Tuesday, July 14, 2015

అమ్మభాషకు జేజేలు- వ్యాసం


మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక కోసం శ్రీ. కర్లపాలెం హనుమంతరావు రాసిన ప్రత్యేక వ్యాసం ఇది. మన తల్లి భాష మీద చూపించవలసిన బాధ్యతను మరోసారి మనకు గుర్తుచేస్తోంది. చదవండి!


కనిపించుట లేదు పేరు: తెలుగు
వయసు: క్రీస్తుపూర్వం నాటిదని చెబుతారు.
ముద్దుపేర్లు: జాను తెలుగు, తేనె తెలుగు
 గుర్తులు: ముద్దుగా, బొద్దుగా ఉంటుంది. తలకట్టు’ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రాచినభాష హోదా’ అనే
 కొత్తగౌను తొడుక్కుంది.

చిట్టితల్లీ! నువ్వెక్కడున్నా సరే, మాతృభాషా దినోత్సవం నాటికి తిరిగొచ్చెయ్‌. ఇకనుంచి నిన్ను చులకనగా చూడం. ఐ నెవర్‌ స్పీక్‌ ఇన్‌ టెల్గు’ బోర్డు తగిలించి బాధపెట్టం. నీ రాతలే రాస్తాం. నీ మాటలే మాట్లాడతాం. నీ పాటలే పాడతాం. నిన్ను కాపాడుకునే పూచి మాది”
ఆచూకీ తెలపాల్సిన చిరునామా:
ఆదికవి నన్నయ విగ్రహం, ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌.

బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ వెుహమే. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది అమ్మ…’ అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన మాట ఇది.
ఏ భాష అయినా మాతృభాష తర్వాతే
ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.

శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికే శాతవాహన చక్రవర్తి హాలుడు తన గాథాసప్తశతి’లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో మొట్టమొదటిది, గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉఛ్చారణకి ఓ ప్రత్యేకాక్షరం ఉంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాన్నయినా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా ఉంది. అందుకే ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అని ఆకాశానికెత్తేశారు హాల్డెన్‌ దొరగారు. సుందర తెనుంగై’ అని తెగ మెచ్చుకున్నారు తమిళకవి సుబ్రహ్మణ్యభారతి. అప్పయ్యదీక్షితులైతే తెలుగువాడిగా పుట్టనందుకు జీవితాంతం చింతించారు. ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ… నాల్పస్య తపసఃఫలమ్‌’ అంటూ తనకుతాను సర్దిచెప్పుకున్నారు. నిజమే మరి, తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు.




నేనూ నా గోదాదేవీ శ్రీరంగంలో పెళ్లాడిన కథను నా తెలుగుభాషలో చక్కని ప్రబంధంగా రాయవయ్యా. నామట్టుకునాకు, అంతకు మించిన సంతోషకరమైన విషయం మరొకటుండదు’ అని రాయలవారిని పురమాయించాడట ఆంధ్రమహావిష్ణువు. తెలుగులోనే ఎందుకంటావా? ఇది తెలుగుదేశం. నేను తెలుగు వల్లభుడిని. తెలుగు తీపిలో కలకండ. నీ కొలువులోని సామంతులు పలురకాల భాషలు మాట్లాడుతుంటారు కదా! ఆ దేశభాషలన్నిట్లోకీ తెలుగు మాత్రమే లెస్స అన్న విషయం నీకూ అనుభవేకవేద్యమే అయుండాలి! అని ఆంధ్రవిష్ణువు కలలో కనిపించి తనకు చెప్పాడని ఆముక్తమాల్యద పీఠికలో రాయలవారు స్వయంగా రాసుకున్నారు.

