Wednesday, December 22, 2021

ఈనాడు- సంపాదకీయం సౌహార్ధ దౌత్యం - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 )

 




ఈనాడు- సంపాదకీయం 


సౌహార్ధ దౌత్యం


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 ) 


పురాణాల ప్రకారం భారతీయులకు ప్రథమ దూత ఆంజనే యుడు. వాలి భయంతో రుష్యమూకంమీద కాలక్షేపం చేస్తున్న రాజు సుగ్రీవుడికి రామసోదరులకు మధ్య మంత్రి హోదాలో రాయబార మంత్రాంగం నడిపింది వాయుపుత్రుడే. సాధారణంగా ఎవరినీ  ప్రశంసించని రాఘవుడిని  ప్రథమ పరిచయంలోనే మెప్పిం చిన వాక్యవిశారదుడు హనుమంతుడు. 'ఇక్ష్వాకల  దశరథ తనయుడు పితృవాక్య పాలనకోసం అడవుల పాలయ్యీ కోల్పోయిన భార్య పునస్సాధనకోసం సాయం ఆశిస్తూ మన దరిచేరాడు. అంటూ ఆ విజ్ఞుడు చేసిన రామ పరిచయంలో ఒక్క పొల్లు పలు కైనా ఉందా! 'దూతకు ఉండవలసిన  ప్రధాన లక్షణం వాక్య విజ్ఞత'  అంటాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో.  రాయబారం అంటేనే రాజకీ యాల బేరం. నియమానుసారం  అజ్ఞాత వాసానంతరం రాజ్యభాగాన్ని తిరిగి ఇచ్చే ఉద్దేశం లేని కౌరవులు యుద్ధభయంతో సంజయుడిని  పాండవుల వద్దకు రాయబారం పంపిస్తారు. యుద్ధ నివారణ సంజయుని రాయబార లక్ష్యం. యుద్ధ సన్నద్ధత పాండవుల ఆలోచన. రాయబారం విఫలమైనా దౌత్యకార్యంలో ప్రతిఫలించే లౌక్య లక్షణాలన్నింటికీ ధర్మరాజు, సంజయుల సంవాదం దర్పణం పడుతుంది. రెండు విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ ఏర్పడి నప్పుడు నివారణార్ధం రాయబారం అవసరం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సాగించిన ప్రఖ్యాత రాయబారం అందుకు విరుద్ధమైనది. కురుపాండవుల మధ్య సంధి కుదిరితే ద్రౌపది మానావమాన దుష్కార్యాలకు శిక్ష ఎక్కడుంటుంది? దుర్యోధన దుశ్శాసనులవంటి దుర్మదాంధులు కర్మఫలాన్ని అనుభవించకుండా తప్పించుకుంటే 'కృష్ణావతార ధర్మసంస్థాపన' కు మరేమి సార్థకత? రాయబారాలన్నీ ఒకే లక్ష్యంతో సాగవు. ఏ సాగరం లోతు దానిది.


పిల్లలమర్రి పిన వీరభద్రకవి 'శృంగార శాకుంతలం'లో శకుం తల దుష్యంతుల మధ్య కణ్వమహాముని పంపున  శిష్యులు రాయబారం నిర్వహిస్తారు. 'అగ్నిద్యోతనుడు' అనే పురోహితుడి అసమాన  రాయబార సామర్థ్యంవల్లే 'రుక్మిణీ కల్యాణం' సాధ్యమైంది. మనసు- వలచిన కన్యదే కావచ్చు. మాటల రూపంలో దానికి  దర్పణం పట్టవలసింది దూతగా వచ్చిన పురోహితుడే గదా! సందర్భం చూసి రుక్మిణి ఆకార సౌందర్య విశేషాలను ఆ భూసురుడు అత్యంత రసవత్త రంగా ఏకరువు పెట్టబట్టే గోపికానాథుడికి అగ్గిలం పుట్టింది. పురో హితులవారి చేత 'పెండ్లి నక్షత్రం' తెలుసుకొని మరీ విదర్భ దేశానికి పరుగులెత్తాడు.  ఆ కార్య సామర్థ్యమంతా భూసురుడి రాయ బారంలో ఉంది. ఆకాశ మార్గంలో సంచరించే మేఘశకలాలలకూ 'ప్రేమ సందేశాలు' మోయక తప్పలేదు. కాళిదాసు ' మేఘ దూతం' పేరుకు రెండు సర్గల ఖండకావ్యం కావచ్చునేమోగానీ.... దానిని  అనుసరిస్తూ వచ్చిన సందేశ కావ్యాలు లెక్కలేనన్ని. నలదమయంతులను కలిపే నిమిత్తం  బంగారు రెక్కల రాయంచ  రాయబారి పాత్ర నిర్వహించిందీ పరమేశ్వరుడే. నలుడి గుండెల్లో అగ్గి పుట్టించడం నుంచి, దమయంతిని నలుని దక్కంగ నొరునినే దలతునెట్లు? అన్నంత దాకా తీసుకుని పోయింది రాయంచ రాయబార విన్యాసమే. పింగళి సూరనార్యుని ' ప్రభావతీ ప్రద్యుమ్నం'లోని రాజ హంస శుచిముఖి ప్రేమరాయబారమూ అమోఘం. కథానాయిక అంగాంగాలను తనివితీరా వర్ణించి 'వచింపలేనయా/ క్కొమ్మ బెడం గులోన నొక కోటి తమాంశమునైన' అన్నదంటే 'శుచిముఖి వాణి'  వాస్తవంగా 'ఉపమాతిశయోక్తి కామధేనువే' !


