Tuesday, December 7, 2021

కథ మా తెలుగు తల్లికి ... మల్లె పూ దండ - కర్లపాలెం హనుమంతరావు ( రచన - మాసపత్రిక - అక్టోబర్ - 2016 - సంచికలో ప్రచురితం )

 కథ : 

మా తెలుగు తల్లికి ... మల్లె పూ దండ !  

- కర్లపాలెం హనుమంతరావు 

( రచన - మాసపత్రిక - అక్టోబర్ - 2016 - సంచికలో ప్రచురితం ) 


విద్యారణ్య!


అన్ని రకాల హైటెక్ హంగులతో నేను నడుపుతున్న విద్యాసంస్థ అది. 


ర్యాంకులు పండించే విద్యాక్షేత్రంలో మా సంస్థ స్థానం మొదటి నుంచి మొదటి మూడింటిలో ఒకటి. శాశ్వతంగా మొదటి స్థానంలోనే స్థిరపడాలన్నది నా లక్ష్యం. 


ఆ లక్ష్యసాధనలో భాగంగానే ప్రపంచ స్థాయి గుర్తింపువున్న  ది 'జీనియస్' గ్రూపుతో 'టైఅప్' అవ్వాలని వ్యూహం. 


ఆ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఇప్పుడు చివరి దశకు చేరు కొన్నాం. 


ఇంకో గంటలో జరగబోయే సాంస్కృతిక ప్రదర్శనలలో  కూడా మా ప్రత్యేకత నిరూపించుకుంటే... ఇహనుంచి నగరంలో మా విద్యారణ్యదే ప్రప్రథమ స్థానం.




కల్చరల్ ఈవెంట్ ఇన్-చార్జ్ మిసెస్ కపర్దీది ఓ ప్రసిద్ధ విద్యాసంస్థకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి హోదాలో దాదాపు ముఫ్ఫై ఏళ్ల అనుభవం. అక్కడ పదవీ విరమణ అయిన వెంటనే ఇక్కడకు రప్పించాను పెద్ద జీతంతో! 


ఆమె గత సంబధాల మూలకంగానే 'జీనియస్' దృష్టిలో మా

సంస్థ పడగలిగింది. నిలబడగలిగింది.


గ్రీన్-రూంలో మిసెస్ కపర్దీ విద్యార్థులకు చివరి హెచ్చరి


కలు జారీ చేస్తున్నది. పదో తరగతి పిల్లలు హేమ్లెట్, దిగువ తరగతుల వాళ్ళు బెంగాలీ రవీంద్ర గీత్, పంజాబీ భాంగ్రా, ఒరియా ఒడిస్సీ... అందరికన్నా ముందు కిండర్గాడెన్ పసి మొగ్గలతో వందేమాతరం!


అన్నీ చక్కగా అమిరినట్లే... కదంబంలో పూలవరసలా!


కార్యక్రమ పర్యవేక్షణ కొచ్చిన బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో జాతీయ స్థాయిలో నిష్ణాతులు. శ్యాంలీలా పర్షాద్, మాతంగి రమణ, బిజయ్మిశో, మదన్లాల్ కథేరియా, దివిజ శర్మ. దివిజ శర్మకు మాత్రమే కొద్దిగా తెలుగు భాషతో పరిచయం. 


తెలుగు తెలిసినవారు లేకపోవడం. నిజానికి ఒక అనుకూలమైన అంశం. ఒక తెలుగువాడు మరో తెలుగువాడిని ఎక్కిరానీయడన్న సామెత మనకుండనే ఉందిగదా! అదీ నా బాధ! 


తెర లేచింది.


'వందేమాతరం' అద్భుతంగా పేలింది. 


జ్యోతి ప్రజ్వలన అనంతరం మిసెస్ కపర్దీ చేసిన ఆంగ్ల ప్రసంగమూ అంతే..  'ఇంప్రెసివ్'! 


పావుగంట బాలే, అరగంట ఆంగ్ల నాటిక. 


హిందీ గీతమాలిక జరుగుతున్న సమయంలో దివిజ శర్మ వచ్చింది.


'మావాళ్లు మీ తెలుగు ప్రోగ్రామ్సు చూడాలనుకొంటు న్నారు. ఇంటర్మిషన్ తరువాత అవే అరేంజి చేయండి! ఒక గంట చూస్తాం' అంది.