ఆంధ్రమహావిష్ణువుకున్న మాతృభాషాభిమానం, ఆంధ్రుల్లో మాత్రం కొరవడుతోంది. ఓనమాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కిరావే…గోగుపూలు తేవే’ అంటూ చంకలోని చంటిపిల్లకు గోరుముద్దలు మింగిస్తూ తెలుగింటి అమ్మ కమ్మగా పాడే ఆ తెలుగు పాటలు కొండెక్కిపోయే రోజులు ఇంకెంతోదూరంలో లేవు. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు…’ అంటూ ఆరుబయట వెన్నెల్లో పడుకుని నాన్న చిన్నాడికి చెప్పే తెలుగు కథలు నిజంగానే కంచికెళ్లిపోయే రోజులు దాపురించాయి. అమ్మ మమ్మీగా మారిపోయింది. నాన్న’ అనే తియ్యటి పిలుపు డాడీ ముందు అటకమీద జాడీలా వెురటుగా అనిపిస్తోంది. ఆంటీఅంకుల్‌ కల్చర్‌ తెలుగుతోటకూ అంటుకుంది. ఆ ఏబీసీడీల వేడికి తెలుగు పలుకుబడి మాడిమసయిపోయే ప్రమాదముంది. మేలుకోండి, మేలుకోండ’ని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం శతవిధాలా హెచ్చరిస్తోంది. దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. ఈ మెకాలే మానసపుత్రులకు తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే. ఒకటో తరగతి బుడతడి భుజం మీదున్న బండెడు పుస్తకాల్లో తెలుగు పుస్తకం ఒక్కటంటే ఒక్కటన్నా ఉంటుందా, చూడండి!
అరటిపండు…
పూలరథం…
ఏకదంతం…
అంటూ కమ్మని తెలుగు పదాలను పసిపిల్లలందరూ కలిసి బిగ్గరగా చదివే పాఠశాలలు ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా అరుదుగా తప్ప కనిపించటం లేదు. తెలుగుమాధ్యమంలో చదువుకునే విద్యార్థులు ద్వితీయ స్థాయి విద్యార్థుల కింద లెక్క. పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, చీలిన రెండు రాష్ట్రాలలోకూడా తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.
యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దదిగా మన్ననలందుకుంటున్నా, ఆ తెలుగు ముక్కలు మనకు పులుసులో ముక్కలకింద కూడా పనికిరావడం లేదిప్పుడు! కూరగాయల అంగళ్ల నుంచి స్కూలు పిల్లల పుస్తకాలమ్మే దుకాణాల దాకా అన్నీ ఇంగ్లీషు బోర్డులాయెు. తాటికాయంత ఆంగ్లాక్షరాల కింద చిమతలకాయంత తెలుగు ముక్కలు గిలుకుతున్నారాయ! తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్లో కూడా తెలుగు సంతకాలు చేసే అలవాటు లేదాయ!

తెలుగు సినిమాలూ, తెలుగు ఛానళ్ల సంగతి చెప్పేదేముంది? ప్రతి రాష్ట్రానికీ ఆ రాష్ట్ర భాషే అధికార భాషగా ఉండాలి. పరిపాలనా వ్యవహారాలన్నీ ప్రజల భాషలోనే జరగాలి. దేశం వెుత్తానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ రాష్ట్రంగా ఉండాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభిలషించారు. కానీ ఆ మాట నిజమయ్యే పరిస్థితులు దరిదాపుల్లో లేవు.

రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. మరో మూడేళ్ల తర్వాత కానీ తెలుగు అకాడమీని (మధ్యలో ఈ అకాడమీ’ ఎందుకో. హాయిగా ఏ 'తెలుగు విద్యాపీఠం' అని పిలుచుకోవచ్చుగా) స్థాపించుకోలేకపోయాం. రాష్ట్ర రాజధాని నడిబొడ్డునున్న తెలుగుతల్లి విగ్రహం మీద తెలుగక్షరాలు చెక్కించుకోడానికి ఉద్యమం చేయాలా? దేశం వెుత్తంమీద హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగే!

