Wednesday, February 3, 2021

భావ విపంచి - కవి - కర్లపాలెం హనుమంతరావు

                                                     



కొరకంచు వంటి లోకానుభవం, రస బంధురమైన హృదయ స్థానం, కన్ను కలిగి చరించే చిత్తం, గభీరమైన భావ ప్రకటన కవిత్వానికి అవసరమైన దినుసులు- అంటారు కట్టమంచి రామలింగారెడ్డి  'కవిత్వ తత్త్వ విచారము' లో.

హృదయ తంత్రుల్ని మీటి భావ మాధుర్యాన్ని పంచే విపంచి- కవి. మీన మేషాలు లెక్కించుకుంటూ, గుణకార సూత్ర బద్ధంగా, చెమటోడ్చి చేసే రచన భౌతికశాస్త్రం అవుతుందేమో కానీ కవిత్వం మాత్రం కాదు. కాలేదు. కృత్రిమత్వానికీ మూర్తిమత్వం ప్రసాదించే అసాధారణ ప్రజ్ఞ (భావనా శక్తి- అంటాం  మామూలు మాటల్లో) కవికి ఉండే ప్రత్యేక లక్షణం.

మనస్తత్వ శాస్త్రం ప్రకారం మానవులను మిగతా జీవరాశి నుంచీ విడదీసి ప్రత్యేక  జాతిగా నిలబెట్టి భావోద్దీపన కలిగించే ప్రాకృతిక గుణాలు 1.ఆలోచనలు(Thinking) 2.భావాలు(Feeling) 3.సంకల్పాలు(Willing).  భావాలను ఉత్తేజ పరిచే గుణం  అధికంగా గల మనిషికే కవిత్వ లక్షణాలు అలవడేది. కవిత్వం ఏ నిర్వచనానికీ అందని ఒక బ్రహ్మ పదార్థం అయితే..  ఒకడు కేవలం ఎందుకు కవి మాత్రమే కాకుండా ఉండ లేడో.. ఇంకొకడు ఎంత గింజుకున్నప్పటికీ కవిగా ఎందుకు మారలేడో అంతుబట్టని వింత.  కవికి మాత్రమే ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు ఏవో కవుల నైజంలో ఉండి ఉండాలి. ఏవిటవి?!


ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అది భౌతికశాస్త్ర సిద్ధాంతం అవుతుంది. కన్నది కన్నట్లుగా వ్యక్తీకరిస్తే అది కవిత్వ రసాయనం అవుతుంది. ఉన్నదానికీ కన్నదానికీ మధ్య ఒక సన్నని  తెర ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది. ఆ తెరను తొలగించుకుని మరీ సత్యశోధనకు తాపత్రయ పడే తత్త్వం శాస్త్రజ్ఞుడిదైతే.. తెరకు ఈవలి వైపునే నిలబడి కంటికి కనిపించే దృశ్యాన్ని కమనీయంగా వర్ణించే నైజం కవిది

సత్యాన్వేషికి లాగా కవికి  శుద్ధ సత్యంతో పని లేదు. సత్యాన్ని  గజం దూరం నుంచైనా సరే నిలబడి మనస్సనే సాధనంతో ఊహించే పనికి కవికి ఇష్టపడతాడు.  

బుద్ధి జీవులకు కవుల భాష చాలా సందర్భాల్లో అసంబద్ధంగా ఉండి చికాకు పుట్టించడానికి కారణం అదే. ఐనప్పటికీ  కొన్ని సందర్భాల్లో ఆ కవిత్వమే తార్కికులకూ సాంత్వన అందించే మంచి ఔషధం అవుతుంది. అదే కవిత్వంలోని విశిష్టత.

కవిత్వానికి ఉండే మరో ప్రత్యేకమైన మంచి లక్షణం దాని చంచలత్వం.. దాని మూలకంగా సంతరించే తాజాదనం.

ఒకే వస్తువును కొన్ని నిర్దేశిత పరిశోధనలకు లోబడి పరీశీలించ గలిగితే ఒకే వస్తువు లాగా నిర్థారించడం అసంభవం కాదు. కానీ  ఒకే వస్తువు కవులు అందరికీ ఒకే విధంగా కనిపించదు. ఆ మాట కొస్తే అదే వస్తువు అదే కవికీ అన్నివేళలా ఒకే విధంగా కూడా కనిపించదు. కాళిదాసునే  మేఘదూతం మళ్ళీ తిరగరాయమంటే పూర్వ రూపంలో రాయగలడని భరోసా లేదు. చూసే సమయ సందర్భాలను బట్టి, అప్పటికి ఉండే రసస్థాయి ఆధారంగా  కవి వ్యక్తీకరణ ధోరణులు మార్పుచెందుతాయి

ఆటంబాంబు నిర్మాణ సూత్రానికి మల్లే ఆడదాని ప్రేమభావనికి ఓ శుద్ధ నిత్య సత్య సూత్రం ఆవిష్కరించడం ఆమెను పుట్టించిన బ్రహ్మకైనా సాధ్యం కాదు? అటువంటి  అసాధ్యంలోనే కవిత్వపు అసలు తాజాదనపు సౌరభ రహస్యమూ  దాగి ఉంది. గురజాడవారి మతం ప్రకారం ఆకులందున అణగి మణగి కూయడమే  కవిత భావనా శక్తి అసలు సిసలు సౌందర్యం.

