Tuesday, July 28, 2015

పునాది రాళ్ల ప్రార్థన-- వ్యంగ్య కథానిక

క్రీ. శ. 3015
హాట్ జూపిటర్నుంచి అరగంట కిందట బైలుదేరిన సూపర్ సానిక్ రాంజెట్ 'గోయిండా'(గోవిందాకి.. గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదేపనిగా గిరిటీలు కొడుతోంది. చిన్నపిల్లలు ఆడుకొనే టాయ్ ఏరోప్లేన్ రీమోట్ కంట్రోలురుతో తిరుగుతున్నట్లంది ఆ దృశ్యం.
గోయిండానుంచి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్దబంతిలాగా ఉంది.
స్పేస్ సెంటర్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాంజెట్ లోని యువశాస్త్రవేత్తలిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని స్క్రామ్ జెట్ సాయంతో సూటిగా భూమివైపుకు దూసుకు రావడం మొదలుపెట్టారు.
పొట్టిగా,  బూడిదగుమ్మడికాయంత బొద్దుగా  రేలంగిలాగా ఉన్నవాడిపేరు మొగానో. పొడుగ్గా,  పొట్లకాయంత సన్నగా రమణారెడ్డిలాగా ఉన్నవాడిపేరు  తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్ యూనివర్సల్ స్పేస్ యూనివర్శిటీలో రీసెర్చి స్టూడెంట్లు.
స్క్రాంజెట్ ని రాంజెట్ ని రీమోట్ ద్వారా కంట్రోలుచేస్తూ హాట్ జూపిటర్ స్పేస్  సెంటర్లో కూర్చొని 'ఆపరేష్ డిస్కవర్ ఇండియా' సూపర్వైజ్ చేస్తున్నాయన పేరు కబిల్. అతగాడు ఆ ప్రాజెక్టుకి గైడు కూడా. సినిమాల్లో ప్రకాష్ రాజ్ లాగా ఉంటాడు.
కబిల్ ముత్తాతలు కొన్నివేల ఏళ్లకిందట భూమ్మీద నివసించినవారు. ఐదువందల ఏళ్లకిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవనం మనుగడకే ముప్పు ముంచుకొచ్చినవేళ  గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకి  వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్ ముత్తాతలు సూర్యకుటుంబంలోని గురుగ్రహానికి చెందినవారే!
ప్రకృతి వికృతిగామారిన దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవజాతులన్నీ క్రమక్రమంగా నశించిపోయాయి. ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది.  అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్ కరువై  పూర్తిగా బొగ్గుపులుసు వాయువుతో నిండిపోయిన భూమ్మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!
తమ సౌరవ్యవస్థను బోలిన మరెన్నో గ్రహకుటుంబాలను వెదికి పట్టుకొని, పరిశోధించి దీసిస్ సమర్పించడం 'ఆపరేషన్ డిస్కరీ ఇండియా' లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్ గైడెన్సులో  రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించారు. గెలాక్సీలనన్నింటినీ గాలించేసె చివరి అంచెగా భూమ్మీదకు దిగుతున్నారు ఇప్పుడు.
భూతలంమీద వాతావరణంమాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే వడగాలులు ఎడాపెడా కొడుతున్నాయి. కనుచూపుమేరంతా సహారానుమించిన ఎడారి దిబ్బలే!
ఓజోన్ పొర చిరిగిపోయి సూర్యరశ్మి భూతలాన్ని నేరుగా "జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.
ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమ్మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడు యువశాస్త్రవేత్తలిద్దరికీ అంతుబట్టడంలేదు.
స్క్రామ్ జెట్ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్ కబిల్ కమాండ్స్ స్పేస్  విండోనుండి వినబడుతున్నాయి.
'కంగ్రాట్ స్! వేలాది ఏళ్లకిందట రోదసీమండలం మొత్తంలో మహానాగరికతలు వెల్లివిరిసిన పుణ్యభూమిమీద మీరు ఇప్పుడు అడుగు పెట్టారు.' కబిల్ హృదయంలో మాతృగ్రహంమీద భక్తి ఎంతలా పొంగిపొర్లుతున్నదో అతని గొంతులోని ఉద్వేగాన్నిబట్టే శిష్యులిద్దరికీ అర్థమయింది.

కబిల్ గొంతు గంభీరంగా వినపడుతోంది. 'ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్ని రంగాల్లో అదే ముందుండేది. తమ దర్పానికి దర్పణంగా వాళ్ళు నిర్మించుకొన్న 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'ని  ఫొటో తీయండి!'