అరణ్యవాసంలో కందమూలాలు తవ్వుతున్న శ్రీరాముడికి ఓ కప్ప ఏడుస్తూ కనిపించిందట. నీ దుఃఖానికి కారణం ఏమిటి? అనడిగాడు రాముడు. దుంపల కోసం గుంతలు తవ్వుకునే ఓ మనిషి నా గుడ్లను అమానుషంగా చిదిమిపారేశాడు స్వామీ! అని చెప్పింది కప్ప. అయ్యో! రామా!' అని పిలిస్తే, నేనొచ్చి కాపాడేవాడిని కదా’ అని అనునయించబోయాడు రాముడు. ఆపద వచ్చింది ఆ రాముడివల్లే స్వామీ. ఇక నన్ను కాపాడేవారెవరుంటారు? అందిట కప్ప. మన పాలకుల తీరూ చట్టసభల పరిస్థితీ అచ్చంగా అలానే ఉంది. ఇరుగుపొరుగు రాష్ట్రాలే కాస్త నయం. సినిమాలకు తమిళ పేర్లు పెట్టుకున్నా, పిల్లలకు అచ్చు తమిళ నామధేయాలు ఖరారుచేసినా తమిళనాడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎంత దూసుకుపోతున్నా ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తోంది కన్నడ ప్రభుత్వం. అక్కడ ఏటా జరిగే కన్నడ సాహిత్యపరిషత్‌ ఉత్సవాలకు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తప్పకుండా హాజరవుతాడు. మహారాష్ట్రలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్న భాషాదురభిమానాన్ని ఎవరూ హర్షించరుకానీ, సొంత భాషని మరీ చింతతొక్కు కింద తీసిపారేసే మన వింత మనస్తత్వాన్ని కూడా ఎవరూ సమర్థించరు. ఇంగ్లీషు లేకపోతే, ప్రపంచదేశాల ముందు మనం తలదించుకోవాల్సి వస్తుందని మెకాలే వారసులు చేస్తున్న దుష్ప్రచారం కూడా సరైంది కాదు. చైనా, జపాన్‌వంటి దేశాల అభివృద్ధే దానికి దీటైన సమాధానం. మన కుర్రాళ్లు కేవలం మార్కుల కోసమే ఇంటర్‌లో తెలుగుభాషను వదిలించుకుని సంస్కృతాన్ని వల్లెవేయడం ఇరుగుపొరుగు రాష్ట్రాలవారికి నవ్వుతెప్పించే విషయం. ఓసారి హోసూరు శాసనసభ్యుడు తమిళ శాసనసభలో తెలుగులో అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులోనే జవాబు చెబుతూ…’తమిళదేశంలో తెలుగును రెండోభాషగా గుర్తించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్‌లో కనీసం తెలుగువారైనా తెలుగు చదివేలా చర్యలు తీసుకుంటే బావుంటుంది’ అన్నారు. తొడపాశంలాంటి సమాధానం.