భావనాశక్తి అనేకమైన మాయలు పన్న గల లీలా వినోదిని-అనేది కట్టమంచి రామలింగా రెడ్డి 'కవిత్వతత్వవిచారం'లో.  నిజమే. కవి తన హృదయంలో అప్పటికి ఉప్పతిల్లిన భావాల అధారంగా చదువరి చేత రూప సందర్శనం చేయిస్తాడు. కవి సమకూర్చిన దూరదర్శినితోనే  చదువరికి వ్యోమసందర్శనం చేయక తప్పని పరిస్థితి. ఆ సందర్శనకు సత్యసంధతతో నిమిత్తం లేదు. రసానుభూతి మాత్రమే అంతిమ లక్ష్యం.  ఆంగ్లకవి టెనిసన్ లాంటి మహానుభావులైతే తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో నందిని పందిలాగా,  పందిని నందిలాగా కూడా చూపించ గల సమర్థులు.  విద్యుత్తరంగాల వేగంతో పాఠకుడి మనో యవనిక మీద ఒక అత్యద్భుతమైన చలనచిత్రాన్ని ప్రదర్శించ గల గడసరులు.  మరుపు రాని, అనిర్వచనీయమైన అనుభవాన్ని అందించడమే కవిత్వం అంతిమ లక్ష్యం.

కాళిదాసులు,  భవభూతులు, పోతనలు, శ్రీశ్రీలు, విశ్వనాథలు, జాషువాలు, నాజర్లు, గద్దర్లు.. జనం నాలుకల మీద ఇవాళ్టికీ అలా నాట్యం చేస్తూనే ఉన్నారంటే.. అలాంటి చిరంజీవనం కలగడానికి  కవిత్వానికి ఎంత ఉపజ్ఞత కావలి! ఆ ఉపజ్ఞతను సృజించే కవి ఎంత సుకృతం చేసుకుని ఉండాలి!

వాల్మీకి లేనిదే రాముడు లేడు. వ్యాసులవారు  పూనుకోక బోయుంటే గీతాచార్యుడి ఆనవాలే మనకు దొరికి ఉండేది కాదు. తిక్కన అంత అద్భుతంగా కవిత్వరీకరించబట్టే పాంచాలి  లోకపరీక్షలో మహా ఇల్లాలుగా  తేలింది. పెద్దన బుద్ధికి ప్రవరాఖ్యుడు, సూరన సంగీత ప్రజ్ఞకి శుక్తిమతి, తెనాలి కవి చతురతకి సుగుణశర్మ పెద్దక్క ఇలా.. నాటి చేమకూర కవి విజయవిలాస కథానాయిక సుభద్ర నుంచీ ఇటీవలి  గురజాడవారి కన్యాశుల్కం తాలూకు  మధురవాణి వరకూ మన మనసుల్లో శాశ్వతంగా గూళ్ళు కట్టుకుని ఉన్నారంటే.. ఆ పుణ్యమంతా  ఆయా కవుల ప్ర్జ్ఞజ్ఞాపాటవాలదే.   భూమి గుండ్రంగా ఉందన్న విశ్వాసం మరో సిద్దాంతం వచ్చి రద్దై పోవచ్చునేమో కానీ భూమి పుత్రిక సీత  రాముని ఏక పత్నీవ్రతానికి భూమికే అన్న నమ్మకం ఎన్ని యుగాలు గడిచినా  జనం గుండెల నుండి చెదరి పోదు. శాస్త్రవేత్తలకు ఉండే పరిమితులు  కవులకు  ఎందుకు ఉండవో.. కవులు సత్యాన్వేషకులకన్నా ఒక మెట్టు ఎప్పుడూ పైనే ఎందుకు ఉంటారో ఈ ఒక్క ఉదాహరణ తరచి చూస్తే చాలు తేలిపోతుంది.   

కాటికి సాగనంపిన పిదప.. ఫొటో ఫ్రేముల్లో బిగించడంతో  కన్నవారి రుణం తీరిపోతున్నట్లు భావిస్తున్న పిదప కాలంలో ఏ రక్త సంబంధమూ లేకపోయినా గుండెల్లో గుళ్ళు కట్టించుకుని మరీ రాముళ్ళూ.. కృష్ణుళ్ళూ .. సీతలూ.. సావిత్రులూ.. జన నీరాజనాలు అందుకుంటున్నారంటే.. వైభవాల  వెనకాల ఉన్నదంతా  ఆయా పాత్రల్ని సృష్టించిన  కవుల కలాల చలవే.


కవిగా పుట్టడం ఒక వరం. కించపడవ్ల్సన అగత్యం లేదు. వేలాది మందిలో ఏ ఒకరికో గాని ఈ శారదాప్రసాదం లభించదు. ఆయాచితంగా లభించిన ఈ ఉపజ్ఞతా విశేషాన్ని మానవత్వపు విలువలు మరింత పెరిగే రీతిలో ఉపయోగించుకునే బాధ్యత మాత్రం మరిచిపోరాదని సలహా.


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...