కెమారాని బాస్ చెప్పిన వైపుకి ఫోకస్ చేసి చూసాడు తనాకో. అక్కడ మట్టిదిబ్బలు తప్ప ఏవీ కనిపించలేదు!
'అల్ ఖైదా వాళ్ళు ఆ అమెరికానెప్పుడో కైమాకింద కొట్టి పారేసారు. దాని నామరూపాలుకూడా మీకిప్పుడు కనిపించవు' అన్నారెవరో! ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాసుకి చేరవేసారు శిష్యబృందం.
'పోనీ సోవియట్ సోషలిస్తు రిపబ్లిక్ పేరుతో ఒకవెలుగు వెలిగి చివరకు  రష్యాలాగా మిగిలిపోయిన దేశాలగుంపువైపుకి మీ కెమేరా తిప్పండి! అట్టడుగు మానవుడి స్వేచ్చా స్వాతంత్ర్యాలకి నిర్మాణరూపం రెడ్ స్క్వేర్. షూటిట్!' కబిల్ గాట్టి కమాండ్!
కెమేరా పొజిషన్ మారింది. అదే దృశ్యం! మటిదిబ్బలే మట్టిదిబ్బలు! 'వాళ్ల ప్రభుత్వాలను వాళ్లే కూల్చుకొన్నారు. ముక్కలు చెక్కలయినా చివరికీ ఒక ముక్కా మిగల్లేదు!' అంది ఇందాకటి గొంతే, శాల్తీ మాత్రం యథాప్రకారం కనిపించలేదు.
శిష్యులద్వారా సమాచారం విన్న కబిల్ అన్నాడీసారి 'లండబ్ టెన్ డౌన్ లో ఉద్దండ పిండాలుండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ల పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించేందుకు అంగుళం  చోటైనా ఉండేది కాదంటారు. ఆ మహాసామ్రాజ్యపు మహారాజులు, రాణులు నివాసమున్న వీధిని మీ కెమేరాల్లో బంధించండి!'
తనాకో కెమేరా అటు తిరక్కముందే అందుకొంది ఇందాకటి గొంతు 'నో యూజ్! ఆ సూర్యుడస్తమించని మహాసామ్రాజ్యం తరువత్తరువాత అమెరికా సింహానికి తోకమాదిరిగా తయారైంది. అల్ ఖైదా దెబ్బకీ  అమెరికాతో పాటే మాడి మసయింది!'
ఓన్లీ వాయిస్ ఓవర్! నో పర్సన్ ఎట్ సైట్!
నుదుట దిద్దుకొనేటంత చిన్నదైనా అమెరికాన సైతం గడగడలాడించిన దేశం  జపాను. వారి నాగరికత చాలా ప్రాచీనమైనది. అయినా నాటి మానవుడు సాంకేతికంగా ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకొన్నాడో జపానువారిని చూసి తెలుసుకోవచ్చు. వాళ్ల విసనకర్ర ఈక కనబడినా చాలు ఒక్క స్నాపు తీసుకోండి!' అన్నాడు కబిల్ నిరాశను గొంతులో కనిపించనీయకుండా!
'అణుధార్మిక విధ్వసంతో దానికదే బూడిదయింది!' అంది ఆకాశవాణి ముక్తుసరిగా ఒక్క ముక్కలో.
'ప్రపంచానికి ఫ్యాషన్ ఎలాఉంటుందో నేర్పించిన ఫ్రాన్స్!' కబిల్ గొంతు.
'ఎయిడ్స్ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగారదేశాన్ని కబళించేసింది' ఆకాశవాణి గొంతు.
'క్యూబా..' కబిల్ గొంతులో వణుకు.
'ప్లేగు వ్యాధికి ఫినిష్' అశరీరవాణి తాపీగొంతు. 
'ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్.. కజికస్తాన్..' కబిల్ దేశాలపేర్లు గడగడా చదువుకుపోతున్నాడు.
'అవన్నీ తాలిబాన్లకి స్థావరాలుగా మారిన తరువాత చరిత్రలో స్థానంలేకుండా పోయాయి. ఆఫ్రికా అడవుల్ని  కార్చిచ్చు, ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లో ఫీవరు.. ఒక్కముక్కలో మీకు అర్థమయేటట్లు చెప్పాలంటే తుఫాన్లూ, భూకంపాలూ, సునామీలూ, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామరూపాల్లేకుండా సర్వనాశం చేసేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా మిగిలున్నా రాజకీయాలు వాటిని నాకేసాయి. చివరికి మిగిలింది ..ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే.. ఈ మట్టిదిబ్బలే!' అశరీరవాణి ఆపకుండాచేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్తలిద్దరికి  తెగ వళ్ళు మండిపోయింది.