బళ్లో అయ్యవారు ఎంత వెుత్తుకున్నా, ఇంట్లో నాన్నారు ఎంత గొంతుచించుకున్నా బుర్రకెక్కని పాఠాలు…అమ్మ ఒళ్లో కూర్చుని చదువుకుంటే ఠక్కున అర్థమైపోతాయి. అదీ అమ్మ గొప్పతనం, అమ్మ భాష గొప్పతనం! అందుకే, ఎదిగేపిల్లల్ని తల్లిభాష నుంచి దూరంచేయడం తగదని మనస్తత్వవేత్తలు మొత్తుకునేది. ఏ దేశమేగినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా అవన్నీ మాతృభాషకు ప్రత్యామ్నాయం కానే కావు. ఎంత చికాగో విశ్వవిద్యాలయంలో చదువుకున్నా
చిలక్కొట్టుడికి సరైన ఇంగ్లీషు పదం దొరుకుతుందా! అదివో అల్లదివో శ్రీహరివాసమూ’ అంటూ ఆ పదకవితాపితామహుడు అంత తన్మయత్వంతో ఆలపించిన గీతాన్ని అంతే ఆర్తిగా ఏ ఇంగ్లీషు భాషలోకో తర్జుమాచేయడం సాధ్యమేనా? ఎందరో మహానుభావులు…’ అంటూ త్యాగయ్య రామయ్యకర్పించిన ఘనరాగపంచరత్నాలను మక్కీకి మక్కీ అనువదించవచ్చేమోగానీ, ఆ మధుర భక్తిభావాన్ని యథాతథంగా పదాల్లోకి దించటం ఎవరి తరమవుతుంది? చెల్లియో చెల్లకో’ లాంటి పాండవోద్యోగ విజయం పద్యాలు, ఎంకిపాటలు, వెంగిలి వెంగిలీయని వేకాము చేసేవు… లోకమంతెవరెంగిలీ ఓ రమణా’ అంటూ బైరాగులు పాడుకునే తత్వాలు, జోలపాటలు, పండగలు  పబ్బాలప్పుడు నలుగురు మహిళలుచేరి పాడుకునే ఎత్తిపొడుపు హాస్యపుపాటలు, యక్షగానాలు, పిల్లల చెమ్మాచెక్కా పాటలు, చెక్కభజనలు… ఓహ్‌ చెప్పుకుంటూపోతే తెలుగుభాష సొగసుల చిట్టా హనుమంతులవారి తోకలాగా అలా సాగుతూనే ఉంటుంది. చెప్పొచ్చేదేమిటంటే, చివరికి చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు కాలిముల్లు’ లాంటి వేమన పద్యాన్నయినా భావగాంభీర్యం చెడకుండా మరో భాషలోకి అనుసృజన చేయడం అసాధ్యం. భాషంటే వట్టి అక్షరాల పోగు కాదు. తల్లిపేగు నుంచి గర్భస్థశిశువుకి ప్రాణధార ఎలా ప్రవహిస్తుందో, తల్లిభాష నుంచి మనిషికి జ్ఞానధార అలానే సంక్రమిస్తుంది. మాతృభాషను కాదనుకుంటే, కొండంత అనుభూతిని కోల్పోతున్నట్లే!

కన్యాశుల్కం’లో తమ ఇంటికొచ్చిన గిరీశాన్ని మా అబ్బాయీ మీరూ ఒక్క పర్యాయం యింగిలీషులో మాట్లాడండి బాబూ! అనడుగుతుంది శిష్యుడు వెంకటేశం తల్లి వెంకమ్మ. గురుశిష్యులిద్దరూ కలిసి నోటికొచ్చిన రైమ్సూ ఇంగ్లీషు పాఠాల్లోని లైన్సూ లెక్కల ఫార్ములాలూ వ్యాకరణ సూత్రాలూ దంచేస్తారు. మేనమామ కరటకశాస్త్రులు తెలుగుపద్యం చదవమంటే మాత్రం అర్థంతెలీని 'నలదమయంతుల' పద్యం గడగడ చదివేసి ఇంటికప్పుకేసి చూస్తూ నిలబడతాడు వెంకటేశం. తెల్లవాళ్ల బళ్లలో తెలుగుపద్యాల మీద ఖాతరీ లేదండీ! యంతసేపూ జాగర్ఫీ గీగర్ఫీ అర్థిమెటిక్‌ ఆల్జీబ్రా మేథమెటిక్స్‌ యివన్నీ హడలేసి చెప్తారండి! అంటూ గిరీశం అప్పుడు కవర్‌ చేయాలని చూశాడు గానీ… నిజానికి ఇవాళ మన పాఠశాలల్లో నూటికి తొంభై చోట్ల జరుగుతున్నదీ ఇదే తంతు. చదువంటే అష్ట్లాగే ఉండాలండీ! అంటూ అప్పుడు అగ్నిహోత్రావధాన్లు దీర్ఘాలు తీసినట్లే.. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులూ భావిస్తున్నారు. చింతించాల్సిన విషయమిది.