నా గుండెల్లో రాయి పడింది. 


కార్పొరేట్ కల్చర్ కదా! హిందీ, ఇంగ్లీష్ లాంటి వాటిమీద మాత్రమే మోజుంటుందని అనుకొన్నాం!


'ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్  అంటే ఏదో మేనేజ్ చేయ గలంగానీ.. ఇప్పటికిప్పుడు గంటపాటు తెలుగు పోగ్రా మంటే ఎలా సార్?!' అని నాకే ఎదురు ప్రశ్న వేసింది మిసెస్ కపర్దీ!


'ఏదో ఒకటి మేనేజ్ చేయండి మ్యాడమ్! నెక్స్ట్ పోగ్రాం మాత్రం తెలుగులోనే ఉండాలి. ఏం చేస్తారో .. మీ ఇష్టం!' అని చెప్పి నా ఛాంబరుకి వచ్చేసాను.


వచ్చానన్నమాటేగానీ... మనసు మనసులో లేదు. పర్యవేక్షక బృందం ఏదో ఆంతరంగిక చర్చల్లో ఉంది... లంచ్ చేస్తూనే! వాళ్ల మధ్యలో దూరడం మర్యాద కాదుగనక


కాఫీ నా చాంబరుకే తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. 


ఆరు దశాబ్దాల కిందట బెనారస్ యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది.


అవి నేను ఎమ్మెస్సీలో ఫిజిక్స్  చేసే రోజులు. అన్ని భాషల వాళ్లకి మల్లేనే తెలుగు వాళ్లకీ ఒక ప్రత్యేకమైన మెస్ ఉండేది.


ఓ చలికాలం ఆదివారం మధ్యాహ్నం భోజనాలు లాగించి

ఆరుబైట బండల మీద వెచ్చదనం కోసం కూర్చొని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం తెలుగు విద్యార్థులం.


ఒక పొట్టి మనిషి, నుదుట పట్టెనామాలు... ముతక పంచి ... లాల్చీ. చేతిసంచీ ఊపుకొంటో మా మధ్యకొచ్చి నిలబడి, 'మీరంతా తెలుగు పిల్లలే కదుటోయ్! నాకో పని చేసి పెట్టాలి. ఓ గంటపాటు నేనో ఉపస్యాసం ఇచ్చిపోతా. తెలుగు తెలిసిన వాళ్లందర్నీ వెంటనే పోగేయాలి!' అన్నాడు! 


'ఈయనెవడ్రా  బాబూ! పిలవని పేరంటాని కొచ్చిందికాక ఉపన్యాసాలిస్తానంటున్నాడు!' అని మాకు ఒకటే ఆశ్చర్యం. 


మా బృందనాయకుడు సుబ్బరాజుకి మొహమాటం తక్కువ. పొట్టిమనిషి మొహం మీదే, 'తమరెవరు మహాను భావా?' అంటూ వెటకారంగా వెళ్లబోసాడు.


పొట్టాయన ఆ వెటకారాన్నేమాత్రం పట్టించుకోలేదు. ' మా తెలుగుతల్లికి మల్లెపూదండ!' పాట ఎప్పుడన్నా విన్నారుటోయ్? ఆ గీతాన్ని రాసింది నేనే!' అనేసాడు. 


ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి అప్పటికి నిండా పదేళ్లు కూడా నిండలేదు. జనంలో ఇంకా దేశభక్తి ఇప్పట్లా పూర్తిగా ఇంకిపోని కాలం. 'మా తెలుగుతల్లి' పాట చాలాసార్లు విని వుండటంచేత మా ఎదురుగా నిలబడి ఉన్నది శంకరంబాడి సుందరాచారిగారని తెలుసుకొన్నాం. అమాంతం గౌరవం పెరిగిపోయింది. 


సుబ్బరాజూ అందుకు మినహాయింపు కాదు. స్వరంలోని మునుపటి దురుసుతనం తగ్గించుకొని, 'ఇప్పటికిప్పుడు జనాలని పొగేయాలంటే ఎలా సార్?' అని నసిగాడు.


'సరేలేవోయ్! రేపు నాలుగ్గంటలకి పెట్టుకోండి. నేను నేరుగా మీ మీటింగు హాలుకే వచ్చేస్తా!' అంటూ చేతిసంచి ఊపుకొంటూ మాయమైపోయారు శకరంబాడి సుందరాచారిగారు.


