Wednesday, December 29, 2021

ఈనాడు - సంపాదకీయం క్రీడా స్ఫూర్తి ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

క్రీడా స్ఫూర్తి 


...

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


'క్రిందు మీదెఱిగి కృతకార్యుడగువాడు/ చేయు కార్యమెల్ల సిద్ధి బొందునన్న' ది  మడికి సింగన పద్మపురాణ ప్రవచనం. తండ్రి తొడలపై కూర్చుండనీయలేదని చిన్నారి ధ్రువుడు దృఢదీక్షకు దిగి శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న కథ పోతన భాగవతంలో కనపడుతుంది. బాల ధ్రువుడికి కార్యదీక్ష లక్షణాలను వివరిస్తూ నారదులవారు చేసిన బోధ- సర్వకాలాలకు వర్తించే కార్యదక్షత పాఠం 'యుద్ధ సమయంలో బంధుమిత్ర పరివారాన్ని సంహరించడం ధర్మకార్యమేనా? ' అంటూ పార్థుడిలాగా సందేహ డోలికల్లో ఊగిసలాడేవాడికి విజయం- చెట్టుమీద ఉన్నా కొట్టలేని పిట్టలాంటిదే. ' చిత్తము చిక్కబట్టుము; త్యజింపు బేలతనమ్ము; మోము పై/ కెత్తుము, ధైర్యము జెదరనీకుము కొంపలు మున్గునయ్య నీ/ తత్త రపాటు నీ ముఖ విధంబు పరుల్ పసిగట్టిరేని' అంటూ హితవా క్యాలు పలికే నారాయణుడు నిజానికి మన గుండెల్లోనే కొలువై ఉంటాడు. శ్రీనాథుడి హరవిలాసంలోని హంసతూలిక పాన్పుపై ' నలరు మొగ్గ/ యెత్తునను మేను గలిగిన నీలోత్పలాక్షి' పార్వతి పశుపతిని తనపతిగా చేసుకునేందుకు శైల పాషాణ పట్టికా స్టండి లమున' పవ్వళించింది. ముత్తాతల పుణ్యగతుల కోసం దివిజ గంగను భువికి దింపిన భగీరథుడు- శివుడినుంచి జహ్నుమహర్షి వరకు  పెట్టిన పరీక్షలను తట్టుకుని నిలబడిన తీరు చాలు, ధీరోదా త్తుడికి ఉండవలసిన ముఖ్యగుణమేదో తెలుసుకునేందుకు .


ఏనుగు లక్ష్మణకవి సుభాషితంలో చెప్పినట్లు- కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని మదిలో లెక్కకు రానీయడు. పుట్టినప్పటినుం ఏ తన కన్నతండ్రికి పట్టం కట్టించేదాకా కన్నయ్యకు ఎదురైన కష్టాలు కడలిలో కెరటాలకు మించినవి. కందుకూరి వీరేశలింగం నీతికథామంజరిలో బోధించిన విధంగా '  కష్టపడునట్టివారు లోకంబు తోడ/ మొర్రపెట్టరు తమ కష్టములను గూర్చి వట్టివారలె యరతురు మిట్టిపడుచు'. అరుపులు గొడ్డు గేదెలకే గాని మనుషులకు గొప్పకాదని వీరేశలింగం అభిప్రాయం. వాస్తవానికి పశుపక్ష్యా దులూ నిశ్శబ్దంగానే తమ పనులు చక్కబెట్టుకుంటాయి. నల దమయంతుల మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం ఫలవంతం కావడానికి రాయంచ కడదాకా చూపించిన కార్యకుశలతే ప్రధాన కారణం. దారిపొడవునా దృశ్యాలు తరచూ గతిమారిపోయే తరుణంలోనూ సైబీరియన్ పక్షులు గడబిడ పడకుండా సుదూర ప్రాంతాలకు దారితప్పకుండా చేరడాన్ని కార్యశూరతకు ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవాలి. అసూయపడితే చాలదు... ప్రకృతినుంచి మనిషి చాలా పాఠాలు నేర్చుకోవాలి. 'పనులను ప్రయత్నము చేతన, కావవి బహు మనోరథములున్నంతన్' అని విక్రమదేవవర్మ సూక్తి. ఇసుక బొరియల్లో నుంచి బయటపడే వేళ సముద్ర  తీరప్రాంతాలు తాబేళ్లకు పూర్తిగా అపరిచితం. చిటికెన వేలంత లేని ఆ జీవాలు అట్లాంటిక్ సముద్ర జలాలను దశాబ్దంపాటు అన్ని అడ్డంకులు దాటి ఈదుకుంటూ తిరిగి క్షేమంగా స్వస్థలాలకు చేరుకుం టాయి. ఎవరు శిక్షణ ఇచ్చారు వాటికి?  లక్ష్యంమీద గురితప్ప కుంటే ఏనాటికైనా విజయం సాధ్యమే! బలమైన బంధనాల నిర్బంధం మద్యే ఎదిగిన ఏనుగు మామూలు మోకునూ ఛేదించే ప్రయత్నం చేయదు. ఆత్మవిశ్వాస లోపమే మనిషి పాలిట పెనుమోకు. విజయసాధనకు సులభమార్గం తెలుపమని ఓ జిజ్ఞాసి సోక్రటీసును సందర్శించాడు. జిజ్ఞాసి తలను చెరువు నీటిలో బలవంతంగా ముంచి ఉంచి లేపి బతికి తీరాలన్న కోరిక ఇప్పుడు ఉన్నంత బలంగా ఎప్పుడూ ఉంటే విజయం తనంతట తానే వచ్చి వరించి తీరుతుందన్న సోక్రటీస్ గురుబోధను మరవరాదు.