'
మా తెలుగు తల్లికి మల్లెపూదండఅని పాడమంటే, ఏకంగా తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం. ఇదేమంత మంచి లక్షణం కాదని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తోంది. మాతృభాష కన్నయితే, ఇంగ్లీషు కళ్లజోడులాంటిదని ఎవరన్నారోకానీ, ఆ మాట నూటికినూరుపాళ్లు నిజం! అసలు కన్నంటూ ఉంటేగా కళ్లజోడుతో పనిపడేది! చిక్కని పాలపై మిసిమి  చెందిన మీగడ పంచదారతో తింటే ఎంత మధురంగా ఉంటుందో,. ఆ తేటతేట తెలుగులో చదవడం వెుదలుపెడితేనేకదా అనుభవంలోకి వచ్చేది! చదువులు గుమస్తా ఉద్యోగాల కోసం కాదు. కాల్‌సెంటర్‌ కొలువుల కోసం అసలే కాదు. మనోవికాసానికి ఉపకరించాలి. మనల్ని మనం నిరూపించుకోవడానికి సహకరించాలి. అంతర్జాలం పుణ్యమా అని బోలెడంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. మనకిప్పుడు కావలసింది, మనముందున్న సమాచారాన్ని సమన్వయపరుచుకోగల సామర్థ్యం. అమ్మభాషకన్నా గొప్పగా ఆ సమస్యను పరిష్కరించే సత్తా పరాయిభాషకు ఉంటుందా!
ఇది కొత్త ఆలోచనల యుగం. సృజనాత్మకతకే గండపెండేరం. సృజనకూ సొంతభాషకూ దగ్గరి చుట్టరికం ఉంది. సొంతభాషలో ఆలోచించినప్పుడు సృజన పురులు విచ్చుకొంటుంది. మాతృభాషలో వచ్చిన గొప్పగొప్ప రచనల్ని చదివినప్పుడు పదసంపద పరిపుష్ఠం అవుతుంది. పదాలు ఆలోచనలకు ప్రాణాలు. ఆలోచనలు సృజనకు ఆధారాలు. పోటీయుగంలో మన మనుగడను నిర్ణయించేది సృజనే. అదే  విజయాల్ని నిర్దేశించే ప్రధాన దినుసు. మాతృభాష మీద ప్రేమ ఉన్నా, లేకున్నా, కనీసం మనకోసమైనా మనం తెలుగు నేర్చుకోవాలి. తెలుగు పుస్తకాలు చదవాలి. తెలుగులో ఆలోచించాలి.

కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఓ పిల్లల ఆసుపత్రి ఉంది. లోపలికి కాలుపెట్టగానే, మిగతా ఆసుపత్రుల్లా మందుల వాసన గుప్పుమనదు. తెలుగు పరిమళం గుబాళిస్తుంది. ఏ గోడ మీద చూసినా తెలుగు పద్యాలే, తెలుగు గేయాలే, పొడుపు కథలే. మందుచిటీల మీద కూడా…ఏ వేమన పద్యవో, సుమతీ శతకం నీతివాక్యవో కనిపిస్తుంది. లేదంటే చేటంత చెవులు… చింతాకు కళ్లు… కొండంత ఒళ్లు… స్తంభాల్లాంటి కాళ్లు… కనుక్కోండి పిల్లలూ! తరహా పొడుపు కథలు ఉంటాయి. డాక్టరుగారుకూడా హాయిగా తెలుగులోనే మాట్లాడతారు. జ్వరవో, దగ్గో వచ్చిందని ఏడుపు వెుహంపెట్టుకుని ఆసుపత్రికెళ్లే పిల్లలు, తిరిగొస్తున్నప్పుడు ఏ వేమన పద్యాన్నో నెమరేసుకుంటూ హుషారుగా తిరిగొస్తారు. కందేపి ప్రసాదరావు అనే డాక్టరుగారి తెలుగు’ వైద్యమిది! ఆ చొరవ పదికోట్లమందికీ విస్తరించాలి. తెలుగు వెలుగే మన మనోజగతిన అలుముకోవాలి.
తెలుగు తల్లికి జేజే
తెలుగు భాషకు జేజే!
'దేశభాషలందు తెలుగు లేస్స; ఎందుకో తెలుసా ?!
పరుగుపందెంలో భావాల వేగాన్ని అందుకోగల భాషల మీద నలభై ఏళ్ల కిందటే పరిశోధనలు వెుదలయ్యాయి. భావాల బట్వాడాలో ఏ భాషకి ఎంత సౌలభ్యం ఉంది? ఏ భాషాపదం ఎంత వేగంగా మనిషి ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వగలుగుతుంది? ఇలాంటి సందేహాలకు జవాబులు రాబట్టడానికి చాలా ప్రయోగాలు చేశారు అప్పట్లోనే. గణాంకాల ఆధారంగా,  సమీకరణల సాయంతో ఫలితాలు రాబట్టారు. ఈ మహత్కార్యానికి పూనుకున్న వ్యక్తి పేరు ప్రొఫెసర్‌ బి.ఎస్‌.రామకృష్ణ. మన తెలుగువారే. సైన్స్‌ టుడే’ 1973, నవంబరు  సంచికలో ఆయన భాషల శక్తిసామర్థ్యాలు’ అనే శీర్షికతో ఓ వ్యాసాన్ని వెలువరించారు. ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ భాషలతోసహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింటిలోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. ఒక లిపిని మనిషి ఎంత వేగంగా రాయగలడో ఆ వేగమే ఆ లిపి ప్రాధాన్యతకి నిదర్శనం. అయితే అందరూ ఒకే వేగంతో రాయలేరు కాబట్టి, రెండు వేర్వేరు లిపులు రాయడానికి పట్టే అసలుకాలాన్ని గణాంకశాస్త్రం సాయంతో లెక్కగట్టి నిజం నిగ్గుతేల్చవచ్చని ప్రయోగాల ద్వారా నిర్ధారించారు.
భాషంటే ఒక సాంకేతిక సంజ్ఞ… కోడ్‌. ఈ సంజ్ఞలే సామూహికంగా భావాలకు ప్రతీకలుగా మారతాయి. ఒక్కో అక్షరానికి అవసరమైన బిట్స్‌’ సమాచార కొలమానం అవుతుంది. తక్కువ సంజ్ఞలతో ఎక్కువ సమాచారాన్ని అందించే బిట్స్‌’ అధికంగా ఉన్న భాష మాత్రమే పోటీలో నిలుస్తుంది. ఇంగ్లీషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకు ఉంది. అదే ఈ వేగానికి కారణం.
ఐటీలోనూ లేదుసాటి! కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు…చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. తెలుగువారిలాగే తెలుగు భాషకూ చొరవ ఎక్కువే. ఇట్టే బంధుత్వం కలిపేసుకుంటుంది. కంప్యూటరీకరణలోకూడా తెలుగు లిపి అతికినట్టు సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష… భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.

మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు ఆరువేలు. ప్రపంచీకరణ పుణ్యమా అని వీటిలో సగానికిసగం ప్రమాదంలో పడ్డాయి. భాషాశాస్త్రవేత్తల అంచనా ప్రకారం…గత మూడువందల సంవత్సరాల్లో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతర్థానమైపోయాయి. వివిధ తెగల భాషలు కనుమరుగైపోయాయి. ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో మాతృభాషల పరిరక్షణ'  ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం’ అని నిర్ధారించింది. 
కనీసం ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే’ 
అంటూ హెచ్చరించింది. ఆ లెక్కన తెలుగు భాషకూ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

1947లో…భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింత తీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీనికూడా మరోఅధికార భాషగా గుర్తించింది. ఆ తరువాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.
(ఆ సందర్భాన్ని పురస్కరించుకొని  ఈనాడు ఆదివారం అనుబంధం 21 ఫిబ్రవరి 2010 నాటి సంచికలో 'కవరు స్టోరీ' ప్రధాన వ్యాసంగా ప్రచురింపబడింది ఈ వ్యాసం)

-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...