తెలుగు సంఘం ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి. ఈ వంకతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో అది తనకు ఉపయోగపడుతుందని సుబ్బరాజు ఎత్తుగడ. 


వాడి పూనికతో భారీగానే పోగయ్యారు జనం.


నాలుగ్గంటలకు అనుకొన్న కార్యక్రమం ఆరు గంటల గ్లానీ మొదలవలేదు. 


ఆలస్యానికి కారణం సుందరాచారి గారే! 


అందుకు క్షమాపణలైనా అడగలేదు. వచ్చీ రాగానే మైకు అందుకోబాయారు.


“ఇప్పుడు మొదలైతే ఎప్పటికయ్యేను? ఇంకో రెండు,   మూడు గంటలయితే మెస్సు కూడా మూసేస్తారు!" అంటూ సుబ్బ రాజు బిగ్గరగానే గొణుకుడు.


విన్నారులాగుంది పెద్దాయన - "తిండి కోసం వెంపర్లాడే

వాళ్ల కోసం కాదు నా ప్రసంగం. ఇష్టంలేనివాళ్లు నిక్షేపంగా

వెళ్లిపోవచ్చు... ఇప్పుడైనా... ఎప్పుడైనా!" అంటూ

మైకందుకొన్నారు.


ఆద్యంతం ఆయన ఉపన్యాసం సాగిన తీరు అత్య ద్భుతం. 


తెలుగు భాష విశిష్టతను గూర్చి సాగిన ఆ ప్రసంగం ఓ రసగంగా ప్రవాహం. తలమునకలా ఆ గంగలో తడిసి ముద్దవని తెలుగువాడు లేడు ఆ పూట .


తొలిఝాములో వినిపించే కోడికూతల నుంచి పొద్దు పోయిన తరువాత వీధుల్లో సంచరించే కుక్కల అరుపులు దాకా... ఆయన అనుకరించని జీవజాలం లేదు. పల్లె జీవనంలోని తెలుగుదనం, కమ్మదనం సుందరాచారిగారి స్వరంలో ఆవిష్కరణ అయిన వైనం మామూలు మాటల్లో వర్ణించనలవి కానిది.


తొలిసంజె వెలుగుల్లో ఇంటి గుమ్మాల ముందు రంగ వల్లులు తీరుస్తూ ఇంతులు పాడుకొనే పాటలు, కోడికూతతో లేచి పొలంబాట పట్టే రైతన్నలు ఆలమందలని అదిలించుకొంటూ తీసుకొనే కూనిరాగాలు, అత్తాకోడళ్లు, వదినామర దళ్లు రోటి పోటుల దగ్గర ఆడిపోసుకొనే సరదా సూటిపోటు పాటలు, పెద్దపండుగ సంబరాల్లో వీధివీధి తిరిగే హరి దాసయ్యల చిందులు, ఇంటిల్లిపాదిని ఆశీర్వదించిగాని పక్క గుమ్మం తొక్కని గంగిరెద్దుల ఆటలు.. శంకరాచారిగారి గొంతులోనుంచి అలా అలా జాలువారుతుంటే మెస్సు భోజనం సంగతి ఇంకేం గుర్తుకొస్తుందెవరికైనా?! 


' తప్పయి పోయింది స్వామీ! క్షమించండి' అంటూ సుబ్బరాజే చివరికి చేతులు జోడించాల్సి వచ్చింది. అంతకన్నా తమాషా. .  ఆయన అవేవీ పట్టించుకోకుండా అప్యాయంగా సుబ్బరాజును

అక్కున చేర్చుకోవడం! 


మెస్సు వాళ్లూ సభలోనే ఉండిపోవడంతో అందరికీ ఉపవాస బాధ తప్పిందనుకోండి ఆఖరికి!


ఆ రాత్రంతా సుందరాచారిగారు మా హాస్టలు గదిలోనే బస చేసారు. ఉపన్యాసం ఎంత ఉదాత్తంగా ఉందో... ఆ పూట ఆయన చెప్పిన మాటలు అంతకన్నా ఉత్తేజకరంగా ఉన్నాయి.