గురువుగారికి ఇష్టమైనదేమన్నా పట్టుకుపోదామనుకుంటే మధ్యలో వీడెవడు? పిలవా పెట్టాకుండా కల్పించుకొని  ఏదడిగినా 'బూడిదయింది.. మసయింది.. మన్నుకొట్టుకుపోయింది.. నాశనమయింది.. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.. మురిగిపోయింది.. మునిగిపోయింది' అంటూ అపశకునాలు తప్ప వల్లించడం లేదు! రెండు వాయిద్దామంటే వాయిస్సేగాని శాల్తీ ఎదురుగా కనిపించి చావడంలేదు!
తమకు డాక్టరేట్ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది!
కడుపులోని మంటను కడుపులోనే ఉంచుకొంటే ఏం ప్రయోజనం?  కనబడ్డా కనబడకపోయినా ముందు కడిగిపారేస్తే సరి!
'ఇందాకట్నుంచీ చూస్తున్నాం. ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటావు! ప్రకృతిభీభత్సానికి సర్వం బూదిద అయిపోతే తమరెలా మిగిలున్నారు  మహాశయా?' తనాకో ఇక తమాయించుకోలేక పెద్దగొంతుతో అరిచాడు
'ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మా ముందుకురా!' సవాలు విసిరాడు మొగానో తన వంతు వంతగా.
బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. 'మీరు నిలబడ్డ చోటులోనే భూమి అడుగున ఉన్నాను.  పిల్లల్లారా!'
మొగానో గబగబా గొయ్యితీయడం మొదలు పెట్టాడు. రెండు అడుగులుకూడా తవ్వకుండానే బైటపడిందా గొంతు తాలూకు  వింత ఆకారం.
నిట్టనిలువుగా ఉంది. ధగధగా మెరిసిపోతోంది. వంటిమీదంతా ఏవో గాట్లు.. పైనుంచీ కిందదాకా!
ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతరవాసులు రోదసీమండలంలో ఇంతవరకు ఎక్కడా చూసింది లేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వజీవజాలం దుంపనాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్టనిలువుగా.. తాజాగా.. తళతళలాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడంగానే .. నిజం చెప్పద్దూ.. యువశాస్త్రవేత్తలిద్దరికీ ఒకింత గౌరవంకూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా  మనసులోని మాటను బైటపెట్టాడు తనాకో 'ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కారు సార్?'
ఆ ఆకారం చెప్పటం మొదలు పెట్టింది. 'పునాదిరాయి అంటారు నన్ను. వేల ఏళ్లకిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పాలనావిధానం  ఒకటి వర్ధిల్లింది. ప్రజలే రాజులు. ప్రజలకొరకు, ప్రజలవలన, ప్రజలచేత నడిచే పరిపాలన అది. మరీ లోతుగా వెళ్ళొద్దు! మీరొచ్చిన పని మర్చిపోయి తరిగి వెళ్లడానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా రాజకీయ వ్యవహారం! ప్రజాస్వామ్యమంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు.   వాళ్ళు పాలించే ప్రజలు. ఈ మాత్రం అర్థం చేసుకోండి! ప్రస్తుతానికి  చాలు.!'
'ఇహ నేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టులు కట్టిస్తామని, పాఠశాలలు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. వగైరా.. వగైరా! వాళ్ళు వాగ్దానాలు చేసినంతమాత్రాన జనం నమ్మాలని ఏముంది? నమ్మనివాళ్లని నమ్మించడానికి నాయకులు 'ఇదిగో.. ఇవాళే.. ఇక్కడే.. మీకు భవిష్యత్తులో కట్టబోయే  భారీ నిర్మాణానికి నాందీగా.. పునాదిలో ఓ రాయి వేసేస్తున్నాం!" అంటూ బ్రహ్మాండంగా  ఊరేగింపూ..  గట్రాచేసి  ఆర్భాటంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మి జనం ఓట్లేస్తే.. గెలిచేసి.. గద్దెనెక్కి..  వాళ్ళు చేయాలనుకొన్న పనులన్నీ మళ్లీ ఎన్నికలొచ్చేసే లోపల సుబ్బరంగా చేసేసుకొంటారన్నమాట'.
'ఒక్క నిమిషం పునాదిరాయీ! చిన్నసందేహం! మరి వాగ్దానం చేసినట్లు నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత నిర్మాణాలన్నీ చేసేస్తారుకదా! అయినా మీరింకా ఈ గోతుల్లో శిలావిగ్రహాల్లా పడి అల్లాడుతున్నారేంది?!'