మూడువందల కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన జేమ్స్ బాండ్ చిత్రానికి రచయితగా ఇయాన్ ఫ్లెమింగ్ కి దక్కింది ఆరువందల డాలర్లే. నిస్పృహతో కలం పారేసి ఉంటే బాండ్ సృష్టికర్తగా ఆయన చరిత్రలో మిగిలి ఉండేవాడా! ప్రమాదంలో కాలు కోల్పో యినా కృత్రిమ పాదంతో మయూరిగా తిరిగి వచ్చిన సుధా రామ చంద్రన్ ది  విజయకాముకులందరూ ప్రేరణపొందే స్ఫూర్తిగాథ. మొదటి విద్యుత్ బుగ్గ పనిమనిషి పాలబడి పగిలిపోయిన క్షణంలో నిరాశకు గురై ఉంటే ఎడిసన్ గొప్ప ఆవిష్కర్తగా నమోదై ఉండేవాడే కాదు. విజేత జీవిత పదకోశంలో ఓటమి అంటే అర్థం గెలుపు సోపానం. సైకిల్ రిక్షా వ్యాపార నష్టాలకు చెక్కుచెదరనందుకే ఉక్కు ట్రక్కులకు టాటా కొలబద్ద కాగలిగాడు. పదాలు సరిగ్గా పలకలేని ఐన్ స్టీన్ ప్రముఖ వక్తగా మారగలిగాడంటే- పట్టు దలే ప్రధాన కారణం. తుపానులొస్తాయని ఓడలను ఒడ్డున కట్టేసి ఉంచగలమా? విపత్కర పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించే ధీరులే కావాలి మనకిప్పుడు. బీజింగ్ ఒలింపిక్స్ లో  చేజా రిన పతకం లండన్ మైదానంలో దొరకబుచ్చుకున్న సైనా నెహ్వా ల్ లు  నేడు దేశావసరం. భారతావనికి తనవంతుగా మొదటి పతకం అందించిన గగన్ నారంగ్ రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి తీరతానని సగర్వంగా ప్రకటించుకున్నాడు. ఇద్దరు బిడ్డల తల్లయి ఉండీ మేరీకోమ్ బాక్సింగ్ లో  సాధించిన విజయం ముందుతరాలకు ఆదర్శం. ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ కుమార్ సాధించిన రజతపతకం విలువ దేశవాసులందరికీ బంగారాన్ని మించినంత విలువైనది. సైనా గురువు గోపీచంద్ ఈమధ్య భాగ్యనగరంలో జరిగిన భారీ సన్మానసభలో దేశం తర పున ఆడే క్రీడాకారులందరి పక్షాన చేసిన వాగ్దానం- 'ఇది ఆరంభం' మాత్రమేనన్నది. క్రీడా ప్రేమికులందరూ సంబరపడవలసిన  గొప్ప సంకేతమది. క్రీడాకారులందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప సందేశమూ అందులో ఇమిడి ఉంది!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...