"తేనె లొలికే తెలుగు భాష సౌందర్యాన్ని వివరించి చెప్పడం నా బోటి వామనుడికి తలకు మించిన పని. అయినా కాని, చేతకాదని చేతులు ముడుచుకొని మూల వదిగే మనస్తత్వం కాదు నాది. కాబట్టే చేతనైనంతలో అమ్మ భాష కమ్మదనాన్ని నేల నాలుగు చరగులా ప్రచారం చేయడానికి  పూనుకొన్నది' అంటో చేతిసంచిలో నుంచి కొన్ని పుస్తకాలని తీసి పంచిపెట్టారు మాకందరికీ!


అదృష్టం కొద్దీ నాకూ ఒక పుస్తకం దక్కింది సుందరాచారిగారు స్వహస్తాలతో చేసిన సంతకంతో సహా! ఆ నాటి ఆ పల్లెపదాల పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.


పండిత పామర జనరంజకంగా తెలుగుభాష సౌంద ర్యాన్ని పుస్తకరూపంలో ప్రచురించాలని సుందరాచారిగారి ఆశయంట. 


అందుకోసం ఓ అయిదంచల ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకొనే నిమిత్తం  పెద్దలందరిని కలుస్తున్నారుట. 


అప్పట్లో హస్తినలో పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.


" ఆయన్ని కలసి తిరిగి వెళుతూ తెలుగు పిల్లలు మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. తెలుగు ఎక్కడుంటే నేనక్కడ ఉండాలన్నది నా ఆకాంక్ష. తెలుగును ఎవరన్నా చిన్నచూపు చూస్తే నాకు తిక్కరేగుతుంది. వేల ఏళ్ల చరిత్రగల మన తెలుగు ఇతర భాషల దాష్టీకంవల్ల నష్టపోరాదన్నదే నా పంతం" అనిచెప్పుకొచ్చారాయన... ఆ రాత్రంతా నిద్ర మానుకొని... మమ్మల్ని నిద్ర పోనీయకుండా!


'ఇప్పటి నా కష్టాన్ని కూడా గట్టెక్కించడానికి రాకూడదా గురువుగారూ!' అనిపించింది నాకు ఆ క్షణంలో. . మరుక్షణంలోనే నా పిచ్చి ఊహకు నవ్వూ వచ్చింది.


ఎక్కడో ఓ కంఠం ఖంగున మోగుతుంటే ఈ లోకంలో

కొచ్చి పడ్డాను. 


"అదే గొంతు! అదే వాగ్ధార ! శంకరంబాడి సుందరాచారి గారిది! 


ఇక్కడికి ఎందుకొస్తారు? ఎలా వస్తారు? నా భ్రమ కాకపోతే? 


లేచి ఛాంబర్ బైటికి వచ్చాను. 

వేదిక మీద మైకు ముందు కార్యక్రమాలకని ఏర్పాటు చేసిన అలంకరణ విద్యుద్దీపాల వెలుగులో సుందరాచారిగారు కంచు కంఠంతో ఉపన్యాసం దంచేస్తున్నారు... తెలుగులో! 


తెలుగు రాని పర్యవేక్షక బృందం కూడా మంత్ర ముగ్ధ అయినట్లు  వింటోంది! కనురెప్ప కొట్టడం కూడా మర్చి పోయేటంతగా కనికట్టు చేస్తున్నది ఆ మాట... పాట... ఆట!


మధ్య మధ్యలో ఆంగ్ల పదాలతో... హిందీ పద ప్రయోగా లతో... సంస్కృత శ్లోక భూయిష్టంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని గూర్చి ఆయన చేసే ప్రసంగం అచ్చు శంకరం బాడిగారి శైలిలోనే ఉద్వేగంగా ఉరకలేస్తోంది! 


' మంచి ప్రసంగం!’ అంటూ మధ్యలో దివిజ శర్మ లేచొచ్చి

నన్ను అభినందించడంతో ఫలితం సగం తెలిసిపోయినట్ల

యింది.


శంకరాచారిగారి ఉపన్యాసంలోని చాలా అంశాలు నాకే చురకలు అంటించే విధంగా ఉన్నాయి. 


