోస్తారూ! పార్కులో తిరిగే పిల్లలకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారూ! పుట్టేది ఆడబిడ్డని తెలిస్తే అబార్షన్లు చేయిస్తారు. అదనంగా కట్నం తేలేదని కిరోసిను పోసి కాల్చే కిరాతకులండీ మీ మగాళ్ళూ!' 


'అదేంటోయ్! ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ- అని రాసినాయన మగాడే కదా! కంటే కూతుర్నే కనాలి... పెళ్ళాం చెబితే వినాలి అని సినిమాలు తీసిన వాళ్ళు ఆడాళ్ళా?  ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవుళ్ళు సంచరిస్తారు అని కదా మన పెద్దాళ్ళు అన్నారూ!'


'ఆ దేవుళ్ళ సంగతే చెప్పాలి... ఒకాయన పెళ్ళాన్ని అడవులకు  తోలేశాడు. ఇంకోదేవుడు ఆడాళ్ళ బట్టలు కాజేశాడు. వేలాది పెళ్ళాలుంటే మగాళ్ళకు గొప్ప అప్పు తీర్చటానికి ఆలిని తాకట్టు పెట్టాడా హరిశ్చంద్రుడు. మగాడికి ముక్కోటి దేవ తలుంటే, ఆడదానికి అదనంగా ప్రాణంమీదకింకో దేవుడు... పతిదేవుడు. ఆడది వాడికి పనికి దాసి... సలహాకి మంత్రి... భోజనానికి తల్లి.. పడకకి రంభ-  అలాపడుండాలని చెప్పిన ఆ పెద్దాళ్లు మగాడు ఆడదానితో ఎలా మసలుకోవాలో మాత్రం చెప్పారు కాదు.' 


' ఎందుకు చెప్పలేదు? '


' తల్లో పూలున్నాయని తలలో గుజ్జులేని ఫూల్నేం కాదు. జడేసుకున్నంత మాత్రాన జడపదార్ధమైపోలేదు నేను. చట్టసభల్లో మీ మగ ఎంపీలు చేసే రభస మాకర్థం  కాదనుకోవద్దు. మా జుట్లు ముడేసుకుంటూ పోతే భూగోళాన్ని మూడుసార్లు చుట్టి రావచ్చు. అయిదొందల పైచిలుకుండే పెద్దసభలో మహిళా ఎంపీలు అయిదు పదులకు మించి లేరు. ఆకాశంలో సగమంటారు. భూమ్మీద అంగుళం చోటివ్వరు. మూడోవంతు రిజర్వేషన్లకోసం మా ఆడాళ్ళు బిల్లు పెట్టమంటే మీ మగ ఎంపీలంతా కలసి ఆడిన ఆట ట్వంటీ20 కన్నా ఉత్కంఠగా సాగింది. ఈ ఇరవైఒకటో శతాబ్దిలో జాకెట్లు చేసుకొనే హక్కుకోసం అడవుల్లో ఆడాళ్ళు గోడుపెడుతున్నారండీ! రాకెట్లో ఆడాళ్ళు చంద్రమండలం దాకా వెళ్లొస్తున్నారని చంకలు గుద్దుకుంటే సరా ! స్త్రీ హింసకు పాల్పడే దేశాలింకా నూటముప్పైదాకా ఉన్నాయని..  అందులో మనది వందోదని లెక్కలు చెబుతున్నాయయ్యా మహానుభావా! '


' ఇంటిపని మానేసి ఇలాంటి కాకిలెక్కలు తీస్తూ కూర్చున్నావా? ' 


' నేనింట్లో ఒకరోజు చేస్తున్న పని మూడు గాడిదలు వారం రోజులు చేసే చాకిరికి సమానం. మీరాఫీసులో ఫేనేసుకుని నిద్దరోతూ చేసే పని ప్రకారం చూస్తే నా జీతం ఈ ఇంటి ఖరీదుకన్నా రెట్టింపు ఉంటుంది. నీళ్ళకోసం, రేషన్ కోసం , పిల్లల బడికోసం, నేను నడిచే దూరానికి రథం ముగ్గేసుకుంటూపోతే ఎవరెస్టు శిఖరం రెండుసార్లు ఎక్కి దిగి రావచ్చు. ' 


' నిజం చెప్పద్దూ... నాకూ ఇంక రోషం ఆగలేదు.' 