పరవస్తు చిన్నయసూరి 'మిత్రభేదం'లోని దమనకుడు- వన రాజు పింగళకుడికి, వృషభరాజు సంజీవకుడికి నడుమ నిలబడి నడిపిన రాయబార మంత్రాంగం దౌత్యరీతులకే కొత్తపాఠాలు కూర్చినట్టిది . కొలువిచ్చిన పెదకోమటి వేమారెడ్డి పంపున బాల్యమి త్రుడు అవచి తిప్పయసెట్టిని కంచి రాయబారంలో శ్రీనాథుడు మంచి చేసుకొన్న తీరు సృజనరంగంలో రాయబారాలకు విలువ పెంచింది. మనిషి జీవితానికి, దేవుని రాయబారానికి మధ్యగల అనుబంధం అనుభవాలకు అతీతం. దైవ వాక్యాన్ని భూతలం మీదకు మోసుకొచ్చిన దేవదూత యేసు. 'లోభ మోహ మద కామ క్రోధ మాత్సర్య దుర్వ్యాళక్ష్వేళ కరాళ హాలాహల కీలాభిలమై అల్ల కల్లోమైన జగమ్ము సర్వమ్ము'నకు 'ఓం శాంతి' మంత్రాన్ని మోసు కొచ్చిన దూత బుద్ధభగవానుడు. భారతీయత ఔన్నత్యాన్ని ఎల్లల 'కావల మోతలెక్కించిన యువదూత వివేకానందులు. 'పవలున్ రాత్రులు నెత్తుటేళ్ళు ప్రవహింపన్ పాప భూయిష్టమౌ నవకళా నరకమ్ములో చరణ విన్యాసమ్ము గావించిన విశ్వమానవ సౌభ్రాత్ర దూత గాంధీతాత. 'ప్రాజ్యమైన సంగీత సామ్రాజ్యమునకు రాగ దూత'  త్యాగయ్య. ఇంటిదీపాన్ని ఆర్పిన గబ్బిలాన్నే తన కన్నీటి కథ ఈశ్వరునికి వినిపించే దూతగా మార్చుకున్నారు కవిపీష్వా జాషువా. దౌత్యకార్యాలతోనే ప్రపంచ తంత్రం ప్రస్తుతం నడుస్తున్నది . యుద్ధతంత్రాలకు, వ్యాపార సంబంధాలకు, సాంస్కృ తిక విశేషాల మార్పిడికే కాదు... శరణార్థుల సంక్షేమాలకూ రాయబారులను నియమించే కొత్త విధానానికీ నాంది పలికింది. హాలివుడ్ అందాలనటి ఏంజెలీనా జోలీ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమి షన్ ప్రత్యేక సౌహార్ద రాయబారిగా నియమితులు కావడం అభినం దనీయం. ఆరుబయట మలమూత్రాల విసర్జనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చేపట్టబోతున్న పారిశుధ్య ప్రచారోద్యమ ఆరోగ్య రాయబారులుగా బాలీవుడ్ నటీనటులు విద్యాబాలన్, షారుక్ ఖాన్  ఎంపికయ్యారు. తెరవేల్పుల మాటే మంత్రమై, ఆరోగ్య సూత్రాలపై కనీస అవగాహన అట్టడుగు స్థాయి చేరితే అంతకన్నా కోరదగినది ఇంకేముంటుంది ?


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 22-04-2012 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...