' ఐ నెవ్వర్ స్పీక్  ఇన్ తెలుగు' అని రాసిన పలకలు పసిపిల్లల మెడల్లో వేయడం కన్నా అమానుషం మరోటుందా? మాతృభాష ప్రాముఖ్యం తెలీని మూర్ఖులు చేసే వికృత చేష్టలవి. పసిబిడ్డల్ని తల్లిభాష నుంచి వేరు చేయాలనుకోవడం తల్లి నుంచి వేరుచేయడ మంత పాపం. పరిసరాల నుంచి సహజసిద్ధంగా అబ్బే సంపద తల్లి భాష ద్వారా అందే విజ్ఞానం. దానికి దూర మయే బిడ్డ భాగ్యశాలి  ఎలా అవుతాడు? బాల్యంలో అమ్మ భాష సాయంతో లోకాన్ని అర్థం చేసుకొన్నవాడే ఎదిగి వచ్చిన తరువాత కొత్త భాషల సారాన్ని జుర్రుకొనేది. భాషా వేత్తల నుంచి, మానసిక శాస్త్రవేత్తల దాకా అందరూ నిర్ధారి స్తున్న సత్యం ఇదే! 


ఇహ తెలుగుకి వద్దాం! ఇటాలియన్ భాషకి మల్లే పదం చివర హఠాత్తుగా విరగని మంచి గుణం తెలుగుకి వరం. వేదాలు ఆదిలో తెలుగులోనే ఉన్నాయని ఊహించడానికి ఈ సంగీత గుణమే కారణం. ఏ భాషాపదాన్నయినా తల్లి బిడ్డను పొదువుకొన్నట్లు పొదువుకోగలదు తెలుగు భాష. సంగీతంలోని ఏ శబ్దానికైనా తెలుగంత సమీపంలోకి రాగల ద్రవిడ  భాష మరొకటి లేదు. కంప్యూ టర్లో వాడే బైట్స్ పరిజ్ఞానానికి తెలుగంత అనుకూలత ఆంగ్లానిక్కూడా లేదని ఏనాడో 'సైన్స్ టుడే' లాంటి వైజ్ఞానిక పత్రికలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. 


జనం నాలుకల  మీద సహజంగా పలికే భాషలో చెబితేనే ఏ విషయమైనా చొచ్చుకుపోవడం సులభమవుతుంది. క్రైస్తవ మత ప్రచారకుల నుంచి, శైవ మత ప్రచారకుల వరకు అర్థమయిన ఈ విశేషం  మన తెలుగు నవనాగరీకులకు  ఎందుకో తలకెక్కడం లేదు! 


ఆంగ్లం పట్టుబడకపోతే నేటి పోటీ ప్రపంచం ధాటికి తట్టుకోవడం కష్టమని తల్లిదండ్రుల భయం. ఆ భయం అర్థం చేసుకోదగ్గదే! కానీ... అందుకోసం బిడ్డ కడుపులో పడ్డనాటినుంచే ఏబిసిడిలు తప్ప మరోటి 'అనరాదు... వినరాదు... కనరాదు' అని ఆంక్షలు విధించ డమే విడ్డూరం! వసతో పాటు ఆంగ్లాన్ని రంగరించి పోయాలన్న తల్లిదండ్రుల ఆతం చూస్తే నవ్వొస్తోంది. కోపమూ వస్తోంది. 


అభివృద్ధికి ఆంగ్లానికి ముడిపెట్టేవాళ్ళు చైనా, రష్యాల్లాంటి దేశాల ప్రగతికి ఏం సమాధానం చెబుతారు?! సొంత భాషంటే - సొంత ఉనికిని చాటే ప్రకటన. తమిళుడికి తమిళమంటే ప్రేమ. కన్నడిగుడికి కన్నడమంటే ప్రాణం. మరాఠీ వాడికి మల్లే మనమూ మన భాషను ఠీవికి దర్ప ణంగా ఎందుకు భావించమో అర్థం కాదు! 


పిల్లల కాదు... ముందు బుద్ధి రావాల్సింది పెద్దలకి, తల్లిదండ్రులకి, విద్యా వేత్తలకి! ముఖ్యంగా ఈ తెలుగు గడ్డ మీద! ఆ ముక్క. చెప్పిపోదామనే నేనిక్కడ దాకా వచ్చింది' అంటుంటే హాలు హాలంతా కరతాళ ధ్వనులతో మిన్నుముట్టింది.


'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చిన వాళ్ళలో పర్యవేక్షక బృందమూ ఉంది.


'జీనియస్' సంస్థ నగర ఫ్రాంచైసీ మా 'విద్యారణ్యకే దక్కిందని వేరే చెప్పవల్సిన పని లేదనుకొంటా. 