పకపకా నవ్వింది పునాదిరాయి. 'మరదే ప్రజాస్వామ్యమంటే! సరే! ఇందాకట్నుంచీ ఏదీ కనిపించడంలేదని తెగ అల్లాడుతున్నారుగా! అమెరికా, రష్యా, చైనా, జపానంటూ ఎన్నడో అంతరించిపోయిన దేశాలను గురించి దేవులాడుకొంటున్నారుగా! వృథాగా వాటికోసం సమయం పాడుచేసుకోకుండా.. నన్నూ నా సోదరులనూ ఫోటో తీసుకుపోండి! అంతదూరంనుంచి వచ్చినందుకు ఆ మాత్రమైనా దక్కిందని సంతోషించండి!'
'నువ్వేగాక నీకు సోదరులుకూడా ఉన్నారా ఇంకా?! వాళ్ళూ నీకులాగే సజీవంగానే ఉన్నారా?!' నోరెళ్లబెట్టడం తనాకో వంతయింది.
'ఎందుకు లేరబ్బాయ్? వందలొందలు! మీ కెమేరాల మెమరీ కార్డు చాలదు! ఆన్ చేసుకోండి! వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్ వేసుకోండి! అదిగో అది బ్రాహ్మణి సిమెంటు ఫ్యాక్టరీ పునాదిరాయి. ఇప్పుడు రద్దయిపోయిందనుకోండి!  పోలవరం అనే భారీ నీటిప్రాజెక్టుకి వేసిన పునాదిరాయి! అదిగో ఆ మూల ఉన్నది! ఇదిగో.. ఇవాళో.. రేపో.. అంటో యుగాలబట్టీ కథ నడుపుతున్నారు! ఇది  హంద్రీ నీవా సుజల స్రవంతి పునాదిరాయి. ఇది సిద్దిపేట స్పోర్ట్ స్ స్టేడియం పునాది రాయి. రెండు తెలుగురాష్ట్రాలు కలసి ఉన్నప్పుడు వేసిన పునాది రాళ్లిలాగా ఇంకా చాలా ఉన్నాయి.  అదిగో ఆ మూల వున్నదే .. అది హైదరాబాదనే అప్పటి తెలుగురాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్యల నివారణకని ప్రారంభించిన మెట్రోరైలు ప్రాజెక్టు పునాదిరాయి. స్థలంమారి ఆ ప్రాజెక్టు ఇప్పుడు మరో దిశలో సాగుతున్నది. అయినా దీనికి ముక్తి కల్పించే దిక్కు కనిపించడం లేదు.  ఇది బడాయిగడ్డా లోకాజ్ వంతెన తాలూకు పునాదిరాయి. ఇదిగో..  ఇది పుణ్యవరంలో వంతెన  నిర్మాణానికని వేసిన రాయి. ఇది పటాన్ చెరువులో వెయ్యి పడకల ఆసుపత్రికని అప్పటి ముఖ్యమంత్రి వేసిన శిలాఫలకం! ఇలా మీరు ఎక్కడ చూసినా చక్కని పునాదిరాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండటాన్ని గమనించవచ్చు!  ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మా గతి మారలేదు, మా ఫొటోలు తీసుకొని మామీదగాని మీరు థీసిస్ సమర్పిస్తే  పట్టా గ్యారంటీ! ఆ విధంగానైనా మేము ఉపయోగపడ్డామని సంతోషిస్తాం.' పునాదిరాయి నిట్టూర్పు.
అందంగా తళతళలాడే ఆ పునాది రాళ్లన్నింటినీ కెమేరాలో బంధించి తృప్తిగా తిరుగుముఖం పట్టారు యువశాస్త్రవేత్తలిద్దరూ!
స్క్రామ్ జెట్ ఇంజను స్టార్టుచేస్తూ మొగానో పునాదిరాయితో కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు 'మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం!'
'ఈ జన్మలోనే సుబ్బరంగా  తీర్చుకోవచ్చబ్బాయిలూ! మమ్మల్నిలా నిలువునా పాతేసినా పెద్దమనుషులు మీకు  వెళ్లేదారిలో ఏ నరకంలోనో.. పాతాళంలోనో  తప్పకుండా తగులుతారు.  పెద్దమనసు చేసుకొని ఒక్కసారివచ్చి మాలో కనీసం కొందరికైనా విముక్తి కలిగించి పుణ్యంకట్టుకోమని మా మాటగా విన్నవించండి.. చాలు!'  అని కన్నీరు పెట్టుకొంది అ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.***
-కర్లపాలెం హనుమంతరావు
చిత్రాల సౌజన్యంః కర్లపాలెం నిరంజన్
(సారంగ- అంతర్జాల పత్రిక జూన్ సంచిక 24-07-2015లో ప్రచురితం)








No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...