' ఇందాకట్నుంచీ వింటున్నా. ఏదేదో అంటున్నావు. ఇందిరాగాంధీని ప్రధాని చేసింది మేమే . మదర్ థెరెసా మా దగ్గరికొచ్చిన తరువాతే సెయింటయింది. అటు అనీబిసెంటు, విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు నుంచీ ఇటు సోనియాగాంధీ, జయలలిత, మాయావతి దాకా అందరూ ముఖ్యులూ, ముఖ్యమంత్రులూ అయింది మా మగ జమానాలోనే! అరబ్ దేశాల్లో మొన్నటిదాకా ఆడాళ్ళకు ఓటుహక్కు ఉండేది కాదు. మన దగ్గర ఒక మహిళ రాష్ట్రపతి కాగలిగింది'


' రాష్ట్రపతి అనడమెందుకు? రాష్ట్రమాత అనొచ్చుగా?  మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మాతృభాష అంటుంటారుగానీ మాతృస్వామ్యం అంటే సహించలేరు. ఆడదంటే అంత అబలా! మీ మగాళ్ళు అటూఇటూ వాయించే తబలా?' 


'అలుసైతే రైళ్ళల్లో ప్రత్యేక బోగీలు, బస్సులు, బస్సులో సీట్లు, సినిమా హాలు క్యూలు, టీవీల్లో సీరియళ్ళు ఎక్కడ చూసినా మీకేవేవో ప్రత్యేక రియా ల్టీషోలు ఎందుకు పెట్టిస్తాం?' 


'టాయిలెట్లు, పేరంటాలూ, సామూహిక సీమంతాలు ప్రత్యేకంగా పెట్టిస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈనాటికీ కొన్ని గుళ్ళల్లో ఆడవాళ్ళకు ప్రవేశం నిషిద్ధం. నూటికి ఎనభైమంది పంజరంలో పిట్టలే. పెల్లయితే ఆడదానికే ఇంటి పేరు ఎందుకు మారాలి? మేమే ఎందుకు గాజులు తొడుక్కోవాలి? పసుపు కుంకుమలు పంచటం అవమానంగా ఎందుకు మగాళ్ళు భావించాలి? ఆడదంటే అంత అలుసెందుకు?  తొడలుంటే కొట్టుకోవాలా? మీసాలున్నది మెలిపెట్టుకోవటానికేనా? భాష ఉన్నది సభల్లో తిట్టుకోవటానికేనా? పురుష సూక్తం శ్రీసూక్తం ఒకటిగా ఎందుకు లేవు? ఆడపిల్లలకు దేవతల పేర్లు పెడతారుగానీ దేవతల్లాగా చూసుకోరెందుకు?  మీ మగాళ్ళు మగాడిని ప్లస్, ఆడపిల్లని మైనస్ అనడం ఏ సామాజిక సూత్రం ప్రకారం న్యాయం? ఎంత ఒబామా అయినా ఒక ఆడది పెంచితేనేగా అమెరికా అధ్యక్షుడైంది! ప్రేమ పిచ్చిది కనక ప్రేమించే ఆడాళ్ళంతా పిచ్చాళ్ళేనా? ఆడది ప్రాణం పెడితే ప్రాణాలు తీసే యముడితోనైనా పోరాడి గెలుస్తుంది. ప్రాణం విసిగితే కాఫీలో కాస్త విషం కలిపి ప్రాణాలు తీస్తుంది. మగాడు తోడుగా ఉంటే ఆడది నీడగా ఉండటానికి సిద్ధం. ఆడది ఉన్న ఇల్లు చిలకలు వాలిన చెట్టండి. చప్పట్లు కొడితే చిలకలు ఎగిరి పోతాయేమోగానీ చిలకల కొలికి ఎన్ని ఇక్కట్లు వచ్చినా ప్రాణం పెట్టే మొగుడిని విడిచిపోదు' అందావిడ ఆవేశంగా. 


ఓడిపోయాను. 


' ఇంతకీ ఈ ఉపన్యాసమంతా ఎందుకూ?" అనడిగాను.


'రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్వామీ! మనరాష్టంలో సగానికన్నా ఎక్కువ ఆడ ఓట్లు ఉన్నాయి. ఆ సంగతి తెలిసి ఒకాయన పావలా వడ్డీ, అభయహస్తం అంటుంటే, ఇంకో హీరో భూములూ, సబ్సిడీలు అంటున్నాడు. ఇటునుంచి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి అటునుంచి మద్యం అమ్మి దండుకుంటున్నారు. ఠీవి  అయిన బతుక్కి కావాల్సింది ఉచిత టీవీ కాదు. ఉచితానుచితాలు తెలిసి ఓటు వేసే తెలివి - అని మా ఆడాళ్ళందరికీ తెలియాలని నా కోరిక' 


'వాహ్... వాహ్... మరి ఈ శుభసందర్భాన మా మహారాణిగారు మగమహారాజుగారిని ఏమి చేయమని సెలవు? అనడిగాను నాటక పక్కీగా.. '


' ఇవాళ రేపూ వంట చేయమని ఆజ్ఞ' అనేసింది.


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-03- 2009 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...