అరవై ఏళ్ళ కిందట పిలవని పేరంటానికి వచ్చి మమ్మల్నంతా మంత్రముగ్ధుల్ని చేసారు శంకరంబాడి సుంద రాచారిగారు. 


మళ్ళీ అదేతరహా మాయాజాలం చేసి మమ్మల్ని గట్టెక్కించి పోవడానికి రావడం ఎలా సంభవం?!


ఎవరు పిలిచారని ఇక్కడి దాకా వచ్చి తెలుగు ఔన్నత్యంతో పాటు అవసరాన్ని గురించి కుండబద్దలు కొట్టినట్లు! 


వేదిక మీద ప్రసంగం చేసిన సుందరాచారిగారు సుంద రాచారిగారు కాదు. ఆ ద్రోణాచార్యుడి ఏకలవ్య శిష్యపరమాణువు..  రామాచారిగారుట! 


గంటపాటు తెలుగు కార్యక్రమం సమర్పించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మిసెస్ కపర్దీకి ఠక్కు మని గుర్తుకొచ్చిన ఆపద్భాంధవుడు ఆయన. మిసెస్ కపర్దీ పూర్వం పనిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యా యుడు. పిల్లలకి ఆంగ్ల పాఠాలు చెబుతూనే తెలుగు భాష గొప్పతనాన్ని గురించీ కథలు, పాటలు, పద్యాలు చెబుతుండే వాడుట! ఆ విషయమై యాజమాన్యంతో గొడవలైతే ఉద్యోగం వదులుకోవడానిక్కూడా సిద్ధపడ్డాడుట!


‘పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆంగ్ల, తెలుగు సబ్జెక్టుల్లో తర్ఫీదు ఇచ్చే ఏదో కోచింగు సెంటర్లో అత్తెసరు జీతానికి పొట్టపోసుకొంటున్నాడు ప్రస్తుతం' అని మిసెస్ కపర్దీ వివరించింది.


రామాచారిగారు చేసిన ఉపకారానికి తృణమో పణమో

ఇద్దామనుకొన్నాను. 


తృణంలాగే తృణీకరించాడా సాయాన్ని!


 పణంగా కోరిన కోర్కె మాత్రం విచిత్రమైనది. 


"మీ ఉదయం పూట పార్థనల్లో 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాట పాడించండి చాలు! అలాగైనా పిల్లలకు 'మన తెలుగు భాషం'టూ ఒకటుందని మన్నన ఉంటుంది" అనేసాడు.


ఆ పని ఎటూ నేను చేయాలనుకొన్నదే! పాఠ్యప్రణాళికతో నిమిత్తం లేకపోయినా మాతృభాషను కనీసం ఐదు తరగతుల వరకైనా ఐచ్ఛికంగా  నడపడానికి  సిద్ధపడ్డ పిల్లలకే మా విద్యారణ్యలో ప్రవేశం. 


ఆ నిబంధన విధించడానికి అంగీకరించిన తరువాతే 'జీనియస్ సంస్థ ' మాతో టైఅప్ అవడానికి సిద్ధపడింది.


'తెలుగు విభాగానికి రామాచారిగారినే బాధ్యులని చేస్తే సరి. సుందరాచారిగారే మన మధ్య మసలుతున్నట్లుంది గదా సార్!' అని సలహా ఇచ్చింది మిసెస్ కపర్దీ. 


మంచి సూచన. 


'తెలుగు ఎక్కడ ఉంటుందో తనక్కడ ఉండాలన్న గురువు గారి ఆకాంక్షా నెరవేర్చినట్లుంటుంది' అనిపించింది నాకు. 


' అది సరికాదేమో సార్! సుందరాచారిగారిలాంటి వాళ్ళెక్కడ ఉంటే అక్కడ మాత్రమే తెలుగు వినబడే పరిస్థితి వచ్చిందేమో!' అన్నాడు రామాచారిగారు ఆ తరువాత కలిసి నప్పుడు!


కాదనగలమా!?


( గమనిక: ఈ కథలోని శంకరంబాడి సుందరాచారి కీ.శే ' తెలుగు తల్లి ' గీతా కర్తలు శ్రీ శంకరంబాడి సందరాచారి కాదని గమనిక . కథలోని పాత్ర కేవలం కల్పితం ) 


- కర్లపాలెం హనుమంతరావు 

( రచన - మాసపత్రిక - అక్టోబర్ - 2016 - సంచికలో ప్రచురితం ) 



























No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...